Read more!

సాయిబాబా గ్రంథ పారాయణం (Saibaba grandha paarayana)

 

సాయిబాబా గ్రంథ పారాయణం

(Saibaba grandha paarayana)


సాయిబాబా పారాయణం భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. షిర్డీ సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయడం వల్ల మనసులో చెలరేగే కలతలు, కల్లోలాలు తగ్గుతాయి. సుఖశాంతులు అనుభూతికొస్తాయి.పిలిస్తే పలికే దైవం సాయిబాబా. తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడు. బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలూ అక్కర్లేదు. తిథి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. ఎక్కడివారు, ఏ భాషవారు అని చూడనవసరం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా ప్రారంభించవచ్చు.

 

సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయి బాబా గ్రంథ పారాయణకు కావలసిందల్లా భక్తిభావన.

 

సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక, పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చు.

 

సాయిబాబా చరిత్ర, సాయిబాబా లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణ చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి, బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక సప్తాహంలో పూర్తిచేయలేనివారు రెండు, లేదా మూడు వారాల్లోనూ పూర్తిచేయవచ్చు. నిత్య పారాయణ కూడా చేయవచ్చు. కానీ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం.

 

సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. అలాగే పారాయణ పూర్తయ్యాక రెండు రూపాయలకు తక్కువ కాకుండా బాబా ట్రస్టుకు దక్షిణ పంపాలి.

 

సాయిబాబా గ్రంథాలను పారాయణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.