Read more!

English | Telugu

తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్క ప్రోమోతో రూమర్స్ కి చెక్‌

గతంలో 'బిగ్ బాస్' షోతో అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తారక్ హోస్టుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను గ్రాండ్‌ గా అనౌన్స్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ షో మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ షో ఇక ఇప్పట్లో ఉండదని వార్తలొచ్చాయి. 

కరోనా ఉధృతి తగ్గినట్లు అయితే ఆగస్టు నెల నుంచి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉందని.. లేదంటే ఈ ఏడాది పూర్తిగా షో నిలిపి వేసే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని ప్రచారం జరిగింది. మరోవైపు కరోనా ఉధృతి తగ్గితే తారక్ ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ లతో బిజీ కానున్నారని.. ఆ సమయంలో ఈ షోకి డేట్స్‌ సర్థుబాటు చేయడం ఆయనకు వీలుకాదని.. అందుకే షో వాయిదా పడబోతుందని వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా జెమిని టీవీ యాజమాన్యం ఒక్క ప్రోమోతో ఈ రూమర్స్ కి చెక్‌ పెట్టింది.

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో త్వరలోనే ప్రారంభం కానుందని జెమిని యాజమాన్యం ఓ ప్రోమో ద్వారా తెలిపింది. "జెమిని టీవీ యాజమాన్యం.. ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది.. చూస్తున్న వారికి 100 % ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది​" అంటూ ప్రోమోని విడుదల చేసింది. అయితే షో ప్రసారమయ్యే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది.