English | Telugu
రూ.50 కోట్ల షేర్ దిశగా 'విరూపాక్ష'.. విజయ్, నాని తర్వాత సాయి ధరమ్ తేజ్!
Updated : May 1, 2023
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. రెండో వీకెండ్ లోనూ అదిరిపోయే కలెక్షన్స్ తో సత్తా చాటిన ఈ చిత్రం.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.38 కోట్ల షేర్ రాబట్టింది. ఈ శుక్రవారం విడుదలైన 'ఏజెంట్'కి ఫ్లాప్ టాక్ రావడం, 'పొన్నియిన్ సెల్వన్-2' డబ్బింగ్ సినిమా కావడంతో.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న 'విరూపాక్'కే తెలుగు ప్రేక్షకులు ఓటేస్తున్నారు. ఈ శని, ఆది వారాల్లో కూడా ఈ చిత్రం రెండు కోట్లకు పైగా షేర్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా రెండో శనివారం రూ.2.16 కోట్ల షేర్, రెండో ఆదివారం రూ.2.64 కోట్ల షేర్ రాబట్టింది.
పది రోజుల్లో నైజాంలో రూ.13.29 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.4.42 కోట్లషేర్, ఆంధ్రాలో రూ.12.74 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.30.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.45 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.4.86 కోట్ల షేర్ కలిపి.. పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 37.76 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఈ సినిమా త్వరలో 40 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం ఖాయమే. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు.. వేసవి సెలవులు కావడం, ఇతర సినిమాల నుంచి చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో 'విరూపాక్ష' బాక్సాఫీస్ జోరు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది. దీనికి తోడు మే 5న హిందీతో పాటు ఇతర భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం నార్త్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల హవా లేకపోవడంతో.. విరూపాక్ష ఎంతో కొంత సత్తా చూపే అవకాశముంది. అదే జరిగితే ఫుల్ రన్ లో అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటిదాకా యంగ్ హీరోల్లో సోలోగా 'గీత గోవిందం'(రూ.70 కోట్లకు పైగా షేర్)తో విజయ్ దేవరకొండ, 'దసరా'(రూ.60 కోట్లకు పైగా షేర్)తో నాని ఈ ఫీట్ సాధించారు. మరి ఇప్పుడు విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ కూడా రూ.50 కోట్ల షేర్ క్లబ్ లో చేరతాడేమో చూడాలి.