English | Telugu
సుజీత్ స్పీడ్ మాములుగా లేదు.. అప్పుడే 'ఓజీ' 50 శాతం షూటింగ్ పూర్తి!
Updated : Jun 26, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ డ్రామా 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
'ఓజీ' సినిమా షూటింగ్ ని పక్కా ప్లానింగ్ తో వేగంగా పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ లో ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, అప్పుడే 50 శాతం పూర్తయింది. హైదరాబాద్లో తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో, ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. మూడు అద్భుతమైన షెడ్యూల్స్ తో 50 శాతం షూటింగ్ పూర్తయిందని, రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయని మేకర్స్ తెలిపారు.
జూలై, ఆగస్ట్ లో జరగనున్న షెడ్యూల్స్తో, మొత్తం షూటింగ్ను త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.