English | Telugu

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు.. పలువురికి పురస్కారాలు!

నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన వేడుకలో కళావేదిక స్పెషల్‌ మ్యాగజైన్‌ను విడుదల చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కాపీని ఆవిష్కరించారు. తొలి కాపీని నిర్మాత ఎన్.ఆర్. అనురాధా దేవి అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ లైఫ్‌ టైం ఎక్సలెన్సీ అవార్డును ఆమెకు అందజేశారు. ఆర్‌.వి.రమణ మూర్తి లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్ అవార్డును పొత్తూరి రంగారావుకి, ఎన్టీఆర్‌ కళావేదిక ఫిల్మ్‌ అవార్డులను సీనియర్ నటి రోజా రమణి, నిర్మాత రాజ్‌ కందుకూరి, నటుడు పృథ్వీ, సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్‌, శివ కందుకూరి, కృష్ణసాయి, గాయకుడు సాకేత్‌ వేగి, వివి రష్మిక, నిర్మాత విజయ బాబు, త్రినాథ్‌ పంపన తదితరులకు అందజేశారు. ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

‘‘ఎన్టీఆర్‌ను దేవునిలా భావించే కోట్లాదిమంధిలో నేను ఒక్కదాన్ని. ఆయన, మా నాన్న మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ కళాసేవలోనే జీవితమంతా ఉండిపోయారు. అలాంటి మహానుభావుడి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కళావేదిక స్పెషల్‌ మ్యాగజైన్‌ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’’ అని అనురాధా దేవి అన్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కేల్‌ దామోదర్‌ ప్రసాద్‌, కార్యదర్శి ప్రసన్నకుమార్‌, వైవిఎస్‌ చౌదరి, అనుపమ రెడ్డి, రామసత్యనారాయణ, వివి రష్మిక, దర్శకుడు బాబ్జి, ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, జి శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.