English | Telugu
భూ వివాదంలో రాఘవేంద్రరావు... హైకోర్టు నోటీసులు!
Updated : Nov 10, 2023
హైదరాబాద్లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు గతంలో ప్రభుత్వం కొందరికి భూములను కేటాయించింది. స్టూడియోల నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి సంబంధించిన స్టూడియోల నిర్మాణ నిమిత్తం ఆ భూములను కేటాయించారు. అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే భూములను కేటాయించిందో.. దానికి కాకుండా మరోలా ఆయా భూములను వినియోగిస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కోర్టు నుంచి అలాంటి నోటీసునే అందుకున్నారు. రికార్డింగ్, రీరికార్డింగ్ థియేటర్లను నిర్మించేందుకు కేటాయించిన భూమిని రాఘవేంద్రరావు సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిల్పై స్పందించిన హై కోర్టు రాఘవేంద్రరావుకు, ఆయన బంధువులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఓసారి నోటీసులు జారీ చేసినా.. అవి వారికి అందినట్టుగా రికార్డుల్లో లేకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేశారు. మెదక్కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని ఆర్.కె.సినీప్లెక్స్ పేరుతో వాణిజ్య అవసరాలకు వినయోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది. అనంతరం విచారణ కోసం న్యాయస్థానం జనవరి 18కి వాయిదా వేసింది.