English | Telugu
అనుదీప్ ఫ్రెండ్ 'మ్యాడ్'.. మరో 'జాతిరత్నాలు' అవుతుందా!
Updated : Sep 27, 2023
లాజిక్స్ ని పక్కనపెట్టి నవ్వించడమే టార్గెట్ గా తీసిన 'జాతిరత్నాలు' సినిమాలో 2021 మార్చ్ లో విడుదలై ఘన విజయం సాధించింది. అప్పుడు ఈ చిత్ర దర్శకుడు అనుదీప్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు అనుదీప్ బాటలోనే అతని ఫ్రెండ్ పయనిస్తున్నాడు. తమ సినిమా చూసి 'మ్యాడ్' అయిపోతారు అంటున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాలో దర్శకుడు అనుదీప్ కూడా నటించడం విశేషం. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. "దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది." అన్నారు.
అనుదీప్ మాట్లాడిన సమయంలో మైక్ అందుకున్న నిర్మాత నాగవంశీ "మీరు సినిమా చూశారు కదా. మ్యాడ్, జాతిరత్నాలు.. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బాగుంది" అని అడగగా.. "మ్యాడ్ సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చింది" అని అనుదీప్ సమాధానం ఇచ్చాడు.
అనంతరం నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "జాతిరత్నాలు కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. జాతిరత్నాలు తరహాలోనే కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు" అన్నాడు.
చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. వంశీ గారు చెప్పినట్టు మీకు డబ్బులు వెనక్కి రావు. అంతలా ఎంజాయ్ చేస్తారు" అన్నాడు.
మరి వీరి నమ్మకం నిజమై 'మ్యాడ్' సినిమా మరో 'జాతిరత్నాలు' అవుతుందేమో చూడాలి.