English | Telugu

రాజమౌళి ముందున్న సవాళ్లు అవే.. వాటిని అధిగమించి ‘వారణాసి’ని రిలీజ్‌ చెయ్యగలడా?

- షూటింగ్‌ దశలోనే ఉన్న వారణాసి

- ‘వారణాసి’ రిలీజ్‌పై భిన్నాభిప్రాయాలు

- సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసిన అంశాలు..

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ సినిమాల హవా కొనసాగుతోంది. టాప్‌ స్టార్స్‌ అంతా పాన్‌ ఇండియా మూవీస్‌పైనే దృష్టి పెట్టారు. దానికి తగ్గట్టుగానే సినిమాలో అనేకానేక హంగులు సమకూర్చే పనిలో ఉన్నారు. ఎన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ అందరి దృష్టీ మహేష్‌, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి చిత్రంపైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్‌ వచ్చినా క్షణాల మీద అది వైరల్‌గా మారిపోతోంది.

ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి, ఇందులో మహేష్‌ కనిపించే ఐదు పాత్రల గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్‌ డేట్‌ గురించి భారీగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ డిస్కషన్‌ ఎక్కువైంది. వారణాసి 2027 మార్చిలో రిలీజ్‌ అవుతుందని కొందరంటుంటే, మరికొందరు ఆ సంవత్సరం శ్రీరామనవమికి రిలీజ్‌ అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో బలం లేకపోయినా ఈ వార్తలు మాత్రం వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి రాజమౌళికే కాదు, చిత్ర యూనిట్‌లోని ఎవ్వరికీ క్లారిటీ లేదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటి అని ఆలోచించకుండా వైరల్‌ చేసేస్తున్నారు. ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో 2027లో వారణాసి చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. అయితే అది ఏ నెలలో అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే, అసలు 2027లో సినిమా రిలీజ్‌ ఉంటుందా లేదా సందేహం అందరిలోనూ మొదలైంది.

ఇప్పటివరకు సగం షూటింగ్‌ మాత్రమే పూర్తయింది. బ్యాలెన్స్‌ షూటింగ్‌ను ఎంత వేగంగా పూర్తి చేసినప్పటికీ ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం చాలా టైమ్‌ తీసుకుంటాడు రాజమౌళి. తను అనుకున్న క్వాలిటీ వచ్చే వరకు కాంప్రమైజ్‌ అవ్వడని అతని గత సినిమాల ద్వారా తెలుసుకున్నాం. ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్‌లో కూడా చేస్తున్నారు కాబట్టి రాజమౌళి చెప్పినట్టు 2027లో ‘వారణాసి’ రిలీజ్‌ అవుతుందని చెప్పడం కష్టమే.

ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మరో సంవత్సరంలో ఈ పనులన్నీ పూర్తి చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు. అందులోనూ ‘వారణాసి’ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్‌గా చేస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే.. ఇతర హీరోల సినిమాలు 2027లోనే థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. ఎన్టీఆర్‌, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా, ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమా డ్రాగన్‌, ప్రభాస్‌, సందీప్‌రెడ్డి మూవీ స్పిరిట్‌ వంటి సినిమాలు 2027నే టార్గెట్‌ చేశాయి. వారణాసి సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చెయ్యాలంటే రాజమౌళి ముందు ఇన్ని సవాళ్లు ఉన్నాయి. మరి వీటిని ఎదుర్కొని తను అనుకున్న విధంగా సినిమాను రిలీజ్‌ చెయ్యగలడా? లేదా? అనేది వేచి చూడాలి.