English | Telugu
తండ్రి సమాధి దగ్గర ప్రశాంత్ నీల్
Updated : Sep 7, 2023
ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో భారీ చిత్రాలను తెరకెక్కించటంలో అతి కొద్ది మంది దర్శకులకే ఓ ఇమేజ్ ఉంది. అలాంటి వారిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయన గత చిత్రం KGF భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఏకంగా రూ.1200 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు ఆయన ప్రభాస్తో ‘సలార్’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న వస్తుందని ప్రకటించినప్పటికీ తాజా సమాచారం మేరకు వాయిదా పడింది. త్వరలోనే ‘సలార్’ కొత్త రిలీజ్ డేట్పై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘సలార్’కు సంబంధించిన విషయాలు బయటకు లీక్ కాకుండా ఉండటానికి తన సొంత ఊరిలోనే మన స్టార్ డైరెక్టర్ నిర్మాణానంత కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
గురువారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగాసత్యసాయి జిల్లా లకంఠాపురంలోని కృష్ణుడి ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అక్కడ తమ కుటుంబ గోత్ర నామాలతో పాటు సలార్ సినిమా పేరు చెప్పటం కొసమెరుపు. తర్వాత తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు ప్రశాంత్ నీల్. అక్కడే కొద్ది సమయాన్ని గడిపి మౌనం పాటించారు. ప్రశాంత్ నీల్కి కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘువీరా రెడ్డి అన్నయ్య వరుస అవుతారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన దృష్టినంతా సలార్ మీదనే ఫోకస్ చేసి ఉన్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్కి తగ్గట్టు సినిమాను తెరకెక్కించినట్లు రీసెంట్గా రిలీజైన గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్. ‘సలార్’ను ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో మొదటి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది. త్వరలోనే కొత్త రిలీట్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.