English | Telugu
దిల్ రాజా మజాకా.. 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్ చేసిన ఇద్దరు అరెస్ట్!
Updated : Nov 6, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
థమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం 'జరగండి' అనే ఓ పాట లీకైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత దిల్ రాజు.. ఆ సమయంలో సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ ఏసీపీ చాంద్ భాషా, ఎస్సై భాస్కర్ రెడ్డి, ప్రసేన్ రెడ్డి, సాయి తేజ్ ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.
దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్ 'జరగండి'ని అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పాటను పాన్ ఇండియా రేంజ్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా ఎస్.తిరుణావుక్కరసు, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల, ఎడిటర్ గా షామీర్ ముహ్మద్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.