English | Telugu
Rashmika Mandanna Fake Video : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. చర్యలు తీసుకోవాలని అమితాబ్ డిమాండ్!
Updated : Nov 6, 2023
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందితే అంత చేటు చేస్తుందని ఇటీవల చాలా సందర్భాల్లో రుజువైంది. దేశం అభివృద్ధి బాటలో నడిచేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని సక్రమమైన మార్గంలోనే వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో ఆందోళన నెలకొనేలా చేస్తున్నారు. తాజాగా రష్మిక డీప్ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై బిగ్బి అమితాబ్ స్పందించి ఈ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడంటే ఆ వ్యక్తులు చేసింది ఎంత హేయమైన చర్యో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారంటే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఇప్పుడు ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. దాని సాయంతో రష్మిక ముఖాన్ని కురచ దుస్తులు ధరించిన ఓ అమ్మాయికి మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. ఒక్కసారి ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఈ వీడియోపై రష్మిక అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది ఎలా జరిగింది అనే విషయాన్ని ఓ జర్నలిస్ట్ డీటైల్డ్గా వివరించాడు. ఎఐ టెక్నాలజీ సాయంతోనే ఈ వీడియోను క్రియేట్ చేశారని, మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేశారని వెల్లడిరచారు. సెలబ్రిటీలకు ఇలాంటి ఫేక్ ఫోటోలతో, వీడియోలతో నిద్రలేకుండా చేస్తున్న వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. నెట్టింట జరిగే తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చెయ్యాల్సి బాధ్యత సోసల్ మీడియా వేదికలపైనే ఉందని స్పష్టం చేశారు. భారతీయుల భద్రతపై నమ్మకాన్ని పెంచేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించినపుడు ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలని అన్నారు. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్కు రూల్ 7 వర్తిస్తుందని, బాధితులకు కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.