English | Telugu
తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్టీఆర్
Updated : Apr 5, 2023
నాన్న గారి శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఆయన ప్రభావం ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనమని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కమిటీ, చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో ఇటీవల భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని జనార్దన్ బాలకృష్ణకు వివరించారు. తన తండ్రే తనకు స్ఫూర్తి ప్రదాతని, ఆయన మార్గంలోనే తాను ప్రయాణిస్తున్నానని బాలకృష్ణ చెప్పారు.
ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జయహో ఎన్టీఆర్ పేరుతో ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు/వీడియోలు ఉంటాయని, అలాగే రామారావు గారు ముఖ్యమంత్రి గా అసెంబ్లీ లో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకొస్తున్నామని, 'శకపురుషుడు' పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని, ఇందులో రామారావు గారి సినిమా, రాజకీయ జీవితంపై విశ్లేషణాత్మకమైన వ్యాసాలు, అపురూపం, అరుదైన ఫోటోలు వుంటాయని జనార్దన్ తెలిపారు.
తమ తండ్రి గారు సినిమా రంగంలో సాధించిన విజయాలు, చేసిన వినూత్న ప్రయోగాలు, ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు ఈనాడు దేశమంతా అమలవుతున్నాయని, అంటే ఆయన దూర ద్రుష్టి ఎలాంటిదో ఇప్పటి తరాలకు తెలుస్తుందని, వారిని ఎప్పటికీ నిలిపేలా మీరు చేస్తున్న అసామాన్యమైన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, మేము కూడా ఈ కృషిలో భాగస్వాములమవుతామని బాలకృష్ణ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
చైర్మన్ టి .డి .జనార్దన్, మిగతా కమిటీ సభ్యుల ను బాలకృష్ణ అభినందించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను విజయవాడ , హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జనార్దన్ తెలిపారు. చైర్మన్ టి.డి. జనార్థన్, సభ్యులు, కాట్రగడ్డ ప్రసాద్, భగీరథ, విక్రమ్ పూల, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్ మరియు విజయ్ భాస్కర్, గౌతమ్ బాలకృష్ణను కలసి తమ కృషిని తెలిపారు.