English | Telugu

సినిమా పేరు:మహారాజ
బ్యానర్:ప్యాషన్ స్టూడియోస్
Rating:3.00
విడుదలయిన తేది:Jun 14, 2024

తారాగణం: విజయ్ సేతుపతి,అనురాగ్ కశ్యప్,మమతా మోహన్ దాస్,అభిరామి,భారతీరాజా ,నటరాజన్ సుబ్రహ్మణ్యం తదితరులు 
ఎడిటర్: ఫిలోమన్ రాజ్ 
సినిమాటోగ్రఫీ:దినేష్ పురుషోత్తమన్
దర్శకుడు: నితిలన్ స్వామినాథన్
నిర్మాతలు :జగదీశ్ పళని స్వామి, సుదాన్ సుందరం 
విడుదల తేదీ: జూన్ 14, 2024

 

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నుంచి  సినిమా వస్తుందంటే భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనపరుస్తారు.మరి ఈ రోజు 'మహారాజ'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పైగా మక్కల్ యాభయ్యవ సినిమా. దీంతో  ఎన్నో అంచనాలతో థియేటర్స్ లో అడుగుపెడతారు. మరి వాళ్ళ అంచనాల్ని అందుకుందా లేదో చూద్దాం.

 

కథ
మహారాజ (విజయ్ సేతుపతి ) ఒక సెలూన్ షాప్ నిర్వహిస్తుంటాడు. తన ఒక్కగానొక్క కూతురు జ్యోతి అంటే మహారాజ కి పంచ ప్రాణాలు. తనే లోకంగా బతుకుతుంటాడు. చదువులో పూర్ అయిన జ్యోతి స్పోర్ట్స్ లో మాత్రం నెంబర్ వన్. అందుకు సంబంధిచిన పోటీల నిమిత్తం జ్యోతి వేరే ఊరు వెళ్తుంది. ఆ తర్వాత  తను  దైవంగా భావించే డస్ట్ బిన్ ని ( లక్ష్మి) ముగ్గురు  దొంగలు అపహరించారని  పోలీసు కంప్లైంట్ ఇస్తాడు. మొదట పిచ్చి కేసుగా భావించిన ఎస్ ఐ (నటరాజన్ సుబ్రహ్మణ్యం)  మహారాజ ఇస్తానన్న డబ్బుకి ఆశపడి  కేసు ని ఛాలెంజ్ గా తీసుకొని లక్ష్మి కోసం ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తాడు ఇంకో పక్క కరుడుగట్టిన దొంగ (అనురాగ్ కశ్యప్ ) డబ్బు కోసం మనుషులని చంపుతుంటాడు. మహారాజ కూడా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తాడు.చివరకి  అనురాగ్ కశ్యప్ ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? మహారాజా హత్య చేసిన విషయాన్ని కనిపెట్టారా?  డస్ట్ బిన్  కేసు ఏమైంది ?  అదే విధంగా  మహారాజ కి అనురాగ్ కశ్యప్ కి సంబంధం ఏమైనా ఉందా? అనేదే ఈ కథ.
 


ఎనాలసిస్ :

సినిమా అంటేనే భారీ బడ్జట్ ఉండాలని భావించే ఈ రోజుల్లో అలాంటివేమీ అక్కర్లేదు. ఆరిస్టుల పెర్ ఫార్మెన్స్ ,పకడ్బంది స్క్రీన్ ప్లే ఉంటే చాలని మహారాజా నిరూపించింది. మూవీ  మొత్తం  ఎక్కడ కూడా  బోర్ లేకుండా సాగింది. కథ సింపుల్ పాయింట్ అయినా కూడా కథ లో ఏదో  ఉందనే  క్యూరియాసిటీ ని కలిగించింది. ఇలాంటి మూవీ  గురించి చెప్పుకోవాలంటే  ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని విడదీసి చెప్పుకోలేము. ఎందుకంటే సినిమా కూడా ఆ ఉద్దేశ్యంతో తెరకెక్కలేదు. ఫస్ట్ ఆఫ్ చూస్తున్న ప్రేక్షకుడు సెకండ్ ఆఫ్ లో ఏమై ఉంటుందనే  ఆలోచనలో పడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుడు బుర్రకి మహారాజ  పదును పెట్టింది. నిజ జీవితంలో ఒక మనిషి తన స్థాయి తగ్గ  మెంటాలిటీ ని ఏ విధంగా  ప్రదర్శిస్తాడో కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది  ఒక మనిషికి అన్యాయం చేసి తన ఫ్యామిలీ ని మాత్రం  బాగా చూసుకుంటాడు. అదే సమయంలో మనిషిలో ఎంత ఉన్నత విలువలు ఉంటాయో కూడా చూపించారు.ఆ  రెండిటి బ్యాలన్స్  ఈ మూవీ.  క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం  అదిరిపోతుంది.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
మహారాజ క్యారక్టర్ లో విజయ్ సేతుపతి వీర విహారం చేసాడు. తన నటనలో  దాగి  ఉన్న ఇంకో  కొత్త కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసాడు. బార్బర్ క్యారక్టర్ లో పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. పాయిజన్ ఎలా అయితే నిదానంగా మనిషి మెదడుకి ఎక్కుతుందో ,సేతుపతి నటన కూడా ప్రేక్షకుడికి అదే విధంగా ఎక్కుతుంది. మూవీ చూస్తున్నంత సేపు సేతుపతి కనపడడు. కేవలం మహారాజానే కనపడతాడు. మమతా మోహన్ దాస్, అభిరామి లకి పెద్దగా నటించడానికి లేకుండాపోయింది. ఇక హత్యలు చేసే క్యారక్టర్ లో బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక లెవల్లో నటించాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి ఒక కొత్త విలన్ దొరికినట్టే.  మూవీకి నిండుదనాన్ని కూడా తెచ్చాడు.ఎస్ ఐ క్యారక్టర్ లో నటరాజన్ సుబ్రహ్మణ్యం ఒక రేంజ్ లో నటించాడు. బిజీ ఆర్టిస్ట్ గా మారడం ఖాయం.ఇక సేతుపతి కూతురుగా చేసిన అమ్మాయి కూడా బాగా చేసింది.  దర్శకుడి పని తనం ప్రతి ఫ్రేమ్ లో కొట్టొస్తుంది. ఫొటోగ్రఫీ సూపర్ గా ఉంది. ఇక అలనాటి దర్శక శిఖరం భారతి రాజా తన పాత్ర మేరకు నటించి నిండుతనాన్ని తెచ్చాడు. బిజిఎం రొటీన్. ఎడిటింగ్ మాత్రం చాలా  బాగుంది.
 


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఈ బిజీ ప్రపంచంలో  డస్ట్ బిన్  విలువ ఏంటి అనేది ఒక్క నిమిషం ఆలోచిస్తే గాని తెలియదు. కానీ మహారాజ చూసిన ప్రేక్షకుడు మాత్రం ఒక్క నిమిషం ఆలోచనలో పడతాడు.

- అరుణాచలం