English | Telugu
పవన్ టార్గెట్ అల్లుఅరవిందేనా..?
Updated : Dec 8, 2017
పవర్స్టార్ పవన్కళ్యాణ్కి తన అన్నయ్య చిరంజీవి అంటే ప్రాణం. ఆయన్ను ఎవరైనా పల్లెత్తు మాటన్నా..? అవమానించినా పవర్స్టార్కి పూనకం వచ్చేస్తోంది.. ఇక ఎదుట ఉన్న వ్యక్తి స్థాయి ఏంటీ..? ఆయన మనకి ఏమవుతాడు ఈ విషయాలేవి ఆయన పట్టించుకోరు.. అక్కడికక్కడే దుమ్ము దులిపేస్తాడు పవన్. ఈ ఆవేశాన్ని తెలుగువారు ఎన్నో సార్లు చూశారు. తాజాగా విశాఖలోని డీసీఐ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికేందుకు వైజాగ్ వెళ్లారు జనసేనాని. సూసైడ్ చేసుకున్న ఉద్యోగి కుటుంబాన్ని ఓదార్చి.. అక్కడ బహిరంగ సభలో రెచ్చిపోయాడు పవర్స్టార్. ప్రధానమంత్రిని.. ముఖ్యమంత్రిని.. ప్రతిపక్షనేతని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించాడు. ఈ సమయంలో ఎందుకు గుర్తొచ్చిందో గానీ.. ప్రజారాజ్యం పార్టీ ఆయనకు జ్ఞప్తికి వచ్చింది..
ఇక అంతే నాడు తన అన్నయ్య పార్టీకి, అన్నయ్యకు ద్రోహాం చేసిన ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారని.. వారిలో ఏ ఒక్కరిని తాను వదలనని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన ఈ మాటలను ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పీఆర్పీ దారుణ ఓటమికి చిరు బావమరిది అల్లు అరవింద్ తీరే కారణమన్నది రాజకీయంగా ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.
టిక్కెట్ల విషయంలో, పార్టీ ఫండింగ్ విషయంలో అల్లుపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. బలమైన అభ్యర్ధులను పక్కనబెట్టి.. డబ్బులు ఇచ్చిన వాళ్లకే అరవింద్ టిక్కెట్లు ఇచ్చారన్న వార్తలు మీడియాలో వచ్చాయి. నాటి నుంచే పవన్కు, అరవింద్కు మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు వచ్చాయని.. అవే పవన్ను చిరును విడదీశాయని విశ్లేషకులు మాట. మరి అంతు చూస్తా అన్న మాటలు అల్లు అరవింద్ గురించి అన్నాడా.. లేక ప్రజారాజ్యం పార్టీలో కీలకపాత్ర వహించిన పరకాల ప్రభాకర్, దేవేందర్ గౌడ్, డాక్టర్ మిశ్రా, ఇనుగాల పెద్దిరెడ్డిలను టార్గెట్ చేశాడా అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది.