Read more!

English | Telugu

కొవిడ్‌తో సీనియ‌ర్ టీవీ న‌టి మాధ‌వి మృతి!

 

'అనుప‌మ' టీవీ సిరీస్‌లో హీరోయిన్ రూపాలి గంగూలీ త‌ల్లిగా న‌టించిన సీనియ‌ర్ తార మాధ‌వి గోగ‌టే కొవిడ్‌-19 వ్యాధికి గురై మృతి చెందారు. ఆమె వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన ఆమెను ముంబైలోని సెవ‌న్ హిల్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె స‌హ‌న‌టులు రూపాలి, అల్ప‌న బుచ్‌ సోష‌ల్ మీడియా ద్వారా మాధ‌వికి సంతాపం తెలియ‌జేస్తూ శ‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

'అనుప‌మ' సీరియ‌ల్‌లో రూపాలి త‌ల్లి కాంతా జోషి పాత్ర‌ను మాధ‌వి గోగ‌టే పోషించారు. ఇటీవ‌లే ఆమె ఆ సీరియ‌ల్ నుంచి త‌ప్పుకోగా, ఆమె స్థానాన్ని మ‌రో వెట‌ర‌న్ యాక్ట్రెస్ స‌విత ప్ర‌భునే భ‌ర్తీ చేశారు. రూపాలి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మాధ‌వి ఫొటోను షేర్ చేసి, ఆమెకు నివాళుల‌ర్పించింది. 

అలాగే 'అనుప‌మ‌'లో రూపాలి అత్త‌గా న‌టిస్తోన్న అల్ప‌నా బుచ్ సైతం సోష‌ల్ మీడియాలో మాధ‌వి గోగ‌టే మృతికి తీవ్ర సంతాపం తెలియ‌జేశారు. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో మాధ‌వి ఫొటోను షేర్ చేసిన ఆమె, "మాధ‌వీజీ ఇలా జ‌ర‌గాల్సింది కాదు.. సీన్ పూర్త‌వ‌క‌ముందే యాక్ట‌ర్ నిష్క్ర‌మించ‌కూడ‌దు. 'అనుప‌మ' సెట్స్‌పై మిమ్మ‌ల్ని మిస్ అవుతుంటాం. మీ అంద‌మైన చిరున‌వ్వు, మీ స్వీట్ వాయిస్‌.. మీ హ్యూమ‌ర్‌.. అన్నింటినీ మేం మిస్స‌వుతుంటాం" అని ఆమె రాసుకొచ్చారు.

మాధ‌వి ప్ర‌స్తుతం దంగ‌ల్ టీవీలో 'సిందూర్ కి కీమ‌త్' సీరియ‌ల్‌లో క‌నిపిస్తున్నారు.