English | Telugu

భారతీయులందరూ నన్ను క్షమించండి.. పహల్‌గామ్‌ ఘటనపై ఎమోషనల్‌ అయిన హీరోయిన్‌!

ఈనెల 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన మారణకాండ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌కి చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను వారి మతం అడిగి మరీ హతమార్చడం అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యకు సిద్ధమవుతోంది. దాని కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ దుశ్చర్యకు పాల్పడిరది పాకిస్తానేనని అందరూ విశ్వసిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా పాకిస్తాన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ దాడిని ప్రముఖులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్‌ ఈ ఘటనపై ఎమోషనల్‌ అయింది. తాను ఓ ముస్లిం అయినందుకు ఎంతో సిగ్గు పడుతున్నాను అంటోంది. ఆమె పేరు హీనా ఖాన్‌.

బుల్లితెర ద్వారా ఎంతో పాపులర్‌ అయిన హీనా ఖాన్‌.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బిగ్‌ బాస్‌ 11 పాల్గొన్న హీనా.. ఆ తర్వాత ఏక్తా కపూర్‌ నిర్మించిన ‘నాగిన్‌5’లో నటించింది. విక్రమ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాక్డ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. హీనా ఖాన్‌ గత కొంతకాలంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న హీనా.. దానివల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఎంతో మనో ధైర్యంతో తన ఆరోగ్య సమస్యపై పోరాడుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై తన నిరసనను, మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది. ఏప్రిల్‌ 22 చీకటి రోజుగా పేర్కొంది. తాము ముస్లింలుగా చెప్పుకొని మానవత్వం లేకుండా కాల్పులు జరపడాన్ని, అమాయకులను హత్య చేయడాన్ని ఆమె ఖండిరచింది. తాను ఓ ముస్లింగా ఎంతో సిగ్గుపడుతున్నానని తెలిపింది. భారతదేశంలో ఉన్న హిందువులందర్నీ, తోటి భారతీయులను క్షమాపణలు వేడుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేసింది. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచకుండా ఉన్నాయని, వారందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తన ట్వీట్‌లో పేర్కొంది.