English | Telugu
ప్రతిసారీ షారూక్ ఖాన్నే టార్గెట్ చేస్తున్న ప్రశాంత్ నీల్!
Updated : Feb 26, 2024
షారూక్ ఖాన్, ప్రశాంత్ నీల్.. ఒకరు గత ఏడాది రెండు బ్లాక్బస్టర్స్తో కలెక్షన్లు కొల్లగొట్టి బాలీవుడ్కి ఊరట నిచ్చిన హీరో.. మరొకరు కెజిఎఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో భారీ విజయాలను అందుకొని అందరి దృష్టినీ తనవైపు మరల్చుకున్న డైరెక్టర్. వీరిద్దరి మధ్య పోటీ ఏమిటి? అసలది ఎలాంటి పోటీ? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ప్రశాంత్ నీల్ తన సినిమాలతో రెండు సార్లు షారూక్ను దెబ్బకొట్టాడు.
వివరాల్లోకి వెళితే.. గత ఏడాది పఠాన్, జవాన్ వంటి సినిమాలతో కలెక్షన్ల సునామీ సృష్టించి దాదాపు ఐదేళ్ళ తర్వాత పర్ఫెక్ట్ రీ ఎంట్రీ ఇచ్చాడు షారూక్ ఖాన్. 2018లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ‘జీరో’ ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దానికి ప్రశాంత్ నీల్ కూడా ఒక కారణం. ఎందుకంటే ‘జీరో’, ‘కెజిఎఫ్’ రెండూ ఒకేరోజు అంటే డిసెంబర్ 21, 2018లో రిలీజ్ అయ్యాయి. ‘కెజిఎఫ్’ హిందీలో 45 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలవగా, ‘జీరో’ 90 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది.
పఠాన్, జవాన్ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత గత ఏడాది డిసెంబర్ 21న ‘డంకీ’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు షారూక్ సిద్ధమయ్యాడు. కానీ, డిసెంబర్ 22న ‘సలార్’తో వచ్చాడు ప్రశాంత్నీల్. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాని దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో ‘డంకీ’ పెద్ద విజయం సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ‘సలార్’తో షారూక్ను మరోసారి దెబ్బతీశాడు ప్రశాంత్ నీల్. బాక్సాఫీస్ వద్ద ‘డంకీ’ నిరాశపరచింది. ‘జీరో’, ‘డంకీ’ రెండూ డ్రామా జోనర్కి చెందిన సినిమాలు, ‘కెజిఎఫ్’, ‘సలార్’ పూర్తి యాక్షన్ మూవీస్. అందువల్లే షారూక్ సినిమాలు నిలబడలేకపోయాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ‘సలార్2’ ప్రారంభం కావాల్సి ఉంది. రెండుసార్లు ప్రశాంత్ నీల్తో తలపడిన షారూక్ మూడో ప్రయత్నం కూడా చేస్తాడేమో చూడాలి.