Read more!

English | Telugu

ఫస్ట్‌ టైమ్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌!

బాలీవుడ్‌లో ఓ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే విషయం తెలియడంతో ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విశేషాల కోసం ఎదురుచూస్తున్నారు. కరణ్‌ జోహర్‌, షారూక్‌ ఖాన్‌, రణవీర్‌సింగ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట.  1995లో దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే మొదలుకొని 2010లో వచ్చిన మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌ వరకు వివిధ విభాగాల్లో 22 సినిమాలకు కలిసి పనిచేశారు కరణ్‌, షారూక్‌. ఇటీవలే రణ్‌వీర్‌ సింగ్‌ అలియా భట్‌లతో రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ సినిమాతో హిట్‌ కొట్టిన కరణ్‌ ఇప్పుడు ఈ మల్టీస్టారర్‌పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటివరకు కరణ్‌, షారూక్‌ పనిచేసిన సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలే. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో రాని యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. 

ఈ సినిమా విషయంలో కరణ్‌ ప్లానింగ్‌ బాగానే ఉంది. కానీ, ఇప్పటివరకు అతని డైరెక్షన్‌లో వచ్చిన 10 సినిమాల్లో ఒక్కటి కూడా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా లేదు. మరి ఒక్కసారిగా ఇలాంటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సినిమా చేయడానికి ఎందుకు డిసైడ్‌ అయ్యాడనేది ఆలోచించాల్సిన విషయమని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనికి కూడా కారణం లేకపోలేదని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలకు, సెంటిమెంట్‌ సినిమాలకు కాలం చెల్లిందని, ఏ ఇండస్ట్రీలో చూసినా ఇలాంటి యాక్షన్‌ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కరణ్‌ కూడా ఆ ఫార్మాట్‌లోనే వెళుతున్నట్టు తెలుస్తోంది.