English | Telugu
అంత హుషారుగా ఉండే నటి.. చనిపోయే టైమ్కు ఇలా అయిపోయింది!
Updated : Sep 19, 2022
పాపులర్ టీవీ నటి నిషి సింగ్ ఆదివారం మృతి చెందారు. 'హిట్లర్ దీదీ', 'ఖుబూల్ హై', 'ఇష్క్బాజ్', 'తెనాలి రామ' లాంటి హిందీ సీరియల్స్ దారా ఆమె ఎంతో పేరు గడించారు. రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె, తన 50వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్న రెండు రోజులకే తుదిశ్వాస విడిచారు. రచయిత, నటుడు సంజయ్ సింగ్ భద్లీ ఆమె భర్తే.
తెరపైనే కాకుండా బయట కూడా ఎంతో హుషారుగా కనిపించే ఆమె.. మృతి చెందే సమయానికి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చివరి రోజుల్లో ఆమె వైద్య చికిత్సకు అవసరమైన డబ్బు సమకూడక కుటుంబం ఎంతగానో అవస్థలు పడింది. అనారోగ్యం వేధిస్తున్నప్పటికీ, బతకడానికి నిషి ఎంతో పోరాడిందని ఆమె భర్త సంజయ్ సింగ్ చెప్పాడు.
రెండేళ్ల కాలంలో నిషికి మూడు సార్లు స్ట్రోక్ వచ్చిందని ఆయన వెల్లడించాడు. చనిపోవడానికి కొద్ది వారాల ముందు తీవ్రమైన గొంతు ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడిందనీ, చనిపోవడానికి రెండు రోజుల ముందే తన 50వ పుట్టినరోజును ఆమె జరుపుకుందనీ ఆయన చెప్పాడు.
"ఫిబ్రవరి 3 (మొదటి స్ట్రోక్ వచ్చిన ఏడాదికి)న ఆమెకు రెండోసారి స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత కోలుకుంటున్నట్లు కనిపించింది. కానీ, తిరిగి మేలో మూడో స్ట్రోక్ వచ్చాక, ఆమె ఆరోగ్య స్థితి క్షీణిస్తూ వచ్చింది. హాస్పిటల్లో చేర్పించాం. తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. కొన్ని వారాలుగా గొంతు ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా తినడానికి కూడా ఆమె ఇబ్బందిపడుతూ వచ్చింది. ఘన పదార్థాలు తీసుకోలేకపోయేది. దాంతో మేం ద్రవపదార్థాలే ఇస్తూ వచ్చాం. అత్యంత బాధాకరమైన విషయమేంటంటే.. చనిపోవడానికి రెండు రోజుల ముందే, సెప్టెంబర్ 16న తన 50వ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది. మాట్లాడలేకపోతున్నా, సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. తనకు ఇష్టమైన లడ్డు తినమని చెప్పాను. తను తిన్నది." అని ఆయన గుర్తుచేసుకున్నాడు.