English | Telugu

60 కోట్ల స్కామ్‌ నిజమే.. ఒప్పుకున్న బాలీవుడ్‌ జంట!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.60 కోట్ల స్కాంకి సంబంధించి ఎట్టకేలకు పోలీసులు నిజం రాబట్టగలిగారు. పెట్టుబడి పేరిట ఒక వ్యాపారిని మోసం చేసినట్టుగా వెల్లడైంది. అతన్ని మోసం చేసింది ఎవరో కాదు, ప్రముఖ నిర్మాత రాజ్‌ కుంద్ర, నటి శిల్పా శెట్టి. రెండు నెలలుగా ఈ స్కామ్‌కి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. దాదాపు 5 గంటలపాటు జరిగిన విచారణలో రాజ్‌ కుంద్ర నిజం ఒప్పుకున్నాడని తెలుస్తోంది. తనను రూ.60 కోట్ల మేర మోసం చేశారు అని ఒక వ్యాపారవేత్త.. ఈ జంటపై కేసు నమోదు చేయించారు. భాగంగానే ముంబై పోలీసులు రాజ్‌ కుంద్రాను విచారించారు. అతని బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ వివరాలతోపాటు ఇతర ఖర్చుల గురించి కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కొన్ని కంపెనీలలో రూ.60 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణలో రాజ్‌ ఒప్పుకున్నాడని సమాచారం. నిజంగానే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా లేక వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారా అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.

రాజ్‌ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతని ఇతర వ్యాపారాలపై కూడా నిఘా పెట్టారు పోలీసులు. అంతేకాదు, అతను అద్దెకు తీసుకున్న ఆఫీసులకు సంబంధించిన పేమెంట్స్‌పై కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రాజ్‌కి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులు రాబట్టారు. విచారణలో తను నేరం చేసినట్టుగా అంకగీకరించాడు కాబట్టి అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై బాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ కేసుకి సంబంధించిన మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.