రిజర్వ్ బ్యాంక్ రాజధాని రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీ చిత్రవిచిత్ర ఆటల సంగతి అటుంచితే, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాలు కూడా అమరావతి విషయంలో తమవంతు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో వుండగా జరిగిన అమరావతి అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ కుట్రల కారణంగా ఆగిపోయింది. అమ్మ పెట్టా పెట్టదు  అడుక్కుతినానివ్వదు అన్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పట్టించుకోదు.. అటు కేంద్రానికి చెందిన సంస్థలకు సహకరించదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల కారణంగా కేంద్రం నుంచి అమరావతికి అందాల్సిన ఎన్నో ప్రయోజనాలు ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం మూడు  రాజధానుల సాకు చూపిస్తూ అమరావతిని అణిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ‘క్లారిటీ లేదు’ అనే సాకు చూపించి ముఖం చాటేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆ లిస్టులో తాజాగా రిజర్వ్ బ్యాంక్ కూడా చేరింది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు  చేయాలి. దీని కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో 11 ఎకరాలు కేటాయించింది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి కూడా అంత స్థలం వుందో లేదో మరి. తెలుగుదేశం ప్రభుత్వం స్థలం  కేటాయించినా ఆర్బీఐ అమరావతిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా నిద్రపోయింది. పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయి వైసీపీ పాపకాలం ప్రారంభమైన తర్వాత నిద్ర మేలుకున్న ఆర్బీఐకి పాపం రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించలేక చేతులెత్తేసింది. అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాన్ని ఎప్పుడు  ఏర్పాటు చేస్తారు మహాప్రభో అని అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. దాంతో  ప్రధానమంత్రి కార్యాలయం ఆర్బీఐని సూదితో గుచ్చింది.  ఉలిక్కలిపడి నిద్ర లేచిన ఆర్బీఐ, తమకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని లేఖ రాసింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో క్లారిటీ లేదని రిజర్వ్ బ్యాంక్ అనడం అమాయకత్వం అనాలో, అజ్ఞానం అనాలో అర్థం కాని  పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ రాజధానిగా శంకుస్థాపన చేసింది  అమరావతికి. కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది   రాజధాని అమరావతి అనే. కేంద్రప్రభుత్వం లెక్క ప్రకారం ఇప్పటి వరకు అయితే అమరావతే రాజధాని. ఈ ఏడాది జూన్  వరకు హైదరాబాద్ కూడా రాజధాని అయిప్పటికీ ఆ తర్వాత రాజధాని అమరావతే అనే విషయంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ పటంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే వుంది. ఇన్ని అధికారిక ఆధారాలు వుండగా, మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అనవసరపు రచ్చని ఎందుకు ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటున్నదనేది అర్థం కాని విషయం.

పేర్లతో కన్ఫ్యూజన్ ...పవన్  ఓటమికి జగన్ కుట్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలలో  వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కొత్త కుట్రకు తెరలేపాడు. తన సత్తా చాటాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించటానికి వైసిపి ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు తగులుతున్నాయి.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి ఇక ఇదే సమయంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఢిల్లీ వెళ్లి మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకోవాలని బెదిరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పిఠాపురంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పిఠాపురంలో పోటీలో మరో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తారని జనసేన వర్గాలు భావిస్తుంటే, తాజాగా ఆయనకు అతిపెద్ద సమస్య వచ్చి పడింది. పిఠాపురం నియోజకవర్గం నుండి కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఈయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి జనసేన శ్రేణులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ... ఒక విషయం ఆ పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే బకెట్ గుర్తు. కామన్ సింబల్స్ లో ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కూడా కేటాయించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నేతల పేర్లతో ఉన్న వారు బకెట్ సింబల్ తో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బకెట్ గుర్తు అచ్చం జనసేన గుర్తు గాజు గ్లాసును పోలి ఉంది. నవరంగ్ కాంగ్రెస్ అనే ఓ పార్టీ బకెట్ సింబల్ తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. పిఠాపురంలో కె. పవన్ కల్యాణ్, తెనాలిలో ఎన్. మనోహర్, మచిలీపట్నం ఎంబీ అభ్యర్థిగా బాలశౌరి అనే అభ్యర్థులను బరిలోకి దించింది. జనసేనకు ఓటు వేసే ఓటర్లు ఈ గుర్తుల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన సింబల్స్ ఆ పార్టీని ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలో రెండు సమస్యలు వచ్చి పడ్డాయి. పవన్‌పై మరో పవన్ పోటీకి సిద్ధమయ్యారు.. ఇద్దరి ఇంటి పేర్లు కే కావడం.. ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అంతేకాదు గుర్తు విషయంలోనూ చిక్కులు వచ్చి పడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది.. ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి.

అనుచిత సలహాలెందుకయ్యా కోనా?

ఫుల్‌ టైమ్ సినీ రచయిత, పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు కోన వెంకట్ ఇటీవల తన సినిమా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోరకం వ్యాఖ్యలు చేసిన కోన వెంకట్ తనపై విమర్శలు రేగడానికి తానే అవకాశం ఇచ్చారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న కోన వెంకట్ తన పనేదో తాను చేసుకోక పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నప్పుడు ఈయన గారు ‘మనకెందుకు పాలిటిక్స్’ అని పవన్ కళ్యాణ్‌కి తగుదునమ్మా అని ఉచిత సలహా ఇచ్చారట. ఇలాంటి అనుచిత సలహా ఇచ్చిన కోన వెంకట్‌కి పవన్ కళ్యాణ్ ‘నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో’ అని సమాధానం ఇచ్చారట. మరి పవన్ కళ్యాణ్ ఇంత సాఫ్ట్.గా చెప్పారో, చాలా ఘాటుగా చెబితే, వెంకట్ దాన్ని సాఫ్ట్.గా మార్చారో ఆయనకే తెలియాలి. పవన్ కళ్యాణ్ ఇంట్రావర్ట్, సెన్సిటివ్, పరుషంగా మాట్లాడడు... అందుకే ఆయనకు ఈ గొప్ప సలహా ఇచ్చానని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ రకంగా ఆయన విమర్శకులకు దొరికి పోయారు. పవన్ కళ్యాణ్‌కి కోన వెంకట్ ఎంతకాలం క్రితం సలహా ఇచ్చారోగానీ, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న ఇప్పటి పరిస్థితిని చూస్తే కోన సలహా ఇచ్చింది అనవసరపు సలహా అనేది అర్థమైపోతోంది కదా. సినిమాల్లో నటించడం ద్వారా వచ్చే ఎంతో ఆదాయాన్ని వదులుకుని, రాజకీయ పార్టీని స్థాపించి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అధికార వైసీపీ నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాట పంథాలో పయనిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్... అలాంటి పవన్ కళ్యాణ్, ఆనాడు కోన వెంకట్ ఇచ్చిన చచ్చుపుచ్చు సలహాని పాటించినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు మిస్సయి వుండేవాడు కదా. అయినా, పవన్ కళ్యాణ్‌ని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఏ కథో చెప్పి ఇంప్రెస్ చేసుకోవాలిగానీ, ఈ రాజకీయాల ప్రస్తావన ఎందుకంట? పవన్ కళ్యాణ్ సున్నితంగా వుంటారు కాబట్టి, సెన్సిటివ్ కాబట్టి, పరుషంగా మాట్లాడలేరు కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళకూడని కోన సలహా ఇచ్చారట. అంటే, రాజకీయాల్లో వుండాల్సింది మొరటు మనుషులే తప్ప ప్రజలకు స్ఫూర్తిగా నిలిచే మంచి మనుషులు కాదనేది కోనగారి అభిప్రాయం. అందుకే అలాంటి మొరటోళ్ళు ఇబ్బడి ముబ్బడిగా వున్న వైసీపీ సానుభూతిపరుడిగా బాపట్ల నియోజకవర్గంలో కోన హవా నడిపిస్తున్నారు. కోన ఉచిత సలహా వెనుక వున్న మరో బలమైన కారణం ఆయన వైసీపీ అనుకూల వర్గం కావడమే. బాపట్ల నియోజకవర్గానికి కోన వెంకట్ బంధువు కోన రఘుపతి ఎమ్మెల్యే. అక్కడ కోన వెంకట్ హవా నడుస్తూ వుంటుంది. బాపట్లలో ఎక్కడ చూసిన కోన రఘుపతి కటౌట్లతోపాటు కోన వెంకట్ కటౌట్లు కూడా కనిపిస్తూ వుంటాయి. ఎమ్మెల్యే బంధువుగా కోన వెంకట్ బాపట్లలో ఏయే రాజకీయాలు చేస్తున్నారో ఆయనకే ఎరుక. సున్నిత మనస్కులు, అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని కోన గారు అంటున్నారే, మరి ఆయన తాతగారు కోన ప్రభాకరరావు మొదట సినిమా నటుడే. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. గవర్నర్ స్థాయి వరకూ ఎదిగారు. ఆయన వారసత్వాన్ని అందుకునే కదా కోన రఘుపతిగానీ, కోన వెంకట్ గానీ బాపట్ల ప్రజల మీద తమ పెత్తనం చెలాయిస్తున్నది? మరి కోన ప్రభాకరరావు కూడా సున్నిత హృదయుడే, పరుషంగా మాట్లాడ్డం రానివ్యక్తే. మరి ఆయన రాజకీయాల్లో రాణించలేదా? ఆయన వారసులుగా వున్న ‘కోన’ అండ్ కో మాత్రం పెద్దాయన బాటని వదిలేసి పరుషంగా మాట్లాడే దారిలో, పార్టీలో కొనసాగుతున్నారు.  ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో అధికార వైసీపీకి చెల్లుచీటీ ఫిక్సయిపోయింది. పాపం కోన ప్రస్తుతం ఆ ఫస్ట్రేషన్లో వున్నట్టున్నారు. అందుకే, ఎప్పుడో పవన్ కళ్యాణ్‌కి, తనకి మధ్య జరిగిన సంభాషణని అనువుగాని వేదిక మీద ప్రస్తావించారు. అలా ప్రస్తావించినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.

జగన్ కోసం పాదయాత్ర చేసిన బసవారావు.. తెలుగుదేశం గూటికి

ఎన్నికల వేళ వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఇలా పార్టీ మారిపోతున్న వారిలో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వీర భక్తులూ కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవారావు తెలుగుదేశం గూటికి చేరారు. మంగళగిరి నియోజకవర్గ వరిధిలోని కురగాళ్ల  గ్రామానికి చెందిన బసవారావు జగన్ కు మద్దతుగా గతంలో ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ రెండు వేల కిలో మీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అయితే జగన్ అస్తవ్యస్థ పాలన, అడ్డగోలు విధానాలకు విసిగిపోయానని పేర్కొంటూ గురువారం ( ఏప్రిల్ 11) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ మద్దతు దారులు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బసవారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక నాయకుడు చంద్రబాబేనని అన్నారు.  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు అని చెప్పుకునే జగన్ ఏకంగా27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు.  అధికారంలోకి రాబోయేది తెలుగుదేశమే ననీ, తెలుగుదేశం పాలనలో దళితులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నారు.  మొత్తం మీద ఎన్నికల వేళ వైసీపీ శిబిరం ఖాళీ అవుతోంది. ముఖ్యంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో  వైసీపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. అన్ని వర్గాలలోనూ వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

కూటమి సభలు అదుర్స్.. జగన్ బెదుర్స్!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌వేళ నేత‌ల ప్ర‌చారం హోరెత్తుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఎన్నికల ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జనసేన బీజేపీ,కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మూడు పార్టీల మ‌ధ్య‌ సీట్ల పంప‌కాలతో పాటు అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న పూర్త‌యింది. దీంతో కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యాన్నికాంక్షిస్తూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ రోడ్ షోలు, స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఇద్ద‌రు అగ్ర‌నేత‌లు క‌లిసి త‌ణుకు, నిడ‌ద‌వోలు, పి. గ‌న్న‌వ‌రం, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన రోడ్‌షోలు, ప్ర‌జాగ‌ళం స‌భల్లో పాల్గొన్నారు. ఈ స‌భ‌ల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒక‌రు ఎక్కువ ఒక‌రు త‌క్కువ అనే బేధాలు లేకుండా మెలిగారు, మెసిలారు. అంతేకాక‌.. జెండాలు వేర‌యినా   అజెండా ఒక్క‌టేన‌ని, రాష్ట్రంకోసం సీట్ల పంప‌కం విష‌యంలో   త్యాగాలు చేసి.. క‌లిసిక‌ట్టుగా ముందుకొచ్చామ‌ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పారు. తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని,  కూట‌మి అభ్య‌ర్థులు ఏ పార్టీ వారైనా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని మూడు పార్టీల శ్రేణుల‌కు  పిలుపునిచ్చారు.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్లపాటు ఏపీలో కొన‌సాగించిన అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఏక‌తాటిపైకి వ‌చ్చారు. సీట్ల పంప‌కం విష‌యంలో ఒక‌రినొక‌రు స‌హ‌క‌రించుకొని పార్టీలు కాదు.. రాష్ట్రం అభివృద్ధే  ధ్యేయం అని చాటారు. అయితే   అధికార వైసీపీ  టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ మ‌ధ్య విబేధాలు సృష్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. చేస్తోంది. కులాల మ‌ధ్య  విద్వేషాలు రెచ్చ‌గొట్టింది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌ కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో మెజార్టీ కాపు సామాజిక‌వ‌ర్గం   ప‌వ‌న్‌కే  జైకొడుతున్నది.  కాపు సామాజిక‌వ‌ర్గంలో చీల‌క తెచ్చేందుకు మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రంగంలోకి దింపారు. ఆయ‌న వైసీపీలో చేర‌డంతోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కాపుల ఆత్మ‌గౌర‌వాన్ని చంద్ర‌బాబు కాళ్ల కింద పెట్టాడంటూ కాపుల‌ను రెచ్చగొట్టే ప్ర‌య‌త్నాల‌ు వైసీపీ చేస్తోంది. తాజాగా ప్ర‌జాగ‌ళం స‌భ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన గౌర‌వాన్ని చూసి జ‌న‌సేన శ్రేణులు, ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ కాపులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. నాకు అనుభ‌వం ఉంది.. ప‌వ‌న్ కు ప‌వ‌ర్ ఉంది అంటూ చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు. ప‌వ‌న్ మంచి నాయ‌కుడు.. రాష్ట్రాన్ని మేమిద్ద‌రం క‌లిసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దీంతో ఎవ‌రెన్ని చెప్పినా న‌మ్మొద్దు.. మేమిద్ద‌రం క‌లిసే ఉన్నాం.  క్షేత్ర స్థాయిలో జ‌న‌సే, టీడీపీ శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు ఇరు పార్టీల‌కు శ్రేణుల‌కు సూచించారు.    ఈ ప్రకటన జనసేన, తెలుగుదేశం శ్రేణుల్లో ఏమూలనైనా ఇంకా శంకలు మిగిలి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి.    దీంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వైసీపీ నేత‌ల‌కు అర్థ‌మైంది. దీంతో ఎలాగైనా మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని అనేక కుట్ర‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వ్య‌వ‌హారాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెర‌పైకి తెచ్చారు. వారిని ఎన్నిక‌ల్లో  వాడుకొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని భావించారు. కానీ, కోడ్ పూర్త‌య్యే వ‌ర‌కు ఎన్నిక‌ల విధులు, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో వాలంటీర్లు పాల్గొన‌వ‌ద్ద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. ఈసీ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేని జ‌గ‌న్‌.. ఇదంతా చంద్ర‌బాబు, ప‌వ‌న్ కుట్ర.. వారు అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తారు.. త‌ద్వారా మీకు ఇంటివ‌ద్ద‌కు పెన్ష‌న్ రాదు అంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ప్ర‌చారం చేశారు. దీనికితోడు వాలంటీర్ల‌పై ఒత్తిడి తెచ్చి వారితో వైసీపీ నేత‌లు రాజీనామాలు చేపిస్తున్నారు. జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారాల‌కు, వాలంటీర్ల‌ను అడ్డుపెట్టుకొని ఆడుతున్న నాట‌కాల‌కు ప్ర‌జాగ‌ళం స‌భ‌ల్లో చంద్ర‌బాబు,ప‌వ‌న్ చెక్ పెట్టారు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని, కూట‌మి అధికారంలోకి రాగానే వారికి రూ. 10వేల వేత‌నం ఇస్తామ‌ని ఇద్ద‌రు నేత‌లు స్ప‌ష్టం చేశారు. అయితే, వాలంటీర్లు రాజ‌కీయాలు చేయొద్దని చంద్ర‌బాబు, ప‌వ‌న్ సూచించారు. వైసీపీ నేత‌లు చెప్పార‌ని రాజీనామా చేస్తే మ‌ళ్లీ ఉద్యోగం రాదు.. అధికారంలోకి వ‌చ్చేది కూట‌మి.. ఇప్పుడు రాజీనామా చేస్తే పోయేది మీ ఉద్యోగాలు. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి మీ ఉద్యోగాల‌ను పోగొట్టుకోవ‌ద్ద‌ని, కూట‌మి అధికారంలోకి రాగానే మీకు అన్నివిధాల అండ‌గా ఉండి.. మీకు మ‌రింత మేలు జ‌రిగేలా చూస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ వాలంటీర్ల‌కు హామీ ఇచ్చారు. దీంతో.. వాలంటీర్ల‌తో రాజీనామాలు చేయించి చంద్ర‌బాబు, ప‌వ‌న్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచాల‌ని చూసిన వైసీపీ నేత‌ల కుట్ర‌ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది.        త‌ణుకు, నిడ‌ద‌వోలు, పి. గ‌న్న‌వ‌రం, అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి పాల్గొన్న ప్ర‌జాగ‌ళం స‌భ‌ల‌కు భారీ స్పంద‌న ల‌భించింది. కిలోమీట‌ర్ల కొద్ది ఇసుకేస్తే రాల‌నంత రీతిలో ప్ర‌జ‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ పాల్గొన్న స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన బ‌స్సు యాత్రకు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. గ‌తంలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చేవారు.. కానీ, ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు షాకిస్తున్నారు. కొంద‌రు వైసీపీ కార్య‌క‌ర్త‌లుసైతం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌లో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. దీంతో వైసీపీలో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఒకే వేదిక‌పైనుంచి గ‌ర్జ‌న చేస్తుండ‌టంతోపాటు.. ఇద్ద‌రు నేత‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిపోయి ప్ర‌చారంలో పాల్గొంటుండ‌టంతో జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో జోష్ ను నింపింది.  భారీ మెజార్టీతో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని కూట‌మి పార్టీల శ్రేణులు ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్ శిబిరం బెదిరిపోతోంది. 

విజయమ్మ విదేశాలకు.. జగన్ ఒత్తిడే కారణమా?

వైఎస్ విజయమ్మ.. అన్నా చెల్లెళ్ల రాజకీయ పోరులో ఆమె ఎవరి వైపు ఉంటారన్న ఆసక్తి, ఉత్కంఠకు తెరదించుతూ ఆమె విదేశాలకు వెళ్లిపోయారు. గత ఎన్నికల సమయంలో జగన్ విజయం కోసం వైఎస్ కుటుంబం అంతా ఏకతాటిపై నిలిచింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల విస్తృతంగా ప్రచారం చేసి మరీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని గెలిపించాలంటూ ప్రజలను కోరారు. వారి ప్రచారం ఫలించింది. ఆ ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనం హృదయాలను గెలుచుకున్నారు. అయితే గత ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తన విజయంలో కీలక పాత్ర పోషించిన షర్మిలను జగన్ పక్కన పెట్టేశారు. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు బ్రేకులు వేశారు. దీంతో ఆమె అన్నతో విభేదించి తెలంగాణకు వలస వెళ్లిపోయారు. ఆమెతో పాటుగానే తల్లి విజయమ్మ కూడా తెలంగాణకు పరిమితమైపోయారు. వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుని తెలంగాణలో తన రాజకీయం తాను చేసుకుంటున్న షర్మిలకు తోడుగా తల్లి కూడా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కుమారుడికి దూరంగా జరిగారు. సరిగ్గా వైసీపీ ప్లీనరీ రోజునే అమ్మ (విజయమ్మ) కుమారుడి పార్టీకీ, పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాకూ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తల్లిని, చెల్లిని దూరం పెట్టారు.  అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల  తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి నేరుగా అన్న పాలనపైనే విమర్శలు సంధిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు జగన్ పైనా విమర్శల బాణాలను సంధిస్తున్నారు. దీంతో రాజకీయంగా అన్నా చెల్లెళ్లిద్దరూ పరస్పరం ఢీ కొంటున్న పురిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ విజయమ్మపైనే ఉంది. కుమారుడివైపా, కుమార్తె వైపా ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  సరిగ్గా ఈ సమయంలో జగన్ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి మార్చి 27న  ఆ సందర్భంగా యాత్ర ప్రారంభ కార్యక్రమానికి తల్లి విజయమ్మ హాజరయ్యారు. జగన్ ను ఆశీర్వదించారు.  దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. ఎందుకంటే విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం కిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ  గౌరవాధ్యక్ష పదవి ఏమంత  క్రియాశీల పదవి కాదు.  అయినా విజయమ్మ ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరుమీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పని చేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుటుక్కుమని తెగిపోయినట్లే అప్పట్లో అంతా భావించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశారు. పార్టీతో బంధం తెంచుకున్న తరువాత విజయమ్మ కూడా జగన్ తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు.  ఆ మధ్యలో ఆమె ఏపీకి వచ్చినా జగన్ నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు. షర్మిల కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు మాత్రమే షర్మిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. అంతే.  వాస్తవానికి తల్లి, చెల్లితో చాలా కాలంగా జగన్ కు ఎటువంటి సంబంధాలూ లేవు. ఇటు జగన్ కానీ, అటు విజయమ్మ, షర్మిల కానీ పరస్పరం ఎదురుపడిన దాఖలాలు లేవు. పలకరించుకున్న సందర్భమే లేదు. వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో జరిగే కార్యక్రమాలలో కూడా వీరు ఎడముఖం, పెడముఖంగానే మసిలారు.  షర్మిల కుమారుడు, సొంత మేనల్లుడి  వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్యా సంబంధాలు ఎంతగా బెడిశాయో అర్ధం చేసుకోవచ్చు. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ.. జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం రాజకీయవర్గాలలో విస్తృత చర్చకు దారి తీసింది.  జగన్ వేడుకోవడం, లేదా ఒత్తిడి తేవడంతోనే విజయమ్మ  ఆ కార్యక్రమానికి వచ్చి మొక్కుబడి తంతుగా ఆశీర్వదించి ఉంటారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  ఆ తరువాత షర్మిల తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలోనూ విజయమ్మ కుమార్తెను ఆశీర్వదించారు. అయితే ఇరువురిలో ఆమె మద్దతు ఎవరికి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో ఆమె ఎన్నికల సమయంలో దేశంలోనే ఉండకుండా విదేశాలకు వెళ్లిపోవడం సంచలనంగా మారింది.   అన్న పార్టీని అధికారం నుంచి దించడమే లక్ష్యంగా షర్మిల జగన్ పైనా, జగన్ సర్కార్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల స్వయంగా కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల జగన్ పైనా, ఆయన పాలనపైనా నిత్యం విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రచారంలో కూడా జగన్ మరియు వైసీపీ కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన అవినాష్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో విజయమ్మ   విజయమ్మ  ఎన్నికలు ముగిసే వరకూ దేశం విడిచి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.  జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారని అంటున్నారు. షర్మిలకు తోడు విజయమ్మ కూడా తనకు వ్యతిరేకంగా గళం విప్పితే ఇబ్బందులు తప్పవన్న భయంతోనే జగన్ ఒత్తిడి చేసి ఆమెను విదేశీ పర్యటనకు వెళ్లేలా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చల్లబడిన వాతావరణం.. జనాలకు ఉపశమనం!

 తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా  వాతావరణం చల్లబడింది. గత పక్షం రోజులుగా భుగభగలాడుతున్న భానుడు శాంతించాడు.   భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వడగాడ్పుల తీవ్రత తగ్గి చల్లటి గాలులు వీస్తుండటంతో జనం శ్వాంతన పొందారు.  రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఉక్కపోత.. ఇంకో వైపు  వడగాడ్పుల ప్రభావంతో  ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు గత మూడు రోజులుగా వాతావరణం చల్లడటంతో ఉపశమనం కలిగింది. శుక్ర(ఏప్రిల్ 12), శని (ఏప్రిల్ 13) తేదీలలో కూడా వాతావరణం చల్లగానే ఉంటుందనీ, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందనీ వాతావరణ శాఖ చల్లటి తొలకరిలాంటి కబురు చెప్పింది.   గురువారం (ఏప్రిల్ 11)  నల్లగొండలో 39 డిగ్రీలు ఆదిలాబాద్‌  20.2 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్‌ తక్కువగా నమోదు కావడం గమనార్హం. రానున్న రెండు రోజులూ కూడా వాతావరణం చల్లగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.   రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం,  మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా  ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణశాఖ పేర్కొంది.  ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ముందస్తు మాన్ సూన్.. రైతులకు చల్లటి కబురు

 ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్ మెట్ రైతులకు చల్లటి కబురు అందించింది. ఈ ఏడాదది ముందస్తు రుతుపవనాలు ఖాయమని, అలాగే వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందనీ పేర్కొంది. వర్షాభావ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఇది నిజంగానే చల్లటి కబురు. సాగుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు ముందస్తు రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు అన్న వార్తతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  ఎల్ నినో ప్రభావంతో దేశమంతా కరువు పరిస్థితులు దాపరించాయి. కొన్ని చోట్ల నోటికాడికి వచ్చిన పంటలు నీటి ఎద్దడితో ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. దీంతో వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఈ సారి ముందుగానే రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వారిలో ఆనందం నింపింది.   వ్యవసాయాధారిత దేశమైన ఇండియాలో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నారు. పంటలు బాగా పండాలంటే సాగు నీరు ప్రధానం. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక వ్యవసాయం అస్తవ్యస్తంగా మారిపోయి రైతులు కుదేలయ్యారు. అయితే ఈ ఏడాది లానినోపరిస్థితుల కారణంగా  రుతుపవనాలు ముందుగానే వచ్చి దేశ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే నిప్పులు చెరుగుతున్న పరిస్థితి.   దేశవ్యాప్తంగా భానుడి భుగభగలతో ఎండలు తీవ్రాతి తీవ్రంగా ఉన్నాయి.  ఈ కారణంగా పలు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రమైంది.  బెంగళూరు వంటి నగరాలలో అయితే నీటి సంక్షోభమే తలెత్తింది.  ఇలాంటి పరిస్థితుల్లో వ  ఈ సారైనా వర్షాలు పడతాయో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ముందస్తు రుతుపవనాల వార్త తొలకరి జల్లులా వినిపించింది. ఈ ఏడాది జూన్-ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ఏర్పడి  ముందుగానే రుతుపవనాలు వస్తాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, సాధారణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా క‌ష్ట‌మే.. తేల్చేసిన జన్మత్ పోల్

కడపలో లోక్ సభ స్థానంలో అవినాష్ రెడ్డి మూడో స్థానానికే పరిమితం ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి, షర్మిల మధ్యే ఏపీలో మే13న జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల లో అధికార వైసీపీకి  జనం బిగ్ షాక్ ఇవ్వనున్నారు.  వచ్చే ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమన్న విషయాన్ని ఇప్పటికే  జాతీయ‌, రాష్ట్ర స్థాయిలోని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాయి. మెజార్టీ   స‌ర్వేలు వైసీపీకి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 30 నుంచి 35 స్థానాలు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. అయితే పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ సంఖ్య త‌గ్గే అవకాశం ఉందని సర్వేలన్నీ అంచనా వేశాయి. ఇక తాజాగా జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే అయితే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తేల్చేసింది.  జన్మత్ పోల్ స‌ర్వే   వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా  క‌ష్ట‌మేనని పేర్కొంది. ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ సర్వే ఫలితాలను బట్టి తేటతెల్లం అవుతోంది. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని జ‌న్మ‌త్ పోల్ త‌న స‌ర్వే ఫలితం స్ప‌ష్టం చేసింది. జ‌న్మ‌త్ పోల్ స‌ర్వే పేర్కొన్నమేరకు వైసీపీ గ్రాఫ్ ఏపీలో రోజురోజుకు ప‌డిపోతుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  జన్మత్ పోల్స్ సర్వే ఫలితాల ప్ర‌కారం.. ఏపీలోని   175 శాసనసభ స్థానాల్లో అత్య‌ధిక స్థానాలు కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు పార్టీలు సీట్ల పంప‌కాల ప్ర‌క్రియ, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌  పూర్త‌యింది. మూడు పార్టీల అధ్య‌క్షులు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, పురందేశ్వ‌రిలు ప్ర‌చార ప‌ర్వంలో దూసుకెళ్తున్నారు. వీరి ప్ర‌చారానికి ప్ర‌జ‌ల మంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. ఇందులో 110 నుంచి 115 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. జనసేన పార్టీ  అభ్య‌ర్థులు 21 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా.. 17 నుంచి 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తార‌ని, బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాల‌కుగాను రెండు నుంచి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. ఇక అధికార వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. వైసీపీ   175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్ధులను రంగంలోకి దింపింది. అయితే వైసీపీ అభ్యర్థులు కేవలం  15 నుంచి 18 స్థానాల్లో మాత్ర‌మే   విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది. దీంతో వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా రాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. పోలింగ్ స‌మ‌యం నాటికి వైసీపీ గ్రాఫ్ మ‌రింత‌గా ప‌డిపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వాస్త‌వానికి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు గట్టగా మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల్లో అయితే.. రాయ‌ల‌సీమ జిల్లాల్లో  వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు అధికారం మ‌త్తు త‌ల‌కెక్క‌డంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రిచి ప్ర‌శ్నించిన వారిని హింసించ‌డం మొద‌లు పెట్టారు.  దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జలు సైతం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు వివేకానంద రెడ్డి హ‌త్య‌,   వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉండ‌టం, చంద్ర‌బాబు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్న ప్ర‌జ‌ల నమ్మకం ఇలా అన్నీ కలిసి ఇప్పటికే సీమలోని మెజారిటీ స్థానాలలో   వైసీపీ అభ్య‌ర్థుల ఓట‌మిని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని, వైసీపీ మూడో స్థానానికి ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వేలో  తేలింది. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చించుకునే స్థానం క‌డ‌ప ఎంపీ   స్థానం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి బ‌రిలోఉన్నారు. అవినాశ్ రెడ్డికి పోటీగా సీఎం జ‌గ‌న్ సోద‌రి, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల పోటీ చేస్తున్నారు. అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు. అయితే  అవినాశ్ రెడ్డి  ష‌ర్మిల‌కు పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని జ‌న్మ‌త్ పోల్స్ స‌ర్వే పేర్కొంది.  క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాశ్ రెడ్డి మూడో స్థానంలో ఉంటారనీ, ప్ర‌ధాన పోటీ వైఎస్ ష‌ర్మిల, కూట‌మి అభ్య‌ర్థి మధ్యే ఉంటుంద‌ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే చెప్పింది. వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితుడుగా అవినాశ్ రెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద‌ర్యాప్తు సంస్థ‌లు సైతం అవినాశ్ రెడ్డి వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా చెబుతున్నాయి. అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారాన్ని ఉప‌యోగిస్తున్నాడ‌ని ఆయ‌న చెల్లెళ్లు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత రెడ్డి  ఆరోపిస్తున్నారు. వివేకా హ‌త్య వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని క‌డ‌ప లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గంలోని మెజార్టీ శాతం ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఈ క్ర‌మంలో అవినాశ్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓటు బ్యాంకు అధిక శాతం వైఎస్ ష‌ర్మిల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. దీంతో కూట‌మి అభ్య‌ర్థి వ‌ర్సెస్ ష‌ర్మిల మ‌ధ్య హోరాహోరు పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌ని   రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇదే విష‌యాన్ని జ‌న్మత్ పోల్స్ స‌ర్వే సంస్థ స్ప‌ష్టం చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు వైసీపీకి కంచుకోట‌గాఉన్న క‌డ‌ప‌లోనూ ఆ పార్టీకి ఎదురుగాలి త‌ప్ప‌ద‌ని ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ తేల్చేస్తున్నాయి.

జగన్ రెడ్డి ఐదేళ్ల రివర్స్ పాలన.. వైసీపీకి 2019 ఫలితాలు రివర్స్!

ఐదేళ్ల జగన్ రెడ్డి రివర్స్ పాలనక సరైన ఫలితం దక్కనుంది. ఆ పార్టీకి గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఈ సారి ఎన్నికలలో రివర్స్ కానున్నాయి. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ వెలువరించిన సర్వే ఇదే చెప్పింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించింది. ఆ సందర్భంగా జగన్ ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు.  సరే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత దేవుడు నాలుక కరుచుకుని తన స్క్రిప్ట్ ను కరెక్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోరాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు ఈ సారి రివర్స్ కానున్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు అన్ని అ సర్వేలూ తెలుగుదేశం కూటమికి భారీ విజయం ఖాయమనే పేర్కొన్నాయి. ప్రతిస్ఠాత్మక సంస్థలు వెలువరించిన సర్వేలలోనూ ఇదే ఫలితం వచ్చింది. ఇండియా టుడే వంటి సంస్థలైతే  రెండు మూడు నెలల కిందట వెలువరించిన సర్వేలో వైసీపీ రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో 24 స్థానాలను కైవశం చేసుకుంటుందని పేర్కొంది. అప్పట్లోనే ఆ సర్వే ఫ్యాబ్రికేటెడ్ అని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే రెండు మూడు నెలల వ్యవధిలోనే ఇండియా టుడే ప్లేట్ ఫిరాయించేసింది. తాజాగా వెలువరించిన సర్వేలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 17 స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుందని పేర్కొంది. సరే ఎంతగా సమర్ధిద్దామని ప్రయత్నించినా వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో తన క్రెడిబులిటీని దెబ్బతీసుకోవడానికి ధైర్యం చేయలేక ఇండియా టుడే వాస్తవాలకు దగ్గరగా తన సర్వే ఫలితాన్ని తాజా పరిస్థితి ఇదంటూ సవరించుకుందని చెప్పుకోవచ్చు.  అది పక్కన పెడితే ఏపీలో రానున్న అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికే  జనం పట్టం కట్టడానికి ఫిక్స్ అయిపోయారని ఇప్పటి వరకూ వెలువడిన అన్ని సర్వేలూ తేల్చి చేప్పేశాయి.  తాజాగా మరో ప్రముఖ సంస్థ వెలువరించిన సర్వేలో  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి 19 నుంచి 23 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. ప్రముఖ సర్వే సంస్థ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వెల్లడించింది. నిజానికి అనేక జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడి యా సంస్థలు ఎన్డీఏ కూటమి 18 సీట్లు సాధించటం పక్కా అని గత నెలలోనే ప్రకటించాయి. ఇప్పుడు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్  తన తాజా సర్వేలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో  23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని  వెల్లడించింది. ఈ సంఖ్య సరిగ్గా గత ఎన్నికలలో వైసీపీ సాధించిన లోక్ సభ స్థానాల సంఖ్య. అందుకే పరిశీలకులు వైసీపీకి ఈ సారి సీన్ రివర్స్ అవుతోందని విశ్లేషిస్తున్నాయి. రాజకీయవర్గాలలో అయితే ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటూ సెటైర్లు  పేలుతున్నాయి.   వచ్చే ఎన్నికలలో వైసీపీ 2 నుంచి 3 లోక్ సభ స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే పేర్కొంది. యాక్చువల్గా ఆ సర్వే తెలుగుదేశం కూటమికి 19 నుంచి 23, వైసీపీ కూటమికి 2 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.  దీనిని బట్టి  అసెంబ్లీ ఎన్నికలలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అంటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమికి 133 నుంచి 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా,  వైసీపీ 14 నుంచి  42 స్థానాలు లభించే అవకాశం ఉంది.   అసెంబ్లీ స్థానాల్లో  కూటమి విజయవిహారం చేస్తుందని జాతీయ సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కొన్ని సంస్థలు ఎన్డీఏకూటమి 135 సీట్లు సాధిస్తుందని వెల్లడించగా, మరికొన్ని 150 సీట్ల వరకూ సాధిస్తుందని పేర్కొన్నాయి. కూటమి ఏర్పడక ముందు..  తెలుగుదేశం ఒంటరిగా 100 సీట్లు సాధిస్తుందని పలు సర్వేలు ప్రకటించిన సంగతి తెలిసిందే.   తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేఅదే విషయం తెలిపింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సంస్థ  ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  వెలువరించిన ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 59-67, బీఆర్‌ఎస్ 36-44, బీజేపీ 7-9, ఇతరులు 6-8 సీట్లు సాధిస్తాయని వెల్లడించగా, ఎన్నికల ఫలితాలు దాదాపు అలాగే వచ్చాయి. దీంతో  ఇప్పుడు ఏపీలో  ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమవడం ఖాయమని  విశ్లేషకులు నమ్ముతున్నారు.  వైసీపీకి 2019లో వచ్చిన ఫలితాలు ఇప్పుడు రివర్స్ అవుతాయనీ, జగన్ రెడ్డి రివర్స్ పాలనకు అదే సరైన  రివర్స్ ఫలితంగా నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.

డికె శివకుమార్ తో షర్మిల భేటీ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులోని శివకుమార్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారానికి రావాలని శివకుమార్ ను ఈ సందర్భంగా షర్మిల కోరారు. తాను తప్పకుండా వస్తానని షర్మిలకు శివకుమార్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ద్వారా ఏపీలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆమె ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య పోటీ కావడంతో కడప లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.   దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సన్నిహిత సంబంధాలున్న డికె శివకుమార్ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి డికె ముఖ్య భూమిక వహించిన సంగతి తెలిసిందే . డికె సేవలను గుర్తించే కాంగ్రెస్ హై కమాండ్ అతనికి డిప్యూటి సీఎం పదవి కట్టబెట్టింది. కర్ణాటక స్పూర్తితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలిగారు. డికె మంతనాలు జరపడం వల్లే వైఎస్ తెలంగాణలో కాంగ్రెస్ కు బాసటగా నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత షర్మిల ఎపికి షిప్ట్ అయి కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా ఎపిలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలని షర్మిల డికెను కోరారు. 

పిఠాపురంలో చేతులెత్తేసిన వైసీపీ.. పవన్ కల్యాణ్ రూట్ క్లియర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎత్తులు వేస్తున్నది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించింది. వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలు పిఠాపురంలోనే తిష్ఠవేసి వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కు ప్రత్యర్థిగా కాకినాడ ఎంపీ వంగాగీతను బరిలోని దించిన జగన్ ఆమె విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతం గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాను స్వయంగా పోటీలో లేకపోయినా.. పవన్ కల్యాణ్ పై విమర్శలు, విసుర్లతో ఆయన చెలరేగిపోతున్నారు. కాపు సంఘాల సమావేశాలలో పాల్గొంటూ ఆయన వైసీపీ విజయం కోసం పని చేస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా వైసీపీ పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆ పార్టీ క్యాడర్ లో మాత్రం గెలుపు సాధిస్తామన్న నమ్మకం కానీ, విశ్వాసం కానీ కనిపించడం లేదు. వంగా గీత ప్రచారం నామ్ కే వాస్తేగా జరుగుతున్నది. ఆమె తన ప్రచారానికి కనీస వ్యయం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో క్యాడర్ ఆమె తరఫున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక జగన్ ఓటమే ధ్యేయం అంటూ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి మొదట్లో కొద్దిగా హడావుడి చేసినా ఇప్పుుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు.   సొంత నియోజకవర్గం రాజంపేటలో  గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయన పిఠాపురాన్ని గాలికి వదిలేసి తన విజయం కోసం రాజంపేటలోనే పని చేసుకుంటున్నారు.  దీంతో సమన్వయం లేకుండా పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వంగాగీతకు పార్టీ టికెట్ కేటాయించడంతో అక్కడి సిట్టింగ్ ఎం్మెల్యే పందెం దొరబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించినా ఫలితం లేకపోయింది. మరో వైపు దొరబాబు అనుచరగణం అంతా జనసేన తరఫున సీరియస్ గా పని చేస్తున్నారు. స్వయంగా దొరబాబే వారిని జనసేనకు మద్దుతుగా నిలవమని ఆదేశించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. త్వరలో ఆయన కూడా జనసేన గూటికి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.  ఇక జనసేన పిఠాపురం ఇన్ చార్జ్ మకినీడి శేషు కుమారి వైసీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. గత ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేసిన ఆమెకు 28 వేల ఓట్లు వచ్చాయి. అయితే  గత ఎన్నికలలో ఓటమి తరువాత శేషు కుమారి ఎన్నడూ పార్టీ కార్యక్రమాల్లో కానీ, రాజకీయంగా కానీ క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. ఇటీవల వైసీపీ గూటికి చేరిన తరువాత ఆమె పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. మొత్తం మీద దిశ, దశ లేని ప్రచార వ్యూహాలతో, సమన్వయ లోపంతో పిఠాపురంలో వైసీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కు రూట్ క్లియర్ అయిపోయినట్లేనని అంటున్నారు.  

వైసీపీ ఎమ్మెల్సీ  ఇక్బాల్ దేశం గూటికి 

ఏపీ అధికార పక్షం వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ఆయనకు టీడీపీలోకి స్వాగతం పలికారు.  మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.  మహ్మద్ ఇక్బాల్ హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ ను తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూడు టీడీపీకి తిరిగొచ్చారు.

పశ్చిమ గోదావరిలో 2014 సీన్ రిపీట్!

గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం కూటమి హవా నడుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో గత ఎన్నికలలో దుమ్మురేపిన వైసీపీకి ఈ సారి అంత సీన్ కనిపించడం లేదని అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గోదావరి జిల్లాల్లో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసేందుకే అవకాశాలు అధికంగా  ఉన్నాయంటున్నారు.  2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో  తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికలలో వైసీపీ జిల్లాలో బోణీ కొట్టలేదు. ఆ ఎన్నికల్లో  జిల్లాలో  మొత్తం 15 స్థానాలకు గాను తెలుగుదేశం పద్నాలుగు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి.  ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ  పొత్తు కారణంగా పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో  2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేల ఫలితాలను తీసుకున్నా.. తెలుగుదేశం అంతర్గత సర్వేల ఫలితాలను బట్టి చూసినా  పశ్చిమ గోదావరి జిల్లాలో 14 నియోజవకర్గాలలో తెలుగుదేశం కూటమి  విజయం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో జిల్లా మొత్తంలో అటువంటి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వైసీపీకి లేదని పరిశీలకులు చెబుతున్నారు.  వైసీపీ ఏదో ఒక మేరకు బలంగా ఉందని చెప్పడానికి జిల్లా మొత్తంలో పోలవరం నియోజకవర్గం మాత్రమే కనిపిస్తోందంటున్నారు.  ఆచంట, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, ఉండి, దెందులూరు, ఏలూరు స్థానాల్లో  తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యత కనబరుస్తోందని చెబుతున్నారు. ఈ తొమ్మిది స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న భీమవరం, నిడదవోలులో  ఆ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.  ఇక  గోపాలపురం,  ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాలలో  పోటాపోటీ పరిస్థితి ఉన్నప్పటికీ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం కూటమి వైపే అని చెబుతున్నారు.  జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ గతంలో కంటే బాగా పుంజుకోవడంతో   జిల్లాలో వైసీపీకి గెలుపు అవకాశాలు దాదాపు మృగ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంటే పశ్చిమలో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

ఏపీలో కాంగి‘రేసు’.. పలు నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి వైసీపీ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ వైసీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలు వెలువడటం మొదలైన తరువాత ఆ విశ్లేషణలు అక్షరసత్యాలని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు మొత్తం వైసీపీకి వెళ్లి పోయింది. ఈ పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి మాత్రంగా మిగిలిపోవడానికి అదే ప్రధాన కారణం. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఆ ఓటు అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లి పోతుందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ఆ పార్టీలో ఆ జోష్ కనిపించినా ఆ తరువాత ఆ ప్రభావం పెద్దగా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అనుకున్న స్థాయిలో వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు లేకపోవడం కూడా అందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా షర్మిల నేరుగా జనగ్ ను ఉద్దేశించి, పేరు పెట్టి మరీ విమర్శలు చేయడంతో వైసీపీలో గుబులు మొదలైంది. ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తరువాత పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఆమె ప్రజెన్స్ ఒక్క కడప లోక్ సభ నియోజకవర్గాన్ని, కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, మాజీ మంత్రి శమంతకమణి వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి ఆయా జిల్లాలలో, ప్రాంతాలలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వీరు వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ నుంచి తమ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి పార్టీకి బదలాయించుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతోందన్న సంకేతాలను పంపించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వ్యూహాత్మకంగా, వైసీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. కీలకమైన నియోజకవర్గాలలో  బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా సంప్రదాయ ఓటు బ్యాంకు మళ్లీ పార్టీకి చేరువకావడానికి ఢోకా లేని పరిస్థితులు ఆయా నియోజకవర్గాలలో నెలకొన్నాయి. కడప లోక్ సభ నుంచి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయగా షర్మిల నిలబడటంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి హంతకుడికి పార్టీ టికెట్ ఇచ్చిన సీఎం జగన్ వైఎస్సార్ వారసుడెలా అవుతారంటూ షర్మిల సూటిగా సంధిస్తున్న ప్రశ్న కడప వాసులను కదిలిస్తోంది. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ ఖరారై  ఆమె ప్రచారం ప్రారంభించిన  తరువాత నుంచీ స్థానికంగా వెలువడిన పలు సర్వేలు అక్కడ షర్మిల దూసుకుపోతున్నట్లు తేల్చేశాయి. ఆమెకు దాదాపు 50శాతం మంది జనం మద్దతుగా నిలుస్తున్నారంటూ అంచనాలు వెలువడ్డాయి. అలాగే తిరుపతి నుంచి చింతా మోహన్, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ  నుంచి  మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు వంటి అభ్యర్థులు రంగంలోకి దిగడంతో  ఆయా లోక్ సభ నియోజకవర్గాలలోనే కాకుండా ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ బలంగా పుంజుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా  పూతలపట్టు, గంగాధర  నెల్లూరు నియోజకవర్గాల  అభ్యర్థులను ప్రకటించే విషయంలో కూడా కాంగ్రెస్ అత్యంత వ్యూహాత్మకంగా వైసీపీ అవకాశాలను గండి కొట్టిందని అంటున్నారు.  గతంలో  వైపీపీ అభ్యర్థిగా పూతలపట్టు నుంచి విజయం సాధించిన ఎంఎస్ బాబుకు  అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ద్వారా.. ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఆశలను కాంగ్రెస్ ఆవిరి చేసేసింొదని అంటున్నారు.   వైఎసీపీ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబును కాదని   సునీల్‌కుమార్‌ను బరిలోకి దించిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటి వరకూ రెండు జాబితాలను విడుదల చేసింది. రానున్న రోజులలో మిగిలిన నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయనుంది. మొత్తం మీద కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం అంటే వైసీపీ బలహీనం కావడమేనన్న పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం కూటమి, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ బలంగా పుంజుకున్న పలు నియోజకవర్గాలలో ప్రధాన పోటీ తెలుగుదేశం కూటమి, కాంగ్రెస్ మధ్యే అన్నట్లుగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ కాంగ్రెస్ కారణంగా భారీగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. 

టిఎస్ టెట్ దరఖాస్తు గడువుపెంపు 

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్‌-2024) ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగించ‌డం జ‌రిగింది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ మేర‌కు బుధ‌వారం స్కూల్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాగా, ఇంత‌కుముందు షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ్టితో ద‌ర‌ఖాస్తు గ‌డువు ముగియ‌నుంది. కానీ, ఈసారి టెట్ ద‌ర‌ఖాస్తులు బాగా త‌గ్గాయి. మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని అనుకుంటే.. ఇప్ప‌టివ‌ర‌కు రెండు ల‌క్ష‌ల‌కు కూడా దాట‌ని వైనం. అయితే, ఈసారి ద‌ర‌ఖాస్తు రుసుము రూ. 1000 గా నిర్ణ‌యించ‌డం కూడా అభ్య‌ర్థులు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డానికి ఒక కార‌ణమ‌ని స‌మాచారం. ఇక 2016లో 3.40 ల‌క్ష‌లు, 2017లో 3.29 ల‌క్ష‌లు, 2022లో 3.79 ల‌క్ష‌లు, 2023లో 2.83 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి.  ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 27న టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు. అయితే టెట్ రాసేందుకు ఇప్పటి వరకు కేవలం 1,66,475 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈసారి టెట్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచడంతో అభ్యర్థులు రాసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 8 సాయంత్రం నాటికి పేపర్-1కు 63,524 మంది, పేపర్-​2కు 1,02,951 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.  దీంతో రెండు లక్షల లోపే అప్లికేషన్లు  వచ్చాయి.  మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు.. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను  ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.  వీరు అర్హులు.. ➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే.  ➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు. పరీక్ష విధానం:  ➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.

ప్రత్యర్థికి డిఎల్ రవీంద్రారెడ్డి మద్దత్తు .. అధికారంలో వచ్చేది ఎన్డీఏ కూటమి అని జోస్యం 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎపిలో రాజకీయ సమీకరణాలు చక చకా మారిపోతున్నాయి.ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాయకులు తమ గళం విప్పుతున్నారు.  కడపజిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట.  ఆ జిల్లా నుంచి చాలామంది   నేతలు  ఉమ్మడి రాష్ల్రంలో చక్రం తిప్పిన వారే .   దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి కీలక నేతగా పని చేశారు. వైఎస్ ఆర్ మరణం తర్వాత చాలామంది నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. మైదుకూరు నుంచి  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.  మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి  2014 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.   గతంలో టీడీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిది. కానీ డీఎల్ ఎటు వెళ్లలేదు.2014 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చెయ్యలేదు. కానీ మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్  కు మద్దతు ప్రకటించారు.  అయితే ఆ ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ తో వచ్చిన విభేధాలతో డీఎల్ రవీంద్రారెడ్డి స్తబ్ధుగా ఉన్నారు.  వాస్తవంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త బహీనంగా ఉంది. ఉన్న కొద్దిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.  పార్టీలోని సమస్యలను చక్కదిద్దుతూనే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని  మాజీ సీఎం చంద్రబాబు అన్వేషణలో పడ్డారు.  ముఖ్యమంత్రి జగన్ ఇలాకాలో  ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అనూహ్యంగా డిఎల్ తెలుగుదేశం పార్టీకి మద్దత్తు వహించడం చంద్రబాబుకు ప్లస్ అయ్యింది.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని విభేధాలను పక్కనపెట్టి గెలుపుగుర్రాలపై  చంద్రబాబు నాయుడు కాన్ సన్ ట్రేట్ చేయాలని దేశం శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కడపలో వైసీపీకి గండికొట్టాలంటే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు.  భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం....ఆ తర్వాత జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో  ఆ సమయంలోనే డీఎల్ సైకిలెక్కుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా డీఎల్ మౌనంగానే ఉండిపోయారు.   ఇకపోతే తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతనే డీఎల్ ఎటూ తేల్చుకోలేకపోయారని టాక్. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎల్ అదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు.. అయితే టీడీపీ మాత్రం మైదుకూరు నియోజకవర్గం పుట్టా సుధాకర్ యాదవ్ కు కేటాయించింది. ఈ నిర్ణయం డీఎల్ కు రుచించలేదని సమాచారం.  అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డితో తరచూ చర్చలు జరిపారు. 2019లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన డిఎల్ కొంతకాలంగా స్థబ్దుగా ఉంటున్నారు.  డీఎల్ రాజకీయంగా సీనియర్ నేత కావడం వల్ల ఆయన మద్దతిచ్చే అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది.  ‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని  ఆయన జోస్యం చెప్పారు.  తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని బాహాటంగానే చెబుతున్నారు.  మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో డిఎల్  విలేకర్లతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. ‘‘మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కే నా మద్దతు’’ అని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఎల్ టిడిపి మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ కు మద్దతునిస్తూ కడప వైఎస్ ఆర్ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.