అమ్మ ప‌లికింది

  తెలంగాణ ఏర్పాటు ప్రక‌ట‌న త‌రువాత సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తెలంగాణ నిర్ణయం జ‌రిగిపోయింద‌ని చెప్పిన ఆమె విభ‌జ‌న ప్రక్రియ ముందుకు సాగుతుంద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక‌ట‌న‌తో సీమాంద్ర జిల్లాలో వ్యక్తమ‌వుతున్న ఆందోళ‌న‌లు అభ్యంత‌రాలను పరిష్కరించేందుకు త్వర‌లో కేంద్ర ప్రభుత్వ క‌మిటీ వేయ‌నున్నట్టుగా ప్రక‌టించారు. ఇప్పటికే ఆంటోని క‌మిటీ వేశామ‌ని ఇరు ప్రాంతాల్లోని నేత‌లు త‌మ అభిప్రాయ‌ల‌ను ఆందోళ‌న‌లను క‌మిటీ ముందు నివేదించుకోవాల‌ని చెప్పారు. ఆంటోని క‌మిటీ గాని, త్వర‌లో ఏర్పాటు కాభోయే ప్రభుత్వ క‌మిటీతో గాని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ‌కు ఎలాంటి సంబందం లేద‌న్నారు.

జ‌గ‌న్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష

  విజ‌య‌మ్మ దీక్షను భ‌గ్నం చేయ‌టంతో ఇప్పుడు ఆపార్టీ త‌రుపున ఆ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి జైలులోనే దీక్ష చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆ పార్టీ కేంద్ర పాల‌క‌మండ‌లి స‌భ్యుడు కొణ‌తాల రామ‌కృష్ణ ఓ ప్రక‌ట‌న చేశారు. విభ‌జ‌న వ‌ల్ల తలెత్తే స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం చూప‌కుండా కాంగ్రెస్ పార్టీ ఏక‌ప‌క్షంగా నిర్ణయం తీసుకుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపించారు. శ‌నివారం చంచ‌ల్‌గూడ జైల్‌లో జ‌గ‌న్‌ను క‌లిసిన కొణ‌తాల రామ‌కృష్ణ పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై కాంగ్రెస్ టిడిపి మౌనంపై నిర‌స‌న‌గా జ‌గ‌న్ నిర‌వ‌ధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టుగా ప్రక‌టించారు. జ‌గ‌న్‌ను అణ‌గ దొక్కాల‌నే కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ విభ‌జ‌న‌కు సిద్దమ‌య్యిందన్నారు. జ‌గ‌న్ దీక్షతో పాటు ప్రజ‌ల్లో ధైర్యం నింపేందుకు ష‌ర్మిల త్వర‌లో బ‌స్సుయాత్ర కూడా చేప‌డ‌తార‌ని ప్రక‌టించారు. జ‌గ‌న్ నిరాహార దీక్షతో రాష్ట్రంలో ఎదురయ్యే స‌మ‌స్యల‌కు ప్రభుత్వమే బాధ్యత వ‌హించాల‌ని అన్నారు.

రాజకీయ విరోధుల నుండి ప్రేరణ

  వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత 14నెలలుగా చంచల్ గూడా జైలు నుండే తన పార్టీని ఎంతో సమర్ధంగా నడిపిస్తున్నపటికీ, ఆపార్టీ యొక్క రోజువారి కార్యక్రమాలను నిర్వహించడం మాత్రం కొంచెం కష్టంగానే ఉండవచ్చును. ఇక నిరాహార దీక్షలు, ధర్నాలు, పాదయాత్రలు వంటి కార్యక్రమాలను రూపొందించుకోవడంకోసం చంచల్ గూడా జైలుకి పరుగులు తీయడంకంటే నేరుగా తన రాజకీయ ప్రత్యర్ధి తెదేపా కార్యక్రమాలనే అమలు చేయడమే సులువని ఆ పార్టీ భావిస్తున్నట్లుంది.   తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టగానే, వెంటనే షర్మిల కూడా పాదయాత్ర చేప్పట్టారు. మళ్ళీ ఇప్పుడు ఆయన తన పాదయాత్రలో సందర్శించని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా సందర్శించాలనుకొంటున్నట్లు ప్రకటించగానే, షర్మిల కూడా త్వరలో బస్సుయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు వైకాపా ప్రకటించడం గమనార్హం. అయితే, తెదేపా నేతలు కూడా వైకాపా రాజీనామాలను, నిరాహార దీక్షలను, ర్యాలీలను గుడ్డిగా అనుసరించడం విశేషం. ఇంకా చెప్పాలంటే బహుశః చంద్రబాబు కూడా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర స్పూర్తితోనే తను కూడా పాదయాత్ర చేసి ఉండవచ్చును. ఏమయినప్పటికీ బద్ద విరోధులయిన వైకాపా, తెదేపాలు ఈవిధంగా ఒకరినుండి మరొకరు రాజాకీయ ప్రేరణ పొందడం విడ్డూరమే.

రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీల అనుచిత వైఖరి

  ఇవాళ రేపు ఆమరణ నిరాహార దీక్ష అంటే దీక్ష చేస్తున్న వ్యక్తి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయేంతవరకు, అంటే మహా అయితే ఐదు లేక ఆరు రోజుల తరువాత పోలీసులు వచ్చి భగ్నం చేసేంత వరకు దీక్ష చేయడం, అనే ఒక సరికొత్త ఒరవడి మొదలయింది. గనుక నేడు రాష్ట్రంలో చాల మంది రాజకీయ నేతలు ఈ ఐదారు రోజుల ఆమరణ నిరాహార దీక్షలకు కూర్చొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   వైకాపా గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయగానే, ఆ పార్టీకి చెందిన నేతలు కొణతాల రామకృష్ణ, భూమన నాగిరెడ్డి, ధర్మాన కృష్ణ దాసు తదితరులు హడావుడిగా చంచల్ గూడా జైలుకి పరుగులు తీసి, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిసివచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుండి జగన్ మోహన్ రెడ్డి జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. బహుశః ఈ దీక్ష కూడా కూడా విజయమ్మ దీక్షలాగే ఐదారు రోజుల్లో ముగియవచ్చును.   కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఈ ఆమరణ నిరాహార దీక్షా పోటీలలో పాల్గోననప్పటికీ, సమైక్య ఉద్యమంలో వారి పాత్రను బాగానే పోషిస్తున్నారు. సమైక్యాంధ్ర, సమన్యాయం అంటూ పోటాపోటీలుగా రెండు పార్టీల నేతలు ఉద్యమిస్తున్నపటికీ, వారు తమ ప్రత్యర్ధుల కంటే తామెక్కడ వెనుకబడిపోతామనే భయంతో, తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకొనేందుకే ఉద్యమిస్తున్నట్లు వారి చేతలతో, ప్రసంగాలతో స్పష్టం అవుతోంది. అయితే, విజయమ్మ, జగన్ మోహన్ రెడ్డిల దీక్షలు మాత్రం పార్టీ శ్రేణులను ప్రోత్సహించి తద్వారా సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరచుకోవడానికేనని చెప్పవచ్చును.   రాజకీయ నేతలు ఈవిధంగా తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఉద్యమాలు దీక్షలు చేస్తూ రాష్ట్రంలో అశాంతికి మూలకారణం అవుతున్నారు. రాష్ట్ర విభజన వంటి ఒక సంక్లిష్టమయిన సమస్యను సజావుగా పరిష్కరించడానికి కృషి చేయవలసిన రాజకీయ పార్టీలు, ఈవిధంగా అనుచితంగా ప్రవర్తిస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్నే నిందించడం రాజకీయ దౌర్భాల్యమే.   వివేకం ప్రదర్శించవలసిన తరుణంలో ఈవిధంగా ఆవేశం, అసహనం ప్రదర్శించడం వలన సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాబోదు. ఈసంగతి అన్ని రాజకీయ పార్టీలకి స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకంటే తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత నీయడం చాలా దారుణం. ఆవిషయం దాచిపెట్టి తాము ప్రజలకోసమే ఉద్యమిస్తున్నట్లు నటిస్తూ ప్రజలను కూడా మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు రాజకీయ పార్టీలను గుడ్డిగా నమ్ముతున్నంత కాలం అవి ఈవిధంగానే ప్రవర్తిస్తాయి.గనుక ముందుగా మేలుకోవలసింది ప్రజలే.     

వైకాపా రాజకీయ దుర్నీతి

  కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత అందరికంటే ముందు వైకాపా చాలా చురుకుగా పావులు కదిపింది. తెలంగాణాలో నిలద్రొక్కుకోలేకపోయిన వైకాపా రాష్ట్ర విభజన ఖాయమని గ్రహించగానే, వెంటనే సమైక్యవాదం అందుకొని రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. తద్వారా తన శత్రువులయిన తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు సంకట పరిస్థితి కల్పించడమే కాకుండా సమైక్య చాంపియన్ గా నిలిచి సీమాంధ్రలో గట్టిగా నిలద్రొక్కుకోవాలని భావించింది. ఆ ప్రయత్నంలో వైకాపా చాల వరకు సఫలం అయినట్లే ఉంది. ఆపార్టీ ఊహించినట్లే తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కూడా సమైక్య ఉద్యమంలోకి రాక తప్పలేదు.   వైకాపా ఎటూ తెలంగాణాను వదులుకోవడానికి సిద్దపడింది గనుక బలంగా సమైక్యవాదంతో ముందుకు సాగడానికి ఇబ్బందిలేదు. కానీ, తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాత్రం రెండు ప్రాంతాలలో తమ పార్టీలను కొనసాగించాలని భావిస్తున్నందున వాటికి ఇది చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి కల్పించింది.   ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విజయమ్మలతో సహా అందరూ కూడా సమైక్యాంధ్ర కోసమంటూ వ్యూహాత్మకంగా రాజీనామాలు చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజినామా కోసం పట్టుబట్టడం చూస్తే, ఎలాగయినా తెదేపాను, ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇటు సీమాంధ్రలో లేదా అటు తెలంగాణా ప్రజల ముందు దోషిగా నిలబెట్టి తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఒకవేళ చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినట్లయితే తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. రాజీనామా చేయకపోతే సమైక్యాంధ్ర వ్యతిరేఖనే ముద్ర వేయవచ్చునని వైకాపా ఆలోచన. ఇదెలాగుందంటే, ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే తనది ఒక కన్ను పోయినా పరువలేదన్నట్లుంది.   సీమాంధ్ర ప్రాంతంలో పట్టు సాధించేందుకు తెలంగాణాను వదులుకొన్నవైకాపా, తన ప్రత్యర్డులు రెండు ప్రాంతాలలో నాశనమయిపోవాలని శాపాలు పెడుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే హరికృష్ణను కూడా ఇప్పుడు చంద్రబాబుపైకి ఉసిగొల్పుతున్నట్లు సమాచారం. వైకాపా ప్రేరణతోనే ఆయన సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసారని, త్వరలోనే వైకాపా తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందని సమాచారం.   విస్వసనీయతకు మారుపేరని గొప్పలుపోయే వైకాపా ఆది నుండి ఈవిధమయిన అనైతిక ఆలోచనలోతోనే ముందుకు సాగుతోంది. దానికి ఆ పార్టీ రాజకీయ వ్యుహాలని ముద్దు పేరు పెట్టుకొన్నపటికీ అటువంటి విధానాలతో ప్రజల మెప్పు పొందడం, పార్టీని ఎంతోకాలం నెట్టుకురావడం కష్టమని గ్రహించడం మేలు.

అవనిగడ్డలో టిడిపి విజయం

      కృష్ణాజిల్లా అవనగడ్డ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైకం రాజశేఖర్‌పై 61,644 మెజార్టీతో శ్రీహరి విజయం సాధించారు. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 92,309కాగా, టీడీపీ అభ్యర్థి అంబరి శ్రీహరి ప్రసాద్‌కు 75,392 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ఈరోజు జరిగింది. అవనిగడ్డ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

జగన్ పార్టీలోకి సంచలన నాయకుడు..!!

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డీని చంచల్ గూడ జైలులో అత్యంత సన్నిహితుడు కలిసినప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగే ఒక నాయకుడు త్వరలో మన పార్టీలో చేరబోతున్నాడని ఒక వ్యాఖ్య చేసినట్టు తెలుగువన్ కి అందిన విశ్వసనీయ కథనం.   ఇంతకీ జగనన్న చెప్పిన ఆ సంచలన నాయకుడు ఎవరా?అని రాజకీయ విశ్లేషకులు తమ మొదడుకు పదును పెడుతుండగా...తాజాగా రాష్ట్రంలో జరిగిన హరికృష్ణ రాజీనామా విషయం చర్చనీయాంశమైంది. మొదట చంద్రబాబుతో విభేదించి ''అన్న తెలుగుదేశం పార్టీ'' పెట్టిన హరికృష్ణ తిరిగి టిడిపి పంచనే చేరాడు. ఇప్పుడు చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టేందుకు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కిందటి ఎన్నికల్లో తనదైన శైలిలో విస్తృత ప్రచారం చేసి టిడిపి కి మంచి వ్యక్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొద్దికాలంలోనే వారసుడేవారు అనే విషయం పై ఎన్టీఆర్, లోకేష్ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యం కోసం వేస్తున్న ప్రణాళికలు,ఎత్తులు, పైఎత్తులు ఆతరువాత జరుగుతున్న పరిణామాలన్ని పాఠకులకు తెలిసినవే. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో జరిగిన పెళ్ళికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణకు వ్యతిరేకంగా సమైకాంధ్ర నినాదానికి జై కొట్టింది. అదే తరహాలో హరికృష్ణ కూడా సమైకాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకొని రాజ్యసభ కు రాజీనామాను సమర్పించారు. హరికృష్ణ రాజీనామా చేస్తున్నట్లు టిడిపి  అధ్యక్షుడికి గాని ...ఆ పార్టీ నేతలెవరికీ తెలియదు. అయితే ఈ విషయం ముందుగానే కృష్ణా జిల్లా వైకాపా నేతలకు తెలియడం విశేషం. విజయవాడ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏపీఎన్జీవో నేతలకు ఫోన్ చేసి... హరికృష్ణ రాజీనామా చేయబోతున్నారని... దానిని స్వాగతించాలని కోరారు. ఈ పరిణామన్నంతా విశ్లేషిస్తే జగన్ చెప్పిన ఆ సంచలన నాయకుడు హరికృష్ణేనేమోనన్న సందేహం కలగకమానదు...ఈ సినిమా క్లైమాక్స్ ఎలా వుండబోతుందో తెలియాలంటే Wait and Watch TELUGUONE.

రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం లేదా

  సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నడూ కూడా గొప్ప నిర్ణయాలు తీసుకోవు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొంటే అది మన రాష్ట్రవిభజన నిర్వాకంలా ఉంటుంది. కొండా నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు, ఒక సమస్యను పరిష్కరించబోతే అనేక సమస్యలు కాంగ్రెస్ తలకు చుట్టుకొన్నాయిప్పుడు.   రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేయగానే సీమాంధ్ర ప్రాంతంలో ఊహించనంత తీవ్రంగా ఉద్యమాలు మొదలయ్యాయి. వివిధ శాఖలకు చెందిన దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది.   తెలంగాణా ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగిన సమయంలో కూడా రాష్ట్రంలోఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. నేడు రాష్ట్రంలోగవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసన సభ్యులు అందరూ ఉన్నపటికీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం లేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో బహుశః ఇంతదయనీయ పరిస్థితి ఎన్నడు చూసిఉండము.   రాష్ట్రవిభజనపై చాలా లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పుకొస్తున్నకాంగ్రెస్ అధిష్టానం ఊహించనివిధంగా ఎదురయిన ఈ గడ్డు పరిస్థితులను నుండి ఏవిధంగా బయటపడాలోతెలియక విలవిలలాడుతోంది. ఇదంతా నిశితంగా గమనిస్తున్న,టీ-జేయేసీ, తెరాస నేతలు కేంద్రానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకొనే వరకు ఉద్యమం, సమ్మె కొనసాగుతాయని సీమాంధ్ర నేతలు ఉద్యోగులు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమిచేయాలో పాలుపోవడం లేదు.   అయినప్పటికీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా నేటికీ తెలంగాణా ఏర్పాటుకే మొగ్గుచూపుతుండటం విశేషమనే చెప్పాలి. అంటోనీ కమిటీ కూడా తనను కలవడానికి వస్తున్న సీమాంధ్ర నేతలకు సమైక్యవాదం గురించి తప్ప మరే సమస్య గురించయినా మాట్లాడవచ్చని చెపుతుండటం విశేషం. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఇంత ధృడంగా నిలబడటం చాల గొప్ప విషయమే. కాంగ్రెస్ అధిష్టానం అంత గట్టిగా నిర్ణయం తీసుకొన్న తరువాత ఇక అంటోనీ కమిటీ ఏర్పాటు కూడా అనవసరమేనని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.   దేశాన్ని ఏలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఇటువంటి క్లిష్ట సమస్యలను పరిష్కరించగల మేధావులు, నిపుణులు, వారికి అవసరమయిన సకల సమాచారం అందించగల గూడచారి వ్యవస్థలు అన్నీ ఉన్నపటికీ, కేవలం రాజకీయ కోణం నుంచి మాత్రమే తెలంగాణా సమస్యను పరిష్కరించబోయి కాంగ్రెస్ అధిష్టానం భంగపడింది. తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియను అశ్రద్ధగా, అనాలోచితంగా, నిర్లక్ష్యంగా చేసి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొంటోంది.   అయితే తిలా పాపం తలో పిడికెడు అన్నట్లు, నేటి ఈ పరిస్థితికి కాంగ్రెస్ అధిష్టానంతో బాటు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బాధ్యత వహించక తప్పదు. రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖలు ఇచ్చిన అన్నిరాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయం ప్రకటించేవరకు మౌనంగా ఉండటంతో ఇక ప్రతిపక్షాల నుండి వ్యతిరేఖత ఉండబోదని కాంగ్రెస్ అధిష్టానం పొరబడింది. కానీ అవి మళ్ళీ షరా మామూలుగానే మాట మార్చి ఈ దుస్థితికి కారణమయ్యాయి.   తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ కూడా ఇదంతా వారి శ్రేయస్సు కోసమేనని మభ్యపెడుతున్నాయి. ఈ సమస్యకు రాజకీయ పార్టీలు పరిష్కారం చూపలేకపోవచ్చును. బహుశః కాలమే దీనికి పరిష్కారం చూపగలదేమో!

వైయస్‌ విజయమ్మ దీక్ష భగ్నం

  రాష్ట్రవిభజన విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ దీక్ష చేపట్టిన వైయస్‌ఆర్‌ సిపి గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరహారదీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఐదురోజులుగా దీక్ష చేస్తుండటంతో ఆమె ప్రాణానికి ప్రమాదం అన్న కారణంతో పోలీసులు బలవంతంగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో అర్ధరాత్రి దీక్షా శిభిరం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శిభిరంలోనే ఉన్న వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి సహా పార్టీ నేతలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేదిక వీద ఉన్న నేతలందరిని పంపించేసిన పోలీసులు రాత్రి 1.55గంటలకు పోలీస్‌ వ్యాన్‌లోనే విజయమ్మను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. పోలీస్‌ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆసుపత్రి ముందు రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. తరువాత డాక్టర్లు ఆమెను ఐసియూకి తరలించారు. విజయమ్మ నిరసన దీక్షను భగ్నం చేయడంతో పాటు పోలీసులు వైసిపి నాయకులనూ అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు సీమాంద్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

దేశ ఆర్ధిక రాజధానిలో మరో ఘోరం

  దేశంలో అత్యాచారాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. డిల్లీలో నిర్భయ ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే ఇప్పుడు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా మీడియా ప్రతినిధి పైనే సామూహిక అత్యాచారం జరిగింది. ముంబైలో ఫోటో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న 22 ఏళ్ల యువతిపై గురువారం సాయంత్రం ఐదుగురు దుర్మార్గులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నగరంలోని ఓ పాత మిల్లులొ కవరేజ్‌కి వెళ్లిన యువతిని ఆమె సాహాయకున్ని బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలిస్‌ 20 స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకడిని అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు అతడి నుంచి మిగతా వారి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ముంబై పోలిస్‌తో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఘటనపై సమగ్రనివేదిక అందిచాలని కోరారు. వీలైనంత త్వరగా కేసును పూర్తి చేసి నింధితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు.

కేంద్రపాలిత ప్రాంతంగా హైద‌రాబాద్‌

  సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌పై ఎట్టకేల‌కు కేంద్రమంత్రి చిరంజీవి నోరు విప్పారు. ఈ రోజు సోనియా గాందీని క‌లిసిన చిరంజీవి త‌రువాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు ఆయ‌న‌ తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రక‌టిస్తే సీమాంధ్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌ను అదుపు చేయ‌చ్చచి ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో సీమాంద్రుల భ‌యాన్ని దూరం చేయ‌టంతో పాటు ఇరు ప‌క్షాల వారికి స‌మ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. సోనియాతో ఇదే విష‌యాన్ని చెప్పాన‌న్న చిరు ఆమె ఇరు ప‌క్షాల‌కు న్యాయం చేస్తానన్నారు అని చెప్పారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకుంటుంద‌ని తాను అనుకోవ‌టం లేద‌న్నారు చిరు. ఆంటోని కమిటీ నివేదిక వచ్చే వరకూ విభజన ప్రక్రియ ముందుగా వెళ్లదని ఆయన తెలిపారు.

హెచ్‌పిసిఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

  వైజాగ్ సిటీ మ‌రోసారి ఉలిక్కి ప‌డింది. న‌గ‌రంలోని హెచ్‌పిసిఎల్ క‌ర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం జ‌రిగింది.నిర్మాణ ద‌శ‌లో ఉన్న కూలింగ్ ట‌వ‌ర్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ప్రాధ‌మిక స‌మాచారం ప్రకారం ఇద్దరు మ‌ర‌ణించిన‌ట్టుగా చెపుతున్నా ప‌ది మందికి పైగానే మ‌ర‌ణించి ఉంటారంటున్నారు ప్రత్యక్షసాక్షులు. ఈ దుర్ఘట‌న‌లో 36 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. మ‌రో 15 మంది ఆచూకి తెలియ‌టం లేదు. ప్రమాదంలో గాయ‌ప‌డిన వారిని కేర్, కేజీహెచ్ ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు   హెచ్‌పిసిఎల్ కంపెనీలోని సీడీ-2 బ్లాక్ జరిగింది. ఒక్కసారిగా భారీ శ‌భ్దం నగ‌రం అంతా వినిపించింది. దాదాపు రెండు కిలొమీట‌ర్ల వ‌ర‌కు మంట‌లు క‌నిపించాయి.. 15 కిలీమీట‌ర్ల మేర పొగ వ్యాపించింది. ప్రమాదం త‌రువాత ఆ చుట్టు ప‌క్కల ర‌హాదారుల‌న్ని పోలిసులు నిలిపివేవారు దీంతో భారీగా ట్రాఫిక్ జావ అయింది. దీంతో స‌హాయ‌క చ‌ర్యల‌కు కూడా అవాంతరాలు ఎదుర‌య్యాయి. బాధితులు మృతుల వివ‌రాలు తెలియ‌జేయాలంటూ వారి బంధువులు ఆందోళ‌న‌కు దిగ‌టంలో అక్కడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. యాజ‌యాన్యం స‌రైన ప్రమాణాలు పాటించ‌క‌పోవ‌టం వ‌ల్లే ఈ ప్రమాదం జ‌రిగింద‌ని కార్మికులు ఆరోపిస్తున్నారు.

బాబాయి, అబ్బాయి మధ్య అల్లుడి మంట

      బాబాయి, అబ్బాయి..గత రెండు రోజులుగా అందరి నోట్లో నానుతున్న పేర్లవి. ఎక్కడ ఏ నలుగురు ఒక చోట చేరినా ఏంటి కథా? అంటుంటే సోషల్ నెట్ వర్క్స్ లోనైతే..ఎవరి వాల్ మీద చూసినా...ఈ విషయం మీద కామెంట్లు, లైకులు, షేర్ లు..ఎవరికి చేతనైన౦త సెటైర్లు వాళ్ళు చేరుస్తూ డైలాగులు రాసేస్తున్నారీ బాబాయి..అబ్బాయి సినిమాకి...ఇక న్యూస్ న్యూస్ ఛానెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది....గంట గంటకి చర్చలు, ప్రత్యేక కథనాలు..ఇంత హడావుడికి కారణమైన ఈ బాబాయ్..అబ్బాయ్ సినిమాలో వాళ్ళ సినిమాల్లో లానే ఓ ఆసక్తికర ట్విస్ట్..అదే ఫ్లాష్ బ్యాక్ ఉందని బోగట్టా..వివరంగా చెప్పాలంటే..   అబ్బాయి మామగారు, బాబాయి గారి అల్లుడు కలిసి ఓ వ్యాపారం మొదలుపెట్టారట. అందులో బాబాయి గారి అల్లుడు 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే అబ్బాయి మామగారు దానికి లెక్క చూపించకుండా...లాభం, గీభం జాన్తా నహీ..సొమ్ము కాస్త ఖర్చు అనే సారికి బాబాయి గారి అల్లుడుకి సుర్రు సుమ్మైంది.   అనుకున్నది ఒకటి..అయ్యింది ఒకటి దీంతో ఎం చెయ్యాలో తోచని సదరు అల్లుడు.. మామగారితో తన గోడు మొర పెట్టుకుంటే..ఆయన అబ్బాయి గారి మామగారిని తనదైన శైలిలో నోటికి వచ్చినదంతా అందుకున్నారు. ఇది మామగారు తన అల్లుడి దగ్గరా మొర పెట్టుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల బోగట్టా. అక్కడ మొదలైన పొగ, సెగలాగ బంధాలను, అనుబంధాలను కమ్మేసి మసక బార్చేసింది. ఇదంట అసలు కథ అని సినీ వర్గాలు చెవులు కోరుక్కుంటే.. బాబాయ్..అబ్బాయ్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని అభిమానులు బోరుమంటున్నారు..ఈ చిచ్చు ఇప్పుడప్పుడే అరదు కదా అని.     

విజయమ్మ దీక్ష సమైక్యం కోసమేనా

  వైకాపా అధ్యక్షురాలు విజయమ్మరాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ గుంటూరులో చేప్పటిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో ఐదవరోజు పూర్తయింది. షరా మామూలుగానే ఆమె షుగర్, బీపీ, లెవెల్స్ పడిపోవడం, నీరసించిపోవడం, వెంటనే దీక్ష విరమించమంటూ డాక్టర్ల హెచ్చరికలు అన్నీ మొదలయిపోయాయి. ఇక నేడో రేపో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె దీక్షను భగ్నం చేయడం ఆసుపత్రికి తరలించడం కూడా షరా మామూలుగా జరిగేవే.   ఆమె రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష మొదలుపెట్టినప్పటికీ, అక్కడ జరుగుతున్న రాజకీయ ప్రసంగాలు మాత్రం తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని సాగుతుండటం విశేషం. ఈ రోజు దీక్షా వేదిక వద్ద ప్రసంగించిన ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ రాష్ట్ర విభజన వల్ల కలిగే కష్టనష్టాల గురించి, రాష్ట్రం విడిపోకుండా ఉంచేందుకు చేయవలసిన ప్రయత్నాల గురించి మాట్లాడే బదులు, ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరగడానికే ప్రాధాన్యమిచ్చారు.   రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని, ఇప్పటికయినా ఆయన తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని రాష్ట్ర విభజను వ్యతిరేఖిస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని ఆమె అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెపుతూ, మరో వైపు సీమాంధ్ర నేతల చేత సమైక్య ఉద్యమాలు చేయించడం ప్రజలను మోసగించడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటికయినా ఆయన ద్వంద నీతిని పక్కనబెట్టి ఆయన తన పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆమె డిమాండ్ చేసారు.   తెలంగాణాలో పాగా వేసేందుకే ‘తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని’ చెప్పుకొన్న వైకాపా అక్కడ, పార్టీకి ఆశించినంతగా ప్రజాదరణ దక్కకపోవడంతో ఇక అక్కడ కొనసాగి లాభంలేదని గ్రహించగానే అకస్మాత్తుగా సమైక్యరాగం అందుకొని, అక్కడి తన పార్టీ నేతలని, ప్రజలని మోసం చేయడం నిజం కాదా? విశ్వసనీయతకు సర్వహక్కులు తమవేనన్నట్లు మాట్లాడే ఆ పార్టీ అధిష్టానం తెలంగాణా ప్రజలను వంచించడం నిజం కాదా? తెలంగాణా విషయంలో ఆ పార్టీ అవలంభించినది ద్వంద వైఖరి కాదా?   తెలంగాణాలో పూర్తిగా పరువు పోగొట్టుకొని, ఏమీ జరగనట్లుగా ఆంధ్రప్రాంతంలో ఈవిధంగా ఉత్తర ప్రగల్భాలు పలకడం ఆ పార్టీకే చెల్లు. నిజానికి ఆ పార్టీకి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది నిబద్దత, విశ్వసనీయతే. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడుతున్నామని చెపుతూ ఆ పేరుతో సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీ రేటింగ్ పెంచుకోవాలని తహతహలాడుతున్న వైకాపా మళ్ళీ ద్వందనీతినే అవలంభిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరుచుకొంటూ, తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే ప్రయత్నం చేస్తున్నవైకాపా సమైక్య ఉద్యమాల పేరుతో ప్రజలని వంచించడం చాలా హేయమయిన చర్య.   సీమాంధ్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకే రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమాలు మొదలుపెట్టిన వైకాపా, ఆ తరువాత చంద్రబాబుని ముగ్గులోకి లాగేందుకే జగన్, విజయమ్మల రాజీనామాలు చేసి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించడం గమనిస్తే ఆ పార్టీ ఎంత దురాలోచనతో ఈ సమైక్యపోరాటం ఆరంభించిందో అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్నీతితో పార్టీ ప్రజల మెప్పు పొందడం, కలకాలం మనుగడ సాగించడం అసంభవమని ఆ పార్టీ అధిష్టానం ఎంత త్వరగా గ్రహిస్తే ఆపార్టీకి అంత మేలు.

కాంగ్రెస్ ఉచ్చులో ప్రతిపక్షాలు

  కొద్ది రోజులుగా సీమాంధ్రకు చెందిన తెదేపా కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరో అడుగు ముందుకువేసి తన రాజీనామాను కూడా ఆమోదింపజేసుకొన్నారు. నిన్న లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తెదేపా కాంగ్రెస్ పార్టీలకు చెందిన మొత్తం 12మంది యంపీలను లోక్ సభ నుండి సస్పెండ్ చేయబోగా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. కానీ, ఈ రోజు స్పీకర్ వారందరినీ సభ నుండి ఐదు రోజులపాటు సస్పెండ్ చేసారు.   యంపీలు సభలో గొడవ చేయడం వారిని సస్పెండ్ చేయడం షరా మామూలు విషయమే అయినప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు సస్పెండ్ అయిన కాంగ్రెస్ యంపీలు అందరూ కూడా సోనియా గాంధీకి వీర విధేయులే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సోనియా గాంధీకి వీర విధేయులయిన ఉండవల్లి, కనుమూరి, హర్ష కుమార్, లగడపాటి వంటి కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్రపై సభను స్తంభింపజేయడం ఆశ్చర్యమనుకొంటే, సభలోనే ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వారిని వారించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.   అసలు కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ నిజంగానే తమ అధిష్టానానికి డ్డీ కొంటున్నారా? లేక ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యర్ధులను ఏమార్చడానికే ఆడుతున్న మహానాటకంలో భాగమా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఆహారభద్రతా బిల్లుని తమ యంపీలే స్వయంగా అడ్డుకొంటున్నపటికీ సోనియా గాంధీ వారిని వారించే ప్రయత్నం చేయకపోవడం, అదేవిధంగా కీలకమయిన బిల్లుపై సభలో చర్చ జరుగుతోందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ యంపీలు సభలో రభస చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.   రాష్ట్ర విభజన ప్రకటన తరువాత వైకాపా రాజీనామాలతో మొదలయిన సమైక్య ఉద్యమం చూసి కాంగ్రెస్ పార్టీ కంగుతింది. రాష్ట్ర విభజన చేసి ఒకే దెబ్బకు మూడు పిట్టలు-తెరాస, తెదేపా మరియు జగన్ పార్టీలను కొడదామని అడియాసకు పోయిన కాంగ్రెస్ అధిష్టానం ఊహించని స్థాయిలో నడుస్తున్న సమైక్య ఉద్యమాలు చూసి నివ్వెరపోయింది. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత వెనక్కి వెళితే మొదటికే మోసం రావడం ఖాయం. అందువల్ల తన పార్టీ యంపీలతోనే తిరుగుబాటు బావుటా ఎగురవేయించి, తెదేపా, వైకాపాలు కూడా ఆ ఉచ్చులో చిక్కుకొన్న తరువాత ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లయితే క్షేమంగా బయటపడవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.

12 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

      లోక్‌సభలో 12 మంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. అరంగట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో స్పీకర్ మీరాకుమార్ సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధన 374ఏ ప్రకారం స్పీకర్ మీరాకుమార్ ఎనిమిది మంది కాంగ్రెస్, నలుగురు టీడీపీ సీమాంధ్ర ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సప్పెన్షన్ గురైన టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సస్పెన్షన్ జాబితాలో సాయిప్రతాప్, అనంత, లగడపాటి, మాగుంట, హర్షకుమార్, మోదుగుల, ఉండవల్లి, కొనకళ్ల, శివప్రసాద్, నిమ్మల కిష్టప్పతో పాటు సబ్బంహరి, కనుమూరి బాపిరాజు పేర్లను చేర్చారు. నిన్న లిస్టులో ఉన్న రాయపాటి పేరును తొలగించారు. సమైక్యాంధ్ర కోసం గత కొద్దిరోజులుగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

ముంబై లో జర్నలిస్ట్ పై గ్యాంగ్ రేప్

      ముంబై కి చెందిన ఓ మహిళ జర్నలిస్ట్ గురువారం రాత్రి గ్యాంగ్ రేప్ కి గురయింది. ఓ ప్రముఖ పత్రికకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ జర్నలిస్ట్ అసైన్‌మెంట్‌పై ఆమె మిల్ కాంపౌండుకు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జస్లోక్ అస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలుస్తోంది. ఆమెతో పాటు వచ్చిన మగ సహోద్యోగిని దుండగులు కొట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయికి గాయాలయ్యాయని, రక్తం కూడా కారుతోందని, అయితే చికిత్సకు ప్రతిస్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 10మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సెప్టెంబరు 7 టెన్షన్ టెన్షన్

      సమైక్యాంధ్ర డిమాండ్ చేస్తూ లక్షమందితో హైదరాబాద్ తో పమైక్య సభను నిర్వహిస్తాం అని ఏపీఎన్జీవోల సంఘం నిర్ణయించింది. అదే జరిగితే అదే రోజు తాము కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ జేఏసీ నేతలు చెబుతున్నారు. దీంతో సెప్టెంబరు 7న హైదరాబాద్ లో ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరు అడ్డువచ్చినా హైదరాబాద్ లో సమైక్య సభ నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవో నేతలు చెబుతుంటే దానికి పోటీగా ర్యాలీ చేయాలని తెలంగాణ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభజన రేఖ పడిపోయింది. పోటాపోటీగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యమాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి జేఏసీ కూడా ర్యాలీలు తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే నెల 4 నుండి 7 వరకు శాంతిర్యాలీలు, 7న మిలియన్ మార్చ్ కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. లాల్ బహదూర్ స్టేడియం, నిజాం కళాశాల ప్రాంతాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

హరికృష్ణ వెనుక జగన్..!!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ హరికృష్ణ రాజీనామా వెనుక జగన్ పార్టీ నేత ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి గురువారం ఆయన రాజీనామా చేయడం, అంతేవేగంగా అది ఆమోదం పొందడం పార్టీవర్గాలను విస్మయంలో ముంచెత్తింది. హరికృష్ణ భావోద్వేగంతో రాజీనామా చేశారా? లేక పార్టీ అధినేత, బావ చంద్రబాబును ఇరుకునపెట్టేందుకు చేశారా? అనే చర్చ జరుగుతోంది.   హరికృష్ణ రాజీనామా చేస్తున్నట్లు టిడిపి నేతలెవరికీ తెలియదు..కాని ఈ విషయంపై ముందుగానె జగన్ పార్టీ నేతలకు సమాచారం అందడం విశేషం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే..హరికృష్ణ రాజీనామా ను స్వయంగా జగన్ పార్టీ నేతే తాయారు చేశారట. "ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న విజయవాడ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఏపీఎన్జీవో నేతలకు ఫోన్ చేశారు. హరికృష్ణ రాజీనామా చేయబోతున్నారని... దానిని స్వాగతించాలని కోరారు. రాజీనామా సరే, ఆది ఆమోదం పొందుతుందా? అని ఉద్యోగ నేతలు ప్రశ్నించగా... రాతకోతలన్నీ తానే చేశానని, రాజీనామా కచ్చితంగా ఆమోదం పొందుతుందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబును పరోక్షంగా ఇరుకున పెట్టడానికే ఈ వ్యవహారం నడిపినట్లు అనిపిస్తోంది. రాజీనామా చేసి ఆమోదించుకొని చంద్రబాబుకంటే ముందే సీమాంధ్రలో పర్యటనకు వెళ్తే పార్టీ కార్యకర్తలు, నాయకులంతా తననే అనుసరిస్తారని, చంద్రబాబు కంటే తనకే ఇమేజి వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.