బీజేపీ కార్యాలయంలపై తెలంగాణ జాగృతి దాడి!

  తెలంగాణ బంద్ సందర్భంగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ జాగృతి కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడానికి నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై రాళ్ళు విసిరారు. దీంతో కార్యాలయ అద్దాలు ద్వంసమయ్యాయి. బీజేపీ కార్యాలయంలోనికి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-కార్యాకర్తల మధ్య భారీ స్థాయిలో తోపులాట జరిగింది. తెలంగాణ జాగృతి ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ బంద్ సంపూర్ణం

  పోలవరం బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాజకీయ పక్షాలు చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. పోలవరం బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ.. టీఆర్ఎస్, టీజేఏసీ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, పాఠశాలలు మూతబడ్డాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇమ్లీబన్ నుంచి తెలంగాణ జిల్లాలలో పాటు సీమాంధ్ర జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులు ఆగిపోయాయి. హైదరాబాద్‌లోని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జంటనగరాల్లోని స్కూళ్లకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. తెలంగాణ జిల్లాలన్నిటిలో బంద్ సంపూర్ణంగా జరిగింది.

అజ్మీర్‌లో దారుణం: తల్లే కొడుకు తల నరికింది!

  రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఒక ఘోరం జరిగింది. కన్నతల్లే మూడేళ్ళ వయసున్న తన కొడుకు తల నరికి దారుణంగా హత్య చేసింది. అంతిమా జైన్ అనే ఆ మహిళ.. తన కొడుకు దుకాణానికి వెళ్తానని మారాం చేస్తుంటే వద్దని మందలించింది. అయితే ఆ బాలుడు దుకాణానికి వెళ్తానని మారాం చేయడంతో ఆ తల్లి ఆవేశంతో కొడుకుని తలనరికి చంపేసింది. అయితే కొడుకును చంపిన తర్వాత ఆ నేరం తన మీద పడకుండా వుండటానికి కొడుకు శవాన్ని దూరంగా పశువుల షెడ్డు దగ్గర పడేసింది. స్థానికులు ఆ బాలుడి శవాన్ని చూసి నిర్ఘాంతపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకుని హత్య చేసిన ఆ తల్లి తనకేమీ తెలియనట్టు గుండె బాదుకుని ఏడ్చింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తన కొడుకుని తానే తలనరికి చంపానని ఒప్పుకుంది. తాను వద్దన్న పని చేస్తానని అన్నందుకు కోపం వచ్చి తాను కొడుకుని చంపేశానని అంగీకరించింది.

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తనముందు వున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయనను ఏపీ ఎన్జీఓలు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగుల పోరాటం అద్వితీయమని కొనియాడారు. సమైక్య ఉద్యమ ఘనత ఎన్జీవోలదే అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, అమెరికాలో ఆఫీస్ ఆఫీస్ తిరిగి కంపెనీలు తీసుకువచ్చానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చుదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు పరిణితి చెందిన నేత: అశోక్‌బాబు

  శనివారం నాడు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీఎన్జీవోలు సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువారికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని, అలాగే చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైదరాబాద్ అభివృద్ధి పథంలో పయనించాయని అశోక్ బాబు అన్నారు. రాజకీయ కుట్రతో రాష్ట్రాన్ని విభజించారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉద్యోగులు తమ సంపూర్ణ సహకారం అందిస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అశోక్‌బాబు ఆకాంక్షించారు.

పోలవరం ఆందోళన: కోదండరామ్ ఆగ్రహం!

  పోలవరం బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయంలో తెలంగాణలో బంద్ జరుగుతోంది. తెలంగాణ రాజకీయ ఐకాసా బంద్‌ను పర్యవేక్షిస్తోంది. అధికార పార్టీ కూడా బంద్‌కి మద్దతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఐకాసా కన్వీనర్ కోదండరామ్‌ పోలవరం అంశం విషయంలో కేంద్రం తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పోలవరం అంశం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కాదని, ఆదివాసుల హక్కులపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు. పోలవరంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. పోలవరం విషయంలో న్యాయపోరాటం ఆపమని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం బిల్లు: వెంకయ్య స్పందన

  పోలవరం ముంపు గ్రామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్‌ని తమ ప్రభుత్వం బిల్లు రూపంలో ఆమోదించిందే తప్ప తమ ప్రభుత్వం ఈ విషయంలో కొత్తగా చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ అంశాన్ని రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలేలా చేయడం చాలా పొరపాటు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ గిరిజనులకు పునరావాసం గురించే ఆలోచిస్తే బాగుంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన చెప్పారు.

ఫార్మసీ అడ్మిషన్లు: కేసీఆర్‌కి చంద్రబాబు లేఖ

  తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. జూలై 31లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఆ లేఖలో స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం జూలై 31 లోగా అడ్మిషన్లు పూర్తి కావాలి, ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం కావాలి. ఈ విషయాన్ని చంద్రబాబు తాను రాసిన లేఖలో కేసీఆర్‌కి గుర్తుచేశారు. సకాలంలో అడ్మిషన్లు చేయకపోతే స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా నివారించవచ్చని, తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించినట్లవుతుందని చంద్రబాబు సూచించారు.

ఆ రెండు విమానాలు ఢీకొనేవే!

  పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోరా విమానాశ్రయంలో ఒక ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. 250 మంది ప్రయాణికులకు భూమ్మీద నూకలు వుండటంతో ఈ ప్రమాదం తప్పిపోయింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే, ఎయిరిండియాకు చెందిన మరో విమానం రన్ వే మీద లాండ్ అవుతోంది. ఈ రెండు విమానాలు ఒకదానితో మరొకటి ఢీకొనబోయాయి. అయితే వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. రెండు విమానాలకూ ఒకేసారి ఏటీసీ క్లియర్స్ ఇవ్వడం వల్ల ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. రెండు విమానాలూ ఢీకొనబోతున్నాయన్న విషయాన్ని రెండు విమానాల్లోనూ వున్న పైలెట్లు గ్రహించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఎయర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన మీద అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇడుపులపాయ: జగన్ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు

  నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఆదివారం నాడు జరగబోతోంది. ఈ నేపథ్యంలో 30 మంది నెల్లూరు జిల్లా వైకాపా జడ్పీటీసీ సభ్యులతో జగన్ పార్టీ ఇడుపులపాయలోని జగన్‌కి చెందిన గెస్ట్ హౌస్‌లో క్యాంపు ఏర్పాటు చేసింది. జడ్పీటీసీ అయిన తన భార్యని జగన్ గెస్ట్ హౌస్‌లో బంధించారని కావలి జడ్పీటీసీ సభ్యురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఇడుపులపాయలోని జగన్‌కి చెందిన గెస్ట్ హౌస్‌లో తనిఖీలు జరపడానికి పోలీసులు వెళ్ళారు. అయితే పోలీసులను గెస్ట్ హౌస్ లోపలకి వెళ్ళనీయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికీ గెస్ట్ హౌస్‌లో పోలీసులు తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది.

జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక!

  జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా సునామీ కూడా వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున టోక్యోకు ఈశాన్యప్రాంతంలో ఉన్న ఫుకుషిమా తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. 2011లో 19 వేల మంది ప్రాణాలను బలితీసుకున్న పెను భూకంపం, సునామీ వచ్చి అణు విద్యుత్ ప్లాంటు విధ్వంసం జరిగిన ఫుకుషిమా ప్రాంతంలోనే తాజాగా ఈ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద భూకంపం తీవ్రత 6.8గా నమోదైందని వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా జపాన్ ఉత్తర తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఫుకుషిమాలోని అణు విద్యుత్ ప్లాంటుకు కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లిందేమోనని నిపుణులు పరిశీలిస్తున్నారు.