కొన‌సాగింపు గాంధీ వ‌చ్చేశాడోచ్!

  ప్రియాంక గాంధీ వాద్రా.. త‌న కొడుకు పేరు.. రెహాన్ రాబ‌ర్ట్ వాద్రా నుంచి రెహాన్ రాజీవ్ గాంధీ అనే కొత్త పేరుకు మార్పించారు. అది కూడా కోర్టు ద్వారా పూర్తి చ‌ట్ట‌బ‌ద్ధంగా. దీంతో రాహుల్ గాంధీతో అంత‌మై పోనున్న గాంధీస్ డైనాస్టీ కాస్తా.. కొన‌సాగనుంది. దీంతో రెహాన్ రాజీవ్ గాంధీ ఇలా పేరు మార్చుకున్నారో లేదో అలా కొన‌సాగింపు గాంధీగా పిలుస్తున్నారంద‌రూ. బేసిగ్గానే ఒరిజిన‌ల్ గాంధీ కుటుంబం నుంచి దేశ రాజ‌కీయాల్లో ఎవ్వ‌రూ లేరు. గాంధీ కొడుకులున్నా వారంతా కూడా ర‌క‌ర‌కాల రంగాల్లో ఉండ‌టం వ‌ల్ల మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ కంటూ ఒక రాజ‌కీయ వార‌సుడు లేకుండా పోయారు. ప్ర‌స్తుతం గాంధీజీ మ‌న‌వళ్లుగా..  రాజ్‌మోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, రామచంద్ర గాంధీ, అరుణ్ మణిలాల్ గాంధీ, తుషార్ గాంధీ వంటివారున్నారు. గాంధీకి నలుగురు కొడుకులు - హరిలాల్, మణిలాల్, రాందాస్, దేవదాస్. వీరి వార‌సులే వారంతా.  నిజ‌మైన గాంధీలు ఇంత మంది ఉండ‌గా.. వీరంతా కూడా రాజ‌కీయాల్లో లేక పోవ‌డంతో.. రాహుల్ గాంధీయే చివ‌రి రాజ‌కీయ‌ గాంధీగా ఉన్నారు. నిజానికి ఈ రాహుల్ గాంధీ కూడా ద ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఇందిర నెహ్రూ- ఫిరోజ్ గాంధీని పెళ్లాడ్డం వ‌ల్ల ఆమె ఇందిరా గాంధీగా మారారు అప్ప‌ట్లో. అలాగ‌ని ఫిరోజ్ గాంధీ సైతం ఒరిజిన‌ల్ గాంధీ కాదు. ఆయ‌న్ను గాంధీజీ ద‌త్త‌త తీస్కోవ‌డం వ‌ల్ల‌.. ఆయ‌న‌కా ఇంటి పేరు వ‌చ్చింది.  ఒక వేళ గాంధీ అన్న పేరే అంత గొప్ప రాజ‌కీయ నామం అయితే.. ఇక రాజ‌కీయాల్లో రాణించానుకున్న వారంతా.. గాంధీ అని పేరు పెట్టేసుకుంటే స‌రిపోతుంది క‌దా!? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఉన్న ఒరిజిన‌ల్ గాంధీల‌ను ప‌క్క‌న పెట్టి ఎక్క‌డో ఉన్న వాద్రాని గాంధీ చేయ‌డం వ‌ల్ల‌.. ఎలాంటి సందేశం ఇవ్వ‌నున్నారీ ప్రియాంక గాంధీ వాద్రా అన్న‌ది ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఇందులో వాద్ర అనేది కూడా ఒక కుటుంబ‌మే. మ‌రలాంట‌పుడు ఆ కుటుంబానికున్న ఆత్మ‌గౌర‌వం త‌గ్గించుకోవ‌డం కాదా ఇదీ? ఆపై గాంధీగా త‌న కొడుక్కి పేరు మార్చ‌డం వ‌ల్ల ప్రియాంక అంత విలువ లేని కుటంబానికి కోడ‌లిగా వెళ్లిన‌ట్టా? మ‌రి అత్తింటి కుటుంబ గౌర‌వాన్ని ఇది త‌గ్గించ‌డం కాదా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  గాంధీ అన్న పేరు పెట్ట‌గానే గొప్ప వాళ్ల‌యిపోతే.. మ‌రి గాంధీజీకి పుట్టిన న‌లుగురు కొడుకులు వారికి పుట్టిన పిల్ల‌లు ఆ పిల్ల‌ల‌కు పిల్ల‌లూ.. రాజ‌కీయంగా ఎంతో ఎత్తుల‌కు ఎదిగి పోవాలి క‌దా!? మ‌రి వారు ఎందుక‌ని అంత‌టి రాజ‌కీయ అనామ‌కులుగా మిగిలిపోయారు??? అన్న చ‌ర్చ‌కు తెర‌లేస్తోందీ ప్రియాంక గాంధీ వాద్రా చ‌ర్య‌ల వ‌ల్ల అంటున్నారు కొంద‌రు.  

ఏఎస్ఐ పై దాడికి పాల్పడ్డ గంజాయి బ్యాచ్

  నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.  మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు..  పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు  పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం : సీఎం రేవంత్

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు. సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.” ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్‌ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్‌ తెలిపారు.

పిఠాపురం వర్మ.. మంత్రి నారాయణ వివాదానికి ఎండ్ కార్డ్

మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని   క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే  విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.   అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదమేం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.  ఈ సందర్భంగా వర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ,  అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు.   కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అభ్యర్థికే మా మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. . నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  

వైసీపీ ఫేకు ప్రచారంపై కేంద్రం సీరియస్!

ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది.  అసలింతకీ విషయమేంటంటే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే  స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌ విరూపాక్షి,   ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు.    కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి   రాష్ట్రంలో  మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు.  అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  

ఆంధ్రా పచ్చళ్లే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే!

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం.. పరిశ్రమల స్థాపనకు ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామిక వేత్తలు భావిస్తుండటం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి కంటగింపుగా మారింది. దీంతో ఉన్నవీలేనివీ కల్పించి ఏపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నది ఆ రాష్ట్రం. ఈ విషయంలో కర్నాటక మంత్రులే ముందువరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కాదని మరీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఏపీకి క్యూ కడుతున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలకు కడుపుమంటగా ఉంటుంది. అయితే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కడుపుమంట మరీ ఎక్కువగా ఉంది.  ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుచిత రాయితీలు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.  సామాజిక మాధ్యమ వేదికగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. గూగుల్ వైజాగ్ నే ఎంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయతీలు ఇవ్వడమేననీ, అలాగే రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీయింబర్స్ మెంట్, భూమి ధరపై పాతిక శాతం డిస్కౌంట్, ఉచిత విద్యుత్ ట్రాన్స్ మిషన్, వాటర్ టారిఫ్ పై పాతిక శాతం రాయతీలు ఇచ్చిందనీ..ఈ స్థాయిలో రాయితీలు ఇచ్చిన రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా ఆయన వ్యాఖ్యలు ఏపీకి గూగుల్ వచ్చిందన్న కడుపుమంటతోనే అన్నది ఎవరికైనా సులువుగా అర్ధమైపోతుంది.  కర్నాటక మంత్రి ఖర్గే వ్యాఖ్యలపై ఏపీ ఐటీ మంత్రి దీటైన బదులిచ్చారు. ఎక్కడా కర్నాటక పేరు కానీ, ఆ రాష్ట్ర మంత్రి  ప్రియాంక ఖర్గే పేరుకానీ ప్రస్తావించకుండానే లోకేష్ ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. ఈ మేరకు లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  ‘ఏపీలో పచ్చళ్లు మాత్రమే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే’ అని పేర్కొన్నారు. ఆ ఘాటును, వేడిని పొరుగురాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసినట్లేనా?

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసిందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు మరో మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డితో మేడారం జాతర పనుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలు చినికిచినికి గాలివానగా మారిన చందంగా ముదిరిపాకాన పడ్డాయి. ఈ విషయంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకింత దూకుడుగా వ్యవహరించడం సమస్యను మరింత పెద్దది చేసింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఆయన వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. తుపాకి గురి పెట్టి మరీ మామూళ్ల కోసం బెదరించేవారన్న ఆరోపణలు, ఫిర్యాదులపై ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా కొండా సురేఖ అడ్డుకోవడమే కాకుండా తన నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఆమె నివాసానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమైంది. ఇక ఆమె కేబినట్ పదవికి సీఎం ఉద్వాసన పలకడమో, లేక ఆమే రాజీనామా చేయడమో వినా మరో మార్గం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంపై అపారమైన విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ ప్రకటనలో పేర్కొని పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీఎంపైన కొండా దంపతుల కుమార్తె చేసిన విమర్శలు అన్ని హద్దులనూ దాటేశాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసి ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమేంటనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.  

లంక‌ల దీప‌క్ రెడ్డి.. ల‌క్కెంత‌.. కిక్కెంత‌?

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్న‌ లంక‌ల దీప‌క్ రెడ్డి 2023 ఎన్నిక‌ల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక న‌వీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే క‌లిగి  ఉన్నారు. కానీ, ఆయ‌న‌కీ ఈయ‌న‌కీ ఉన్న తేడా ఒక్కటే..  అధికార‌పార్టీ.  దీప‌క్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్క‌డ అదేమంత ప‌ని చేసేలా లేదు. గ‌తంలో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించ‌డం అయ్యే ప‌ని కాదు. కార‌ణం అప్ప‌ట్లో ఉన్న సిట్యువేష‌న్ వేరు- ఇప్పుడున్న ప‌రిస్థితి వేరు.  ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు.. దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావ‌డం ఒక ఆటంక‌మైతే.. రెండోది ఇక్క‌డ అత్య‌ధికంగా మైనార్టీ ఓట్లుండ‌టం. దీప‌క్ ఇక్క‌డి మైనార్టీల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక ఇంట‌ర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పింద‌ల్లా చేసే గొర్రెలు కారంటూ ప‌రుష ప‌ద‌జాలం వాడారు.  ఆమాట‌కొస్తే తాము బీసీల‌కు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వార‌మ‌నీ. ఇంకా మాట్లాడితే త‌మ ప్ర‌ధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీప‌క్ రెడ్డి. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ ఇచ్చిన‌ట్టు ఒక బీసీ బిడ్డ‌కు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాట‌కు ఒక అర్ధ‌ముండేది. అంతే కాకుండా ఎంద‌రో మ‌హిళ‌లు పోటీ ప‌డ‌గా.. వారంద‌రినీ తోసి రాజ‌ని.. త‌నకున్న కిష‌న్ రెడ్డి స‌పోర్ట్ మొత్తాన్ని వాడారు దీప‌క్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైన‌స్ గా మారి దీప‌క్ రెడ్డి విజ‌యావ‌కాశాల‌ను గండి కొట్టేలా కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా క‌న్నీటిప‌ర్యంత‌మై ప్ర‌చారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన  లోక‌ల్ బాయ్ న‌వీన్ ముందు.. దీప‌క్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంక‌ను జ‌యించ‌డం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు.  కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జ‌న‌ర‌ల్ అయ్యిందిగానీ గ‌తంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం  కూడా  కావ‌డంతో.. ఇక్క‌డ దీప‌క్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అస‌లు యుద్ధం మొత్తం సునీత‌, న‌వీన్ మ‌ధ్య ఉండ‌నుంద‌ని అంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌లో పేలనున్న కొండా దంపతుల టైంబాంబ్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముంగిట నిలిచింది. పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే వ్యక్తి  ఓఎస్డీ గా చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.  కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల కోసం   స్వయంగా సుమంత్ బెదిరింపులకు దిగుతున్నారు.   డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు.  సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సుమంత్ ను అదుపులోకి తీసుకోలేకపోయారు. దీంతో ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి.  స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి.

నారా లోకేష్ అచ్చం నాన్నలాగే.. ఈ మాట ఎవరన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే..  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.   అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి.   బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.  ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో  కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే  పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.  

బీహార్ ఎన్నికలు.. పీకే వ్యూహ వైఫ్యలాలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పీకే జన సురాజ్ పార్టీ ప్రభావం నామమాత్రమేనా? కింగ్ మేకర్, ప్రభుత్వ ఏర్పాటులో కీ ఫ్యాక్టర్ అంటూ పీకేపైనా, ఆయన జన సురాజ్ పార్టీపైనా సర్వేలు చెప్పినదంతా ట్రాషేనా? విశ్లేషకులు పీకే గురించి, బీహార్ ఎన్నికలలో ఆయన పాత్ర గురించి చెప్పినవన్నీ అభూతకల్పనలేనా? అన్న ప్రశ్నలకు పీకే స్వయంగా ఔనని చెప్పినట్లైంది.. ఆయన తాను వ్యక్తిగతంగా పోటీలో నిలబడటం లేదని ప్రకటించడం ద్వారా.  ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని విజయాలు అందుకున్న పీకే ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. పెరిటి వైద్యం పని చేయదు అన్నట్లు పీకీ వ్యూహాలు ఆయన సొంత పార్టీ జన సురాజ్ కు ఇసుమంతైనా పని చేయడం లేదని ఆయన పోటీ నుంచి వైదొలగడం ద్వారా తేటతెల్లమైందంటున్నారు పరిశీలకులు.   ప్రశాంత్ కిశోర్ బీహార్ ఎన్నికలలో జనసూరజ్ పార్టీని గెలుపు గుర్రంగా మార్చేందుకు గత రెండేళ్లుగా నిర్విరామంగా శ్రమించారు. పాదయాత్ర చేశారు. అధికార, విపక్ష కూటములపై విమర్శలు గుప్పించారు. యువతను ఆకట్టుకుని బీహార్ నే ఏలేయడానికి నేల విడిచి సాము చేశారు. ఉద్యమాలు, ఆందోళనలూ సరేసరి.  సరే ఇక ఇప్పుడు ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి, మహాఘట్ బంధన్ (ఇండియా కూటమి) కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించి గెలుపు రేసులో ముందున్నానని చాటుకున్నారు. రెండు జాబితాలు ప్రకటించేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడికి ప్రత్యర్థిగా నిలబడతానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన తీరా జాబితాల ప్రకటన వేళ రఘోపూర్ నియోజకవర్గంలో తాను కాదు మరో అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడే ఆయన గెలుపు బాటలో లేరని తేటతెల్లమైందంటున్నారు. ఇక ఆ తరువాత ఒక జాతీయ స్థాయి వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను వ్యక్తిగతంగా పోటీకి దూరం అని ప్రకటించేసి.. పార్టీకి విజయావకాశాలు అంతంతమాత్రమేనని చెప్పకనే చెప్పేశారు.  తాను  పోటీ చేసి గెలవడం కంటే తన పార్టీని గెలిపించుకోవడం ముఖ్యమన్న ప్రశాంత్ కిశోర్.. ఒక రకంగా జనసూరాజ్ కార్యకర్తలలో జోష్ ను చంపేశారని చెప్పాలి.  అయితే తాను పోటీ నుంచి తప్పుకున్నా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జన సురాజ్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యక్తం చేసిన ధీమా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజంగా పార్టీ విజయం కోసం ఫుల్ టైం కేటాయించడానికి తాను పోటీలో ఉండకూడదని ఆయన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.. కానీ ఇదే ప్రకటన ఆయన చివరి నిముషంలో కాకుండా ఇంకా చాలా ముందే ప్రకటించి ఉంటే.. బెటర్ గా ఉండేది. అలా చేసి ఉంటే.. ఇప్పుడు ఆయన ఓటమి భయంతో పోటీ నుంచి పలాయనం చిత్తగించారన్న విమర్శలకు తావు ఉండేది కాదు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ తాను పోటీకి దూరం అని ప్రకటించడంతో  ప్రత్యర్థులకు ఆయన అస్త్రసన్యాసం చేశారంటూ ఎద్దేవా చేయడానికి అవకాశం ఇచ్చినట్లైంది. సొంత పార్టీలో కూడా ఆఖరి నిముషంలో తమ అధినేత కాడె వదిలేశారన్న భావన వ్యక్తం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చింది. ఇక ప్రజలు  కూడా గెలుపు సత్తా లేని పీకే పార్టీకి ఓటేసి ఏం లాభం అన్న భావనకు లోనయ్యే అవకాశాలున్నాయి. అంటే తాను పోటీ నుంచి విరమించుకోవడంపై ప్రశాంత్ కిశోర్ ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా.. దాని వల్ల వాటి వల్ల జనసురాజ్ పార్టీకి కలిగే ప్రయోజనం శూన్యమేనని అంటున్నారు. యుద్ధానికి ముందు అస్త్రసన్యాసం చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా?

కాంగ్రెస్ లో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మేడారం పనుల కాంట్రాక్టుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య నెలకొన్న విభేదాలు కేబినెట్ భేటీపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విభేదాలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవలసింది పోయి మీడియా ముందుకు వెళ్లడమేంటన్నది రేవంత్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ మాజీ ఓఎస్డీ వ్యవహారం అగ్నికి అజ్యం పోసినట్లైంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఏకంగా మంత్రి సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ కొండా సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నిప్పులు చెరిగారు.  ఇక దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. ఉరుములేని పిడుగులా మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి మేడారం పనులను తప్పించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మేడారం పనుల రికార్డులను వెంటనే ఆర్అండ్ బి శాఖకు అప్పగించాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టాలని కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడమే కాదు.. అవసరమైతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. కేబినెట్ భేటీకి గైర్హాజర్ అవుతున్నట్లు కొండా సురేఖ ప్రకటించనప్పటికీ, ఆమె సన్నిహిత వర్గాలు మాత్రం ఆమె కేబినెట్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.  

మంత్రి కొండా సురేఖకు మరో షాక్

మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తోంది. ఆమె మాజీ ఓఎస్డీని విధుల నుంచి తొలగించిన ప్రభుత్వం.. అతడిపై కేసుల విషయంలో రాజీ లేకుండా అరెస్టు చేయాలంటూ పోలీసులను ఆమె నివాసానికి పంపించింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఆమెకు ప్రభుత్వం మరో  షాక్ ఇచ్చింది.  మేడారం జాతర పనులను ఆర్అండ్ బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే మేడారం జాతర పనుల రికార్డులను ఆర్ అండ్ బీకి అప్పగించాలంటూ దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేడారం జాతర పనులకు సంబంధించిన టెండర్ల విషయంలోనే మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేని సుధాకరరెడ్డిల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ హైకమిండ్ కు లేఖ రాశారు.  ఇప్పుడు తాజాగా  మేడారం జాతర పనుల రికార్డులను ఆర్అండ్ బి శాఖకు అప్పగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేయడంతో.. కొండా సురేఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

కొండా సురేఖ నివాసం వద్ద అర్థరాత్రి హైడ్రామా

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం (అక్టోబర్ 15) అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు చర్యలలో భాగంగా  పోలీసులు జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ కొండా సురేఖ కుమార్తె  కొండా  సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  విషయమేంటంటే.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14) విధుల నుంచి తొలగించింది.   తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులైన సుమంత్‌  అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయనను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా   డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించిన తరువాత  సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి   వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు  మంత్రి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేచ శారు.  సుమంత్‌పై నమోదైన కేసు వివరాలు స్పష్టంగా చెప్పకుండా, అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ లోగా అక్కడకు మీడియా రావడంతో పోలీసులు వెనక్కు తగ్గారు.  ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు.  బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు.

హవ్వ.. రాష్ట్రానికి గూగుల్ జగన్ క్రెడిటేనంట?

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. కింద పడినా మాదే పై చేయి అని చాటుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న విన్యాసాలు నవ్వుల పాలౌతున్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అధ: పాతాళానికి దిగజారిపోయేలా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్తవి రాకుండా అడ్డగోలు విధానాలతో  అడ్డుకున్నారు. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి? జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి పోరుగు రాష్ట్రం మంత్రులే జోకులేసేలా అప్పట్లో రాష్ట్ర పరిస్థితి ఉండేది. అయినా సరే జగన్  మాత్రం అభివృద్ధి, సంక్షేమాలలో తామే మేటి అని నిస్సిగ్గుగా చాటుకునే వారు. అంతే కాదు.. జగన్ హయాంలో వీసమెత్తు అభివృద్ధి లేకపోయినా.. కొత్తగా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోయినా పట్టించుకునే వారు  కాదు కానీ, అంతకు ముందు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి మాత్రం అదంతా తమ క్రెడిటేనని చాటుకోవడానికి  వైసీపీయులుఇసుమంతైనా వెనుకాడే వారు కాదు. అనంతపురంలో కియా మోటార్స్ రావడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీ వేదికగా నిస్సిగ్గుగా కియా రాష్ట్రానికి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని చెప్పుకున్నారు. ఒక్క కియా అనేమిటి, తమ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అంతకు ముందు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఇసుమంతైనా సంకోచించేవారు కాదు.  ఇప్పుడు విశాఖలో గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వైసీపీ మళ్లీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రేయపడుతోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి జగనే కారకుడని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది.      వైజాగ్‌లోని తన ఏఐ  హబ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో   15 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని గూగుల్ మంగళవారం  అధికారికంగా ప్రకటించిన విషయం  తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి  అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో సంతకాలు జరిగాయి.  ఇంతటి స్థయిలో ప్రపంచ మేటి సంస్థ గూగుల్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ లపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఈ ఘనతను అంగీకరించలేక.. తనదైన శైలిలో ఫేక్ ప్రచారానికి తెగబడుతోంది.   చంద్రబాబు నాయుడు దార్శనికతకు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయన ఆచరణాత్మక విధానాలను రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థులు సైతం అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే వైసీపీ మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక ఫేక్ ప్రచారానికి దిగి నవ్వుల పాలౌతోంది.  గూగుల్ డేటాసెంటర్ విశాఖకు రాబోతోందనగానే.. వైసీపీ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనను తలకెత్తుకుంది. అయితే, ఆ ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోవడం.. చంద్రబాబు, లోకేష్ ల బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోవడంతో.. వైసీపీ ఇక కొత్త ప్రచారానికి తెరతీసింది. అదేమిటంటే.. రాష్ట్రానికి గూగుల్ తరలిరావడానికి జగనే కారణమనీ, ఇందులో చంద్రబాబు ఘనతేమీ లేదనీ తన భుజాలను తానే చరిచేసుకోవడం మొదలెట్టిది. ఇంతకీ వైసీపీ వాదనేంటంటే.. కొన్నేళ్ల కిందట జగన్ అదానీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ..  ఆ భేటీలోనే గూగుల్ డేటా సెంటర్  ఏపీకి తీసుకురావాలని జగన్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఫలించి ఇప్పుడు గూగుల్ వైజాగ్ కువచ్చింది. అయితే ఈ వాదన వైసీపీ నవ్వుల పాలు కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడలేదని పరిశీల కులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నసమయంలో  రాష్ట్రంలో ఒక్కకంటే ఒక్క ప్రధాన ఐటీ కంపెనీ వచ్చిదా?  అసలు ఏ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూసిందా? అంటూ జనమే వైసీపీ వాదనను పూర్వపక్షం చేస్తున్నారు.  నెటిజనులు వైసీపీ వాదనను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాజకీయ పరిశీలకులైతే.. వైజాగ్ కు గూగుల్ తరలిరావడం చంద్రబాబు ఘనతే అని వైసీపీ అంగీకరించలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చునని అంటూనే.. ఈ సమయంలో వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగకుండా మౌనం వహిస్తే ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకూ మంచిదని సలహా ఇస్తున్నారు.  

బీహార్ రాజకీయాల్లో లూలూ శకం ముగిసిందా?

బీహార్ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభావం కనిపించడం లేదా? అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. గతంలో అయితే  ఒక్క బీహార్ అనేమిటి దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే అంతర్జాతీయంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక జైగాంటిక్ పొలిటీషియన్. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ ది పుష్ప రేంజ్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అన్నట్లుగా ఉండేది.  రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో.. రైల్వేలను లాభాల బాట పట్టించారు. దీంతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ లాలూ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఒక పశువుల కాపరి కొడుకు.. ఇంతటి రేంజ్ కి ఎలా ఎదిగారు? అంటూ హార్వర్డ్  యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలు ఆయన జీవితాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకుని పరిశీలించాయి. అదీ అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టామినా. అయితే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ గా సొంత పార్టీలోనే ఇన్ సిగ్నిఫికెంట్ అయిపోయారు. అంతటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు కనీసం కుమారుడిని కూడా మందలించలేని, నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారు.    ఇప్ప‌టి వ‌ర‌కూ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన ప్ర‌త్య‌ర్ధులే   ఇర‌కాటంలో ప‌డేసేవారు.. ఇప్పుడు ఏకంగా ఆయన కుమారుడే పక్కన పెట్టేస్తున్నారు.  లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ అధినేతగా  పార్టీ  లీడ‌ర్ల‌కు ఇచ్చిన బీఫామ్స్ ను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ వెనక్కు తీసేసుకున్నారు.  అదేమంటే మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లోనే ప్రధాన  పార్టీ అయిన కాంగ్రెస్ ఇదేం ప‌ద్ధ‌తి? ఇంకా సీట్ల సర్దుబాటు కాకుండానే పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లు ఎలా ఇస్తారంటూ నిలదీయడమే కారణమంటున్నారు.  ఈ ఎన్నిక‌ల్లో గానీ ఆర్జీడీ పరిస్థితి ఏమాత్రం అటూ ఇటూ అయినా, అంటే పార్టీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకోలేకపోతే మాత్రం.. లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలుకుల విశ్లేషిస్తున్నారు.   ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ కెరీరే కాదు, ఆర్జేడీ ఉనికి కూడా నామమాత్రం అయిపోతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఓ రేంజ్, నేమ్ అండ్ ఫేమ్. బీహార్ ఒక స‌మోసాలాంటిదైతే లాలూ అందులో మ‌సాలాతో కూడుకున్న ఆలూ అన్న ఫేమ్ ఉండేది. అయితే కేసులు, జైలు, వయస్సు పైబడటం ఇత్యాది కారణాలతో అదంతా గతంగా మిగిలిపోయింది. ఇప్పుడు సొంత పార్టీలోనే, అందునా సొంత కుమారుడే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి నెలకొంది.  వాటీజ్ లాలూస్ బ‌యోగ్ర‌ఫీ అని ఒక లుక్కేసుకుంటే.. పాట్నా యూనివ‌ర్శిటీలో విద్యార్ధి నాయ‌కుడిగా మొద‌లైన లాలూ ప్ర‌స్థానం.. అంచెలంచెలుగా ఎదిగింది. జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ వ‌ద్ద శిష్య‌రికం చేసిన లాలూ.. ఎమ‌ర్జెన్సీ హ‌యాంలో ఇందిరాగాంధీకే చార్ట‌ర్ ఆఫ్ డిమాండ్స్ అందించిన ధీశాలిగా పేరు సాధించారు. అంతే కాదు 29 ఏళ్ల అతి పిన్న‌వ‌య‌సులోనే ఆయ‌న లోక్ స‌భ‌కు ఎంపిక‌య్యారు. కేవ‌లం ప‌దేళ్ల స‌మ‌యంలోనే ఆయ‌న బీహార్ రాజ‌కీయాల్లో న‌వ యువ శ‌క్తిగా ఎదుగుతూ వ‌చ్చారు. సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని విజ‌య‌ప‌థాన న‌డిపించారు. అంతేనా 1990లో సీఎం అయ్యారు. ఆర్ధికంగా ఎదుగుతోన్న బీహార్ పై ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిందంటే అర్ధం చేసుకోవ‌చ్చు లాలూ ఆర్ధిక‌ప‌రంగా ఎంత‌టి నిష్ణాతుడో. 1996లో బ‌య‌ట ప‌డ్డ రూ.950 కోట్ల‌ ప‌శుగ్రాస కుంభ‌కోణం ఆయ‌న జీవితాన్ని తారు మారు చేసేసింది. ఆ స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి ర‌బ్రీదేవిని ముఖ్య‌మంత్రి చేశారు లాలూ. 1997లో ఆయ‌న జ‌నతా ద‌ళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ ని ఏర్పాటు చేశారు. లాలూ అతి పెద్ద విజ‌యం రైల్వే మంత్రిగా ఉండ‌గా.. న‌ష్టాల్లో ఉన్న ఆ శాఖ‌ను లాభాల బాట ప‌ట్టించ‌డం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌పై అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక స‌మ‌యంలో కొన్ని అంత‌ర్జాతీయ యూనివ‌ర్శిటీలు.. రైల్వేలో లాలూ పాటించిన  యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌పై ప‌రిశోధ‌న‌కు దిగాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు ఆయ‌న శ‌క్తి  సామ‌ర్ధ్యాలు ఏపాటివో. అయితే లాలూ జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది మాత్రం.. దాణా కుంభ‌కోణ‌మ‌నే చెప్పాలి. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు జైలు శిక్ష  విధించింది. చివరిది, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.  ఒక ప‌శువుల కాప‌రి కొడుకు ఇంత‌టి అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గ‌డం.. భార‌త ప్ర‌జాస్వామ్యం సాధించిన విజ‌యం.. అంటూ ఆయ‌న త‌న‌కు తాను స్వ‌యంగా ఏషియా టైమ్స్ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో ఎలా చెప్పుకున్నారో. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప‌శువుల‌ దాణా కుంభ‌కోణంలో ఆయ‌న పీక లోతు కూరుకుపోవ‌డం ద్వారా..  త‌న ప‌త‌నాన్ని త‌నే శాసించుకున్నారని  చెప్పాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే రాజ‌కీయంగా ఎంతో అప్ర‌దిష్ట‌పాలైన లాలూ.. ప్ర‌స్తుతం త‌న కొడుకు నుంచి కూడా ఛీత్కార స‌త్కారాలు పొంద‌డం  ఆయన రాజకీయ జీవితంలో అతి పతనావస్థ అనే చెప్పాలి. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాలూను మళ్లీ పతాక స్థాయికి తీసుకెడతాయా, మరింత పతనావస్థలోకి దిగజార్చుతాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.  

జూబ్లీహిల్స్ బై పోల్స్.. మంటలు రేపుతున్న కన్నీళ్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో  దొంగ ఓట్ల వ్య‌వ‌హారంతో పాటు క‌న్నీటి  క‌థ‌లు కూడా భారీగానే న‌డుస్తున్నాయ్.  బీఆర్ఎస్ అభ్య‌ర్ధి మాగంటి సునీత త‌న భ‌ర్త‌ను త‌లుచుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారొక స‌భ‌లో. అయితే ఈ క‌న్నీటి క‌హానీలు కేటీఆర్, హ‌రీష్ కావాల‌నే ద‌గ్గ‌రుండి  నడిపిస్తున్న‌ారంటూ  కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు పొన్నం త‌దిత‌రులు. త‌మ‌కు సునీత మీద సానుభూతి ఉందంటూనే.. ఆమెను కావాల‌నే రెచ్చ‌గొట్టి  ఏడిపించి సీన్ క్రియేట్ చేస్తున్నది మాత్రం  హ‌రీష్, కేటీఆరే అంటూ విమర్శలు చేస్తున్నారు.   అస‌లు బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా సునీత‌ను నిలబెట్టిందే ఇందుకు అంటున్నారు.  వాస్తవానికి జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత పార్టీ అనుకున్న వ్యక్తులు వేరు అంటూ గుర్తు చేస్తున్నారు. జూబ్లీ బైపోల్ లో  బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలుత  కేటీఆర్ స‌తీమ‌ణి  శైలిమ పేరు, ఆ తరువాత   పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.  అయితే శైలిమ, విష్ణువర్దన్ రెడ్డిలలో ఒకరిని నిలిపినా.. జూబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందే కానీ, బీఆర్ఎస్ కు అవసరమైన సెంటిమెంట్ పండదన్న భావనతోనే మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని అంటున్నారు.   బేసిగ్గా బీఆర్ఎస్ ఆయువు ప‌ట్టు మొత్తం సెంటిమెంటులో దాగి ఉంటుంది. అయితే ప్రాంతీయ సెంటిమెంటు, లేకుంటే ఇదిగో ఇలాంటి సెంటిమెంట్లు ఆధారంగా వారు త‌మ కారు  న‌డిపిస్తుంటారు. ఎంద‌రో బ‌లిదానాల పునాదుల మీద క‌ట్టుకున్న పార్టీ క‌దా? అలాగే ఉంటుంద‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.   బీఆర్ఎస్ దంతా  ఎమోష‌న్ చుట్టూ ఆడే డ్రామానే అంటారు వారు. ఇవేవీ కాకపోతే.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును అప్పు తెచ్చుకుని మరీ ఆయనపై విమర్శలు గుప్పించి పబ్బంగడుపుకోవడం చూస్తున్నాం కదా అని ఎద్దేవా చేస్తున్నారు.   మొత్తం సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం ఉంటుందనీ, అటువంటి పార్టీకి అందివ‌చ్చిన అవ‌కాశంలా సునీత క‌న్నీళ్లు చెంత‌నే ఉంటే వాడుకోకుండా ఎలా ఉంటారు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  

క‌విత యాత్ర షురూ!

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన కల్వకుంట్ల క‌విత పార్టీ పెడ‌తారా? పెట్ట‌రా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నగా ఉన్నా.. కవిత ఈ ప్రశ్నకు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నారంటున్నారు పరిశీలకులు. ఆమె సొంతంగా పార్టీ పెట్టే ప్రయత్నంలోనే ఉన్నారనీ, అందుకే ఈ నెల చివరి వారంలో ఆమె తెలంగాణలోని అన్ని జిల్లాలనూ కవర్ చేసే విధంగా ఒక యాత్ర చేపట్టబోతున్నారనీ అంటున్నారు. ఆమె యాత్ర చేపట్టనున్నట్లు ఇప్పటికే ఖరారు చేశారు.  ఇక ఇంత‌కీ ఆ యాత్ర ఎలా జ‌ర‌గ‌నుంది? ఆ డీటైల్స్ ఏంట‌ని చూస్తే.. కల్వకుంట్ల కవిత తాను త్వరలో చేపట్టబోతున్న యాత్రలో ఎక్కడా కూడా తన తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించదంటున్నారు. ఇందుకోసం ఆమె తెలంగాణ సిద్ధాంతకర్త   ప్రొఫెసర్ జ‌య‌శంక‌ర్ త‌దిత‌రుల‌తో ఒక పోస్టర్ ను తీసుకువచ్చి.. దానినే ప్రముఖంగా తన యాత్రద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.   ఇలా ఎందుకు? అంటే..  తండ్రి కేసీఆర్  త‌న అన్న‌ కేటీఆర్ తో ఉన్నారు.  ఎంత కాదనుకున్నా వారిద్దరూ ఒక జట్టు.  దీనిని మార్చడం అసాధ్యం. అందుకే ఆమె సొంతంగా, స్వతంత్రంగా అడుగులు వేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం అవసరమైతే.. ఇంత కాలం తన పేరు ముందు ఉంచుకున్న పుట్టింటి ఇంటి పేరు కల్వకుంట్లను సైతం వద్దనుకునేలా ఆమె అడగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందు కోసమే పార్టీ నుంచి భౌతికంగా బయటకు వచ్చేయడంతో ఆగకుండా.. కల్వకుంట్ల కుటుంబానికి కూడా దూరం జరిగి.. తాను నేటి మహిళను, కావలసినంత ఆత్మవిశ్వాసం ఉంది అని నిరూపించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.   ఇక యాత్ర ఎందుకు అంటే.. ఇలా యాత్రలు చేసిన వారికి అధికార ఫలం దక్కుతుందన్న భావనతోనే అంటున్నారు.  నిన్న కాక మొత్త బతుకమ్మ సందర్భంగా తన తండ్రి సొంత ఊరు చింతమడకలో కవిత కన్నీటిపర్యంతమై భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో.. మాజీ మంత్రి హరీష్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇక ఇప్పుడు తన యాత్రలో కూడా అదే చేయనున్నారు. కుటుంబం నుంచి తనను వేరు చేశారన్న సెంటిమెంటు పండించడంతో పాటు.. ఉభయతారకంగా యాత్ర సెంటిమెంటు కూడా పండుతుందని కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  యాత్ర సెంటిమెంటు అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని కాదు. ఇక్క‌డా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్. ఇంత వరకూ కేవ‌లం అన్న‌ల‌కే ఈ సెంటిమెంటు వ‌ర్క‌వుట్ అయ్యింది.   చెల్లెళ్ల‌కు కాద‌ని  గ‌త అనుభ‌వాలు చెబుతున్నాయి.  జ‌గ‌న్, ష‌ర్మిళ ఇద్ద‌రూ యాత్ర‌లు చేశారు. కానీ అధికారం జ‌గ‌న్ కే   ద‌క్కింది. ఇక్క‌డ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?  లేక కవితకు కలిసివస్తుందా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.