బీఆర్ఎస్, బీజేపీ కుట్రే అంటున్న బీసీ సంఘాలు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుంద‌ని బీజేపీ  ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డికి ఎలా తెలుసు? అన్న ప్రశ్న  ఇప్పడు బీసీ సంఘాల నుంచి వస్తున్నది.  కాంగ్రెస్ లేస్త లేదు, బీఆర్ఎస్ స‌స్త లేదు, బీజేపీకి చూస్తే అవకాశం మంచిగుంది అంటూ  జీవోపై కోర్టు స్టే ఇవ్వ‌డానికి ఒక రోజు ముందు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అన్న మాట‌లేంటంటే.. కాంగ్రెస్ కోర్టులో పెద్దగా  కొట్లాడ‌దు కావాలంటే చూడండి అన్నారు. ఈ విష‌యం అంతగా ఆయ‌న‌కు ఎలా తెలుసు? అన్న‌దొక ప్ర‌శ్న కాగా.. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీసీ సంఘాల‌ కామెంట్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మ‌క్కై చేసిన కుట్ర‌గా అభివ‌ర్ణించారు. బీఆర్ఎస్ అప్ప‌ట్లోనే 50 శాతానికి మించ‌కుండా బీసీల‌కు చ‌ట్టం తీసుకొచ్చింద‌నీ, కేంద్రంలో ఉన్న బీజేపీ వీరికి మ‌రింత సహకారం అందిస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి బీసీ సంఘాలు. త‌మ‌కు లేక లేక ఒక అవ‌కాశం వ‌స్తే మా నోటికాడ కూడు లాగేసుకున్నార‌ని తీవ్రంగా మండి ప‌డుతున్నారు బీసీలు.  వీహెచ్ అయితే  నాలుగు వారాల వాయిదా అంటే  త‌మ‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన‌గా..  ఆర్ కృష్ణ‌య్య  బీసీల నోట్లో మ‌ట్టి కొట్టార‌ని.. మేం బందుకు పిలుపునిస్తున్నామ‌ని ప్రకటించారు. ఇక హైకోర్టులో ప్ర‌భుత్వ వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ లాయ‌ర్ ర‌వి వ‌ర్మ‌.. రాష్ట్రంలో 15 శాతం కూడా లేని ఓసీల‌కు ఎందుకు అంత రిజ‌ర్వేష‌న్ ఏం చేస్కుంటారు? అస‌లు మీకు 62 శాతంతో వ‌చ్చిన స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే 1990ల కాలంలో నాడు జ‌య‌ల‌లిత‌.. ఢిల్లీ వెళ్లి అక్క‌డ అప్పటి ప్రధాని పీవీ ముందు కూర్చుని నా రిజ‌ర్వేష‌న్ నాకు ఇస్తారా చ‌స్తారా అన్న‌ట్టు కొట్లాడార‌నీ, మ‌నం కూడా అలా వెళ్లి మోడీ ఇంటి ముందు కూర్చుందాం ర‌మ్మంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి గంగుల క‌మ‌లాక‌ర్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీఎంతో స‌హా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా క‌ల‌సి.. ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర అంత పెద్ద ధ‌ర్నా చేస్తే.. అప్పుడు బీఆర్ఎస్ ఎక్క‌డుందో చెప్పాల‌ని నిల‌దీశారు కాంగ్రెస్ లీడ‌ర్లు.  దేశంలోనే తొలిసారిగా మేం చిత్త‌శుద్ధితో కుల‌గ‌ణ‌న స‌ర్వే చేప‌డితే క‌నీసం పాల్గొన‌ని బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఒక అసెంబ్లీ తీర్మానం చేశాక,  అది కూడా అన్ని ప‌క్షాల మద్దతుతో ఏకగ్రీవ  ఆమోదం పొందిన‌ బిల్లును హైకోర్టు త‌ప్పు ప‌ట్ట‌డం, స్టే ఇవ్వ‌డం ఏమిటంటున్నారు కాంగ్రెస్ నాయకులు.   ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కుగానీ, రాష్ట్ర‌ప‌తి ద‌గ్గ‌ర‌కుగానీ పంపితే.. మూడు నెల‌ల్లోగా తేల్చేయాలి. ఒక వేళ అలా జ‌ర‌క్కుంటే ఆ బిల్లు ఆమోద‌యోగ్య‌మైన‌ట్టేన‌ని  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తేదీల‌తో స‌హా గుర్తు చేశారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క. ఇక మా చిత్త‌శుధ్దిని శంకించ‌డానికి బీఆర్ఎస్, బీజేపీలు స‌రిపోవ‌ని అన్నారు  టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. చేయాల్సిందంతా చేసి వారు ఇప్పుడు ఆడుతున్న ఈ నాట‌కాలు ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని మండిప‌డ్డారు మ‌హేష్ కుమార్ గౌడ్. ఇక మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ,  కాంగ్రెస్ 42 శాతానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఇది తెలంగాణ ఇవ్వ‌డంలో అయినా బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌లో అయినా ఒక‌టే విధానంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు మంత్రి వాకిటి. రేవంత్  త‌మ పాలిట దేవుడిలా ఈ రిజ‌ర్వేష‌న్ల బిల్లు తీసుకొచ్చార‌ని.. అయినా స‌రే వీరంతా క‌ల‌సి త‌మ నోటికాడ ముద్ద లాగేసుకున్నార‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు ఒక లేడీ లాయ‌ర్. సుప్రీంకైనా వెళ్లి.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు కాంగ్రెస్ క‌ట్టుబ‌డితే.. తామంతా క‌ల‌సి వ‌స్తామ‌ని అన్నారు బీసీ సంఘం నేత‌లు.  హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ఆపేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఈ దిశ‌గా ఒక గెజిట్ కూడా విడుద‌ల చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న ఎన్నిక‌ల కోడ్ కాస్తా ర‌ద్ద‌య్యింది.

నవీన్ యాదవ్ ద లోక‌ల్ బాయ్ ఆఫ్ జూబ్లీహిల్స్!

1978 నుంచీ జూబ్లీహిల్స్ స్థానికుల‌ లో కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న‌ది తాజాగా కాంగ్రెస్ నుంచి అభ్య‌ర్ధి న్న‌ న‌వీన్ యాదవ్ చేసిన కామెంట్. ఇంత‌కీ ఏంటీ జూబ్లీహిల్స్ హిస్ట‌రీ. ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో ఏ సెగ్మెంట్లో భాగంగా ఉండేది? ఆ డీటైల్స్ ఏంటి? అని చూస్తే.. ఇది 1952 లో ద్విస‌భ్య స‌భ‌గా ఉండేది. ఇక్క‌డ ఎస్సీ కేట‌గిరిలో ఒక‌రు, జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ఒక‌రు ఎంపిక‌య్యారు. వారెవ‌ర‌ని చూస్తే బ‌త్తులు సుమిత్రాదేవి ఎస్సీ కేట‌గిరి, న‌వాజ్ జంగ్ జ‌న‌ర‌ల్ కేట‌గిరి. ఆ త‌ర్వాత 1960లో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. ఈ ఎన్నిక‌లో సికింద్రాబాద్ కి చెందిన పార్సీ సంప‌న్నురాలు రోడా మిస్త్రీ గెలిచారు. 1962ఎన్నిక‌లోనూ ఆమే గెలిచారు. ఆ త‌ర్వాత ఈ సెగ్మెంట్ హిస్ట‌రీ 2009లో మొద‌లైన‌ట్టు తెలుస్తుంది. ఈ ఎన్నిక‌ల్లో పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి గెలిచారు. అప్ప‌టి వ‌ర‌కూ ఇది ఖైర‌తాబాద్ సెగ్మెంట్లో ఉండేది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2018, 2023లోనూ ఆయ‌నే గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మాగంటి సైతం ఈ ప్రాంతానికి స్థానికులేం కాదు. ఆయ‌న హైద‌రాబాద్ లోని హైద‌ర్ గూడ నివాసి. దీంతో న‌వీన్ యాద‌వ్ అన్న‌ట్టు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికులు ఎమ్మెల్యేగా అయ్యిందే లేదు. మొన్న కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన అజ‌ర్ సైతం ఇక్క‌డి వారు కారు. మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంద‌న్న కోణంలో ఈ ప్రాంతం నుంచి ఆయ‌న్ను పోటీకి దింపారు అధిష్టానం పెద్ద‌లు. ఇప్పుడు తొలిసారి న‌వీన్ యాద‌వ్ తానీ ప్రాంత స్థానికుడిననీ.. మీ బిడ్డ‌ను గెలిపించాలనీ కోరుతున్నారు. అర్ధశతాబ్దం నుంచీ జూబ్లీహిల్స్ లో అన్యులు రాజ్య‌మేలుతున్నార‌నీ.. మీ ఇంటి త‌మ్ముడు మీరు పిలిస్తే ప‌ల‌క‌డానికి యూస‌ఫ్ గూడ చెక్ పోస్టులోని నా ఆఫీసు త‌లుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయ‌నీ.. మీకంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని అంటున్నారాయ‌న‌. అంతే కాదు ప‌దేళ్ల పాటు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేయ‌లేని పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక మాత్రం చేస్తుందా? అన్న లాజిక్ లాగుతున్నారు. త‌న‌పై పెట్ట‌ిన‌వ‌న్నీ ఫాల్స్ కేసుల‌నీ.. అవ‌న్నీ వీగిపోతాయి కాబ‌ట్టి.. చ‌దువుకున్న వాడ్ని.. స్థానికుడ్ని.. నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటి మ‌నిషిగా ఉంటూ.. మీకు అన్ని ప‌నులు చేసి పెడతానంటున్నారు న‌వీన్ యాద‌వ్.

ఏంటీ ఓసీల‌కు కూడా రిజర్వేషన్లా వెంకటరమణా!?

కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ కావాలంటున్నారాయ‌న‌. ఇప్ప‌టికే బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ మీదున్న అప‌వాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధ‌ర్మ‌పురి అర‌వింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు  బీజేపీ మీద‌ యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.   రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీఆర్ఎస్..  బీసీల‌కు వ్య‌తిరేకంగా యాభై శాతం క్యాప్ చ‌ట్టం తేగా..  తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన‌   బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఢిల్లీకి వెళ్లి అక్క‌డ నిర‌స‌న వ్య‌క్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోంద‌న్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.  కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.   మొన్న‌టికి మొన్న కామారెడ్డికి వ‌ర‌ద వ‌చ్చిన‌పుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయ‌లేను క‌దా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి.. మ‌రోమారు త‌న వితండ వాద‌న వెలుగులోకి తేవ‌డంతో.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయ‌న్న హెచ్చ‌రిక‌లు అందుతున్నాయ్. ఓబీసీల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేద‌ని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేద‌లుంటారు కాబ‌ట్టి,  తాము ఆటంక‌ప‌ర‌చ‌లేద‌న్న కామెంట్ చేశారు వీహెచ్.   56 శాతం గా ఉన్న బీసీల ప్ర‌యోజ‌నాల‌ను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వ‌డం వెన‌కున్న శ‌క్తులు త్వ‌ర‌లోనే బ‌య‌ట ప‌డ‌తాయ‌ని అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులు, ఇత‌ర బీసీ సంఘాల వారు. ఇప్ప‌టికే బీజేపీ మీదున్న నింద‌లు చాల‌వ‌న్న‌ట్టు వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వంటి వారు బీజేపీని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేస్తున్నార‌నీ.. ఇది విప‌రీత అర్ధాల‌కు దారి తీసి పార్టీని మ‌రోమారు పుట్టి ముంచినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు కొంద‌రు కాషాయ పార్టీ లీడ‌ర్లు. అనువుగాని చోట అధికుల‌మ‌న‌రాద‌న్న సామెత‌లు గుర్తు చేస్తున్నారు.

ఇచ్చిన సొమ్ముకు డబల్ అంటూ రూ.20 కోట్లకు టోకరా!

హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య అనే మహిళ తన భర్త రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఏపీ కి చెందిన ఒక్క ఎమ్మెల్యే  పిఏ నుండి 2వేల కోట్లు వస్తున్నాయని... 2వేల కోట్లు కోసం కంటైనర్లు కొనాలని  వివిధ ప్రాంతాలకు చెందిన మహిళ లను మోసం చేసి కోట్లులో డబ్బులు వసూలు చేసింది. ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పి... అమాయక మైన జనాలను నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. కొంతమంది వద్ద బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మ బలికింది. ఇలా కూకట్ పల్లి, కెపిహెచ్ బి కాలనీ, మియాపూర్ మొదలగు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు కట్టు కథలు చెప్పి వారి వద్ద నుండి బంగారం, సొమ్ములు వసూలు చేసి ఏకంగా 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది.   అనంతరం పటాన్ చెరుకు మకాం మార్చేసింది. తీసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆమెను నిలదీశారు.  దీంతో శ్రీవిద్య వారినందరినీ.. గురువారం సాయంత్రం తన నివాసానికి రమ్మని.. వచ్చిన ఎనిమిది మంది మహిళలను ఒక గదిలో బంధించి, భర్త రాజశేఖరరెడ్డి, తమ్ముడు, పనిమనిషి,  ముగ్గురితో దాడి చేయించింది. ఈ దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై విద్య మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ హైకోర్టులో రేవంత్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో 9పై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి.వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం (అక్టోబర్ 9)న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ..  57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలిందనీ,  బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు నివేదిక ఎందుకని వాదించారు. అలాగే రిజర్వేషన్ల బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదన్నారు. అలాగే నిర్ణీత గడువులోగా గవర్నర్‌  ఆమోదించకపోతే దానిని చట్టంగా భావించాల్సి ఉంటుందని వాదించారు. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చిన  సుదర్శన్‌ రెడ్డి, నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుందని వివరించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరని వాదించారు. తెలంగాణ ప్రభుత్వం  రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో  తెచ్చిందని వాదించారు. 

బీహార్‌లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : తేజస్వి యాదవ్

  బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీనికి సంబంధించి చట్టం తీసుకువస్తామని పేర్కొన్నారు. 20 నెలల్లోపు నిరుద్యోగం లేని బీహార్‌ను చూపిస్తామని స్పష్టం చేశారు.  యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ సర్కార్ నిరుద్యోగ భృతి ఇస్తోందని తేజస్వి విమర్శించారు. మరోవైపు బీహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది సాధ్యమయ్యే విషయమే కానీ, దానికి బలమైన సంకల్పం అవసరమని అన్నారు. తమ హామీలను ఎన్డీఏ కూటమి నకలు చేస్తోందని విమర్శించారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6 మరియు 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఒక వైపు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, మరో వైపు ఎన్నికల వ్యూహకర్త మరియు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూడా తన పార్టీ తరఫున పోరాటానికి సిద్ధమవుతున్నారు.

జూబ్లిహిల్స్ బైపోల్.. న‌వీన్ యాద‌వ్ గెలుపు అవకాశాలెంత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా న‌వీన్ యాద‌వ్ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.  న‌వీన్ యాదవ్ బ‌ల‌మైన నేత కావ‌డం వ‌ల్లే.. ఆయ‌న‌పై కేసులు పెడుతున్నార‌ని  టీపీసీసీ చీఫ్‌ మ‌హేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్క‌డ కాంగ్రెస్ కి, న‌వీన్ కి ఉన్న గెలుపు అవ‌కాశాలెన్ని అన్న చర్చ అయితే ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిన్నా, మొన్నా అని కాదు.. గత కొన్నేళ్లుగా ఆయనీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.  పండ‌గేదైనా స‌రే ఈ సెగ్మెంట్ లో గ‌త కొన్నాళ్లుగా నవీన్ యాదవ్  హ‌డావిడి హంగామా కనిపిస్తోంది.  ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సామూహిక శీమంతాలు జ‌రిపించారు న‌వీన్ యాదవ్.  నవీన్ యాదవ్  విద్యావంతుడైన యువ‌కుడు కూడా కావ‌డంతో యూత్ ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఎంత పలుకుబడి, ఫాలోయింగ్ ఉన్నా కూడా నవీన్ యాదవ్ కు రెండుమూడు అంశాల్లో  మాత్రం  సవాళ్లు ఎదురౌతున్నాయి.  ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్క‌డ ముస్లిం మైనార్టీలు ఎక్కువ‌. అందుకే ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గోపీనాథ్ పై అజారుద్దీన్ ను నిలబెట్టింది  కాంగ్రెస్. కానీ ఎందుక‌నో తెలీదు గ‌త కొంత కాలంగా ఇక్క‌డి ఓట‌ర్లు బీఆర్ఎస్ కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. దానికి తోడు కాంగ్రెస్ సైతం మైనార్టీల్లో ఎవ‌రికీ ఇంత వ‌ర‌కూ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అజ‌ర్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై హోం మంత్రిత్వం ఆయ‌న‌కు క‌ట్ట‌బెడ‌తార‌న్న మాట వినిపించింది. ఈ ఎన్నిక‌ల‌క‌న్నా ముందే కాంగ్రెస్ ఆప‌ని చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. కానీ అలా చేయలేదు. ఇక రేవంత్ కేబినెట్ లో  ఒక్క ముస్లింకి కూడా చోటు దక్కలేదన్న అంశంపై   బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని ఎండ‌గ‌డుతోంది. దానికి తోడు సిటీలో బీఆర్ఎస్ ప్ర‌భావం  ఎక్కువ‌. ఆ ప్రభావాన్ని ఎదుర్కొని  న‌వీన్ యాద‌వ్ జూబ్లిహిల్స్ లో నెగ్గుకు రావ‌డం సాధ్య‌మేనా? అని రాజకీయవర్గాలు అంటున్న పరిస్థితి. వీటికి తోడు సిటీలో హైడ్రా ఎఫెక్ట్ కూడా ఎక్కువే. ప్ర‌త్యేకించి జూబ్లిహిల్స్ సెగ్మెంట్లో హైడ్రా పెద్ద న‌ష్టం క‌లిగించ లేదు. కానీ హైడ్రా ఫ‌స్ట్ ఆప‌రేష‌న్ ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత ఘ‌ట్టం జ‌రిగింది ఇక్క‌డే.  దీంతో ఒక ర‌క‌మైన కాంగ్రెస్ వ్య‌తిరేక‌త అంత‌ర్లీనంగా ఉందీ ప్రాంతంలో. ఆ త‌ర్వాత బీఆర్ఎస్ గ‌తంలో ప్ర‌వేశ పెట్టిన బ‌స్తీద‌వాఖాన వంటి వాటిని కాంగ్రెస్ స‌రిగా నిర్వ‌హించ‌డం లేద‌న్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది. ఇలాంటి వాటి ద్వారా కూడా న‌వీన్ యాద‌వ్ కి వ్య‌తిరేక‌త ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. ఆపై అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ఎదుర్కోబోతున్న‌ మాగంటి సునీత‌ గోపినాథ్ స‌తీమ‌ణి. దీంతో నవీన్ యాదవ్   సెంటిమెంటును   జ‌యించాల్సి ఉంటుంది. మ‌హిళా ఓట‌ర్లు  ఎప్ప‌టిలాగానే అటు వైపు మ‌ళ్లితే న‌వీన్ యాద‌వ్ ఇప్ప‌టి వ‌ర‌కూ లేడీ సెంటిమెంట్ గ్రాబ్ చేయ‌డం కోసం చేసిన ప్ర‌య‌త్నమంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. ఇక ఫైన‌ల్ గా కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్. కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్త‌వ‌మే. కానీ అదంటే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌. అదే ఇప్పుడు పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చి సుమారు రెండేళ్లు. ఈ కాలంలో కొంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన మాట వాస్త‌వం. వీట‌న్నిటినీ త‌ట్టుకుని న‌వీన్ యాద‌వ్ జూబ్లి కింగ్ కావ‌ల్సి ఉంది. మ‌రి ఆయ‌న ఓన్ చ‌రిష్మాతో ఇన్ని వ్య‌తిరేకతలను ప‌రిస్థితుల‌ను నెగ్గుకు రాగ‌ల‌రా? అన్న‌ది తేలాలంటే న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ రోజే ఈ ఉప ఎన్నిక ఫ‌లితాలు వ‌స్తాయి కాబ‌ట్టి.

ఇదెక్కడి చోద్యం?.. విమర్శల్లోనూ వివక్షా?

ఈ యాక్టివిస్టులున్నారే! త‌న మ‌న బేధాలు పాటించ‌డం వీరికి పెన్నుతో పెట్టిన విద్య‌. వివ‌క్ష చూప‌డం అన్న‌ది వీరికి మైకుతో వ‌చ్చిన ఆర్టు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు కేంద్రంగా రెండు ప్ర‌ధాన దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. వాటిలో మొద‌టిది.. క‌రూర్ లో జ‌రిగిన‌  తొక్కిస‌లాట కాగా.. మ‌రొక‌టి  త‌మిళ‌నాడులో త‌యారు చేసిన దగ్గుమందు కార‌ణంగా మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ లో కొంద‌రు పిల్ల‌లు చ‌నిపోవ‌డం. వీటిపై మ‌న ద‌గ్గ‌రున్న యాక్టివిస్ట్ బ్యాచ్ క‌నీపం స్పందించలేదు.  అదే   బీజేపీ  కూట‌మి పార్టీ నేత‌లు చేసే త‌ప్పొప్పుల మీద వీళ్ల బాదుడు.. ఒక రేంజ్ లో ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైర‌ల్ జ్వ‌రాన్ని కూడా వ‌ద‌ల‌కుండా వాయించేస్తారు. అదే విజ‌య్ కరూర్ రోడ్ షో కారణంగా  41 మంది చ‌నిపోయారు. అయితే ఈ సంఘటనపై సోకాల్డ్ యాక్టివిస్టులు కనీసం స్పందించను కూడా స్పందించలేదు.  అదే బీజేపీ కేంద్రంగా ఏదైనా చీమ చిటుక్కుమ‌న్నా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తుమ్మినా ద‌గ్గినా కూడా వీరి యాంటీ ర్యాగింగ్ క్యాంపెయినింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ మాట‌కొస్తే మొన్న మోడీ మ‌ణిపూర్ కి వెళ్లిన‌పుడు కూడా ఘ‌ట‌న జ‌రిగిన ఇన్ని రోజుల‌కు, ఇన్ని గంట‌ల‌కు, ఇన్ని గ‌డియ‌ల‌కు ఆయ‌న‌క్క‌డ‌కు వెళ్ల‌డ‌మా అంటూ సెక‌న్ల‌తో స‌హా లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీసి మ‌రీ పోస్టులు పెట్టారీ పెద్ద మ‌నుషులు. అలాంటిది విజ‌య్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించడంపై ఎందుకు స్పందించడంలేదు?  అంటే ఇక్క‌డే ఉంది అస‌లు లాజిక్కు.. ఇక్క‌డ విజ‌య్ కూడా సేమ్ టూ సేమ్ వీరిలాగానే బీజేపీని వ్య‌తిరేకిస్తారు కాబట్టి.  త‌న సినిమాలో సీన్లు పెట్టిమ‌రీ ఆయ‌న యాంటీ బీజేపీ వాయిస్ వినిపిస్తారు కనుక.  తాజాగా త‌మిళ‌నాడు కు చెందిన ఒక కంపెనీ త‌యారు చేసిన విష‌పూరిత ద‌గ్గుమందు ద్వారా పిల్ల‌లు చ‌నిపోతే.. అదేంటో తెలీదు జ‌స్ట్ ఆస్కింగ్ ప్ర‌కాష్ రాజ్ ప‌త్తా లేరు. ఇక డీఎంకే ద్వారా ఎంపీ అయిన క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించ‌రు. ఇక స‌నాత‌న ధ‌ర్మం అంటే విరుచుకుప‌డే స‌త్య‌రాజ్ మాట పెగ‌ల‌దు. అంటే ఇక్క‌డ వివ‌క్ష‌పై పోరాటం చేసే ఈ యోధాను యోధుల గ‌ళం, క‌లం కొన్నిసార్లంతే అదేంటో తెలీదు.. ఆటోమేటిగ్గా మూగ‌పోతాయి. వీరి దృష్టిలో కరూర్ తొక్కిసలాట అయినా, దగ్గుమందు వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అయినా  య‌ధాలాపంగా జరిగినవే. గ‌ట్టిగా నిల‌దీస్తే.. వీటి వెనుక కూడా  బీజేపీ కుట్ర అంటూ బుకాయించినా ఆశ్చ‌ర్యం లేదు. ఇదే ప్ర‌కాష్ రాజ్ అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల‌దోసి మ‌రీ అక్క‌డ రామ మందిరం నిర్మించారని తీవ్రఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తారుగానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ కూలిన దేవాల‌యాల సంఖ్య అస్స‌లు ప‌రిగ‌ణ‌లోకి తీస్కోరు.  ఇక దేవుడు లేనే లేడ‌నే క‌మ‌ల్ హాస‌న్ కి విజ‌య్ పార్టీ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట కార‌ణంగా పోయిన ప్రాణాల‌కు విలువ లేన‌ట్టే బిహేవ్ చేస్తారు. ఆపై త‌మ రాష్ట్రంలో త‌యారైన ద‌గ్గు మందు కార‌ణంగా చ‌నిపోయిన పిల్ల‌ల విషయంలో అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్లుగా  స‌త్య‌రాజ్ సైలెంటైపోతారు. ఇక్క‌డ కూడా అంతే తెలుగులో కొంద‌రు యాక్టివిస్టులుంటారు. వీరు కూడా కేవ‌లం హిందుత్వ‌, ఎన్డీయే, కూట‌మి ద్వారా జ‌రిగే త‌ప్పొప్పుల మీద మాత్ర‌మే దృష్టి సారిస్తారు. మిగిలింది ఏమైనా  కానీ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తారు. ఇదెక్క‌డి విడ్డూర‌మో అర్ధం  కాదంటారు కొంద‌రు సామాజిక‌వేత్త‌లు.

మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ కే!

జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్  టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు.   అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే..  ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల రూట్ మ్యాప్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం  విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.  నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు. 

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్!

   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.  మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో  జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్‌ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది.  2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో  మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  

బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య  తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్  కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట.  అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ,  ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.  అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.   గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.   దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా. అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే  ఇందుకు బీజేపీ అవకాశాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన  సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది.  సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని  యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు. మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

జ‌గ‌న్ హెలికాప్ట‌ర్ వివాదం

జ‌గ‌న్ విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జ‌గ‌న్ స‌హా ప‌ది వాహ‌నాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేష‌న‌ల్ హైవే మీద వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. రోడ్ షోలు, జ‌న‌స‌మీక‌ర‌ణ చేస్తే ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా ఆపేస్తామ‌ని ష‌ర‌తులు విధించారు. అయితే రోడ్డు మార్గంలో జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నం వెళ్లేందుకు మాత్రం అనుమ‌తి లేద‌న్నారు అన‌కాప‌ల్లి ఎస్పీ. అయితే అనుమ‌తులు లేకున్నా స‌రే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జ‌రిగి తీరుతుందంటున్నారు వైసీపీ నేత‌లు.  జగన్‌ పర్యటన రోజు అక్టోబ‌ర్ 9న‌, విశాఖలో మహిళల ప్రపంచకప్‌   మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు విశాఖ సీపీ. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేష‌న‌ల్ హైవే బ్లాక్‌ అవుతుందని.. అలా జ‌రిగితే  తమిళనాడులోని క‌రూరులో  విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేద‌ని సీపీ తెగేసి చెప్పారు. కాబ‌ట్టి జ‌గ‌న్ కి హెలికాప్ట‌ర్ లో వెళ్ల‌ాలని సూచించారు.  అయితే  హెలికాప్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌కైతే ఓకే అంటున్న పోలీసుల తీరును  వైసీపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అదే ప‌నిగా హెలికాప్ట‌ర్ ప్ర‌స్తావ‌న చేస్తున్నారంటే ఇందులో మ‌రేదో కుట్ర కోణం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. అయితే గ‌త రాఫ్తాడు ప‌ర్య‌ట‌న‌లోనూ జ‌గ‌న్ చాప‌ర్ వివాదం సంగ‌తి తెలిసిందే.  జ‌గ‌న్ చాప‌ర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దానిపైకి కూడా జ‌నం దూసుకొచ్చేశారు. దీంతో ఆ చాప‌ర్ పైల‌ట్ జ‌గ‌న్ లేకుండానే తిరిగి వెళ్లిపోయాడు. ఏది ఏమైనా జగన్ పర్యటన వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. అసలు అధికారం కోల్పోయిన తరువాత జగన్ చేపట్టిన ప్రతి పర్యటనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు 

జగన్ రోడ్ షోకు నో పర్మిషన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనకు రోడ్డు మార్గంలో అనుమతి లేదని అనకాపల్లి పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల  తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాన సంఘటనను పేర్కొంటూ.. జగన్ రోడ్ షోకు అనకాపల్లి పోలీసులు అనుమతి నిరారించారు. అయన వైజాగ్ నుంచి  నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. అసలింతకీ విషయమేంటంటే.. జగన్ గురువారం (అక్టోబర్ 9) విశాఖకు 63 కిలోమీటర్ల దూరంలో ఉనన వాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఇందు కోసం ఆయన వైజాగ్ నుంచి రోడ్ మార్గం ద్వారా 53 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు.  త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని తప్పుపడుతున్న జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌ క‌వ‌ర్గం లోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని   ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌నీ అన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించిన జగన్.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ,  ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. అయితే జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కావాలంటే. విశాఖ నుంచి హెలికాప్టర్ లో మాకవర పాలెం వెళ్లాలని సూచించారు.  అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా రోడ్ షో జరుగుతుందంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రోడ్డు మార్గంలోనే వెడతానంటూ పట్టుబట్టడం వెనుక శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న కుట్ర కోణం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  

బీహార్ ఫ‌లితాల‌తో ఓట్ చోరీ.. ఆరోపణల నిగ్గు తేలనుందా?

అటు బీహార్  ఎన్నిక‌తో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  షెడ్యూల్ కూడా విడుద‌లైంది. న‌వంబ‌ర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడ‌త‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. అదే నెల 14న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓట‌ర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగ‌తేంట‌ని చూస్తే.. న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నుండ‌గా.. 21 తుదిగ‌డువు. 22వ తేదీ ప‌రిశీల‌న‌, 24వ తేదీ ఉప‌సంహ‌ర‌ణ‌. కాగా న‌వంబ‌ర్ 14న ఈ ఉప‌ ఎన్నిక ఫ‌లితం కూడా తేల‌నుంది.  ఈ రెండు ఎన్నిక‌లు కాంగ్రెస్ కి ఎంత కీల‌క‌మంటే.. ఒక ప‌క్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చారం చేయ‌డంతో పాటు బీహార్ లో ప్ర‌త్యేకించి ఆయ‌న యాత్ర నిర్వ‌హించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌డంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేష‌న్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే య‌త్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై  రియాక్ట‌యిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాల‌తో స‌హా కంప్ల‌యింట్  చేయాల‌ని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని  వారించారు. తాను ప్ర‌త్యేకించీ ఆధారాలు చూపించ‌న‌క్క‌ర్లేద‌నీ.. త‌న ప్రెజంటేష‌న్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.  ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చార‌మంతా కూడా బీహార్ ఎన్నిక‌ల‌ను  దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయ‌న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్ర‌చారం జ‌నం న‌మ్మారా లేదా? అన్న‌ది ఈ ఎన్నిక‌ల ఫ‌లితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు.  కాబ‌ట్టి ఈ రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలను బ‌టి కాంగ్రెస్  ఎలిగేష‌న్లు జ‌నం సీరియ‌స్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.  ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా మాగంటి స‌తీమ‌ణి సునీత‌ను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా  కాంగ్రెస్ కి అగ్ని ప‌రీక్షేనని చెప్పాలి. రేవంత్ స‌ర్కార్ హైద‌రాబాద్ లో హైడ్రా ప్ర‌యోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ..  జ‌నం మాత్రం బ్యాడ్ గా ఫీల‌వుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి  తోడు హ‌రీష్ రావ్ ఇక్క‌డ ఎక్కువ‌గా ఉన్న మైనార్టీ  ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని..  ఈ క‌మ్యూనిటీకి ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ఆపై ఇక్క‌డ అధికంగా ఉండే  సినీ జ‌నం, అందునా  ఎక్కువ‌గా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం. వీట‌న్నిటినీ  క‌వ‌ర్ చేయ‌డానికి మాగంటి సామాజిక వ‌ర్గం స‌రిపోతుంద‌ని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు త‌మ‌కు న‌ల్లేరు  న‌డకే అన్న ఊహ‌ల్లో ఉంది గులాబీ దండు.  అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్ట‌కేల‌కు జూబ్లీహిల్స్  ద్వారా మ‌రో కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్ చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ అయితే ఈ సీటు ఎలాగైనా స‌రే కైవ‌సం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫ‌రండంగా మార‌నున్నాయ‌నే అంటున్నారంతా. మ‌రి చూడాలి.. ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వ‌స్తాయో తెలియాలంటే మ‌నం న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

దేశం అభ్యంతరాలు బేఖాతర్.. మిథున్ రెడ్డికే కేంద్రం ఇంపార్టెన్స్!

తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత సరే.. అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔనని అనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన మిథున్ రెడ్డికి ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీకి వెళ్లే భారత ప్రతినిథుల బృందంలో చోటు కల్పించింది. తనకీ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మిథున్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ణతలు తెలిపారు. అంతే కాదు.. ఆ బృందంలో ఇటా చోటు దక్కగానే, అలా  పాస్ పోర్టు కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.   ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి అత్యంత కీలకమైనఅంశాలపై చర్చించే వేదిక అయిన ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉండి, ఇటివలే బెయిలుపై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి  చోటు కల్పించడంపై తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మిథున్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా.  అదలా ఉంటే ఐరాసా జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలక మద్దతు దారుగా ఉన్న తెలుగుదేశం నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.  చోటు దక్కకపోవడం అటుంచి.. మిథున్ రెడ్డి ఎంపికను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా కేంద్రం పెద్దలు లెక్క చేయలేదు. నిందితుడు మాత్రమే కదా.. నేరం రుజువు కాలేదుగా అంటూ తేలిగ్గా తీసుకున్నారు.  గతంలో అంటే 2014లో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అప్పట్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే కేంద్రం ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

బిహార్‌ ఎన్నికల సర్వే... గెలుపు ఎవరిదంటే?

  బిహార్‌లో ఎన్డీయే కుటమి ఘన విజయం సాధిస్తుందని మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్‌లో వెల్లడైంది. ఎన్డీయే కూటమి బీజేపీ, జేడీయూకి 150-160 సీట్లు గెలిచి అధికారన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సర్వేపోల్‌ వెల్లడించింది. మహాఘట్‌బంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెప్ట్ పార్టీలు 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్ 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్, జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది. బీజేపీ 80-85, జేడీయూ 60-65 సీట్లు గెలుచుకోవచ్చు అని అంచన వేస్తున్నారు. ఆర్జేడీకి 60-65, కాంగ్రెస్‌కి 15-20 అసెంబ్లీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఒపినియన్ పోల్‌ తెలిపింది.  బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

నవంబర్ 11న జూబ్లీ బైపోల్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ బైపోల్ వచ్చే నెల 11న జరగనుంది.  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13న ఎ  నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుదిగడువు.  22న నామినేషన్ల పరిశీలను ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్  14న ఫలితం వెలువడుతుంది.  జూబ్లీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ  ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని నియమించింది. జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి,  ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత  రేసులో ఉన్నారు.  ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే జూబ్లీ ఉప ఎన్నికలో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది.  ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలెట్టేశారు.  ఈ తరుఏణంలో  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నలుగురి పేర్లతో ఓ జాబితాను ఏఐసీసీకి సమర్పించింది. ఈ జాబితాలో   నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సి.ఎన్‌. రెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా పీసీసీ ప్రతిపాదించిన ఈ పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం చర్చించారు.  మూమూలుగా అయితే ఆశావహులు అధికంగా ఉంటే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలు చివరి నిముషం వరకూ ఎటూ తేల్చకుండా నాన్చడం కద్దు. అయితే అలా నాన్చడం అసెంబ్లీ, జనరల్ ఎలక్షన్లలో అయితే ఓకే కానీ, ఒకే ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అలా నాన్చడం వల్ల  మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిక జరిగేది ఒకే నియోజకవర్గానికి కావడంతో  ప్రచారం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. అభ్యర్థిని ఎంత త్వరగా ప్రకటిస్తే అంత త్వరగా ప్రచారం ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానంపై అభ్యర్థి ప్రకటన చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అటు బీజేపీ శ్రేణులు సైతం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు. 

బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల...జూబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడంటే?

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నాట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటాయని ఈసీఐ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.  ఈ నెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22న చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 24. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, ఝార్ఖండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్‌, పంజాబ్‌లోని తర్న్‌తారన్‌, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్‌, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమీషన్ పేర్కొన్నాది