చరిత్ర సృష్టించిన భారత్

        ఆస్ట్రేలియాపై ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు లో భారత్ ఆరు వికెట్లతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 80ఏళ్ల భారత్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద సిరీస్ విజయం. చివరిసారిగా 1993-94లో ఇంగ్లండ్‌పై అజహరుద్దీన్ టీం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్', రవిచంద్రన్ అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' వరించాయి.   తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టంతో 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 6 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఇషాంత్(0),ఓజా(0) వెను వెంటనే ఔటయ్యారు. దీంతో భారత్ తొలిఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసి 10 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 164 పరుగులకే ఆలౌట్ అయి, భారత్ ముందు 155 పరుగులు విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ ఆటగాడు సిడల్ ఒంటిపోరాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిడిల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కోవాన్(24),వేడ్(19) స్మిత్(18) పరుగులు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లు జడేజాకు ఐదు వికెట్లు, అశ్విన్, ఓజాకు చెరో రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కాయి. తర్వాత 155 పరుగుల విజయమే లక్ష్యంగా ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పుజారా (82)పరుగులు, ధోని(11) పరుగులతో నాటౌట్‌గానిలిచారు.

ఢిల్లీ టెస్ట్: భారత్ లక్ష్యం 155

        ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్ట్ మూడో రోజు 266/8తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. లియోన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్, సిడిల్, పాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆతరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వార్నర్, మాక్స్‌వెల్‌లు ఆరంభంలోనే అవుటయ్యారు. మాక్స్‌వెల్, వార్నర్‌ జడెజా ఆవుట్ చేసి ఆదిలోనే దెబ్బ తీశాడు. కొవాన్, హ్యూస్ క్రీజులో నిలకడగా అడే ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. కేవలం 53 పరుగులకే ఆసీస్ ఐదు కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వేడ్, స్మిత్‌లు కాసేపు నిలకడగా ఆడారు. అనంతరం స్మిత్(18) జడెజా బౌలింగులో ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్సన్ పరుగులేమీ చేయకుండానే క్రీజు వదిలాడు. ఆ తర్వాత వేడ్(19) ఓజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 157 పరుగుల వద్ద పాటిన్సన్(11) రూపంలో తొమ్మిదో వికెట్ పడిపోయింది. సిడిల్(50) ఒక్కడే రాణించాడు. తోమ్మిదో నెంబరులో వచ్చి రెండు వరుస అర్ధసెంచరీలు చేసిన ఘనత సిడిల్‌కి దక్కింది. 164 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి వికెట్ కోల్పోయింది. జడెజా ఐదు, ఓజా, అశ్విన్‌లు చెరో రెండు, ఇషాంత్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ లక్ష్యం 155 పరుగులు.

అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ప్రజ్ఞాన్ ఓజా

  ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టేస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఓజా 22 టెస్టు మ్యాచుల్లో 100వ వికెట్ గా జేమ్స్ పాటిన్సన్ విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ ద్వారా అవుట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. మూడవ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఎర్రపల్లి ప్రసన్న 20 టెస్టులు, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 21 టెస్టు మ్యాచుల్లో 100 వికెట్లు తీసినవారిలో ఉన్నారు. ఇండియా తరపున వంద వికెట్లు పడగొట్టిన వారిలో ఓజా 18వ వాడుగా, ప్రపంచ క్రికెట్ చరిత్రలో 163వ ఆటగాడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం బౌలర్ గా ఓజా ఇండియా తరపున ఐదవ ఆటగాడు కాగా అంతకుముందు ఇండియా తరపున వంద టేస్ట్ వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, వినూ మన్కడ్, రవి శాస్త్రి, దిలిప్ దోషి ఉన్నారు.

ఢిల్లీ టెస్ట్: ఆస్ట్రేలియా 63/1

        ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దీగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ పరుగులేమీ చేయకుండా ఇషాంత్ శర్మ బౌలింగులో అవుటయ్యాడు. నాలుగు పరుగుల స్కోరు వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ కు గాయకావడంతో ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా వాట్సన్ ను నియమించారు. గాయం కారణంగా శిఖర్ ధావన్ దూరం కావడంతో భారత్ ఓపెనర్‌గా అజింక్యా రహనేకు చోటు కల్పించింది. ఆస్ట్రేలియా అత్యధిక ఐదు మార్పులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 63/1 తో బ్యాటింగ్ చేస్తోంది. ఎడ్ కోవాన్ 20, హ్యూజ్ 40పరుగులతో క్రీజులో వున్నారు.

మెరుగైన మురళీ విజయ్, విరాట్ కోహ్లీ ఐసిసి టేస్ట్ ర్యాంకింగ్స్

  తాజాగా విడుదలైన టెస్టు బ్యాట్స్ మెన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)లో భారత ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ 24 ర్యాంక్ నుండి 20వ ర్యాంక్ కు, మురళీ విజయ్ ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్నా టేస్ట్ క్రికెట్ సీరీస్ భాగంగా మొహాలీలో సోమవారం ముగిసిన మూడో టేస్ట్ లో 153 పరుగులు సాధించి భారతజట్టు విజయంలో కీలకపాత్ర వహించిన మురళీ విజయ్ 59ర్యాంక్ నుండి 43వ ర్యాంక్ కు చేరుకున్నాడు. వీరిద్దరూ అంతర్జాతీయ టెస్టు బ్యాట్స్ మెన్ జాబితాలో తమ కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన సౌరాష్ట్ర యువ బ్యాట్స్ మెన్ చటేశ్వర పూజారా ఐసిసి టాప్ 10 బ్యాట్స్ మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు అయితే తాజాగా విడుదలైన ర్యాంకులలో పుజారాకు 12వ ర్యాంగ్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది.

మొహాలి టెస్ట్: ఆసీస్ పై హాట్రిక్ కొట్టిన భారత్

        ఆస్ట్రేలియాతో మొహాలి లో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇండియా హాట్రిక్ విజయం సాదించింది. ఇండియా మూడో టెస్టులోను గెలిచి 3-0తో బోర్డర్ - గవాస్కర్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 75/3తో సోమవారం ఉదయం ఆట ప్రారంభించిన ఆసీస్ త్వరగానే వికెట్‌ను కోల్పోయింది. ఓఝా బౌలింగులో లియోన్(18) ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గాయం కారణంగా ఆడుతాడా, లేడా అనే అనుమానం నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ బ్యాటింగ్ చేశాడు, అవుటయ్యాడు. అతను 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా చేతిలో అవుటయ్యాడు. 179 పరుగులకు 9 వికెట్లు కోల్పోయినా ఒక్క వికెట్‌తో 233 పరుగుల వరకు లాక్కొచ్చారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మొహాలి టెస్ట్: ఆస్ట్రేలియా 213/4

        మొహాలిలో ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత బౌలర్లు వికెట్ల వేట మొదలు పెట్టారు. రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కు ఓపెనర్లు కొవాన్, వార్నర్‌లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత వార్నర్ 147బంతుల్లో ‌71 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆతరువాత వచ్చిన ఆసీస్ సారథి క్లార్క్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఓజా బౌలింగులో హ్యూజెస్ రెండు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 151 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. ఆసిస్ మరో ఓపెనర్ ఎడ్ కోవాన్ కూడా అర్థ సెంచరీ చేశాడు. 238 బంతుల్లో 86 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 213/4 కోల్పోయి బ్యాటింగ్ చేస్తుంది.

దేవధర్ ట్రోఫీ విజేత వెస్ట్ జోన్

  దేశవాళీ దేవధర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. గౌహతి నెహ్రూ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వెస్ట్ జోన్, నార్త్ జోన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసంచేసుకుంది. మన రాష్ట్ర ఆటగాడు అంబటి రాయుడు వెస్ట్ జోన్ గెలుపులో ముఖ్యమైన పాత్ర వహించాడు. అంబటి రాయుడు ఈ మ్యాచ్ లో 78 నాటౌట్ గా నిలిచి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. టాస్ గెలిచి వెస్ట్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ 88పరుగులు, యువరాజ్ సింగ్ 67 పరుగులు చేశారు. వీరిద్దరూ 120 పరుగుల భాగస్వామ్యాని నెలకొల్పారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 293 చేసి విజయం సాధించింది. వెస్ట్ జోన్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ పార్థివ్ పటేల్ 58పరుగులు, మన్ ప్రీత్ జునేజా 56 పరుగులు, కేదార్ జాదవ్ 57 పరుగులు, అంబటి రాయుడు 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

చిరకాల ప్రత్యర్థిపై భారత్ గెలుపు

మలేషియా లో జరుగుతున్న అజ్లాన్ షా మెన్స్ హాకీ టోర్నమెంట్ లో భారత్ తన చిరకాల ప్రత్యతి పాకిస్తాన్ పై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. రెండు పరాజయాలను ఎదుర్కొన్న భారతజట్టు ఈ విజయంతో టోర్నీలో కొనసాగే అవకాశాలను నిలుపుకుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో భారతజట్టు ఆటగాళ్ళు చక్కటి సంయమనంతో ఆడింది. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిముషంలో పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ వకాస్ గోల్ చేయడంతో ఖంగుతిన్న భారతజట్టు ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో మరు నిముషంలోనే భారత ఆటగాడు రూపీందర్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమానమయింది. భారత్ తొమ్మిదో నిముషంలో ఆకాశ్ దీప్ రెండో గోల్.  56వ నిముషంలో మన్దీప్ సింగ్ మూడో గోల్ చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎంత ప్రయత్నించినా భారత గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుకోవడంతో గోల్ సాధించడంలో విఫలమయ్యారు.

ఆస్ట్రేలియా ప్లేయర్లకు షాక్ ...

భారతదేశ పర్యటనలో వున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీంకు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. క్రికెట్ బోర్డు ఆదేశాలను పాటించనందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేటు వేసింది. వైస్ కెప్టెన్ వాట్సన్, బౌలర్లు ప్యాటిన్సన్, జాన్సన్, ఖాజాలను పంజాబ్ లో మొహాలిలో జరిగే ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టు నుండి తప్పించింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా నాలుగు టేస్ట్ సీరిస్ ను భారత్ రెండు టెస్టు మ్యాచుల్లో నెగ్గి ఆధిక్యంలో ఉంది. మూడో టేస్ట్ నుండి నలుగురు ఆటగాళ్ళుపై వేటు పడడంతో మూడో టేస్ట్ రసకందాయంలో పడింది. బోర్డు ఆదేశాలను పాటించనందుకే వీరిపై వేటు పడిందని ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్  మికి ఆర్థర్ అంటున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే వైస్ కెప్టెన్ వాట్సన్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.

సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్ పరాజయం

        సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3 ఫైనల్లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ ఓటమి పాలైంది. తెలుగు వారియర్స్ పై కర్ణాటక బుల్‌డోజర్స్‌ జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగారు. సెమీస్‌లో రాణించిన ఓపెనర్లు ఆదిత్య, ప్రిన్స్ ఫైనల్లో చేతులెత్తేశారు. ఒత్తిడికి లోనైన తెలుగు బ్యాట్ మెన్స్ గిరి 16, తేజ 23 బంతుల్లో 31, ఆదర్శ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. నందకిశోర్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు 29 నాటౌట్ చివర్లో ధాటిగా ఆడినా విజయాన్ని అందించలేకపోయాడు.   అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బుల్‌డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేశారు. సొంతమైదానంలో చెలరేగిన ప్రదీప్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45, ధ్రువ్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 54 నాటౌట్ వారియర్స్ బౌలర్లను చిత్తుచేశారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ట్రోఫీలను బుల్‌డోజర్స్ ఆటగాడు ధ్రువ్ శర్మ దక్కించుకున్నాడు. సిరీస్ బెస్ట్ బౌలర్ ట్రోఫీని వారియర్స్ ఆటగాడు రఘు అందుకున్నాడు.    

సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్

        సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో వీర్ మరాఠీ జట్టుపై 75 పరుగుల తో విజయం సాధించి బెంగళూరులో ఆదివారం జరిగే ఫైనల్లో కర్ణాటక బుల్‌డోజర్స్‌తో తలపడడానికి సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన మరాఠీ జట్టు పూర్తి ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంజ్రేకర్ 13, జాదవ్ 19 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. గిరి, ఆదర్శ్, తేజ తలా రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్.. ప్రిన్స్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఆదిత్య 52 బంతుల్లో 7 ఫోర్లతో 59 నాటౌట్ గా నిలవడంతో వారియర్స్ జట్టు 20 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి154 పరుగులు చేశారు. పవర్‌ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆదిత్య, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రిన్స్ నిలిచారు.

ఆస్ట్రేలియా తో టెస్ట్: సెహ్వాగ్ అవుట్, రహానే ఇన్

        ఆస్ట్రేలియా తో జరగనున్న మూడో,నాల్గో టెస్టు కు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అనుకున్నట్లు గానే సెలక్టర్లు సెహ్వాగ్ పై వేటు వేశారు. భారత జట్టులో సెహ్వాగ్ కు స్థానం దక్కలేదు. సెహ్వాగ్ స్థానం లో రహానే కు జట్టులో చోటు లభించింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇప్పటికే ఇండియా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను భారత్ వశం అవుతుంది. గత సంవత్సరం అహ్మదాబాదులో ఇంగ్లాండు పైన ఒక సెంచరీ మినహా బాగా ఆడలేదు. ఇప్పటికి సెహ్వాగ్ ఫాం చాలా గోరంగా ఉంది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటి వరకు సెహ్వాగ్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. మూడు ఇన్నింగ్సులలో అతని పరుగులు అంత తక్కువ ఉండటం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. భారత్ జట్టు : ఎమ్మెస్ ధోనీ(సారథి), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర పుజారా, సచిన్ టెండుల్కర్, రవీంద్ర జడెజా, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ప్రజ్ఞాన్ ఓఝా, అజింక్యా రహానే, హర్బజన్ సింగ్, ఆర్ అశ్విన్, అశోక్ దిండా  

ధోనీ రికార్డు

టీం ఇండియా కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీం ఇండియా 22 టేస్ట్ మ్యాచ్ లను గెలిచింది. ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లో జరిగిన రెండవ టేస్ట్ మ్యాచ్ ను గెలిచి ఆ రికార్డును తిరగరాశాడు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఇదంతా గోరింటాను కొండంత చేయడమేనని, డ్రెస్సింగ్ రూమ్ లో జట్టు సభ్యులు ఎవరూ ఎన్ని మ్యాచ్ లు గెలిచామని చర్చించమని, టేస్ట్ మ్యాచ్ లు గెలవడమే ముఖ్యమని తెలిపాడు. టీం ఇండియా జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సీరీస్ లో పరాజయాల పాలైన తరువాత ఆత్మవిమర్శ చేసుకున్నామని, తాను తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. జట్టు సభ్యుల్లో పుజారా, మురళీ విజయ్ రెండవ టెస్టులో ఆడిన అద్భుత ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఉప్పల్ టెస్ట్: ఇన్నింగ్స్‌ 135 రన్స్ తో భారత్ గెలుపు

        ఉప్పల్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసిస్ బ్యాట్స్ మెన్‌లు పెవిలియన్ బాటపట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.   టీంఇండియా బౌలర్లు అశ్విన్‌కు ఐదు వికెట్లు, జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆసిస్‌పై భారత్‌కు ఇది రెండో విజయం. రెండో టెస్టులో ద్విశతకం చేసిన ఛటేశ్వర్‌పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' దక్కింది. మరోవైపు కెప్టెన్‌గా టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించి ధోని రికార్డు సృష్టించాడు.  

ఉప్పల్ టెస్ట్: కష్టాల్లో ఆసీస్ 74/2

        ఉప్పల్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజూ ఇండియా 154.1 ఓవర్లలో 503 పరుగులు చేసి ఆలౌటైంది. ఛటేశ్వర్ పూజారా చెలరేగి 332 బంతుల్లో డబుల్ సెంచరీ 204 పరుగులు చేశాడు. కెరీర్‌లో పూజారాకు ఇది రెండో ద్విశతకం. డబుల్ సెంచరీతో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేశారు. ఆసీస్ పై భారత్ 266 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లు మాక్స్‌వెల్ 4, దోహార్తి-3, ప్యాటిన్సన్ 2, సిడిల్ ఒక వికెట్ తీసుకున్నారు.   అనంతరం బ్యాటింగుకు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 74 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత్ 192 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇండియా స్కోర్ వివరాలు : విజయ్ : 167, సెహ్వాగ్ : 6, పుజారా : 204, సచిన్ : 7, కోహ్లీ : 34, ధోనీ ఐ 44, జడేజా : 10, అశ్విన్ 1, హర్భజన్ సింగ్ : 0, కుమార్ : 10, ఇషాంత్ శర్మ నాటౌట్ : 2, ఎక్స్‌ట్రా : 18.