గాంధీ సంకల్ప యాత్ర బండి సంజయ్ కు రెండు విధాలుగా ఉపయోగపడిందా..?

  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సూత్రాన్ని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులను ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించింది. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ ఎంపీలను వారి వారి నియోజకవర్గాలలో తిరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. తన పార్లమెంటరీ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో మొత్తం కలియ తిరిగారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాంధీ సంకల్ప యాత్ర ఎంపి బండి సంజయ్ కుమార్ కు రెండు రకాలుగా ఉపయోగపడిందని బిజెపి నాయకులు విశ్లేషిస్తున్నారు. ఒకటి పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఆయన పాద యాత్ర చేసి నియోజక వర్గ కార్యకర్తలను కలుసుకునే వీలు పడిందనీ, రెండోది ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకునే అవకాశం దొరికిందని వారు అంటున్నారు. వాస్తవానికి బండి సంజయ్ కుమార్ కు ఒక్క కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా నియోజక వర్గాల్లో పెద్దగా పట్టులేదట. ఆయా నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదట. ఈనేపధ్యంలో బిజెపి అధిష్టానం తలపెట్టిన గాంధీ సంకల్ప యాత్ర ఎంపి సంజయ్ కుమార్ కు ఒక అవకాశంలా దొరికిందని స్థానిక పార్టీ నాయకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ ఆయనకు అన్ని నియోజకవర్గాల్లో తిరిగే అవకాశం రాలేదట. అప్పుడు ఏ నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేక పోయారట. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనకి తెలియదట. అలాగే కరీంనగర్ ప్రజలకు మినహా మిగతా నియోజకవర్గాల్లోని చాలామంది బండి సంజయ్ కుమార్ మొహం చూడలేదట, అయితే యూత్ లో మాత్రం ఆయనకు బాగా క్రేజ్ ఉంది. యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి బండి సంజయ్ ఈజీగా గుర్తుపట్టగలిగారట. ఆయన పాటలకు మాటలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యింది. అయితే సామాన్య జనం మాత్రం బండి సంజయ్ కుమార్ ఎవరో తెలీకుండానే ఓట్లేశారని స్వయంగా ఆయన సన్నిహితులే తెలిపారు. మోదీ వేవ్ సహా టిఆర్ఎస్ మీద ప్రజలకున్న అసంతృప్తి వల్లే గెలిచారని ప్రచారం జరిగింది. ఈ తరహా చర్చలకు ఒకే యాత్రతో ఆయన సమాధానం చెప్పాలంటున్నారు. గాంధీ సంకల్ప యాత్ర ద్వారా జనాలకు దగ్గరవ్వటంతో పాటు పార్టీ బలాబలాలు కూడా తెలుసుకుంటున్నారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో క్యాడర్ ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న పురపాలక పరిధుల్లో ఎక్కువ సమయం గడిపేలా గాంధీ సంకల్ప యాత్రను ఆయన షెడ్యూల్ చేసుకున్నారు. అయితే మిగతా మున్సిపాలిటీలన్నీ ఒకెత్తయితే ఒక్క కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మాత్రం సంజయ్ కు మరో ఎత్తు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడ జరిగే పుర పోరు ఆయనకొక అగ్నిపరీక్షలా మారనుందట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బిజెపి చూపిన ఊపు ఇప్పుడు ఆ పార్టీ వైపు ఉంటుందా లేదా అన్నది మునిసిపల్ ఎన్నికల్లో తేలిపోనుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి వచ్చింది. ఈ క్రమంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ అధికార టీఆర్ఎస్ ను ఏ మేరకు ఢీకొంటారన్న చర్చ జరుగుతుంది. బిజెపి కార్పొరేటర్లు అనుకున్నన్ని సీట్లల్లో గెలవకపోతే కరీంనగర్ లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. టీఆర్ఎస్ తోనే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ దక్కిందని ఆయన అన్నారు, ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. మొత్తం మీద బండి సంజయ్ కు గాంధీ సంకల్ప యాత్ర కొన్ని విషయాలను బోధించింది. మరి ఆయన యాత్రకు ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

భారీగా పెరిగిన భూ దందాలు.. రాజకీయ నాయకులను సైతం మోసం చేస్తున్న పోలీసులు

  రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో భూ దందాలు భారీగా పెరిగాయి. సదరు స్టేషన్ కు భూముల ఫిర్యాదు వెళ్తే చాలు స్టేషన్ ఆఫీసర్ కాసులు పండించుకుంటున్నారు. నేరుగా ఆయనే సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా బాధితులు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతి అంతా విని నేను బిజీగా ఉన్నాను, మీరు ఫిర్యాదు చేసి మళ్లీ రేపు ఒకసారి రండి అని చెబుతారు. తర్వాత రోజు ఫిర్యాదు దారుడు రాగానే అయ్యో నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఆ భూమి విషయంలో కమిషనర్ మొన్ననే ఫోన్ చేశారు నీవు వచ్చినపుడు నాకు ఈ విషయం గుర్తులేదు. వివాదం పెద్దది చేసుకోవద్దు సెటిల్ మెంట్ చేసుకో అని సూచిస్తారు. అవసరమైతే నేనే వాళ్లను ఇక్కడకు పిలుస్తానని చెబుతారు, అలా చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. రెండవ పార్టీ రాగానే వాళ్లకూ కథ చెప్పి అవతలి వాళ్లను కూడా సెటిల్ మెంట్ కు పిలుస్తారు. వాళ్ల తరఫున డీజీ గారు ఫోన్ చేస్తారు, వివాదాన్ని పెద్దది చేసుకోవద్దు ఈ రోజే ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒత్తిడి తెచ్చి ఆయనే సెటిల్ మెంట్ చేస్తారు. ఇద్దరి నుంచి వాటాలు తీసుకుంటారు, లేదంటే మరో పార్టీని తీసుకొచ్చి వివాదాస్పద భూమిని వారిద్దరి నుంచి అమ్మించి చెరికొంత ఇచ్చి ఆయన వాటా ఆయన తీసుకుంటాడు. వివాదాస్పద భూముల్లో గోడలు కట్టేందుకు ఆయన అనధికారికంగా అనుమతులు ఇస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఓ వివాదాస్పద భూమిలో ఒకరు గోడ కట్టేందుకు వెళ్లారు, ఈ విషయం ఆయన వరకూ వెళ్ళింది. ఆయన వెంటనే పనులు నిలిపివేశారు, తర్వాత వారితో బేరం మొదలుపెట్టారు. 2.06 ఎకరాల భూమిలో గోడ కట్టేందుకు సదరు స్టేషన్ ఆఫీసర్ రెండు కోట్లు డిమాండ్ చేశారు. చివరకు 25 లక్షలకు డీల్ కుదిరింది, 2 గంటలులో పని పూర్తి చేయాలని షరతుతో ఆయన అనుమతి ఇచ్చారు. ఈ స్టేషన్ లో ఆయన కంటే ముందు పని చేసిన మరో అధికారి కూడా భారీగా భూదందాలు చేసి కోట్ల వెనకేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఏకంగా ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీనే నడుపుతున్నారు, అనేక చోట్ల భూవివాదాల్లో పోలీసులు జోక్యం పెరుగుతుంది. నగర శివారులోని అనేక మండపాల్లో పలువురు పోలీసు అధికారులపై భూదందా ఆరోపణలొస్తున్నాయి. కొందరు స్థానిక రాజకీయ నేతలను కలుపుకొని భూదందాలు చేస్తున్నారు. రికార్డుల ప్రక్షాళనను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, చిన్న రైతులకు అన్యాయం చేస్తున్నారు. విజయవాడ హైవేకు సమీపంలోని ఓ భూమి విషయంలో కూడా స్థానిక పోలీస్ అధికారులు మితిమీరిన జోక్యం చేసుకున్నారు. దీనిని ప్రత్యర్ధులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపారు, విచారణ అనంతరం బాధ్యులైన ఇద్దరు అధికారులను బదిలీ చేశారు. ఎన్నారైల భూములను పోలీసులు రాజకీయ నాయకులు కలిసి మింగేస్తున్నారు. తమ భూములు కబ్జా చేశారంటూ ఎన్నారైలు చేసిన ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పేరొందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఇలానే పోలీసుల దెబ్బకు బాధితుడిగా మారి న్యాయం కోసం తిరుగుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్గజ నేతలతో పోటీ పడిన ఆయన ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అయినా ఆ నాయకుడికి కష్టాలు మాత్రం తగ్గలేదు, ఆయనకున్న భూమిని కొందరు కబ్జా చేశారు. ఇందులో స్థానిక పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆయన ఉన్నతాధికారులకు చెప్పారు, సదరు అధికారిని బదిలీ చేశారు. కానీ ఆయనకు మాత్రం న్యాయం జరగలేదు, మేడ్చల్ నియోజక వర్గంలోని ఘట్ కేసర్ మండల పరిధిలో 25 ఎకరాల భూమి విషయంలో పోలీసులు గ్రేటర్ లోని ఓ ముఖ్య రాజకీయ నేతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆ భూమికి నలుగురు హక్కు దారులు ఉండగా ఒక హక్కుదారుల నుంచి భూమి మొత్తాన్ని ప్రభుత్వ పెద్దల్లో ఒకరికి కుడి భుజంగా వ్యవహరించే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇందుకోసం ఒక వ్యక్తికే 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి అతని నుంచి భూమి కొనుగోలు చేశారు. దీని పై మిగతా రైతులు అభ్యంతరం చెప్పిన మూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ జరిపించేశారు. ఈ విషయంలో స్థానిక రెవిన్యూ అధికారులు పోలీసులు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ భూములు అనుభవిస్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. భూ వివాదాలు వచ్చినప్పుడు రికార్డులు పరిశీలించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఇప్పుడు సరి కొత్త ట్రెండ్ మొదలైంది. భూ వివాదాలపై ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వారికి అక్కడ చుక్కెదురవుతుంది. రికార్డులు మార్చినప్పుడు లేదా భూమి కబ్జాకు గురైనప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులు రికార్డులను పరిశీలించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పై పొజీషన్ లో ఎవరు ఉన్నారనే విషయం తెలుసుకొని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పొజిషన్ మాత్రమే తాము చూస్తామని మిగతా వ్యవహారాలు కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు. తన భూమి ఆక్రమణకు గురైందని ఇటీవల ఓ రాజకీయ నాయకుడు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. భూమిని స్వాధీనం లోకి తీసుకునేందుకు వెళ్తే కబ్జాదారునికి అనుకూలంగా స్థానికులు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయినా సదరు పోలీసు ఉన్నతాధికారి కూడా కబ్జా దారునికి అనుకూలంగానే సమాధానం ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. ఇలాంటి ఘటనలు అధికంగా మేడ్చల్ జిల్లా పరిధిలో జరుగుతున్నాయి.

పార్టీ ఫిరాయింపు రాజకీయాలను సహించేది లేదు : జగన్

    నెత్తిన నోరుంటే పెత్తనం సాగుతోంది అన్నట్టుగా ఉందట పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారం. తెలుగుదేశం మాదిరిగా తాను పార్టీ ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించబోమని శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శాసన సభ్యులుగా ఉండి పార్టీకి రాజీనామా చేయకుండా ఎవరైనా ఫిరాయిస్తే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఇలా జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ మారేందుకు ప్రతిబంధకంగా మారింది. ఆయన పార్టీ మారాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది. ఇప్పటికే టిడిపికి శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకు రాసిన వాట్సప్ లేఖలో వంశీ పేర్కొన్నప్పటికీ స్పీకర్ కు మాత్రం నేరుగా తన లేఖను పంపలేదు. ఈ నేపథ్యంలో వంశీతో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ చర్చలు దాదాపుగా విఫలమయ్యాయి, మరోవైపు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు, ఈ భేటీ తరువాత వంశీ ఈ నెల 7 న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అయితే వంశీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే సీఎం జగన్ ప్రకటన ప్రకారం అంతకుముందే ఆయన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటనేది తెలుగుదేశం పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. వల్లభనేని వంశీకి టిడిపి టికెట్ ఇచ్చి గెలిపించింది ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ కు సిద్ధమైందట ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా లేఖను నేరుగా చంద్రబాబుకే పంపించాలని ఆయనే దాన్ని స్పీకర్ కు పంపేలా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉన్నట్టు సమాచారం. తద్వారా చంద్రబాబు పైనే ఈ నెపాన్ని నెట్టవచ్చు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇలా వల్లభనేని వంశీ మోహన్ ఎపిసోడ్ ఎండ్ లెస్ లవ్ స్టోరీలా కొనసాగుతుండగా తెలుగుదేశం పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గోడదూకుతారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు, కోస్తాలోని ఇరువురి ఎమ్మెల్యేలతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇందులో కోస్తా లోనూ ఓ ఎమ్మెల్యేను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు, ఆయన తనను వ్యాపారపరంగా అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తాను పార్టీ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రిపై ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. ఇటీవల మీడియా ప్రతి నిధులు ఆయన్ను సంప్రదించగా ప్రతి రోజు శీలం ఎక్కడ నిరూపించుకుంటామని ఆయన ప్రశ్నించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వంశీ మరో ఇరువురిని తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేస్తే చంద్రబాబుకు ప్రతి పక్ష హోదా కూడా పోతుందనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇక గోడమీద పిల్లుల్లా ఉన్నవారికి తాజాగా సిబిఐ కోర్టులో చుక్కెదురు కావడం వెనుకాడేలా చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో పాటు సిబిఐ వేసిన కౌంటర్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు గోడ దూకుదామనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలను పునరాలోచనలో పడవేశాయి. క్రిమినల్ నేరాల కంటే ఆర్థిక నేరాలు తీవ్రమైనవని, ఇటువంటి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ తన కౌంటర్ లో పేర్కొనడం ప్రజా బాహుళ్యంలోకి వెళ్లింది. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి ఫ్యాన్ పార్టీ పంచన చేరుదామనుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతం డైలమాలో పడ్డారని సమాచారం. అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కొందరు నేతలు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారట తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉంటే తటస్థ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతగా రుచించలేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి వారు ఒకే అయినప్పటికీ తాము చెప్పినప్పుడే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో ఆ ముగ్గురు నేతలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది, మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.  

 ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది, విధుల్లోకి 373 మంది మాత్రమే, మిగతావారు సమ్మెలో కొనసాగింపు...

.   ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు ముగిసింది. 373 మంది మాత్రమే విధుల్లో చేరారు, మిగిలిన వారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు 150 మంది రాత్రి తొమ్మిదిన్నర వరకు 240 మంది రాత్రి ఒంటి గంట వరకు 373 మంది విధుల్లో చేరారు. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విషయంలో కుటుంబ సభ్యులతో సన్నిహితులతో చర్చించి విధుల్లోకి చేరినట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు, కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్టు ఆర్టీసీ వెల్లడించింది. నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు 1937 అద్దె బస్సుల్ని కలుపుకొని మొత్తం 6484 బస్సులు నడిచినట్లు తెలిపింది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిల పక్ష నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆర్టీసిని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున దానిని మూసెయ్యాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందే నని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 33వ రోజుకి చేరింది, ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీ తో చర్చలు జరిపి కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ నెల 7న నిర్వహించే సడక్ బంద్ లో భాగంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెన్ డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. 9న నిర్వహించే చలో ట్యాంక్ బండ్ ను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట వీడట్లేదు, డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు. పలు డిపోల్లో బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కార్మికులు రోడ్లపై బైఠాయించారు. తమ డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉన్నతాధికారులు హామీతో ధర్నాను విరమించిన ఢిల్లీ పోలీసులు...

    ఢిల్లీ పోలీసులు శాంతించారు, పదకొండు గంటల పాటు సాగిన ధర్నాను విరమించారు. పోలీసు సిబ్బంది డిమాండ్లన్నీ నెరవేర్చుతాం అంటూ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తీస్ హజారీ కోర్టుల సముదాయంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య శనివారం గొడవలు జరిగాయి. దీని పై ఢిల్లీ హై కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు పోలీసులు. ఢిల్లీ హై కోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ వేస్తామని పోలీసులు ఆందోళన విరమించి విధుల్లో చేరాలంటూ ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ సతీష్ గొల్చా కోరారు. గాయపడిన పోలీసులకు 25,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు సిపి. శనివారం రోజున తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్ లకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్ లు కూడా గాయపడ్డారు. దీని పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్ట్ ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను భాదించింది. సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు, ఘర్షణకు పోలీసులు తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని పోలీసులు ఆరోపించారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన పదకొండు గంటల పాటు జరిపిన ధర్నాను విరమించారు.  

వైసీపీ ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం... రాష్ట్రపతి ఆదేశాలతో కదులుతోన్న డొంక... 

  ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీకి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కారణమనే ప్రచారం జరుగుతోంది. వినాయకచవితి రోజు జరిగిన ఒక గొడవలో తనను కులం పేరుతో దూషించారని ఆమె ఫిర్యాదు చేయడం, తూళ్లూరు పోలీసులు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో... బాధితులు... జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీ హిందువు కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో, ఉండవల్లి శ్రీదేవి... హిందువో... క్రిస్టియనో... తేల్చాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎల్వీ సుబ్రమణ్యానికి ఆదేశాలు వచ్చాయి. అయితే, ఉండవల్లి శ్రీదేవి... క్రిస్టియన్ కాదు... హిందువు అంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని, దానికి ఎల్వీ ఒప్పుకోకపోవడంతో... ఆకస్మిక బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఎస్సీలు... క్రైస్తవ్యంలోకి వెళ్తే... వాళ్లు రిజర్వేషన్లను కోల్పోతారని, వాళ్లు బీసీ-సీగా పరిగణించబడతారని రాజ్యాంగం చెబుతోంది. అమెండ్-మెంట్ 1950 పేరా 3లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఎస్సీలు.... క్రైస్తవ్యాన్ని స్వీకరించి.... క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే చేస్తున్నప్పటికీ... సర్టిఫికెట్స్ ప్రకారం మాత్రం ఎస్సీలుగా కొనసాగుతున్నారు. దీనిపై దళితుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రైస్తవ్యంలోకి మారినవాళ్లు... ఎస్సీ హోదాను వదులుకోకపోవడంతో.... నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందనే పోరాటాలూ జరుగుతున్నాయి. అయితే, ఇఫ్పుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... హిందువా? లేక క్రిస్టియనా? తేల్చాలంటూ ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచే సీఎస్ కు ఆదేశాలు రావడంతో.... తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. ఎందుకంటే, ఉండవల్లి శ్రీదేవి... తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడం... చర్చికి వెళ్లడం... ఇంట్లో కార్యక్రమాలను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేయడం... ఇలా ఎన్నో ఆధారాలు ఉండటంతో... ఒకవేళ ఆమె క్రిస్టియన్ అంటూ రాష్ట్రపతికి నివేదిక ఇస్తే.... శాసనసభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది. అదే జరిగితే, ఇది ఒక్కరితోనే ఆగిపోదు... ఎందుకంటే... ఒక్క తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కాదు.... స్వయంగా హోంమంత్రి మేకతోటి సుచరితే... తన కుమార్తె వివాహాన్ని... క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారు. అందుకు పెళ్లి వీడియోలే రుజువు. ఇలా చెప్పుకుంటూ పోతే... ఎస్సీ కోటాలో ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల్లో అధిక శాతం క్రైస్తవులుగానే ఉన్నారనేది బహిరంగ సత్యం. ఒకవేళ కులం వివాదంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడితే... అది మిగతా ఎస్సీ ప్రజాప్రతినిధులపైనా పడటం ఖాయం. ఎందుకంటే అట్రాసిటీ కేసులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ సంస్థలు, కొన్ని వర్గాలు.... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధుల క్రైస్తవ మూలాలపై ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

విజయారెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు!!

  తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి, పోలీసులు హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పలు కీలక ఆధారాలు సేకరించింది. విజయారెడ్డి ఆఫీస్ లోని గడియారం మధ్యాహ్నం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఈ ఆధారంతో దర్యాప్తు చేసిన క్లూస్ టీం సంఘటన 1:45 నిమిషాలకు జరిగినట్టు నిర్ధారించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే విజయా రెడ్డి ప్రాణాలు విడిచినట్టు నిర్ధారణకొచ్చారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గర పది నిమిషాలకు పైగానే తిరుగుతూ మంటలార్పే ప్రయత్నం చేశాడు. సగం మంటలు ఉండగానే మండల కార్యాలయం నుంచి నడుచుకుంటూ 2:35 నిమిషాల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. నిందితుడు సురేష్ తన వెంట రెండు లీటర్ల బాటిల్ లో పెట్రోల్ కలిపిన కిరోసిన్ తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. దాన్ని విజయారెడ్డిపై చల్లాడు, అయితే అది ఆమె ఒంటిపై ముందున్న టేబుల్ కుర్చీపై పక్కన పేపర్లపై పడింది అలాగే సురేష్ పై కూడా పడింది. క్షణాల్లోనే తనతో పాటు తెచ్చుకున్న అగ్గిపెట్టెతో మంటలు అంటించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా విజయా రెడ్డికి మంటలు అంటుకోవడంతో పాటు చుట్టు పక్కల కూడా వ్యాపించాయి. కిరోసిన్ అందులో కలపడంతో వెంటనే దట్టంగా పొగలు వచ్చాయి, ఈ పొగతో ఆమె ఛాంబర్ లో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోవడం కార్బన్ మోనాక్సైడ్ గది అంతా వ్యాపించడంతో ఆమె దాని పీల్చుకుంది దీంతో నిమిషాల వ్యవధి లోనే విజయారెడ్డి ప్రాణాపాయ స్థితికి చేరి తన ఛాంబర్ నుంచి బయటకు మంటలలో కాలుతూ వచ్చి డోర్ దగ్గర కుప్పకూలిపోయింది. కర్టెన్స్ కు మంటలంటుకోవడంతో కాలిపోయాయి. ఈ మంటల వేడికి తలుపు పై భాగంలో ఉన్న గోడ గడియారం 1:55 నిమిషాలకు ఆగిపోయింది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంగుళాన్ని గాలించి ముప్పై రకాలైన నమూనాలను సేకరించింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు, కిరోసిన్ ఆనవాళ్లు లభించాయని ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు క్లూస్ టీం అధికారులు. కిరోసిన్ కు ఎక్కువ సేపు మండే స్వభావం ఉంటుంది, పెట్రోల్ త్వరగా అంటుకున్న ఆవిరి స్వభావం ఎక్కువగా ఉండటంతో పాటు అంతే త్వరగా మంటలు కూడా ఆరిపోయే అవకాశాలుంటాయి. దీంతో నిందితుడు కిరోసిన్ లో పెట్రోల్ కలుపుకొని వచ్చినట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అటు గౌరల్లిలో రోడ్డు పక్కన చిన్న దుకాణంలో పెట్రోల్ కొన్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. తహసీల్దార్ ఛాంబర్ లో మంటలు అంటుకోవడానికి ఉపయోగించిన కిరోసిన్, పెట్రోల్ ఆనవాళ్లు అగ్గిపెట్టె, పూర్తిగా కాలిపోయన రెండు లీటర్ల బాటిల్ తదితర వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. దీనిపై మరింత స్పష్టత వచ్చాకే అధికారికంగా చెబుతామన్నారు పోలీసులు. నిందితుడు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు చాంబర్ లోకి వెళ్లి ఆమెను సజీవ దహనం చేశాడు. తనక్కూడా మంటలంటుకున్న సురేష్ కార్యాలయం వద్దనే కొద్దిసేపు ఉన్నాడు, ఎవరో బాధితులు తమ పని కాకపోవడంతో ఒంటికి నిప్పంటించుకున్నారనే భావనలో అక్కడున్న వారు భావించారు. తన ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేసుకునేందుకు బట్టలు విప్పేసిన సురేష్ అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మండల ఆఫీసు నుంచి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మధ్యాహ్నం 02:25 నిమిషాల ప్రాంతంలో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు దర్యాప్తుకు కీలకంగా మారాయి.

70 ఏళ్ళ వయస్సులో కంకరను కరకరా నమిలేస్తున్న ఓ వృధ్ధుడు..!!

  అన్నంలో చిన్న ఇసుక రవ్వ వస్తేనే విలవిల్లాడిపోతాం, నోటితో బఠానీలు నమలాలంటేనే బెంబేలెత్తిపోతుంటాం కానీ, ఓ వృద్ధుడు కంకర రాళ్లను సైతం కరకరా నమిలేస్తున్నాడు. డెబ్బై ఏళ్ళ వయస్సులోనూ రాళ్లను ఉండ్రాళ్లలా కొరికి పాడేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఈ స్టోన్ మ్యాన్ సంచలనంగా మారాడు. పేరు సత్తిరెడ్డి వయసు డెబ్బై ఏళ్లు సాధారణంగా ఈ వయసులో పళ్లూడిపోయే స్థితిలో ఉంటారు వృద్ధులు. కానీ, ఈ స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి మాత్రం రోజు రోజుకూ పళ్లను బలంగా మార్చుకుంటున్నాడు. రాళ్ళను అన్నంలా నమిలి పిప్పి చేస్తున్నాడు. ఓ దశలో తన పళ్లు ఊడిపోయే స్థితికి వచ్చాయి అంటున్నాడు సత్తిరెడ్డి. ఆ సమయంలో ఏ డాక్టర్ కు చూపించుకోలేదు. కేవలం మూలికలతో తన పళ్లు బాగుపడ్డాయని చెబుతున్నాడు. పళ్లు గట్టిపడటం కోసం తానే కొత్త రకం మూలికను తయారు చేశాను అన్నాడు. అప్పట్నుంచీ పళ్లు గట్టిపడి రాళ్లు నమిలే స్థితికి వచ్చానంటున్నాడు స్టోన్ మ్యాన్ సత్తిరెడ్డి. సత్తిరెడ్డిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతోందంటున్నారు గ్రామస్తులు. అన్నంలో రాళ్ళొస్తేనే విలవిల్లాడతాం అని, అలాంటిది రాళ్లనే అన్నంలా తినడం చూస్తుంటే ముచ్చటగా ఉందన్నాడు గ్రామ సర్పంచ్. తన దగ్గరున్న మూలికను సీఎం కేసీఆర్ కి కూడా ఇస్తానంటున్నాడు సత్తిరెడ్డి. గతంలో పంటి నొప్పితో కేసీఆర్ భాదపడ్డట్లు విన్నాననీ అవకాశమొస్తే ఆయన పళ్లను కూడా తన పళ్ళ లాగా మారుస్తాను అని సత్తిరెడ్డి అంటున్నాడు. అవసరమైతే పళ్ళకు సంబంధించిన యాడ్స్ లో నటించటానికి కూడా సిద్ధమని ప్రకటించాడు.

గతంలో కంటే ప్రస్తుత జిడిపి వృధ్ధి రేటు మరింత తగ్గుతుందా..?

  ఆర్థిక వృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటులో ఏమాత్రం పెరుగుదల కనిపించడం లేదు. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలోనూ నిరాశే మిగల్చడం ఇందుకు కారణంగా మారింది. జిడిపి 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నా వృద్ధి రేటు మాత్రం పెరగడం లేదు. రెండో త్రైమాసికం లోనూ జిడిపి కోలుకునే అవకాశం లేదని ఎస్.బి.ఐ నివేదించడం పరిస్థితికి అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే మరింత దిగజారే అవకాశమే ఉందని చెబుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఈ సారి ఐదు శాతానికి దిగువనే వృద్ధి రేటు ఉండచ్చని ఎస్.బి.ఐ అంటోంది. 2012,2013 నాటి అంచనా స్థాయికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం సరి సమానంగా వుండనుందని చెబుతోంది. పడిపోయన వినియోగ సామర్థ్యం, క్షీణించిన పెట్టుబడులు సేవా రంగంలో మందగమనం వంటివి జిడిపి పెరుగుదలకు బ్రేక్ వేస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిడిపి గాడిలో పడాలంటే ఇంకా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అక్టోబర్, డిసెంబర్ మధ్య కాస్త కోలుకోవచ్చని భావిస్తున్నారు. సెప్టెంబర్ లో 3.1 లక్షల కోట్లు ప్రభుత్వం ద్వారా ఖర్చు కావడం ఇందుకు దోహదపడుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జిడిపి గాడిన పడచ్చని ఆశాభావం వ్యక్తం చేసినా మార్పు మాత్రం రాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని పరిశీలించిన దేశ విదేశీ ఆర్థికవేత్తలు, నిపుణులు వివిధ అధ్యయనాలు జిడిపి అంచనాలని తగ్గిస్తూ పోతున్నాయి. ఇంతకు ముందున్న 6.2 శాతాన్ని కూడా అందుకోవడం కష్టమనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. క్షీణించిన రుణ వృద్ధి రేటు తిరిగి బలపడుతుందన్న ఆశతో ఉన్నారు. సెప్టెబర్ నెలారంభం నుంచి రుణాలకు డిమాండ్ పెరిగిందని 1.08 లక్షల కోట్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు. త్వరలో ఆర్.బి.ఐ నిర్వహించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మరోమారు వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమీక్షలోనూ 0.15 శాతం వడ్డీ తగ్గించే ఆస్కారం ఉందని అభిప్రాయ పడుతున్నారు.  

విజయారెడ్డి హత్యతో మొదలైన భయం.. ఛాంబర్ చుట్టూ తాడు కట్టించుకున్న ఎమ్మార్వో

  అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ హత్యతో అధికారుల గుండెల్లో భయం మొదలైంది. అంతేకాదు ఈ హత్య తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కూడా అధికారులను మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళా రైతు.. పాసు పుస్తకాలను ఇవ్వడంలో కొనసాగుతున్న జాప్యంపై సిబ్బందిని గట్టిగా నిలదీశారు. తన వద్ద నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ కొట్టినంత పనిచేసారు. దీంతో, షాక్ కు గురైన రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక కడప జిల్లాలో తహసీల్దార్‌ చాంబర్‌ లో ఓ వ్యక్తి తనపై పెట్రోల్‌ పోసుకున్న ఘటన కలకలం రేపింది. కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ, పని జరగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే అక్కడున్న సిబ్బంది సమయానికి స్పందించి ఆ రైతుని కాపాడారు. ఈ వరుస ఘటనలతో రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. తమ మీద ఎప్పుడు ఎవ్వరు దాడి చేస్తారోనన్న భయం వారిలో మొదలైంది. భయంతో బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. అదే భయంతో ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దారు ఉమా మహేశ్వరి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తన చాంబర్ లో తను కూర్చునే కుర్చీ ముందు ఓ తాడును కట్టించారు. సిబ్బందిని మాత్రమే తాడు దాటి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. అర్జీలు ఇచ్చే వారు ఎవరైనా తాడుకు అవతల ఉండి మాత్రమే వాటిని అందించాలన్న ఆదేశాలు జారీ చేశారు. కొందరు అధికారులైతే.. రెవెన్యూ కార్యాలయాల ముందు భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి వారిలో భయం పోగొట్టి, వారు ప్రశాంతంగా పనిచేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

విజయారెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చింది? నిందితుడు సురేష్ స్టేట్-మెంట్ ఏమిచ్చాడు?

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న నిందితుడు సురేష్ నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు.... ఈ ఘాతుకం వెనుక ఇంకెవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. అయితే, విజయారెడ్డి హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తన తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టా పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. తమ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే, రెవెన్యూ అధికారులు మాత్రం ఇతరుల పేరు మీద దస్తావేజులు, పట్టా పాసు పుస్తకాలు ఇచ్చారని, దీనిపై గ్రామసభల్లో అనేకసార్లు ప్రశ్నించామని, అలాగే తమ పేరిట పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్ విజయారెడ్డిని వేడుకున్నానని, కానీ ఆమె పట్టించుకోలేదని, ఆ కోపంతోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశానని పోలీసులకు, మెజిస్ట్రేట్ కు సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలీ భూముల వివాదమేంటో ఒకసారి చూద్దాం... అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి గ్రామంలో... పలురువు రైతులు.... 1954లో రాజా ఆనందరావు నుంచి భూములు కొనుగోలు చేశారు. అనంతరం కాలంలో ఆర్‌వోఆర్‌ చట్టం కింద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. అప్పట్నుంచి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, సాగుదారులుగా కొనసాగుతున్నారు. అయితే, 2014లో సడన్‌గా తెరపైకి వచ్చిన యాసిన్ అండ్ హయత్ లు‌.... తమ దగ్గర రక్షిత కౌలుదారుల చట్టం కింద హక్కులు ఉన్నాయంటూ కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో అప్పటివరకు సాగు చేసుకుంటున్న రైతులకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు విచారణ తర్వాత ఆ భూమిపై హయత్‌-యాసిన్ తోపాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2016 అక్టోబర్ 25న ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆ భూములను‌ వాళ్లు... ఇద్దరు రియల్టర్లకు విక్రయించారు. అయితే, అప్పటివరకు సాగుదారులుగా ఉన్న రైతులు... జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా, ఆర్డీవో ఆదేశాలనే సమర్ధించడంతో... తిరిగి హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉండగా, సర్వే నెంబర్ 87 నుంచి 101 వరకున్న దాదాపు 130 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది.  అయితే, ఈ భూములు హైదరాబాద్‌కి సమీపంలో ఉండటం... అలాగే, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండటంతో... రాజకీయ నేతలు, కబ్జాదారులు, రియల్టర్ల కన్ను వీటిపై పడింది. దాంతో, ఇటీవల సర్వే నెంబర్ 92, 93, 94, 96ల్లో 40 ఎకరాల భూమిని ఓ రాజకీయ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో... ఆ భూములకు చెందిన 11 కుటుంబాలు హైకోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే... మరోవైపు రెవెన్యూ అధికారులు... లంచాలకు కక్కుర్తిపడి ఇతరుల పేరు మీద దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. ఈ 40 ఎకరాల్లోనే నిందితుడు సురేష్‌, అతని పెదనాన్నకు 8 ఎకరాల భూమి కూడా ఉండటంతో.... స్థానిక తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తాను కలుగజేసుకోలేనని విజయారెడ్డి చెప్పింది. కానీ, ఆ భూములకు ఇతరుల పేరు పట్టాలివ్వడంతోపాటు దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బాధిత రైతులు గ్రామ సభల్లో నిలదీయడమే కాకుండా, అనేకసార్లు గొడవకి దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా, ఇతరుల పేరు మీద పట్టాలు ఇవ్వడంతో బాధిత రైతులు రగిలిపోయారు. ఆ బాధిత కుటుంబాల్లో ఒకడైన సురేష్... తహశీల్దార్ విజయారెడ్డి ఉండగా... ఆ భూములు ఇక తమకు దక్కవేమోనన్న ఆందోళనతో... పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

నిరసనలో ఉన్న రెవెన్యూ అధికారులకు ఖంగు తినిపించిన మహిళా రైతు...

  ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను ఖండిస్తూ రెవెన్యూ ఉద్యోగులు నిరసనలకు దిగారు అయితే వీరికి కొన్ని చోట్ల చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న ఓ వీఆర్వోను మహిళా రైతు నిలదీసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో జరిగింది. నెల రోజుల నుంచి పట్టాదారు పాసు పుస్తకం కోసం వీఆర్వో ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నాడని మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం కోసం రెండు మూడు సార్లు లంచం తీసుకున్నాడని అయినా ఇంకా పాస్ పుస్తకం ఇవ్వలేదని మండిపడింది. మహిళా రైతు నిలదీయ్యటంతో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ సిబ్బంది అంతా కంగుతిన్నారు, నిరసనను ఆపేసి కార్యాలయం లోకి వెళ్లిపోయారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం మరికొడ గ్రామంలో నిన్న విజయా రెడ్డి చనిపోయిన తర్వాత గుండాల మండలం ఎమ్మార్వో ఆఫీస్ ముందు మండలానికి సంబంధించిన వీఆర్వోలు, తహసిల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జితో నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళ తన ల్యాండ్ వ్యవహారంలో మరిపెడ గ్రామానికి చెందిన వీఅర్వోను ఎదురించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి మరిపెడ గ్రామ వీఆర్వో మాట్లాడుతూ ఆ ల్యాండ్ కి సంబంధించిన విషయంలో 2009 లో మార్తమ్మ తమ తమ్ముళ్ళ నుంచి భూమి రెజిస్ట్రేషన్ చేసుకుందన్నారు. అయితే ఆ భూమి రెజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఆ భూమిలో ఒక సెల్ టవర్ పెట్టించి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తమ్ముళ్ళకు మద్దతు ఇచ్చింది మార్తమ్మ. ఇటీవలె పట్టాలు ఆదునీకరణ చేసే క్రమంలో తన పట్టా మార్పునకు రెవెన్యూ ఆఫీసులో దరఖాస్తు చేసుకుంది, అయితే దీనికి మార్తమ్మ సోదరులు ఇద్దరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో పట్టాను అమలు చేయటం వీలు కాదని స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పారు. తనకు పట్టా ఇవ్వకపోవటానికి వాళ్ళెవరు, మీరెవరు అనీ, మార్తమ్మ తమ్ముళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తనకు పట్టా ఇవ్వట్లేదు అని అదే విధంగా తన వద్ద కూడా రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే నిరసనలో ఉన్న రెవెన్యూ అధికారులను నిలదీసింది.

బొగ్గు విషయంలో కేంద్రానికి లేఖ రాసిన ఏపి సిఎం జగన్...

  ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు, ఒడిస్సా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపి జెన్ కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5010 మెగా వాట్లని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ క్యాలరీస్ నుంచే సరఫరా అయ్యేదన్న జగన్ కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఏపీకి ఇవ్వలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గుమీదే ఆధారపడుతున్నామని వివరించారు. ఒడిస్సాలోని ఐబీ వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని ఒడిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, తెలంగాణ బొగ్గు సంపద రాష్ట్రాలని చెప్పారు జగన్. వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ నుంచి ఏ పీ ఎం డీ సీ కి ఒక గనిని కేటాయించారన్న ముఖ్యమంత్రి ప్రతి గని నుంచి 5 ఎం ఎం టీ ఎల్ తీసుకొచ్చారని చెప్పినట్లుగా వివరించారు. అయితే బొగ్గు వెలికి తీయడానికి నిర్వహణ వ్యయం అధికంగా ఉందని బొగ్గు గనుల చట్టం 2015 ప్రకారం ట్రాంచి ఆరు ను ఏపీ జెన్ కో వినియోగం కోసం ఏపీకి కేటాయించారని లేఖలో తెలిపారు జగన్. 2020 మార్చికి ఏపీ జెన్ కో 1600 మెగావాట్ల అదనపు ఉత్పాదనకు సిద్ధంగా ఉందన్నారు. ఒడిస్సా మందాకిని కోల్ బ్లాక్ ని ఏపీకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసి కార్మికుల వ్యవహారంలో కేంద్రం తల దూర్చనుందా..?

  ఆర్టీసీ కార్మికులు ఈ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఉండవని సర్కార్ స్పష్టం చేసింది. ఈ నెల 7 న హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువు లోపు విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగాలు కాపాడుకోవడమా కోల్పోవడమా అనేది కార్మికులే తేల్చుకోవాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గడువు తర్వాత ఒక్క కార్మికుడ్ని కూడా చేర్చుకునే ప్రసక్తే లేదంటున్నారు కేసిఆర్. గడువులోగా కార్మికులు చేరకుంటే మిగిలిన 5000 రూట్ల లోనూ ప్రైవేటు వాహనాలకు అనుమతులిస్తామని తేల్చి చెప్పారు. మరో 5000 ప్రైవేటు వాహనాలకు అనుమతులిస్తే రాష్ట్రంలో ఇక ఆర్టీసీ ఉండదు అని కేసీఆర్ అన్నారు. హైకోర్టులో విచారణను చూసి కార్మికులను యూనియన్లు మభ్యపెడుతున్నాయి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చే అవకాశం లేదంటున్నారు. హై కోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమత్రి పేర్కొన్నట్టుగా సమాచారం.  కేసీఆర్ స్వయంగా డెడ్ లైన్ విధించినా కార్మికులు పెద్దగా విధుల్లో చేరలేదని ఆర్టీసీ, జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని కోరారు, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి అంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను మానవీయ కోణంలో చూడాలని అంటున్నారు. చర్చిస్తే తాము సమ్మె విరమించటానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. బేషరతుగా విధుల్లో చేరడాన్ని కార్మికులు అంగీకరించడం లేదని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.  గడువు లోగా విధుల్లో చేరాలనుకునే ఉద్యోగులు తాము పని చేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల జాయినింగ్ లెటర్ ఇవ్వొచ్చని ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసులో గానీ లేఖలు ఇవ్వొచ్చన్నారు. అలాగే తాము పని చేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయం, డీవీఎం, రీజనల్ మేనేజర్ కార్యాలయాలలోను జాయినింగ్ లెటర్స్ అందజేయుచున్నారు. ఇక హైదరాబాద్ లో పనిచేసే కార్మికుల బస్ భవన్ ఈడీ ఓపీ సేవలలో అందించొచ్చని సునీల్ శర్మ చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్టుగా ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె దాని స్థితిగతులపై కేంద్రం ఆరా తీస్తోందా, బిజెపి అధిష్టానం దృష్టికి ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని తీసుకువెళ్ళి రాష్ట్ర కమలదళం కేంద్రం జోక్యాన్ని కోరుతుందా, ఒకవేళ కేంద్రం ఎంటరైతే ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ కారణం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాయబోతున్న లేఖ, కార్మికుల డిమాండ్లు ఆర్టీసీ స్థితిగతుల పై ఇప్పటికే సునిల్ శర్మ కేంద్ర రవాణా శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. దానికి స్పందన లేదని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాయబోతున్నట్లు సమాచారం.  

పోలవరం పనులు ప్రారంభించిన 4 రోజులకే అదనపు ఖర్చు... రివర్స్ పంచ్!!

  రివర్స్ టెండరింగ్ విజయవంతమైంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో 628 కోట్ల రూపాయలు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది కానీ, ఇప్పుడు ఆదా కూడా రివర్సవుతోంది. కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తానికి అదనంగా 500 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సమాయత్తమవుతోంది. ఆ సంస్థ పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే అదనపు చెల్లింపులకు సిద్ధం కావటం విశేషం. తాజా అంచనాల మేరకు ధరల సవరణ కూడా జరిగితే రీటెండర్ లో మిగులంతా కొట్టుకుపోతుందని నిపుణులంటున్నారు.  పోలవరం హెడ్ వర్క్స్ లో మిగిలిన పనులు జల విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని కలిపి ఒకటే ప్యాకేజ్ గా 4,987 కోట్లకు జల వనరుల శాఖ రివర్స్ టెండర్ ను పిలిచింది. ప్రీ బిడ్ సమావేశానికి ఆరు సంస్థలు వచ్చినా చివరకు ఒకే సంస్థ బిడ్ దాఖలు చేసింది. అంచనా వ్యయం కంటే దాదాపు 12.6 శాతం తక్కువగా.. అంటే 4,359 కోట్లతో పనులు పూర్తి చేస్తామని సంస్థ తెలిపింది. రివర్స్ టెండర్ విధానంలో బిడ్ లను పిలిచినప్పుడు కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు పాల్గొనాలి. ఇక్కడ ఒకటే సంస్థ బిడ్ దాఖలు చేయటంతో దీన్ని రీటెండర్ గా జల వనరుల శాఖ గుర్తించింది. అటు జల విద్యుత్ కేంద్రం రివర్స్ టెండర్ల పైన హై కోర్టు స్టే ఎత్తివేయటంతో అదే సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.  గతంలో కాంట్రాక్టు సంస్థ పనులు చేసినపుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం ప్రకారం టన్నుకు 375 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తంతో పాటు జీఎస్టీ ఇతర పన్నులు, టెండర్ డాక్యుమెంట్ పరిధిలోకి రాని పనులకు ప్రభుత్వం అదనంగా చెల్లించాలని కొత్త కాంట్రాక్టు సంస్థ జలవనరుల శాఖకు తాజాగా లేఖ రాసింది. దీనిపై పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సానుకూలంగా స్పందించారు. ఇసుకకు టెండరు డాక్యుమెంట్ లో లేని ఇతర పనులు చేసేందుకు అదనంగా డబ్బు చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ అడగడం, అందుకు జల వనరుల శాఖ సుముఖత వ్యక్తం చేయడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ వేసినప్పటికే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం రద్దయ్యింది, బిడ్ వేసినప్పుడు ఇసుక ప్రస్తావన తీసుకురాకుండా ఇప్పుడు చెల్లింపులు జరపాలని కోరడం తగదని అంటున్నారు.

ఎమ్మార్వో హత్య వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం!!.. తీగ లాగితే?

  పట్టపగలు తన ఆఫీసులోనే ఎమ్మార్వో విజయారెడ్డి అగ్నికి ఆహుతి కావడం తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సురేష్ అనే ఓ సాధారణ వ్యక్తి పట్టపగలు ఆఫీస్ కి వెళ్లి ఎమ్మార్వోని హత్య చేయడం ఒక్కసారిగా కలకలం రేపింది. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోను హత్య చేసానని సురేష్ చెప్తున్నప్పటికీ.. ఈ హత్య వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాను చెప్పిన పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని.. అయినా ఎమ్మార్వో వినలేదన్న కోపంతో చంపే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకు ముందు స్థానిక ఎమ్మెల్యే ఇదే విషయమై అనేక సార్లు ఒత్తిడి తెచ్చారని, కానీ ఈ భూమి వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎమ్మార్వో ఆ సాహసం చేయలేకపోయారని చర్చ సాగుతోంది. ఇదే విషయంపై ఇద్దరు స్థానికులు మాట్లాడుకుంటున్న ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోన్ సంభాషణ ప్రకారం.. ఎమ్మార్వో హత్య కేసులో టీఆరెఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూముల పాత పంచాయితీల్లో ఎమ్మెల్యే వేలు పెట్టారని, తాను పరిష్కారం చూపిస్తానని.. 30లక్షలు వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం 412 ఎకారాల భూమి ఎప్పటి నుండో వివాదాల్లో ఉందని, కోర్టులో కేసు నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివాదానికి పరిష్కారం చూపిస్తానని రైతుల దగ్గర నుండి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారని, సురేష్‌ నుండి కూడా 3లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పని కాకపోవటంతో కొంతమేర తిరిగి ఇచ్చి, మిగతా సొమ్ము ఎమ్మెల్యే ఇవ్వలేదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. భూమి వ్యవహారం కోర్టులో ఉండటంతో ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చినా ఎమ్మార్వో అంగీకరించలేదు. దీంతో సురేష్ కూడా ప్రత్యక్షంగా ఎమ్మార్వో మీద ఒత్తిడి తెచ్చాడని అంటున్నారు. ఒత్తిడి తెస్తున్నా, ఎమ్మార్వో మాట వినడం లేదని.. అందుకే బెదిరించే ఉద్దేశంతో సురేష్ పెట్రోల్ పోసి ఉంటాడని, కానీ అది హత్యకు దారి తీస్తుందని ఊహించి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మరి సురేష్ నిజంగానే బెదిరించే ఉద్దేశంతోనే పెట్రోల్ పోశాడా? లేక నిజంగానే హత్య చేయాలనే ఉద్దేశంతోనే పోశాడా?. ఒకవేళ హత్య చేయాలనే ఉద్దేశంతో పోస్తే అసలు అతనికి అంత ధైర్యం ఎక్కడిది? నిజంగానే అతని వెనుక రాజకీయ శక్తుల ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి కూడా ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నా భార్య మృతికి సురేష్‌ ఒక్కడే కారణం కాదని.. అతని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, వారెవరో తేలాలంటే.. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసారు. విపక్షాలు, ప్రజా సంఘాలు కూడా ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం.. ఓ ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ కార్యాలయంలోనే సజీవ దహనం చేసిన ఘటనను సీరీయస్‌గా తీసుకొని.. కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయించి నిందితులకు శిక్ష పడేలా చేస్తుందేమో చూడాలి.

ఆసక్తితో చేరా... ఆవేదనతో వీడుతున్నా... ఓ కానిస్టేబుల్ వ్యథ..! 

  ఒకప్పుడు పోలీస్ శాఖలో ఉద్యోగమంటే పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు... దాంతో, కిందిస్థాయి ఉద్యోగుల ఎంపికకు అసలు పరీక్షలే ఉండేవి కాదు... ఒకచోట అడ్డంగా ఒక తాడు కట్టి... దాని కింద నుంచి పంపేవారు. ఎవరి తల అయితే ఆ తాడుకి తగులుతుందో... వాళ్లను కానిస్టేబుల్స్ గా ఎంపిక చేసేవారు. అంటే, ఒక మోస్తరు ఎత్తు ఉంటే చాలు కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిపోయేవారు... కానీ రోజులు మారాయి... పెద్దపెద్ద చదువులు చదివినా... ఉద్యోగాలు, ఉపాధి దొరకని పరిస్థితి వచ్చింది... దాంతో, బీటెక్ లు, ఎంటెక్ లు, ఎంఏ, ఎమ్మెస్సీ... ఇలా డిగ్రీ, పీజీ, ఆపై చదువులు చదివిన వాళ్లంతా... కానిస్టేబుల్, హోంగార్డుల ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. కేవలం టెన్త్ అండ్ ఇంటర్ మాత్రమే కనీస అర్హతతో భర్తీ చేసే కానిస్టేబుల్ పోస్టులకు ఉన్నత చదువులు చదివినవాళ్లంతా పోటీపడుతుండటంతో... ఉద్యోగాలకు దాదాపు వాళ్లే ఎంపికవుతున్నారు. అయితే, కానిస్టేబుల్, హోంగార్డులంటే ప్రజల్లోనే కాదు... పోలీస్ శాఖలోనే చిన్నచూపు ఉందని, ఉన్నతాధికారులు వాళ్లను కనీసం ఉద్యోగులుగానే గుర్తించరనే అపవాదు ఉంది. కానిస్టేబుల్స్, హోంగార్డులకు అంటే కనీస గౌరవం ఇవ్వరని... ఎస్సై నుంచి ఆపై స్థాయి అధికారులంతా... వాళ్లను చిన్నచూపు చూస్తారని అంటారు. కానిస్టేబుల్స్, హోంగార్డుల చేత ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయించుకున్న ఘటనలు ఎన్నో బయటపడ్డాయి. ఇక, విధి నిర్వహణలోనూ కానిస్టేబుల్స్ దే కీలక పాత్ర. గ్రౌండ్ లెవల్ లో చెమటోడ్చిది వాళ్లే. బందోబస్తులైనా... ఇంకేదైనా కానిస్టేబుల్స్ లేకపోతే ఏ పనీ జరగదూ... అసలు కానిస్టేబుల్స్ లేకుండా పోలీస్ శాఖను ఊహించుకోవడం కష్టమే. అంతటి కష్టాన్ని, శ్రమను భరిస్తూ వేళాపాళాలేని టైమింగ్స్ తో విధులు నిర్వర్తించే తమకు కనీస గుర్తింపు దక్కడం లేదని కానిస్టేబుల్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమ జీవితాలు మాత్రం మారడం లేదని అంటున్నారు. కానిస్టేబుల్ గా చేరి... చివరికి కానిస్టేబుల్ గానే పదవీ విరమణ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మిగతా శాఖల్లో కనీసం అటెండర్ గా ఉద్యోగంలో చేరినా... అతడు పదవీ విరమణ చేసే సమయానికి మంచి పొజీషన్ లో ఉంటాడని, కానీ పోలీస్ శాఖలోని కానిస్టేబుల్స్ కు ఎదుగుబొదుగూ లేదంటున్నారు. ఎస్సైలకు కనీసం పదేళ్లకే ప్రమోషన్ లభిస్తుంటే... కానిస్టేబుల్స్ మాత్రం వాళ్ల మొత్తం సర్వీసులో ఒక్క పదోన్నతి కూడా లేకుండా పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.     అయితే, ఉన్నత విద్యావంతులు... ఉద్యోగం కోసం కానిస్టేబుల్స్ గా చేరినా... ఆ తర్వాత ఎదురవుతున్న చిన్నచూపు, చీత్కారాలతో పునరాలోచనలో పడుతున్నారు. తాజాగా ఒక కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది. అతడు రాసిన లేఖ ఇలాగుంది... నా పేరు ప్రతాప్... ఇంజనీరింగ్ పూర్తిచేసి 2014లో కానిస్టేబుల్(పీసీ నెం 5662)గా ఎంపికై చార్మినార్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా... పోలీస్ శాఖపై అమితాసక్తితో అడుగుపెట్టిన నేను నా విధుల్ని త్రికరణ శుద్ధితో నిర్వర్తించా... అనేకసార్లు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నా... అయితే, నా వయసు 29ఏళ్లు కావడంతో నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు... కానీ, నేను కానిస్టేబుల్ అని తెలియడంతో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే, ఓ యువతి నన్ను తిరస్కరించడానికి కారణాలేంటని ఆరా తీసినప్పుడు... ఆమె చెప్పిన కారణాలు నిజమేననిపించింది... కానిస్టేబుళ్లు 24గంటలూ గొడ్డుచాకిరి చేస్తారని, వాళ్లకసలు కనీస గౌరవం ఉండదని, అసలా ఉద్యోగంలో ఎదుగుబొదుగూ ఉండదని, కానిస్టేబుల్ గానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చిందని... అయితే ఆమె చెప్పిన కారణాలన్నీ నిజమే కావడంతో తాను తీవ్రంగా మనస్తాపం చెందటంతోపాటు... నా ఉద్యోగం పట్ల డిప్రెస్ ను గురయ్యానని... నా సీనియర్లు 35ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తున్నా... కానిస్టేబుల్ గా పదవీ విరమణ చేయడాన్ని తాను గుర్తించానని... అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశాడు. దాంతో, కానిస్టేబుల్ ప్రతాప్ రాజీనామాను ఆమోదిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీవో నెం.9583/2019 జారీ చేశారు. అయితే, కానిస్టేబుల్ ప్రతాప్ రాజీనామాపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇబ్బందులున్న మాట నిజమేనని, ఎక్కువమంది కానిస్టేబుల్స్ గానే రిటైర్ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు. కానిస్టేబుల్స్ లో చాలా మంది లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నా... పదోన్నతులు మాత్రం లభించడం లేదని అంటున్నారు. అయితే, దీనికి కారణం... ఎస్సై... ఆపై పోస్టులు తక్కువగా భర్తీ కావడం... కానిస్టేబుల్స్ మాత్రం వేలల్లో రిక్రూట్ కావడమే ప్రధాన కారణమని అంటున్నారు.

ఆర్టీసి కార్మిక సంఘాలకు అర్ధరాత్రి వరకు డెడ్ లైన్... వాట్ నెక్స్ట్?

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఈ రోజు సాయంత్రంతో ముగియబోతోంది. మరోవైపు కార్మిక సంఘాలు చర్చలకు పిలిస్తే సమ్మె విరమించటానికి సిద్ధంగా ఉన్నాము కానీ, బేషరుతగా ఉద్యోగాలలో చేరేది లేదని చెబుతున్నారు. ఖచ్చితంగా అందరూ సమ్మె వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు, అటు హైకోర్ట్ చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నప్పటికీ కూడా చర్చల్లో జరగాల్సిన న్యాయం జరగడం లేదు అన్నదే మొదట్నుంచీ జెఏసి చెప్పుకొస్తున్న మాట. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ విధించారు, ఈ సారి మాత్రం ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోపు ఖచ్చితంగా కార్మికులు ఉద్యోగాల్లో చేరాలి లేకపోతే బేషరుతుగా ఉద్యోగాల్లోంచి తొలగించబడతారని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనిని కార్మికులు ఎలా తీసుకుంటారనే దానిపైన కూడా ఒకింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే మానవహారాలతో ప్రతి జంక్షన్ వద్ద నిరసన తెలియజేయడానికి కార్యాచరణ రూపుదాల్చనున్న నేపథ్యంలో ఈ సారి ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తుంది, ఈ రోజు అర్ధరాత్రి లోపు చేరకపోతే ఖచ్చితంగా ఆర్టీసీలో ఉండరు అని చెప్తున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కూడా దానికి తగ్గ కార్యాచరణను రూపొందించుకుందనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు అఖిల పక్ష సమావేశంతో పాటు ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా కలిసి సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చించబోతున్నారు.  

అధికారులపై సీఎం జగన్ ఫైర్.. వైఎస్సార్ పేరు తొలగించండి!!

  ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముందుగా చేసే పని.. పథకాలకు పేర్లు, భవనాలకు రంగులు మార్చడం. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ కూడా అదే చేసింది. పలు పథకాలకు పేర్లు మార్చింది. సీఎం జగన్.. ఆయన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుని పథకాలకు జోడించారు. ఇక రంగుల సంగతి సరేసరి. పలు ప్రభుత్వ భవనాలను వైసీపీ జెండా రంగులు కప్పేశాయి. అత్యుత్సాహానికి పోయి కొన్ని చోట్ల.. స్మశానాలు, బోరు పంపులకు కూడా పార్టీ జెండా రంగులు వేశారు. ఒక గ్రామంలో అయితే ఏకంగా జాతీయ జెండా రంగులనే తమ రంగుతో కప్పేశారు. వీటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా రంగు పడుతూనే ఉంది. అయితే తాజాగా వైసీపీ సర్కార్ కి ఓ పెద్ద తలనొప్పి వచ్చి పడింది. చివరికి సీఎం జగన్ రంగంలోకి దిగి వైఎస్సార్ పేరుని తొలగించండని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. నవంబర్ 11న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకునే.. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార అవార్డుల’ పేరును ‘వైఎస్‌ఆర్ విద్యా పురస్కార అవార్డులు’గా మార్చుతూ సోమవారం నాడు అధికారులు జీవో జారీ చేశారు. అయితే ఈ జీవో పెను దుమారమే రేపింది. విద్యార్థులను, యువతను ఎంతో ప్రభావితం చేసిన అబ్దుల్ కలాం పేరుని తొలగించడం ఏంటని విమర్శలు వ్యక్తమయ్యాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఎంతో గౌరవించే వ్యక్తి పేరుని తొలగించి ఇంతలా అవమానపరుస్తారా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు.  జీవో రావడంతోనే తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడంతో.. సీఎం జగన్ అధికారులపై ఫైర్ అయ్యారు. అసలు తన దృష్టికి తీసుకురాకుండా పేరు ఎందుకు మార్చారంటూ మండిపడ్డారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. మరికొన్ని అవార్డులకు కూడా మహనీయుల పేర్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. గాంధీ, అంబేద్కర్, పూలే, జగ్జీవన్‌రామ్‌ పేర్లతో అవార్డులు ఇవ్వాలని జగన్‌ సూచించారు.