హస్తినలో చంద్రబాబు, లోకేష్ హవా.. అడిగిందే తడవుగా కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ఎవరికైనా సరే ఢిల్లీలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ లు లభించడం అంత  తేలికైన విషయం కాదు. ఇదేమీ రహస్యం కాదు. అందరికీ తెలిసిన విషయమే.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్ల కోసం ఎన్ని తిప్పలు పడ్డారో తలియంది కాదు. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా మోడీ అప్పాయింట్ మెంట్ లభించడం గగనంగా మారిన పరిస్థితులు చూశారు. గతానికీ, ఇప్పటికీ హస్తినలో కేంద్ర మంత్రుల అప్పాయింట్ మెంట్లు పొందడమనే విషయంలో పెద్ద మార్పేమీలేదు. అదే కష్టం. అదే జాప్యం. అయితే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల విషయంలో మాత్రం లేదు. వారికి వెంటవెంటనే అప్పాయింట్ మెంట్లు దొరుకుతున్నాయి. ప్రధాని మోడీ అయితే లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు. దీనిని బట్టే ఎన్డీయేలో తెలుగుదేశం ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటో అర్ధమౌతుంది.   ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 15 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనీసం 12 సార్లు హస్తినలో పర్యటించారు. ఆయా సందర్భాలలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.  తాజా హస్తిన పర్యటనలో కూడా చంద్రబాబు పలువురు కేందర్ మంత్రులతో వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులకు నిదులు కేటాయించాలని కోరారు. చంద్రబాబు తాజా పర్యటనకు కేవలం రెండుమూడు రోజుల మంత్రి ఏపీ మంత్రి నారా లోకేష్ హస్తినలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా లోకేష్ ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతకు అద్దంపడుతోందనడంలో సందేహం లేదు.  ఈ ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు ప్రధాన కారణం ఎన్డీయేలో తెలుగుదేశం పాత్ర అత్యంత కీలకం కావడమే. కేంద్రంలోని మోడీ సర్కార్ మనుగడకు తెలుగుదేశం పార్టీ మద్దతు అత్యవసరయన్న సంగతి తెలిసిందే.   

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతుపై చంద్రబాబు ఏమన్నారంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతీయ రాజకీయాల్లో ఊహించని  సమీకరణాలకు, అనూహ్య పరిణామాలకూ తావిచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై పలు రకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్, జగన్ తొడబుట్టిన సోదరి షర్మిల సహా పలువురు జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయంగా ఓ సిద్ధాంతమంటూ  లేని పార్టీగా వైసీపీని అభివర్ణిస్తున్నారు. పార్టీ అధినేత స్వప్రయోజనాల పరిరక్షణ వినా వైసీపీకి మరో సిద్ధాంతం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. జగన్ సోదరి షర్మిల అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ ను ప్రధాని మోడీ దత్తపుత్రుడిగా పేర్కొన్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పించేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జగన్ ను ఆయన సోదరి షర్మిల మోడీ దత్తపుత్రులు అంటూ విమర్శలు గుప్పించారు. రహస్య ఒప్పందాలు, సీక్రెట్ డీల్సే జగన్ రాజకీయం అని దుమ్మెత్తి పోశారు.  ఆ విమర్శలు, వ్యాఖ్యలు పక్కన పెడితే.. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. తన వ్యాఖ్యలతో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. హస్తిన పర్యటనలో భాగంగా  మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై సునిశిత విమర్శలు చేశారు. నేరుగా జగన్ ను విమర్శించకుండానే ఆయన సిద్ధాంత రాహిత్యాన్నీ, అవకాశవాద రాజకీయాన్నీ ఎండగట్టారు. మీడియా సమావేశంలో ఓ విలేకరి వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వడంపై  అడిగిన ప్రశ్నకు చంద్రబాబు.. ఆ విషయం తనను కాదు జగన్ ను అడగాలని బదులిస్తూనే.. తెలుగుదేశం ఎన్డీయేలో కీలక భాగస్వామి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి ఏకగ్రీవంగా రాథాకృష్ణన్ ను ఎంపిక చేసింది. అందుకే మరో మాటకు అవకాశం లేకుండా తమ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు.  ఈ ఒక్క మాటతో చంద్రబాబు జగన్ పార్టీ మద్దతు రాజకీయపరమైనది కాదని ఎండగట్టేశారు. అదే సమయంలో జగన్ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించడం పూర్తిగా వ్యక్తిగత అజెండా అనీ, అవకాశవాదమనీ చెప్పకనే చెప్పేశారు.  జగన్ నిర్ణయం గురించి తాను మాట్లాడనని చెబుతూనే.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కీలక భాగస్వామి అని, ఆ కూటమితో జగన్ కు కానీ వైసీపీకి కానీ ఎలాంటి సంబంధం లేదనీ చెప్పకనే చెప్పేశారు. తద్వారా జగన్ మద్దతు వెనుక ఆయన స్వార్థ ప్రయోజనం వినా మరో కారణం లేదని పరోక్షంగా తేల్చేశారు. 

రోడ్డు ప్రమాదంలో ఓ ఊరు మొత్తం తగలడిపోయింది!

పంజాబ్ లో అత్యంత ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఓ ఊరు మొత్తం దాదాపు తగలడిపోయింది. పలువురు గాయపడ్డారు. మరింత మంది గల్లంతయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. వివరాలిలా ఉన్నాయి.   పంజాబ్‌  హోషియార్‌పూర్‌లోని మాండియా పారిశ్రామిక వాడ సమీపంలో ఎల్‌పిజి ట్యాంకర్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ వెంటనే గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘోర సంఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.   

చంద్రబాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారు. దేశంలోని   ముఖ్యమంత్రుల్లో  అందరికంటే చంద్రబాబు ఆస్తుల విలువే అధికమని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యు) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. చంద్రబాబు ఆస్తుల విలువ  రూ.931 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. చంద్రబాబు తరువాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ రూ.332 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ నివేదిక ప్రకారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ. 51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో  నిలిచారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇక ఆదే నివేదిక దేశవ్యాప్తంగా  12 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసుల వివరాలను కూడా పేర్కొంది.    తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులతో ఈ నివేదికలో తొలి స్థానంలో నిలిచారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ పై 47 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో 19 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు.  

సురవరం ద లీడర్‌!

లీడర్‌.. తన పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్‌. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాగ్ధాటితో, వాదనా పటిమతో  ప్రత్యర్థులను నిరుత్తరులను చేయడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడంద్వారానే నాయకుడనిపించుకుంటారు. అటువంటి సమర్ధ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి.  అధ్యయనం, అవగాహన, ఆచరణ.. త్రివేణి సంగమంగా మదిలో, హృదిలో మథనంతో జనాభ్యుదయం,  దేశ హితం కాంక్షించి, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆజన్మాంతం కమ్మూనిస్టు పార్టీతో కలిసి నడిచిన నేత సురవరం సుధాకరరెడ్డి.   మతవాద, మితవాద రాజకీయాల్లోని క్రూరత్వాన్ని, కుటిలత్వాన్ని, స్వార్థపూరిత దోపిడీ విధానాలను ఎండగడుతూ లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు అండగా  నిలిచిన నేత సురవరం సుధాకరరెడ్డి. నమ్మిన సిద్ధాంతాల కోసం ఆజన్మాంతం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు.   నిజమైన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి.  పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించడం నేర్చుకుని,   విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నారు. తన వాగ్దాటితో జనార్షక నేతగా ఎదిగారు. తన అధ్యయనం, సైద్ధాంతిక బలంతో దార్శనికునిగా ఎదిగారు.  భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా, ఎటువంటి భేషజాలు లేకుండా సామాన్యులలో సామాన్యుడిగా ప్రజలతో మమేకమయ్యారు. రజాకార్లు తమ ఇంటిని తగలబెట్టినా, కుటుంబాన్ని వెంటాడినా  వెరవకుండా ప్రజా ఉద్యమబాట వదలకుండా సాగారు.  ప్రతి ప్రతిబంధకాన్నీ తన పోరాటానికి నిచ్చెన మెట్లుగా మలచుకున్న నిజమైన ప్రజానాయకుడు సురవరం సుధాకరరెడ్డి. ప్రజా పోరాటాలలో పాల్గొని జైలు పాలైనా కూడా ఆ చెరసాలనే మరింత ఉధృతమైన పోరాటాలకు పురిటి గదిగా మార్చుకున్నారు.  ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటంలో  ముందున్నారు.   పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టినా.. కార్యకర్త నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినా  ఆయన ఆలోచన, ఆచరణలో ఏ మార్పులేదు. నిరాడంబరత ఆయన శైలి. నల్లకుబేరుల జాతకాలపై తొలిసారి పార్లమెంటు వేదికగా గళం విప్పిన ఘనత సురవరం సొంతం. అటువంటి ప్రజాపోరాట యోధుడు సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి కన్నుమూశారు. సురవరం మృతికి సంతాపం తెలుపుతూ.. అలుపెరుగని ఆ పోరాట యోధుడికి నివాళులర్నిస్తోంది తెలుగువన్. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న  తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ,ర విదేశాల నుంచి కూడా తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తుల తరలి స్తుంటారు. తిరుమల నిత్యం భక్త జనసందోహంతో కిటకిట లాడుతుంటుంది. శనివారం (ఆగస్టు 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (ఆగస్టు 22) శ్రీవారిని మొత్తం 72 వేల 67 మంది దర్శించుకున్నారు. వారిలో   25,212 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.75 కోట్లు వచ్చింది.  

సురవరం సుధాకరరెడ్డి అస్తమయం

సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి  కన్నుమూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు.  ఆయనకు భార్య డాకర్‌ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్‌, కపిల్‌ ఉన్నారు.   ఆయన సతీమణి కూడా కమ్యూనిస్టు నాయకురాలే.  ఏఐటీయూసీలో పని చేస్తున్నారు. సురవరం ఆరోగ్యం క్షీణించడంతో గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది సేపటికే సురవరం మరణవార్త తెలియడంతో కమ్యూనిస్టు నాయకులు, శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె. నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  పల్లా వెంకట్‌రెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి. నరసింహ, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, పల్లా నర్సింహారెడ్డి,  సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ హుటాహూటిన ఆసుపత్రికి వెళ్లి సురవరం భౌతిక కాయానికి నివాళి అర్పించారు.   ముఖ్యమంతి  రేవంత్‌రెడ్డి, ప్రతిపక్షనేత కేసీఆర్, టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సహా పలువురు నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.  విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌ నాయుడు, సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఒంగోలు నుంచి సంతాపం తెలియజేశారు.  సురవరం కుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆయన తుది సంస్కారం ఆదివారం (ఆగస్టు 24)న జరగనుంది.  సురవరం భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధంఆదింవారం ఉదయం పది గంటలకు మగ్ధుంభవన్ తరలిస్తారు.  మధ్యాహ్నం అంతిమ యాత్ర జరగనుంది. అదే రోజు సాయంత్రం సురవరం పార్థీవ దేహాన్ని  గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు.  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో 1942, మార్చి 25న జన్మించిన సురవరం సుధాకరరెడ్డికి తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి  పెదనాన్న. సుధాకరరెడ్డి ప్రాథమిక విద్య కంచుపాడులో జరిగింది.   ఆ తరువాత కర్నూలులోని కోల్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. కర్నూల్‌లోనే ఉస్మానియా డిగ్రీ కాలేజీలో బిఎ చదివారు. అదే సమయంలో ఆయనకు విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలు ఏర్పడి, ఎఐఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయన హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై  పోరాటాలు చేశారు.  అనంతరం పార్టీ ఆదేశాల మేరకు విశాలంధ్ర విలేకరిగా హైదరాబాద్‌కు వచ్చారు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి అడ్మిషన్‌ లభించింది. ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో పని చేశారు. ఆ సమయంలోనే  దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు కలకత్తా, ఢిల్లీ, లక్నో  జైళ్లలో శిక్షలు అభవించారు. సురవరం సుధాకరరెడ్డి    చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌.   రాష్ట్రానికి తిరిగి వచ్చి పార్టీ నిర్మాణంలో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తూ కర్నూలు జిల్లా, నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దకొత్త పల్లి మండలంలో, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో పాటియాల రాజా భూముల ఆక్రమణ పోరాటాల్లో పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీల పెంపుదల వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన సమయంలో గుర్రాలతో తొక్కించడంతో  గాయపడ్డారు.  ఆయనపై ప్రభుత్వం పలు కేసులు బనాయించింది. అయినా ఎక్కడా వెరవలేదు. ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు. సురవరం సుధాకరరెడ్డి ప్రాజెక్టుల కోసం పదిరోజులు పాదయాత్ర నిర్వహించారు. అలాగే విశాలాంధ్ర విజ్ఞాన సమితి గవర్నింగ్‌బాడీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా యువజన  మాసపత్రిక, యూత్‌ లైఫ్‌ మాసపత్రిక,  న్యూ జనరేషన్‌ వారపత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు.  ఆంధ్రప్రదేశ్‌ దర్శిని  ఎడిటోరియల్‌ బోర్డ్‌ సభ్యునిగా పనిచేశారు. 1995 ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు సమితి సహాయ కార్యదర్శిగా  పనిచేశారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి  ఎంపిగా విజయం సాధించారు.  2004 యుపిఎ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అసంఘటిత కార్మికుల సంక్షేమ ముసాయిదా బిల్లును రూపొందించడంలో సురవరం సుధాకరరెడ్డి కీలక పాత్ర పోషించారు. అలాగే ఐక్యరాజ్య సమితి  సాధారణ  సమావేశాల్లో భారత పార్ల మెంట్‌ తరుపున   ప్రతినిధిగా వెళ్లారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన సుధాకరరెడ్డి ఆ తరువాత  2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు.   2019 జులై 24న అనారోగ్యం కారణంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని

    సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా మరోసారి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన 4వ రాష్ట్ర మహా సభలో ఆయన పేరును సీనియర్ నేత పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా, మరోనేత శంకర్ బలపరిచారు. కూనంనేని వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యీరు.మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.  . కొత్తగూడెం పట్టణానికి చెందిన కూనంనేని సాంబశివరావు మొదట  పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. విశాలాంధ్ర పత్రికలో జర్నలిస్టుగానూ పనిచేశారు. 1984లో పట్టణ సీపీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1987లో కొత్తగూడెం మండలపరిషత్ ఎన్నికల్లో గెలిచి మండలాధ్యక్షుడు అయ్యాడు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. 2005 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2009లో సిట్టింగ్ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఓడించి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

రామ్మోహన్ నాయుడు ఇంటికి చంద్రబాబు... చిన్నారికి ఆశీస్సులు

  ఏపీ చంద్రబాబు హస్తినలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాసంలో సందడి చేశారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఆయన కుటుంబాన్ని పలకరించారు. ఇటీవల రామ్మోహన్ నాయుడు దంపతులకు కుమారుడు జన్మించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి వారిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు కుమారుడిని చంద్రబాబు ఆప్యాయంగా ఎత్తుకుని ఆశీర్వదించారు. చిన్నారికి తన దీవెనలు అందించి, ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ పలకరింపుతో రామ్మోహన్ నాయుడు నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రాక పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పదివేల చీరలన్న పవన్...ఏవయ్యా ఆ చీరలు.. ఎక్కడ?

  పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ పది వేల చీరలు పంచుతారని తెలియడంతో ప్రసిద్ధ పాదగయ పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా వచ్చారు మహిళా భక్తురాళ్లు. ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం కావడంతో వరలక్ష్మీ వ్రత కూపన్లను పంచారు ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అయితే ఇక్కడ జరిగిన తోపులాటలో భారీ ఎత్తున ఇబ్బంది పడ్డారు మహిళలు. ఈ క్రమంలో కొందరు మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు. ఒక మహిళకు రక్తం రావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ సందర్భంగా మహిళలు పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో దుయ్య బట్టారు. తాను తన ఇద్దరు పిల్లల్ని బెంగళూరు నుంచి తెప్పించి మరీ ఓట్లు వేయించానని.. ఇప్పుడు చూస్తే ఆ ఖర్చు మోయినా కూడా లాభం లేక పోయిందని.. ఒక మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ అయితే పది వేల  చీరలు అని అన్నారు. అవెక్కడికెళ్లాయ్? ఇక్కడ అంత మంది కూడా లేరు. అంటే, జనసేన నాయకులే వీటన్నిటినీ పంచేసుకున్నారు కాబట్టి.. మా వరకూ రాలేదని ఆరోపించారు. చీరలు దక్కక  పోగా మాకు దెబ్బలు తగిలాయని.. కన్నీటి పర్యంతమయ్యారు.  శుక్రవారం పూట పిఠాపురంలో మహిళా భక్తురాళ్లు ఉనసైనికుల నిర్వాకం పుణ్యమాని కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని పిలిచి ఇలా రక్తం కారేలా చేయడం మాకే కాదు, మీకూ మంచిది కాదన్నారు బాధిత మహిళలు. ఈసారి పవన్ ఓట్లకు వచ్చినపుడు తామిదంతా గుర్తు పెట్టుకుని నిలదీస్తామని అన్నారు. సైనికులు చివరికి చీరలను కూడా దోచేస్తున్నారు. వీరికెంత కరవు వచ్చి పడందో అన్న మాట కూడా వినిపిస్తోంది.

గులాబీ బాస్‌కి గుచ్చుకుంటోన్న ముల్లు

  ఘోష్ నివేదిక నేరుగా మాకు ఇవ్వకుండా మీడియాకు ఇవ్వడంలో ఉద్దేశమేంటి? కేసీఆర్, హరీష్ ప్రశ్న. బాగుంది కానీ, ఓటుకు- నోటు కేసులో కేసీఆర్ చేసిందేంటి? అది పనిగా మీడియాకు వీడియోల లీకేజ్ చేసి తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించలేదా? ఇక ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నడిపించిన హైడ్రామాలో మీరు పాటించిన నిబద్ధత ఏపాటిది? అన్నదిక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. తమదాకా వచ్చే వరకూ గులాబీ దళాధిపతికి తెలియరాలేదా? అన్న కోణంలో కొందరు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంలో ఎలాంటి డిజైనింగ్ లోటు లేదని చెబుతున్నారు సరే. మరి ఈఈలు, ఈఎన్సీలు ఇంత భారీ ఎత్తున ఎలా బొక్కారు? హరిరామ్, శ్రీధర్, మురళీధర్ రావు వంటి వారే వెయ్యి కోట్లకు పైగా వెనకేసిన పరిస్థితి. మరి దీని మాటేంటి? పదే పదే ప్రాజెక్టు వ్యయం పెంచింది నిజం కాదా? ఇదే విషయంపై కోర్టులో దావా వేసిన రాజలింగం అనే సామాజిక కార్యకర్త హతమారిపోవడంలో అంతరార్ధమేంటి?  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సిన పరిస్థితి. దీన్నిబట్టి సీనేంటో అర్ధం చేసుకోవచ్చు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అడిగినట్టు.. కమిషన్ ముందు విచారణకు హాజరైనపుడు తెలియలేదా? ఈ ఘోష్ కమిషన్ రద్దు చేయాలని.. ఇప్పుడే ఎందుకు ఈ పిటిషన్లు వేసినట్టు? అన్న ప్రశ్నలకు కూడా కేసీఆర్ అండ్ కో సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ ఇరవై రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, ఆపై కేబినేట్ భేటీ తర్వాత ఈ వ్యవహారంపైనా ఒక సిట్ వేయడమా? లేక ఏదైనా దర్యాప్తు సంస్థకు అప్పగించడమా? తేలాల్సి ఉందంటున్నారు. మరి చూడాలి ఈ కేసు కేసీఆర్ తదితరులను ఏ స్థాయిలో ఇరుకున పెట్టనుందో తెలాల్సి ఉంది.

కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

    ఓటీటీలో వచ్చే ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసిన బాలుడు... హత్య కంటే రెండు రోజుల ముందే బాలుడు మిషన్ డన్ పేరుతో ఒక లేఖ రాసుకున్నాడు. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రభావితమయ్యాడు. గ్యాస్ లీక్ చేసి పరార్ అవ్వాలని ప్లాన్ చేశాడు. అదే విషయాన్ని మిషన్ డాన్ పేరుతో వచ్చిరాని ఇంగ్లీషు లో ఒక పేపర్ మీద రాసుకున్నాడు. పథకం ప్రకారం పక్కింట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అంతలో అమ్మాయి కనిపించింది. దీంతో భయపడిపోయిన బాలుడు తన దొంగతనం విషయం బయటపడకుండా ఉండడానికి బాలికను అతి దారుణంగా హత్య చేశాడు.  బాలిక సహస్ర హత్య జరిగిన రోజే పోలీసులు బాలు డిని విచారించారు. అయితే విచారణ చేస్తున్న సమయం లోసహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్లానని పోలీసు లను తప్పుదోవ పట్టించాడు. సహస్ర ఇంట్లోంచి నాన్న నాన్న అని గట్టి గట్టిగా అరుపులు వినిపించాయని పోలీసులను నమ్మించాడు. బాలుడు చెప్పిన మాటలు నమ్మిన పోలీసులు సహస్రను ఇతరులు చంపి ఉంటారని అనుమానంతో విచారణ ప్రారంభించారు. ఇలా పోలీసులు గత ఐదు రోజులుగా భవనంలోని ప్రతి ఒక్కరిని విచారించడమే కాకుండా బాలిక తల్లిదండ్రులను కూడా విచారించారు.  ఈ కేసులో ఎస్ఓటి, కూకట్పల్లి పోలీసులు 300 మందిని విచారించారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా కూడా కూకట్పల్లి లో జరిగిన సహస్ర బాలిక హత్య కేసు మిస్టరీ వీడలేదు. ఈరోజు ఉదయం ఎస్వోటీ పోలీసులు మళ్లీ హత్య జరిగిన భవనానికి వెళ్లి ఆధారాలు సేకరి స్తున్న సమయంలో పక్క భవనం నుండి ఈజీగా ఈ బిల్డింగ్ లోకి దూకవచ్చునని  గుర్తించారు. దీంతో ఎస్ఓటి పోలీసులు పక్క బిల్డింగ్ లో ఉన్న వారందరిని విచారించారు. అయితే వర్క్ ఫర్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు తన గది పక్కనే ఓ బాలుడు 15 నిమిషాల పాటు దాక్కొని ఉన్నాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు.  పక్క భవనంలోనే ఆ బాలుడు ఉంటాడని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడికి కోసం వెంటనే స్కూలుకు వెళ్లి స్కూల్లోనే బాలుడిని పక్కకు పిలిచి విచారణ చేశారు. తనకు హత్యకు ఎటువంటి సంబంధం లేదని మరోసారి బాలుడు పోలీసులను తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులకు బాలుడి పై అనుమానం వచ్చి అతన్ని తీసుకొని ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీ చేయగా.. కత్తి, రక్తంతో కూడిన దుస్తులు, పక్క ఇంట్లో దోచుకునేందుకు ప్లాన్ వేసిన మిషన్ డౌన్ పేరుతో  రాసుకున్న లేఖ లభ్యమైంది.  దీంతో ఎస్ఓటి పోలీసులు వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే బాలుడి కుటుంబ సభ్యులు ఈ ఫ్లాట్లోకి వచ్చారు. ఇదే ప్రాంతంలో కిరాణా షాప్ నడుపుతు న్నారు. హత్య చేసిన బాలుడు మరియు  మృతు రాలి తమ్ముడు స్నేహితులు.... ఈ క్రమంలోనే మృతు రాలు సహస్ర పుట్టినరోజు వేడుకలకు నిందితుడు హాజరయ్యాడు.

ఏంటేంటీ వైఎస్ఆర్సీపీ... కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీనా!?

  వైసీపీ కాంగ్రెస్‌కి వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ కాబ‌ట్టి.. మేం ఆ పార్టీకి అనుకూలంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేం అంటారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స‌. ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే మా పార్టీ అంటూ పులిహోర క‌లుపుతున్న బొత్స  ఆ టైంలో ఉన్న పార్టీ కాంగ్రెస్.  ఇదిలా ఉంచితే, వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం ఏపీలోని కాంగ్రెస్ ది. ఇప్ప‌టికి వైసీపీ కి ఉన్న 39. 5 ఓటు శాతం మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిష్టియ‌న్ మైనార్టీ. వీళ్లంతా.. దాదాపు కాంగ్రెస్ సాలిడ్ ఓటు బ్యాంకే. ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌నాంత‌రం త‌గిన ఆద‌ర‌ణ లేక పోవ‌డంతో ఆ మొత్తం ఓట్ షేర్ మొత్తం వైసీపీకి వెళ్లిపోయింది. లిట్ట‌ర‌ల్ గా మాట్లాడితే ఏపీలోని వైయ‌స్ఆర్సీపీ ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ దే. ఇందులో నో డౌట్.  ఇంకో ముచ్చ‌ట ఏంటంటే ఎన్డీయే కూట‌మికి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన స‌ర‌కు స‌రంజామా మొత్తం రెడీగా ఉంది. 788 మంది ఎల‌క్టోర‌ల్ ఎంపీలుంటే, వారిలో 392 మంది స‌పోర్టు ఉంటే స‌రిపోతుంది. ఇప్ప‌టికి 422 మంది మ‌ద్ధ‌తు ఎన్డీఏ అభ్య‌ర్ధి సీపీ రాధాకృష్ణ‌న్ కి ఉంది. అంత ఉండి కూడా తిరిగి కేంద్ర బీజేపీ అధిష్టానం  కేంద్ర మ‌త్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా జ‌గ‌న్ కి ఫోన్ చేయించింది. ఇదెక్క‌డి మ‌త‌ల‌బో అర్ధం కావ‌డం లేదెవ‌రికి. ఏంటీ దోబూచులాట‌? ఇప్ప‌టికే జ‌గ‌న్ బెయిల్ మీద ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం బీజేపీతో ఆయ‌న‌ కి ఉన్న చీక‌టి ఒప్పందాల‌ని అంటారు. మొన్న అమిత్ షా వ‌చ్చిన‌పుడు కూడా బాబు, ప‌వ‌న్ ముందు జ‌గ‌న్ బాగోగులు వాక‌బు చేశారు. మోడీ కూడా జ‌గ‌న్ గ‌ట్స్ గురించి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తార‌న్న టాకుంది. ఇదంతా చూస్తుంటే, జ‌గ‌న్- బీజేపీ అవినాభావ సంబంధం ఏంటో ఇట్టే తెలిసి పోవ‌డం లేదా? అంటారు కొంద‌రు. ఆ మాట‌కొస్తే వ‌చ్చే కొత్త  ప‌ద‌వీచ్యుతి బిల్లు- జ‌గ‌న్ని క‌ట్ట‌డి చేయ‌డం క‌న్నా బాబు, నితీష్ కోస‌మే ఇదంతా అంటూ ఏకంగా పార్ల‌మెంటులోనే మార్మోగిన వైనం.  వీన్నిటిని బ‌ట్టీ చూస్తే.. ఎవ‌రు ఏంటో ఇట్టే తెలిసి పోవ‌డం లేదా? కాంగ్రెస్ ఓటు బ్యాంకు త‌న ఓటు బ్యాంకుగా మ‌లుచుకుని.. కాంగ్రెస్ బ్ల‌డ్ న‌ర‌న‌రాన జీర్నించుకుని.. కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా తామీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేస్తామంటే దీని భావ‌మేమి బొత్సేశా! అంటున్నారు ఒక్కొక్క‌రూ. కార‌ణం జ‌గ‌న్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం యాంటీ బీజేపీ. కానీ ఇక్క‌డ జ‌గ‌న‌న్న చూస్తే త‌న స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీతో అంట‌కాగ‌డాన్ని ఏమ‌ని అర్ధం చేసుకోవాలి వైసీపీ ఓట‌ర్లూ! అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.

ముగిసిన నారాయణ స్వామి సిట్ విచారణ

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సుదీర్ఘంగా సిట్ విచారించింది. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని ప్రశ్నిలించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలు, లిక్కర్ స్కాంకు సంబంధించి పలు అంశాలపై విచారణ సాగినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు, నారాయణ స్వామి స్టేట్మెంట్ సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.  ఆరోగ్య కారణాల రిత్యా విచారణకు హాజరు కాలేనని సిట్ కు గతంలో నారాయణస్వామి  తెలిపారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే సిట్ విచారణ చేపట్టింది. గతంలోనే ఆయన తనకు ఎలాంటి సమాచారం లేదని .. కేవలం మంత్రిగా తాను అవసరమైతే సంతకాలు మాత్రమే చేసేవాడినని నారాయణ స్వామి వీడియో కాల్ ద్వారా విచారణ చేసినప్పుడు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరు నమ్మొద్దని నారాయణ స్వామి తెలిపారు. నాపై అనేక అభూతకల్పనలు కొన్ని ఛానెళ్లు చేస్తున్నాయిని పేర్కొన్నారు. సిట్ విచారణకు పూర్తిగా సహకారించాని తెలిపారు. సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని ఆయన పేర్కొన్నారు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన సీఎం చంద్రబాబు

  ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి మద్దతు తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఆయనకు మా మద్దతు ఉంటుందని చెబుతూ అభినందనలు తెలిపాను. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి సీపీ రాధాకృష్ణన్‌ గౌరవం తీసుకొస్తారని సీఎం పేర్కొన్నారు.  ఎన్నికల ముందు నుంచి ఎన్డీయేలో తెలుగు దేశం పార్టీ ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుందన్నారు. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశం ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ : మంత్రి లోకేశ్

  ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు గత 14 నెలల్లో అమలు చేసిన సంస్కరణలు ఫలితాల దిశగా నడిపి బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదని అన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక సదుపాయలు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అమరావతిలో ఏడాదిలోగా లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.  రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.325కోట్లు విడుదల చేశాం. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని సిద్ధంచేయండి. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలని మంత్రి తెలిపారు.  రాజమండ్రి గ్రంథాలయానికి రూ.87లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో ప్రిపేరైన 350మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు లభించాయి. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాలి. పోటీ పరీక్షలకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

శ్రీశైల క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

  నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన  శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు ఐదవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 650 మంది చెంచు గిరిజన ముత్తైదువులు, అలానే 1000 మంది సాధారణ మహిళ ముత్తయిదువులు పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం లో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రతపూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం కూడ అందజేసి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు.  అనంతరం వ్రతంలో పాల్గొన్న చెంచు గిరిజన మహిళలకు, సాధారణ మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా చీర,రవిక పూలు, గాజులు, ప్రసాదం అందజేసి శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు. వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.  మన వైదిక సాంప్రదాయంలో శ్రావణ మాస వరలక్ష్మి  వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందనీ ఈవో తెలిపారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో  గిరిజన చెంచు సోదరిమనులకు అవకాశం కల్పించామన్నారు. చెంచు ముత్తైదులను ఎంపిక చేయడంలో ఐటీడీఏ అధికారుల సహకారం అందించారని తెలిపారు, ఐటీడీఏ పీవో శివప్రసాద్ మాట్లాడుతూ దేవస్థానం గిరిజన చెంచు భక్తులను వరలక్ష్మి వ్రతాలకు ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల దేవస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. మూడు జిల్లాల నుండి పలు గూడెములలోని గిరిజన చెంచు భక్తులను ఈ వరలక్ష్మి వ్రతానికి తీసుకొని రావడం జరిగిందన్నారు  వరలక్ష్మి వ్రతంలో శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో శివప్రసాద్  దంపతులు, పెద్ద ఎత్తున మహిళలు  పాల్గొన్నారు.  

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయా?  అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు  కార్పోరేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల పరిధిని ఐదు లక్షల నుంచి పదిలక్షల రూపాయలకు పెంచింది.  అయితే ఆరోగ్యశ్రీ బకాయలు పేరుకుపోవడంతో ఈ పథకం కింద సేవలను ఈనెల 31 నుంచి బంద్ చేయాలని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు నిర్ణయించాయి. ఈ మేరకు ఆరోగ్య శ్రీ సీఈవోకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్ హెచ్ ఏ) లేఖ రాసింది.  ఆ లేఖలో ఆరోగ్య శ్రీ సేవలతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సేవలను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, ఆయా సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బకాయిలను చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిందనీ, దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్ హెచ్ ఏ ఆ లేఖలో పేర్కొంది.  

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ

  సినిమాల్లో హీరో విలన్లను రక్తం వచ్చేలా కొట్టడం లేదా చంపడం... పబ్జి వంటి గేమ్ షోలో గన్  పట్టుకుని ఎదురు వచ్చిన శత్రువులను తుపాకిలతో కాల్చి చంపడం...ఇటువంటి రక్తపాతం లాంటి సీన్లు చూసి పిల్లలు మైండ్ సెట్ మారు తుందనడానికి కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు ఓ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు... తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఒక బాలుడే నిందితుడని తెలి యగానే పోలీసులు, స్థానికులు ఒక్క సారిగా అవ్వక్క య్యారు. గత ఐదు రోజులుగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. చివరకు బాలిక హత్య కేసులో పక్కింటి పిల్లోడే  నిందితుడి గా బయటపడింది. పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు దొంగతనం ఎలా చేయాలో వచ్చి రాని ఇంగ్లీషు లో ఒక లెటర్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ ఇంగ్లీషులో ఓ లెటర్ రాసుకున్నాడు. బాలిక సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లిన అనంతరం పక్కింట్లో ఉన్న బాలుడు దొంగతనం చేయడానికి సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చాడు. మెల్లిగా దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో సహస్ర అక్కడికి వచ్చింది. దొంగ తనం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్తానని సహస్ర బెదిరించింది.  దీంతో భయపడిపోయిన బాలుడు వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర గొంతులో పొడిచాడు. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై దాడి చేసి 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత బాలుడు సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలుడులో తెలియని భయం మొదలైంది. అది  గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే ఎస్ఓటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్ ఓ టి పోలీసులు బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పి ఏమి చెప్పలేదు. దీంతో ఎస్ఓటి పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా ఇంగ్లీషులో రాసుకున్న ఒక లెటర్, ఒక కత్తి, రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు..