రంగు ప‌డింది.. జ‌గ‌న్ స‌ర్కారుపై హైకోర్టు సీరియస్..

ఒక్క‌సారి చెబితే విన‌రు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయ‌లు వేసినా ప‌ట్టించుకోరు. దులిపేసుకుంటారు. మ‌ళ్లీ చేసిన త‌ప్పే చేస్తుంటారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయొద్ద‌ని హైకోర్టు గ‌తంలోనే గ‌ట్టిగా హెచ్చ‌రించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ముందు వైసీపీ రంగుల‌న్నింటినీ తీసేయించింది. అయినా, స‌ర్కారు బుద్ధి మార‌లేదు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వైసీపీ రంగులు వేయ‌డం మాన‌లేదు. దీంతో, హైకోర్టు మ‌రోసారి ప్ర‌భుత్వంపై మండిప‌డింది. ఈసారి డెడ్‌లైన్ పెట్టి మ‌రీ.. రంగులు మార్చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు, ఆఖ‌రికి చెత్త నుంచి సంప‌ద త‌యారు చేసే కేంద్రాల‌కు సైతం వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 6వ తేదీ లోపు రంగులన్నింటినీ తొలగించాలని ఆదేశించింది. తొలగించిన అనంతరం కోర్టుకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తెలియజేసింది. రంగులు తొలగించారో లేదో, నివేదిక ఇవ్వాలని.. పిటిషనర్ తరపు న్యాయవాదిని కూడా ఆదేశించింది.  ఏపీలో ప్రభుత్వ భ‌వ‌నాల‌కు వైసీపీ రంగులు వేయ‌డంపై జ‌రిగిన విచార‌ణ‌కు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీలు హైకోర్టు ధ‌ర్మాస‌నం ముందు హాజ‌రయ్యారు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు ఎలా వేస్తారని అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయొద్దని తక్షణమే  లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.   

సోనూసూద్‌పై మ‌ళ్లీ ఐటీ రైడ్స్.. బీజేపీ టార్గెట్ చేస్తోందా?

సోనూసూద్‌. ఈ పేరు ఇప్పుడు సేవ‌కు ప్ర‌తిరూపం. సోనూ న‌టుడి స్థానికి దాటేశారు. నేష‌న్ ఐకాన్‌గా నిలిచారు. కొవిడ్ స‌మ‌యంలో సోనూసూద్ చేసిన సేవ‌ల‌కు జ‌నం నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ప్ర‌భుత్వాల‌క‌న్నా.. సోనూసూద్‌పైనే ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింది. అలాంటి ఆయ‌న‌పై స‌డెన్‌గా ఐటీ రైడ్స్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ నేష‌న్ హీరోను విల‌న్‌గా చిత్రీక‌రించే కార్య‌క్ర‌మం ఎందుకు జ‌రుగుతోంది? సోనూసూద్ నిజంగా ఏమైనా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారా? లేక‌, సోష‌ల్ మీడియాలో హెరెత్తుతున్న‌ట్టు.. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వంతో జ‌త‌క‌ట్టినందుకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ ప్ర‌భుత్వ‌మే  సోనూసూద్‌ను టార్గెట్ చేసిందా? ఇలా అనేక ఆరోప‌ణ‌లు. బుధ‌వారం ముంబై, ల‌క్నోలోని సోనూసూద్ నివాసాలు, కార్యాల‌యాల్లో త‌నిఖీలు చేసిన ఐటీ అధికారులు, గురువారం మ‌రోసారి ముంబైలోని సోనూసూద్ ఇంట్లో సోదాలు చేశారు. లక్నోకు చెందిన రియల్‌ఎస్టేట్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై సోనూను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.  పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, ల‌క్నో నగరాల్లోని సోనూసూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధ‌వారం సోదాలు జరిపారు. ఏకకాలంలో దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ల‌క్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయంటూ ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.  అయితే, ఇదంతా రాజ‌కీయ క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లే అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోనూసూద్‌.. ఢిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసి ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాతే ఇలా సోనూపై ఐటీ రైడ్స్ జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆప్‌తో క‌లిసినందునే సోనూసూద్‌ను ఐటీ దాడుల‌తో భ‌య‌పెడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కొవిడ్‌ వేళ వలసకూలీలతో పాటు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.     

రాజు చ‌చ్చాడా? చంపేశారా? అంతా అనుమానాస్ప‌దం..!

సైదాబాద్ బాలిక హంత‌కుడు రాజు రైల్వేట్రాక్‌పై చ‌చ్చిప‌డున్నాడు. రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అంటున్నారు. మృతిడి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చ‌నిపోయింది రాజునే అని పోలీసులు ధృవీక‌రిస్తున్నారు. అయితే, బాలిక పేరెంట్స్ మాత్రం మృత‌దేహాన్ని త‌మ‌కు చూపించాల‌ని.. తాము క‌న్ఫామ్ చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. లేటెస్ట్‌గా రాజు త‌ల్లి ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. త‌న కొడుకు 3 రోజుల కింద‌టే దొరికాడ‌ని.. పోలీసులే ఉరికించి చంపేశార‌ని ఆరోపిస్తున్నారు.  హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన పులికొండ రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఘటనపై నిందితుడి తల్లి వీరమ్మ అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులే తన కొడుకుని ఉరికించి ఉరికించి చంపేశారని ఆరోపించింది.  ‘‘నా కొడుకు రాజు 3 రోజుల కిందటే రైల్వేస్టేషన్‌లో పోలీసులకు దొరికాడు. రాజును ఎన్‌కౌంటర్ చేయాలని, పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాం. నిన్న మొత్తం మా వివరాలన్నీ రాసుకున్నారు. మూడు రోజుల నుంచి స్టేషన్‌లో ఉన్నా ఎవరూ రాలేదు. నిన్న ఒక్కసారిగా అందరూ వచ్చారు. అప్పుడే మాకు డౌట్ వచ్చి అడిగితే దొరకలేదన్నారు. మిమ్మల్ని వదిలేస్తున్నాం అని నిన్న రాత్రి 10 గంటలకు ఉప్పల్‌లో వదిలిపెట్టారు. పోలీసులే నా కొడుకును ఉరికించి చంపేశారు. వాళ్లకు 3 రోజుల కిందటే దొరికినా ఈ రోజు మమ్మల్ని ఇటు పంపించి వాడిని అటు చంపేశారు.’’ అంటూ రాజు త‌ల్లి వీర‌మ్మ సంచ‌ల‌న కామెంట్లు చేసింది.  మ‌రోవైపు రాజు సూసైడ్ చేసుకున్న‌ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించిన వరంగ‌ల్ సీపీ తరుణ్ జోష్ ప‌లు వివ‌రాలు చెప్పారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య.. స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. మొహం గుర్తుపట్టలేనంతగా ఉందని, అయితే చేతిపై టాటూ, మనిషి పొడుగు అన్నీ సరిపోయాయన్నారు. రాజు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారన్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని సీపీ స్పష్టం చేశారు. ఇక్కడికి ఎలా, ఎప్పుడు వచ్చాడు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నది విచారణ జరుపుతున్నామన్నారు. సీపీ కెమెరాలు పరిలీస్తామని చెప్పారు. గురువారం ఉదయం 8:45 గంటలకు కోరార్క్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుందని.. అదే సమయంలో రాజు ట్రాక్‌పై నడుచుకుంటు వెళుతుండగా రైల్వే సిబ్బంది చూసి పట్టుకోడానికి ప్రయత్నించారని.. సాధ్యంకాలేదని, ట్రైన్ కింద పడి నిందితుడు రాజు చనిపోయాడని సీపీ తరుణ్ జోష్ వెల్ల‌డించారు.   

అసెంబ్లీ బరిలో ప్రియాంక? యోగికి చెక్ పెట్ట‌గ‌ల‌రా?

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోందా? ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ పోటీకి దిగుతోందా? అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రియాంకా వాద్రా పార్టీకి ఊపు నిచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమయ్యారని పార్టీ వర్గాల సమాచారం. అయితే,ప్రియాంకా వాద్రా ఎన్నికలలో పోటీచేయడం పెద్ద విశేషం కాదు. నిజానికి గత లోక్ సభ ఎన్నికల్లోనే ఆమె వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సై’ అన్నారు. అయితే, ఓటమి భయంతోనో ఏమో వెనక్కి తగ్గారు. అదలా ఉంటే, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఇంతవరకు ఫాలో అవుతూ వచ్చిన ఎన్నికల అరంగేట్రం సంప్రదాయానికి విరుద్ధంగా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం కావడంతో అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  గాంధీ నెహ్రూ కుటుంబంలో నెహ్రూ  నుంచి రాహుల్ దాకా మూడు తరాలకు చెందిన అందరూ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే, అందులో ఎవరూ కూడా లోక్ సభకే కాని ఆసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ పోటీ చేయడం అంటే అది చిన్నతనంగా, తమ స్థాయికి తగని పనిగా భావించడం వలన చేతనో, ఇంకేందుకో ఇంత  వరకు ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమే కాదు, ముఖ్యమంత్రి పదవి కూడా  నెహ్రూల స్థాయి కాదు, అనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. అయితే, ఇప్పుడు ప్రియాంక, అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిల్చేందుకు కూడా సిద్దమవుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే, గాంధీ కుటుంబ సభ్యుల్లో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తి ప్రియాంకే అవుతారు.  అదలా ఉంటే, ప్రియాంక నిజంగానే పోటీ చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబాన్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న అమేఠీ లేదంటే రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానాలను ఎంచుకోవచ్చని అంటున్నారు. ఈ రెండు నియోజక వర్గాలు ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గాల. అలాగే. ప్రియాంకకు బాగా పరిచయమున్న నియోజక వర్గాలు. అయితే, గత లోక్ సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించారు. ప్రియాంక అక్కడే పోటీ చేస్తే బీజేపీ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  అయితే, ప్రియాంక‌ పోటీ చేసినా, కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండండని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఐదే ఐదు స్థానాలు గెలుచుకుంది. చివరకు అమేథీ, రాయిబరేలి లోక్ సభ నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. అంతే కాదు, గడచిన ఐదు సంవత్సరాలలో పార్టీ పెద్దగా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసిందీ లేదు. కాబట్టి, ప్రియాంక పోటీ చేయడంవలన హస్త వాసి గొప్పగా మారే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.  

వైసీపీకి బిగ్ షాక్‌.. టీడీపీలో భారీగా చేరికలు..

కాలం మారుతోంది. ఫ్యాన్ గాలి మ‌ళ్లుతోంది. రెండేళ్ల‌లోనే వైసీపీ పాల‌న‌పై విర‌క్తి క‌లుగుతోంది. ఉపాధి లేక కార్మికులు అల్లాడుతున్నారు. పెట్టుబ‌డులు, ఉద్యోగాలు లేక యువ‌త బేజార‌వుతోంది. రాష్ట్రం అప్పుల‌తో తిరోగ‌మ‌నం పాల‌వుతోంది. అన్ని రంగాల్లో వైఫ‌ల్యాల‌తో జ‌గ‌న్ పాల‌న‌పై అంతా పెద‌వి విరుస్తున్నారు. ఏకంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విసుగు చెందుతున్నారు. అస‌మ‌ర్థ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పార్టీని వీడుతున్నారు. అందుకే, ఇటీవ‌ల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి భారీగా వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. వ‌ల‌స‌ల్లో గిద్దలూరు నియోజకవర్గం అన్నింటికంటే ముందుంటోంది. ఇటీవల కొమరోలు మండలం రాజుపాలెంలో 125 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా, రాచర్ల మండలం అన్నంపల్లిలో 600 మంది అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.  అన్నంప‌ల్లి గ్రామంలో జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో వంద‌లాది మంది వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన శిరిగిరి వెంకటపతితో పాటు మరికొందరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పెద్ద‌సంఖ్య‌లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు, బోయ, యాదవ సామాజికవర్గాలకు చెందిన వైసీపీ వర్గీయులు పార్టీ మారిన వారిలో ఉన్నారు.  వైసీపీ నుంచి టీడీపీలో చేరిక సంద‌ర్భంగా గ్రామంలో భారీ స్థాయిలో ర్యాలీ, ఊరేగింపు నిర్వ‌హించారు. వంద‌లాది మంది బైక్ ర్యాలీతో.. జై టీడీపీ నినాదాల‌తో హోరెత్తించారు. గ్రామంలో అట్టహాసంగా సభ నిర్వహించి.. వైసీపీ పాల‌న‌ను దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అన్ని వ‌ర్గాలకు అన్యాయం జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు.  అయితే, వంద‌లాది మంది వైసీపీ కేడ‌ర్ టీడీపీలో చేరే సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ ప్రారంభమైన కాసేప‌టికే గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవ‌డం.. స‌భ ముగిసిన తర్వాత రావటం చర్చనీయాంశమైంది.   

20 ల‌క్ష‌ల చెక్కు వ‌ద్దు.. న్యాయం కావాల‌ని బాలిక తండ్రి డిమాండ్‌..

బిడ్డే పోయింది. హంత‌కుడిని ప‌ట్టుకోలేక‌పోయారు. వాడు చచ్చేదాకా లేట్ చేశారు. ఇప్పుడొచ్చి ఏం లాభం? 20 ల‌క్ష‌ల చెక్కు ఇస్తే అయిపోతుందా? మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి.. అంటూ డిమాండ్ చేశారు సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీ బాలిక‌ తండ్రి. ప్ర‌భుత్వం ఇచ్చిన 20 ల‌క్ష‌ల చెక్కును వెన‌క్కిచ్చేస్తామ‌ని చెప్పారు.  వారం రోజుల త‌ర్వాత తీరిగ్గా వ‌చ్చారు తెలంగాణ మంత్రులు. హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌లు భారీ బందోబ‌స్తు మ‌ధ్య‌ సైదాబాద్ బాలిక కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. 20 ల‌క్ష‌ల చెక్కు ఇచ్చారు. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇస్తామ‌ని హమీ ఇచ్చారు.  అయితే, నిందితుడిని ప‌ట్టుకోలేక‌పోయిన ప్ర‌భుత్వంపై బాలిక కుటుంబ‌స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్కారు చేసిన సాయాన్ని తిరస్కరించారు. 20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని లేల్చి చెప్పారు. మంత్రులు ఇచ్చిన చెక్కును వెనక్కి ఇచ్చేస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.   ‘‘మంత్రులు మా ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారు. మాకు చెక్కు కాదు.. న్యాయం కావాలి. చెక్కుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదు’’ అని బాలిక తండ్రి చెప్పారు.  

థర్డ్ వేవ్ వచ్చిందంటే ఆగదు.. హైకోర్టు వార్నింగ్‌...

కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం చాలా వరకు కోలుకుంది. కేరళ, మహారాష్ట్ర మినహా మిగిలిన రాష్ట్రాలలో కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. అయితే, ఇంతటితో కరోనా చచ్చినట్లే అనుకుంటే పొరపాటే అవుతుంది. చైనా సహా అనేక దేశాల్లో కరోనా కేసులు సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. చైనాలో అయితే, మళ్ళీ లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి తలెత్తింది. అమెరికాలోనూ అదే పరిస్థితి. కాబట్టి, కరోనా మహమ్మారి విషంలో అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఇదలా ఉంటే, కరోనా వైరస్‌ మూడోసారి విజృంభించడం ప్రారంభమైతే వేగంగా చుట్టేస్తుందని తెలంగాణ హైకోర్టు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కొవిడ్‌ మూడోవేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించింది. సమస్యలను ఊహించడం, ప్రణాళికలు రచించడం, వాటిని అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత. అది కోర్టుల పని కాదు. వ్యవస్థలు సరిగా వ్యవహరించకపోతే కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం  వ్యాఖ్యానించింది.  కొవిడ్‌ 19 వ్యాప్తి, పరీక్షలు, వైద్య సౌకర్యాలు వంటి అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు గతంలో ఆదేశించిన విధంగా విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశం వివరాలను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి సమర్పించారు. నిపుణుల కమిటీ నిర్ణయాలను ఏ మేరకు అమలు చేస్తున్నారు? అందుకు సంబంధించిన కలర్‌ గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను ఎక్కడ? అని ధర్మాసనం ఏజీని, విచారణకు హాజరైన పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ప్రశ్నించింది. మూడో వేవ్‌పై చీఫ్‌ సెక్రటరీ పర్యవేక్షిస్తున్నారని.. ఇటీవల సమావేశాలు సైతం నిర్వహించారని శ్రీనివాసరావు తెలిపారు. కలర్‌ గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చారా? అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం తరఫున హాజరైన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావును హైకోర్టు ప్రశ్నించింది. వివరాలు అందించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.  

ఇదే లాస్ట్‌ఛాన్స్.. హుస్సేన్‌సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నాల‌కు సుప్రీం గ్రీన్‌సిగ్న‌ల్‌..

హ‌మ్మ‌య్య. తెలంగాణ స‌ర్కారు ఊపిరి పీల్చుకుంది. హుస్సేన్‌సాగ‌ర్‌లో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో చేసిన‌ వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు అనుమ‌తించింది. అయితే, ఇదే చివ‌రి అవ‌కాశ‌మ‌ని హెచ్చ‌రించారు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌. ఈ ఏడాదికి మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.  వినాయ‌క నిమ‌జ్జ‌నానికి మోడ్ర‌న్ క్రేన్లు ఉప‌యోగించాల‌ని.. నిమ‌జ్జ‌నం త‌ర్వాత వెంట‌నే తొల‌గించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిమ‌జ్జ‌న చ‌ర్య‌ల‌పై హైకోర్టుకు ప్ర‌భుత్వం స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని.. త‌దుప‌రి విచార‌ణ హైకోర్టు చేప‌డుతుంద‌ని తెలిపింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎమ్‌సీకి ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.  హుస్సేన్‌సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నాన్ని నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో ఇటీవ‌ల‌ ప్ర‌భుత్వ ఇర‌కాటంలో ప‌డింది. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లినా హైకోర్టు స‌సేమిరా అంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి అనుమ‌తించ‌మ‌ని తేల్చిచెప్పింది. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందేన‌ని ఆదేశించింది. దీంతో.. అల్ట‌ర్‌నేట్ చ‌ర్య‌ల‌పై దృష్టి సారిస్తూనే.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది తెలంగాణ ప్ర‌భుత్వం. స‌ర్కారు విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన సుప్రీంకోర్టు.. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్‌సాగ‌ర్‌లో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి అనుమిస్తూనే.. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ హెచ్చ‌రించ‌డం కీల‌క‌ప‌రిణామం. ఏది ఏమైనా.. ఈసారికి గండం త‌ప్పిన‌ట్టైంది తెలంగాణ స‌ర్కారుకు.  

టెలికాంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు.. క‌స్ట‌మ‌ర్ల‌కూ లాభ‌మా?

ఆధునిక ఆర్థిక వ్యవస్థలో టెలికాం రంగం అత్యంత కీలకమైన పాత్రను పోస్తిస్తుంది. అదే సమ‌యంలో దేశీయ టెలికాం రంగం సంక్షోభాలను ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగానికి భారీ  ఊరట నిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేసంలో ఇటు దేశీయ టెలికాం రంగానికి ఊరట నిచ్చే మారటోరియం తో పాటుగా ఇటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా టెలికాం రంగంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.  కొవిడ్19 సంక్షోభ సమయంలో టెలికాం రంగం అత్యంత సమర్ధవంతంగా సవాళ్ళను ఎదుర్కుంది. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్‌ సమావేశాలు.. ఇలా డేటా వినియోగం విరీతంగా పెరిగిన నేపధ్యంలో టెలికామ్ రంగం సమర్ధవంతంగా పనిచేసింది. ఇక ఇప్పుడు ప్రవేశ పెట్టిన సంస్కరణలతో మరింత మెరుగైన సేవలు అందిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రివర్గం వ్యక్తపరిచింది.   కాగా, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో భాగంగా  ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశీయ టెలికం రంగానికి నాలుగేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపశమన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం  సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలతో సహా టెలికాం బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియంను వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ బుధ‌వారం ఆమోదం తెలిపింది. దీని వల్ల వేల కోట్ల స్పెక్ట్ర‌మ్ బ‌కాయిలు ఉన్న వొడాఫోన్-ఐడియాలాంటి టెలికం కంపెనీల‌కు పెద్ద ఊరట కల్పిస్తుందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేబినెట్ తెలిపింది. మారటోరియం పొందినవారు సదరు మొత్తానికి ఎంసీఎల్‌ఆర్ ప్లస్ 2 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆటోమేటిక్ మార్గంలో టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేబినెట్ అనుమతించింది. ఈ విషయమై కెబినెట్ సమావేశంలో టెలికాం మంత్రి మాట్లాడుతూ ‘‘సంస్కరణలు చాలా విస్తృతమైనవి. అవి నిర్మాణాత్మకమైనవి. ప్రస్తుతం తీసుకునే సంస్కరణలు నేడు, రేపు, భవిష్యత్‌లో మార్పును తీసుకువస్తాయి’’ అని అన్నారు. ఇదలా ఉంటే, టెలికాం రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై  టెలికాం సంస్థలు, హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు, ఉపశమన చర్యలు..టెలికాం రంగం తన లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నాయి.  

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫ‌లితాల‌కు ఓకే.. ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..

ఏపీలో మరోసారి రాజ‌కీయ హ‌డావుడి. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.  ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జ‌రిగాయి. పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టంచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు.    అయితే, సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్‌ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.   

సైదాబాద్ శాడిస్ట్ చ‌చ్చాడు.. రైల్వే ట్రాక్‌పై సూసైడ్‌...

ఉన్మాది చ‌చ్చాడు. ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు ప్రాణం విడిచాడు. ఐదు రోజులుగా పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన రాజు.. రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర విగ‌త‌జీవుడై ప‌డున్నాడు. రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న‌గ‌ర శివారు ఘ‌ట్‌కేస‌ర్ రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర రాజు డెడ్‌బాడీని గుర్తించారు. చేతిపై ఉన్న ప‌చ్చ‌బొట్టు ఆధారంగా మృతుడు రాజు అని నిర్థారించారు.  రాజు మ‌ర‌ణంతో ఐదు రోజుల ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచీ పోలీసులు రాజు కోసం విస్తృతంగా గాలించినా దొర‌క‌లేదు. వెయ్యి మంది పోలీసుల‌తో ప్ర‌త్యేక బృందాలు సెర్చ్ ఆప‌రేష‌న్ చేసినా నిందితుడు చిక్క‌లేదు. రాజుపై ఏకంగా 10 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీని కూడా ప్ర‌క‌టించారు. రాజు ఫోటోలతో పోలీసులు బ‌స్టాండ్లు, హైవేలు గాలించారు. ఆవేవీ ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. ఘ‌ట్‌కేస‌ర్ రైల్వే ట్రాక్ ద‌గ్గ‌ర రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తేల్చారు. మ‌రోవైపు, ఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచీ చిన్నారి కుటుంబానికి వివిధ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి సానుభూతి వ్య‌క్త‌మైంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌.. త‌దిత‌రులు బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ప్ర‌భుత్వం, పోలీసుల తీరును త‌ప్పుబ‌ట్టారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పైనా ర‌చ్చ జ‌రిగింది. దీంతో, పోలీసుల‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. మ‌రింత ఛాలెంజ్‌గా తీసుకున్న హైద‌రాబాద్ కాప్స్‌.. పెద్ద ఎత్తున సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. రాజు సెల్‌ఫోన్ వాడ‌క‌పోవ‌డంతో అత‌న్ని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది.  పోలీసులు, ప్ర‌జ‌లు అంతా రాజు కోసం వెతుకుతున్న విష‌యం తెలుసుకొని కాబోలు.. నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే, హైద‌రాబాద్‌కు సుమారు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స్టేష‌న్‌ఘ‌ణ‌పూర్ ద‌గ్గ‌ర సూసైడ్ చేసుకోవ‌డం పోలీసుల వైఫ‌ల్య‌మే. వాడు సూసైడ్ చేసుకోక‌ముందే.. పోలీసులు ప‌ట్టుకొని శిక్షించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.     

తెలంగాణలో తీన్మార్ ధమాకా.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది? 

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయముంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఇప్పట్లో జరిగేలా లేదు. అయినా, రాజకీయ వాతావరణం మాత్రం, రేపో మాపో ఎన్నికలు జరుగుతాయన్నంతగా వేడెక్కింది. నాయకుల భాష అప్పుడే అరేతురే, వాడూ వీడూ దాకా వచ్చింది. ఇక రేపు ఎక్కడికి చేరుతుందో ఎంతగా దిగాజరుతుందో వేరే  చెప్పనక్కర లేదు. అదలా ఉంటే, సెప్టెంబర్ 17న తెలంగాణలో తీన్మార్ ధమాకాకు రంగం సిద్దమైంది. ఒకే రోజున మూడు ప్రధాన పొలిటికల్ ఈవెంట్స్ కు తెలంగాణ వేదిక అవుతోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఇది పార్టీలకు అతీతంగా ప్రజలు జరుపుకునే పండగ. నిజాం పాలన నుంచి, రజాకార్ల రాక్షస కృత్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు. నిజానికి, సెప్టెంబర్ 17, తెలంగాణ  స్వాతంత్ర దినం. అయినా, తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించ లేదు. కాంగ్రెస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు ప్రతి ఏటా, అదే డిమాండ్ చేస్తున్నా, తెరాస ప్రభుత్వం మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంద్ర పాలకులు ఏ విధంగా అయితే తెరాస చేసిన ఇదే డిమాండ్’ను పెడచెవిన పెట్టారో   ఇప్పుడు తెరాస కూడా సీమాంధ్ర పాలకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా, విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా,  రజాకార్ల వారసులు (ఎంఐఎం)కు భయపడో ఏమో కానీ, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 17 రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎక్కడిక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.  విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్మల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత షా ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో అధికార తెరాసపై యుద్దాన్ని ప్రకటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న పాదయాత్ర కాకరేపుతోంది. బండితో పాటుగా బీజేపీ నాయకులు తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా ఎత్తు పల్లాలు లేని భాషలో ఏకి పారేస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్ళు  రాజీనామాల దాక వెళ్ళాయి.  ఈ నేపధ్యంలో జరుగుతున్న నిర్మల్ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా, గత కొంత కాలంగా బీజీపీ, తెరాసల మధ్య ఏదో బంధం ఉందని సాగుతున్న ప్రచారానికి అమిత్ షా సమాధానం ఇస్తారని భావిస్తున్నారు. అలాగే, నిర్మల సభ తర్వాత బీజేపే జోష్ పెంచుతుందని అంటున్నారు. అమిత్ షా వస్తోందే అందుకు, తెరాసతో ఎలాంటి చుట్టరికాలు లేవు, ఉండవు అని స్పష్టం చేయడంతో పాటుగా, తెరాసపై  రాజకీయ యుద్ధానికి పచ్చ జెండా ఊపేందుకే అమిత్ షా వస్తున్నారని.పార్టీ నాయకులు అంటున్నారు.   అదే రోజున కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి సొంత గడ్డ గజ్వేల్’లో దళిత గిరిజన గర్జన సభను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్ర నేత రాహుల గాంధీ వస్తారని ప్రచారం జరిగినా, ఎందుకనో ఆయన రావడం లేదు. అయినా. ఇటు ప్రభుత్వానికి, అటు అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్  సొంత నియోజక  వర్గంలో ‘దళిత గిరిజన గర్జన’ సభను ఏర్పాటు చేశారు. అంతే కాదు లక్ష మందితో సభ నిర్వహిస్తామని, దమ్ముంటే ఆపాలని  సవాలు విసిరారు.  మరో వంక ముఖ్యమంత్రి వ్యూహం ఏమిటో కానీ, ఆయన మంగళవారం అనుకున్న యాదగిరి పర్యటనను శుక్రవారం (సెప్టెంబర్ 17) కు వాయిదా  వేసుకున్నారు. మొతానికి సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయ వేదిక మీద తీన్మార్... తమాషా రక్తికదుతుందని అదే విధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తునారు

తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ కు సవాలే? 

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై తన యూ ట్యూబ్ చానెల్ తో పాటు రాజకీయంగా పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 32 కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఆ కేసుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని కోర్టుల్లో మల్లన్నను హాజరు పరుస్తున్నారు పోలీసులు. బుధవారం నల్గొండ జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. మల్లన్న దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అడ్డగూడూరుకు చెందిన మహిళ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు.. మల్లన్నను ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. మల్లన్నకు న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణను షేక్ చేస్తోంది. వారం రోజులవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడ్ని పట్టుకోలేని పోలీసులు తనపై కక్ష సాధిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.  తన భార్య, అత్తమామలు కూడా దళితులేనని, తాను తన కుటుంబ సభ్యులను ఎలా కించపరుస్తానని ప్రశ్నించారు. ఇదంతా తనపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదన్నారు. తనపై ఇప్పటికే 35 కేసులు బనాయించారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి తమ వంతు సహకరిస్తున్నారని మల్లన్న ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కక్ష సాధింపు చర్యలకు కాకుండా ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని మల్లన్న అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే గిరిజన బాలిక దారుణ హత్యకు గురైందని మండిపడ్డారు.

సోనూసూద్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. కారణం అదేనా? 

సినీ నటుడు, పేద పాలిట పెన్నిధిగా పేరు గాంచిన సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.  ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త సంచలనంగా మారింది. లాక్ డౌన్‌లో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడిలా సోనూసూద్ నిలిచాడు. ప్రభుత్వాలు కూడా చేయని పని సోనూ చేశాడు. సొంత ఖర్చులతో వందల బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చాడు. దీంతో దేశం మొత్తం సోనూని రియల్ హీరోగా కొనియాడింది. కరోనా బాధితులకు ఖరీదైన మందులు ఉచితంగా సమకూర్చాడు. సెకండ్ వేవ్ సమయంలోనూ ఎంతో మంది రోగులకు ప్రాణం పోశాడు సోనుసూద్. సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. సాయం పొందిన వాళ్లు సోనూని దేవుడిలా చూస్తున్నారు. అలాంటి సోనుసూద్ టార్గెట్ గా ఐటీ సోదాలు జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయ కారణాలతోనే ఇలా జరుగుతుందనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. 

టీటీడీ పాలకమండలి జాబితా విడుదల.. మైహోం, హెటిరో సారధులకు మళ్లీ చోటు.. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 25 మంది బోర్డు మెంబర్ల జాబితాను విడుదల చేసింది. టీటీడీ  పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.  టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు చెందిన ప్రముఖ  పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోవసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్ కు పాలకమండలిలో చోటు దక్కింది. మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం కల్పించారు. టీటీడీ పాలక మండలి జాబితా.. ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొర్ల బాబూరావు తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు, రాజే శర్మ, పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్  తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య కర్ణాటక నుంచి ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి, శశిధర్  మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్‍కు అవకాశం  

ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. జ‌గ‌న్ తీరుతో అధికారుల్లో ఆందోళ‌న‌..

జ‌గ‌న్‌కు, అధికారుల‌కు, జైలుకు ఏదో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. జ‌గ‌న్‌తో సంబంధం ఉన్న ప‌లువురు ఐఏఎస్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు, ఏదో ర‌కంగా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. వైఎస్ హ‌యాంలో జ‌గ‌న్‌తో అంట‌కాగినందుకు అక్ర‌మాస్తుల కేసులో అప్ప‌ట్లో ప‌లువురు అధికారులు జైలుకెళ్లాల్సి వ‌చ్చింది. అనేక‌మంది ఐఏఎస్‌లు సీబీఐ విచార‌ణ ఫేస్ చేశారు. ఇదంతా గ‌తం. ఆ గ‌తం నుంచి అధికారులు సరైన గుణ‌పాఠం నేర్వ‌న‌ట్టున్నారు. మ‌ళ్లీ అన్ని విష‌యాల్లో జ‌గ‌న్‌కు వంత పాడుతున్నారు. దీంతో, కోర్టు నుంచి మొట్టికాయ‌లతో పాటు శిక్ష‌లూ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఏపీ ఐఏఎస్ అధికారులను కోర్టు ధిక్కరణ కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలను కోర్టు ధిక్కరణ కేసులో నిందితులుగా నిర్ధారించింది. 29వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయశాఖ, సెరీకల్చర్ విభాగాలకు వీరు ఉన్నతాధికారులుగా ఉన్నారు.  పూనం మాలకొండయ్య వ్యక్తిగతంగా కోర్టుకు హాజురు కాకపోవడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు. విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పాటించలేదు. దీంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ప్రభుత్వం అభ్యర్థుల‌కు న్యాయంచేయాలని ఆదేశించింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు అధికారులు. దీంతో కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌.. హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్‌ చిరంజీవి చౌదరి.. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యలుగా గుర్తించి శిక్ష విధించింది హైకోర్టు. 29న శిక్ష ఖరారు చేయనుంద‌ది.   హైకోర్టు చేతిలో శిక్ష‌కు గురికావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇటీవ‌ల ముత్యాల‌రాజు త‌దిత‌ర ఐఏఎస్‌లపై ఇలానే కోర్టు క‌న్నెర్ర జేసింది. ఇప్పుడు వీరి వంతు వ‌చ్చింది. కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం అంగీకరించకపోతే తాము ఎలా ఉత్తర్వులు ఇస్తామనేది ఐఎఎస్ అధికారులు వాద‌న‌. త‌మ మాట‌లు స‌ర్కారు చెవికి సోక‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి ప‌రిణామాల‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికే ప‌లువురు అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ‌స్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అవి శిక్షలకూ దారి తీస్తుండ‌టంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌ని చేయ‌డం క‌ష్ట‌మంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సిన్సియ‌ర్ అధికారిణిగా పేరొందిన పూనం మాల‌కొండ‌య్య లాంటి ఐఏఎస్‌లు సైతం జ‌గ‌న్ తీరుతో ఇలా జైలు శిక్ష ముంగిట నిల‌బ‌డ‌టం అవ‌మాన‌క‌ర విష‌య‌మే.   

మోడీ పైసలవి.. వెనక్కి ఇచ్చేది లేదు! రైతు ఆన్సర్ తో బ్యాంకర్లకు షాక్..

ఆ రైతు బ్యాంక్ ఖాతాలో ఐదున్నర లక్షల రూపాయలు జమ అయ్యాయి.. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని విత్ డ్రా చేసుకుని ఖర్చు పెట్టేశాడు ఆ రైతు. అయితే ఆ డబ్బులు రైతుకు సంబంధించినవి కావు.. బ్యాంకు ఉద్యోగి పొరపాటున ఆయన ఖాతాలోకి వచ్చినవి. తనవి కావని తెలిసినా ఆ రైతు వాటిని ఖర్చు పెట్టేశాడు. తర్వాత తప్పును గ్రహించిన బ్యాంకర్లు... రైతు దగ్గరకు వచ్చి డబ్బులు గురించి ఆరా తీయగా వాళ్లకు షాకిచ్చాడు రైతు.  బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైతు రంజిత్ దాస్‌కు స్థానిక గ్రామీణ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఈ ఏడాది మార్చిలో దాస్ ఖాతాలో రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే అది బ్యాంకు తప్పిదం వల్ల జరిగింది. తన ఖాతాలో డబ్బులు జమ కావడంతో వాటిని తన అవసరాలకు ఖర్చు పెట్టుకున్నాడు రైతు రంజిత్ దాస్. కొన్ని రోజుల తర్వాత తప్పును గ్రహించారు బ్యాంకు ఉద్యోగులు. రైతు దగ్గరకు వెళ్లి.. ఆ మొత్తాన్ని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిందిగా కోరారు. కానీ దీనికి దాస్ తిరస్కరించాడు.  ఆ డబ్బులు తనకు ప్రధాని మోడీ పంపారని, తిరిగి ఇవ్వనని మొండికేశాడు.  ‘ఈ ఏడాది మార్చిలో నా బ్యాంకు అకౌంట్‌లో లక్షల మొత్తంలో డబ్బులు జమవ్వగానే చాలా సంతోషించా. అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగానే తొలి విడతగా ఆ డబ్బులు నాకు పంపారేమోనని భావించా. అలా ఆ డబ్బును ఖర్చు చేసేశా. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు’ అని చెప్పాడు.  రైతు చెప్పిన సమాధానంలో షాకయ్యారు బ్యాంక్ అధికారులు. అతన్ని ఏమి చేయలేక పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంజిత్ దాస్ ను అరెస్ట్ చేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని మాన్సి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ కుమార్ పేర్కొన్నారు.  

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? 

దేశంలో ప్రస్తుతం అన్ని అతి పెద్ద సమస్యల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకటి. గత కొన్ని రోజులుగా పెరిగిపోతున్న ధరలతో పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు గుది బండగా మారింది. కేంద్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందులు కల్గిస్తోంది. ఇటీవల కొన్ని సంస్థలు నిర్విహించిన సర్వేల్లో గతంలో కంటే ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలేనని చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదలపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ప్రస్తుతం కేంద్రం వైఖరిలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. పెట్రోల్, డీజల్ ధరలు తగ్గేలా కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం.. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండబోతోంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ గ్రాఫ్ పెరిగింది. గతంలో మోడీ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న వారు.. బలంగా వాదనలు వినిపించిన వారు సైతం పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో మాత్రం ప్రభుత్వం తీరును తప్ప పట్టే పరిస్థితి. ఈ సెగ కేంద్రానికి తాకినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు గండంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా మోడీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలుస్తోంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలో మోడీ సర్కార్ ఉందని సమాచారం. ఈనెల 17న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ పై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.  ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీలోకి మద్యం.. పెట్రోల్.. డీజిల్.. విమాన ఇంధనం లాంటి కొన్నింటిని జాబితాలో చేర్చలేదు.  అయితే.. పన్ను ఎక్కువగా ఉండే లిక్కర్.. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అయితే.. దీనిపై ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. జీఎస్టీలోకి చేరిస్తే.. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటమే దీనికి కారణం. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్ను విధించే వీలుంది. ఒకవేళ.. దీన్ని తీసుకొస్తే.. రాష్ట్రాలతో పాటు.. కేంద్రం కూడా భారీగా పన్ను ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాల్ని నడిపిస్తోంది లిక్కర్.. పెట్రోల్.. డీజిల్ మీద పన్ను ఆదాయమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.80 డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్ను వసూళ్లను చేపడుతున్నాయి. ఒకవేళ.. వీటిని జీఎస్టీలోకి తీసుకెళితే.. పన్ను 28 శాతానికి మించి వేసే అవకాశం ఉండదు. రాష్ట్రాలు కూడా అదనంగా పన్ను విధింపులకు అవకాశం ఉండదు. అదే జరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గటం ఖాయం. మరి.. కీలకమైన పన్ను ఆదాయాన్ని కోల్పోయి మరీ ధరలు తగ్గేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది.. చూడాలి మరీ.. పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపునకు కేంద్రం ఏం చేయబోతుందో... 

సజ్జలకు కేబినెట్ బెర్త్? తెలుగు పన్నీర్ సెల్వం అవుతారా? 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతీసి అడుగేయాలంటే, అయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలే అయినా, ఆయన ఓకే చేస్తేనే  ఫైల్ ముందుకు కదులుతుంది. ముందు అయన దర్శనం చేసుకుంటేనే, ముఖ్యమంత్రి దర్శనం లభిస్తుంది. అలాగని ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువో, క్లాస్మేట్, రూమ్మేట్టో కాదు, చివరకు జైల్మేట్ కూడా కాదు. ఎంపీ, ఎమ్మెల్యే అసలే కాదు. నిజానికి ప్రత్యక్ష రాజకీయాలలో ఆయన పాత్ర ఇంచుమించుగా జీరో. అయినా ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు ఆయన నోటి నుంచే మీడియాకు చేరతాయి. ప్రభుత్వ నిర్ణయాలే కాదు, ఫ్యామిలీ పాలిటిక్స్ విషయంలోనూ ఆయనే మాటే. ‘బైబిల్’ వాక్కు.  వైసీపీలో ఆయన కీలక బాధ్యతలే నిర్వహించారు. పార్టీ జనరల్ సెక్రటరీగానూ పనిచేశారు. అయినా, నెంబర్ 2 షాడో తొలిగే వరకు ఆయన చాలావరకు తెర చాటునే ఉండి పోయారు. నెంబర్ 2 ను మేఘాలు కప్పేయడంతో, అయన వెలుగులోకి వచ్చారు.   ఆయన ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అవును,ఆయన మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అయిన వారిని, కానీ వారిని అనేక మందిని సలహాదారులుగా నియమించారు. అలా నియమించిన ‘మంద’ లో ఆయన కూడా ఒకరు. అయితే, కలిసొచ్చె కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారన్నట్లు, ఆయనకు కాలం కలిసొచ్చింది. కారణాలు ఏవైనా ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితునిగా ముద్ర పడింది. ప్రభుత్వ నిర్ణయాలు మొదలు రాజకీయ వివివాదాలు, పరిష్కారాల వరకు అన్నిటికీ ఆయనే కేంద్ర బిందువు. ఇన్ని మాటలెందుకు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే  అంటారు.    అదే సమయంలో అయన  సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ వ్యవహారాల్లో ఎలా వేలు పెడతారనే విమర్శలు వినవచ్చాయి. విమర్శలు మాత్రమె కాదు, ఏకంగా ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రపై న్యాయస్థానంలో పిటీషన్ కూడా దాఖలైంది. అయితే ‘మరకా మంచిదే’ అన్నట్లుగా, ఈ మరక కూడా ఆయనకు మరో అదృష్ట రేఖగా మారింది. ఈ గొడవంతా ఎందుకని అనుకున్నారో ఏమో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే తంతే వెళ్లి గారెల బుట్టలో పడినట్లు సజ్జల అదృష్టమే అదృష్టం. అలాగే రేపు ఏదైనా జరగరానిది జరిగి మళ్ళీ జైలుకు వెళితే, తెలుగు పన్నీర్ సెల్వం అయ్యే అదృష్తం కూడా దక్కవచ్చని అంచున్నారు.  ఎటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ కూర్పు సమయంలోనే మంత్రి పదవి అంటే ఐదేళ్ళు అనుకునేరు, రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పూర్తిగా మారిపోతుంది, మీరంతా మాజీలు అయిపోతారు. కొత్త వారికి అవకాశం ఇస్తామని ముందుగానే చెప్పారు. ఇప్పుడు ఆ ఆగడువు ముగింపు దశకు చేరుకుంది.  కాబట్టి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం రానే వచ్చింది ఈ నేపధ్యంలో కొత్త మంత్రివర్గం కూర్పు పై జరుగతున్న చర్చల్లో సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సజ్జలకు కాబినెట్ బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే, ఆయన శాసన సభ సభ్యుడు కాదు.. కాబట్టి ఆరు నెలలలో అయన ఎమ్మెల్యే,/ ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. అదెంత పని  రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..