ఢిల్లీ లిక్కర్ స్కాం.. చార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం పేరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ  చార్జీషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ పేరు చేర్చింది. అలాగే రెండో చార్జిషీట్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌తో పాటు మరో 17 మందిపై కూడా ఈడీ అభియోగాలు మోపింది. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ పేరు చేర్చటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  మొదటి నుంచీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనంగానే ఉంది.  

నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉందంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రవేశ పెట్టిన 2023-2024 వార్షిక బడ్జెట్ ఎలా వుంది? ఎప్పటిలానే, అధికార పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా వుంది. ప్రతిపక్షాలకు అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుంది. నిజానికి, అక్షరం పొల్లు పోకుండా ఇదే బడ్జెట్’ను చిదంబరం (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రవేశ పెట్టి వుంటే,  బడ్జెట్ ఇదే అయినా కాంగ్రెస్ పార్టీకి అద్భుతంగా, అమోఘంగా, మహా రుచిగా, బీజేపీకి అందుకు పూర్తి భిన్నంగా, మహా చేదుగా, వెగటు పుట్టేలా వుండి వుండేది. అలాగే ఇతర పార్టీల ప్రతిస్పందనలు. ఇప్పుడు బాగుందన్న నోళ్ళే అప్పుడు ఛీ’ అనేవి.. అలాగే, ఇప్పుడు ఛీ అన్న నోళ్ళు అప్పుడు ఆహో. ఓహో అనేవి.  సో ... బడ్జెట్ పై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, రాజకీయ పార్టీలే కాదు, మీడియా, మేథావులు సైతం రాజకీయ రంగులకు అనుగుణంగానే విశ్లేషణలు చేస్తున్నారు.  సరే అదలా ఉంటే ఇది ఎన్నికల సంవత్సరం కూడా కావడం, మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే చిట్టచివరి పూర్తి స్థాయి బడ్జెట్  కావడంతో, బీజేపీ బడ్జెట్ లోని సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, బడ్జెట్‌లో ప్రకటించిన ప్రజానుకూల  చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 12 రోజుల దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజునుంచే మొదలైన, ప్రచారానికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడీ సారధ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  ఫిబ్రవరి 1 నుంచి 12న వరకు సాగే ఈ ప్రచారంలో దేశంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర బడ్జెట్‌పై చర్చలు, విలేకరుల సమావేశాలు,  సెమినార్‌లు నిర్వహించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్,  రైతు, యువజన విభాగాల అధినేతలతో సహా తొమ్మిది మంది సభ్యులతో కూడిన టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల బీజేపీ యూనిట్ల అధినేతలు, అసెంబ్లీలోని విపక్ష నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రజలకు అవగాహనా కల్పించేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టిందీ అంటే అందుకు ప్రత్యేక కారణం ఎన్నికలు. అవును ఈ సంవత్సరం ఏకంగా తొమ్మిది రాష్త్రాలలో  శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ కేంద్ర బడ్జెట్ మోడీ ప్రస్తుత  ప్రభుత్వం ప్రవేశ పెట్టీ చిట్ట  చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అవుతుంది. అందుకే, కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు  ఓక పథకం ప్రకారం బడ్జెట్ అనుకూల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఈ  ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి,  గతంలోనూ  బీజేపీ కేంద్ర బడ్జెట్‌లలో ప్రకటించిన సంస్కరణలు, కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహించింది. ఇప్పుడ మళ్ళీ అదే పంథాలో ముందుకు సాగుతోంది. అయితే, కేవలం ప్రచారంతోనే రాజకీయ ప్రయోజనం చేకురుతుందా, అంటే అనుమానమే అంటున్నారు. ముఖ్యంగా ఓటు బ్యాంకు లక్ష్యంగా, ఎలాంటి ఆకర్షణలు లేకుండా నిర్మలమ్మ వండి వడ్డించిన  బడ్జెట్  ప్రజలకు ఎంత వరకు రుచిస్తుందనేది అనుమానమే అంటున్నారు.   అంతేకాదు, కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మల సీతారామన్  వరసగా ఐదవసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్, గత బడ్జెట్లకు భిన్నంగాలేదు. నిజానికి పేరుకే ఎన్నికల బడ్జెట్ కానీ, ఎన్నికల వాసనలు అసలే లేవు.  మధ్య తరగతికి పన్ను పోటు నుంచి కాసింత వెసులుబాటు కల్పించే చర్యలు మినహా, పెద్దగా ఓటు బ్యాంక్ తాయిలాలు ఏవీ కనిపించలేదు. అలాగని అందరినీ నిరాశ పరిచిందా అంటే అదీ లేదు. ఒక విధంగా మోడీ ప్రభుత్వం మొదటి నుంచి అనుసరిస్తున్న... సుస్థిర అభివృద్ధి లక్ష్యంగానే ఈ వార్షిక బడ్జెట్ కూడా వుంది. ఇక ప్రజలు ఎలా రిసీవ్  చేసుకుంటారో చూడవలసి వుంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చిక్కుల్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీ నిఘా దళపతి పీఎస్సార్‌ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందా? నెల్లూరు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్  పీఎస్సార్ ఆంజనేయులే తనకు అందించారంటూ మీడియా ఎదుట చెప్పంతో ఆయన చిక్కుల్లోపడేసిందనే పరిశీలకుల చెబుతున్నారు.  కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది. తన ఫోట్ ట్యాప్ అయ్యిందనీ, ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడతానన్న కోటం రెడ్డి అన్నంత పనీ చేశారు. మీడియా సమావేశంలో తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను వెల్లడించారు. దీంతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మంత్రి అమర్నాథ్ కోటం రెడ్డి చూపిన ఆధారాలు ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని వ్యాఖ్యానించారు. దీంతో కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనని మంత్రి అంగీకరించినట్లైంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలోఆందోళన పెరిగింది. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో తమ ఫోన్ లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కోటం రెడ్డి తన ప్రెస్ మీట్ లో చెప్పారు. తాను తన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆరోపణలు చేయగానే పలువురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని తనకు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు స్వయంగా మంత్రి రికార్డింగ్ వ్యవహారంతో అధికార పార్టీ తన సొంత ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టిందన్న విషయం తేటతెల్లమైపోయింది. ఒక ఎమ్మెల్యేకు స్వయంగా నిఘా విభాగం అధిపతే ఆయన ఫోన్ కాల్ రికార్డు పంపించారంటే.. అధికార పార్టీలోని ఎమ్మెల్యేల ఫోన్లన్నీ నిఘా నీడలోనే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది. అదంతా పక్కన పెడితే.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలంటూ బయటపెట్టిన వివరాలు ఏపీ ఇంటెలిజెన్స చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును చిక్కుల్లో పడేసిందన్నఅభిప్రాయం వ్యక్తమౌతోంది.    

అయోధ్యకు చేరిన పురాతన సాలగ్రామం.. ఎందుకంటే?

అయోధ్యలో రామజన్మ భూమిలో  నిర్మాణంలో ఉన్నరామమందిరంలో  శ్రీరాముడి ప్రధాన విగ్రహాన్ని మలిచేందుకు నేపాల్ నుంచి అత్యంత అరుదైన సాలగ్రామాన్ని తీసుకువచ్చారు.  ఈ భారీ సాలగ్రామంతోనే శ్రీరామచంద్రుని విగ్రహాన్ని తయారు చేసి, గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈమేరకు శ్రీ రామజన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్టు రెండు అరుదైన సాలగ్రామాల వివరాలను వెల్లడించింది. ఇవి 60 మిలియన్ ఏళ్లకంటే పురాతనమైనవని, ఒక రాయి 26 టన్నులు, మరొకటి 14 టన్నుల బరువుందని ట్రస్టు వివరించింది.  వీటిని దేవ శిలలుగా పిలుస్తారు. ఈ శిలలనునేపాల్ లోని ముక్తినాథ్ సమీపంలోని  గండకి నది సేకరించారు. గండకి నదిలోనే అరుదైన సాలగ్రామాలు లభిస్తాయి. అయోధ్యలో ఉన్నది రామ్ లల్లా మందిరం. అంటే బాల రాముడు, రాముడు బాలుడి అవతారంలో ఉంటారు కనుక ఈ అరుదైన..అత్యంత పురాతన, భారీ సాలగ్రామంతోనే రామయ్య బాలుడి రూపాన్ని చెక్కి, ప్రతిష్ఠాస్తారు. వచ్చే ఏడాది  సంక్రాంతి నాటికల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి.

ఇది ఆరంభం మాత్రమే... అసలు సినిమా ముందుంది!

నెల్లూరు వైసీపీలో ముసలం ప్రారంభమయింది. పది అసెంబ్లీ స్థానాలుంటే పదింటిలోనూ వైసీసీయే గెలిచిన నెల్లూరు జిల్లాలో  ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు ఆరంభమైంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా వార్ కు దిగారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నిరసన గళం వినిపించారు. జిల్లాకే చెందిన  మరో ఎమ్మెల్యేలో కూడా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందనీ, ఏ క్షణమైనా బయటపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో ఆరంభమైన అసమ్మతి ముందుముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెలుగు చూసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కృష్ణా జిల్లా గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రారవు జగన్ సైకో.. సినిమాల్లో విలన్ లా ఉన్నారని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. వారి వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియో పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  దీంతో ఈ జిల్లా, ఆ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గత మూడున్నరేళ్లకు పై బడి మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఇక ముందు ముందు తమ అసంతృప్తిని వెళ్ల గక్కేందుకు ఒక్కరొక్కరుగా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  సీఎం సొంత జిల్లా కడప లో కూడా అసమ్మతి రాజుకుంటోంది. ఎమ్మెల్యేలు బయటపడలేదు కానీ, రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి వంటి వారు తమ అసమ్మతి గళం విప్పారు.  ఇలా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసమ్మతి గూడుకట్టుకుని ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా అవి బయటపడే అవకాశం  ఉందని అంటున్నారు.  

ఈటల ఓటమికి కేటీఆర్ వ్యూహం!?

తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నియోజక వర్గం  హుజురాబాద్.  ఇంచుమించుగా ఏడాది కిందట జరిగిన  హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ప్రభావితం చ్జేసిందో, అందుకు కారణాలు ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగులో అడుగేస్తూ వచ్చిన బీసీ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో మొదలై హుజురాబాద్  ఉపఎన్నిక వరకు కొనసాగిన పొలిటికల్ హైడ్రామా గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణమే అవుతుంది. ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడినా  ఓడిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు.  ఇక అక్కడ నుంచి బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదునుపెడుతూ వచ్చారు. ఈటల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకనో ఏమో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను వెంటాడుతూనే ఉన్నారు. ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరం అయినా ఇంతవరకు అసెంబ్లీలో ఆయనను కనీసం ఒక్క రోజైనా కూర్చోనీయలేదు. మాట్లాడనీయలేదు.   ఏదో ఒక సాకుతో ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఈటలను  గౌరవ స్పీకర్  సభలో ఉండనిస్తారో లేదో చూడాలి.అదలా ఉంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటలను సొంత  నియోజక వర్గం హుజురాబాద్ లో ఓడించేందుకు,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్,  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్  అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయనకు సూచించారు. గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే  ఇప్పటికే  కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇటీవల గవర్నర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు సైతం తప్పు పట్టింది.  ఆ తప్పును ప్రభుత్వ తరపు న్యాయవాది అంగీకరించడంతో పాటుగా, మరో మారు అలాంటి పరిస్థితి రాదని కోర్టుకు తెలిపారు. అయితే   కౌశిక్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంచితే  ఏ విధంగా చూసినా   కౌశిక్ రెడ్డి ఈటలకు సామ ఉజ్జీ కాదని అంటున్నారు. అంరో వంక ఉప ఎన్నికల్లో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ వర్గం కౌశిక్ రెడ్డిని ఉద్యమ ద్రోహిగా పేర్కొంటూ  ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ని ఢీకొట్టడం   కౌశిక్ రెడ్డికి అయ్యే పనేనా?  అంటే, కాదనే అంటున్నారు.

కోటంరెడ్డి తిరుగుబాటు వైసీపీ స్క్రిప్టేనా?

నెల్లూరు పెద్దారెడ్ల అసంతృప్తి ఒక వైపు వైసీపీలో కాక రేపుతుంటే.. మరో వైపు తెలుగుదేశంలో ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందా అన్న అనుమానాలు  తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కోటం రెడ్డి తీరు పట్ల తెలుగుదేశంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ట్వీట్ రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సరిగ్గా నెల రొజుల కిందటే.. కోటం రెడ్డి జగన్ పిలుపు మేరకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి ఆయనతో బేటీ అయిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కోటంరెడ్డి బహిరంగంగా తన ఫోన్  ట్యాప్ చేస్తున్నారంటూ మీడియా ముందు ప్రకటించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో తాను తెలుగుదేశం తరఫున పోటీ చేస్తానంటూ ప్రకటించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గత మూడున్నరేళ్లుగా  తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేతపైనా ఇష్టారీతిగా నోరు పారేసుకున్న కోటం రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి.. తన రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చేతుల్లోనే అనడం వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు అనుమానిస్తున్నాయి.  2019లో ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు చేశారు. చంద్రబాబుది భస్మాసుర హస్తం అంటూ విమర్శించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబను విఫల నాయకుడిగా విమర్శించారు. ఇప్పుడు అప్పట్లో కోటం రెడ్డి చేసిన విమర్శలన్నీ తెలుగుదేశం సర్కిల్స్ లో విపరీతంగా సర్క్యలేట్ అవుతున్నాయి. కోటంరెడ్డిని తెలుగుదేశం గూటికి చేరనివ్వవద్దంటూ అధినేతకు విజ్ణప్తులు  చేస్తున్నాయి.  అంతే కాకుండా.. రాష్ట్రంలో రోజు రోజుకూ జగన్ ప్రభ మసకబారుతుండటం, వైసీపీ పట్ల ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పక్కా వ్యూహంతోనే కోటం రెడ్డి సొంత పార్టీపైనా, జగన్ పైనా విమర్శలతో బయటకు వచ్చారన్న అనుమానాలు దేశం శ్రేణుల్లో వెల్లువెత్తుతున్నాయి. అలాగే వివేకా హత్య కేసులో తాడెపల్లి ప్యాలస్ డొంక కదులుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చే వ్యూహంతో కూడా వైసీపీ కోటం రెడ్డి చేత కావాలనే సొంత పార్టీపై ఆరోపణలు చేయిస్తోందన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్లను పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. అప్పట్లో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆ అంశం నుంచి దృష్టి మరల్చడానికే కోససీమలో చిచ్చు రేపారనీ, ఇందు కోసం వైసీపీ సొంత ఎమ్మెల్యే ఇంటిని దగ్ధం చేయించడానికి కూడా వెనుకాడలేదనీ గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి విషయంలో, ఆయన ఆరోపణల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్న అనుమానాలనే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ ద్వారా బయటకు వెల్లడించారని అంటున్నాయి.   గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ట్వీట్ లో..  వైసీపీ కోవర్ట్ డ్రామా ఆరంభమైంది.. రాబోయే వ్యూహం సినిమా స్క్రప్ట్ లా ఉంది.. తెలుగు తమ్ముళ్లూ జర జాగ్రత్త అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనపైనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి కారణమేంటి?

కేసీఆర్ రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేశారా? గవర్నర్ తో విభేదాల విషయంలో తగిలిన ఎదురు దెబ్బ కారణంగా ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై బీజేపీపై విమర్శలు చేయవద్దని నిర్ణయించుకున్నారా? లేక కుమార్తె కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి కాపాడుకోవడం కోసం కేంద్రంపై, ప్రధానిపై విమర్శల వాడి వేడి తగ్గించేశారా? కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బుధవారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు దాదాపు శూన్యం. ఏదో ఒకటీ అరా కేటాయించినా.. అవన్నీ కేంద్ర సంస్థలకు సంబంధించి మాత్రమే. గత ఏడాది నిర్మలాసీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ ను చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ఎలుగెత్తారు. అప్పుడు ఆయన ప్రసంగం అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. కేంద్రంపై పోరులో కేసీఆర్ చాంపియన్ అన్న భావన కలిగించింది. ఏడాది గిర్రున తిరిగింది. మళ్లీ కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ సారీ తెలంగాణకు రిక్తహస్తమే. అయినా కేసీఆర్ పన్నెత్తి మాట్లాడలేదు. కనీసం తెలంగాణకు కేంద్రం మళ్లీ అన్యాయం చేసింది అన్న మాటైనా ఆయన నోటి వెంట రాలేదు. జాతీయ పార్టీ అధినేత అయినా, తెలంగాణకు ముఖ్యమంత్రే కదా.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేటాయింపులు దక్కకపోవడంపై నోరెత్తకపోవడమేమిటని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా బడ్జెట్ పై కేసీఆర్ మౌనానికి పలు  రకాల భాష్యాలు చెబుతున్నారు. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్ రాబోతోంది. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభం అవుతున్నాయి. ఆ రోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. మొదట గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని భావించిన కేసీఆర్.. ఆ తరువాతి పరిణామాలతో వెనక్కు తగ్గారు. అంతే కాదు.. గవర్నర్ కు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా గవర్నర్ ప్రసంగ ప్రతులలో ఆమె చెప్పిన మార్పులకు కూడా ఓకే చేసేశారు. అంటే ప్రభుత్వం ఆమోదంతో రూపొందిన గవర్నర్ ప్రసంగంలో కూడా ఆమె చెప్పిన మార్పులు చేయడానికి కిమ్మనకుండా అంగీకరించేశారు. తమిళనాడు గవర్నర్ చేసిన విధంగా తమిళిసై కూడా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా అన్న భయం ఆయనలో కనిపిస్తోంది. ఒక వైపు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తనతో జట్టుకట్టే పార్టీల గురించి అన్వేషణ సాగిస్తూనే.. మరో వైపు ఏ విధంగానైనా కేంద్రం మెప్పు పొందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో అంటే గవర్నర్ ఎపిసోడ్ తరువాత కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కేంద్రంపై విమర్శల దూకుడు కనిపించడం లేదు. మరో వైపు గవర్నర్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి పసన్న కుమార్ రెడ్డిని షటిల్ సర్వీసులా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య తిప్పుతున్నారు.   మొత్తానికి కేంద్రం విషయంలో కేసీఆర్ తీరు మారిందనడానికి బడ్జెట్ పై ఆయన నోరెత్తకపోవడాన్నే తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు. 

రాహుల్ జోడో యాత్ర ముగిసింది.. కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది?

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగిసింది. శ్రీనగర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయన విజయవంతంగా తన గమ్యం చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు.  అయిదు నెలల కాలంలో 14 రాష్ట్రాలలో కాలి పాదయాత్ర సాగించిన  రాహుల్‌ గాంధీ, ఈ యాత్ర వల్ల పార్టీకి ఎంత మేరకు రాజకీయ లబ్ధి చేకూరిందన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం రావడం లేదు. రాహుల్ తన పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎర్రటి ఎండలో, వణికించే చలిలో కూడా ఎక్కడా ఆగకుండా ఆయన పాదయాత్ర నిర్ధిష్ట షెడ్యూల్ ప్రకారం సాగింది. ఆయనలోని పట్టుదలను, ఓర్పు, సహనాన్ని ప్రజల కళ్లకు కట్టింది. రాహుల్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ తనయుడిగా, తల్లి సోనియా చాటు బిడ్డగానే కాకుండా ప్రజా జీవితంలో యాక్టివ్ గా ఉండే నేతగా, ప్రజల కష్టాలకు, సమస్యలకు స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక అలుపూ, సొలుపు అన్నది లేకుండా రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తూ, అదీ ఉత్సాహంగా, ప్రజలతో మమేకమౌతూ ఆయన సాగించిన నడక అందరి దృష్టినీ ఆకర్షించిందనడంలో సందేహం లేదు. స్థిత ప్రజ్ణత సాధించిన నేతగా, పరిణతి చేందిన వ్యక్తిగా, రాజకీయ వేత్తగా ఆయనకు దేశ వ్యాప్త గుర్తింపు తీసుకు వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే ఈ గుర్తింపు  కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనకరం, ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా? అధికారాన్ని హస్తగతం చేస్తుందా? అంటే మాత్రం అనుమానమే అన్న సమాధానమే రాజకీయ వర్గాల నుంచీ, విశ్లేషకుల నుంచే కాదు.. ఆ పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తోంది. ఆయన పాదయాత్ర సాగుతున్న సమయంలోనే తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేనంత ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైంది. హిమాచల్ లో విజయం సాధించినప్పటికీ.. ఆ విజయాన్ని రాహుల్ పాదయాత్ర క్రెడిట్ లో వేయడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒక సారి అధికారం మారడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని గద్దె దించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు.   ఏతావాతా.. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలలో ఆదరణ ఉందనీ, ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నీరుగారలేదనీ, అయితే ఆ ప్రజాదరణనూ, క్యాడర్ ఉత్సాహాన్నీ ఎన్నికలలో విజయంగా మరల్చుకుందుకు అవసరమైన వ్యూహాలు కరవయ్యాయనీ తేలింది.  ఇక మళ్లీ రాహుల్ వద్దకు వస్తే.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వల్ల, ప్రజలకు చేరువ కావడం వల్ల ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్న అవగాహన నిస్సందేహంగా మరింత పెరిగింది.  అలాగే ప్రజలకు కూడా రాహుల్ పట్ల ఇప్పటి వరకూ ఉన్న దృక్ఫథం కూడా మారి ఉంటుంది. నాన్ సీరియస్ రాజకీయ వేత్త కాదనీ, విపక్షాలు ఇంత కాలం విమర్శిస్తున్న విధంగా ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్ కాదనీ కూడా అర్ధమైంది. ఆయనలో పరిణితి చెందిన నేతను ఈ యాత్ర  ప్రజలకు పరిచయం చేసింది.   ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికీ, పార్టీకి అవసరమైన జవసత్వాలు నింపడానికి చేకగలిగిందంతా చేశారు. ఇక మిగిలినది పార్టీ చేయాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా వ్యక్తమౌతున్న సానుకూలతను వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. పార్టీ పట్ల ప్రజలలో ఆదరణ ఉన్నా,  రాష్ట్రాలలో పార్టీ నేతల మధ్య తగాదాలు, విభేదలూ గెలుపునకు అవరోధాలుగా మారుస్తున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ ఎన్నికల ఓటములకు అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు.. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో విజయంపై పార్టీ దృష్టి సారించాల్సి ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దానిని కాపాడుకోవడం.. విపక్షంగా ఉన్న రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ ముందున్న సవాళ్లు.  మరీ ముఖ్యంగా  కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో  ఏకకాలంలో బీజేపీ, అధికార బీఆర్ఎస్ లను ఎదుర్కొని విజేతగా నిలవాల్సిన అవసరం ఉంది.   

బాలకృష్ణ గ్రేట్.. విజయసాయి రెడ్డి

తెలుగుదేశం అధినేత   నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణపై  ఎవరైనా సోషల్ మీడియా వేదికగా  విమర్శలు గుప్పిస్తున్నారంటే.. అది వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కరే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి రోజు.. వీరిపై  ట్విట్టర్ వేదికగా ఏదో ఒక విమర్శ చేస్తేనే కానీ  విజయసాయిరెడ్డికి  పూట గడవదన్న టాక్   సోషల్ మీడియాలో ఉంది.  అయితే తాజాగా టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్జతలు తెలపడం సంచలనంగా మారింది.  జనవరి 27న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.  ఆ  సందర్భంగా  ఆయన బంధువు, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై.. కుప్పకూలిపోయారు. దీంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి..  చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.  నందమూరి తారకరత్న.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అది ఎలాగంటే... విజయసాయిరెడ్డి భార్య సునంద.. చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డి.  ఆ అలేఖ్యా రెడ్డి.. తారకరత్న భార్య. అంటే.. విజయసాయిరెడ్డికి.. తారకరత్న వరుసకు అల్లుడు అవుతారు.  దీంతో విజయసాయిరెడ్డి.. బుధవారం(ఫిబ్రవరి 1) బెంగళూరులోని నారాయణ హృదయాలకు వెళ్లి.. మరదలి అల్లుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన పూర్తిగా సేఫ్ అని చెప్పారు. అయితే  తారకరత్న అస్వస్థతకు గురైన రోజు దాదాపు  45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ   నిలిచిపోవడంతో  మెదడు పైభాగం దెబ్బతిందని.. ఈ నేపథ్యంలో.. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌‌ కారణంగా.. లివర్ కానీ.. కొన్ని ఆర్గాన్స్‌కి కానీ.. రక్త ప్రసరణ తగ్గిందని.. దీంతో కొంత యాక్టివిటీ తగ్గిందని అన్నారు.   అయితే ఈ రోజు హార్ట్ ఫంక్షనింగ్ పర్ ఫెక్ట్ గా ఉందనీ,  మెదడులో ఎడిమా  అంటే వాపు  ఉందని.. ఇది మూడు నాలుగు రోజులు ఉంటుందని..  ఆ తర్వాత స్టెబిలైజ్ అయి.. వాపు తగ్గడం ప్రారంభమవుతుందని... వైద్యులు చెప్పారని విజయసాయి వివరించారు.  వైద్యులు  అద్బుతంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనీ. మంచి ట్రీట్‌మెంట్ కనిపిస్తోందని విజయసాయి అన్నారు. ఈ సందర్భంగా ఆయన నందమూరి బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం విషయంలో బాలకృష్ణ  ఎంతో కష్టపడ్డారనీ, అన్ని విషయాలూ ఆయన   స్వయంగా చూసుకొంటురన్న విజయ సాయి ఆయనకు కృతజ్జతలు తెలియజేసుకొంటున్నానన్నారు.        తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి ఫ్యామిలీతోపాటు నారా ఫ్యామిలీలో ఎంత ఆందోళన వ్యక్తమవుతుందో.. విజయసాయిరెడ్డి ఫ్యామిలీలో కూడా అంతే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సైతం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలోనే ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించి... అతడికి అందిస్తున్న వైద్యాన్ని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరు పెద్దారెడ్ల ప్రతిఘటన

కాలం కలిసి వస్తుంటే.. అన్ని ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి.. అదే కాలం కలిసి రాకుంటే.. ఒకదాని వెనుక ఒకటి పోతునే ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా  చోటు చేసుకొంటున్న పరిణామాలు చూస్తుంటే.. వైసీపీకి కాలం కలిసి రావడం లేదని అనిపించక మానదు.  మొన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి.. నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నేడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి..  రేపు ఎవరు అనే  చర్చ జోరుగా సాగుతోంది. వీరందరూ ఒకరి వెంట ఒకరు వైసీపీపైనా, సీఎం జగన్ పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతలను నేదురుమిల్లి రామ్‌కుమార్‌రెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం.  మరి కొద్ది రోజుల్లో ఆయన  తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమనీ, నేడో రేపో ముహూర్తం ఖరారు చేసుకుంటారని నెల్లూరులో విస్తృతంగా ప్రచారంలో ఉంది.   అలాగే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..   జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో..   తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ క్రమంలో తన ఆగ్రహాన్ని, అసహనాన్ని అధికారులపై చూపిస్తుండడంతో.. ఈ ఏడాది జనవరిలో సీఎం  జగన్ ఆయనను తన క్యాంప్ కార్యాలయానికి స్వయంగా  పిలిపించుకొని మరీ మాట్లాడి పంపించారు. అయితే గత కొద్ది రోజులుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. సొంత పార్టీపై కోటంరెడ్డి నిప్పులు చెరగడమే కాదు..  అన్నా.. జగనన్న మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే... అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి,  జగన్‌కే సూటిగా ప్రశ్నలు సంధించారు. నమ్మకం లేని చోటు నేను  ఉండను గాక ఉండనంటూనే.. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ నుంచి పోటీ చేస్తానని.. ఆ విషయం ఆ పార్టీ వారికే చెప్పానని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తాన్నారు. దీంతో కోటంరెడ్డి పార్టీ మార్పు పక్కా అని అందరికీ అర్థమైపోయింది.     ఇక... ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సైతం.. తన నియోజకవర్గంలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలపై.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గమైన ఉదయగిరిలో పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి.. చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఆతడి వల్ల మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. పరిశీలకుడు ధనుంజయరెడ్డి నిర్ణయాల వల్ల .. పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధనుంజయ్ రెడ్డి ససతం ఉదయగిరి ఎమ్మెల్యేపై తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌కు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు తన మీద పెత్తనం చేయడం కదరని పని అని.. ఈ విషయం సీఎం జగన్, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడానికే కాదు.... దేనికైనా సిద్ధమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం చేశారు.  ఇలాంటి వరుస పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని మరో ఎమ్మెల్యే.. అంటే మరో పెద్దారెడ్డి.. తన గొంతు సవరించుకొని.. అధికార పార్టీపై అసమ్మతి గళం విప్పి ఎదురు తిరిగేవారు ఎవరా? అని తాడేపల్లి ప్యాలెస్‌లోని పెద్దలు సైతం టెన్షన్ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో   ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అలాంటి జిల్లాలో ఇలా   ఒకరి తర్వాత ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తడం విప్పుతూ పోతే.. ఇక మిగిలేది ఎవరిని.. అధికార పార్టీ పెద్దలు తలలుపట్టుకుంటున్నారు. 

జగన్ పై కోటం రెడ్డి రివోల్ట్.. కారణమేమిటంటే?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీకి  రాం.. రాం చెప్పేశారు.  అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున బరిలో దిగాలనుందంటూ..  తన మనస్సులోని మాటను బయటపెట్టేశారు.  అయితే తెలుగుదేశం నుంచి పోటీ విషయంలో  నిర్ణయం మాత్రం చంద్రబాబుదేనంటూ  ముక్తాయించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం  జగన్‌తో కోటంరెడ్డి భేటీ అయ్యారు.  అయితే ఆ భేటీ జరిగిన నెల రోజులకే కోటంరెడ్డి..  ఇకపై వైసీపీలో ఉండలేనంటూ..  ఫ్యాన్‌ స్వీచ్ ఆప్ చేసి మరి బయటకు వచ్చేయడం సంచలనంగా మారింది.  కోటంరెడ్డి నిర్ణయం పట్ల వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలో తొలి నాళ్ల నుంచి ఆవేశం ఉండేదని..  కానీ  జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం ఆయనకు మంత్రిపదవి దక్కకపోవడంతో పాటు..  తన సొంత జిల్లాలో.. అదీ జస్ట్... తన పక్క నియోజకవర్గం నుంచి గెలుపొందిన సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను జగన్ తన తొలి కేబినెట్‌లోకి తీసుకోవడం..  ఆ తర్వాత జరిగిన మలి కేబినెట్‌ కూర్పులో సైతం.. అదే  జిల్లాకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డికి కేబినెట్ బర్త్ కేటాయించడం.. ఈ ఇద్దరికీ అత్యంత కీలక శాఖలను  కేటాయించడం..   కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేదనే ఓ చర్చ అప్పుడూ, ఇప్పుడూ కూడా జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది. అదీకాక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో..   జగన్ మీద ఉన్న నమ్మకంతో కోటంరెడ్డి ఫ్యాన్ పార్టీలో చేరారన్న సంగతి అందరికీ తెలిసిందే.  2014లో తొలిసారి నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. అయితే నాడు పార్టీ విపక్షంలో ఉండడంతో.. జగన్ అధికారంలోకి వస్తే.. తనకు మంత్రిగిరి దక్కుతోందని కూడా భావించారని ఆయన కోటరీలోని వారు ఇప్పటికీ చెబుతుంటారు. అంతేకాదు..  వైయస్ జగన్ అధికారంలోకి రావడం కోసం జిల్లాలో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారని కూడా ఆయన వర్గం చెబుతోంది.  ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో జగన్ పార్టీ జెండా రెపరెపలాడిందని.. అలాగే రాష్ట్రంలో కూడా ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని.. దీంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం మంత్రిగిరి దక్కలేదని.. చర్చ సైతం సాగుతోంది.  అలాగే జగన్ మలి కేబినెట్‌ కూర్పుకు ముందు కూడా కోటంరెడ్డి.. తన నియోజకవర్గంలో రాజకీయ పరంగా జగనన్న వదిలిన బాణంలా దూసుకుపోయారని.. ఆ క్రమంలో పార్టీలోని శ్రేణుల పడుతున్న ఇబ్బందులు తెలుసుకొనేందుకు.. తన నియోజకవర్గంలో నేను.. నా కార్యకర్త అంటూ దాదాపు 50 రోజులు పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్ర సైతం నిర్వహించారని... కానీ జగన్ మలి కేబినెట్‌లో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదని... ఈ నేపథ్యంలో ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టోన్‌లో జగన్ పార్టీ పట్ల విముఖత స్పష్టంగా వినిపిస్తూ వస్తోందనే టాక్ సైతం వైరల్ అవుతోంది. అందులోభాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్లీనరీలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. అధికార మదంతో ప్రవర్తిస్తే, అధికార మదం తలకెక్కితే ప్రజలు వాత పెడతారని.. సొంత పార్టీ వారిని హెచ్చరించారు. అంతేకాదు... ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు ఆయన హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే కోటంరెడ్డిలో చోటు చేసుకున్న అసంతృప్తి క్లియర్ కట్‌గా అర్థమువుతోందనే చర్చ సైతం సాగుతోంది.  అలా మొదలైన కోటంరెడ్డిలో ప్రస్ట్రేషన్.. నేడు పీక్స్‌ చేరిందని.. అంతేకాదు తన ఫోన్ ట్యాపింగ్ అంశం.. కోటంరెడ్డిని జీర్ణించుకోలేకుండా చేశాయని..  అందుకే నమ్మకం లేని చోట ఉండలేనంటూ ఆయన వైసీపీకి పార్టీకి గుడ్ బై చేప్పేశారు.  ఇక వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కోటంరెడ్డి గట్టిగానే నోరు పారేసుకొన్నారని.. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుది భస్మాసూర హస్తమని.. ఆ భస్మాసురుడికే ఈ చంద్రబాబు పెద్దన్న అన్నారని.. అలాగే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తగలబడిపోయిందన్నారని.. రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు ఓ విఫల నాయకుడిగా అభివర్ణించారని.. తన ఐదేళ్ల పాలనపై చంద్రబాబు... ఆత్మపరిశీలన చేసుకోకుండా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమంటూ కోటంరెడ్డి పలు వేదికలపై నుంచి వ్యాఖ్యలు సైతం చేశారని చర్చ సైతం సైకిల్ పార్టీలో సవారీ చేస్తోంది.   మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌లో నరకాసురుడి పాలన కనిపిస్తోందా? చంద్రబాబు అవినీతిని బైట పెట్టిన వైయస్ జగన్‌లో నరకాసురుడు కనిపిస్తున్నాడా? అంటూ నాడు చంద్రబాబుపై ఇదే కోటంరెడ్డి నిప్పులు సైతం చెరిగారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కేవలం ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారని కూడా కోటంరెడ్డి తన ప్రెస్‌మీట్‌లో గుర్తు చేశారని.... అలాగే  చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కరువు కటకాలతో ఉండేదని... జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని కూడా అన్నారని.. అలాగే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోతోందంటూ కోటంరెడ్డి జోస్యం కూడా చెప్పారనే చర్చ సైతం టీడీపీలో సాగుతోంది.  అయితే పార్టీ అధినేత చంద్రబాబుపై ఇలాంటి వాఖ్యలు చేసిన.. కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దంటూ.. తెలుగుదేశంలోని ఓ వర్గం   అడ్డం పడుతోన్నట్లు సమాచారం. అదీకాక గతంలో ఇన్ని విమర్శలు చేసిన ఆయన.. నేడు పార్టీలోకి వస్తే.. పార్టీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతోందనే ప్రశ్న కూడా ఉదయించినట్లు తెలుస్తోంది. మరోవైపు... టీడీపీతో కోటంరెడ్డి.. ముందుగానే మంతనాలు చేసుకొన్నారని.. ఆ తర్వాతే.. జగన్ పార్టీకి బై బై చెప్పేశారని.. జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుపై ఇన్ని ఆరోపణలు గుప్పించిన.. కోటంరెడ్డిని సైకిల్ పార్టీలోకి ఆహ్వానిస్తారా? లేకుంటే.. సజ్జల చెప్పినట్లు.. ముందే వేసుకొన్న పథకం ప్రకారం.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారా? ఓ వేళ.. టీడీపీలో కోటంరెడ్డి రాకకు అడ్డు పడితే... ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది.. ఆయనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటంటే మాత్రం.. అందుకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

వచ్చే ఎన్నికలలో బీజేపీ నినాదం మోడీ!

ప్రస్తుతం బీజేపీకి మోడీ వినా మరో ప్రజాకర్షక నేత లేరు. నిజమే ఇప్పుడు మోడీ తప్పితే ప్రస్తుతం బీజేపీలో ఇమేజ్ ఉన్న నేత మరొక్కరు లే రు. అందుకే పార్టీని మించి ఎదిగిన మోడీ పెత్తనాన్ని ఆర్ఎస్ఎస్ అనివార్యంగా భరిస్తోంది. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నినాదం, ఆశ, ఆస్త్రం అన్నీ మోడీయే. ప్రచార సారథీ మోడీయే. అందుకే తన కోసం తన కాళ్లకు తానే   బలపాలు కట్టుకు మరీ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు మోడీది. నిజమే కాంగ్రెస్, దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలూ ఎలా అయితే ఒకే ఒక వ్యక్తిపై ఆధారపడి బండి లాగిస్తున్నాయో.. బీజేపీ కూడా అలాగే మోడీపై ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన  బీజేపీ ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అంతా మోడీ షో అన్నట్లుగానే సాగుదోంది. బీజేపీలో, ప్రభుత్వంలో అంతా తానే అయిన పరిస్థితిపై మోడీ ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. అన్నిటికీ తన ఇమేజ్, తన పేరు ఉపయోగించడంపై ఒకింత అభ్యంతరం చేశారు. అన్నిటికీ తానే రావాలని, తాను వస్తేనే విజయం అన్న మైండ్ సెట్ నుంచి బయటకు రావాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీ పార్టీ నేతలకు చెప్పారు. అయితే ఆయన ఆ మాట కేవలం మాటవరసకే చెప్పారన్న విషయం అప్పుడే అందరికీ అర్ధమైంది. పార్టీకి  మోడీ పేరు ఓ తారక మంత్రంగా మారింది. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు బీజేపీ నేతలకు మోడీ జపం వినా మరోటి లేకుండా పోయింది.   ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రానికి చెందిన నేతే ఉన్నా తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి స్వయంగా మోడీయే ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ఆయన ఆధిపత్యం, ప్రాముఖ్యతా పార్టీలో ఎంతగా పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికకు  బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను మోడీ తన వ్యక్తిగత హోదాలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి ఉందంటే.. పార్టీగా బీజేపీ పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.  ఉదాహరణకు హిమాచల్ విషయం చెప్పుకున్నాం కానీ.. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర విభాగాలన్నీ మోడీ ఆదేశాల కోసమే ఎదురు చూస్తాయి తప్ప సొంతంగా పని చేసే శక్తియుక్తులను ఎప్పుడో కోల్పోయాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి పోటీగా, దీటుగా రాష్ట్రాల్లో బీజేపీలో కుమ్ములాటలు వర్ధిల్లుతున్నాయి.  సంఘ్ పరివార్ నుంచి వచ్చిన పాత బీజేపీ నేతలకు బయటి నుంచి, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి  వచ్చి చేరిన నేతల మధ్య విభేదాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇంతకాలం బీజేపీ జెండా, అజెండా మోసిన తమను కాదని బయటి నుంచి వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత పెరగటం, వారికి అధికారం కట్టబెట్టడాన్ని పాతనాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటి బిగువన తమ ఆగ్రహాన్ని అణచుకుంటున్నారు. ఒక్కో సారి పార్టీని ధిక్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితులూ ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు  తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో  అంతర్గత కుమ్ములాటల రూపంలో బయటకు వస్తూనే ఉంది. వీటి పరిష్కారానికి సైతం మోడీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ఇమేజ్ అనే ఏకైక అస్త్రంతో కదన రంగంలోకి అడుగుపెడుతోంది.  వరుసగా మూడవసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు.  నెహ్రూ వరుసగా మూడుసార్లు దేశాన్ని ఏలినట్టు తన పేరు కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవాలని మోడీ కోరుకుంటున్నారు. అందుకే మోడీ కూడా నెహ్రూ అడుగుజాడలలో అంతర్జాతీయ వేదికలపై గౌరవం పొందడం ద్వారా దేశ ప్రజల మనస్సులలో స్థానాన్ని పదిల పరుచుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగమే ఇండియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు అని పరిశీలకులు అంటున్నారు.    

శుభమన్ గిల్ సెంచరీ.. మూడో టి20లో ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 1) జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పై చేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రెండో ఓవర్ లోనే ఇషాంత్ కిషన్ ఔటైనప్పటికీ శుభమన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.   కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.  గిల్. మొత్తంగా 63 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ స్కోరులో 12  ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో టి20లో ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది.  అలాగే రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు.   235 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ  12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా 168 పరుగుల భారీ విజయం సాధించింది. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా నాలుగు వికెట్లు, హర్షదీప్, ఉమ్రాన్, మావీలు రెండేసి వికెట్లు తీశారు. శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 2-1తో కైవశం  చేసుకుంది. స్కిప్పర్ హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

లాంగ్ లీవ్ లో ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. కారణమేమిటి?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. ఏపీ డీజీపీగా సునీల్ కుమార్ నియామకం జరగనుందన్న వార్తలు వస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ లో వెళ్లడం సంచలనం కలిగిస్తోంది.  నిజానికి డాక్టర్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఏపీలో ఎవరికీ పరిచయం అవసరం లేని పేరు. సీఐడీ చీఫ్ గా అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన వ్యక్తి.  విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి. సీఐడీ చీఫ్ గా ఉన్నంత కాలం సునీల్ కుమార్ అంటే ఏపీ సీఐడీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది.   అటువంటి సునీల్ కుమార్ ను  ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఇటీవల బదలీ చేసింది.   డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో  ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.   జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమారే ఉన్నారు.  ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.    ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. పదోన్నతి ఇచ్చి నిండా నెలరోజులు కూడా కాకుండానే  బదలీ వేటు వేయడం సంచలనం సృష్టించింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు  పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించడం అప్పడే  సంచలనం సృష్టించింది.   1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్  జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  అటువంటిది సీఐడీ పోస్టు నుంచి ఆయన తప్పించి ఇంత కాలం ఎలాంటి పోస్టూ ఇవ్వకుండా ప్రభుత్వం దూరం పెట్టడం, ఆ తరువాత ఇప్పుడు ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలోని ఒక రెస్టారెంట్, విశాఖ జిల్లాలో ఓ 50 ఎకరాల భూమి విషయంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించడంతోనే ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసింది. ఏది ఏమైనా.. సునీల్ కుమార్ ను సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించి పక్కన  పెట్టేయడం, ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ పెట్టడం వెనుక ఏదో  పెద్ద కారణమే ఉందని మాత్రం అంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వానికి సానుకూలంగా.. పరిధి దాటి మరీ వ్యవహరించిన సునీల్ కుమార్ ఇప్పుడు అదే ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారనీ, అందుకే లాంగ్ లీవ్ పై వెళ్లక తప్పని అనివార్య పరిస్థితి ఎదుర్కొన్నారని అంటున్నారు. 

మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పైనే చికిత్స

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఈ రోజు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బుధవారం  (ఫిబ్రవరి 1) హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యలు.. ఆయనకు మరి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తరువాత మరో హెల్త్ బులిటిన్ విడుదల చేస్తామని  తెలిపారు. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నారనీ, ప్రస్తుతం ఆయనకు బ్రెయిన్ డ్యామేజీ రికవరీ చికిత్స అందిస్తున్నామనీ తెలిపారు. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు త్వరలోనే వెంటిలేటర్ సపోర్టు తొలగిస్తామని వివరించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ మంగళవారం( జనవరి 31)తో పోలిస్తే బుధవారం(ఫిబ్రవరి 1) ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడిందని అన్నారు.  గుండె, కాలేయం పనితీరు సాధారణంగానే ఉందని తెలిపారు. తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. నిన్నటి వరకూ గడ్డంతో కనిపించిన తారకరత్న తాజా ఫొటోలో క్లీన్ షేవ్ తో కనిపించారు. 

వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోందా?

వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఓ విధంగా రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు.  అంతేకాదు.. ప్రభుత్వంలో కొలువు దీరిన సలహాదారుల రూపంలో అయితేనేమీ.. వివిధ కార్పొరేషన్ సంస్థల అధిపతులుగా నియమించడంలో అయితేనేమీ.. వివిధ నామినేటేడ్ పోస్ట్‌లు కట్టబెట్టడంలో అయితేనేమీ.. టీటీడీ చైర్మన్, ఈవో వంటి పదవుల విషయంలో అయితేనేమి, శాసన మండలి  చైర్మన్, ఈవో పదివిలో అయితేనేమి మొత్తం రెడ్డి సామాజిక వర్గం వారికే మనసా వాచా   జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా కూడా జగన్ సర్కార్ పట్ల రెడ్డి సమాజిక వర్గంలో  ఆసంతృప్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో రెడ్డి సమాజికవర్గంలో అసంతృప్తి గతంలో ఎన్నడూ లేదని ఆ సమాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఇదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు ..  కాసు బ్రహ్మానందరెడ్డి,  చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెడ్లదే రాజ్యమని.. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో.. ఆ తర్వాత వచ్చి కె రోశయ్య ప్రభుత్వంలోనే కాదు.. ఆ గద్దెనెక్కిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని.. దీంతో రెడ్లకు దక్కాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు. ఇక   జగన్.. ముఖ్యమంత్రి అయితే.. తమకు పూర్వ వైభవం వస్తోందని.. తమ సామాజిక వర్గానికి  జగన్   ఓ ఆశాకిరణమని ఆ సామాజిక వర్గం వారు భావించారు. వైఎస్ ప్రభుత్వంలో దక్కిన మర్యాద, ప్రాధాన్యత మళ్లీ దక్కుతోందని  ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా  వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరినా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు అత్యంత గౌరవప్రదమైన స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత జగన్ పాదయాత్ర లో రోడ్లు మీదకు వచ్చి మరీ తమ శక్తి కొలది ఖర్చు చేసి.. తమ విలువైన సమయాన్ని సైతం పక్కన పెట్టి.. మరీ జగన్ గద్దెనెక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు.  దీంతో 2019 ఎన్నికల్లో  జగన్ పార్టీ గెలుపు..  నల్లేరు మీద నడకే అయిందని..ఈ నేపథ్యంలో తమకు గౌరవం, విలువ దక్కుతోందని సదరు సామాజికవర్గం భావించింది కానీ,  జగన్ హయాంలో కనీస గౌరవం కూడా  దక్కడం లేదని సదరు   సామాజిక వర్గం వాపోతోంది.    ఈ నేపథ్యంలో  రెడ్డి సామాజిక వర్గం చూపు తెలుగుదేశం వైపు మళ్లిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  ఉమ్మడి కడప జిల్లా నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి,వరదరాజులు రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్యామిలీ, బైరెడ్డి ప్యామిలీలు  తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో రెడ్లు... పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులివే!

ఎన్నికల సంవత్సరం పైగా తెలంగాణలో అధికారంపై బీజేపీకన్నేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. తెలంగాణ ప్రజలూ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కేంద్రంతో పెరిగిన దూరం నేపథ్యంలో బడ్జెట్ కు ముందు తెలంగాణ సర్కార్ పెద్దగా డిమాండ్లేవీ పెట్టలేదు. ఒక విధంగా బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులూ లేకుంటే బాగుంటుంది అన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరించింది. బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత లేకపోతే.. తన విమర్శలకు మరింత పదును పెట్టి ఎన్నికలలో లబ్ధి పొదాలన్న వ్యూహంతో  బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించింది. అందుకే గత బడ్జెట్ కు ముందు తెలంగాణకు కావాల్సినవి ఇవీ అంటూ లేఖాస్త్రాలను సంధించేది. రైల్వే ప్రాజెక్టులపై గొంతెత్తేది. కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసేది. అయితే ఈ సారి మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. సరే బీఆర్ఎస్ సర్కార్ అడక్కపోయినా..రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ అర్రులు సాచుతున్న సమయంలో ప్రజల మెప్పు పొందడానికి తెలంగాణకే కేటాయింపులలో సింహభాగందక్కుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం ఎన్నికలు ఎన్నికలే.. బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులే రెంటికీ సంబంధం లేదన్న తీరుగానే వ్యవహరించింది. ఈ సారి బడ్జెట్ లో కూడా తెలంగాణకు దక్కాల్సిన కేటాయింపులు దక్కలేదు. ఏదో ఊరడింపు అన్నట్లుగా నిధులు విదిలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ఆఫ్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 

నిర్మలమ్మ బడ్జెట్ 2023-24 .. కొంచం తీపి.. కొంచెం చేదు

నిర్మలా సీతారామన్ బుధవారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ తీపి చేదుల మిశ్రమంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఆర్థిక నిపుణులు మాత్రం బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మతన బడ్జెట్ లో వేతన జీవులకు ఒకింత ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 7లక్షల రూపాయలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పొదుపు పరిమితిని రూ.15లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధిస్తారు. అంటే 7లక్షల నుంచి 9 లక్షల వరకూ 5శాతం, ఆదాయం 30 లక్సలు దాటితే 30శాతం పన్ను విధిస్తారు. ఇక  ధూమ పాన ప్రియులకు నిర్మల షాక్ ఇచ్చారనే చెప్పాలి. పొగాకు ఉత్పత్తులపై భారీగా వడ్డించారు. దీంతో సిగరెట్ల ధరలు పెరుగుతాయి. ఒక బంగారం, వెండి లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో వీటి ధరలూ పెరుగుతాయి. అలాగే బ్రాండెడ్  దుస్తుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఇక టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గుతాయి.     నిరుద్యోగులకు కూడా ఒకింత ఊరట కలిగించేందుకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నిధులు కేటాయించారు. నాలుగు లక్షల మంది  నిరుద్యోగులకు  పీఎం కౌశల్ పథకం కింద శిక్షణ ఇస్తారు. స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.   ఇక దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువచ్చారు. విద్యుత్ రంగానికి 35 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.  5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయినఎంఎస్ఎంఈలకు రిఫండ్ పథకం అమలు చేస్తారు. అలాగే ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు ఉంటుందన్నారు.  గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. అలాగే  పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.   కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని  మరో ఏడాది పొడిగించారు.   వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించగా,  బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించారు.  పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు,  గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు పీఎంఏవై కోసం రూ.79వేల కోట్లు కేటాయించారు.