బతకనివ్వను.. ఛస్తే ఊరుకోను!

ఎప్పుడూ.. దిమ్మ తిరిగే ఆలోచనలు..శాశనాలతో కొరియన్లు ఊదరగొట్టే కిమ్ జోంగ్ మరో శాశనంతో.. జనాన్ని ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయం సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల కిమ్ కుమార్తె పేరును ఎవరికి ఉండొద్దు అంటూ నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె 'జు ఏ' పేరు దేశంలోని ఏ బాలిక లేదా మహిళకు ఉండకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  కిమ్ మరో ఆదేశాలతో ఆయన చర్చనీయాంశంగా మారారు. అదేంటో గాని... ఉత్తర కొరియాలో ఆత్మహత్యలపై ఆయన నిషేధం విధించారు. ఈ మేరకు సీక్రెట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.   ఆత్మహత్య అనేది సోషలిజానికి వ్యతిరేకంగా దేశద్రోహంగా భావించిన కిమ్... ఆత్మహత్యను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా నివేదికలో పేర్కొంది. ఉత్తర కొరియాలో గత ఏడాది కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యలు పెరిగాయని తెలుసుకున్న కిమ్ జోంగ్... ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తర కొరియాలో.. ఆత్మహత్యల కేసులు 40 శాతం పెరిగాయి. అక్కడి అధికారులను ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ సంఖ్యను అధికారులు ధృవీకరించలేదు. ఆత్మహత్యల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిమ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. అందుకోసం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... ఈ ఆదేశాలు జారీ చేశారనే వాదన వినిపిస్తోంది.  ఈ సమావేశంలోనే ఆత్మహత్యకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాలో పెరుగుతున్న అంతర్గత అశాంతి ప్రజల సమస్యలకు కారణమని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఉత్తర కొరియా దేశంలో హింసాత్మక నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని సమాచారం. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ఏడాది మాత్రమే చోంగ్జిన్ సమీపంలోని క్యోంగ్సాంగ్ కౌంటీలో 35 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయట. ఈ సంఖ్యను నార్త్ హమ్గ్యోంగ్ సమావేశంలో కూడా ప్రదర్శించారు. ఈ కేసులలో చాలా వరకు మొత్తం కుటుంబాలు కలిసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఆత్మహత్యలపై నిషేదం విధించారు. మీరవరూ బతకడానికి వీలగలేదు..అలా అని ఛస్తే మాత్రం..నేనూరుకోను అన్నట్టుంది సదరు కిమ్ ల వారి వ్యవహారం. నిత్యం..కొత్త కొత్త శాశనాలతో..కొరియన్లను భయభ్రాంతులకు గురిచేసే ఆయన వైఖరికి జనం ఇప్పటికే సగం చచ్చారు. ఇప్పడు .. ఆత్మహత్య లపై నిషేధంతో.. వారి పరిస్థితి..బతకాలేము..చావలేము అన్నట్టుగా ఉంది. ఇలాంటి నేతతో.. ఉత్తర కొరియా ప్రజలను ఆ దేవుడే రక్షించాలి.

బాలయ్య.. ప్రజాసేవ, సినిమా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుల్లో  ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. నేటికీ ఆ వారసత్వాన్ని కొసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే.. అది నందమూరి బాలకృష్ణ అన్నది సుస్పష్టం. అలాగే ఎమ్మెల్యేగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అనుసరిస్తున్న మార్గం.. పలువురికి సర్వదా అనుసరణీయం. అలాంటి బాలయ్య జన్మదినం శనివారం (జూన్ 10). ఈ ఏడాది ఆయన 63వ సంవత్సరంలోకి అడుగు పెడతారు.   నందమూరి బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమా విడుదలవుతోందంటే.. ఆయన అభిమానులకు నిజంగా పండగే పండగ. ఆయన డైలాగ్ డెలివరీ అయినా.. డ్యాన్స్ సెప్ట్‌లు వేసిన.. ఛేజింగ్ సీన్స్‌లో దూసుకెళ్లినా బాలయ్యకు బాలయ్య బాబే సాటి. అలాగే పౌరాణికం, సాంఘికం, రాజకీయం ఏ సినిమా అయినా.. అది ఒక కళాఖండమే. అలాగే ఓటీటీ వేదికగా వచ్చిన.... వస్తున్న అన్‌స్టాపబుల్ కార్యక్రమం సైతం సూపర్ డూపర్ హిట్టే.  ఇక హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అటు అన్నా క్యాంటీన్లను   బాలయ్య బాబు ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో.. నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలను   అందిస్తున్నారు. ఇక బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాలయ్య బాబు.. అందిస్తున్న సేవలు అపూర్వం, అనితర సాధ్యం. ప్రముఖ మ్యాగజైన్ అవుట్ లుక్ నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో రోగులకు సేవలందిస్తున్న అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా ఈ బసవ తారకం ఆసుపత్రి రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించింది. దీంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు బాలకృష్ణ ఎంత అంకితబావంతో సేవలందిస్తున్నారో  అర్థమవుతోంది. అలాగే ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ సైతం నిర్వహిస్తున్నారు.   ఆయనకు 23 ఏళ్ల వయస్సులో తండ్రి ఎన్టీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. గత 39 ఏళ్లలో 22 ఏళ్ల ముఖ్యమంత్ర పీఠం ఆ ఇంటిదేనన్నది సుస్పష్టం.  ఇద్దరు బావలు ఎమ్మెల్యేలు అయినా.. సొంత సోదరుడు నందమూరి హరికృష్ణ పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నా.. రక్తం పంచుకు పుట్టిన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా చక్రం తిప్పినా.. మొత్తంగా చూస్తే.. గత 40 ఏళ్ళుగా.. మధ్యలో 1989 నుంచి 1994 వరకూ తప్ప అధికారం ఆయనింటి గడప దాటలేదన్న విషయం తెలిసిందే. ఇంతగా ఇంతలా ఈ ఫ్యామిలీ పాలిటిక్స్‌లో ఉన్నా.. ఈ రోజు వరకు ఒక్క అణా పైసా అవినీతి ఆరోపణ కానీ,  అధికార దుర్వినియోగం చేసినట్లు విమర్శలు కానీ లేక పోవడం గమనార్హం.  ఎక్కడో దూరపు చుట్టం, వరుసకు సోదరుడు,  వేలు విడచిన బామర్ది రాజకీయాల్లో ఉంటేనే ఈ రోజుల్లో వాళ్ళు హడావిడి, వాళ్ల సంపాదన ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాగే చిన్న చిన్న హీరోలు కూడా బౌన్సర్లను పెట్టుకుని వీర బిల్డప్‌తో చలామణి అవుతోన్న ఈ రోజుల్లో ఎటువంటి హడావిడి లేకుండా తిరిగే ఏకైక అగ్ర హీరో..   నందమూరి బాలకృష్ణ. వృత్తి, రాజకీయాలు, బాధ్యతతో కూడిన సమాజ సేవ మధ్య స్పష్టమైన సమన్వయంతో ముందుకు సాగుతూ సమకాలీన హీరోల్లో ముందుండే ఒకే ఒక్క పేరు బాలయ్య బాబు. అయితే బాలయ్య బాబు చేత్తో చెంపమీద కొడతారేమో గాని కడుపు మీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతం చెబుతుంటారంటే ఆది ఆయన మంచితనానికి అసలు సిసలు నిదర్శనం.    ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 108వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి భగవంత్ కేసరి అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ టాక్ ఆప్ ది టాలీవుడ్‌గా మారింది.  అలాగే బాలయ్య బర్త్ డే జూన్ 10వ తేదీ. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఘనంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణి చేయనున్నారు. అలాగే పేదలకు అన్నదానంతోపాటు ఫ్యాన్స్ రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు.  ఇక బాలయ్య నటించిన సూపర్ డూపర్ హిట్ సాధించిన సినిమాల్లో ఒకటైన ‘నరసింహనాయుడు’ చిత్రాన్ని ఆయన జన్మదినం సందర్బంగా 4కె టెక్నాలజీలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల జన్మదినం సందర్భంగా.. వారు నటించిన హిట్ చిత్రాల్లో ఒక చిత్రాన్ని ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా మలిచి.. రీ రిలీజ్ చేస్తున్న విషయం విదితమే. ఆ క్రమంలో ‘నరసింహనాయుడు’ చిత్రం విడుదల కానుంది. ఈ నందమూరి నటసింహాన్ని టాలీవుడ్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా పిలుచుకొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భవిష్యత్తులో బాలయ్య మరిన్ని చిత్రాల్లో హీరోగా నటిస్తూనే.. ఎమ్మెల్యేగా ప్రజా సేవలో దూసుకుపోవాలని ఆయనకు ఫ్యాన్స్ .. బర్త్ డే విషెష్ చెబుతున్నారు.

చేరికలు తెలంగాణ బీజేపీకి వాపా.. బలమా?

సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బలోపేతం పేరుతో వాపును పెంచేసుకున్న బీజేపీకి  ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ తొలి నుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్న పాత నాయకులకు.. చేరికల పేరిట వచ్చి చేరిన నేతలకు అస్సలు పొసగడం లేదు. దీంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో  పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడానికి ఏకంగా చేరికల కమిటీనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇన్ చార్జిగా బయట నుంచి వచ్చి చేరినఈటలను నియమించారు. అసలు బీజేపీలో చేరిన నాటి నుంచీ ఈటలకు పార్టీలో ఉక్కపోత మొదలైందన్న వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా సర్దుకుంటూ, సరిపెట్టుకుంటూ వచ్చిన ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాత్రం సమన్వయం కుదరడం లేదని అంటున్నారు.  ఈ తరుణంలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు అంటూ వార్తలు వస్తున్నాయి. తెరాస నుంచి బహిష్కృతులైనప్పటి నుంచీ కమలం గూటిగా, హస్తం గూటికా అని తేల్చుకోలేక సతమతమౌతూ వస్తున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైపోయింది. వారలా ఖరారు చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు ఈటల వారితో రహస్య భేటీ కావడం.. ఆ భేటీ తరువాత ఈటల స్వయంగా పొంగులేటి, జూపల్లిలు బీజేపీలో చేరే అవకాశం లేదని ప్రకటించడం, అంతటితో ఊరుకోకుండా వారే తనకు బ్రెయిన్ వాష్ చేశారని చెప్పడంతో ఈటల కూడా జంపై పోతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అసలు ఈటల తెరాస నుంచి బయటకు వచ్చేసిన తరువాత.. ఆయనంతట ఆయన రాలేదనుకోండి.. కేసీఆర్ బయటకు పంపారు అది వేరే విషయం. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ కాషాయ శిబిరంలో ఇమడగలరా అన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్త మయ్యాయి. సరే  ఆయన బీజేపీలో చేరడమే కాదు.. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో  బీజేపీ అభ్యర్థిగా రంగంలో  నిలిచి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆ విజయం పూర్తిగా ఈటల వ్యక్తిగత విజయంగా అప్పట్లో పరిశీలకులు అభివర్ణించారు. అయితే ఎలా గెలిచినా ఆ స్థానం బీజేపీ ఖాతాలోనే పడింది అది వేరే సంగతి. ఆ విజయంతో రాష్ట్రంలో ఈటల ఎంత ప్రభావం చూపగలరో బీజేపీ హై కమాండ్ కు బాగా అర్ధమైంది. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయనకు పొసగకపోయినా.. విభేదాలు పలుమార్లు రచ్చకెక్కినా.. ఈటల ప్రాధాన్యత బీజేపీల ఇసుమంతైనా తగ్గలేదు.  అయితే అప్పటి నుంచీ కూడా బండి, ఈటల మధ్య సమన్వయం కుదిర్చే విషయంలో బీజేపీ హై క మాండ్ మల్లగుల్లాలు పడుతూనే ఉంది.  బండి సంజయ్ ను మార్చాల్సిందేనని బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన నేతలు గట్టిగా పట్టుబడుతుండటంతో బీజేపీ అగ్రనాయత్వం దిక్కు తోచని స్థితిలో ఉంది. ఎవరిపైనైనా చర్య తీసుకుంటే.. కర్నాటక ఎన్నికల ముందు రాలినట్లు తెలంగాణ కమలంలో కూడా చాలా రేకలు రాలిపోతాయన్న భయం వారిని పట్టి పీడిస్తోంది.  అందుకే మరోసారి  ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది.  మరి ఈ సారి ఈటలను ఎలా సముదాయిస్తారో చూడాల్సి ఉంది. మొత్తం మీద గెలుపు ధీమా  బీజేపీలో సన్నగిల్లిందనడానికి ఇటీవలి పరిణామాలు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అవినాష్ చేజారిన కడప?!

ఎంపీ అవినాష్ కు కపడ చేజారిపోయిందా? ఆయనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదా? ఒక వేకడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైసీపీ దూరం పెట్టేస్తుందా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. అలా పెట్టకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కడప లోక్ సభ నుంచి అవినాష్ కే పార్టీ టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు అనుమానమేనని, అనుమానమేమిటి.. ఆయన ఓటమి తథ్యమని అంటున్నాయి. ఇందుకు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని కడప వాసులు గట్టిగా నమ్ముతుండటమే కారణమని చెబుతున్నాయి. అవినాష్ తల్లి అనారోగ్యం పేరుతో కర్నూలు ఆస్పత్రి వద్ద చేసిన హంగామా తరువాత  జిల్లా వ్యాప్తంగా అవినాష్ రెడ్డి ప్రతిష్ట దిగజారిందనీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ టికెట్  విషయమే కారణమని జనం గట్టిగా నమ్ముతున్నారని చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. అవినాష్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఉన్న బంధుత్వం. బాబాయ్ వివేకానందరెడ్డితో జగన్ కు ఉన్న విభేదాలు. జగన్ తండ్రి వైఎస్ బతికి ఉన్న సమయంలోనే జగన్ కు కడప ఎంపీ టికెట్ కోసం పంచాయతీ జరిగింది. ఆ సందర్భంగా జగన్ వివేకాతో దురుసుగా ప్రవర్తించిన విషయం అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరకూ వెళ్లింది. అదలా ఉంచితే..  వైఎస్ వివేకా మరణం తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ వైసీపీని ఏర్పాటు చేసుకున్నారు. బంధుత్వం కారణంగా వివేకాను సొంత పార్టీలోకి చేర్చుకున్నప్పటికీ జగన్ ఆయనను దూరంగా ఉంచుతూనే వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో వివేకా ఎమ్మెల్సీగా పరాజయం కావడం వెనుక అవినాష్ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. అవన్నీ పక్కన పెడితే..కడప ఎంపీ సీటు విషయంలో  వివేకా గట్టిగా పట్టుబట్టారనీ, అయితే షర్మిల లేదా తాను పోటీ చేయాలి తప్ప అవినాష్ కు వైసీపీ టికెట్ ఇస్తే సహించేది లేదని కరాఖండీగా చెప్పడంతోనే ఆయన ఎలిమినేషన్ కు కుట్ర జరిగిందని చెబుతారు. జగన్ సోదరి షర్మిల అయితే బాబాయ్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటు విషయంలో గట్టిగా నిలబడ్డారని బహిరంగంగానే చెప్పారు. ఇక సీబీఐ కూడా వివేకా హత్యకు రాజకీయకారణాలున్నాయని విస్పష్టంగా పేర్కొంది. కడప వాసులు కూడా వివేకా హత్య విషయంలో అవినాష్ ప్రమేయం ఉందనే విశ్వసిస్తున్నారు. అందుకే అవినాష్  2024 ఎన్నికలలో అవినాష్ పోటీ చేస్తే ఓడించడం తధ్యం అని చెబుతున్నారు. వైఎస్ కుమారుడిగా జగన్ కు కపడపై ఎంత పట్టు ఉన్నప్పటికీ... వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కఃను కాపాడేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను మాత్రం కడపవాసులు తప్పుపడుతున్నారు. దీంతో జగన్ కు అవినాష్ ను కడప నుంచి దూరం పెట్టడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ ను కాకుండా మరెవరిని నిలబెట్టాలన్న విషయానికి వస్తే.. అక్కడా జగన్ కు తాను దూరం పెట్టిన తల్లిని మళ్లీ తీసుకువచ్చి నిలబెడితే తప్ప ఆ సీటును కాపాడుకోలేని పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే జగన్ వెళ్లి తల్లిని కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలబడమని అర్ధిస్థారా? అలా అర్ధించినా, గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి ‘సగౌరవంగా’ సాగనంపిన కొడుకు అభ్యర్థనను ఆమె ఔదాలుస్తారా అన్నవి ప్రశ్నలే? మొత్తం మీద అక్కడ నిలబడేది ఎవరన్నది పక్కన పెడితే ఆ సీటు అవినాష్ చేయి జారిందని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు.  

మాగుంట మధ్యంతర బెయిలు రద్దు.. 12న లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

ఊరట దక్కిన ఆనందం రోజులైనా నిలువలేదు.  మాగుంట రాఘవకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది.  ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ తన అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదంటూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే అమ్మమ్మ బాత్ రూంలో జారిపడిన కారణంగా బెయిలు మంజూరు చేయడం సబబు కాదని ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమ్మమ్మను రాఘవ ఒక్కరు మాత్రమే చూసుకోవలసిన అవసరం లేదని ఈడీ సుప్రీం కోర్టులో వాదించింది. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న రాఘవ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు  రెండు వారాల మాత్రమే బెయిలు ఇచ్చిందని పేర్కొన్నారు.   అంతే కాకుండా ఒక సారి నాయనమ్మ అనీ, మరో సారి అమ్మమ్మ అనీ, ఇంకో సారి భార్య ఆత్మహత్యా యత్నం చేశారనీ రాఘవ బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదోపవాదాలు విన్న అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా మాగుంట రాఘవ మధ్యంతర బెయిలుపై రెండు రోజుల కిందట విడుదలయ్యారు.  దీంతో ఈ నెల 12న లొంగిపోవాలని రాఘవకు ఆదేశించింది. 

అవినాష్ ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం విచారణ ఎప్పుడంటే?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అవినాష్‌ ప్రధాన కుట్రదారు అని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచారు. అవినాష్‌కు కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి సహాయసహకారాలు అందుతున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ డాక్టర్ సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  ఏపీ సర్కార్ కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే  ముందస్తు బెయిలు విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని  సునీత పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 24 తర్వాత సీబీఐ నాలుగుసార్లు సమన్లు జారీ చేసిందని.. అవినాష్‌ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సునీత పిటిషన్ పై సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ పై వాదనల సందర్భంగా సీబీఐ కీలక అంశాలను వెల్లడించింది. తొలి సారిగా అవినాష్ ను వివేకా హత్య కేసులో నిందితుడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు రద్దు కోసం సునీత పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

సీమలో బాలయ్య యాత్ర

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీమ యాత్రకు రెడీ అవుతున్నారు.   రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలో  ఈ ఏడాది చివరలో ప్రారంభమైయ్యే బాలయ్య యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందుపురం నియోజకవర్గం రాయలసీమలోనే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయనను  ఆ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. సీమలోని మొత్తం అన్ని జిల్లాల్లో బాలయ్య యాత్ర చేసే విధంగా ప్రణాళికలు సిద్దమైనట్లు సమాచారం.  అదీకాక రాయలసీమలో బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.. ఆయన నటించిన అన్ని చిత్రాలూ ఇక్కడ రికార్డులు బద్దలు కొట్టిన విషయం విదితమే. అలాంటి రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉన్నాయి.  2019 ఎన్నికల్లో  ముచ్చటగా.. మూడంటే మూడు స్థానాలు మాత్రమే తెలుుదేశం ఖాతాలో పడగా మిగిలిన 49 స్థానాల్లో   జగన్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.    ప్రస్తుతం వైయస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నది సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను  పార్టీ వైపునకు.. అదీ కూడా బలంగా తిప్పుకోవాలంటే.. బాలయ్య లాంటి మాస్ క్రేజీ ఉన్న హీరోతో యాత్ర చేస్తే తెలుగుదేశం విజయం  నల్లేరు మీద నడకే అవుతుందన్న విశ్వాసం పార్టీ అధిష్ఠానంల  ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఇప్పటికే యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర.. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలను చుట్టేసి... ప్రస్తుతం సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో సాగుతొంది. ఈ జిల్లాలో లోకేష్ యాత్ర.. మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.  నారా లోకేష్ పాదయాత్రకు.. సీమలోని అన్ని జిల్లాలోని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్న విషయ విదితమే. ఆ క్రమంలో ఎన్నికలకు ముందు అంటే ఈ ఏడాది చివరలో అంటే.. నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో బాలయ్య బాబు .. సీమలో ఈ యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం.         అయితే వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని సవారీ తీయించేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో పార్టీని గెలిపించి.. అధికారం చేపట్టడం కోసం ఆయన తన చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. అందులోభాగంగా వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రజల్లోకి వెళ్లి తనదైన శైలిలో గళం విప్పుతోన్నారు. ఆ క్రమంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తదితర కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆయన నిర్వహిస్తుండగా... వీటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న విషయం విదితమే. అలాగే మీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అటు ప్రజలకు, ఇటు యువతకు భరోసా ఇచ్చేందుకు మరో కార్యక్రమాన్ని సైతం చంద్రబాబు చుట్టనున్నారు. ఓ వైపు నారా లోకేశ్, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇలా తలా వైపు నుంచి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పుతూ... ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు.  అలాగే రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి చైతన్యకృష్ణ, రామకృష్ణలు, నందమూరి సుహాసిని తదితరులు సైతం వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనే అంశంపై తెలుగు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

వైఎస్ బ్రాండ్ కు అవినాష్ గండం

తెలుగు రాజకీయాలను మ ూడు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ఎదుగురి సందింటి రాజశేఖరరెడ్డి వైఎస్ఆర్ గా ప్రసిద్ధులు. 1978లో తొలి సారి అసెంబ్లీ మెట్లు ఎక్కిన రాజశేఖరరెడ్డి అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా  రెండు సార్లు పని చేశారు. తెలుగు రాజకీయాలలో వైఎస్ఆర్ ఒక పెద్ద బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మసక బారింది.   తమ్ముడి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి, తన కొడుకు వైఎస్ జగన్ లు పదవులతో ప్రత్యక్ష  రాజకీయాలలో ఉండగా భార్య వైఎస్ విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలలు రాజకీయాల్లో పని చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  వీరిలో వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ఆర్ మరణానంతరం పులివెందుల అసెంబ్లీ  స్థానం నుంచి గెలుపొంది తదననంతరం కుమారుడు ప్రారంభించిన వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగారు. అనంతర పరిణామాలలో ఆమె ఆ  పదవిని కూడా  త్యాగం చేయాల్సి వచ్చింది.  సెప్టెంబరు 2, 2009న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన తరువాత ఆయన బ్రాండ్ ఇమేజ్ ను వాడుకునేందుకు జగన్ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైసీపీ పేరుతో ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో జగన్ మరో ఐదేళ్లు వేచి ఉండక తప్పలేదు. ఈ ఐదేళ్లలో వైఎస్ బ్రాండ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు జగన్ కుటుంబం కష్టపడింది. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ప్రతి గ్రామంలో , ప్రతిపట్టణ, నగర కూడళ్లలో వైఎస్ఆర్ విగ్రహాలు వెలిశాయి. ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ విగ్రహాల సంఖ్య 20 వేలు దాటింది.  ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహాత్మాగాంధీ, బీఆర్ అండేడ్కర్, నెహ్రూ వంటి జాతీయ నేతల విగ్రహాల కన్నా చాలా ఎక్కువ. ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకున్న వైఎస్ బ్రాండ్ 2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఒక్క సారిగా పాతాళానికి దిగిపోయింది.  కడప జిల్లాలో వైఎస్ వంశీయుల అనుమతి లేకుండా గాలి కూడా ఒక వైపు నుంచి మరో వైపుకు వీచదు అంటూ చెప్పుకుంటారు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి స్వంత తమ్ముడిని  పులివెందులలో ఆయన స్వంత ఇంట్లో అత్యంత దారుణంగా నరికి చంపడంతో  కడప జిల్లా ఉలిక్కిపడింది. తొలుత వివేకా మరణం గుండెపోటుతో6 జరిగిందన్న అబద్ధాన్ని ప్రచారం చేసేందుకు వైఎస్ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  వివేకా కూతురు స్వతహాగా డాక్టర్ కావడంతో ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు వైఎస్ కుటుంబం  దగ్గర సమాధానాలు దొరకలేదు. పులివెందులలో వైఎస్ పెద్దయనగా పెరు సంపాదించిన వివేకా హత్యతో అవినాష్ పై కడప వాసులు కోపం పెంచుకున్నారు. గత కొంత కాలంగా హైకోర్టు, సుప్రీం కోర్టు, సీబీఐ ఇంటరాగేషన్ తో వైఎస్ బ్రాండ్ కు బీటలు వారాయి. వైఎస్ విజయలక్ష్మిని పార్టీ నుంచి సాగనంపి, వైఎస్ షర్మిలను తెలంగాణకు పరిమితం చేయడంతో కడప ప్రజలు జగన్ పై గుర్రుగా ఉన్నారు. వివేకా హత్య కేసులో తమ్ముడిని వెనకేసుకు రావడం కూడా కడప వాసులకు నచ్చడం లేదు. ఇప్పటికి 11 సీబీఐ కేసులలో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్ పై ఉన్న సానుభూతి ఇప్పడు కనబడడం లేదు. వైఎస్ కుటుంబ కంచుకోటగా  పేరున్న కడపలోనే బ్రాండ్ డామేజి అవుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడపలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ యువగళం ద్వారా జగన్ పాలనను తూర్పారపడుతున్నారు. ఏది ఏమైనా రాజశేఖరరెడ్డి పెంచుకున్న వైఎస్ బ్రాండ్ కు గడ్డు రోజులు వచ్చాయని చెప్పక తప్పదు. 

మోడీ ఇమేజ్ ముంచేస్తుంది జాగ్రత్త!

బీజేపీ డబుల్ ఇంజిన పవర్ అంటూ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంటే ప్రగతి స్పీడందుకుంటుందని ఊదరగొట్టేస్తోంది. పేరుకు డబుల్ ఇంజిన్ అంటున్నా కేంద్రం ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు మనుగడ సాగిస్తున్నది మోడీ ఇమేజ్ తోనే అని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కర్నాటక ఎన్నికలలో పరాభవం ఎదురయ్యే వరకూ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరికీ మోడీ మ్యాజిక్ పై వీసమెత్తు అనుమానం కూడా రాలేదు. అయితే కర్నాటక ఫలితాల తరువాత ‘మోడీ’ ఇమేజ్ పైనే ఆధారపడి సార్వత్రిక ఎన్నికలకు వెడితే మునిగిపోవడం ఖాయమన్న భయం బీజేపీలో మొదలైంది. ఆ భయం ఆ పార్టీ మెంటార్ ఆర్ఎస్సెస్ వరకూ చేరింది. దీంతో ఇంత కాలం మౌనంగా ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీకి సుద్దులు చెప్పడం మొదలెట్టేసింది. కర్నాటక ఫలితాలను ఉటంకిస్తూ.. కేవలం మోడీ ఇమేజ్ బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో గట్టెక్కించే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేసింది. కర్నాటక ఫలితాల తరువాత పార్టీలో మోడీ వ్యతిరేక గొంతులు సవరించుకుంటున్నాయి. వాటికి ఆర్ఎస్ఎస్ అండ లభిస్తోందన్న అనుమానాలు కూడా పార్టీలో వ్యక్తమౌతున్నాయి. పార్టీలో మోడీ వ్యతిరేక గళం అనగానే మొదటిగా ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు గడ్కరీ.  ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో  2018లోనే మోడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ధైర్యంగా పార్టీ పవర్ సెంటర్ నే ప్రశ్నించారు. నాగపూర్ ఆశీస్సులతోనే గడ్కరీ అంత ఘాటు విమర్శలు చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. అయితే అప్పడు గడ్కరీకి ఆర్ఎస్ఎస్ ఏ మాత్రం అండగా నిలవలేదు. కానీ గడ్కరీ మోడీకి వ్యతిరేకంగా అప్పట్లో గట్టిగా గళమెత్తడంతో మోడీకి ఆయనే ప్రత్యామ్నాయమన్న చర్చ కూడా జరిగింది. ఇంతకీ అప్పుడు ఆయన ఏమన్నారంటే.. 2014 ఎన్నికలలో బీజేపీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు.  ఎందుకంటే అప్పుడు అధికారంకి రాగలమన్న నమ్మకం బీజేపీలో లేదు. అందుకే ప్రజాకర్షక హామీలను గుమ్మరించేయమని పార్టీ హైకమాండ్ నిర్దేశించింది.  సరే అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు నాడు మేం ఇచ్చిన హామీలను నెరవేర్చమని జనం డిమాండ్ చేస్తున్నారు.  మేం నవ్వి ఊరుకుంటున్నామని అప్పట్లోనే గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నికలలో విజయం కోసమే హామీలిచ్చాం కానీ వాటిని నెరవేర్చాలన్న ఉద్దేశమే లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆ తరువాత ఆయనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాముఖ్యత బాగా తగ్గిపోయింది. ఆయన నాగపూర్ సంబంధాలు కూడా దానిని ఆపలేకపోయాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని కూడా కోల్పోయారు. 2019 ఎన్నికలలో కూడా మోడీ ఫేస్ బీజేపీని గెలిపించడంతో పార్టీలో, ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర నామమాత్రమైపోయింది. కేంద్ర మంత్రిగా ఉత్సవ విగ్రహంగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఇప్పడు 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట మోడీ ఇమేజ్ మసకబారుతోందన్న అంచనాల నేపథ్యంలో ఈ సారి ఆర్ఎస్ఎస్ ఘాటు వ్యాఖ్యలే చేసింది. మోడీ ఇమేజ్ ని మాత్రమే నమ్ముకుంటే మునక ఖాయమని హెచ్చరించింది. బీజేపీ మెంటార్ గా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను డబుల్ ఇంజిన్ లెక్క చేసినా చేయకపోయినా బీజేపీ క్యాడర్ కచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుందన్నది పరిశీలకుల అంచనా. ఈ నేపథ్యంలోనే మరోసారి అందరి దృష్టీ గడ్కరీ వైపు మళ్లింది. ఈ ఏడాది చివరిలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటి ఫలితాలు బీజేపీలో మోడీ భవిష్యత్ కు లిట్మస్ టెస్ట్ గా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఆర్ఎస్ఎస్ మాత్రం.. ఇప్పటికైనా మించిపోయింది లేదు తప్పు తెలుసుకుని బీజేపీ కనుక తన దారిని మార్చుకుని బీజేపీ లో సమష్టి నాయకత్వానికి పెద్ద పీట వేయడం లోకల్ లీడర్ షిప్  ని డెవలప్ చేయడం కేవలం హిందూత్వనే పట్టుకోకుండా మొత్తంగా ప్రజల కు అవసరం అయిన వాటిని అందిపుచ్చుకుని వాటి మీద పనిచేయడం మొదలు పెట్టాలని సూచించింది. మెంటార్ సూచనలను డబుల్ ఇంజిన్ పట్టించుకుంటుందా? లేదా అన్నది చూడాల్సి ఉంది. 

విజయసాయికి చేయడానికి పనేది?

విజయసాయి రెడ్డి.. చాలా కాలం తరువాత అమరావతిలో  వైపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పడు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిల్స్ లోనూ ఓ రేంజ్ లో  చర్చకు తావిచ్చాయి. అంతే కాదు.. విజయసాయి నిజం చెప్పేశారంటూ సోషల్ మీడియాలో ఆయన మాటలు తెగ ట్రోల్ అవుతున్నాయి. ఇంతకీ విజయసాయి కొత్తగా ఏమీ చెప్పలేదు.  రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు ఏం చేప్పారో.. విజయసాయి ఇప్పుడు అదే విషయాన్ని అనుబంధ సంఘాలకు చెప్పారు. నాలుగేళ్లుగా రిలాక్స్ డ్ గా ఉన్నారు. పని చేయకుండా పబ్బం గడిపేసుకున్నారు. ఇక ఈ తొమ్మిది నెలలైనా పని చేయండంటూ విజయసాయి అనుబంధ సంఘాల సమావేశంలో చెప్పారు.  బలే కోయిన్సిడెన్స్ అంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే కాదు.. పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఈ నాలుగేళ్లు అధికారం, పెత్తనం చెలాయించేస్తూ గడిపేశారనీ, ఇక ఎన్నికలకు తొమ్మిది నెలలో మిగిలి ఉండటంతో పని చేయండ అని మంత్రులను సీఎం బతిమలాడుకుంటుంటే.. విజయసాయి తాను ఇన్ చార్జ్ గా ఉన్న పార్టీ అనుబంధ సంఘాలను బతిమలాడుకుంటున్నారు. ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు.. ఇక నుంచి 24 గంటలూ పార్టీ కోసం పని చేయాలని ఆయన వైసీపీ విద్యార్థి, యువత, మహిళా విభాగాలకు దిశా నిర్దేశం చేశారు.   విజయసాయి అంటే ఇటీవల అయితే పార్టీలో అనామకుడిగా మిగిలిపోయారు కానీ, వైసీపీ ఆవిర్బావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన నేత. సలహాదారు అన్న పదవి లేదు కానీ, ప్రస్తుతం సజ్జల అనుభవించిన హోదాను, ఆధిపత్యాన్నీ పార్టీలో విజయసాయి అనుభవించారు. ఆయన మాటే వేదవాక్కుగా పార్టీ పై నుంచి కింది వరకూ అందరూ శిరసావహించేవారు. అలాంటి విజయసాయికి పదవులన్నీ పీకేసి కేవలం అనుబంధ సంఘాల ఇన్ చార్జి పదవిని నామమాత్రంగా మిగిల్చింది పార్టీ. మళ్లీ ఇక్కడ కూడా ఆయన అధికారాలు అంతంత మాత్రమే. పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జ్ లందరూ సజ్జల కంట్రోల్ లో ఉంటారు. ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను ఈ అనుబంధ సంఘాలకు సంబంధం లేకుండా సజ్జల కుమారుడు మానిటర్ చేస్తున్నారు. అంటే అలంకారప్రాయమైన పదవిలో ఉన్న విజయసాయి.. అనుబంధ సంఘాల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు ఇక పని చేయండంటూ దిశానిర్దేశం చేయడం వెనుక ఆయన ఉద్దేశమేమిటని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను సజ్జల కుమారుడి చేతికి పార్టీ అధినేత అప్పగించిన తరువాత పార్టీలో విజయసాయికి పనే లేకుండా పోయింది. ఇంత కాలం ఆయన హస్తినకు పరిమితమై.. మౌనాన్ని ఆశ్రయించారు. చంద్రబాబు జన్మదినానికి ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం, మెడీని పొగుడుతూ పోస్టులు పెట్టడం వినా ఆయన ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కనిపించలేదు కూడా. ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ వర్గాలనే విస్మయపరిచినట్లుంది. చేయడానికి పార్టీలో ఆయనకే ఏ పనీ లేదు.. ఇక ఆయన చెబితే అనుబంధ సంఘాలు వింటాయా? ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వైసీసీ వర్గాలలోనే  వ్యక్తమౌతున్నాయి.  

ఢిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందన్న కోర్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ ఆకాంక్షలను వదులుకుని మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించినా కుమార్తెకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇసుమంతైనా ఊరట కలిగించలేకపోయారు. బీజేపీ  వ్యతిరేక వ్రతం స్వయంగా భగ్నం చేసుకున్నా.. అందకు ఆయనకు ఆ పార్టీ నుంచి ఫలం దక్కలేదంటూ కేసీఆర్ విమర్శకులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఔను వరుస విచారణలతో ఇక కవిత అరెస్టే తరువాయి అన్న స్థాయి నుంచి అనూహ్యంగా కవితను కనీసం ఈడీ విచారణకు కూడా పిలవకుండా పక్కన పెట్టేసే వరకూ జరిగిన పరిణామాలలో కేసీఆర్ మౌనమే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ గా మారిపోయిందన్న విమర్శలూ వెల్లువెత్తాయి. రాజకీయంగా ఎంతగా రాజీ పడినా, సర్దుకు పోయినా కేసు కోర్టు వరకూ వెళితే.. లాజికల్ ఎండ్ కు చేరాల్సిందే అన్నట్లుగా తాజాగా హస్తిన మద్యం కుంభకోణంలో కోర్టే ఈ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకూ  ఈడీ, సీబీఐ ల నుంచి ఇటువంటి ఆరోపణలు వచ్చాయి కానీ.. ఈ సారి    న్యాయమూర్తే ఆధారాలున్నాయని చెప్పడం నిస్సందేహంగా కవితకు పెద్ద షాక్ అని చెప్పడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన  లాభాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం ఆస్తులు కొనుగోలు చేశారనడానికి   ఆధారాలున్నాయని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు విస్పష్టంగా పేర్కొంది నిధులు బదిలీ ,ఆస్తుల క్రయవిక్రయాలు, క్రియేటివ్‌ డెవలపర్స్‌ వాంగ్మూలాలు అన్ని కూడా కవిత ఆదేశాలనుసారమే జరిగినట్లు  కోర్టు పేర్కొంది. ఈ వ్యాఖ్యలు కోర్టు  పిళ్లై బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో చేసింది.   ఈడీ సమర్పించిన  ఆధారాల మేరకు ఈ కేసులో అరుణ్‌ పిళ్లై ప్రధాన నిందితుడని  కోర్టు స్పష్టం చేసింది.   ఈ సందర్భంగా కవిత ప్రమేయంపై కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఇక మద్యం కేసులో కవిత పూర్తిగా ఇరుక్కున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేశినేని నాని పొగపెట్టుకున్నారా? పెట్టారా?

తెలుగుదేశం పార్టీతో కేశినేని నాని తెగతెంపులు ఖాయమైనట్లే కనిపిస్తున్నాయి. అయితే నాని ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీయే పొమ్మనలేక పొగపెట్టిందా? లేక పార్టీలో తమ్ముడు చిన్ని ఎదుగుదలను ఓర్వలేక తానే పొగపెట్టుకున్నాడా అంటే.. వేళ్లన్నీ కేశినేని నానివైపే చూపుతున్నాయనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ హవాలో సైతం తాను గెలిచానని చెప్పుకుంటున్న నాని.. విజయవాడలో తెలుగుదేశం బలంతోనే తాను విజయం సాధించగలిగానన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో  తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పుకుంటున్న నాని విజయం విషయంలో వ్యక్తం చేస్తున్న ధీమాపై మాత్రం పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాని తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదనీ, అలాగే బెజవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికీ పిలవలేదని అంటున్నారు. తెలుగుదేశం ఎంపీ అయిన కేశినేని నాని ఆహ్వానం అందలేదనడమేమిటన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉన్నట్లు కనిపించడం లేదు. బొట్టు పెట్టి పిలవడానికి ఆ రెండు కార్యక్రమాలూ ఎవరింట్లోనో జరిగిన పెళ్లిళ్లూ, పేరంటాలూ కావు. పార్టీ కార్యక్రమాలు. పార్టీ కార్యక్రమానికి పార్టీ ఎంపీకి ఆహ్వానం ఏమిటి? స్వచ్ఛందంగా వెళ్లి చురుకుగా ఆ కార్యక్రమంలో నిమగ్నం కావాలి. అలా కాకుండా తనకు పార్టీతో ఏం సంబంధం లేదన్నట్లు దూరంగా ఉండి ఆహ్వానం అందలేదంటూ రాగాలు తీయడం ద్వారా ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో చెప్పకనే చెప్పినట్లైంది. గత కొంత కాలంగా అంటే తమ్ముడు చిన్ని పార్టీలో చురుకుగా పాల్గొనడం మొదలెట్టినప్పటి నుంచీ కేశినేని నాని తీరులో తేడా వచ్చింది.  తమ్ముడా, తానా తేల్చుకోవాల్సింది పార్టీయే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక వైసీపీ వత్తాసు ఉందన్న అనుమానాన్ని తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.   ఏది ఏమైనా నాని తీరు వల్ల ఆయన తనంత తానుగా తెలుగుదేశం పార్టీకి దూరం కావాలనే నిర్ణయించుకున్నారన్నది విస్పష్టంగా తేలిపోతోంది. గుర్రాన్ని ఎవరైనా చెరువు వరకూ తీసుకు వెళ్లగలరు కానీ, నీళ్లు తాగించలేరుగా. నాని పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారైంది. పార్టీలో ఉండటం, ఉండకపోవడం ఆయన ఇష్టం. పార్టీ మాత్రం పని చేసే వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాట కేశినేని నానికి కూడా వర్తిస్తుంది.  

ఓ వైపు బిగింపు..మరో వైపు సడలింపు.. అవినాష్ విషయంలో సీబీఐ విచిత్రాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తొలిసారిగా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఆయన ను ఎ8 గా చేర్చింది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై గురువారం (జూన్8) సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా, ఎ8గా పేర్కొంది. అదే సమయంలో అవినాస్ విషయంలో మరో బ్రహ్మాండమైన ట్విస్ట్ వెలుగులోనికి వచ్చింది.  సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, బెయిలుపై విడుదల చేయడం అన్నీ జరిగిపోయాయని బయటకు వచ్చింది.   అయితే ఈ విషయాన్ని అటు అవినాష్ రెడ్డి.. ఇటు సీబీఐ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు.  తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు ముందస్తు బెయిలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెయిలు సందర్భంగానే కోర్టు సీబీఐ  అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలన్న షరతు విధించిన సంగతి విదితమే.   ఆ ప్రకారమే కోర్టు ఆదేశాల మేరకు  విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచికత్తు తీసుకుని విడుదల  చేసింది. ఇదేంటి కోర్టుకు ఇవ్వాల్సిన పూచీకత్తును అవినాష్ సీబీఐకి ఇవ్వడమేంటి? సీబీఐ వాటిని అంగీకరించి విడుదల చేయడమేమిటి? అన్న అనుమానాలు వస్తే అది అమాయకత్వమే. ఎందుకంటే సీబీఐ అవినాష్ విషయంలో గతంలో ఎన్నడూ ఎవరి విషయంలోనూ చూపనంత ఉదారత చూపుతోంది. ఒక వైపు కోర్టుల్లో అవినాష్ వివేకా హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంటూనే.. అరెస్టు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంలేదు.  అవినాష్ అరెస్టు బెయిలుపై విడుదల వ్యవహారం ఎంత రహస్యంగా ఉంచారంటే.. ఈ కేసులో సీబీఐ కంటే చురుకుగా, చొరవగా తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. కేసు ఇంత వరకూ రావడానికి కారణమైన వివేకా కుమార్తె సునీతకు కూడా తెలియలేదు. అందుకే ఆమె అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ శుక్రవారం (జూన్ 9) సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పుడు అవినాష్ ను సీబీఐ అల్ రెడీ అరెస్టు చేసి బెయిపుపై విడుదల చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిలుపై కాకుండా బెయిలును రద్దు చేయాలన్న అంశంపై విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు అవినాష్ ను ఉపయోగం లేని అరెస్టు చేసి బెయిలిచ్చి విడుదల చేసిన సీబీఐ, ఇదే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టులో గట్టిగా వ్యతిరేకించింది.  ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అవినాష్ రెడ్డిని ఎ8గా పేర్కొంది. మరో సారి ఏపీ సీఎం జగన్ పేరునూ ప్రస్తావించింది. తొలి సారిగా అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.   హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో తండ్రీ కొడుకులు భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డీ చాలా కీలకంగా వ్యవహరించారని, కేసు వద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం అవసరంల ేదనీ సీఐ శంకరయ్యకు అవినాష్ గట్టిగా చెప్పారని సీబీఐ ఆ అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐకి ఏం చెప్పొదని దస్తగిరిని బెదరించడంలోనూ, ప్రలోభపెట్టడంలోనూ అవినాష్ పాత్రే కీలకమని స్పష్టం చేసింది.  వివేకా హత్య కేసులో భారీ కుట్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ భాస్కర్ రెడ్డికి బెయిలు ఇవ్వొద్దంటూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది.  భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై సీబీఐ కోర్టు శుక్రవారం (జూన్ 9) తీర్పు వెలువరించనుంది. 

బీఎస్ఎన్ఎల్ నెత్తిన భస్మాసుర హస్తం

ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు. అది కూడా అత్యంత ఖరీదైన వస్తువుగా తెలుసు. అప్పట్లో వీధికి ఒక్క ఫఓన్ మాత్రమే ఉండేది.  గ్రామాలలో పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఇలాంటి సమాచార వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఫోన్ల స్థానంలో మొబైల్ ఫోన్లను తెచ్చాయి. ఇప్పడు ప్రతి ఇంట్లో కనీసం అరడజను ఫోన్లు. టెలికాం విప్లవం మొబైల్ ఫోన్లతో ఆగిపోలేదు.  జనరేషన్ల పేరుతో తన సేవలను పెంచుకుంటూ ఇప్పుడు 5జీగా కొనసాగుతోంది. అలాంటి సమాచార విప్లవంలో భారత ప్రభుత్వం కూడా తన స్వంత సంస్థగా కోటి రూపాయల మూలధనంతో భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ప్రారంభించింది.  ప్రయివేటీకరణలో భాగంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తూ వచ్చిన భారత ప్రభుత్వం క్రమంగా బీఎస్ఎన్ఎల్ ను పక్కన పెట్టేసింది. భారత దేశంలో డిఫఎన్స్, రైల్వేస్ తరువాత అ త్యధిక మంది ఉద్యోగులను, ఆస్తులను కలిగిన బీఎస్ఎన్ఎల్ దివాళా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. చివరికి బీఎస్ఎన్ ఎల్ అభివృద్ధి 3జి దగ్గరే ఆగిపోయింది.  మిగిలిన కార్పొరేట్ టెలికాం సంస్థలు లాభాల బాటలో నడుస్తుంటే భారత ప్రభుత్వంలోని బీఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలో చిక్కుకుంది.  తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ కు 89వేల కోట్ల రూపాయల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది.  దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి.  ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 89 వేల కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీలో పలు కీలక అంశాలపై దేశంలో చర్చ సాగుతోంది.  బీఎస్ఎన్ఎల్ ను పలు రకాలుగా నష్టాలలోకి నెట్టి అప్పడప్పుడూ ప్యాజేపీలు ప్రకటించడాన్ని టెలికాం రంగ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒకటిన్నర శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత టెలికాం రంగానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం మితిమీరిన కార్పొరేట్ పలుకుబడే కారణమని విమర్శలు వస్తున్నాయి.  స్పెక్ట్రం లకు బీఎస్ఎన్ఎల్ ను దూరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడుు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం, వాటిని దొడ్డి దారిన కార్పొరేట్ల చేతుల్లోకి పంపడానికే అని విమర్శలు ఉన్నాయి.  దేశంలో  సుమారు 36శాతం మంది గ్రామీణ ప్రజలు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ బ్రాడ్ బాండ్ లలో అధిక లాభాలు రావు కాబట్టి కార్పొరేట్లు ఆ వైపు చూడటం లేదు.  అయినా బీఎస్ఎన్ఎల్ ఇంత వరకూ 4జి సేవలను పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది.  లాభాలు తెచ్చే సేవలో పోటీ పడే కార్పొరేట్లు దేశంలోేని పేదల కోస నెట్ వర్క్ లు నడపడం లేదు.  సేవల ఏర్పాట్లపై టీసీఎల్ కు 15వేల కోట్లు చెల్లిస్తున్న బీఎస్ఎన్ఎల్, టాటాలను పెంచి పోషిస్తోంది. 4జి సేవల కోసం అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతికను కొర్పొరేట్లు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటే, చైనాపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇక్కడి పారిశ్రామిక వేత్తల నుండే టెక్నాలజీని కొనాల్సి వస్తోంది.  దీంతో సేవలు అంతరాయానికి గురవుతున్నాయి. టెక్నాలజీ కొనుగోళ్ల పేరుతో దేశంలోని కార్పొరేట్లు ఆ డబ్బును కూడా దిగమింగుతున్నారు. దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికీ బీఎన్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 89వేల కోట్ల ప్యాకేజీ అటూ, ఇటూగా తిరిగి దేశీయ కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లబోతోంది అన్నది అక్షర సత్యం.

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వానా!

వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం లోగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఈ ఏడాది రుతుపవనాల రాక  ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వ్యవసాయం మీద ఉంటుందని రైతులు అంటున్నారు. ఇక ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రానున్న రెండు రోజులలో అవి కర్నాటక, తమిళనాడులకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే అంటే మరో మూడు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   అయితే అంత వరకూ తెలుగు రాష్ట్రాలలో  ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.   నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అయితే దక్షిణ చత్తీస్ గఢ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందనీ, ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.  

నాలుగేళ్లూ గాలికి.. ఇకనైనా పని..జగన్ వేడుకోలు

వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్ నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమయ్యారా? అంటే ఆ పార్టీ శ్రేణులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ప్రజావ్యతిరేకత వెనుక పార్టీ అధినాయకుడు క్యాడర్ విశ్వాసం కోల్పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.   అవును ఆ పార్టీకే చెందిన కార్యకర్తలు, నాయకులు.  నిజానికి, ఈరోజున అధికార పార్టీలో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య దూరం అంతో ఇంతో కాదు, అంచనాలకు అందనంతగాపెరిగింది. ఇందుకు కారణం పార్టీ అధినేత కార్యకర్తలకే కాదు   ముఖ్యసలహాదారు సజ్జలకు తప్ప   మంత్రులకు కూడా కనిపించరని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  అటువంటి ముఖ్యమంత్రి రాజకీయాలంటే మానవ సంబంధాలు అంటూ చాలా గంభీర ప్రకటన చేయడం పార్టీలో ఆయన పట్ల సన్నగిల్లిన నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో భాగమే అంటున్నారు.  ఎమ్మెల్యేలను టిక్కెట్టివ్వను జాగ్రత్త అంటే బెదరించకుండా, మంత్రులను  మీ పనితీరు మెరుగు పరచుకుంటారా ..  పీకేయ మంటారా ? హెచ్చరించకుండా..  నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోను అంటూ  బుజ్జగింపులకు దిగడానికి కారణమదే అంటున్నారు. అయితే  ఎంతగా స్వరం మార్చినా పార్టీ క్యాడర్ ఆయనను విశ్వసించే పరిస్ధితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ముఖ్యంగా ఏప్రిల్ 7 న ప్రారంభమైన,  ‘మా నమ్మకం నువ్వే జగనన్నా’ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వంపై వైస్పీ కార్యకర్తలు, స్థానిక నాయకుల్లో భగ్గుమంటున్న అసమ్మతిని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధాన్నీ బహిర్గతం చేసిందంటున్నారు.  నిజానికి మా నమ్మకం న ువ్వే జగనన్నాకు ముందు ఏడాది కాలంగా సాగుతున్న  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు జనం నాడి అర్థమైంది. అందుకే, గడప గడపకు కార్యక్రమంపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఫలితం లేక పోయింది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా  దింపుడు కళ్ళెం ఆశతో చేపట్టిన  మా నమ్మకం నువ్వే జగనన్నా  కార్యక్రమంలోనూ  వైసీపే నాయకులకు జనం నుంచి అవమానాలే ఎదురయ్యాయి.  దీనిని బట్టి చూస్తే వాస్తవానికి ఫెయిలైంది వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి నాయకత్వం. చాలా చాలా ఆలస్యంగానైనా జగన్ ఈ విషయాన్ని గుర్తించారనడానికి బుధవారం (జూన్ 7) జరిగిన కేబినెట్ భేటీలో జగన్ మాటలే నిదర్శనమని  అంటున్నారు పరిశీలకులు.  తొమ్మది నెలలు కష్టపడండి అధికారం మనదే అనడం వెనుక ఈ నాలుగేళ్ల వైఫల్యాలనూ మంత్రుల ముందు జగన్ అంగీకరించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విజయమ్మ.. జగన్.. మధ్యలో సజ్జల!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ  బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కుమారుడి ఇంటి వైపు కనీసం కన్నెత్తి చూడకుండా విజయమ్మ సజ్జల నివాసానికి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అ యితే వైయస్ విజయమ్మ  సజ్జల నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. అయితే  సాక్షాత్తూ ముఖ్యమంత్రి తల్లి అయిన విజయమ్మ స్వయంగా కుమారుడి కింద పని చేసే ఉద్యోగి లాంటి సజ్జల నివాసానికి వెళ్లడం తల్లీ కుమారుల మధ్య విభేదాలున్నాయనీ, కనీసం రాకపోకలు కూడా లేవని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది. అయినా వాస్తవానికి విజయమ్మ స్థాయికి ఆమె కాకితో కబురంపితే రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిన స్థాయి సజ్జలది. అయితే  విజయమ్మే స్వయంగా సజ్జల నివాసానికి వెళ్లడమేమిటన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి,  ప్రస్తుత సీఎం  జగన్‌ తల్లి, అధికార వైపీసీ మాజీ  గౌరవ అధ్యక్షురాలు అయిన  ఆమె.. సజ్జల ఇంటికి వెళ్లడం.. ఆ సమయంలో సజ్జల లేకపోవడం.. మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయమ్మని అవమానపరచడమేనని వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ముందస్తుగా సజ్జలకు సమాచారం ఇచ్చే.. హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారని.. అలాంటి ఆమెను.. ఇలా అగౌరవపరచడం సజ్జల అహంకారం తప్ప మరోటి కాదని అంటున్నారు.  అయినా మహానేత భార్య  వైయస్ విజయమ్మ.. ఎందుకు సజ్జల ఇంటికి వెళ్లారనే అంశంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.   అయితే అమరావతి వరకూ.. అదీ సజ్జల ఇంటి వరకు వెళ్లిన ఆమె... ఆ పక్కనే తాడేపల్లిలో ఉన్న తన కుమారుడు, సీఎం జగన్ ఇంటికి వెళ్లక పోవడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  జగన్ అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు తల్లిగా విజయమ్మ, చెల్లిగా  షర్మిల.. ఎంతగా కష్టపడాలలో అంతగా కష్టపడ్డారని.. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ వీరిద్దరినీ జగన్ దూరం పెట్టారని కూడా ఈ  సందర్భంగా  పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీలో వరుసగా చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు.  మరోవైపు వైయస్ జగన్ సొంత చిన్నాన్న  వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురై.. నాలుగేళ్ల దాటిపోయిందని... ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాత్రం ప్రధాన నిందితులంటూ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం..  అవినాష్ రెడ్డి అయితే కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందడం.. తదితర అంశాలను ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోవైపు తన తండ్రి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ  వివేకా కుమార్తె వైయస్ సునీత  వైయస్ అవినాష్ రెడ్డి పొందిన ముందస్తు బెయిల్  ను సవాల్ చేస్తూ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితులలో జగన్ తల్లి విజయమ్మ కుమారుడిని కనీసం పలకరించకుండా.. ఆ పక్కను ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు నివాసానికి వెళ్లడం వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అదీకాక వైయస్ జగన్, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారం   చేస్తున్నారనే ఓ చర్చ  వైసీపీ వర్గాల్లో  హల్ చల్ చేస్తోంది.  దీంతో విజయమ్మ.. సజ్జలతో ఏ అంశాలపై చర్చించేందుకు  ఆయన నివాసానికి వైయస్ విజయమ్మ వెళ్లి ఉంటారన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

ఖమ్మం సభకు ప్రియాంక!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఇచ్చినా.. కొట్లాడి తెచ్చింది మాత్రం నేనేనంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. అలా ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన క్రెడిట్ కొట్టేసి.. వరుస ఎన్నికల్లో  విజయం సాధించి అధికారంలో  కొనసాగుతున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో  కేసీఆర్ రాజకీయానికి సంపూర్ణంగా చెక్ పెట్టేందుకు ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీలోని హస్తం పార్టీ నేతల వరకు అంతా ప్రణాళికబద్దంగా పావులు కదుపుతున్నారు.  ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన  ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. అదీకాక ఇదే ఉమ్మడి జిల్లాలోని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు వస్తారని అంటున్నారు. రాహుల్ వచ్చినా రాకున్నా  ప్రియాంకా గాంధీ మాత్రం పక్కాగా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.  ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టారు. అదే విధంగా ఈ ఏడాది చివరిలో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోభాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ఈ నెల 12వ తేదీన ఆమె ప్రచార ఘట్టానికి శ్రీకారం చుట్టున్నారని... ఆ క్రమంలో ఖమ్మం వేదికగా జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇదే వేదికపైన .. అదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొల్హాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు   హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.  ఇంకోవైపు జూన్ 11 లేదా 12వ తేదీన ఢిల్లీలోని హస్తం పార్టీ అధిష్టానంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు భేటీ అయి.. రాష్ట్రంలో పార్టీ  విజయం కోసం అమలు చేయాల్సిన అంశాలు.. అలాగే ప్రజల్లోకి ఏ ఏ అంశాలు బలంగా తీసుకు వెళ్లాలి తదితర అంశాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  తెలంగాణలో   ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ప్రియాంక గాంధీ సైతం.. తెలంగాణలో పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందనే చర్చ సైతం జరుగుతోంది. ఇక తెలంగాణలో పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని.. అందుకు ఆయన చేపడుతోన్న సభలు, బహిరంగసభకు భారీగా ప్రజలు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. అయితే రానున్న తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారనున్నాయనేది సుస్పష్టమని తెలంగాణలోని పోటిలికల్ సర్కిల్‌లో చర్చ అయితే ఇప్పటికే ఊపందుకొంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి దక్షిణాదిలో.. అదీ తెలంగాణలో పాగా వేసి... తమ సత్తా చాటుకోవాలని బీజేపీలోని కాషాయం పార్టీ నేతలు... తమ వ్యూహాలకు పదును పెడుతూ.. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు.  అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రాలో పార్టీ పరిస్థితి పాతాళంలోకి పడిపోతోందని తెలిసినా.. తెలంగాణలో మాత్రం అధికారం నిలుపుకుంటామని.. హస్తం పార్టీ అధిష్టానం కలలు కన్నది. కానీ ఆ కలలను... నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కల్లలు చేశారు. దీంతో తమ పార్టీ అధిష్టానం కన్న కలను సాకారం చేసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని అయితే హస్తం పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం సత్తా చాటిన తెలుగుదేశం.. 2019 ఎన్నికల్లో మాత్రం అంతగా సత్తా చాట లేకపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌ పార్టీగా అవతరించిన తర్వాత.. తెలంగాణలో టీడీపీ సైతం సూపర్ స్పీడ్‌తో సైకిల్ సవారీ చేస్తుంది. ఆ క్రమంలో 2022 డిసెంబర్‌లో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావ సూపర్ సక్సెస్ అయింది.  ఆ తర్వాత అంటే  2023, జనవరిలో కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సైతం ఖమ్మంలో భారీ సభ చేపట్టి గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం వేదికగా సభ నిర్వహించి.. సత్తా చాటనుంది. మరి అలాంటి వేళ.. కాషాయం పార్టీ నేతలు సైతం....ఖమ్మం వేదికగా.. సభ నిర్వహించినా నిర్వహించవచ్చుననే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్ చల్ చేస్తోంది.    అన్ని పార్టీలు ఇలా ఖమ్మం వేదికగా.. బహిరంగ సభలు నిర్వహించినా.. ఓటర్లు మాత్రం ఒకే ఒక్క పార్టీకే మేజార్టీ స్థానాలు కట్టబెతారనేది సుస్పష్టం. అలాంటి వేళ.. అదీ ఏ పార్టీ అంటే మాత్రం.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే వరకు వేచి చూడాల్సిందేనన్నది సుస్పష్టం.