వాయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక పోటీ?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ కు ఈ ఏడాది చివరిలో ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం తదితర జిల్లాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనర్హత వేటు కారణంగా ఆ ఉప ఎన్నికలో రాహుల్ గాంధీ పోటీకి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే   ప్రియాంకా వాద్రా  పేరు తెరమీదకు వచ్చింది. అయితే గతంలో  ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంఐ షనవాస్ కే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తారన్న చర్చ కూడా జరగుతోంది.  అసలు వాయనాడ్ ఉప ఎన్నిక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతుందని అంతా భావించినా,  ఎన్నికల కమిషన్  ఆ ఎన్నికలతో పాటు వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక కు నోటిఫికేషన్ ఇవ్వలేదు.  ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను మాత్రమే క్లియర్ చేశామని అప్పట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  అప్పట్లో  తెలిపారు. వాయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై  అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

వారాహిని అడ్డుకోవడానికేనా?

ఏపీలో జగన్ సర్కార్ విపక్షాల గొంతు నొక్కడమే పాలన అనుకుంటోందా? విపక్షాల గొంతు వినబడకుండా చేస్తేనే తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సమసిపోతుందని భావిస్తోందా?  రాష్ట్రంలో  ఆల్ ఈజ్ వెల్ అని జనం అనుకోవాలంటే.. విపక్షాలను అణచివేస్తే సరిపోతోందని భావిస్తోందా? అంటే ఆ పార్టీ వర్గాల నుంచి మాత్రమే ఔనన్న సమాధానం వస్తోంది. అయితే విమర్శకులు మాత్రం విపక్ష నేతలెవరైనా జనంలోకి వెళుతున్నారంటేనే  అధికార వైసీపీ వణికిపోతోందనీ, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి  రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పోలీసులను ప్రయోగిస్తోందనీ అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలను అడ్డుకోవడానికీ, అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు అవరోధాలు, ఆటంకాలు కల్పించడానికి జీవో నంబర్ 1 ను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అవరోధాలు కల్పించేందుకు ఉపక్రమించింది. ఇంకా యాత్ర ప్రారంభం కాకముందే.. దానికి అడ్డంకులు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెలలో ఆయన యాత్ర జరగనుంది. ఆ యాత్రకు ముందే కోనసీమ జిల్లాలో  పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చేసింది. ప్రభుత్వ తీరు పరిశీలకులు, రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ, చివరాఖరికి వైసీపీ శ్రేణుల్లోనూ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  కానీ గత నాలుగేళ్లుగా వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే విపక్షాలు బయటకు రాకుండా చేయడం కోసం ఎంతకైనా తెగించేందుకు జగన్ సర్కార్ ఇసుమంతైనా వెనుకాడదని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.   గతంలో  కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రతిపాదన సందర్భంగా అమలాపురంలో జరిగిన అల్లర్లను నెపంగా చూపి ఏకంగా ఆరు నెలల పాటు పోలీసు యాక్ట్ ను అమలు చేశారు. ఆ పోలీస్ యాక్ట్ ను ఎత్తివేసి రెండు నెలలైందో లేదో..ఇప్పుడు మళ్లీ జనసేనాని వారాహి యాత్ర నెపంతో మళ్లీ అమలులోకి తీసుకువచ్చారు. గతంలో పోలీసు యాక్ట్ అమలు చేయడానికి అల్లర్లు సాకుగా చూపారు. ఇప్పుడు యాక్ట్ ను మళ్లీ విధించేందుకు వారాహి యాత్ర సందర్భంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లి అల్లర్లు జరుగుతాయోమేనన్న అనుమానాన్ని నెపంగా చూపుతున్నారు.   పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులపై నిషేధం ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతారు. నెల 14 నుంచి   ప్రారంభమయ్యే  పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ ల ప‌రిధిని దాటి చించినాడ బ్రిడ్జి ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుతుంది. ఏపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ తెరమీదకు తీసుకువచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నంలో  భాగంగానే పోలీస్ యాక్ట్ తీసుకువచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధాజ్ణలు ఉన్నా వారాహి యాత్ర కొనసాగుతుందని జనసేన వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో  కోనసీమ జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఏపీలో బీఆర్ఎస్ అసలు ఉందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏపీలో అసలు ఉందా? ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఘనంగా  ఏర్పాటు చేసిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ  ఘనంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ప్రారంభించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. ఇక ఆ పార్టీలో చేరికలకు ఏపీకి హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ నాయకులను రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు. ఇంకే ముందు ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. దీంతో బీఆర్ఎస్ ఏపీలో ప్రవేశం వల్ల ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న విశ్లేషణలూ అప్పట్లో వెల్లువెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ జనసేనాని చేసిన ప్రకటన నేపథ్యంలో బీఆర్ఎస్ పాత్ర ఏపీలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు దోహదపడుతుందంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఇంతా చేసి ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది నాయకులు మాత్రమే. వారిలో ఇప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నది ఎవరా అని గాలిస్తే కనిపించేది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే. ఆయన కూడా ఏపీని వదిలేసి తెలంగాణలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఆయన వ్యాపారాలూ, భూములూ అక్కడే ఉన్నాయి మరి.  ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని ప్రచారం జరిగినా  ఆయన అటువైపు కన్నెత్తి చూడలేదు.  కనీసం తెలంగాణలో బీఆర్ఎస్ లో ప్రముఖంగా ఉండేవారెవవరూ కూడా ఏపీవైపు చూడలేదు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రి, ఏపీకి చెందిన ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. తొలుత సొంత భవనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తామని ఘనంగా చెప్పుకున్నా చివరకు అద్దెభవనంలో తూతూ మంత్రంగా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ముగించేసి మమ అనిపించేశారు తోట చంద్రశేఖర్.  ఇక పేరుకు ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఉన్నా ఇంత కాలంగా ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. సాటి తెలుగు రాష్ట్రంలోనే అడుగుపెట్టడానికి జంకుతున్న బీఆర్ఎస్ ఇక జాతీయ స్థాయిలో ఏం ఒరగబెడుతుందన్న విమర్శలు వినవస్తున్నాయి. మహారాష్ట్రలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రకటించుకున్నప్పటికీ అక్కడా ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొత్తంమీద బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ కానీ ఉనికి మాత్రం తెలంగాణకే పరిమితమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మంత్రి రోజాకు ఏమైంది?

మంత్రి ఆర్కే రోజాకు ఏమైందన్నఆందోళన రాజకీయవర్గాల్లోనే కాకుండా సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. కారణం ఏమిటన్నది తెలియదు కానీ ఆమె ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరారు అన్న విషయం తెలియరాలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా ఆమె ఆరోగ్యం గురించి  ఎటువంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. అయితే పార్టీ వర్గాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆమె ఆరోగ్యం బాలేదనీ, ఇప్పటికే  గతంలో ఆమెకు రెండు సార్లు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు సార్లూ కూడా ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నారు. గతంలో ఆపరేషన్ తరువాత ఆమె ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమెకు ఆపరేషన్ జరిగిన సమయంలో ఆమె మంత్రి కారు. ఎమ్మెల్యే మాత్రమే. అప్పట్లో  జబర్ద్ షోకు జడ్జిగా వ్యవహరించేవారు. ఆపరేషన్ కారణంగా అప్పట్లో ఆమె జబర్దస్త్ షోకు చాలా కాలం దూరంగా ఉన్నారు.  ప్రస్తుతం   రోజాకు  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు   ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందనీ, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అంటున్నాయి.  

తెలంగాణలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

కర్నాటకలో కాంగ్రెస్ విజయం.. ఇప్పుడు అన్ని పార్టీలకూ ఒక దారి చూపింది. ముఖ్యంగా ఆ పార్టీ ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత హామీ పథకం ఎన్నికల విజయానికి ఒక రూట్ మ్యాప్ అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణలో ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడు అదే దారిలో ప్రయాణించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం  అన్న హామీయేనని పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలతో అన్ని పార్టీలూ ఆ హామీపై కసరత్తు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీ ఇవ్వడమే కాదు.. దాని అమలు కూడా ప్రారంభించేసింది. ఇందుకు ఏడాదికి ఆ రాష్ట్రప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని నాలుగు కోట్ల రూపాయలుగా అంచనా కూడా వేసింది. ఇక  రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు వేదికగా  ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీమహానాడులో కూడా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ ఉంది.  ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఎలాగూ ఆ హామీనే ప్రధానంగా తన ఎన్నికల హామీగా ప్రకటించి తీరుతుంది. అందులో సందేహం లేదు. ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా  ఆ దిశగానే యోచిస్తోంది. అయితే ఎన్నికల హామీగా ప్రకటించడం కాకుండా.. ఇప్పుడే అంటే అధికారంలో ఉండగానే.. ఎన్నికలకు ముందుగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని యోచించడమే కాదు.. అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించేసిందని అంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత తదితర అంశాలపై కేసీఆర్ ఇప్పటికే అధికారులను నివేదిక కోరారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉచిత ప్రయాణం పథకాన్ని ముందుగా పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నాయి.ఏది ఏమైనా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణలో రానున్న ఒకటి రెండు నెలలలోనే ప్రారంభయమ్యే అవకాశం ఉందని అంటున్నారు.  

ఏపీపై బీజేపీ మాట మారింది సరే.. మరి తీరు?

మాట మామిడల్లం.. మనసు పటికబెల్లం.. జగన్ ప్రభుత్వం విషయంలో బీజేపీ తీరు సరిగ్గా ఇలాగే ఉంది. జగన్ పాలన అంతా అవినీతి, కుంభకోణాల మయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించే బీజేపీ అగ్రనేతలు.. చేతల్లో మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ , కుంభకోణాల, అవినీతి జగన్ పాలనకు వత్తాసు పలికింది. ఈ మాటలు వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షాలు జగన్ పాలనపై చేసిన విమర్శలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇష్టారీతిన అప్పులకు అనుమతులు ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారే. ఆ అప్పుల చలవతోనే జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అరకొరగానైనా కొనసాగించగలిగింది. ఇప్పుడు అదే బీజేపీ అగ్రనేతలు జగన్ సర్కార్ పై విమర్శల దాడి చేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలే చేసిందని విమర్శలు గుప్పించారు. విశాఖను అసాంఘిక శక్తులకు అడ్డాగా చేశారని దుయ్యబట్టారు. రైతులకు మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.  మైనింగ్, గంజాయి , మద్యం మాఫియాలకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. నాలుగేళ్లో కేంద్రం… ఏపీకి రూ. ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని.. ఆ డబ్బులకు తగ్గట్లుగా ఏపీలో అభివృద్ధి అభివృద్ధి కనిపించలేదని అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆ నిధులకు లెక్కలు చెప్పాలని నిలదీశారు.  కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తన పేరు .. బొమ్మలు పెట్టుకుంటున్నారని.. చివరికి ఉచితంగా ఇచ్చిన బియ్యానికి కూడా జగన్ తన ఫోటో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.   తొమ్మిదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభలే అయినప్పటికీ నడ్డా, అమిత్ షాలు ఇద్దరూ కూడా  ఆ విషయం కంటే ఏపీలో వైఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, కుంభకోణాలపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు.  ఆయా సభల్లో  మాట్లాడిన ఇతర బీజేపీ నేతలు కూడా జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం విశాఖ వేదికగా అమిత్ షా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలను పట్టించుకోవడం లేదు. వాటిని అసలు గమనించనట్లుగా గుంభనంగా ఉన్నారు. అయితే తిరుపతి వేదికగా నడ్డా చేసిన విమర్శలపై బూతులతో విరుచుకుపడ్డారు.   అసలు ఇప్పుడు మనం చెప్పుకోవలసింది బీజేపీ అగ్రనేతలపై జగన్ మంత్రులు, ఎమ్మెల్యేల స్పందన గురించి కాదు.. బీజేపీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని.  ఏపీలో నడ్డా, అమిత్ షాల సభల ఉద్దేశం నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను ప్రజలకు వివరించడానికి .. అయితే వారిరువురూ కూడా  జగన్ సర్కార్ పై విమర్శలకే అధిక సమయం కేటాయించారు.   ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక తమ ఆబోరు కాపాడుకోవాలంటే.. తమ స్టాండ్ ఏమిటో తెలియచేయాలనుకున్నారు. వైసీపీ  ప్రభుత్వంపై విమర్శల తీవ్రత పెంచారు. మొదటి   నడ్డా  ఘాటు విమర్శలు చేస్తే.. ఒక రోజు వ్యవధిలో ఏపీకి వచ్చిన అమిత్ షా దాదాపు వాటినే  మళ్లీ చెప్పారు. ఇదంతా వైసీపీ విషయంలో తాము క్లియర్ గానే ఉన్నామనీ, వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నామనీ ఏపీ ప్రజలకు చెప్పడానికే అన్నట్లుగా ఉంది. వారి ఈ వైఖరే.. ఇటీవల చంద్రబాబును హస్తిన పిలిపించుకుని మరీ చర్చించిన అంశాలేమిటన్నది చెప్పకనే చెప్పినట్లైంది.  అయితే నాలుగేళ్ల పాటు ఏపీలో జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలకు వంత పాడి.. లేకపోతే చూసీ చూడనట్లు వదిలేసి.. ఆ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచి ఇప్పడు ఎన్నికలు దగ్గరపడేసరికి మాట మార్చి.. విమర్శలు ఎక్కుపెడితే ఏపీ జనం నమ్ముతారా?  మాటలు ఓకే…. మరి చేతల మాటేమిటని నిలదీయరా? అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికైనా జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ సహకారం ఆగుతుందా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి.  జగన్ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ  అప్పులో.. నిధులో విడుదల చేసి ఆదుకున్న మోడీ సర్కార్.. ఇప్పుడు ఆ నిధులకు లెక్కలు చెప్పమని అడగి.. మేం జగన్ సర్కార్ ను కడిగేశాం అని చెప్పుకుంటే సరిపోతుందా అని అంటున్నారు.    ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఘాటు విమర్శలు చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదని, ఆ వ్యతిరేకతను చేతల్లోనూ, చర్యల్లోనూ చూపితేనే ఏపీ జనం విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బాబు ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వని సర్కార్

ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణం అనుమతి కోసం పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొంటే.. వారం.. పది రోజులు.. మహా అయితే నెల రోజులు పడుతోంది. అంతేకానీ.. అనుమతులు మంజూరు చేయడానికి నెలలకు నెలలు అయితే పట్టదు కదా. కానీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా.. అధికారుల నుంచి నేటికి  స్పందన లేకపోవడం గమనార్హం.  చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. సదరు నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకొన్నారు. ఆయన దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు గడిచినా.. నేటికి మున్సిపల్ అధికారులు అనుమతులు మంజూరు చేయకపోవడంతో... అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయిన ఆయన.. న్యాయవాదుల ద్వారా సదరు అధికారులకు నోటీసులు పంపినట్లు సమాచారం.  కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని అనుకొని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం.. ఆయన భూమి పూజ సైతం నిర్వహించారు. ఎన్నికల లోపు.. ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు. కానీ ఇంటి నిర్మాణానికి  అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే తమ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణంపై అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై స్థానిక టీడీపీ శ్రేణులు మండిపడుతోన్నాయి.  ఈ జగన్ పాలనలో ఉమ్మడి రాష్ట్రానికే కాదు.. నవ్యంధ్రకు సైతం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటని సదరు పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరికైనా సమస్యలు ఉంటే.. ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ఉంటుందని.. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇస్తే.. సదరు సమస్య.. వెంటనే పరిష్కారమవుతోందంటూ.. ఈ ఫ్యాన్ పార్టీ సర్కార్ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతోందని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.  అదీకాక.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్.. తాడేపల్లిలో నివాసం నిర్మించుకొన్నారని.. వారు గుర్తు చేస్తున్నారు. నేడు జగన్ చేసినట్లు.. నాడు తమ పార్టీ అధినేత చంద్రబాబు చేసి ఉంటే.. తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణం సజావుగా సాగేదా అని పార్టీ శ్రేణులు సూటిగా అధికార పార్టీని నిలదీస్తున్నాయి.

సైకిలు జోరు.. కారు బేజారు!

అవును, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ, గత వైభవాన్ని కోల్పోయింది. అది నిజం. తెలుగుదేశం అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యంగా, తెలంగాణ సెంటిమెంట్ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కేసేఆర్ అదే సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని, రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట  ప్రత్యర్ధి పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను నిర్వీర్యం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను, తెలంగాణను ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని కూడా 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత అతికొద్ది కాలానికే, టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు.గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు. ఇక ఆ తర్వాత ఏంజరిగిందనేది చరిత్ర. 2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది. అలాగే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా సీనియర్ నాయకులు చాలామంది అధికార పార్టీలోకి దూకేశారు. మరి కొందరు బీజేపీలోకి జంపయ్యారు.  ఇది చరిత్ర..ఎవరూ కాదనలేని నిజం. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎదురు లేదు, తిరుగు లేదనుకున్న పార్టీ నాయకులు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం, లేకుంటే అహంకారం, అదీ కాదంటే అమాయకత్వం అనిపించుకుంటుంది. పడి లేచిన కెరటంలా, రాజకీయాల్లోనూ పనైపోయింది అనుకున్న పార్టీలు రెట్టింపు బలంతో అధికారంలోకి వచ్చిన సందర్భాలు చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలోనూ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రెండంటే రెండు లోక్ సభ స్థానాలున్న బీజేపీ ఈరోజు 303 స్థానాలకు చేరుకుంది.  సరే, అదలా ఉంచి  అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అదినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టడమే కాకుండా. ఆయనలో ఓటమి భయం పుట్టించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చు తెలంగాణ సెంటిమెంట్  అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను స్వహస్తాలతో తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు. నిజానికి కేసీఆర్  2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల  వ్యవధిలోనే, తెరాస ఇక ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు.ఆ దిశగానే ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఉద్యమ ఆనవాళ్ళను తుడిచేశారు. రాజకీయ పునరేకీకరణ అనే ముద్దు పేరుతొ  తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని ‘సగౌరవం’గా పార్టీ నుంచి సాగనంపారు. అదే  సమయంలో ఆ ముందు రోజు వరకు ఉద్యమ  ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా తామే నిందించిన తలసాని మొదలు సబితా ఇందర రెడ్డి వంటి వారిని  మంత్రిపదవులతో అందలం ఎక్కించారు. అలాగే, తెరాసను కుటుంబ పార్టీగా, తెలంగాణను కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.  అయితే తానొకటి తలిస్తే దేవుడి ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, కేసీఆర్  ఉద్దేశం ఏదైనా జాతీయ రాజకీయాలు అసలుకే మోసం తెచ్చాయి. ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇక  అక్కడి నుంచి బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా, ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాగే, మొదటి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మరింతగా పుంజుకుంది. .బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరిది పైచేయి అనేది అటూ ఇటూ ఉగుతున్నా, చివరకు రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అనివార్యంగా మారింది.  ఈ నేపద్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరేడు మాసాల క్రితం ఖమ్మం సభతో పూరించి శంఖారవం ఇప్పడు తెలంగాణ అన్ని జిల్లాలలో మారు మోగుతోంది. చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి పెట్టడంతో, బీఆర్ఎస్ లో  భయం పట్టుకుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు, కేసీఆర్ గుడ్నేల్లో రైళ్ళు పరిగెతిస్తున్నాయి. నిజానికి, టీడీపీ రేసులో నిలిస్తే, కాంగ్రెస్ బీజేపీలకంటే తెలుగు దేశం పార్టీనే  బీఆర్ఎస్ ను బలగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే సైకిల్ జోరు పెరుగుతుంటే కారు బేజారౌతోందని అంటున్నారు.  అందుకే కేసీఆర్, ఏపీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. 

యూటీ జాబితాలో విశాఖ.. జగన్ పుణ్యమేనా...?

తెలుగు రాష్ట్రాలలో అధికారం అందని ద్రాక్ష అని తేల్చేసుకున్న బీజేపీ ఆ రెండు రాష్ట్రాలనూ ఆర్థిక చక్రబంధంలో ఇరికించేసి గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటోందా అంటే ఔననే సమాధానమే వస్తుంది.  తెలుగు రాష్ట్రాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ రెవెన్యూ లేకుండా చేసి ఆర్థిక చక్కుల్లో పడేలా చేసి తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.  ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఆ గడువు తీరిపోగానే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం యోచిస్తున్నదన్న సమాచారంతో పాటు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెవెన్యూ వచ్చే విశాఖ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందని విశ్వసనీయ వర్గాల కథనం.  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా ఆ రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి కొట్టి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేలా చేసి ఆధిపత్యాన్ని చెలాయించాలన్నదే కేంద్రం వ్యూహంగా చెబుతున్నారు.  తొలుత  తెలంగాణ రాజధాని. దేశంలో  ఐదు అగ్ర నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.  ప్రస్తుతానికి అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని. 2024 జూన్ వరకూ హైదరాబాద్ హోదా అదే.  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీని కోసం గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్  అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 జూన్ వరకు ఇది వర్తిస్తుంది.  ఉభయ తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్న  నేపథ్యంలోనే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.     గతంలో అంటే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకించారు.   దరిమిలా   హైదరాబాద్ ను  పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలఉమ్మడి రాజధానిగా  ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతున్నాయి. ఆ తరువాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నా.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వినియోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఏపీ హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే.  అయితే  హైదరాబాద్ విషయంలో కేంద్రం ఆలోచన వేరుగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేయటం లక్ష్యంగా  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అన్న అంశం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.  ఇప్పటికే తెలంగాణకు అప్పుల విషయంలో అవరోధాలు సృష్టిస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మెలిక పెట్టే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.  హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలు లేవకుండా నిరోధించొచ్చని కేంద్రం భావిస్తోంది. ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు ఓకే అన్నారు. ఇప్పుడు కేంద్రం దానినే సాకుగా చూపి ఈ ప్రతిపాదనతో వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయంటున్నారు.   ఇక విశాఖ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ చాలా చాలా  చాలా చాలా ఏమిటి అన్నీ కోల్పోయింది. హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయింది. భద్రాచలం రామాలయాన్ని కోల్పోయింది. ఆదాయాన్ని కోల్పోయింది. ఉపాధి అవకాశాలను కోల్పోయింది. విద్యాసంస్థలను కోల్పోయింది. పరిశ్రమలను కోల్పోయింది ఒ ముఖ్యంగా రెవెన్యూ లోటుతో భవిష్యత్ ఎలాగా అన్న భయం, ఆందోళన మాత్రమే విభజన కారణంగా ఏపీకి దక్కింది. ఇన్నీ కోల్పోయినా ఆంధ్రులు మన విశాఖ ఉందిగా అనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన విశాఖ సుందర నగరమే కాదు, పర్యాటక, వాణిజ్య పరంగా ప్రత్యేకత సంతరించుకున్న నగరం కూడా. ఈ నగరం ఒక టూరిస్ట్ స్పాట్. ఉపాధి, విద్యావకాశాల హబ్. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశ, విదేశీ టూరిస్టులు కూడా వేల సంఖ్యలో సందర్శించే నగరం విశాఖ. సాగర తీరం, ఉద్యానవనాలు, కొండలు, నైట్ లైఫ్, ఫుడ్ డెస్టినేషన్స్ ఇలా ఇక్కడ పర్యాటకులకు అవసరమైనవన్నీ ఒకే చోట కుప్పపోసినట్లు ఉన్న నగరం. ఇక పారిశ్రామికంగా విశాఖ ఏపీకి బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెప్పాలి. అటువంటి విశాఖ నగరం గత మూడున్నరేళ్లుగా ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది. జగన్ హయాంలో  పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. కోర్టులు, పర్యావరణ వేత్తలు, ఎన్జీటీ వంటి ట్రైబ్యునళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా విశాఖ ఘనతను మసకబార్చే పనిలో ముందుకు సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో ఉన్న విశాఖ విభజన అనంతరం ఏపీకి మిగిలిన ఏకైక  ప్రధాన ఆదాయ వనరు.    విశాఖలో కేంద్ర సంస్థలు నేవీ, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. కేంద్ర ఉద్యోగులు ఎక్కువ మంది  రిటైర్మెంట్ తర్వాత కూడా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు మొగ్గు చూపుతారు.  అయితే ఇప్పుడా పరిస్థితి వేగంగా కనుమరుగైపోతోంది.  భూ కబ్జాలు, పారిశ్రామిక వేత్తలకు వేధింపులు.. ఇలా విశాఖ తన ప్రశాంతతను కోల్పోతోంది. విశాఖ రాజధాని అని వైసీపీ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచీ ఇక్కడ పొలిటికల్ రౌడీ యిజం పెరిగిపోయింది. సామాన్య జనమే కాదు.. పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడ నుంచి బిచాణా ఎత్తేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేస్తున్నా జగన్ సర్కార్ లో ఉలుకు, పలుకూ లేదు. విశాఖ జోన్ కు మంగళం పాడేసినా చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు.  జగన్ సర్కార్ అశక్తతని, నిష్క్రియా పరత్వాన్నీ ఆసరాగా తీసుకుని విశాఖను కూడా ఏపీకి దక్కకుండా చేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. నిన్న మొన్నటి దాకా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ వచ్చిన కేంద్రం , విశాఖను కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ మేరకు హస్తిన స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చి విశాఖను పరిశీలించి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏపీకి ఉన్న ఏకైక ప్రధాన వనరు విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కేంద్రం యోచనకు ఆ నగర ప్రాశస్థ్యాన్ని, ఘనతను, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరే కారణమని అంటున్నారు.  ఇప్పటికే జగన్ నిర్వాకం వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  రాజధాని  నగరానికి  ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో  ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి  అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విభజిత రాష్ట్రానికి హైదరాబాద్ స్థాయిలో ఆదాయ వనరుగా ఎదుగుతుందని అంతా భావించిన అమరావతి పురోగతి నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఏపీ హైకోర్టు విస్పష్ట తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ తీరు మారలేదు. కోర్టు తీర్పుతో అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు   ప్రకటించినా తమ విధానం మూడు రాజధానులే అంటూ వస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి అభివృద్దికి ముందుకు అడుగులు వేయలేదు. అలా బంగారు గనిలా మారుతుందనుకున్న అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి విశాఖ నగరాన్ని కూడా రాష్ట్రానికి దక్కకుండా చేస్తోంది. మొత్తం మీద విభజనకు ముందు ఏదోలా రాష్ట్రం సాధించుకుంటే చాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ యూటీగా అభ్యంతరం లేదని చెప్పడాన్ని సాకుగా చూపి హైదరాబాద్ ను, అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యాలతో జగన్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన విశాఖ ప్రాభవాన్ని, ప్రాశస్థ్యాన్నీ దిగజారుస్తుండగాన్ని నెపంగా చూపి విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఆసియా గేమ్స్ బహిష్కరిస్తాం: రెజ్లర్ల హెచ్చరిక

భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా   రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.  బ్రిజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయకుంటే త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోమని రెజ్లర్లు ప్రకటించారు.  ఇటీవల కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు జరిపిన రెజ్లర్లు కేంద్రం ముందు ఐదు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈ నెల 15వ తేదీలోపు ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనురాగ్ చెప్పారు. ఆ గడువు ఇంకా ముగియకుండానే రెజ్లర్లు షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. బ్రిజ్ భూషన్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని రెజ్లర్లు ఆరోపిస్తున్న సంగతి విదితమే. 

జూలు విదులుస్తన్న నెల్లూరు పెద్దా రెడ్లు

అనూహ్యం ఏమీ కాదు కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్క జారిగా వేడెక్కింది. రాష్ట్రం దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపో మాపో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అటువంటి వేళ.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడమే కాకుండా.. వేగాన్ని సైతం పుంజుకొన్నాయి.. జిల్లాలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.  తాజాగా హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే శనివారం ( జూన్ 10) వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు నియోజకవర్గ నేతలతోపాటు తన అనుచరులతో సైతం ఆనం సమావేశమై.. రాజకీయ భవిష్యత్, పార్టీ మార్పు తదితర అంశాలపై చర్చించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారని సమాచారం.  మరోవైపు ఆనం కుమార్తె కైవల్య రెడ్డి సైతం.. నారా లోకేశ్‌ను ఇటీవల కలిశారు. అలాగే 2022లో ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో కైవల్యరెడ్డి దంపతులు.. చంద్రబాబు, లోకేష్‌తో భేటీ అయిన విషయం విదితమే.  మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీద రవిచంద్రలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.  ఇక ఇదే జిల్లాకు చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్‌లో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ను కలిసి.. ఆయన పాదయాత్రకు మేకపాటి సంఘీభావం ప్రకటించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితులపై వారిరువురు చర్చించారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు సహకరించారంటూ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డితోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ముఖ్యమంత్రి   జగన్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.  కానీ ఒక రోజు తేడాతో కాస్తా అటు ఇటుగా అధికార జగన్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు .. అదీ నెల్లూరు జిల్లాకు చెందిన వారు.. తెలుగుదేశం నేతలతో  వేర్వేరుగా భేటీ  కావడం.. చర్చలు జరపడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పరిస్థితులను బట్టి చూస్తే లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన వెంటనే.. వీరంతా  తెలుగుదేశం గూటికి చేరుకుని ఆ పార్టీ విజయం కోసం కీలకంగా వ్యవహరించనున్నారనే ఓ చర్చ   నెల్లూరు జిల్లాలో నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.  

వివేకా పాపం.. తలా పిడికెడు

వైఎస్ రాజారెడ్డి కుమారుల్లో రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిలు కడప రాజకీయాల్లో చక్రం తిప్పారు. వైఎస్ వంశానికి శాశ్వత కీర్తిని సంపాదించగా, వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో పనులు చక్కబెడుతూ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ మరణంతో తిరిగి ఆ కుటుంబంలో ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. అప్పటికే ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పని చేసిన వివేకానందరెడ్డి తన నాయకత్వాన్ని నిలుపుకొని కుటుంబ పెద్దగా తనను తాను ప్రకటించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ తండ్రి స్థానం కోసం పావులు కదిపాడు. వివేకా, జగన్ ల మధ్య 2005 ప్రాంతం నుంచి జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోవాలి.  2004లో కపడ  లోక్ సభ స్థానం నుండి వివేకానందరెడ్డి విజయం సాధించారు. అప్పటికి ఏ పదవిలోనూ లేని జగన్ కు లోక్ సభ సభ్యుడు కావాలన్న కోరిక పుట్టింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా కడప ఎంపీ వివేకాపై ఒత్తిడి పెరిగింది.   జగన్ కు తండ్రి తోడవడంతో చేసేది లేక రాజీనామాకు సిద్ధపడిన వివేకానందరెడ్డి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు ఎదురు చూసినా సోనియా దర్శనం కాకపోవడంతో నిరాశగా తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరారు. మోతీలాల్ ఓరా ద్వారా సమాచారం తెలుసుకున్న సోనియా గాంధీ వైఎస్ వివేకాను ఏఐసీసీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.  విషయాన్ని సోనియాకు వివరించిన వివేకా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. వివేకా ప్రతిపాదన సోనియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వివేకాను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడాన్ని సోనియా తప్పుపట్టారు. వివేకాకు నచ్చజెప్పి ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించారు సోనియాగాంధీ. ఈ అంశాన్ని దగ్గరుండి చూసిన మరో కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఈ నిజాన్ని ఇటీవల ప్రపంచం ముందు ఉంచారు. అప్పటి నుంచి వివేకానందరెడ్డిని కష్టాలు పలకరిస్తూనే వచ్చాయి. 2009లో కడప లోక్ సభ స్థానాన్ని జగన్ కు వదిలేసి అనంతరం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ ప్రమాదవశాత్తు మరణించడంతో వివేకా కష్టాలు నూరింతలు పెరిగాయి. 2010లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో వదిన విజయలక్ష్మికి మద్దతు పలికారు. కాంగ్రెస్ తో జగన్ తెగతెంపులు చేసుకున్న తరువాత 2011లో మరోసారి ఉప ఎన్నిక వచ్చింది. ఈ సారి వివేకా కాంగ్రెస్ తరఫున వదిన విజయలక్ష్మికి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2014 తరువాత వివేకా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇది గతం. ప్రస్తుతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతి విషయం వివేకా హత్య  చుట్టూ తిరుగుతోంది. 2019లో విజయం సాధించిన జగన్ ను ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య మింగుడుపడడం లేదు. వివేకానందరెడ్డిని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన పాపం, వివేక హత్య జరిగిన అనంతరం ఆయనపై వేసిన నిందల పాపం, ఆయన కుమార్తెకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న పాపం, వివేకా హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన అవినాష్ ను కాపాడుతున్న పాపం.. ఇలా ఒకటి కాదు అన్ని పాపాలూ కలిసి ఇప్పడు జగన్ కు, ఆయన అనుయాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న ఎన్నికలలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 

కేసులు వేరు.. దర్యాప్తును అడ్డుకోవడంలో వ్యూహాలు ఒకటే!

వివేకా హత్య కేసు దర్యాప్తు జగుతున్న తీరు..చేరుకుంటున్న ముగింపు దశ చూస్తే.. ఈ కేసులో సూత్ర ధారులు, పాత్రధారుల పాత్ర దాదాపు బయటపడిపోయిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది. సీబీఐ ఎంత నిదానంగా, నత్తతో పోటీ పడుతూ దర్యాప్తు చేసినా సుప్రీం కేసు దర్యాప్తు పూర్తికి గడువు విధించడంతో తప్పని సరి పరిస్థితుల్లో కేసు దర్యాప్తును తార్కిక ముగింపు దిశగా తీసుకువచ్చింది. ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా.. అది వారికే బూమరాంగ్ అవ్వక మానదనీ, అనుమానపు దృక్కులు వారిపై కూడా ప్రసరించక మానవనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వివేకా హత్య కేసు  దర్యాప్తు సజావుగా సాగకుండా  సాధ్యమైనంత వరకూ జాప్యం జరిగేలా చూడటమే లక్ష్యంగా ఎత్తులు వేయడాన్ని జనం గుర్తించారు. ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతున్న ప్రయత్నాల కారణంగా, ఆ ప్రయత్నిస్తున్నవారే ఈ కేసులో దోషులు అన్న నిర్ధారణకు జనం వచ్చేందుకు ఆస్కారం కలగడం  తప్ప మరో ప్రయోజనం నెరవేరిన దాఖలాలు కనిపించవు.  టెక్నికల్ గా కేసులు, పిటిషన్లతో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటూ.. జనం దృష్టిలో పలుచన అవ్వడమే కాకుండా..  నేరం చేసినట్లుగా ప్రజలు నమ్మడానికి మాత్రమే ఆ ప్రయత్నాలు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు వివేకా హత్యలో ఆయన పాత్రపై అనుమానాలు పెంచాయి. తాత్కాలికంగా ఆయన తన ప్రయత్నాల ద్వారా అరెస్టును వాయిదా వేసుకోగలరు కానీ.. అంతకు మించి ప్రయోజనం సిద్ధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు అనుసరించిన వ్యూహాలను   జగన్ అక్రమాస్తుల కేసులో అనుసరించిన వ్యూహాలతో పరిశీలకులు పోలుస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు దర్యాప్తు, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు సంబంధించిన కేసు కనుక దర్యాప్తు విచారణకు సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదు కానీ,  ఒక క్రిమినల్ కేసు ఇంతగా లాగ్ అవ్వడం వెనుక రాజకీయ జోక్యం తప్ప మరోటి కాదని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసు దర్యాప్తు పూర్తికి సుప్రీం గడువు విధించినందునూ నాలుగేళ్లు దాటిన తరువాతైనా లాజికల్ ఎండ్ కు చేరుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పార్టీపై జగన్ పట్టు జారిపోయిందా?

వైసీపీ బండారం బయటపడిపోయింది.  పార్టీపై జగన్  పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నే అది పక్కాగా తేటతెల్లమైపోయింది. మూడేళ్ల పాటు గుప్పిట మూసి అంతా నేనే.. నా మాటే శాసనం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ ఒక్క సారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంతో కుప్పకూలిపోయినట్లైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఎమ్మెల్యేలూ, మంత్రిపదవుల ఆశావహులూ, పదవి కోల్పోయిన మాజీలలో వెల్లువెత్తిన నిరసన వైసీపీ బండారాన్ని బయటపెట్టేశాయి. సరే ఆ అసంతృప్తి ఎలాగో కష్టపడి బుజ్జగింపుల ద్వారా చల్లార్చుకున్నారనుకుంటే అసలు సినిమా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులకు అడుగడుగునా ప్రజా నిరసన సెగలా తగలడంతో  దానిని తూతూ మంత్రంగా చుట్టేయడానికే ఎమ్మెల్యేలూ, మంత్రులూ మొగ్గు చూపారు. దీంతో జగన్ సమీక్ష నిర్వహించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పేరు ప్రస్తావించి మరీ తీవ్ర హెచ్చరికలు చేశారు. టికెట్లు, పదవులు అన్నీ కూడా గడపగడపకూ పెర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించి పెర్ఫార్మెన్స్ బాలేని మంత్రులకు ఉద్వాసన పలుకుతాననీ, బాగున్న వారికి పదవులు కట్టబెడతాననీ విస్పష్టంగా చెప్పేశారు. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే మరో సారి సమీక్ష నిర్వహించారు. అప్పుడూ అదే ధోరణి కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ సందర్భంగానే మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ పలువురి మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సరే ఆ చర్చ అలా జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీకి ఆ ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మూడు గ్యాడ్యుయెట్ ఎమ్మెల్సీ స్థానాలలోనూ, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలోనూ అధికార వైసీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఇక ఆ తరువాత నుంచీ జగన్ నోటి వెంట హెచ్చరికలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు లేవు. రుసరుసలు లేవు. మొత్తం బుజ్జగింపుల పర్వమే. పనితీరు బాలేకపోతే వచ్చే ఎన్నికలలో నో టికెట్ అంటూ హెచ్చరికలు లేవు.  ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం అన్నీ విపక్షాల సృష్టే అంటూ గతంలో మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా జగన్ స్వరం మారిపోయింది.   ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లోనే ఇంకా పలువురు లిస్ట్ లో ఉన్నారంటూ గంభీరమైన లీకులు ఇచ్చారు. అయితే ఆ తరువాత సీన్ మారిపోయింది. ఏప్రిల్ 3న నిర్వహించిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినా కిమ్మనలేదు.  అప్పటి వరకూ ఓ హెచ్చరికలా చెబుతూ వచ్చిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట ఎత్తలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. అప్పట్లో కేబినెట్ సమావేశంలో  స్వయంగా జగన్   ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు.  అయితే తరువాత పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట కాదు కదా.. కనీసం పని చేయని మంత్రులను మందలించే ధైర్యం కూడా చేయలేనంత బలహీనంగా సీఎం మారిపోయారు. గతంలోలా సొంత పార్టీపై పట్టు లేకపోవడం వల్లనే ఆయన పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా విపక్షంపై విమర్శలు చేయడానికే అన్నట్లుగా జగన్ అజెండా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్ తీరుతో బీజేపీలో ఆందోళన!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందా? ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావేనా? అంటే కమలనాథులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి హైప్ ఇచ్చిందీ, ఇప్పుడా హైప్ ను తగ్గించేసి పార్టీని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందీ కూడా కేసీఆరే అని అంటున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీకి లేని హైప్ ను క్రియేట్ చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే  అలా చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పెరిగేదీ ఉండదు.. ఆ పార్టీకి ఒరిగేదీ ఏమీ ఉండదని ఆయన భావించారంటున్నారు. కానీ తర వైఖరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన భావించారు. చాలా వరకూ ఆయన అనుకున్నట్లే జరిగింది కానీ, కేసీఆర్ కృత్రిమంగా బీజేపీకి క్రియేట్ చేసిన హైప్ ఆసరాగా తీసుకుని ఆ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు (గతంలో టీఆర్ఎస్)కు దీటుగా ఎదిగింది. ఆయన రాష్ట్రంలో బీజేపీకి ఉద్దేశపూర్వకంగా హైప్ క్రియోట్ చేయడానికి కాంగ్రెస్ ను బలహీన పరచడమే కాకుండా తన జాతీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా దోహదపడుతుందని భావించారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఆ విషయంలో పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా ఆయన బీజేపీ వ్యతిరేకత బూమరాంగ్ కూడా అయ్యింది. ఆయన పదే పదే కేంద్రంలోని మోడీ సర్కార్ ను, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని విమర్శించడంతో.. రాష్ట్రంలో కమలం బలోపేతమైంది. బీఆర్ఎస్ ను గట్టిగా ఢీ కొనే స్థాయికి చేరింది. అదే సమయంలో ఆయన బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడాన్ని జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు నమ్మలేదు. అందుకే ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ చెప్పులరిగేలా దేశమంతా తిరిగినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఇక లాభం లేదనుకుని సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు. అందుకు ఇంత కాలం తనకు అండగా, తన అధికారానికి దండగా నిలిచిన తెలంగాణ సెంటిమెంటును కూడా వదిలేసుకున్నారు. పార్టీలోని తెలంగాణ పేరును తీసేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇలా చేయడం వల్ల ఆయనకు ఒరిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు కానీ ఇక ఏ ఎన్నికలోనూ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా తీసుకునే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు. అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ తీరు వల్లే బలోపేతమైన బీజేపీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టగలమనుకునే స్థాయికి ఎదిగింది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తన పొరపాటును గుర్తించారు. అంతే వ్యూహాత్మకంగా తన ప్రసంగాలలో బీజేపీ పేరెత్తడం మానేశారు. దీని వల్ల గతంలో  అంటే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ఆయన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ బీటీమ్ గానే వ్యవహరించారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. అదే సమయంలో  రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొనేందుకు కూడా  కేసీఆర్ వెరవ లేదు. అయితే.. ఇప్పుడు బీజేపీకి ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే.. రాష్ట్రంలో తన అధికారానికే ముప్పు వస్తుందన్న భావనకు వచ్చిన కేసీఆర్ బీజేపీ పేరెత్తడం మానేశారు. ఇదే బీజేపీకి తెలంగాణలో మైనస్ అయ్యింది. కర్నాటక ఫలితాలతో దిగాలు పడిన బీజేపీకి కేసీఆర్ మారిన వైఖరి మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి కారణమైన బీజేపీ, మోడీ వ్యతిరేకతకు కేసీఆర్ నీళ్లొదిలేశారన్న ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఆయన బీజేపీయేతర పార్టీల సీఎంల భేటీకి దూరంగా ఉండటంతో  కేసీఆర్ బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉందన్న భావన బలపడుతోంది. సరిగ్గా ఇదే తెలంగాణలో బీజేపీని బలహీన పరుస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత బీజేపీపై కూడా ప్రతిఫలిస్తుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది అంతిమంగా  కాంగ్రెస్ కే ప్రయోజనం చూకూరుస్తుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

వివేకా హత్య కేసులో ఎ9 ఎవరు?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి  జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, పదే పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అరెస్టును వాయిదా వేయించుకుంటున్న తీరు తీవ్ర చర్చనీయంశమైంది. ఇక తెలంగాణ హై కోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిలుపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పక్కన పెడితే.. ఈ కేసులో సీబీఐ అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో నూ, భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫడివిట్ లోనూ జగన్ పేరు ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావడం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమౌతున్నాయి. సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిస్తే చాలు జగన్ ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ వేగం మందగించేలా కార్యం చక్కబెట్టుకు వచ్చేవారని స్వయంగా వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  వివేకా హత్య కేసులో జగన్ కూడా విచారణకు హాజరు కాక తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం, అందరికంటే ముందే జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు. ఆయనకు ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే చేరవేశారన్నది తమ అనుమానంగా సీబీఐ చెబుతోంది. అందుకే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు స్పష్టంగా చెప్పింది.  ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనాల్సి రావడం అనివార్యమన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమౌతోంది.   కేసు ఇంత వరకూ రావడానికీ, జగన్ పేరు సీబీఐ ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడడానికీ వివేకా కుమార్తె  సునీత  అలుపెరుగని న్యాయపోరాటమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అసలు సునీత పట్టుబట్టి తన తండ్రి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సాధించినప్పటి నుంచే వైసీపీ పునాదులు కదలడం ప్రారంభమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల వరకూ దర్యాప్తు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారం చేపట్టగానే జగన్ సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.   అందుకే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ.. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే కేసులో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని పట్టించుకోకుండా ఒక్క అవినాష్ రెడ్డి విషయంలోనే జగన్ అతి శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక ఎంపీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఏ ముఖ్యమంత్రైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా కలగ జేసుకోకుండా ఉంటారని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టైతే కేజ్రీవాల్ ఆ అరెస్టును ఆపడం కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా జగన్ మాత్రం అవినాష్ కు ఇలా సీబీఐ నోటీసులు అందితే.. అలా హస్తిన  పర్యటనకు వెళుతున్నారనీ, అర్ధరాత్రి సమావేశాలతో  అవినాష్ ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు కచ్చితంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజలలో వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు సీబీఐ వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్ రెడ్డిని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఎ9 ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కోణం, కుట్ర ఉందని కూడా సీబీఐ పేర్కొనడంతో ఇప్పుడు అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపు మళ్లడంతో ఎ8 అవినాష్ రెడ్డి అయితే ఎ9 ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  ఆ చర్చలో ఈ కేసులో కీలక సాక్షులైన గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రస్తావనకు వస్తోంది. అలాగే  ఈ కేసు విచారణ ఏపీలో జరుగుతున్న సమయంలో సీబీఐ అధికారులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రస్తావనకు వస్తున్నాయి.  

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు జగన్?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.  ఆయనను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆయన బెయిలు కోసం తన కుమారుడు అవినాష్ రెడ్డిలా తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించక తప్పదు. ఆయన ఏ హెల్త్ గ్రౌండ్స్ లో అయితే సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్  వేశారో.. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే తన కుమాడురు అవినాష్ రెడ్డికి మాత్రం హైకోర్టు తల్లి అనారోగ్య కారణంగా బెయిలు ఇచ్చింది. దీంతో భాస్కరరెడ్డి కూడా తన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ లో భాస్కరరెడ్డి అత్యంత ప్రభావమంతమైన వ్యక్తి అనీ బెయిలు ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారనీ పేర్కొంది. అంతే కాకుండా సాక్షులను బెదరించే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొంది. అలాగే ఈ కేసులో సునీత తరఫు న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. కాగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్  వాదనల సమయంలో కూడా సీబీఐ, సునీత ఇవే వాదనలు వినిపించారు. అయినా అక్కడ అవినాష్ కు ఊరట లభించింది. దీంతో భాస్కరరెడ్డి  బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారని పరిశీలకులు అంటున్నారు. కాగా అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీంను ఆశ్రయించారు. సునీత పిటిషన్ సుప్రీంలో మంగళవారం (జూన్ 13)న విచారణకు రానుంది. దీంతో అవినాష్ విషయంలో  సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. ఆరోగ్య కారణాలు, అయితే  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కూడా వివేకా హత్య కేసులో అవినాష్ ఏ గ్రౌండ్ మీద అయితే యాంటిసిపేటరీ బెయిలు సంపాదించారో  అవే గ్రౌండ్స్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నుంచి మధ్యంతర బెయిలు పొందారు. అయితే ఈడీ రాఘవ బెయిలును సవాల్ చేయడంతో పై కోర్టు మధ్యంతర బెయిలు రద్దు చేసి రాఘవను లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో అవినాష్ కు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందని, ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ న్యాయ నిపుణులు అంటున్నారు. అదలా ఉంచితే.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు సందర్భంగా తెలంగాణ హైకోర్టులోనూ, ఆ తరువాత భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ సందర్భంగా సీబీఐ కోర్టులోనూ  సీబీఐ తన అఫిడవిట్లలో ఏపీ ముఖ్యమంత్రి  జగన్ పేరును ప్రస్తావించింది.  వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి  ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసని సీబీఐ రెండు సందర్భాలలోనూవివేకా పీఏ బయటికి చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని పేర్కొంది. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకోవడానికి  అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ప్రయత్నాలన్నిటినీ వివేకా కుమార్తె వైఎస్ సునీత తన అసమాన న్యాయపోరాటంతో అడ్డుకున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఆమె తన సోదరుడు జగన్ పై పై చేయి సాధించారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో జగన్ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందనీ, సీబీఐ తన అఫిడవిట్లలో జగన్ పేరు ప్రస్తావించడమంటే ఆయనను విచారిస్తామని చెప్పడమేనని న్యాయనిపుణులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టు అనివార్యమని చెబుతున్నారు. అలాగే  ఆయన తండ్రి భాస్కరరెడ్డి బెయిలు కోసం  హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా  పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.