వారంలో తెలంగాణ ఎన్నికల నగారా!

వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. హస్తిన వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఆ షెడ్యూల్ మేరకు తెలంగాణ ఎన్నికలు తొలి దశలోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2018 లోనూ అలాగే జరిగింది. దానిని బట్టి ఈ సారి కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి విదితమే. అనారోగ్యంగా ఉండి కూడా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రక్రియలు ఏమైనా ఇంకా పూర్తి కాకుండా ఉంటే ఈ నెల 10లోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అనూహ్యంగా, హఠాత్తుగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం, దసరాకు ప్రారంభించాలనుకున్న సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6నే ప్రారంభించేందుకు నిర్ణయించడం ఇవన్నీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల వారంలోగానే ఉంటుందన్నడానికి సంకేతాలుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో రెండు సార్లు పర్యటించి రెండు బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాలలో ఎన్నికల హామీలను గుప్పిస్తూనే అధికార పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సారథ్యంలో ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధత తదితర అంశాలపై చర్చలు జరుపుతోంది. సమీక్షలు నిర్వహిస్తోంది.   తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల గడువు 2014, జనవరి 24తో ముగియనుండగా, ఒక్క మిజోరంలో మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17 వరకే ఉంది. అందుకే ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. జమిలి ప్రతిపాదన, ప్రస్తావన వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లేదని తేలిపోవడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.  

మైనంప‌ల్లి వెనుక కేటీఆర్? హరీష్ కు చెక్ పెట్టేందుకేనా?

కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో  రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.   ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం మాట్లాడుకోవాలి. అదేమిటంటే మైనంపల్లి హనుమంతరావు సొంత జిల్లా   గ‌తంలో మెదక్  నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ లో హరీష్ పెత్తనం కారణంగా ఆయన జిల్లాలో రాజకీయాలు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు తన కుమారుడి కోసం హరీష్ ను టార్గెట్ చేసి కాంగ్రెస్ లో చేరిపోయి… ఉమ్మడి మొదక్ జిల్లా బాధ్యతల్ని తీసుకున్నారు.  అంతే కాదు బీఆర్ఎస్ కంచుకోటలపై దృష్టి పెట్టారు. రామాయంపేటకు చెందిన మైనంపల్లి గతంలో తెలుగుదేశం మెదక్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. మైనంపల్లి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ మెదక్ పై దృష్టి పెట్టారు. నర్సాపూర్ బాధ్యతల్ని కూడా తీసుకునేదుకు సిద్ధమయ్యారు. మెదక్‌ సొంత జిల్లా కావడంతో పాటు కార్యకర్తల్ని ఆదుకుంటారన్న పేరు ఉండటంతో మెదక్‌తో పాటు నర్సాపూర్ నియోజకవర్గాల్లో  ఆయనకు ఊరూరా అనుచగణముంది. వారినీ యాక్టీవ్‌ చేస్తున్నారు.  మైనంపల్లి రోహిత్‌ మెదక్‌ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. మైనంపల్లి ఫౌండేషన్‌ పేరిట  ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని గ్రామాల్లోనూ అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయాలు, ఇండ్లు, కమ్యూనిటీహాల్స్‌ నిర్మాణం, వైద్య, విద్య అవసరాల కోసం సాయం చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్నారు.  నర్సాపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇవ్వడం లేదు. దీంతో ఆయనను కాంగ్రెస్‌లో కి లాగేందుకు మైనంప‌ల్లి ప్రోత్సహిస్తున్నారు. మైనంపల్లి దూకుడు హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… ఉమ్మడి మెదక్ జిల్లాలో  తెలంగాణ ఆవిర్భావం నుంచీ హరీష్ రావు పెత్త‌న‌మే న‌డుస్తోంది.  అక్కడ క‌నుక పట్టు కోల్పోతే హరీష్ రావుకు రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుంది.  పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు మెదక్ జిల్లాపై పట్టు కోల్పోతే.. ఇక  పార్టీలో ఆయనకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికీ పార్టీలో కేసీఆర్ తరువాత నంబర్ టూ స్థానం కోసం కేటీఆర్ తో పోటీ పడుతున్నది హరీష్ రావేనని పార్టీ  శ్రేణులే చెబుతున్నాయి. అటువంటి హ‌రీష్ రావుకు మెదక్ జిల్లాపై పట్టు జారితే.. ఇక ఆయన కేటీఆర్ కు సమఉజ్జీగా ఉండే అవకాశమే లేదు. అందుకే స్వయంగా కేటీఆరే మైనంపల్లిని హరీష్ కు వ్యతిరేకంగా  ప్రొత్సహించి పెంచారా అన్న అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం  అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  హ‌రీష్ రావు  మైనంపల్లికి చెక్ పెట్టేందుకు జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతున్నారు. మైనంప‌ల్లిని దెబ్బ‌తీయ‌డానికి అంది వచ్చే ఏ అవకాశాన్నీ వ‌దులుకోవ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్ట‌డానికి త‌న‌దైన స్టైల్‌లో  వ్యూహాలు రచిస్తున్నారు. ఫ‌లితం .... మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం వల్ల..ఆ పార్టీ బలం ఎంత పెరిగిందో తెలియదు గాని..  రెండు వికెట్లు ప‌డిపోయాయి.  దీని వెనుక హ‌రీష్ రావు హ‌స్తం వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మేడ్చల్‌ జిల్లా  కాంగ్రెస్ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.  మెదక్ సీటు మైనంపల్లి తనయుడికు కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేత కంటారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.   మరో ప‌క్క అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న సీనియ‌ర్లు మైనంపల్లి కేంద్రంగా అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. మైనంపల్లికి, ఆయన కుమారుడికీ కూడా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. తమకు  కూడా డబుల్ టికెట్లు కావ్వాల్సిందే అంటున్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.  ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని చెప్పింది.  ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో  పార్టీ సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు.  అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చి మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి ఆయన కుమారుడు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లికి మినహాయింపు ఇచ్చినట్లే తమకూ మినహాయింపు ఇచ్చి తమ కుటుంబాలకు కూడా రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అంటే సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. అయితే మైనంపల్లిది ప్రత్యేక  కేసుగా కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నది. ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే వుంది.    మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం   ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు కాబ‌ట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. ఈ నేపథ్యంలోనే  మెదక్  కాంగ్రెస్ లో అస‌మ్మ‌తి ప‌తాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయ‌న మెదక్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మెదక్ టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు మైనంపల్లి పార్టీలో చేరడంతో తిరుపతి రెడ్డి ఆశలు కుప్పకూలాయి. మైనంపల్లి కుమారుడు రోహిత్ కే కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో తిరుపతి రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.     మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు రాక‌తో మ‌రో ముఖ్య‌నేత కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. మొద‌టి నుంచి మైనంప‌ల్లి చేరికను వ్యతిరేకిస్తున్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు లేఖ రాశారు.  ఉద‌య్‌పూర్ తీర్మానానికి వ్య‌తిరేకంగా  కాంగ్రెస్ పార్టీ  మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం, బీసీనేత‌నైన త‌న‌ను కాంగ్రెస్ పార్టీ అణ‌గ‌క‌దొక్క‌డం బాధించింద‌ని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీకి, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు నందికంటి శ్రీ‌ధ‌ర్ లేఖ‌లో వెల్ల‌డించారు. గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్‌కు పట్టు ఉంది. పైగా అక్కడ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లే. దీంతో ఇక్క‌డ పోటీ మరింత రసవత్తరంగా మార‌నుంది. మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్ బలమైన పార్టీ.. అయితే మైనంపల్లికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ బలం కాస్త తగ్గవచ్చు. అటు కాంగ్రెస్‌కు కొంత బలం ఉంది. అది కలిసిరావచ్చు. మల్లారెడ్డి అల్లుడు ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత..దీంతో గట్టి పోటీ తప్పదు. అయితే మైనంపల్లి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేత. అటు కాంగ్రెస్ ఓటింగ్ కూడా కలిసిరావచ్చు. దీంతో మల్కాజిగిరి పోరు ఈ సారి రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ బి‌జే‌పికి కూడా ఒకింత  పట్టు ఉండటంతో  త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో గెలుపు ఎవరికీ నల్లేరుమీద బండినడక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మైనంపల్లి తనయుడు పోటీ చేసే  మెదక్ నియోజకవర్గంలోనూ పోటీ రసవత్తరంగానే ఉంటుందని అంటున్నారు. హరీష్ రావు.. మైనంపల్లిని, కాంగ్రెస్ ను బలహీనం చేసే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనీ, మైనంపల్లిని దెబ్బకొట్టగలిగితే.. తన పట్టు నిలుపుకోవడమే కాకుండా, కేటీఆర్ కూ చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బాబు అరెస్టు.. కేసీఆర్ హౌస్ అరెస్ట్.. లింకుందా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో  ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్  కార్పొరేషన్ స్కాం అంటూ  తెలుగుదేశం అధినేత  చంద్రబాబునాయుడిని జగన్  సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడంపై  దేశ విదేశాల్లో వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు ఆందోళన బాట చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో నినదిస్తున్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. అయితేచంద్రబాబు అరెస్ట్‌పై సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికార  అగ్రనేతలు.. అంటే   కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం థియేటర్‌లో సినిమా ప్రారంభమైన తర్వాత.. సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయింది.   సమీక్షకుడిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం ఏపీలో ఎవరినో అరెస్టు చేస్తే తెలంగాణకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించి.. విమర్శలను ఎదుర్కొన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అనంతరం చోటు చేసుకొంటున్న ప్రతి అంశాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. మినిట్ టు మినిట్.. నివేదికను తెప్పించుకొంటున్నట్లు వరుస కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో  హల్  చల్ చేస్తున్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ పక్క రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల పంచాయతీ అని, దీనితో తమకేమి సంబంధమంటూ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్  చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని సెటిలర్లలో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. అ సంగతి   ఇంటెలిజెన్స్ నివేదిక రూపంలో ఇప్పటికే  కేసీఆర్‌కు అందిందనీ,  ఆ నివేదిక చూసి ఆయనగారు గాభరా పడ్డారని  పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ  జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే ఆయన వైరల్ ఫీవర్ అంటూ ప్రగతి భవన్ కే పరిమితమై తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకున్నారంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.   చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు ఉదాసీనంగా వ్యవహరించడంతో.. తెలంగాణలోని ఆంధ్రుల్లో  బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడం, అలాగే ఐటీ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల ఆందోళనలపై పోలీసులు ఉక్క పాదంమోపడం వెనుక  కేసీఆర్ ప్రభుత్వం తెర చాటు రాజకీయాన్నిఅమలు చేసిందని సెటిలర్లు భావిస్తున్నారు.  అదీకాక బాబు అరెస్ట్‌పై మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ ప్లకార్లుడు పట్టుకొని తెలుగు వారు శాంతియుతంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ... అక్కడెక్కడో బాబు అరెస్ట్ జరిగితే.. ఇక్కడ ఈ గోల ఏమిటని   కస్సు బస్సులు ఆడడం లేదని.. కానీ చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవితలు కారాలు మిరియాలు నూరడం ఏమిటన్న ఆగ్రహం సామాన్య  ప్రజలలో సైతం వ్యక్తం అవుతోంది. అలా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. సాక్షాత్తూ తెలంగాణ స్పీకరే చంద్రబాబు అరెస్టును ఖండించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.  అదీకాక.. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుపునకు కేసీఆర్  సహకరించారని.. ఆ సహాయ సహకారాలు నేటికి కొనసాగుతోన్నాయన్న అభిప్రాయం   తెలుగు వారిలో బలంగా వ్యక్తం అవుతోంది.  ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పది వేల నుంచి 40 వేల ఓట్ల వరకు కారు పార్టీకి కోత పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయనే ఓ ప్రచార సాగుతోంది.  మొత్తంగా చూస్తే.. తెలంగాణలో నిమొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో  ఓ 50 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పై  చంద్రబాబు అరెస్టు ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ విషయాన్ని కేసీఆర్ ఫ్యామిలీ గ్రహించిందని.. అందుకే.. కేసీఆర్ సమీప బంధువు,మంత్రి హరీష్ రావు.. రంగంలోకి దిగి.. చంద్రబాబు అరెస్ట్‌పై  స్పందించారని కానీ అప్పటికే కేటీఆర్ వ్యాఖ్యలతో కారు పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. హరీష్ రావు ప్రకటన నష్టనివారణకు ఏమాత్రం దోహదం చేయలేదని చెబుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్..  పార్టీ నేతలతో భేటీ అయితేనో, ప్రెస్‌మీట్ పెడితేనో.. చంద్రబాబు అరెస్ట్‌పై  స్పందించాల్సి ఉంటుందని.. ఆ భయంతోనే ఆయన బయటకు రావడం లేదని అంటున్నారు.   ఏదీ ఏమైనా.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినా, పాలు చల్లినా అది ఆంధ్రా సెటిలర్లపైనేే ఉందని  అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలను గమనిస్తే.. గతంలోలా సెటిలర్లు బీఆర్ఎస్ కు సహకరించే అవకాశాలు అయితే లేవని అంటున్నారు.  అదలా  ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని అటు బీజేపీ... ఇటు కాంగ్రెస్ తమ తమ ప్రయత్నాలు ముమ్మరం  చేశాయి.. చేస్తున్నాయి. ఇక తెలంగాణలో తెలుగుదేశం సైతం  సత్తా చాటేందుకు  సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటున్నది.దానికి   ఇప్పుడు ఆంధ్రా సెటిలర్ల ఆగ్రహం తోడు కావడంతో  బీఆర్ఎస్ హ్యాట్రిక్ కల నెరవేరడం సులభ సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ డిల్లీ పర్యటన.. మరిన్ని అరెస్టులకు సంకేతమేనా?

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది. స్వయంగా వైసీపీ వర్గాలే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఆశీస్సులు జగన్ కు ఉన్నాయనీ, ఈ అరెస్టుల పర్వం చంద్రబాబుతోనే ఆగదనీ బాహాటంగానే చెబుతున్నారు. కేసుల పేర్లు, సెక్షన్లు ఉటంకిస్తూ తరువాత అరెస్టు ఎవరిదో వారు చెప్పేస్తున్నారు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఖరారయ్యయని చెబుతున్నారు.   అన్నీ కుదిరితే  శుక్రవారం (అక్టోబర్6) జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. నిజానికి గత వారమే జగన్ ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నించారు. విదేశీ పర్యటనలు ముగించుకుని రాష్ట్రానికి రాగానే జగన్ ఢిల్లీ పర్యటనకు వెడతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే ఢిల్లీ పెద్దల నుండి అనుమతి లభించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. ఇక ఇప్పుడు మాత్రం కేంద్ర పెద్దల అనుమతి, అపాయిట్ మెంట్లు దొరకడంతో జగన్ రెడ్డి హస్తిన ప్రయాణం ఖరారైంది.   ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని అంటున్నారు. కాగా, జగన్ హస్తిన పర్యటనపై రాజకీయ వర్గాలలో పలు విధాల చర్చలు జరుగుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు  అక్రమ   అరెస్ట్ , ఈ నెలలోనే తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన  ఆసక్తికరంగా మారింది.  బీజేపీ మద్దతుతోనే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేశారన్న భావన అన్ని వర్గాలలోనూ వ్యక్తమౌతున్నది.  ముఖ్యంగా మోడీ, అమిత్ షాలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జగన్ ఈ పని చేశారంటే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంతెందుకు కేంద్ర పెద్దల మద్దతుతోనే చంద్రబాబును అరెస్టు చేశామని వైసీపీ నేతలే స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ అదే పెద్దలను కలవనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది.  వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు అరెస్టుపై విచారణ జరగనున్నది,  అదే సమయానికి జగన్ కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఢిల్లీ నుండి ఏపీకి ఎలాంటి సంకేతాలు అండనున్నాయన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.  మరోవైపు చంద్రబాబుతో పాటు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, మార్గదర్శి ఎండీ శైలజ వంటి వారిని కూడా జైలుకు పంపాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారని వైసీపీ నేతలే బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి అరెస్టుకు కొన్ని పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో మరోసారి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసమే జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు  ముందస్తు ఎన్నికలకు క్లియరెన్స్ కోసం కూడా జగన్ హస్తిన పర్యటనకు వెళుతున్నారని అంటున్నారు. అందుకోసమే  ప్రత్యర్థుల్లోని బలమైన నేతలను జైలుకు పంపి ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం తోనే హస్తిన పెద్దల ఆశీస్సులు, అనుమతి కోరేందుకే జగన్ హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు అక్రమ ఆస్తుల కేసులు, వివేకా హత్యకేసు వంటి సొంత కేసులు, అదానీ ప్రాజెక్టులు తదితర అంశాల సీఎం జగన్  ఢిల్లీ పర్యటన వెనక కారణాలు కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఏ నెలకి ఆ నెల జీతాలు, పెన్షన్లు వంటి అతి సామాన్య ఖర్చులకు కూడా తెగ కసరత్తులు చేయాల్సి వస్తుంది. అప్పులకోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా సరిపోనంత నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల కోట్లు బిల్లులు చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే చేయాల్సిన  స్థాయిని మించి అప్పులు చేయగా ఇప్పుడు కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి కష్టాలు ప్రభుత్వానికి తీరని నష్టం కాగా మరికొన్ని రోజులు ప్రభుత్వం నడిచేలా పెద్దల ఆశీస్సుల కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్ లో మరోసారి ఢిల్లీ వెళ్లనున్న జగన్ ఏ మేరకు వ్యూహాలను అమలు చేస్తారో చూడాల్సి ఉంది.

బీజేపీకి పవన్ కళ్యాణ్ రాంరాం?

బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే  మిత్రిపక్షంగా ఉన్న బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా.. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వేడతానని ప్రకటించేశారు.  చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ మూడ్ పూర్తిగా మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ పై అన్ని వర్గాలలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు కూడా  రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తరువాత ఆ ఆగ్రహం అవదులనేవే లేకుండా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపుగా  సమాజంలోని అన్ని వర్గాలలోనూ జగన్ రెడ్డి పాలన అరాచకమని, వదిలిచుకు తీరాలన్న పట్టుదల కనిపించింది. ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  , ఏపీలో పొత్తులు ఉంటాయా? ఉంటే ఏఏ పార్టీలు కలిసి వెళ్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది పక్కన పెడితే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన పొత్తు అయితే ఖరారైపోయింది. ఒక్క సారి జనసేనాని పొత్త ప్రకటన చేసిన తరువాత క్షత్ర స్థాయిలో కూడా జనసేన, తెలుగుదేశం శ్రేణులు కలిసే పని చేస్తున్నాయి.  తాజాగా పవన్ కళ్యాణ్ వారాహీ నాల్గవ విడత పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమాలలో జన సైనికులు అంతే యాక్టివ్ ఉంటున్నారు. అయితే, ఎటొచ్చి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. తెలుగుదేశం, జనసేనలు బీజేపీని కూడా కలుపుకొని వెళ్తారా? లేక బీజేపీని సైడ్ చేస్తారా అన్న మీమాంస కొనసాగుతుంది. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా.. ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రకటించింది. టీడీపీతో పొత్తు ప్రకటన వేళ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని, ఆ పార్టీ కూడా  కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో రాజకీయ వర్గాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా తెలంగాణలో పొత్తులకు సమయం వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి స్టేక్ ఉంది. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడం ఇక్కడ బీజేపీకి అవసరం కూడా. ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెప్తున్న పవన్ మాత్రం అనూహ్యంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు.  దీంతో తెలంగాణలో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి అనే చర్చ పెరిగిపోతోంది. పవన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు వలన టీడీపీ,జనసేన కూటమికి  ప్రయోజనం లేకపోగా..నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్న క్రమంలో  టీడీపీ, జనసేన బీజేపీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు తప్ప బీజేపీఊసే ఎత్తడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు తప్ప బీజేపీ గురించి మాటమాత్రంగానైనా చెప్పడం లేదు. ఈ క్రమంలోనే  పవన్ కల్యాణ్   బీజేపీకి రాంరాం చెప్పేశారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీలో బీజేపీని కాదని తెలంగాణలో పొత్తుకు వెళ్తే ప్రజలలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించే పవన్ బీజేపీ నుండి దూరం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.   అన్నిటికీ మించి  చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధంలేదని మీడియాతో చెప్పినా అంతర్గతంగా బీజేపీ, కేంద్రం హస్తం ఉందనే  ఆయన భావిస్తున్నట్లు జనసేన వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలలో బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా పవన్ కళ్యాణ్  సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలో తేటతెల్లమైందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ వంటి విషయాలలో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడంపై పవన్ చాలా కాలంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పుడు సమయం రావడంతో  ఆయన కమలం పార్టీకీ, కమలనాథులకు దూరం జరిగారని అంటున్నారు.  మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో   బీజేపీ పెద్దల తీరు అర్ధం కావడం వల్లనే పవన్ ఢిల్లీ కూడా వెళ్లడం లేదన్ననీ, వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి.   

అగ్రరాజ్యంలో అంబేద్కర్ కు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది.మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో  ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు. ఈ స్మారక చిహ్నం అంబేద్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి  ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  మంత్రి రోజాపై, ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై  పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన సోదరుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టుకు 41ఏ నోటీసులు అందించామని తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. వందల సంఖ్యలో పోలీసులతో ఆయన ఇంటిని దిగ్బంధనం చేసి మరీ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.  తనకు బెయిల్ మంజూరు చేయాలన్న బండారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. బండారుకు భారీ ఊరట లభించిన విషయాన్ని పక్కన పెడితే ఆయనను అరెస్టు చేసిన విధానం మాత్రం తీవ్ర విమర్శల పాలౌతోంది. బండారుకు నోటీసులు ఇచ్చామంటూ కోర్టులో చెప్పడాన్ని  ఎత్తి చూపితే.. నిజంగానే నోటీసులు ఇచ్చి ఉంటే బండారును అరెస్టు చేసే అవకాశమే ఉండదనీ, కేవలం విచారణకు రావాల్సిందిగా మాత్రమే కోరాలని అంటున్నారు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తెలుగుదేశం జనసేన కూటమి క్లీన్ స్వీప్ పక్కా.. బీజేపీని కలుపుకుంటే మాత్రం బొక్కబోర్లా!

ఏపీలో వచ్చే ఎన్నికలలో  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం పక్కా అని ఆత్మసాక్షి సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. చంద్రబాబు అరెస్టు తరువాత ఈ సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో  తెలుగుదేశం, జనసేన పొత్తు వచ్చే ఎన్నికలలో ప్రభంజనం లాంటి విజయాన్ని అందిస్తుందనీ, అదే ఈ కూటమి బీజేపీని కూడా కలుపుకుంటే మాత్రం బొక్క బోర్లా పడుతుందనీ తేల్చింది. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం విజయం ఖాయమని, అయితే బీజేపీతో జతకడితే మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని పేర్కొంది.  తెలుగుదేశం,జనసేన పొత్తుగా ఎన్నికలు వెడితే ప్రస్తుతం  జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులలో 17 మంది పరాజయం పాలు కావడం తథ్యమని పేర్కొంది.  ఇప్పటి వరకూ శ్రీ ఆత్మసాక్షి సర్వే మూడు విడతలు గా సర్వే నిర్వహించింది. విడత విడతకూ తెలుగుదేశం పుంజుకుంటున్నదని సర్వే  ఫలితం తేల్చింది. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జనం తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరయ్యారని సర్వే పేర్కొంది.  వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి  151 స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, అప్పట్లో తెలుగుదేశం 23 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.  అప్పటి ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలలలోనూ ప్రజలలో అసంతృప్తికి బీజం పడింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలనపై ప్రజాగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.   రెండేళ్ల కిందట ఇదే ఆత్మసాక్షి సర్వే తెలుగుదేశం కు వైసీపీ కంటే నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తాయని పేర్కొనగా తాజా సర్వేలో  తెలుగుదుశం, జనసేన కూటమికి 54% ఓట్లు ఖాయమనీ, వైసీపీ 43 శాతానికి పరిమితం అవుతుందనీ పేర్కొంది. అంటే వైసీపీ కంటే తెలుగుదేశం,జనసేన కూటమి 11% అధిక ఓట్లతో అధికారం చేపట్టడ తథ్యమని పేర్కొంది. ఇందులో తెలుగుదేశం ఓట్ల షేర్ 44 శాతం ఓట్లు, జనసేన షేర్10 శాతం ఓట్లు అని పేర్కొంది.  రానున్న రోజులలో తెలుగుదేశం, జనసేనకు ఓటింగ్ శాతం గణనీయంగా  పెరిగే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.  చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని.. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత ప్రజల ఆదరణ పెరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అయి జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ టీడీపీతో జతకట్టడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయని శ్రీఆత్మసాక్షి సర్వే వివరించింది.  కాగా, బీజేపీని కూడా తమతో చేర్చుకుంటే మాత్రం టీడీపీ, జనసేన కూటమి భారీగా నష్టపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. బీజేపీతో  కాకుండా లెప్ట్ పార్టీలతో జతకడితే తెలుగుదేశం,జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన, లెప్ట్ పార్టీలు కలిసి ఎన్నికలకు వెడితే 120కి పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే గణాంక సహితంగా వెల్లడించింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి మూడు శాంపిల్స్ రూపంలో సర్వే నిర్వహించినట్లు వివరించింది.  ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు పేర్కొంది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో తేల్చారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం పక్కా అని సర్వే ఫలితం తేల్చింది.     

బాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టులో మంగళవారం (అక్టోబర్ 3) విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ ను జస్జిట్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ  వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు.  ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.   కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. అలాగే సిద్ధార్థ లూధ్రా ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

మోడీ మళ్లీ ఎన్నికల వాగ్దానాలేనా?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు దూకుడు పెంచాయి. అందరికంటే ముందే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి పెద్దలు అమిత్ షా, నడ్డాలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ నెల ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ తెలంగాణలో రెండు కీలక ప్రకటనలు చేశారు. ఒకటి ములుగు జిల్లాలో 900 కోట్ల రూపాయలతో ఎస్టి యూనివర్శిటీ, రెండు తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటన చేయడం బిజెపిలో జోష్ పెంచింది. 2014 ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ పార్లమెంటు  టీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎంపీ అయినప్పటికీ పసుపు బోర్డు మాత్రం తీసుకురాలేకపోయాయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రస్తుత బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ వోటర్లకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎన్నికల వేళ సాక్షాత్తు  ప్రధాని పాలమూరు సభకు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇంతకు ముందు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క అంటూ బిజెపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో  నిజామా బాద్ బిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్  కేంద్ర పెద్దలతో పసుపు బోర్డుపై పై కీలక ప్రకటన చేయించడం  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కవిత పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు. దీనికి కౌంటర్ గా ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ప్రకటన చేయించడం వచ్చే ఎన్నికల్లో బిజెపికి సానుకూల అంశమైతే బిఆర్ఎస్ కు పెద్ద షాక్ అయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విభజన హామీలను బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదన్న ఆరోపణలు కొత్తగా తెరమీదికొస్తున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8 తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఖాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ సెంటర్ సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ఏప్రిల్‌లో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సహా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అప్పట్లో  ప్రధాని వరుస పర్యటనలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటోంది.  వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గతంలో ప్రకటించారు. చెప్పినట్లుగానే ఎవరూ హాజరుకాలేదు. దీనిపై ప్రధాని సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు బహిష్కరించాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఏమిటి? వాటిల్లో ఏ మేరకు నెరవేరాయి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.దీన్ని ఖాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ చెప్పింది.దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో నిధులు కేటాయించలేదు.ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు. దీనికితోడు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే.. ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది.అది వ్యాగన్ల మరమ్మతుల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. వ్యాగన్ల తయారీ కేంద్రం అడిగితే వ్యాగన్లకు మరమ్మతులు చేసే వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం 2009 నుంచే  పెండింగులో ఉంది. తొలిసారిగా ఆ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఖాజీపేట రైల్వే కోచ్ తయారీ ‌ప్యాక్టరీ అంశం ప్రతిపాదించారు . అలా అప్పట్నుంచి పెండింగులో ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును చట్టంలో ప్రతిపాదించింది.తర్వాత బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని బీ‌‍ఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు తెలంగా‌‍‌‍‌‍ణకు కేంద్ర ప్ర‌‍‌భుత్వం ఇచ్చిన ‌‍‌హామీలపై తేల్చాలి అని బిజెపి యేతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రిపేర్ల ‌షాపు పెడుతున్నారని విమర్శించాయి. తెలంగా‌‍ణకు కేటాయించిన కోచ్ ‌ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని విమర్శిస్తున్నాయి.ప్రధాని అంటే గుజరాత్ కు కాదు, యావత్ దేశానికి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. 

జగన్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు కేసులో తెలుగుదేశం నేతలకు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కూడా ఏపీ సర్కార్ కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఏపీ హైకోర్టు ఈ కేసులో తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఆరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం సీనియర్ నాయకులు చల్లాబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలను మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలని ఆ పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.   జగన్ సర్కార్ పిటిషన్లపై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన  ధర్మాసనం సంఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. అంతే కాకుండా భద్రత కల్పించాల్సిన పోలీసులే సాక్షులుగా ఎలా ఉంటారని ప్రశ్నించింది. హైకోర్టు బెయిలు మంజూరు చేసినందున ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరుపిటిషన్లను కొట్టివేసింది. ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించనున్న సంగతి విదితమే. 

 తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమైంది  తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. అభ్యర్థులను కూడా త్వరలో వెల్లడించనుంది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు... 1. కూకట్ పల్లి,2. పటాన్ చెరు,3. ఎల్బీ నగర్,4. సనత్ నగర్,5. ఉప్పల్, 6. కుత్బుల్లాపూర్, 7.శేరిలింగంపల్లి, 8. మల్కాజిగిరి, 9. మేడ్చల్ ,10. మునుగోడు,11. ఖమ్మం, 12. వైరా,13. నాగర్ కర్నూలు,14. కొత్తగూడెం,15. అశ్వరావుపేట,16. పాలకుర్తి,17. నర్సంపేట,18. స్టేషన్ ఘన్ పూర్, 19.హుస్నాబాద్, 20. రామగుండం,21. జగిత్యాల,22నకిరేకల్, 23. హుజూర్ నగర్, 24.  మంథని, 25.కోదాడ, 26. సత్తుపల్లి, 27.వరంగల్ వెస్ట్,28. వరంగల్ ఈస్ట్, 29. ఖానాపూర్,30. పాలేరు,31. ఇల్లందు,32. మధిర కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఏపీలో ఉన్నది ఏ రాజ్యాంగం? వైసీపీకి చట్టాలు వర్తించవా?

ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమన్యాయం అన్న పదానికే అర్ధం కనిపించడం లేదు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తున్నదన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ వ్యవస్థ విపక్ష నేతల పట్ల ఒకలా.. అధికార పార్టీకి చెందిన వారి విషయంలో మరోలా వ్యవహరిస్తున్నది. తాజాగా తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు విషయంలో పోలీసు శాఖ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతున్నది. బండారు అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానానికే తప్పుడు సమాచారం ఇచ్చారని తేటతెల్లమైంది. నిబంధనలతో పని లేదు.. అరెస్టు చేయాలని జగన్ సర్కార్ అనుకుంటే చాలు.. పోలీసులకు నిబంధనలు, ప్రొసీజర్స్ గుర్తుకు రావు. ఏదో విధంగా అరెస్టు చేసేయడమే. చంద్రబాబు విషయంలో ఏపీ సీఐడీ అలాగే వ్యవహరించింది. సాంకేతిక అంశాల కారణంగా గత పాతిక రోజులుగా చంద్రబాబు నిర్బంధంలోనే ఉన్నారు. న్యాయనిపుణులు సహా అందరూ చంద్రబాబుది అక్రమ అరెస్టు అని ఉద్ఘాటిస్తూనే ఉన్నారు.  తాజాగా పోలీసులు బండారు సత్యనారాయణను అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టడంతో బండారు సోదరుడు హై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. కానీ పోలీసులు బండారు సత్యనారాయణకు నోటీసులు ఇచ్చినట్లు న్యాయమూర్తికి తెలిపడంతో ఆయన విచారణ చేయలేదు. అదే అదునుగా తీసుకుని పోలీసులు బండారును అరెస్టు చేశారు. వాస్తవానికి పోలీసులు నిజంగానే నోటీసులు ఇచ్చి ఉండే బండారును విచారణకు పిలవాలి తప్ప అరెస్టు చేయడానికి అవకాశం లేదు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు.   ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఎన్నికల వేళ... 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి.  నోటిఫికేషన్ సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. వేతన సవరణ కమిటీ (పీఆర్‌సీ)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎన్‌.శివశంకర్‌ను, సభ్యుడిగా బి.రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. పాత పీఆర్‌సీ అమలు గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. శిశశంకర్ కమిటీ సిఫారసు మేరకు కొత్త పీఆర్సీ ప్రకటించనుంది. అప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల ఒకటి నుంచి ఐదు శాతం ఐఆర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారికే ఈ ఐఆర్‌ వర్తించనుంది. రాష్ట్ర జ్యుడిషియల్‌, ఆల్‌ ఇండియా సర్వీసుల వారికి, కాంట్రాక్డు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి వర్తించదని స్పష్టంచేసింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది, మరో 3 లక్షల మంది పింఛన్‌దారులకు ఐఆర్‌ వర్తిస్తుంది. దీని అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థికభారం పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీని అమలుచేయడం ఇది మూడోసారి.

స్కిల్ స్కాంలో ఉండవల్లి పిటిషన్ పై విచారణ ఎప్పుడంటే?

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కాం జరిగిందంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ.. ఆ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంవద్రబాబునాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ విచారణకు ఇంకా నోచుకోలేదు. ఈ పిటిషన్ విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకు వచ్చింది. అయితే ఆ బెంచ్ లో ఒకరైన జస్టిస్  రఘునందన్ రావు రఘునందనరావు నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు.   దీంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి ఉంది. ఇక జస్టిస్ రఘునందనరావు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారిలో కొందరి తరఫున తాను గతంలో వాదించి ఉన్నాననీ, అందుకు ఈ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని పేర్కొన్నారు. కాగా ఉండవల్లి తన పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,   చంద్రబాబునాయుడు, ఈడీ, డిజైన్ టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లను చేర్చారు. ఉండవల్లి చేర్చిన ప్రతివాదులలో  కొందరి తరపున గతంలో  జస్టిస్ రఘునందన్ రావు వాదించారు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయన ఉండవల్లి కేసు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసిన తరువాత విచారణ తేదీ నిర్ణయమౌతుంది.  

తెలుగు రాష్ట్రాల్లో తటస్థులు డిసైడైపోయారు! అందరి నోటా ఐయామ్ విత్ బాబు మాట!

ఎన్నికలు హోరాహోరీ జరుగుతే జయాపజయాలను నిర్ణయించేది తటస్థుల ఓట్లే అని అంటారు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా (కొన్ని మీడియా సంస్థలు ఇఎన్డిఐ అలయెన్స్ అంటున్నాయి) కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్న మాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా తదుపరి ప్రభుత్వం ఎవరిదన్నది నిర్ణయిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ  ఒకే ఒక్క సంఘటన తటస్థులనే వారే లేకుండా చేసింది. ఔను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తటస్థులు లేరు. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో సైతం గత పాతిక రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా సేవలందించిన నాయకుడిని ఆధారాలు లేకుండా, కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు పని చేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో తటస్థులు బేషరతుగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అందుకే చంద్రబాబు అరెస్టు తరువాత రోజు రోజుకూ తెలుగురాష్ట్రాలలో తెలుగుదేశంకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అదే సమయంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీపై, ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఐటీ  ఉద్యోగులతో మొదలైన నిరసనల పర్వం.. ఆ తరువాత సమాజంలోని అన్ని వర్గాలలోనూ కనిపించింది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కూడా చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండించాయి. అలా ఖండించిన పార్టీలలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల ఖండనలు పార్టీ పరంగా కాకుండా ఆయా నాయకుల వ్యక్తిగత స్థాయిలోనే ఉన్నాయి. బీజేపీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ వంటి వారు చంద్రబాబు అరెస్టును ఖండించినా.. ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం కనీసం స్పందన కూడా లేకుండా ఉండిపోయింది. అలాగే  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కూడా కొందరు నేతలు చొంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనల్లో కూడా పాల్గొన్న.. ఆ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడకు కేటీఆర్ మాత్రం స్పందించలేదు. హైదరాబాద్ ప్రగతిలో, పురోగతిలో అడుగడుగునా చంద్రబాబు ముద్రలు కనిపిస్తుంటాయని గతంలో స్వయంగా చెప్పిన కేటీఆర్.. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలేమిటి? అంటూ మీడియా సమావేశంలో రుసరుసలాడారు కూడా.  ఆయన ఒక్క మాటతో తెలంగాణలోని ఆంధ్రసెటిలర్స్  భగ్గుమన్నారు. అప్పటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. ఈ పరిస్థితితో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయాయి. అంత వరకూ త్రిముఖ పోటీగా ఉన్న పరిస్థితి ఒక్క సారిగా ముఖాముఖీగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ పోటీలో ఉన్నట్లుగా కనిపించిన బీజేపీ సోదిలోకి లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. మోడీ మహబూబ్ నగర్ సభకు బీజేపీ సీనియర్లే డుమ్మా కొట్టారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో ఇట్లే అవగతం చేసుకోవచ్చు.  అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అనూహ్యంగా బలోపేతమైంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 40 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయడమే కాకుండా.. పాతిక స్థానాలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో తప్పులో కాలేసినట్లు గ్రహించిన చంద్రబాబు అరెస్టు విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోయినా గొంతు సవరించుకున్నారు. అలాగే మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం అనడం నుంచి చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం అంటూ మాట మార్చారు. అయితే అప్పటికే నివారించడానికి వీలు లేనంత నష్టం జరిగిపోయింది, తటస్థులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలరైజ్ అయిపోయారు. చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను నిలబెట్టిన విధానాన్నీ గుర్తు చేయడమే కాదు. అటువంటి నాయకుడి అరెస్టును ఖండిచే పాటి సంస్కారం, ధైర్యం లేని కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖాముఖీ పోరు అనివార్యమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పట్ల వ్యక్తమౌతున్న సానుకూలత బీఆర్ఎస్ కు తేరుకోలేని నష్టం చేకూర్చడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. జగన్ పట్ల వ్యతిరేకత చంద్రబాబు అరెస్టుకు ముందునుంచీ ఉన్నప్పటికీ ఆయన అక్రమ అరెస్టుతో ఒక్కసారిగా అది ద్విగుణీకృతం, అంతకంటే ఎక్కవ అయ్యిందని అంటున్నారు. ముఖ్యంగా తటస్థలు చంద్రబాబు అరెస్టుతో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గు ఎటువైపు అన్న విషయంలో స్పష్టత లేదనీ, ఇప్పుడు స్పష్టత వచ్చేయడంతో అధికార పక్షానికి వచ్చే ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ అంటున్నారు. అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గుతో సంబంధం లేకుండా వైసీపీ ఓటమి ఖాయమన్న విశ్లేషణలు చేసిన పరిశీలకులు అరెస్టు తరువాత తటస్థుల మొగ్గు తెలుగుదేశం వైపే అని ఖరారు కావడంతో అధికార పార్టీ పని ఇక అయిపోయినట్లేనని చెబుతున్నారు. పోలింగ్ రోజున ఎటు మొగ్గు చూపితే ఆటే గెలుపు.

చంద్రబాబు స్వ్యాష్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం (సెప్టెంబర్3) విచారణ జరగనుంది.  జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేవియెట్ దాఖలు చేసింది.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వెంటనే తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించారు. అయితే సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసి రిమాండ్ విధించింది. ఆ తరువాత చంద్రబాబు తరపున న్యాయవాదులు   ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో సిద్ధార్థ్ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే కూడా వాదనలు విన్పించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  వాస్తవానికి సుప్రీంకోర్టులో గత బుధవారమే   జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి అంటూ విచారణ నుంచి తప్పుకోవడంతో  విచారణ వాయిదా పడింది.   కేసు అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ముందు ప్రస్తావించారు.   ఇరువర్గాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేసు విచారణను మంగళవారం(అక్టోబర్ 3)కు వాయిదా వేశారు.  ఈ కేసు విచారణను జస్టిస్ నిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది.