వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి తప్పు చేసారా...!

  ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ ఏం చేసిందనేది కాసేపు పక్కనపెడితే, ప్రత్యేకహోదా సాధించనందుకు ప్రజలు బాధపడుతున్నారనేది వాస్తవం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, బీజేపీతో కలిసి పనిచేసింది.. బీజేపీ ప్రత్యేకహోదాకి బదులుగా అంతే సమానమైన ప్రత్యేకప్యాకేజీ ఇస్తానంది.. దానికీ టీడీపీ అంగీకరించింది.. కానీ బీజేపీ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా వెనకడుగు వేస్తుండటంతో.. టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకొని ప్రత్యేకహోదాకి పట్టుపట్టింది.. ఇప్పటికీ టీడీపీ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. మరోవైపు ఏపీ విపక్ష పార్టీ వైసీపీ, ప్రత్యేకహోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల చేత రాజీనామా చేయించింది.. అయితే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని, వైసీపీ రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శలు వినిపించాయి.. రాజీనామాల విషయంలో వైసీపీ నిర్ణయం తప్పని పార్లమెంట్ సాక్షిగా నిరూపించే అవకాశం టీడీపీకి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 10వరకు మొత్తం 18 రోజులు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లో పార్లమెంట్ సాక్షిగా టీడీపీ, బీజేపీ ని నిలదీయాలని చూస్తుంది.. అవసరమైతే బీజేపీ మీద అవిశ్వాసతీర్మానం పెట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టు తెలుస్తుంది.. కానీ వైసీపీకి ఆ అవకాశం లేదు.. ఎంపీల రాజీనామా వల్ల పార్లమెంట్లో రాష్ట్రం కోసం పోరాడే అవకాశం కోల్పోయింది.. మరో వైపు ఉపఎన్నికలకు కూడా ఆస్కారం లేదు.. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.. అలానే టీడీపీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద పోరాడితే.. వైసీపీ నిర్ణయం తప్పని ప్రజలకి అర్ధమవుతుంది అంటున్నారు.

రమణ దీక్షితులు ఇక సైలెంట్ అవుతారా

  శ్రీవారి ఆభరణాలు తరలించారంటూ, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొద్దిరోజుల నుండి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టీటీడీ, స్వామీ వారి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచి.. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చేసింది.. టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా పాలక మండలి సభ్యుల కోసం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించారు.. బోర్డు సభ్యులు వీటిని పరిశీలించారు.. శ్రీవారి ఆభరణాలు అన్నీ ఉన్నాయని, రూబీ ఒకటి పగిలిపోయిందని, దాని విలువ రూ. 50గా రికార్డులో నమోదు చేసి ఉందని తెలిపారు.. అలానే రమణ దీక్షితులు చెబుతున్న పింక్ డైమండ్ అసలు లేనే లేదని పేర్కొన్నారు. శ్రీవారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు..  తాజాగా అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయంపై బాబు స్పందించారు.. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై ప్రత్యేక కమిటీతో న్యాయ విచారణ చేపడతామని ప్రకటించారు.. ఆ కమిటీ ముందే, రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామని, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.. అదే విధంగా కొంతమంది లేని నగలు, డైమండ్లు పోయాయంటూ రాజకీయాలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు.. మొత్తానికి శ్రీవారి ఆభరణాల గురించి వస్తున్న ఆరోపణలకి టీటీడీ ఆభరణాల ప్రదర్శన చేసి ఆరోపణలు అవాస్తవమని నిరూపించడం అలానే టీడీపీ ప్రభుత్వం శ్రీవారి ఆభరణాల రక్షణకోసం కీలక నిర్ణయం తీసుకోవడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ జనసేన...!

  చిరంజీవి సామజిక న్యాయం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు.. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవడంతో, కాంగ్రెస్ లో విలీనం చేసారు.. చిరు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.. తరువాత పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. అదే సమయంలో చిరు సోదరుడు పవన్ జనసేన పార్టీ స్థాపించారు.. బీజేపీ,టీడీపీ పార్టీలకు మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. చిరు చిన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ, మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. పవన్ బీజేపీ,టీడీపీ పార్టీలకు దూరమై, సినిమాలకి బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నారు.  పవన్ అప్పుడప్పుడు ప్రజారాజ్యం సమయంలో అన్నయ్యని మోసం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా అని ఆవేశంగా మాట్లాడటంతో.. పవన్, చిరు కోసమే పార్టీ పెట్టాడని.. జనసేన, ప్రజారాజ్యానికి సీక్వెల్ అని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.. అయితే పవన్ వీటిని పట్టించుకోకుండా ప్రజల్లో తిరుగుతూ, వచ్చే ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. కానీ మరొక్కసారి చిరు ప్రజారాజ్యం తెరమీదకి వచ్చింది.. చిరు అభిమాన సంఘ సభ్యులకు ' గతంలో ప్రజారాజ్యానికి పనిచేసినట్టే, జనసేనకు పనిచేయాలని' మెసేజ్ లు వస్తున్నాయట.. ఈ వార్త బయటికి రావడంతో మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.. చిరు తెర వెనుక ఉండి జనసేన పార్టీ నడిపిస్తున్నాడు.. ఇప్పుడే తెరముందుకు వస్తే జనసేన మరో ప్రజారాజ్యంలా అవుతుందని ప్రజలు భావిస్తారు. అందుకే తమ్ముడిని తెర ముందు ఉంచి తెర వెనుక అంతా అన్నయ్య నడిపిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అభిమాన సంఘ సభ్యులకు మెసేజ్ లు అనే వార్తలో నిజమెంత ఉందో తెలీదు కానీ ఆ వార్త బయటికొచ్చినప్పటి నుండి జనసేన పార్టీ, తెరముందు పవన్, తెర వెనుక చిరు అంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి.. చూద్దాం మరి చిరు, పవన్ దీనిపై ఎలా స్పందిస్తారో.

తెలంగాణ కాంగ్రెస్ లో ఒకే కులానికి పెద్ద పీట

  ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెరాసని గద్దె దించి అధికారంలోకి రావాలని చూస్తుంది.. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చేలా ఉందని అధిష్టానం భయపడుతుంది.. సమిష్టిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, ఎవరికివారు పార్టీకి నేనే పెద్ద దిక్కు, నేనే సీఎం అవుతా అంటున్నారు.. దీనికితోడు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కొందరు, పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మార్చాలని మరికొందరు.. వీటితో ఏం చేయాలో పాలుపోక, పరిస్కార మార్గం కోసం అన్వేషణలో ఉన్న అధిష్టానానికి మరో షాక్..  సీనియర్ నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.. ఆయన పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీ తీరుపైన, నాయకత్వం పైన విమర్శలు చేసారు.. గ్రేటర్ లో ఏ పార్టీ కార్యక్రమం జరిగినా సొంత ఇంటి పనిలా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని, అలాంటిది గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే ఎవరెవరికో అనామకులకి టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని అన్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు.. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు.. అందుకే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని దానం అన్నారు..  ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య నిర్వహించిన బస్సు యాత్రలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలకే ప్రాధాన్యముందని, మిగతా సామాజిక వర్గానికి చెందిన నేతలకు అందులో చోటు లేదని విమర్శించారు.. ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నా కొందరు నేతలు ఆయన్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించిన దానం.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని , ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు.. మరి దానం చేసిన ఒకే సామాజిక వర్గ ఆధిపత్యం ఆరోపణలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  

ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో పొత్తుకు పవన్ సై అంటాడా?

  పవన్ కళ్యాణ్.. 2014 లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అంటూ బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసారు.. అనుకున్నట్టే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి.. పవన్ బీజేపీ, టీడీపీ లను విభేదించి ఒంటరిగా 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. హోదా ఇవ్వలేదని బీజేపీతో విభేదించిన పవన్, కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు బయటికొస్తున్నాయి.. ఇప్పుడిప్పుడే మోడీ మీద వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా మలుచుకొని మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నకాంగ్రెస్, ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది..  విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఏపీలో ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, ప్రత్యేకహోదా అంశంతో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.. ఇప్పటికే రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి చర్చించారు.. కాంగ్రెస్ నుండి వెళ్లిపోయిన బలమైన నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేలా చూడాలన్నారు.. రాహుల్ ఏపీ మీద ప్రత్యేకదృష్టి పెట్టడంతో ఏపీ కాంగ్రెస్ నేతల్లో నూతనుత్తేజం వచ్చి పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు.. ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడొక భేటీ అందరిని ఆశ్చర్య పరుస్తుంది..  అదే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పవన్ భేటీ.. కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శలు చేసిన పవన్.. ఇప్పుడు కాంగ్రెస్ నేతతో భేటీ అవడంతో అందరు షాక్ అవుతున్నారు.. ప్రత్యేకహోదా కోసం పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ప్రధాన జాతీయ పార్టీలు రెండు.. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్.. బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా నిరాకరించింది.. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తా అంటుంది..అందుకే, పవన్ కాంగ్రెస్ కి మద్దతిచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ భావన.. మరి పవన్ ప్రత్యేకహోదా కోసం తన పంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటారో లేదో చూద్దాం.  

కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి కాంగ్రెస్ లోకి వస్తారా?

  ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్, ఐతే అధికారంలో ఉండేది లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండేది.. కానీ రాష్ట్ర విభజన తరువాత 'ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉండేది' అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచింది.. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఏపీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. 2019 ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. విభజనకి ముందు కాంగ్రెస్ లో చాలామంది బలమైన నాయకులు ఉండేవారు.. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో..  చాలామంది కాంగ్రెస్ ని వీడి టీడీపీ,వైసీపీ,బీజేపీ పార్టీలలో చేరారు.. ఇక కొందరు నాయకులైతే అసలు రాజకీయాలకే దూరమయ్యారు..  అతి కొద్దిమంది నాయకులు మాత్రమే వేరే పార్టీలలో ఇమడలేమనో లేదా ఎప్పటికైనా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశతోనో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కాస్త వ్యతిరేకత మొదలవడంతో, కాంగ్రెస్ లో ఉత్సాహం మొదలైంది.. 2019 లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తూ.. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.. అలానే ప్రాంతీయ పార్టీలతో దోస్తీకి సిద్ధమైంది.. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. పార్టీని వీడిన సీనియర్ నాయకులని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది..  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట.. అలానే కాంగ్రెస్ నుండి మిగతా పార్టీలకు వెళ్లిన నేతలని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట.. అలానే 'తప్పనిసరి  పరిస్థితుల్లో విభజన జరిగింది.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారట.. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులు ధైర్యం చేసి తిరిగి కాంగ్రెస్ కి రావడం.. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఓటెయ్యడం కష్టమే' అంటున్నారు విశ్లేషకులు.. చూద్దాం ఏం జరుగుతుందో.  

అలక వీడిన గంటా

  ఏపీ రాజకీయాల మీద ఒక తెలుగు న్యూస్ ఛానల్ లగడపాటి టీంతో కలిసి సర్వే చేయించిన విషయం తెలిసిందే.. ఈ సర్వే, మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది కానీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిలో ఓడిపోతారని చెప్పింది.. దీనితో మిగతా టీడీపీ నేతలు హ్యాపీగా ఉన్నా, గంటా మాత్రం హ్యాపీగా లేరు.. ఈ సర్వే వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉంటున్నారు.. దీనికి తోడు గంటా టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొచ్చాయి.. అయితే ప్రస్తుతానికి ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోనున్నాయి..  ఎందుకంటే గంటా అలక వీడారు.. పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పచ్చజెండా ఊపారు.. ఈ రోజు భీమిలి నియోజక వర్గంలో చంద్రబాబు పర్యటన ఉంది.. ఆ నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా పాల్గొనకపోతే బాగుండదని భావించిన బాబు, మంత్రి చినరాజప్పను గంటా ఇంటికి పంపారట.. అలానే బాబు గంటాతో ఫోన్లో స్వయంగా మాట్లాడారట.. "అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? రాజకీయాల్లో ఇవి సహజం.. నా మీద రోజూ ఏవేవో వార్తలొస్తాయి..  అంతెందుకు ఆ సర్వేలో కొన్ని నియోజక వర్గాల్లో నా పనితీరు కూడా బాలేదని అభిప్రాయపడినట్టు వచ్చింది.. వీటిని మనం ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని ముందుకు వెళ్తుండాలి అంతేకాని ఇలా ముభావంగా ఉండకూడదు" అని బాబు, గంటాకు ఫోన్ లో ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది.. దీంతో గంటా అలక వీడి సీఎం పర్యటనలో పాల్గొనడానికి ఒప్పుకున్నారు.  

తెలంగాణ కాంగ్రెస్.. ఉత్తమ్ పదవి ఊడుతుందా?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో ప్రతిపక్షానికి పరిమితమైంది.. ఇక ఏపీలో అయితే పార్టీ పరిస్థితి దారుణం, ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మునుపటిలా కాంగ్రెస్ పార్టీ వెలిగేలా చేయాలని అధిష్టానం భావిస్తుంది.. దానికి తగ్గట్టే రోజురోజుకి తెలంగాణలో పార్టీ బలపడుతూ బలమైన ప్రతిపక్షంగా ఉండటమే గాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అధిష్టానానికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఏర్పడింది.. అయితే ఇప్పుడు ఆ నమ్మకం భయంగా మారుతున్నట్టు తెలుస్తుంది.. దానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు.. ఒకవైపు కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడట్లేదు.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాల్సింది పోయి, నేను సీఎం అంటే నేను సీఎం అని చెప్తూ పోటీపడుతున్నారు.. దీనికితోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ని తొలిగించాలని కొందరు.. ఇవన్నీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. రీసెంట్ గా రాహుల్ జన్మదినం సందర్బంగా కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ మీద ఫిర్యాదు చేశారట.. ఉత్తమ్ పార్టీలోని మిగతా నేతలని పట్టించుకోకుండా అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అందుకే ఉత్తమ్ స్థానంలో వేరొకరిని పీసీసీ చీఫ్ గా నియమించాలని కోరారట.. ఇది విని రాహుల్ ఆలోచనలో పడ్డారట.. ఇప్పటికే ఉత్తమ్ మీద పార్టీ పదవుల నియామకాల లిస్ట్ విషయంపై ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇక రాహుల్ తెలంగాణపై దృష్టి పెట్టబోతున్నారట.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు తొలిగించాలని చూస్తున్నారట.. మరి రాహుల్ ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగిస్తారా? లేక వేరే పరిస్కారం ఏమైనా చూపుతారో చూడాలి.. ఇదిలా ఉంటే ఉత్తమ్ మాత్రం మా పార్టీలో విభేదాలు లేవు, అంతా కలిసే ఉన్నాం అంటున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.

శ్రీవారి గుప్త నిధులకు దారి చెప్తున్న రమణదీక్షితులు

  వెంకటేశ్వర స్వామి.. కలియుగ దైవం.. 'మేం చేసిన పాపాలకు మన్నించు, మా చుట్టూ ఉన్న పాపాత్ముల నుండి రక్షించు' అని అని వేడుకుంటాం.. కానీ పాపం ఈ మధ్య ఆ వెంకన్నకు కూడా కష్టాలు వస్తున్నాయి.. ఆయన చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి..  మనుషులకి కష్టం వస్తే దేవుడికి మొరపెట్టుకుంటాం.. మరి దేవుడికే కష్టం వస్తే, మనుషులం మాట్లాడుకోవడం తప్ప ఏం చేయగలం.. గత కొన్నిరోజులగా ఏపీ రాజకీయాల్లో వెంకన్న పేరు బాగా వినిపిస్తుంది.. దానికి కారణం టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు.. వయస్సు పరిమితి నిబంధనతో ఏపీ ప్రభుత్వం, రమణ దీక్షితులుని పదవి నుండి తొలగించింది..  అప్పటినుండి ఇక దీక్షితులు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.. శ్రీవారి సన్నిధిలోని విలువైన ఆభరణాలు తీసుకున్నారని ప్రభుత్వం మీద, అక్రమాలు చేస్తున్నారని పాలకమండలి మీద ఆరోపణలు చేసారు.. అయితే రమణదీక్షితులు వెనక విపక్షాలు ఉండి ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాయని ప్రభుత్వం కూడా ధీటుగా ఆరోపణలు చేసింది.. ఇప్పడు రమణ దీక్షితులు శ్రీవారి గుప్త నిధుల రహస్యాల గురించి చెప్పారు.. అంతేకాదు ఆ గుప్త నిధులకోసం తవ్వకాలు జరిగాయని కూడా ఆరోపించారు.. ఇంతకీ దీక్షితులు ఏమన్నారంటే.. మూడవ మహారాజు విజయనగర సామ్రాజ్యాధిపతి తిరుమలరాయల వారు, కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడు ఇలాంటి రాజులు అప్పట్లో శ్రీవారికి రత్నాలు, బంగారు ఆభరణాలు, విగ్రహాలు ఇలా చాలా సంపద సమర్పించారు..    ఆ సంపదంతా నేల మాళిగలో భద్రపరిచారు.. ఆ నేల మాళిగ వంటశాల దగ్గర్లో ఉంది.. గతేడాది స్వామి వారి లోపలి పోటును మూసేసారు.. ఎందుకు ముసారని అడిగితే,  నాలుగు రాతి బండలు పగిలాయని కొద్ది రోజులు పోటు మూసివేశామని జేఈఓ చెప్పారు.. కానీ ప్రధాన అర్చకులకు కూడా చెప్పకుండా పోటు ఎందుకు మూయటం జరిగింది.. గుప్త  నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉండొచ్చు.. నా ఆరోపణలకు స్పందించాలి అని రమణ దీక్షితులు అన్నారు.. అంతా బాగానే ఉంది గాని ఇలా స్వామి వారి గుప్త నిధుల ఉన్న ప్రదేశం గురించి బయటపెట్టడం ఎంత వరకు సబబు దీక్షితులు గారు.. ఆ నిధులకి ఇప్పుడు రక్షణ కల్పించడం ఇంకా కష్టమవుతుంది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.. ఏంటో ఇదంతా, ఆ వెంకన్నకే తెలియాలి.  

జగన్‌ను భయపెడుతున్న అమరావతి

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏంటా అని అందరూ ఆలోచిస్తుండగా.. చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి అని చెప్పారు, అలానే అమరావతిని ప్రపంచంలోని ప్రముఖ రాజధానుల్లో ఒకటిగా నిలుపుతానని మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారమే ప్రపంచ స్థాయి కంపెనీల చేత అమరావతి డిజైన్లు వేయించారు.. గొప్ప రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇదంతా బాగానే ఉంది.. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? రాజధానిగా అమరావతి ఉంటుందా? లేక కొత్త రాజధాని తెర మీదకు వచ్చి మళ్ళీ రాజధాని వ్యవహారం మొదటికొస్తుందా? అంటూ ఏపీ ప్రజల్లో భయం మొదలైంది.. ఆ భయం వెనుక కూడా కారణం ఉందిలేండి.  జగన్ మొదటినుండి అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. రాజధానిగా అమరావతి భూమి పూజ కార్యక్రమానికి  దేశ వ్యాప్తంగా ఎందరో నేతలొచ్చారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం రాలేదు.. అదీగాక జగన్ పలు సందర్భాల్లో అమరావతి గురించి తన వైఖరి వెల్లడించారు.. రాజధాని నిర్మాణం కోసం రైతులిచ్చిన భూములను తాను అధికారంలోకి రాగానే తిరిగిస్తానని జగన్ అన్నారు.. దీన్నిబట్టి జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉండటం కష్టం, రాజధాని వ్యవహారం మళ్ళీ మొదటికొస్తుందని ప్రజల్లో భయం మొదలైంది.. అయితే ఇప్పుడు అమరావతి భయం జగన్ లో కూడా మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అందుకే జగన్ ఆచి తూచి మాట్లాడుతున్నాడట.. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేదు.. జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధానిని మారుస్తా అంటే.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని ప్రజలంతా జగన్ కి వ్యతిరేకమవుతారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశలకు జగన్ గండి కొట్టాడన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది.. ఇది రాజకీయంగా జగన్ కి చాలా దెబ్బ.. అందుకే ఇప్పుడు జగన్ అమరావతి విషయంలో సతమతం అవుతున్నాడట.. రాజధాని మారుస్తా అంటే రెండు జిల్లాల్లో అసలు పార్టీనే లేకుండా పోయే ప్రమాదం ఉంది, మరో వైపు రాష్ట్ర అభివృద్ధి మరో ఐదేళ్లు వెనక్కెళ్తుందని యువత జగన్ ని వ్యతిరేకించే ప్రమాదం ఉంది.. పోనీ అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటే మాట తప్పినట్టు ఉంటది, అదీకాక బాబు సెలెక్ట్ చేసిన రాజధాని కాబట్టి జగన్ కి మనస్సు ఒప్పదు.. అందుకే జగన్ అమరావతి విషయంలో సతమతమవుతూ కాస్త భయపడుతున్నాడట.. చూద్దాం మరి అమరావతి విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తాడో.  

కశ్మీర్‌ టూ పీఎం చైర్ వయా అయోధ్య

అర్జునుడి గురి పిట్ట కన్ను అన్నట్టుగా, ప్రస్తుతం మోడీ గురి 2019 లో మళ్ళీ అధికారం సాధించటం మీద ఉంది.. ఇప్పటికే అధికారం కోసం మోడీ ఏదైనా చేస్తాడనే ఆరోపణలు వస్తున్నాయి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మోడీ చర్యలు చూసి కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. గుజరాత్ సీఎంగా చేసిన మోడీ, 2014 ఎన్నికల్లో బీజేపీ తరుపున పీఎం అభ్యర్థి స్థాయికి ఎదిగారు.. 'కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలతో దేశాన్ని దోచుకుంది, మేం అధికారంలోకి వస్తే దేశానికి మంచిరోజులు వస్తాయి' అంటూ మోడీ ప్రజల్లోకి వెళ్లారు.. అనుకున్నట్టే పీఎం అయ్యారు.. మొదట్లో అంతా బానే ఉంది.. కానీ తర్వాతర్వాత మోడీ మీద వ్యతిరేకత మొదలైంది.. నోట్లరద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధర ఇలాంటి వాటితో ప్రజలకి దూరమవుతున్న మోడీ, మరో వైపు దేశమంతటా బీజేపీని విస్తరింప చేయాలన్న ఆశతో మిత్ర పక్షాలకు దూరమయ్యాడు, కొన్ని ప్రాంతీయ పార్టీలకు శత్రువయ్యాడు. అసలే ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా లేదు.. ఇలా రోజురోజుకి అందరిలో వ్యతిరేకత వస్తే 2019 లో అధికారం కూడా దూరమవుతుంది.. అసలే అధికారం కోసం ఏదైనా చేస్తాడని మోడీ మీద ఆరోపణలు ఉన్నాయి.. అధికారం కోసం మోడీ కశ్మీర్‌ సాక్షిగా తన మార్క్ రాజకీయాన్ని స్టార్ట్ చేసారని విశ్లేషకులు అంటున్నారు.. బీజేపీ వ్యూహాత్మకంగానే కశ్మీర్‌ లో మెహబూబా సర్కార్ కి మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తుంది.. రోజురోజుకి కశ్మీర్‌ లో అల్లర్లు పెరుగుతున్నాయి.. ఇది బీజేపీ వైఫల్యం కిందకి వస్తుంది.  ఈ ప్రభావం ఎన్నికల మీద పడుతుందని భావించి బీజేపీ ముందే బయటికొచ్చింది అంటున్నారు.. అలానే దేశ ప్రజల దృష్టి పడేలా, సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాక్ ఉగ్రమూక మీద బీజేపీ ప్రభుత్వం దాడులు చేయించాలని చూస్తుందట.. దీని వల్ల ప్రజల్లో బీజేపీ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది.. అలానే అయోధ్యలో రామజన్మభూమి సెంటిమెంట్ తో కూడా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుందట.. మొత్తానికి బీజేపీ  జాతీయవాదం, రామ సెంటిమెంట్ తో 2019 ఎన్నికల వైపు అడుగులు వేయాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.. చూద్దాం మరి మోడీ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.

బీజేపీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా

  వేరే పార్టీల్లో ఉన్న వ్యక్తులు, రాజీనామా చేసి అధికారంలో ఉన్న పార్టీలోకి రావడం కామన్.. కానీ ఓ వ్యక్తి అధికారంలో ఉన్న బీజేపీకే రాజీనామా చేసి షాకిచ్చాడు.. బీజేపీ జాతీయ కార్యదర్శి 'రామ్ మాధవ్' ప్రచార బృందంలో 'శివం శంకర్ సింగ్' అనే వ్యక్తి ప్రముఖ పాత్ర పోషించాడు.. 2014 లో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసాడు.. ఇప్పుడు 'నేను మోడీ మాయలో పడి తప్పు చేశాను' అంటూ బీజేపీకి రాజీనామా చేసి మోడీ మీద, పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసాడు.. 2013 లో మోడీ అభివృద్ధి మంత్రాన్ని నమ్మాను, దేశ  రాజకీయాల్లో మోడీ ఒక ఆశాకిరణంలా కనిపించారు.. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది.. నాలుగేళ్ళ మోడీ పాలనలో మంచికంటే చెడే ఎక్కువ జరిగింది.. బీజేపీ ప్రచార వ్యూహాలతో ప్రజల్ని మభ్యపెడుతుంది.. ప్రజలు గుడ్డిగా నమ్మి వీటి మాయలో పడొద్దు అంటూ శంకర్ సింగ్ వ్యాఖ్యానించాడు.. అలానే నోట్ల రద్దు పెద్ద వైఫల్యమని తెలిసినా బీజేపీ ఒప్పుకోదని, నోట్లరద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని శంకర్ అన్నాడు.. జీఎస్టీ కూడా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారని, ఇప్పటికీ గందరగోళంగానే ఉందని విమర్శించాడు.. సిబిఐ, ఈడీలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని.. మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి మీద వెంటనే దాడులు జరుగుతాయని ఆరోపించారు.. శివం శంకర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేయడమే గాక వెళ్తూ వెళ్తూ ఘాటు విమర్శలు చేయడంతో బీజేపీ నాయకులు షాక్ తిన్నట్టు తెలుస్తుంది.  

కేసీఆర్ ప్లాన్ అదిరింది.. మరి మోడీ మద్దతిస్తాడా?

  ఈ మధ్య కేసీఆర్, మోడీని కలిసి వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి భేటీలో కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యలే చర్చకు వచ్చాయా? లేక రాజకీయాలు కూడా చర్చించారా? అంటూ అందరూ గుసగుసలు ఆడుకున్నారు.. నిజంగానే ఆ భేటీలో కేసీఆర్, మోడీలు రాజకీయాల గురించి కూడా చర్చించుకున్నారంటూ ఒక వార్త బయటికి వస్తుంది.. ఐతే ఆ రాజకీయ చర్చ 'రాష్ట్రంలో మీరు మద్దతివ్వండి, కేంద్రంలో మేం మద్దదిస్తాం' ఇలాంటి వాటి గురించి కాదంట.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్‌ పదవీ కాలం ముగియడంతో త్వరలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది.. రాజ్యసభ సభ్యుల సంఖ్య 245 లో 4 సీట్లు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే 121 బలం కావాలి.. బీజేపీ, కాంగ్రెస్ లకు పూర్తి బలం లేదు.. దాంతో వేరే పార్టీల మద్దతు ఈ రెండు పార్టీలకి కచ్చితంగా కావాల్సిందే..  ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకొని, ఎవరికి వారు తాము బలపరిచిన అభ్యర్థే గెలవాలని చూస్తున్నాయి.. ఇక మోడీ అయితే కాంగ్రెస్ కి షాక్ ఇవ్వాలని అవసరమైతే తనకి సానుకూలంగా ఉన్న పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని చూస్తున్నాడట.. ఇదే కేసీఆర్ పాలిట వరంగా మారింది.. తెరాస తరుపున అభ్యర్థిని నిల్చోబెట్టి మోడీ మద్దతుతో గెలవాలని చూస్తున్నారట.. అభ్యర్థిగా సీనియర్ నేత ఎంపీ కేశవరావు పేరు కూడా వినిపిస్తుంది.. ఇదే విషయం కేసీఆర్, మోడీతో భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది.. మోడీ కూడా భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది.. మరి మోడీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెరాసకు మద్దతు తెలుపుతారా?..  ఒకవేళ తెలిపినా, అప్పటికీ తెరాసకి పూర్తి మెజారిటీ రాదు, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు కూడా తప్పనిసరి.. మరి ఆ పార్టీలు తెరాసకు మద్దదిస్తాయా?.. అసలింత జరుగుతుంటే కాంగ్రెస్ సైలెంట్ గా ఎందుకుంటుంది.. ఒకవైపు దేశ స్థాయిలో బీజేపీ ప్రత్యర్థి, మరోవైపు తెలంగాణాలో తెరాస ప్రత్యర్థి.. మరి ఈ రెండు ప్రత్యర్థులు కలిసి డిప్యూటీ చైర్మన్ పదవి తన్నుకుపోతుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? బీజేపీయేతర శక్తులన్నిటినీ ఏకం చేయదు.. ప్రస్తుతం కాంగ్రెస్ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.. చూద్దాం మరి కేసీఆర్ అనుకున్నట్టు మోడీ మద్దతుతో తెరాస డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుందో లేక కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు షాక్ ఇస్తుందో త్వరలోనే తెలుస్తుంది.  

బీజేపీకి షాక్ ఇచ్చే దిశగా బాబు

  ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ బాబు ఎన్డీయే నుండి బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అలానే టీడీపీ,బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే బాబు 2019 లో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే శాంపిల్ గా బీజేపీకి ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.. అదేంటంటే.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక త్వరలో జరగనుంది.. ఆ ఎన్నిక సాక్షిగా బాబు తన సత్తా చూపబోతున్నట్టు తెలుస్తుంది.. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా.. 4 ఖాళీ ఉండటంతో ప్రస్తుతం ఆ సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే కనీసం 121 ఓట్లు కావాలి.. బీజేపీకి సొంత బలం 80 .. మిత్రపక్షాలు, మరికొన్ని పార్టీల మద్దతు ఉంటే తప్ప బీజేపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో విజయం సాధించలేదు.. అందుకే బాబు బీజేపీకి ఇప్పుడొక షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక త్రాటి మీదకు తీస్కొచ్చి.. బీజేపీని ఓడించాలి అనుకుంటున్నారట.. బాబుకి జాతీయ స్థాయిలో మంచి పేరుంది.. జాతీయ నేతలు, వివిధ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి.. బాబు తలుచుకుంటే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడం పెద్ద కష్టం కాదు.. ఇక బీజేపీని గద్దె దించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అంటే సహజంగానే ముందడుగు వేస్తుంది..దీన్నిబట్టి చూస్తే రాజ్యసభ సాక్షిగా బాబు, బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.  

మోడీ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించిన బాబు

  ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం, కేంద్రం మీద విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.. అయితే అవకాశం దొరికితే కేంద్రాన్ని డైరెక్ట్ గా అడగాలని చూస్తున్న బాబుకి, నీతి ఆయోగ్ రూపంలో అద్భుత అవకాశం దొరికింది.. ఇంకేముంది మోడీ సాక్షిగా బాబు కేంద్రాన్ని అడిగేసారు.. మాట్లాడటానికి 7 నిమిషాలే సమయం అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బాబు ప్రసంగాన్ని ఆపే ప్రయత్నం చేసారు.. అయినా బాబు వినకుండా ఏపీకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడటానికి ఎక్కువ సమయం కావాలంటూ సుమారు 20 నిమిషాలపాటు ప్రసంగించారు.. ఏపీ ప్రజలు విభజన కోరుకోలేదని, విభజన ఏకపక్షంగా జరిగి ఏపీకి అన్యాయం జరిగింది అన్నారు. ప్రత్యేకహోదా మరియు విభజన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అన్న బాబు.. గత ప్రధాని ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నారు, బీజేపీ కూడా ఎన్నికల సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తానని మాట ఇచ్చింది.. ఆ మాట ప్రకారం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అంటూ బాబు సూటిగా చెప్పారు.. అలానే విభజన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాల్సిందే అంటూ పట్టు పట్టారు.. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున.. భూసేకరణ, పునరావాసం, నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని.. అలానే ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం తిరిగి చెల్లించాలంటూ స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణానికి 20 ఏళ్లలో 5 లక్షల కోట్లు అవసరమని, కానీ కేంద్రం ఇప్పటివరకు కేవలం 1500 కోట్లతో సరిపెట్టుకుంది అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేసారు.. అలానే ఏపీలోని వెనకబడిన జిల్లాలను ఆదుకొనే విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించిన బాబు, ఈ ఏడాది వెనకబడిన జిల్లాల కోసం ఖాతాలో జమ చేసిన 350 కోట్లను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తూ బాబు కేంద్రంపై మండిపడ్డారు.. ఏపీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దానికి కేంద్రం కూడా సహకరించాలని కోరారు.. మొత్తానికి మోడీ సాక్షిగా నీతి ఆయోగ్ లో బాబు కేంద్రాన్ని గట్టిగానే అడిగారన్నమాట.

మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్

  గత ఎన్నికలు మిగిల్చిన అనుభవాలు, ఉపఎన్నికల ఫలితాలు తెచ్చిన ఆశలతో.. మోడీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. మొన్నటివరకు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిన కాంగ్రెస్ ఇప్పుడు మోడీని గద్దె దించడమే లక్యంగా సాగుతుంది.. బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి దూరమవుతున్నాయి.. ఇదే కాంగ్రెస్ పాలిట వరంలా మారనుంది.. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతూ, ప్రజలకి దగ్గరవ్వాలని చూస్తుంది.. మోడీకి చెక్ పెట్టేందుకు అవసరమైతే ఒక మెట్టు దిగైనా ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది.. దానిలో భాగంగానే వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీచేయనుంది.. అంతేకాదు ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ స్థానాలు సర్దుబాటు చేసి, కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్టు తెలుస్తుంది.. విశ్లేషకుల అంచనాల ప్రకారం కాంగ్రెస్ కేవలం 200 నుండి 250 లోక్ సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయబోతోందని, ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోవడమే కాకుండా, వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మోడీకి చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్ వేసిందని అంటున్నారు.. ప్రాంతీయ పార్టీలతో కలిసి మోడీకి చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.  

బీజేపీ మాస్టర్ ప్లాన్.. ముందస్తు ఎన్నికలు?

  2014 వరకు ఒక లెక్క 2014కి ఒక లెక్క అన్నట్టుగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది.. మోడీ పీఎం అయ్యాడు.. తర్వాత బీజేపీ ఇంకా బలపడుతూ వచ్చింది.. మోడీ, అమిత్ షా సాయం తో బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా చేయాలనుకున్నాడు.. దీంతో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు కోలుకోవడం కష్టం అనుకున్నారు.. మళ్ళీ మోడీనే పీఎం అవ్వడం ఖాయం అనుకున్నారు.. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవ్ కదా.. బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.. మిత్రపక్షాలు దూరమయ్యాయి.. ప్రజల్లో బీజేపీ మీద రోజురోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. అందుకే బీజేపీ ఆలోచనలో పడింది.. వ్యతిరేకత పెరిగితే ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్న భయంతో మాస్టర్ ప్లాన్ వేసింది.. ఆ ప్లానే ముందస్తు ఎన్నికలు.. ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది.. ఇప్పటికే ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ మీద ఏర్పడిన వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.. దీనికితోడు త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడుతుంది.. ఆలస్యం అవుతున్న కొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భావించిన బీజేపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుందట.. వచ్చే ఏడాది మధ్యలో జరగాల్సిన ఎన్నికలని ఈ ఏడాది చివరికి నిర్వహించాలని చూస్తుందట.. మరి బీజేపీ మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందో లేదో భవిష్యత్తులో తెలుస్తుంది.  

మూడో స్థానంలో ఏపీ.. ఆరో స్థానంలో తెలంగాణ

  తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, ఏపీలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రచార అస్త్రం 'జాబు రావాలి అంటే బాబు రావాలి'.. ఈ మాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది.. ప్రజలు కూడా అనుభవం, తెలివితేటలున్న బాబు సీఎం అయితే 'యువతకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది' అని నమ్మి బాబుని గెలిపించారు.. మరి బాబు ఈ నాలుగేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా?.. ఈ ప్రశ్న ప్రతిపక్షాలను అడిగితే బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు అంటూ జోకులేస్తారు.. లేదా యువతకి ఉద్యోగాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందంటూ ఆరోపిస్తుంటారు.. కానీ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తెలుస్తుంది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగాల కల్పనలో ఏపీ మూడో స్థానంలో ఉంది.. ఇది ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాదు.. లోక్ సభలో కేంద్రమంత్రి చెప్పిన లెక్కలు.. ఉద్యోగాల కల్పనలో కర్ణాటక, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఏపీ మూడో స్థానంలో ఉందట.. తరువాతి రెండు స్థానాల్లో గుజరాత్, తమిళనాడు ఉండగా తెలంగాణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నట్టు తెలుస్తుంది.. ఏపీ మూడో స్థానంలో ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం రాజధాని, సరైన వసతులు కూడా లేని ఏపీలో ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించి బాబు తానేంటో నిరూపించుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు..మరి కొందరైతే 'జాబు రావాలి అంటే బాబు రావాలి' అనే మాటను బాబు నిజం చేసారుగా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు

  టీడీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా పట్టుదలగా నిలబడి తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ.. అలాంటి పార్టీ, అసలు ఎన్నికల తరువాత లేకుండా ఎలా పోతుంది అనుకుంటున్నారా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు చెప్తున్నారు మరి.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 120 లోక్ సభ స్థానాలు గెలవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందని, అలానే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.. అంతేనా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశం లేదని, అసలు టీడీపీ పార్టీనే ఉండదని అన్నారు.. టీడీపీ ప్రభుత్వం మీద, నాయకుల మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకతను బీజేపీ అవకాశంగా మలుచుకొని రంగంలోకి దిగుతుందని అన్నారు.. అలానే ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు.. చంద్రబాబుకు గంగా యమున సరస్వతి పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని, గంగ ఎవరో యుమున ఎవరో సరస్వతి ఎవరో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమైందని, ఏపీలో టీడీపీకి, తెలంగాణాలో తెరాసకి గట్టిపోటీ ఇస్తామని అన్నారు.. చూద్దాం మరి బీజేపీ వ్యూహాలు ఫలించి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తుందో లేదో.