ఆ రెండు శాతం పన్నే ఆంధ్రాకు వరంగా మారనుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గురించి పాలకులే కాక ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అది చాలదన్నట్లుగా వేలకోట్ల రైతుల రుణాల మాఫీ కూడా ఒకటుంది. ఈ సమస్యలకు కనుచూపు మేర ఎటువంటి పరిష్కారం కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ ఎటువంటి ఫలితము కనబడటం లేదు. కానీ ప్రభుత్వానికి చిన్న ఉపశమనం కలిగించే విషయం ఒకటి వినబడుతోంది.   రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర, తెలంగాణాలు ఇప్పుడు ప్రత్యేక రాష్టాలుగా విడిపోయాయి గనుక, దేశంలో మిగిలిన రాష్ట్రాల మధ్య ఏవిధంగా 2శాతం అంతర్ రాష్ట్ర సెంట్రల్ సర్వీస్ పన్ను (సెంట్రల్ సర్వీస్ టాక్స్ లేదా సీ.యస్.టీ) ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలలో కూడా 2శాతం పన్ను వసూలు చేయబడుతుంది. ఇంతవరకు సమైక్య ఆంద్ర రాష్ట్రంలో మొత్తం 3లక్షల మంది వ్యాపారులు ఈ సీ.యస్.టీ టాక్స్ ను చెల్లిస్తున్నారు. వారిలో చాలా మంది హైదరాబాదు కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలో, ప్రధానంగా ఆంధ్రప్రాంతంలో వివిధ జిల్లాలలో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఆ మూడు లక్షలమంది వ్యాపారులు చెల్లించే 2 శాతం పన్ను మొత్తం రాష్ట్రప్రభుత్వానికే జమా అయ్యేది. కానీ ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినందున, హైదరాబాదు కేంద్రంగా చేసుకొని ఆంధ్రాతో వ్యాపారాలు చేస్తున్నవారు అదనంగా 2శాతం సీ.యస్.టీ. పన్ను చెల్లించవలసి వస్తుంది. అది కొన్ని లక్షల్లో ఉంటుంది గనుక, ఆ భారం తగ్గించుకొనేందుకు వారిలో చాలా మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ రిటర్న్స్ సమర్పించినట్లు సమాచారం.   జూన్ రెండు (అపాయింటడ్ డే) మొదలుకొని జూన్ 30వరకు ఆంద్రతో జరిపిన వ్యాపార లావాదేవీల రిటర్న్స్ జూలై20లోగా రిటర్న్స్ సమర్పించవలసి ఉంటుంది. ఇంతవరకు దాదాపు ఒకటిన్నర లక్షల మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ పేర్లను నమోదు చేయించుకొని రిటర్న్స్ సమర్పించినట్లు సంబందిత అధికారులు తెలుపుతున్నారు.   గతేడాది ఈ మూడు లక్షల మంది వ్యాపారుల వద్ద నుండి దాదాపు రూ.55,000 కోట్లు పన్ను వసూలు అయిందని, ఈసారి అది మరి కొంచెం పెరిగి దాదాపు రూ.60, 000కోట్లు వరకు చేరుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. అంటే మూడు లక్షల మంది వ్యాపారులలో సగం మంది ఆంధ్రాలో పన్ను చెల్లించు తున్నారంటే ఆ ఆదాయంలో దాదాపు సగం అంటే దాదాపు రూ.30, 000 కోట్లు ఆంధ్రా ఖాతాలోనే జమా అవబోతోందని స్పష్టమవుతోంది.   రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర, తెలంగాణాల ఈ ఆదాయ శాతాలు ఇంచుమించు 18:82 నిష్పత్తిలో ఉండవచ్చనే అంచనాలకు విరుద్దంగా రెండు రాష్ట్రాలకు సరిసమానంగా అంటే 50:50 శాతం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈనెల 20వ తేదీ సాయంత్రంతో వ్యాపారులు రిటర్న్స్ సమర్పించడం పూర్తవుతుంది గనుక అప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పన్ను ద్వారా ఎంత ఆదాయం సమకూరిందనే విషయంపై మరింత స్పష్టత వస్తుందని సంబంధిత అధికారులు చెపుతున్నారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చాలా మంచి కబురే కదా!

అగస్టా కుంభకోణంలో నిందితులపై కేసులు నమోదు

  గత పదేళ్ళ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీలేదు. కాంగ్రెస్ పాలనలో ఇటువంటివన్నీ చాలా సహజమని ప్రజలు కూడా భావించే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. మాటలకు, చేతలకు పొంతనలేని పరిపాలన సాగించి, దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి చివరికి తనే బలయిపోయింది. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గనుక ఆ పార్టీ హయాంలో జరిగిన లక్షల కోట్ల కుంబకోణాలను మాఫీ అయిపోవు. వాటి సూత్రధారులను విడిచిపెట్టేందుకు లేదు. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో అటువంటి అవినీతిపరులు, నేరస్తులు అందరూ చట్టసభలలో సభ్యులుగా ఉండటం, ఉన్నత పదవులలో కొనసాగుతుండటం చాలా కలవరం కలిగిస్తోంది.   రూ.3600 కోట్ల అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, గోవా గవర్నర్ బీవీ.వాంచూ వంటివారు కూడా ఉన్నారు. అందువల్లే గత యూపీఏ హయంలో ఈకేసుపై విచారణ నత్త నడకన సాగించారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఇటువంటి కుంభకోణాలన్నీ తుడిచిపెట్టుకోనిపోయేవి. కానీ కాంగ్రెస్ దురదృష్టమో లేక భారత దేశ ప్రజల అదృష్టమో కానీ సమర్దుడైన నరేంద్ర మోడీ ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టి, ఈ అవినీతి రాబందులపై చర్యలకు ఉపక్రమించారు. ఇంతకాలం కాంగ్రెస్ హస్తంలో పావులుగా మిగిలిపోయిన ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ మరియు సీబీఐలు, ఇప్పుడు అదే కాంగ్రెస్ అవినీతిని వెలికి తీసేపనిలో పడ్డాయి.   ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ అధికారులు అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో ప్రదాన నిందితులుగా అనుమానింపబడుతున్న భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, ఆయన బందువులు కొందరిపై, యురోప్ కు చెందిన కార్లో క్రీష్టియన్ మైఖేల్, గిడో హస్చ్ఇద్దరు వ్యక్తులపై విదేశీమారక చట్టాలు మరియు మనీ లాండరింగ్ చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడినట్లుగా రెండు వేర్వేరు కేసులు నమోదుచేసారు. వారితో బాటు చండీఘర్ కు చెందిన ఐ.డీ.యస్.ఇన్ఫోటెక్ మరియు ఏయిరో మాట్రిక్స్ అనే సంస్థలపై, ఇటలికీ చెందిన ఫైన్మెకానిక, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆగస్ట వెస్ట్ ల్యాండ్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసారు. ఈ హెలికాఫ్టర్ కొనుగోలు వ్యవహారాలలో ప్రధాన సాక్షిగా ఉన్న బీ.వీ వాంచూను కూడా నిన్న సీబీఐ అధికారులు విచారణ చేసారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా చేస్తున్న ఆయన విచారణ అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.   మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించేందుకు రూ. 3600 కోట్ల ఖరీదు చేసే 12 హెలికాఫ్టర్లను కొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఆ కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఇంగ్లాండ్ కు చెందిన ఆగస్ట హెలికాఫ్టర్ల సంస్థ భారతదేశంలో అనేకమంది ఉన్నతాధికారులు, వారి బంధువులు, రాజకీయ నాయకులకు ఏకంగా రూ.360కోట్లు లంచాలుగా చెల్లించినట్లు ఇటలీకి చెందిన ఒక ప్రభుత్వ విచారణ సంస్థ బయటపెట్టిన తరువాత కానీ దీని గురించి దేశంలో దర్యాప్తు సంస్థలకు సైతం తెలియలేదంటే ఈ అవినీతి వ్యవహారం ఎంతా ఎంత పకడ్బందీగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. ఇప్పుడు ఈ.డీ. మరియు సీబీఐ అధికారులు ఈ అవినీతి వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం హయాంలోనయినా దోషులకు శిక్షలు పడి, వారి నుండి ఆ డబ్బు తిరిగి వసూలు చేయగలిగితే ప్రభుత్వ సమర్ధతపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అలాకాక ఇప్పుడు కూడా ఏళ్ల తరబడి కేసును సాగదీసి చివరికి చెత్తబుట్టలో పడేస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది.

జగన్మోహన్ రెడ్డి మౌనమేల?

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంధ్ర, తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాక మునుపే వాటిని నిలదీయలనుకోవడం సబబు కాదు. కానీ అవి తప్పుడు నిర్ణయాలు తీసుకొంటుంటే తప్పకుండా ఎవరయినా విమర్శించవచ్చును. తను రోజూ మీడియా ముందుకు వచ్చి ఏవో రాజకీయ వ్యాఖ్యలు లేదా విమర్శలు చేయబోనని ఆయన ముందే తెలిపారు. అంతేకాక ఆయన ఇంతవరకు కనీసం పార్టీ నిర్మాణం కూడా చేసుకోలేదు.   కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ కృష్ణా జలాల విడుదల, ఫీజు రీయింబర్సుమెంటు, ఇంకా అనేక ఇతర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరిని ఎందుకు ఖండించడం లేదో ఎవరికీ తెలియదు. రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని భుజాలు చరుచుకొంటున్న వైకాపా, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో? అసలు ఇంతవరకు ఏ విషయంలో కూడా వారు ఎందుకు నోరు మెదపడం లేదో వైకాపా నేతలే చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతా ఉందో, 67అసెంబ్లీ, 9యంపీ సీట్లు గెలుచుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాపై కూడా అంతే ఉంటుంది.   ఒకవేళ వైకాపాయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకొని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఇదేవిధంగా నాగార్జున్ సాగర్ నుండి నీళ్ళువిడుదల చేయకుండా పేచీలు పెడితే, జగన్ ఇలాగే మౌనంగా ఊరుకోనేవారా? లేక నీళ్ళు విడుదల చేయమని కేసీఆర్ ని నిలదీసేవారా? అనే ప్రశ్నకు వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్ జవాబు చెప్పగలిగితే, వారిప్పుడు ఏవిధంగా స్పందించాలో వారికే తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పని కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనయినా పోరాడవలసి ఉంటుంది.   తెలంగాణాకు మద్దతు, రాష్ట్రవిభజన, సమైక్యాంధ్ర ఉద్యమం, కాంగ్రెస్, తెరాసలతో రహస్య అనుబందం వంటి విషయాలలో జగన్ ద్వంద వైఖరి అవలంబించినందునే, ప్రజలు వైకాపాను తిరస్కరించారు. కానీ ఆయన ఇంకా అదే వైఖరి కొనసాగిస్తే వైకాపా విశ్వసనీయతను పూర్తిగా కోల్పోవడం తధ్యం.

ఆంద్ర ప్రజలపై తెరాస ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు?

  తెరాస ప్రభుత్వం భూముల స్వాధీనం విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఇంతవరకు చట్ట విరుద్దంగా ఆక్రమింపబడిన భూములపైనే దాడులకు అనుమతి ఈయడంతో, సంబందిత వ్యక్తులు తప్ప ఇతరులెవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏపి.ఎన్.జి.ఓ. సంఘానికి గోపన్న పల్లె వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన 189 ఎకరాల భూమిని ఎటువంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో వారిని కోరుండి రెచ్చగొట్టినట్లయింది.   శేరీలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓ సురేష్ తమ సిబ్బందితో కలిసి వెళ్లి ఏపీయన్జీవోలకు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వారికి ఇల్లు కట్టుకోనేందుకు భూమి కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగనందున భూమిని స్వాదీనం చేసుకొంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ భూమిని ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇల్లు కట్టుకోనేందుకు ఇచ్చింది తప్ప, ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు రాయితీ మీద పరిశ్రమలో, వ్యాపార సంస్థలో పెట్టుకొనేందుకు అమ్మలేదు. ప్రభుత్వం ఏపీ యన్జీవో సంఘం సభ్యులందరికీ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా ఇచ్చింది. కానీ ఆ భూమి తమదంటూ వేరే కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం వలన, ఇతరత్రా కారణాల వలన ఉద్యోగులు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు. కానీ దానిని సాకుగా చూపి ఆంద్ర ఉద్యోగులకు కేటాయించిన భూములను తెరాస ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాదం కవ్వింపు చర్యే అవుతుంది.   వారం రోజుల క్రితం జీ.హెచ్.యం.సి. అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ లోకి జొరబడి కొలతలు తీసి, అది ఆక్రమింపబడిన స్థలంగా గుర్తులు వేయడంతో, వారి చర్యలను ఖండిస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై కోర్టు స్పందిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయనిదే ఎవరిపై చర్యలకు పాల్పడవద్దని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, శేరీలింగంపల్లి తహశీల్దార్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓలు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ప్రభుత్వోద్యోగులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొంటున్నామని ప్రకటించడంతో, ఏపీ యన్జీవోలు న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఒకవేళ వారు భూమిపై తమ హక్కులను కోర్టులో నిరూపించుకోగలిగి, వారి వాదనలతో కోర్టు కూడా ఏకీభవించినట్లయితే తెరాస ప్రభుత్వం అభాసు పాలవవచ్చును.   రెండు మీడియా చాన్నాళ్ళపై నిషేధం, నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు, నాగార్జున సాగర్ నుండి ఆంధ్రాకు నీటి విడుదలకు అభ్యంతరాలు, ఇప్పుడు ఎన్జీజీవోల భూములు స్వాధీనం వంటి తెరాస ప్రభుత్వం చర్యలన్నీ ఆంద్ర ప్రజలపై చాలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లే ఉన్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తరువాత కూడా రాజకీయ నేతల్లాగే వ్యవహరిస్తే దాని వలన వారే అప్రదిష్ట పాలవుతారు.

మున్సిపాలిటీ కబుర్లు

  ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడమని ప్రజలు అపోహపడుతుంటారు. కానీ ప్రజల చేత సేవ చేయించుకోవడమని రాజకీయనాయకుల అభిప్రాయం. ఎవరి అపోహలు వారివి, ఎవరి అభిప్రాయలు వారివి. గనుకనే ప్రతీ ఐదేళ్ళకోసారి వచ్చే ప్రజాస్వామ్య పుష్కరాలంటే అందరికీ ఉత్సాహం, ఆనందం పొంగి పొరలుతుంటాయి . ఈ మధ్యనే చాలా అట్టహాసంగా ముగిసిన ఆ పుష్కరాలలో ఓడలు బళ్లయ్యాయి బళ్ళు ఓడలయ్యాయి. అందువలన మధ్యలో మినీ పుష్కరాల వంటి ఏ మునిసిపల్ ఎన్నికలో వస్తే తప్ప అధికారంలో ఉన్నా లేకున్నా మరో ఐదేళ్ళవరకు అందరూ పంటి బిగువున ప్రజాసేవ చేసుకొంటూపోవలసిందే. తప్పదు మరి.   పెద్ద పుష్కరాలలో ప్రజాసేవకు చాలా గట్టి పోటీ ఉంటుంది గనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తప్పనిసరిగా కొందరితో బహిరంగంగా శత్రుత్వం, రహస్యంగా మిత్రత్వం పాటించవలసి వస్తుంటుంది. దానిని రాజకీయ ప్రత్యర్ధులు అపార్ధం చేసుకొన్నప్పటికీ, ప్రజలు మాత్రం సరిగ్గానే అర్ధం చేసుకోగలరు. కనుకనే ఆ పెద్ద పుష్కరాలు అలా ముగిసిపోయాయి. అయితే పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో అటువంటి ఇబ్బందులుండవు. వీధిలో ప్రజల ముందు ఒకరినొకరు బండబూతులు తిట్టుకొన్నప్పట్టికీ, అవసరమయితే మళ్ళీ ఆ తిట్టినవాళ్ళకే నిర్లజ్జగా మద్దతు ఇచ్చుకోవచ్చును, పుచ్చుకోవచ్చును. అప్పుడు కూడా ప్రజలేమీ అపార్ధం చేసుకోరు పాపం. ఎందుకంటే ప్రజాసేవ చేసేందుకు ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకొనే ధోరణి చాలా అవసరమని అందుకే వాటిలో కొన్నిటికి సహకార ఎన్నికలని పేరు పెట్టారని దృడంగా నమ్ముతుంటారు. అందుకే కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపా, తెరాసలు ఒకదానికొకటి సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలలో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, మేయర్ పదవులు తలా ఇన్నీ అంటూ పంచేసుకొన్నాయి.   ఇక ఇంతబాగా ఒకరికొకరు సహకరించుకొని పంపకాలు చాలా సజావుగా పూర్తి చేసేసుకొన్నారు గనుక రేపటి నుండి రాముడు-భీముడు, రామ్ ఔర్ శ్యామ్ లాగా ఒకరు భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని తిరుగుతూ ప్రజాసేవ...కాదు.. ప్రజలకి సేవ చేస్తారనుకొంటే అపోహే అవుతుంది. ముందుగా ‘మునిసిపాలిటీ జమా ఖర్చులపై చర్చ’ అంటూ చిన్నపాటి యుద్ధం మొదలుపెడతారు. జీవనదుల వంటి మురికి కాలువలు గురించి, గతుకుల మద్య అక్కడక్కడ కనబడే రోడ్ల గురించి, కరెంటు ఉన్నప్పటికీ వెలగని వీధి దీపాల గురించి ఏసి గదుల్లో కూర్చొని చర్చించమని ప్రజలు కోరితే, అంతసేపు కూర్చోలేక స్టాండింగ్ కమిటీలు వేసుకొని అందులో చేరిపోతుంటారు.   కమిటీలో సభ్యులయ్యాక వీధిలో దీపం ఎందుకు వెలగడం లేదు? కాలువలో ప్రవహించాల్సిన మురుగు నీరు రోడ్ల మీద ఎందుకు ప్రవహిస్తోంది? అంటూ ఎవరయినా పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేకపోతే చాలా నామోషీగా ఉంటుంది గనుక అధ్యయనం చేసేందుకు ఏ గోవాకో వీలయితే సింగపూరుకో శ్రమ అనుకోకుండా వెళ్లిరాక తప్పదు. ఎలాగు అంతేసే దూరాలు రోజూ వెళ్లి రాలేరు గనుక పనిలోపనిగా పెళ్ళాం బిడ్డలను కూడా తోడు తీసుకువెళితే అధ్యయనం ఆహ్లాదంగా సాగుతుంది. కానీ ఈవిషయంలో మాత్రం ప్రజలు అస్సలు సహించారు ఎందుకో మరి? “టాట్! మా డబ్బుతో విలాస యాత్రలు చేస్తారా?” అంటూ ఒంటికాలి మీద లేస్తుంటారు. కానీ ప్రజలకి గజినీలా షార్ట్ మెమొరీ లాస్ ఉంది గాబట్టి ఆ విషయాన్ని ఇట్టే మరిచిపోతారు గనుక వారితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇలా కడుపులో చల్ల కదలకుండా ఏసి గదుల్లో కూర్చొని వాడులాడుకొంటూ రోజులు దొర్లించేసినందుకు, చివారఖరు రోజున ఏ ల్యాప్ టాపో, మరొకటో బహుమానంగా పుచ్చుకొని ఇంటికి వెళ్లిపోవచ్చును. ఇప్పుడు చైర్ మ్యానులు, ఉమనుల ఎన్నిక కూడా పూర్తింది గనుక ఇక ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చును.

కాంగ్రెస్ మార్క్ సమీక్ష

  కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు సమావేశమయినా పార్టీ గురించే ఆలోచిస్తారు. పార్టీ గురించే మాట్లాడుకొంటారు. ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ‘పార్టీ ఓటమికి నువ్వే కారణమంటే...కాదు..నువ్వేనని’ కీచులాడుకొంటారు. ఆ తరువాత మనమెవరమూ కాదు ప్రతిపక్షాలే కారణమని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించుకొంటారు. పనిలోపనిగా పార్టీ ప్రక్షాళన గురించి కూడా మాట్లాడుకొంటారు. మంగళవారం డిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్ళిన టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఇవే విషయాలు మాట్లాడుకొన్నామని మీడియాకు తెలిపారు.   తెలంగాణా ఇచ్చినా పార్టీని గెలిపించలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకొంటున్నామని వీ. హనుమంత రావు స్వయంగా తెలిపారు. తెలంగాణా ఇచ్చినపుడే పార్టీని గెలిపించలేని వారు, ఐదేళ్ళలో తెరాస ప్రభుత్వం అభివృద్ధి సాధించి చూపిస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ వయసుడిగిన నేతలు ఏవిధంగా గెలిపిస్తారో, సోనియా గాంధీ కనుగొన్నారో లేదో తెలియదు. కానీ షరా మామూలుగానే ఆంధ్రా, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు భూటకపు హామీలు గుప్పించడం వలనే ప్రజలు కాంగ్రెస్ ను కాదని వారికి ఓటేయడంతో ఓడిపోయామని సర్ది చెప్పుకొన్నారు. అంతేగాక టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల శల్యసారధ్యం కారణంగా కూడా పార్టీ ఓడిపోయిందని అందరూ అభిప్రాయపడిపోయారు. అందువల్ల పొన్నాలను ఇప్పటికయినా ఆ పదవిలో నుండి తప్పించి తమవంటి సీనియర్లకు అవకాశం ఇస్తే, ‘నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా!’నన్నట్లు వచ్చే ఎన్నికలలో పార్టీని తప్పకుండా గెలిపించుకొంటామని అందరూ సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. శాసనమండలిలో 15మంది సభ్యులున్నప్పటికీ, తమ అభ్యర్ధిని మండలి చైర్మన్ గా గెలిపించుకోలేనివారు, పార్టీ సభ్యులు గోడదూకి వెళ్లిపోతుంటే ఆపలేనివారు, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల వరకు పార్టీని బ్రతికించి ఉంచగలరా? అని సోనియాగాంధీ ప్రశ్నించారో లేదో కూడా తెలియదు. కానీ పార్టీ ఓటమిపై సమీక్ష జరిగింది.

జైసపా దుఖాణ్ బంద్

  సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి, రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన అధిష్టానాన్ని ముప్ప తిప్పలు పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ప్రజలకు మొహం చూపించలేని దుస్థితిలో ఉన్నారు. ఆది నుండి అందరితో కయ్యమే తప్ప నెయ్యం ఎరుగని ఆయనను నేడు పలుకరించేవారే లేరు. రాష్ట్ర విభజన అంశం మొదలుకొని కాంగ్రెస్ ను వీడి జైసపా స్థాపన, నామినేషన్ వేయకపోవడం వరకు వరుసగా అన్ని తప్పులే చేసుకొంటూ ముందుకు సాగిన ఆయన చివరికి పార్టీ పెట్టిన మూడు నాలుగు నెలలోనే మూసేసుకోవలసి వచ్చింది.   ఎటువంటి రాజకీయానుభవము లేని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమాద్మీ పార్టీని పెట్టి ఏడాది పాటు దిగ్విజయంగా నడిపించి జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించి డిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని దాదాపు ఏడాదిపైనే నడిపించి కాంగ్రెస్ సముద్రంలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి కూడా పుచ్చుకొన్నారు. ఎటువంటి రాజకీయానుభవం లేని జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉంటూనే పార్టీని నడిపించడమే,అనేక ఓడిడుకులను ఎదుర్కొంటూనే గత  ఐదేళ్ళుగా పార్టీని ఏకత్రాటిపై నిలబెట్టగలిగారు. ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా అరవై ఏడు యం.యల్యే., తొమ్మిది యంపీ సీట్లు కూడా గెలుచుకోగలిగారు. ఎటువంటి రాజకీయ అనుభవము లేని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ, పరిస్థితులను చూసి తెదేపా-బీజేపీలకు మద్దతు తెలిపి మంచి పేరు సంపాదించుకోగలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులతో ‘శభాష్’ అనిపించుకొని వారితో సత్సబందాలు పెంపొందించుకోగలిగారు.   కానీ కిరణ్ కుమార్ రెడ్డికి సుదీర్గ రాజకీయానుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయలపై మంచిపట్టు, చివరి నిమిషం వరకు చేతిలో అధికారం అన్నీ ఉండి కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక, పార్టీని నడిపించలేక పరువు తీసుకొన్నారు. రెండు రోజుల క్రితం మాదాపూర్ లో జైసపా కార్యాలయం కోసం అద్దెకు తీసుకొన్న భవనం కూడా ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే ఆయన రాజకీయ జీవితంలో మరొక తప్పుకు సిద్దమవుతున్నారనుకోవలసిందే. ఒక అనుభవజ్ఞుడయిన రాజకీయనాయకుడు ఇంత తక్కువ సమయంలో వరుస పెట్టి ఇన్ని తప్పులు చేయడం సాధ్యమేనా? అంటే 'అవునుసాధ్యమే'నని కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించి చూపారు.  

ఆనాటి మాటలు నీటి మీద వ్రాతలేనా?

  ఊహించినట్లే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై గొడవలు మొదలయ్యాయి. భౌగోళికంగా తెలంగాణా ఎగువనుంది కనుక నీటి విడుదల తన కనుసన్నలలో జరగాలని భావిస్తోంది. ఆ ధోరణి దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం తెలంగాణా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి రావడమే కాక, ప్రతీసారి నీటి విడుదలకు కేంద్రంతో మోర పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.   పదిరోజుల క్రితం నాగార్జున సాగర్ నుండి నీటి విడుదలకి తెలంగాణా ప్రభుత్వం నిరాకరించడంతో కేంద్ర జలసంఘమే స్వయంగా కలుగజేసుకొని, రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీళ్ళు విడుదల చేయామని ఆదేశించావలసి వచ్చింది. అప్పుడు మాత్రమే తెలంగాణా ప్రభుత్వం అయిష్టంగా నీటిని విడుదల చేసింది. కానీ ఆ నీరు నేటికీ దిగువనున్న కృష్ణా జిల్లాకు చేరకపోవడంతో, మరొక వారం రోజులపాటు ఇదే స్థాయిలో నీళ్ళు విడుదల చేయవలసిందిగా జలసంఘం తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొదటిసారే నీటి విడుదలకు తీవ్ర అభ్యంతరం చెప్పిన తెలంగాణా ప్రభుత్వం, మళ్ళీ మరో మారు నీటిని విడుదల చేయమన్నపుడు సహజంగానే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీష్ రావు దీనిపై జలసంఘానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జల బోర్డులో నిర్ణయం తీసుకోకుండా నీటిని విడుదల చేయరాదని, బోర్డు సమావేశం నిర్వహించాలని ఆయన కోరుతున్నారు.   తెలంగాణా మంత్రిగా ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, తెలంగాణకు ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇదే నీతిని పాటించినట్లయితే అప్పుడు తెలంగాణా పరిస్థితి ఏమిటి? అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే మహారాష్ట్రలో బాబ్లీ డ్యాం, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంలు నిర్మింపబడి ఉన్నాయి. ఆ రెండు ప్రభుత్వాలు కూడా క్రిందకు నీటిని విడుదల చేయకుండా మొత్తం నీళ్ళు తామే వాడుకోవాలని భావిస్తే తెలంగాణా పరిస్థితి ఏమిటి?   రాష్ట్ర విభజన జరిగితే నీటి తగవులు వస్తాయని పదేపదే ఆంద్ర ప్రాంత నేతలు వాదించినప్పుడు, శత్రు దేశాలయినా చైనా, పాకిస్తాన్ దేశాలతోనే మనం నదీ జలాలను పంచుకోగాలేనిదీ, రాష్ట్రం రెండుగా విడిపోతే నీటిని పంచుకోలేమా? అని కేసీఆర్, హరీష్ రావు తదితరులు ఎదురు ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు నీటి విడుదలకు అభ్యంతరం చెపుతున్నారు. మరి ఆనాడు వారు నీటి పంపకాలపై చెప్పిన మాటలన్నీ అబద్దాలే అనుకోవాలా?   తెరాస నేతలకు ఆంద్ర ప్రజలపై, ప్రభుత్వంపై విద్వేషం ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఇప్పుడు అధికారం చేప్పట్టిన తరువాత కూడా అదే విద్వేషాన్ని కొనసాగించడం హర్షణీయం కాదు. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలే ఉన్నారు. కానీ భౌగోళికంగా విడిపోయారు. ఒకే జాతి ప్రజల మధ్యే సరయిన సఖ్యత, అవగాహన లేకపోతే ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాలు మనతో సఖ్యత ఎందుకు పాటిస్తాయి?   ప్రపంచంలో ఏ దేశమూ, దేశంలో ఏ రాష్ట్రమూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా మనుగడ సాధించలేదనే విషయం తెలంగాణా ప్రభుత్వం గుర్తుంచుకొని పరస్పర సహకార ధోరణి అలవరచుకొంటే అందరూ హర్షిస్తారు. అలా కాకుండా ఇదేవిధంగా నిత్యం ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యాలకు దిగినట్లయితే చివరికి తనే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.

శారదా పీఠాధిపతికి ఇది తగునా?

  విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అంటే అందరికీ గౌరవం. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నప్పటికీ హేతుబద్ధంగా ఆలోచిస్తారు, మాట్లాడతారన్న గౌరవం ఆయన మీద అందరికీ నిన్నటి వరకూ వుండేది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్లు, మాట్లాడిన విధానం ఆయన మీద తెలుగువారికి వున్న గౌరవం తగ్గించేలా వున్నాయి. కొంతమంది మూఢ నమ్మకాలను విశ్వసించేవారు, దుష్ర్పచారం చేసేవారు నడిచే బాటలోనే ఆయన కూడా నడుస్తూ వుండటం, చాలా సిల్లీగా వుండే విషయాలను అలాంటి ఆధ్యాత్మికవేత్త తన ప్రసంగంలో ప్రస్తావించడం చాలా ఆవేదనను కలిగిస్తూ వుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు కురవటం లేదట. అలాగే రాష్ట్రంలో చాలామంది చనిపోతున్నారట. నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకయినా అర్థమవుతోందా? 2009 ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ వర్గాలు ఒక అసంబద్ధమైన, ఘోరమైన వాదనని తెరమీదకి తెచ్చాయి. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వర్షాలు సరిగా కురవలేదు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే వర్షాలు బాగా కురిశాయి... ఇదీ ఆ వాదన! అసలు ప్రకృతికి, వర్షాలు కురవడానికి, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తికి ఏమైనా సంబంధం వుంటుందా? మరి అలాంటిదేమైనా వుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే కరుణించిన మేఘాలు, ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు కరుణించలేదు? వర్షాలు కురిపించే విషయంలో పనిచేసిన రాజశేఖరరెడ్డి అదృష్టం హెలికాప్టర్‌లో మేఘాల మధ్యలోంచి ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు ఉపయోగపడలేదు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న వర్షాలు సరిగా కురవలేదంటారు.. మరి సరిగా కురవకపోవడం ఎందుకు.. చంద్రబాబు మీద పగపట్టిన వర్షాలు అస్సలు కురవకుండానే వుండొచ్చుగా? మరొక పిచ్చి వాదన ఏమిటంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే వర్షాలు కురవడం మొదలుపెట్టాయట! వర్షాలు కురవడానికి కారణమేంటి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాడని అప్పుడు వరుణుడికి శారదా పీఠాధిపతి లాంటి దేవదూతలు ఎవరైనా టెలీగ్రామ్ ఇచ్చారా? ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్షాలు సకాలంలో కురవకపోవడానికి కారణం చంద్రబాబు సీఎం అయ్యారని మళ్ళీ ఎవరైనా దేవుడికి వర్తమానం పంపారా? ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అనుకుందాం. మరి తెలంగాణలో కూడా వర్షాలు కురవడం లేదు.. దానికి ఎవరు కారణం? ప్రస్తుతం దేశమంతా వర్షాలు కురవటం లేదు. దానికెవరు కారణం? అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నందుకు వర్షాలు కురవడం లేదు. అంతవరకూ ఓకే.. మరి దైవాంశ సంభూతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నారు కదా.. అలాంటి పుణ్యాత్ముడు నడయాడే నేలమీద వర్షాలు ఎందుకు కురవడం లేదు? అంత అధ్యాత్మిక శక్తి వున్న ఆయన జనాల బాధ చూడలేక దేవుణ్ణి ప్రార్థించి వర్షాలు కురిపించొచ్చు కదా.. తెలుగువాళ్ళెవరూ ప్రమాదాల్లో మరణించకుండా చేయొచ్చు కదా?! ఈ విషయం మీద స్వామివారిని ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలతో నిలదీయొచ్చు.. కానీ ఆయన కూర్చున్న పీఠం మీద గౌరవంతో ఇక్కడితో ముగించడం న్యాయం. ఆయన కూడా లేనిపోని అంధ విశ్వాసాలను ప్రచారం చేయకుండా వుంటే బాగుంటుంది! ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోయింది. మళ్ళీ ఎలా అభివృద్ధిలోకి రావాలో ముందు అది ఆలోచించండయ్యా స్వామీ!

ఓటమి నుండి గుణపాటం నేర్చుకోని కాంగ్రెస్

  35మంది సభ్యులుండే తెలంగాణా శాసనమండలిలో టీ-కాంగ్రెస్ పార్టీకి 17మంది సభ్యులుండగా, తెరాసకు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెరాస ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో నిలువరించగలిగే పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా చాలా అవలీలగా మండలి చైర్మన్ పదవి దక్కించుకొనే అవకాశం ఉండేది. కానీ, ఆ పార్టీ నేతలు టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పదవి నుండి దింపి, దానిలో తాము కూర్చొనే ప్రయత్నాలలో తమలో తామే కుమ్ములాడుకొంటుంటే, ఇదే అదునుగా తెరాస కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు శాసనమండలి సభ్యులను పార్టీ ఫిరాయింపజేసింది కాంగ్రెస్ ను దెబ్బతీసింది. అంతేకాక మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు కూడా తెరాస అభ్యర్ధి స్వామిగౌడ్ కే ఓటేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ఫారూక్ హుసేన్ను నిలబెట్టినా అతనికి కనీసం పార్టీలో మిగిలిన సభ్యులయినా ఓటేస్తారనే నమ్మకం లేదు.   ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలున్నప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు టికెట్లు, పదవుల కోసం కుమ్ములాడుకొంటూ పార్టీని చేజేతులా ముంచుకొన్నారు. అయినప్పటికీ వారు ఓటమినుండి ఎటువంటి గుణపాటం నేర్చుకోకుండా కుమ్ములాడుకొంటూ ఇప్పుడు శాసనమండలి చైర్మన్ పదవిని, చివరికి తమ పార్టీ సభ్యులని కూడా పోగొట్టుకొన్నారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీని ఇతరులెవరూ ఓడించలేరని తమను తామే ఓడించుకొంటామని, అప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయని గొప్పగా చెపుతుంటారు. వారి మాటలు నిజమేనని అంగీకరించక తప్పదు.

విద్యార్ధుల పట్ల వివక్ష సమర్ధనీయమేనా?

  తెలంగాణా ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్దులకే ఫీజు రీయింబర్సమెంటు ఇవ్వాలని నిర్ణయించుకొంది. తమ ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకోనేందుకే ఆవిధంగా చేయవలసి వస్తోందని చెప్పి ఉండి ఉంటే ఆ నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టి ఉండేవారు కారేమో. కానీ, ఆంధ్ర విద్యార్ధులకు ఫీజు రీయింబర్సమెంటు చేయవలసిన అవసరం తమకు లేదని నిష్కర్షగా చెప్పడంతో విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు. భావిభారత పౌరులయిన విద్యార్ధులలో స్వయంగా ప్రభుత్వమే ఇటువంటి విద్వేషపూరిత ఆలోచనలు ప్రేరేపించడం ఏవిధంగా సమర్ధనీయం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.   నేడు ఆంధ్రా లేదా తెలంగాణాలో చదువుకొన్న విద్యార్ధులు రేపు ఈ రెండు రాష్ట్రాలకే కాక యావత్ దేశానికి కూడా పేరు ప్రతిష్టలు తేవచ్చును. దేశాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించవచ్చును. అనంతపురం జిల్లా నుండి హైదరాబాదుకు తరలివచ్చి స్థిరపడిన కుటుంబంలో జన్మించిన సత్య నాదెళ్ళ హైదరాబాదు పుట్టి పెరిగారు. అక్కడే చదువుకొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ.గా సమున్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకు ఆయనే ఆశాదీపంగా కనిపిస్తున్నారు. అందువల్ల స్థానికత సాకుతో విద్యార్ధుల పట్ల వివక్ష తగదు.   ఇప్పటికే స్థానికత కారణంగా విద్యార్ధులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం 1956కు ముందు నుండి ఉన్న వారు మాత్రమే స్థానికులని, వారు మాత్రమే తెలంగాణా ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హులని చెప్పడం చాలా దారుణం.   రాష్ట్రవిభజన జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. అందుకే గత రెండు మూడు దశాబ్దాలలో చాలా మంది ఆంధ్రా ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తరలి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అటువంటి వారందరి సమిష్టి కృషి కారణంగానే నేడు హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోగలిగింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు గాక. అది వేరే విషయం. కానీ అనేక ఏళ్లుగా హైదరాబాద్ లోనే స్థిరపడిన వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగి చదువుకొంటున్నప్పటికీ వారు తెలంగాణా వారు కాదని చెప్పడం సమంజసం కాదు. వారే కాక ఆంధ్ర నుండి ఉన్నత విద్యలభ్యసించేందుకు అనేకమంది విద్యార్ధులు హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాలకు వచ్చినవారున్నారు. వారందరికీ తెలంగాణా ప్రభుత్వమే ఫీజు రీయింబర్సమెంటు చేయవలసిన అవసరం లేదు. ఆంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని విద్యార్ధులందరికీ ఫీజు రీయింబర్సమెంటు చేసేందుకు ప్రయత్నించాలి తప్ప ఇటువంటి వివక్ష చూపడాన్ని ఎవరూ హర్షించరు. ఆంధ్రప్రభుత్వం కూడా ఈవిషయంలో వెంటనే చొరవ తీసుకొని తెలంగాణా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి విద్యార్దులెవరూ కూడా నష్టపోకుండా చూడాలి.   దేశానికి వెన్నెముక వంటి విద్యార్ధులలో జాతీయ భావం పెంపొందేలా ప్రభుత్వాలు చర్యలు చెప్పట్టాలి తప్ప వారిలో విద్యార్ధి స్థాయి నుండే విద్వేషభావనలు పెంపొందించే ప్రయత్నాలు చేయడం ఘర్షణీయం.

వైసీపీ సహకరించే ప్రతిపక్షం కాదు!

  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పట్టుదలగా కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళకు అడ్డుపడే ప్రతిపక్షంలా కనిపిస్తోందే తప్ప, రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ప్రతిపక్షంలా కనిపించడం లేదు. అసెంబ్లీలో జగన్‌గానీ, జగన్ పార్టీ నాయకులు గానీ చంద్రబాబును ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టే ఉద్దేశంలో కనిపిస్తున్నారే తప్ప మరోలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలు పరిష్కారమవ్వాలంటే ప్రభుత్వానికి ప్రజలతోపాటు అన్ని వర్గాలూ సహకరించాల్సిన అవసరం వుంది. అయితే జగన్ పార్టీ మాత్రం చంద్రబాబు సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత కలగటం కోసం ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. రైతుల రుణమాఫీ విషయంలో తాను ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తుంటే, అందుకు సహకరించడం మానేసి రైతు రుణ మాఫీ హామీ ఇవ్వడమే పెద్ద నేరమన్నట్టుగా జగన్ పార్టీ నాయకులు జనంలో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేయడంటూ దుష్ప్రచారంలో సదరు నాయకులు నిమగ్నమై వున్నారు. కేంద్రం నుంచి భారీ స్థాయిలో సాయం వస్తేనే ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయగలుగుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే, ఆ ప్రయత్నాలకు సహకరించి కేంద్రం నుంచి నిధులు దండిగా రావడానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద వుంటుంది. అయితే ఆ బాధ్యతని విస్మరించిన జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ కష్టాల్లో వుందని కేంద్రానికి చెబుతారేంటి అంటూ చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. కేంద్రం కనుక ఆంధ్రప్రదేశ్‌ని పొరపాటున పట్టించుకోకపోతే ఆ పాపం పూర్తిగా జగన్ పార్టీదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రతిపక్షం వ్యవహారశైలి మొత్తం అభివృద్ధి నిరోధకంగానే వుంది. ఇలాంటి పరిస్థితుల్లో సహకరించని ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తూ ముందుడుగు వేయాల్సిన అవసరం వుంది.

నాగార్జున వాదనలో పస ఉందా?

  సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ కొరకు 3.55 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసారని జీ.హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేయడంతో, ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. తాము 1992లో కొందరు వ్యక్తుల వద్ద నుండి పూర్తి న్యాయబద్దంగా 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని, అక్కడ ‘యన్ కన్వెన్షన్’ నిర్మించి, దానికి ప్రభుత్వం విదించిన అన్ని పన్నులను నాటి నుండి నేటి వరకు సకాలంలో కడుతున్నానని, ఇటీవల ప్రభుత్వం భవనాల క్రమబద్దీకరణకు అవకాశం ఇచ్చినపుడు దానికి కూడా తాను దరఖాస్తు చేసుకున్నానని ఆయన కోర్టుకు తెలిపారు. గత 22 సం.లుగా అధికారులకు తన స్థలంపై ఎటువంటి సందేహము కలగనది, ఇప్పుడు అకస్మాతుగా అదొక అక్రమకట్టడమని ఏవిధంగా నోటీసులు జారీ చేసారని నాగార్జున తన పిటిషనులో ప్రశ్నించారు. నాగార్జున తన పిటిషనులో బఫర్ జోన్ వంటి ఇతర సాంకేతిక అంశాలపై కూడా తన వివరణ ఇచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోర్టును కోరారు.   నాగార్జున వాదన నూటికి నూరుపాళ్ళు సరయినదే. ఇంతకాలంగా ఆయన వద్ద నుండి జీ.హెచ్.యం.సి. వివిధ పన్నులు వసూలు చేసుకొంటున్నందున యన్.కన్వెన్షన్ చట్టబద్దంగా నెలకొల్పబడిందేనని ద్రువీకరించినట్లే భావించవచ్చును. ఒకవేళ అదొక అక్రమ కట్టడమని వారు భావించి ఉండి ఉంటే దానికి ఎటువంటి అనుమతులు ఇచ్చి ఉండకూడదు. భవన నిర్మాణాన్ని మొదటే అడ్డుకొని ఉండాలి. కానీ వారు అలా చేయలేదు. పైగా పన్నులు కూడా వసూలు చేసుకొన్నారు. అటువంటప్పుడు దానిని అక్రమ కట్టడమని ఇప్పుడు వారు వాదిస్తే కోర్టులో మొట్టికాయలు తప్పకపోవచ్చును.   కానీ నాగార్జున అధికార పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉన్నపుడు, జీ.హెచ్.యం.సి. అధికారులు మాత్రం ఆయనపై చర్యలు తీసుకొనేందుకు ఏవిధంగా సాహసించగలరు? అయితే ఈ విషయాన్ని సదరు అధికారులు కోర్టులో ప్రస్తావించలేరు. ఆ సంగతి కోర్టుకు, ప్రభుత్వానికి, నాగార్జునకు అందరికీ కూడా తెలుసు. అందుకే నాగార్జున దైర్యంగా కోర్టులో పిటిషను వేయగలిగారు. ప్రభుత్వం తలుచుకొంటే అక్రమం సక్రమమవుతుంది, సక్రమం అక్రమవుతుంది. అందుకే ఇంతవరకు ఏ అధికారి కూడా ఆయన జోలికి రాలేదు. కానీ ప్రభుత్వాలు మారిన తరువాత కొత్తగా అధికారం చేప్పట్టిన వారితో కూడా ఏ కారణంగానయినా స్నేహ సంబంధాలు కొనసాగించలేకపోతే, ఇటువంటి సమస్యలు పుట్టుకొస్తాయని స్పష్టమవుతోంది. ఏమయినప్పటికీ చట్టబద్దంగా చూసినట్లయితే నాగార్జున సేఫ్ గా ఉన్నట్లే కనిపిస్తోంది.

వ్యవసాయ రుణాల మాఫీకి హైకోర్టు వ్యతిరేకం

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేందుకు తిప్పలుపడుతుంటే, ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న ‘హైకోర్టు ఆఫ్ హైదరాబాద్’ ప్రభుత్వాలకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసే హక్కులేదని నిన్న తీర్పు చెప్పింది. రైతులు బ్యాంకుల వద్ద తీసుకొన్న వ్యవసాయ రుణాలను కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మాఫీ చేయకుండా ప్రభుత్వాలను ఆదేశించవలసిందిగా కోరుతూ మాజీ తెదేపా శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ హైకోర్టులో పిటిషను వేసారు. దానిని విచారణకు చేప్పట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతీ సేన్ గుప్తా మరియు జస్టిస్ పీ.వీ.సంజయ్ కుమార్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ నిన్న ఈ తీర్పును వెలువరించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. హైకోర్టు రుణమాఫీపై ఎటువంటి స్టే ఇవ్వలేదు గనుక, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు తప్పనిసరిగా ముందుకే సాగవలసి ఉంటుంది. ఆర్ధికంగా కాస్తో కూస్తో ఆంద్ర ప్రభుత్వం కంటే కాస్త మెరుగయిన స్థితిలోనే ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్య నుండి ఏదోవిధంగా బయటపడే అవకాశం ఉంది. కానీ లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తెదేపాకు ఇదొక అగ్నిపరీక్షవంటిదే. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాష్ట్ర బ్యాంకర్లతో సమావేశమయినప్పుడు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయవలసిందిగా అభ్యర్దించారు. కానీ అందుకు బ్యాంకర్లు ఏ విధంగా స్పందించారో తెలియదు.

నష్టపరిహారంతో పాప పరిహారం అవుతుందా?

  నగరం గ్రామంలో గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారు ఒక్కొకరి కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం, గాయపడ్డ వారికీ రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం గెయిల్ సంస్థ సోమవారం చెల్లించింది. అంతే గాక నగరం గ్రామాన్ని గెయిల్ సంస్థ దత్తత తీసుకొని దానినొక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అంగీకరించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది.   కానీ, గెయిల్ సంస్థ ఇవే చర్యలు మొదటే చేప్పట్టి ఉండి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేదే కాదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. తరచూ పైపుల నుండి గ్యాసు లీకవుతోందని స్థానికులు ఎన్ని పిర్యాదులు చేసినా వాటిని ఏనాడు గెయిల్ అధికారులు పట్టించుకోలేదు. ఎవరినీ సస్పెండ్ చేయలేదు. కానీ ఇప్పుడు 17మంది చనిపోయిన తరువాత అందుకు బాధ్యులని భావిస్తున్న ఇద్దరినీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది. గత రెండు మూడు దశాబ్దాలుగా స్థానికుల జీవితాలను చిద్రం చేస్తున్న గెయిల్ సంస్థ ఏనాడూ కూడా వారి సంక్షేమానికి పైసా విదిలించలేదు. కానీ బుగ్గిపాలయిన నగరం గ్రామాన్ని ఇప్పుడు దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు సిద్దపడుతోంది. తమ వ్యాపార ప్రయోజనాలే తప్ప మనుషుల ఆస్తులకు, ప్రాణాలకు విలువీయని గెయిల్ వంటి సంస్థలు రాష్ట్రంలో దేశంలో కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి మీద ప్రభుత్వాలు ఇప్పుడు ఎటువంటి కటిన చర్యలు తీసుకోవు. అవి కూడా తమ కార్యకలాపాల వలన నష్టపోతున్న స్థానిక ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఎటువంటి చర్యలు చేప్పట్టవు. చెప్పట్టాలంటే ఇటువంటి దుర్ఘటనలు జరగాలి. అమాయక ప్రజలు మరణించాలి. వారి ఆస్తులు బుగ్గిపాలవ్వాలి. అప్పుడే ప్రభుత్వాలు, సదరు సంస్థలు మేల్కొని చర్యలు చేపడతాయి. ఎక్స్ గ్రెషియాలు చెల్లిస్తుంటాయి. ప్రమాదాలు జరిగినపుడు వాటి నుండి గునపాటాలు నేర్చుకొని మళ్ళీ అటువంటివి పునరావృతం కాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు మాత్రం చేయకుండా, ప్రజల ప్రాణాలను వెలకట్టి కేవలం నష్టపరిహారాలు చెల్లించడానికే సంస్థలు ఇష్టపడుతున్నాయి. ఇప్పుడయినా ఇది కేవలం నగరం గ్రామానికే సంబందించిన సమస్యగా చూస్తున్నారు తప్ప అంతకు మించి మన ప్రభుత్వాలు చూడలేకపోతున్నాయి. యదా రాజ తదా ప్రజా అన్నట్లుగా ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యవహరిస్తే ఇటువంటి సంస్థలు కూడా అన్నీ పద్దతిగా పాటిస్తాయి.

ప్రభుత్వాలు మారితే ప్రజలు బలికావలసిందేనా?

  ఇంతవరకు ప్రభుత్వాలు మారినప్పుడు కేవలం కొందరు ఉన్నతాధికారులు మాత్రమే అటు, ఇటూ బదిలీలు అయ్యేవారు. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావడం చాలా శోచనీయం. తెరాస ప్రభుత్వం గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములలో అక్రమంగా వెలిసిన కొన్ని భవనాలు మాత్రమే కూల్చివేసి, అవే భూములలో రాజకీయ అందదండలున్న పెద్దల భవనాల జోలికి మాత్రం వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. బహుశః ఆ కారణంగానేనేమో, మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ భూములలో ఉన్న లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకోను సైతం విడిచిపెట్టమని చెప్పారు. అదేవిధంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ కోసం ప్రభుత్వానికి చెందిన 5.55ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేసారంటూ జీ. హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.   ఈ మొత్తం భూముల బదిలీ వ్యవహారాలు గమనించినట్లయితే, వీటన్నిటి వెనుక ప్రభుత్వపాత్ర కూడా ఉందని స్పష్టమవుతోంది. అందుకే ఆ ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకుల చుట్టూ సినీ పరిశ్రమ మరియు ఇతర సంస్థల ప్రతినిధులు తిరుగుతుండటం మనకి కనిపిస్తుంటుంది. ప్రభుత్వ భూములకు, ఆస్తులకు కేవలం ధర్మకర్తగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు, ఈ విధంగా వ్యక్తులతో, సంస్థలతో లులూచీ పడుతూ వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములను అప్పనంగా ధారాదత్తం చేసేసాయి. తద్వారా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగకపోయినా దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోన్నట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ప్రభుత్వాలకు భూములు అవసరం పడినప్పుడు, ఎక్కడా ఒక్క ఎకరం కనబడకుండా పోతోంది.   తెరాస ప్రభుత్వం అటువంటి భూములను గుర్తించి వెనక్కు తీసుకొనే ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా పని మొదలుపెట్టవలసి ఉంది.   అయితే ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా బలయిపోతున్నది మధ్యతరగతి ప్రజలే. ఉన్నత స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ భూముల వ్యవహారాల గురించి తెలియక, వారు తమ జీవితకాల కష్టార్జితాన్ని వెచ్చించి వాటిలో నిర్మించిన ఇళ్ళు, ఫ్లాట్లను కొనుకొంటే, వారి నుండి ఇంతకాలం ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు వసూలుచేసుకొన్న జీ. హెచ్.యం.సి. అధికారులు, ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే వాటిని అక్రమ కట్టడాలని పేర్కొంటూ నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చూస్తుంటే మన వ్యవస్థలో ఎంత లోపం ఉందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ప్రభుత్వాలు, రాజకీయనేతలు చేసిన తప్పిదాలను పట్టించుకోకుండా ఇంతకాలం కళ్ళు మూసుకొని కూర్చొన్న అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా మధ్యతరగతి వాసులపై ఈవిధంగా కొరడా జులిపించడం చాలా అన్యాయం. ఒక ప్రభుత్వానికి ఒప్పయినది ఇంకో ప్రభుత్వానికి తప్పయితే కావచ్చు గాక, కానీ అందుకు మధ్యతరగతి ప్రజలను నడిరోడ్డున పడేయడం మాత్రం హర్షణీయం కాదు. ఈ అక్రమాలకు బాధ్యులయిన వారిని కటినంగా శిక్షించి వారి నుండే ముక్కుపిండి డబ్బు వసూలు చేసి రోడ్డున పడిన మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వాలు ఆధుకోగాలిగితే అందరూ హర్షిస్తారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పయనమెటు?

  ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కారకుడని కొంత మంది కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టాన దేవుడిగా కొలవబడుతున్న రాహుల్ గాంధీని విమర్శించినందుకు వారికి వెంటనే పార్టీ నుండి ఉద్వాసన చెప్పడం ద్వారా ఆ సమస్యను అధిగమించినట్లు కాంగ్రెస్ భావించింది, కానీ నాయకత్వ లోపం గురించి సదరు నేతలు లేవనెత్తిన అంశాన్ని మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అనిపించుకోదు కదా! సమస్య ఇంకా అలాగే ఉంది గనుక అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఈ విషయమై సన్నాయి నొక్కులు నొక్కడం సహజమే. అయితే ఈసారి రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి వేరెవరో కాదు, గత పదేళ్లుగా ఆయనపై ఈగ వాలకుండా చూసుకొన్న దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీకి అధికారం బాధ్యతలు చెప్పట్టగల లక్షణాలు లేవని విమర్శించారు. ఎన్నికలు ముగిసే వరకు కూడా రాహుల్ గాంధీ వంటి నాయకుడు నభూతో నభవిష్యతి అని డప్పుకొట్టిన దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత అతనికి పరిపాలనా సామార్ధ్యం లేదని చెప్పడం చూస్తే, అతను అసమర్ధుడని పార్టీలో నేతలందరికీ తెలిసి ఉన్నప్పటికీ, సోనియా గాంధీకి భయపడి అందరూ ఆయన భజనలో తరించిపోయినట్లు స్పష్టమవుతోంది. కానీ ప్రజలు అతను ప్రధానిగా దేశాన్ని పాలించేందుకు అనర్హుడని సరిగ్గానే అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి అవినీతి, అసమర్ధత, అక్రమాలతో బాటు నాయకత్వ లక్షణాలు లేని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనుకోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చును.     ఇక దిగ్విజయ్ సింగ్ ఆరోపణల విషయానికి వస్తే “రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించేందుకు అవసరమయిన సామర్ధ్యం లేకపోయినప్పటికీ, ఆయన న్యాయం కోసం పోరాడటంలో దిట్ట. కానీ లోక్ సభలో పార్టీకి నాయకత్వ వహించకపోవడం మంచి నిర్ణయం కాదు,” అని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కలకలం సృష్టించాయి. దానికి దిగ్విజయ్ మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవడం వంటివి షరా మామూలే. కానీ సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు ఇటువంటి విమర్శలు చేయడం గమనిస్తే, రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నంత కాలం పార్టీకి భవిష్యత్తు లేదని వారు కూడా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వచ్చే ఐదేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధమయిన పరిపాలన అందించగలిగినట్లయితే, ఇక రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి శనిమహర్ధశ మొదలయినట్లేనని భావించవచ్చును. అయితే ఈ విషయాన్ని అందరికంటే ముందుగా దిగ్విజయ్ సింగ్ పసిగట్టడమే చాలా నవ్వు తెప్పిస్తుంది.

రాష్ట్రానికి భారీ రుణం సంపాదించిన చంద్రబాబు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యదక్షతను మరొకమారు నిరూపించుకొన్నారు. మొన్న డిల్లీ వెళ్లి, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రితో సమావేశమయిన చంద్రబాబు కేంద్రం నుండి రాష్ట్రంలో వివిధ విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ. 18, 268 కోట్లు భారీ రుణం సంపాదించగలిగారు. ఆ మొత్తంలో విజయవాడ వద్ద గల యన్.టీ.టీ.పీ.యస్ (800 మెగా వాట్స్) నాలుగవ దశ విస్తరణ పనులకు రూ. 5286 కోట్లు, క్రిష్ణపట్నం వద్దగల డీ.యస్.టీ.పీ.పీ.విద్యుత్ ఉత్పత్తి సంస్థ (800 మెగా వాట్స్) రెండవ దశ విస్తరణ పనులకు రూ. 5140 కోట్లు, రాష్ట్ర గ్రామీణ విద్యుత్ కార్పోరేషన్ కు రూ. 4300 కోట్లు, రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు రూ. 3542 కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఇదిగాక ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానే ఎంపికచేసినందున, త్వరలోనే దానిని రాష్ట్రంలో అమలు చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఇక రైల్వే వేగన్ల కొరత కారణంగా సకాలంలో బొగ్గు సరఫరా జరగక రాష్ట్రంలో పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, అధనంగా మరికొన్ని రైల్వే వేగన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ అంగీకరించారు. అయితే ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్ధికలోటును పూడ్చేందుకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల మంజూరు వంటివి అనేకం సాధించవలసి ఉంది.

ఇరాక్: పేలుళ్ళకు బెదిరిన కేరళ నర్సులు!

    ఇరాక్‌లో కొన్ని ప్రాంతాలు తీవ్రవాద గుప్పిళ్ళలో వున్నాయి. ఇరాక్‌లో వున్న ఇతర దేశస్థులు వెంటనే దేశం విడిచిపోవాలని తీవ్రవాదులు ఎప్పుడో హుకుం జారీ చేశారు. వాళ్ళు వెళ్ళమని అనకపోయినా ఇరాక్‌లోని అనేకమంది భారతీయులు సాధ్యమైంనంత త్వరగా ఇరాక్‌ని విడిచిపెట్టాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశారు. అయితే కేరళలోని త్రికిత్ నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన 46 మంది నర్సులు మాత్రం తాము ఇరాక్ వదిలి రామని, ఇక్కడ గాయపడిన వారికి చికిత్స చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటామని గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.   ప్రస్తుతం ఇరాక్‌లో ఉద్రికత్తలకు కారణమైన తీవ్రవాదులు కూడా తాము తమ దేశంలో వున్న కేరళ నర్సులను ఏమీ అనబోమని, వారికి ఎలాంటి హానీ చేయబోమమని, గాయపడిన వారికి చికిత్స చేయడానికి తాము ఎలాంటి ఆటంకమూ కలిగించబోమని చెప్పారు. అవసరమైతే కేరళ నర్సులకు తామే జీతాలు కూడా ఇస్తామని ప్రకటించారు. తీవ్రవాదుల నుంచి ఈ హామీ రావడంతో కేరళ నర్సులు ఇరాక్‌లోనే ఉండిపోయి చికిత్స చేస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఇరాక్‌లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోజంతా బాంబు పేలుళ్ళు వినిపిస్తూనే వున్నాయి. ఎక్కడో ఒకచోట బాంబు దాడులు జరుగుతూనే వున్నాయి. ఈ బాంబు పేలుళ్ళ శబ్దాలు కేరళ నర్సులకు భయం కలిగిస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తిక్రిత్ నగరంలో వున్న 46 మంది నర్సులలో 35 మంది నర్సులు ఇండియాకి వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. వాళ్ళంతా తమ లగేజీని సర్దుకుని తమని ఇండియాకి ఎవరు పంపిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరో 11 మంది నర్సులు మాత్రం ఇరాక్‌లోనే వుండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.