అవి కక్ష సాధింపు చర్యలేనట!

   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. వారిరువురి అధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడిన తరువాత, దాని ఆస్తులను ఇతర సంస్థలకు అప్పుగా ఇవ్వడం వ్యాపారపరమయిన లావాదేవీగానే భావిస్తూ, ఆ లావాదేవీలపై వచ్చిన ఆదాయంపై పన్నుఎగవేసినందుకు ఆదాయపన్ను శాఖా నోటీసులు జారీ చేసింది.   దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని, తమను ఎంతగా ఇబ్బందిపెడితే తాము అంత శక్తివంతంగా తయారయ్యి మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. అయితే ఇంతకాలం మిత్ర పక్షాలను, ప్రతిపక్షాలను వేదించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇప్పుడు తనవంతు రాగానే దానిని కక్ష సాధింపు చర్యలని వర్ణించడం హాస్యాస్పదం.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తన రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసేందుకు సీబీఐను ఏవిధంగా వాడుకొందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంతగా తెగించిందంటే చివరికి తనకు బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతలపై కూడా సీబీఐని ప్రయోగించి, తనకు మద్దతు కొనసాగించేలా చేసుకొంది. ఆ విషయాన్ని స్వయంగా సమాజ్ వాదీ పార్టీ నేతలే చెప్పుకొన్నారు కూడా. కాంగ్రెస్ వైఖరితో చివరికి సుప్రీం కోర్టు సైతం విసుగెత్తిపోయి, “కాంగ్రెస్ చేతిలో సీబీఐ పెంపుడు చిలకలా మారిపోయిందని, దానికి అనేకమంది యజమానులున్నారని” చురకలు వేసింది. తన కుమారుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సైంధవుడిలా అడ్డుపడుతున్ననరేంద్ర మోడీపై కూడా సీబీఐ చిలుకలను ప్రయోగించింది. కానీ సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ-సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తప్పించుకోగలిగారు. ఆవిషయాలన్నీ మరిచిపోయిన సోనియాగాంధీ, ఇప్పుడు తనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు అందగానే అది మోడీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం.

భ్రమలు కలిగించని రైల్వే బడ్జెట్!

  నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఇటీవలి కాలంలో అత్యుత్తమ రైల్వే బడ్జెట్‌లలో ఒకటిగా నిలిచే బడ్జెట్ అని పేర్కొనవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలయిన యుపిఎ పక్షాలు పైకి ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని పెదవులు విరిచినప్పటికీ మనసులలో మాత్రం ఇలాంటి చక్కని బడ్జెట్ తాము ఎప్పుడూ ప్రవేశపెట్టలేకపోయామే అని అసూయపడక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి ఈ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన అంశాలు ఏమి వున్నాయి? గత బడ్జెట్‌లతో పోలిస్తే కొత్త రైల్వే లైన్లు ఎన్నిటిని ఓకే చేశారు? ఎన్ని కొత్త రైళ్ళు ప్రకటించారు అనే సందేహాలు కలగవచ్చు. కానీ అలాంటి భ్రమలేవీ దేశ ప్రజలకు కల్పించకపోవడమే ఈ బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి గత ఒక ప్రధాన అంశం. గత ప్రభుత్వాలు రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెట్టినప్పుడు కొత్త రైల్వే లైన్ల విషయంలో, కొత్త రైళ్ళ విషయంలో, రైల్వే అభివృద్ధి పనుల విషయంలో పుంఖాను పుంఖాలుగా హామీలను, ప్రణాళికలను బడ్జెట్ ప్రతిపాదనలలో పెట్టాయి. ఆ క్షణంలో అవి ప్రజల్లో విపరీతమైన ఆనందాన్ని కలిగించి వుండొచ్చు. అయితే సదరు బడ్జెట్‌లలో పేర్కొన్న హామీలలో ఎన్ని కార్యరూపం దాల్చాయన్న విషయాన్ని పరిశీలిస్తే ఒక భ్రమలాగా ప్రజల్ని ఆవరించిన ఆ ఆనందం ఆవిరైపోవడం ఖాయం. ఎందుకంటే గత రైల్వే బడ్జెట్‌లలో ప్రకటించిన అనేక హామీలు, వరాలు ఎన్నో మూలనపడిపోయాయి. అలాంటి మూలన పడిపోయే హామీలు గుప్పించకుండా, దేశ ప్రజల్ని భ్రమల్లో ముంచకుండా వాస్తవ రూపంగా వున్న రైల్వే బడ్జెట్‌గా సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

రాహుల్ గాంధీ ఓవరాక్షన్ చూతము రారండీ!

  వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో నూరేళ్ళూ నిండేలా చేసిన ఘనత శ్రీమతి సోనియాగాంధీకి, మాస్టర్ రాహుల్ గాంధీకి దక్కింది. రాజీవ్ గాంధీ భార్య, కొడుకు కావడం మినహా ఎలాంటి రాజకీయ పరిపక్వత లేని వీళ్ళిద్దరి చేతిలో చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో కూరుకుపోయి, మొన్న జరిగిన ఎన్నికలలో దిక్కూదివాణం లేకుండా పోయింది. ఈ ఎన్నికలలో భవిష్యత్తులో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేకుండా పోయే అవకాశం వుందన్న క్లారిటీ రాజకీయ పరిశీలకులకు వచ్చేసింది. అందరికీ వచ్చిన క్లారిటీ రాహుల్ గాంధీకి రాకుండా వుంటుంది. ఈ క్లారిటీ ఆయనకి కూడా వచ్చే వుంటుంది. కానీ ఏమీ రానట్టే కనిపిస్తున్నారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ రాహుల్ గాంధీని చూస్తున్న జనం బిత్తరపోతున్నారట. ఎందుకంటే ఆయన ఈ మూడు రోజులుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ వున్నారు. ఎప్పుడు చూసినా అందర్నీ నవ్వుతూ పలకరిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పటికంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారట. భారత ప్రజలు తమని, తమ పార్టీని ఇంటికి సాగనంపారన్న దిగులు ఏ కోశానా ఆయన ముఖంలో కనిపించడం లేదట. తన జీవితంతో ఎప్పుడూ ఎవరినీ పలకరించి ఎరుగని వాళ్ళని కూడా పేరు పెట్టి మరీ పిలిచి పలకరిస్తూ చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నారట. రాహుల్ గాంధీ ఈ యవ్వారమంతా చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన గారి మాతృమూర్తి సోనియాగాంధీ మురిసిపోతూ వుండొచ్చేమోగానీ, మిగతా రాజకీయ వర్గాలు మాత్రం రాహుల్ గాంధీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటమి తెచ్చిన అవమాన భారంలో పీకలదాకా కూరుకుపోయి వున్న రాహుల్ గాంధీ తన బాధ బయటకి తెలియకుండా వుండటం కోసం ఇలా అతి ఉల్లసాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ దిగులుగా ఓ మూలన కూర్చుని వుంటే చూసేవాళ్ళకి పెద్దగా ఇబ్బందేమీ వుండదని, అయితే ఇలా అతి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శించడాన్నే చూడలేకపోతున్నామని అంటున్నారు. అంచేత రాహుల్ గాంధీ తన ఓవర్ యాక్షన్ని ఆపితే మంచిదని భావిస్తున్నారు.

ఏపీలో వుండాలంటేనే భయమా? అబ్బ ఛా!

  వైసీపీ నాయకుడు జగన్ గారు నిన్నగాక మొన్న ఒక సూపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాల ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ నెత్తిన తెల్లగుడ్డ పడింది. చాలామంది వైసీపీ నాయకులు సదరు పార్టీకి గుడ్‌బై చెప్పేసి తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వైపీసీ మనుషుల్ని పెట్టి వాళ్ళని ఆపాలని ప్రయత్నించినప్పటికీ జగన్ ధోరణికి విసిగిపోయి వున్న చాలామంది ఆ పార్టీ నాయకులు టీడీపీ అధ్యక్ష అభ్యర్థలకు మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని జగన్ గవర్నర్ దగ్గరకి వెళ్ళి తన బాధని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వుండాలంటేనే భయం వేస్తోందనే మాట వాడారు. జగన్ ఈ మాట వాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం జగన్. రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఆయనే ప్రధాన కారణం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డు పడుతున్న వ్యక్తి జగన్. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడుతున్న జగన్ తాను భయపడిపోతున్నానని అనడం చాలా కామెడీగా వుందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన కామెంట్లు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేయకుండా, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తే బాగుంటుందని అంటున్నారు.

నరసింహన్ ఇంటికి వెళ్ళక తప్పదా?

  అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ జరుపుతున్న విచారణ ప్రక్రియలో భాగంగా సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ని కూడా ప్రశ్నించింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు అంశంతో ప్రమేయం వున్న నారాయణన్, వాంగ్ ఛూలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించడం, మొన్నటి వరకూ గవర్నర్ పదవులను వెలగబెట్టిన వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ గవర్నర్‌ గిరీకి రాజీనామా చేయక తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. స్కామ్‌లో భాగస్వామి రూపంలో కాదు.. కేవలం ఒక సాక్షిగా మాత్రమే కావడంతో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు మరోవైపు వినిపిస్తున్నాయి. యుపిఎ హయాంలో నియమితులైన గవర్నలను తొలగించే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్న ఎన్డీయే ప్రభుత్వం నరసింహన్‌ని కూడా సాగనంపడానికే సీబీఐ ఆయనని ప్రశ్నించేలా చేసిందా అనే సందేహాలు వున్నప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ని పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ ఎలాంటి సూచనా చేయలేదు. యుపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ‘పర్లేదు కొనసాగించవచ్చు’ అని భావిస్తున్న వారిలో నరసింహన్ పేరు కూడా వుందన్న అభిప్రాయాలు ఇంతవరకూ వ్యక్తమవుతూ వచ్చాయి. నరసింహన్‌ పదవికి ఇప్పట్లో ఇబ్బందేమీ లేదన్న సంకేతాలే ఇంతవరకూ అందుతూ వచ్చాయి. అయితే అకస్మాత్తుగా నరసింహన్‌ని కూడా కేంద్రం ముగ్గులోకి లాగడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ల తొలగింపు కార్యక్రమాన్ని, అగస్టా స్కామ్‌ విచారణను ఒకే గాటన కట్టాలా, వద్దా, ఈ విచారణ గవర్నర్లను తొలగించడానికే చేస్తున్నారా అనే సందేహాలు కూడా జనాన్ని కన్ఫ్యూజన్‌కి గురి చేస్తున్నాయి. అయినా ఈ విషయం మీద అతి తక్కువ వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. సీబీఐ ప్రశ్నించిన నరసింహన్ త్వరలో ఈ విషయం మీద ప్రతిస్పందించే అవకాశం వుంది. అప్పుడే నరసింహన్ భవితవ్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.

Potential Budget needs time to prove itself

  It is a potential budget that can deliver good results for the Indian Railways. While few people were not for it, we would like to make few points here in support of the Railway Budget 2014. While we make our points as a comparison of this budget with our day to day life.     1. People cry of lack of hygiene: While there is lack of hygiene in toilets (Train or stations) the Rail Ministry made a provision to establish a separate Housekeeping arm for the railways. But the bogeys can be cleaner with the participation of passengers, yes we passengers are the ones who mess the bogeys and toilets with food, plastic, paper and waste food that we spill, what more we blame the Railways for not cleaning the mess that we have created. We have been provided with the dustbins and we can definitely utilise them instead of letting the litter lay there or throw the same out of window. So the point is if the Govt ensures Cleanliness of toilets and better housekeeping we people can pay more. But the people should also be made more aware of how to keep the trains clean which itself is a huge task considering the rural population who travel in trains.     2. Increased cost in fares:  We have never heard of people crying out loud against Multiplexes costing Rs 300-400 for a ticket which you can get at 100-110 in Single screen theatres. We have never heard of people crying out loud when the Malls/Food Courts on Highways charge extra money for Water bottles, Lays chips or Cold Drinks. we have never heard of people crying out loud against the overpricing of commodities beyond MRP in several stores. Then why cry for Railway Price hike? We want every kind of amenity on trains and we protest to pay extra? Why not pay extra? We pay extra charges to A/C Volvo buses for they give comfort, if we are open to that we should be open to the hike as well.     3. Not Common Man Friendly: We all are common people. We all need to introspect what's common man friendly? There are people who travel without Tickets...is that Govt Friendly? There are people who burn Trains in the name of Protests is that being Govt Friendly? There are people who are Management experts who can tell what it takes to run such a large organisation with such a large wish list of passengers and it is not easy. Let’s give the Indian Railway Ministry some time to at least achieve 40% of the budget target that has been presented yesterday and the people who are bashing up this budget will start praising the efforts. But we need to give time as Rome was not built in a day! Being said that we as a collective Vote power can change the Govt if they fail to deliver on their promises/Budget developments. Then why crib? Let’s face the reality. We should not oppose for the sake of opposition we should accept, learn, understand and then oppose on the proven grounds.  

జగన్ పార్టీ బుద్ధి మరోసారి బయటపడింది!

  ఎంత దాచుకుందామని, బయటపడకుండా వుందామని ప్రయత్నించినా కొంతమంది బుద్ధి ఇట్టే బయటపడిపోతూ వుంటుంది. ప్రస్తుతం జగన్ పార్టీ అలాంటి స్థితిలోనే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నా్రు. ప్రస్తుతం జగన్ పార్టీకి చంద్రబాబును ఏదోరకంగా ఇరకాటంలో పెట్టి తాను రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలోనే వుంది. తాను కోరుకుంటున్నదాన్ని సాధించడం కోసం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఉదాహరణగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలకి సంబంధించిన అధికారాలను గవర్నర్‌కి అప్పగించే విషయంలో వైసీపీ నాయకుల స్పందనను చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక్కడానికే ఇవ్వడం వల్ల హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులకు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు రాసిన ఈ లేఖ అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణలో వున్న సీమాంధ్రులలో కూడా సంతోషాన్ని కలిగించింది. పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కి అధికారాలు కల్పించడం ద్వారా తమకు భద్రత వుంటుందని హైదరాబాద్‌‌లోని సీమాంధ్రులు భావిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదాలో వున్న వైసీపీ మాత్రం దీనికి పెడార్ధాలు తీస్తోంది. గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలంటే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం పెద్ద తప్పని, కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేయడం అంతకంటే ఘోరమైన తప్పు అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో వున్న తెలుగువారికి ఏ సమస్య వచ్చిందని గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ నాయకులు తమకు నష్టం కలిగించే రకంగా మాట్లాడుతూ వుండటం చూసి సీమాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోనీలే కదా అని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఈరకంగా వ్యవహరిస్తోంది, పొరపాటుగా అధికారాన్ని ఇచ్చి వుంటే ఇంకెంత దారుణంగా వ్యవహరించేదో అని అనుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని విమర్శించడం మానుకుని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్ళేలా సహకరిస్తే మంచిదని అంటున్నారు.

రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్!

  ఎక్కడ అభివృద్ధి జరుగుతూ వుంటే అక్కడ రియల్ ఎస్టేట్ రాబందులు వాలిపోతూ వుంటాయి. ప్రస్తుతం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ మీద రియల్ ఎస్టేట్ రాబందుల దృష్టి పడింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు అంశాన్ని ఈ రాబందులు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజధాని ఏర్పడే ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెంచేసి సదరు భూములు అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారులే. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో రాజధాని వస్తుందంటూ వదంతులను వ్యాపింపజేసి చాపకింద నీరులాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ దగ్గర వున్న భూములను చల్లగా అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. నిజంగా సదరు ప్రాంతంలో రాజధాని వచ్చేస్తుందేమోనన్న ఆశతో చాలామంది సామాన్యులు తక్కువ ధర వుండే భూములను ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎలాగైతే హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంత ఇల్లు లేకుండా చేశారో అదే వ్యూహాన్ని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పుణ్యమా అని భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ధోరణికి కళ్ళెం వేయడానికి, రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ పరిసరాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం చట్టపరంగా కుదరదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుండటంతో ఈ మార్గం కాకపోతే మరో మార్గంలో అయినా భూముల ధరలకు కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీ, తెలంగాణ విషయంలో కేంద్రం వ్యూహాత్మకం!

  కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతాపార్టీకి సంపూర్ణ మెజారిటీ వుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేయదలచుకున్నా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసే అవకాశం పూర్తిగా వుంది. తాను చేయదలచుకున్న ఏ పనికైనా ఏ పార్టీ నుంచి అయినా మద్దతు కోరాల్సిన పరిస్థితి లేదు. నిజానికి సంపూర్ణ మెజారిటీ లభించిన భారతీయ జనతాపార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే శక్తి వున్నా తన మిత్రపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని ఎన్డీయే ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. ఇలా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో తాను ఎవరికీ దొరికిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వివేకంతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రెండు కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వం ముందు వున్నాయి. అవి ఒకటి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లు రూపంలో పార్లమెంట్ ఆమోదం పొందేలా చేయడం. రెండోది హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థకి సంబంధించిన అధికారాలు గవర్నర్‌కి అప్పగించడం. ఈ రెండు అంశాలనీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఈ రెండు అంశాలూ సీమాంధ్రులకు చాలా కీలకమైన అంశాలు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ రెండు అంశాలనూ కచ్చితంగా అమలులోకి తేవాలన్న కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం వుంది. మోడీ ప్రభుత్వం చేయదలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందో, అంతే నిర్దాక్షిణ్యంగా తన నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు చేయవచ్చు. అయితే ఆ మార్గంలో వెళ్ళడానికి ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఈ రెండు అంశాలలో ఆచి తూచి వ్యవహరించి తాను ఇబ్బంది పడకుండా, ఇరుక్కుపోకుండా, విమర్శలు ఎదుర్కోకుండా వుండేలా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పోలవరం ఆర్డినెన్స్‌కి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే లోక్‌సభలో బిల్లును ఆమోదించాలని భావిస్తోంది. అదేవిధంగా గవర్నర్‌కి అధికారాల విషయంలో కూడా తాను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వుండేలా కూడా కేంద్రం కసరత్తు చేస్తోంది. మొత్తమ్మీద కేంద్రం సేఫ్ గేమ్ ఆడుతోంది.

నెత్తీనోరూ బాదుకున్నా ప్రతిపక్ష హోదా దక్కదు!

  దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టినంత దరిద్రపు దుస్థితి భవిష్యత్తులో మరేపార్టీకీ పట్టదేమో! ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఒక వెలుగు వెలిగి, ఆడింది ఆటగా పాడింది పాటగా హవా నడిపించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంకఛండాలంగా తయారైంది. కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో పవర్ పోయింది. అయిదేళ్ళపాటు పనికిమాలిన రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే, లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రావడం దేశ ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించే విషయమే. సాధారణంగా లోక్‌సభలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 52 లోక్‌సభ స్థానాలు సాధించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలతో సరిపెట్టుకోవడంతో 16వ లోక్‌సభలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయింది. అయితే తాము చేసిన ఘోర తప్పిదాల ఫలితమే ఈ పరిణామమని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ సరిపెట్టుకోకుండా ఈ అంశం విషయంలో నానా రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వరూ అంటూ బీజేపీని బతిమాలే ధోరణిలో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ అతి వినయాలకు లొంగకపోవడంతో స్వరం పెంచింది. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా బీజేపీ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అహం దెబ్బతింది. దాంతో ఆమే స్వయంగా రంగంలోకి దిగి తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని మొత్తుకున్నారు. సీట్ల బలాబలాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎంతమాత్రం సిగ్గుపడకుండా అడిగేశారు. అలా ఇవ్వకపోతే మర్యాదగా వుండదని కూడా బీజేపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల ముందే తమ పార్టీ తమలాంటి దరిద్రపు భావాలున్న పార్టీలతో జతకట్టాం కాబట్టి, అన్ని పార్టీలకూ వచ్చిన సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆమె కాకమ్మ లెక్కలు చెప్పారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పార్లమెంటుని సాగనివ్వమని కూడా బెదిరింపు సెక్షన్‌లోకి ఆమె దిగారు. ఈ బెదిరింపులను చూస్తుంటే అధికారం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఎంతమాత్రం బుద్ధిరాలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చూడమ్మా సోనియమ్మా.. మీరెంత అరిచి గీపెట్టినా, నెత్తీనోరూ బాదుకున్నా మీకు ప్రతిపక్ష హోదా దక్కదు.

అంబానీ అందుకు రాలేదా?

  రిలయన్స్ అధిపతి అనిల్ అంబానీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయినపుడు, ఆయన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపన కోసం మాట్లాడేందుకే వచ్చారని అందరూ భావించారు. కానీ, ఆయన తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట వద్ద ఏర్పాటు చేసిన 7000మెగా వాట్స్ సామర్ధ్యం గల గ్యాస్ ఆధారిత రిలయన్స్ పవర్ ప్లాంటుకు కృష్ణ-గోదావరి బేసిన్ నుండి సరిపోయినంత గ్యాస్ అందజేయవలసిందిగా కోరేందుకే వచ్చారని స్పష్టమయింది.   సామర్లకోటలో ఏర్పటు చేసిన రిలయన్స్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ గత అనేక సంవత్సరాలుగా ఆశించిన మేర గ్యాస్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతోంది. తమ ప్లాంటుకు అధనంగా గ్యాస్ కేటాయించవలసిందిగా రిలయన్స్ సంస్థ యూపీఏ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నిరాకరించడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పతి జరగడంలేదు. చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ మరియు కేంద్రమంత్రులతో సత్సంబంధాలున్నందున, చంద్రబాబు ద్వారా తమ సంస్థకు అదనపు గ్యాస్ సంపాదించుకొనే ప్రయత్నంలోనే ఆయనను అంబానీ వచ్చి కలిసారు.   అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తూ, తాను కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఇటువంటి గ్యాస్ ఆధారిత ప్లాంట్లు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులను నివారించేందుకు కేజీ బేసిన్ లో ఫ్లోటింగ్ గ్యాస్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అనిల్ అంబానీ మాత్రం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలేవీ స్థాపిస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ ఆ తరువాత ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు మాత్రం అక్కడ కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.   అన్నివిధాల క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావాలంటే తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా పొందవలసి ఉంటుంది. ప్రత్యేకహోదా కోసం గట్టి ప్రయత్నాలు చేయకుండా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనుకోవడం అత్యాసే అవుతుంది. అందువల్ల రాష్ట్ర యంపీలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి కట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గట్టిగా ప్రయత్నించాలి.

నగరం లాంటి నరకాన్ని మళ్ళీ సృష్టించొద్దు!

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోనసీమలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అనకొండ రెండు పదులకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న దుర్ఘటన రాష్ట్ర ప్రజల స్మృతిపథం నుంచి ఇంకా తొలగిపోలేదు. పల్లె ప్రజల మీద పగబట్టిన తాచులాగా విషాగ్నిని చిమ్మిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం ఎప్పటికీ మరచిపోలేని విషాదం. ఇలాంటి విషాద సంఘటన మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన రాష్ట్రం నుంచి గ్యాస్‌ని తరలించుకపోతున్న సంస్థల మీద వుంది. సదరు సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వాల మీద కూడా వుంది. ఇప్పుడు కోనసీమ ప్రజలు పల్లెపల్లెలో విస్తరించి వున్న గ్యాస్ పైప్ లైన్లను చూస్తేనే భయంతో వణికిపోతున్నారు. ఏ పైప్ లైన్ ఎప్పుడు పగులుతుందో, మళ్ళీ ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని భయపడుతున్నారు. వారి భయానికి తగ్గట్టుగానే కోనసీమలోని అనేక గ్యాస్ పైప్ లైన్లు తుప్పుపట్టి అవసానదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాంటి పైపులను వెంటనే మార్చాల్సిన గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, కోనసీమ ప్రజలు భయపడుతున్నట్టుగానే అక్కడ అడపా దడపా గ్యాస్ లీకేజీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాకినాడ సమీపంలోని సర్పవరం ప్రాంతంలో ఒక గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గ్యాస్ సంస్థ అధికారులకు సమాచారం అందించడంతో సదరు సంస్థ సిబ్బంది హుటాహుటిన వచ్చి గ్యాస్‌ని ఆపినట్టు సమాచారం. ఇక్కడ గ్యాస్ లీక్ అవడాన్ని స్థానికులు గమనించడం వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు స్పందించాలి. కాలం చెల్లిన గ్యాస్ పైప్‌లైన్లను మార్చాలి. మరోసారి ‘నగరం’ గ్రామం లాంటి నరకాలను సృష్టించకుండా వుండాలి. ‌

భూములు.. కేసీఆర్‌కి షాకులు..!

  ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసే ముహూర్తాలు మంచివి కాకపోతే సదరు ముఖ్యమంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జ్యోతిషులు చెప్పే మాట నిజమే అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తంలో ఏదో తేడా వున్నట్టే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయి. భూమిని నమ్మున్న రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలులో జాప్యం చేయడం తెలంగాణ రైతాంగంలో ఆయనకి గౌరవాన్ని సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ రావడం రావడం గురుకుల్ ట్రస్ట్ భూముల మీద తన ప్రతాపం చూపించారు. నిర్మాణంలో వున్న కొన్ని భవంతులను కూలగొట్టించారు. ప్రతిపక్షంలో వుండగా గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుగోలు చేసిన వారి పక్షాన నిలబడిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ గత విధానానికి వ్యతిరేకంగా పనిచేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అలాగే లగడపాటి రాజగోపాల్‌కి చెందిన ల్యాంకో హిల్స్ మీద కేసీఆర్ దృష్టి పడింది. లాంకోహిల్స్ మీద తన ప్రతాపం చూపించడానికి కేసీఆర్ సర్వ సన్నాహాలు చేసుకున్నప్పటికీ చట్టరీత్యా లాంకో హిల్స్‌ను తాను ఏమీ చేయలేనని అర్థం చేసుకున్న ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌లోని గోకుల్ ఫ్లాట్స్ మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి ప్రారంభించింది. దీని మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ ఎన్జీవోలకు చెందిన హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా ఉన్నాయనే సాకు చూపించి ఆ భూములను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ స్థలానికి సంబంధించిన వివాదాలు కోర్టులో వున్న కారణంగా ఇక్కడ ఎపీ ఎన్జీవోలు ఇళ్ళు నిర్మించుకోలేదు. అంతే తప్ప హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా వుండటానికి మరే ఇతర కారణాలూ లేవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వివాదంగా మారింది. కేసీఆర్ ఏపీ ఎన్జీవోల విషయంలో కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, దీనిమీద నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈరకంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం షాక్ తిన్నది. దీన్నిబట్టి మనకి అర్థం అవుతున్నదేమిటంటే, కేసీఆర్ ప్రభుత్వం భూముల గొడవల్లో తల దూర్చకపోవడం మంచిది.

పారిశ్రామిక ప్రగతిపథంలో ఆంధ్రప్రదేశ్!

  గడచిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయం ద్వారా తమను తామే అభివృద్ధి పథం వైపు నడిపించుకుంటున్నారు. ఆ నిర్ణయమే తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రాష్ట్రాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి వుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వం చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి నాయకత్వం అప్పగించి తమ విజ్ఞతను చాటుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు చూపించిన విజ్ఞతకు తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అభివృద్ధే ఏకైన నినాదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు దార్శనికత మీద దేశ వ్యాప్తంగా సదభిప్రాయం వుంది. ఆ సదభిప్రాయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. శ్రమించే తత్వం వున్న ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, సమర్థవంతంగా వాటి నిర్వహణకు పూర్తి అనుకూలమైన రాష్ట్రమన్న అభిప్రాయం దేశ పారిశ్రామిక వర్గాలలో ఇప్పటికే ఏర్పడింది. దానితోపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం కూడా రాష్ట్రానికి ఒక వరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఏడాది తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా కళ్ళు చెదిరే అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు నొప్పిగా వుందా జగన్ బాబూ?

  వైసీపీ నాయకుడు జగన్‌కి, ఆయన అనుయాయులకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కంటే ఏదో ఒక హడావిడి చేస్తూ వార్తల్లో నిలిచే అంశమే ప్రధానంగా వున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పాయింట్ పట్టుకుని ఊరేగుతున్నారు. అది మునిసిపల్ స్థానాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టిందని, వారిని తనవైపు లాక్కుందని వారు తాజాగా లేవనెత్తిన పాయింట్. ఈ విషయం మీద వైసీపీ నాయకుడు జగన్ గవర్నర్ని కూడా కలసి మొత్తుకున్నారు. పాపం జగన్ బ్యాచ్ లోపాలన్నీ తమవైపు పెట్టుకుని తెలుగుదేశాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో జగన్ నాయకత్వం మీద అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్ పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత పీక్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేకమంది పార్టీ మారుతున్నారు. అలాగే స్థానిక ఎన్నికల అధ్యక్ష పీఠాల ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా చాలామంది వైసీపీకి స్వచ్ఛందంగా గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోవడానికి కారణమయ్యారు. జగన్ మీద వున్న వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తూ వుండటం వల్ల వైసీపీ నాయకులు అనేకమంది తెలుగుదేశం వైపు ఆకర్షితులయ్యారు. వైసీపీ నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా చాలామంది తెలుగుదేశం వైపు వచ్చేశారు. తమ పార్టీ నాయకులు తనకు గుడ్ బై కొట్టడం వెనుక వున్న అసలు విషయాలను జగన్ పరిగణనలోకి తీసుకోకుండా ఆయన తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడంలో బిజీగా వున్నారు. పాపం జగన్‌ బాబుకి తన పార్టీ నుంచి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది. అందుకే ఫ్లాష్‌బ్యాక్‌ని మరచిపోయి మాట్లాడుతున్నారు. గతంలో అనేకమంది తెలుగుదేశం నాయకుల మీద, శాసనసభ్యుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించి, వారిని వైసీపీలోకి లాక్కుని తెలుగుదేశం పార్టీని ఏకాకిని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు. అప్పుడు తాను చేసింది న్యాయం.. ఇప్పుడు జరిగింది అన్యాయం అన్నట్టు మాట్లాడుతున్న జగన్‌ని ఏమనాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం నాయకులను తన పార్టీలోకి లాక్కున్నప్పుడు ఎగిరి గంతులేసిన జగన్‌కి ఇప్పుడు తన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ వుండేసరికి ఆ నొప్పేమిటో తెలిసొచ్చిందని చెబుతున్నారు.

కేసీఆర్ జీ... రైతుల ఆత్మహత్యలు ఆపండి!

ప్రస్తుతం తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కటే కోరుతున్నారు... అదే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆపండని! అసలే తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా యువకులు, రైతులు చాలా సున్నిత హృదయం కలవారు. మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి, ఇక రాష్ట్రంలో ఆత్మహత్యలనేవే వుండవని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ యువకులు.. ఇప్పుడు రైతులు. ఈ ఆత్మహత్యల పర్వం తెలంగాణ తల్లికి కడుపు కోతను మిగులుస్తోంది. ఎంతో ఆత్మ గౌరవంతో స్వపరిపాలనను సాధించుకున్న ఈ సమయంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుండటం అత్యంత విచారకరమైన విషయం. ఎన్నికల సందర్భంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని కలిగించింది. కేసీఆర్ మాటని నమ్మిన తెలంగాణ రైతులు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. కేసీఆర్ ప్రభుత్వం రుణాల మాఫీకి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలిస్తున్న సమయంలోనే రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటడం తెలంగాణ రైతుల సున్నిత మనస్తత్వానికిమరోసారి అద్దం పడుతోంది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్న అపోహకి గురైన ఇద్దరు రైతులు కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అన్నదాతలు, నల్లగొండ జిల్లాలో ఒక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురు రైతులూ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెబుతూ వున్నప్పటికీ రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమైన అంశం. అయితే రుణ మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతున్న దారిలో వెళ్తున్నందువల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. రైతు రుణాల మాఫీ విషయంలో రైతులలో ఏర్పడిందని భావిస్తున్న అపనమ్మకాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే వుంది. రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రైతుల్లో అపోహలు తొలగించేలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే రైతు రుణ మాఫీ విషయంలో మనసులు కష్టపెట్టుకున్న ఆరుగురు తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకముందు మరొక్కరు ఆత్మహత్య చేసుకున్నా అది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.

గంగా ప్రక్షాళనకు సిద్దమవుతున్న మోడీ సర్కార్

  హిందువులందరికీ పరమ పవిత్రమయినది గంగానది. జీవితంలో ఒక్కసారయినా గంగా నదిలో స్నానం చేసి పూజిస్తే చాలనుకోనేవారు కోకొల్లలు. తమ జీవిత అంతిమ యాత్ర గంగానదిలోనే పూర్తిచేయాలని అక్కడికి తరలివెళ్ళేవారూ చాలా మంది ఉన్నారు. ఆ నదిని ఆనుకొని ఉన్న అనేక నగరాలు, పరిశ్రమలు గత అనేక దశాబ్దాలుగా మురికి నీటిని, పారిశ్రామిక వ్యర్ధాలను, ప్రమాదకరమయిన రసాయనాలను పవిత్రమయిన గంగానదిలోకి విడిచి పెడుతూ పూర్తిగా కలుషితం చేసాయి. తత్ఫలితంగ నదిలో అనేక జీవరాసులు చనిపోతున్నాయి. వాటిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. ఆ నీటిని త్రాగిన వారు రోగాల పాలవుతున్నారు. గంగలో మునిగితే పాపాలు పోవచ్చునేమో కానీ కొత్త రోగాలు రావడం తధ్యం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.   ఈ సమస్య పరిష్కారం కోసం గంగానదిని సమూల ప్రక్షాళన చేయాలని చాలా ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు, మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ దానిపై వందల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ఇంతకాలం వెనుకాడుతున్నాయి. కానీ, నరేంద్ర మోడీ తన ప్రభుత్వంలో జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ఉమా భారతికి, గంగా ప్రక్షాళణా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా అప్పజెప్పారు. ఆమె ఈరోజు ‘గంగా మదన్’ (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా) (ఎన్‌ఎంసీజీ) అనే ఒక జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అందులో మేధావులు, పర్యావరణవేత్తలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, జల వనరుల శాఖ, షిప్పింగ్ అండ్ టూరిజం శాఖ, గంగా నది ప్రవహించే రాష్ట్రాలకు చెందిన అధికారులు మరియు మరికొన్ని ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకొన్న తరువాత, ఈ ప్రక్షాళన కార్యక్రమానికి అధికారులు, నిపుణులు, మేధావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ లేదా సంఘాన్ని ఒక దానిని ఏర్పరచి దాని ఆధ్వర్యంలో పని మొదలుపెట్టే అవకాశం ఉంది.   ఈ సమావేశానికి సాధువులను కూడా ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెపుతోంది. గంగా మదన్ కార్యక్రమాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలి తప్ప ఒక హిందూ కార్యక్రమంగా నిర్వహించడం సరికాదని కాంగ్రెస్ అభిప్రాయ పడింది. ఏమయినప్పటికీ గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని, చేయని పనిని బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. గంగా నదితో బాటు యమునా నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉమాభారతి తెలిపారు.

తమిళనాడులో 11మంది తెలుగువాళ్ళు మృతి

  హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో 24మంది విద్యార్ధులు మరణించినప్పటి నుండి తెలుగువాళ్ళను ఒకదాని తరువాత మరొక విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాణాలు బలిగొంటూనే ఉన్నాయి. ఆ ప్రమాదం నుండి కోలుకోకముందే తూర్పుగోదావరి జిల్లాలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో 17మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులో 11అంతస్తుల భవనం కూలినపుడు 63మంది మరణించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో ఉపరవలయం అనే ప్రాంతంలో కూలీలు ఉంటున్న గుడిసెలపై గోడ కూలి ఒక పసిపాపతో సహా 11మంది తెలుగు వాళ్ళు మరణించారు. వారందరూ ఉత్తరాంధ్రాకు చెందినవారు. శిధిలాల క్రింద మరికొంత మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంబంధిత అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, పొక్లేయిన్ల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. శిదిలాల క్రింద నుండి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఒక కంపెనీ కోసం 20అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ నిర్మిస్తుంటే, మొన్న కురిసిన వానలకి నాని కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు నెల్లూరు నుండి రాష్ట్రానికి చెందిన ఒక అధికారుల బృందం ఈరోజు ఉదయం తిరువళ్ళూరుకు బయలుదేరింది.

మోడీ ప్రభుత్వం చేత కంట తడిపెట్టిస్తున్న ఉల్లి

  వర్షాభావ పరిస్థితుల వలననో లేక బ్లాక్ మార్కెట్ వ్యాపారుల కారణంగానో మొత్తం మీద మళ్ళీ ఉల్లి ధరలు సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయాయి. ఉల్లి ధరల అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎగుమతి ధరను టన్నుకి 300 డాలర్ల నుండి ఒకేసారు 500 డాలర్లకు పెంచింది. ఉల్లిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది. హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిని నిర్దిష్ట పరిమితికి మించి గోదాములలో నిలువచేయరాదని, చేస్తే కటిన చర్యలు తీసుకొంటామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్లాక్ మార్కెటర్లపై కటిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా కూడా ఈ చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఈయలేదు. అందువల్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కటినచర్యలు తీసుకొనేందుకు వీలుగా నిత్యావసర సరుకుల చట్టానికి మరింత పదునుపెడుతూ, ఉల్లిని అక్రమంగా గోదాములలలో నిలువచేసిన వారిని నాన్ బెయిలబుల్ కేసుల క్రింద బుక్ చేయాలని నిశ్చయించింది. త్వరలో జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.   ప్రతీ ఏట ఎదురయ్యే ఈ ఉల్లి మరియు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను స్థిరీకరించేందుకు, శాశ్వితప్రాతిపాదికన ‘ధరల స్థిరీకరణ నిధి’ ని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. కూరలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నపుడు, ఈ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమయిన మేరకు డబ్బు వాడుకొని ధరలను స్థిరీకరించవలసి ఉంటుంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ఇందుకు అవసరమయిన సొమ్మును కేటాయిస్తుంది. నిన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో డిల్లీలో జరిగిన 26రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు.   అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఎన్ని చర్యలు చెప్పట్టినా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనంతవరకు దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. అంతేకాక వివిధ రాష్ట్రాలలో ఉల్లి, దుంపలు ఇతర నిత్యావసర సరుకుల మార్కెట్లను బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నియంత్రిస్తున్నారు. అటువంటివారిని గుర్తించి వారిపై కటిన చర్యలు చేప్పట్టనంత కాలం ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం సాధ్యం కాదు.