కుటుంబాన్నే చంపేశాడు

  శుక్రవారం నాడు వరల్డ్ ఫ్యామిలీ డే. కుటుంబ ప్రాధాన్యాన్ని తెలిపే రోజు. కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పే రోజు. కుటుంబానికి సంబంధించి ఇంత ప్రాధాన్యం వున్న ఈ రోజున హైదరాబాద్‌లో ఓ కిరాతకుడు తన కుటుంబాన్నే చంపేశాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలో వున్న సాయినగర్‌తో ఈ ఘోరం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సమ్మిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి తన తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఈ ముగ్గర్నీ చంపేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పరైరయ్యాడు. తర్వాత ఓ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు జరిగిన సమయంలో హంతకుడి పెద్దకూతురు ప్రత్యూష ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడింది.

500 ‘ఆ’ వీడియోలు దొరికాయి

  బెంగుళూరులో ‘ఆ’ తరహా వీడియోలను తయారు చేస్తూ, వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఒక ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి ‘ఆ’ తరహా వీడియోలు 500 స్వాధీనం చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఈ ‘కుటీర పరిశ్రమ’ పెట్టింది డబ్బు సంపాదన కోసం మాత్రమే కాదు.. తనలోని ‘హాబీ’ని సంతృప్తి పరచడానికి అని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. కౌశిక్ కునార్ అనే కోటీశ్వరుడికి బోలెడంత డబ్బుంది. విదేశాలలో చదువుకున్నాడు. కుటుంబంలో అందరూ ఉన్నత స్థానాల్లో వున్నారు. అందమైన భార్య కూడా వుంది. అయితే కౌశిక్‌కి బ్లూఫిలింలు నిర్మించడం అంటే సరదా. డబ్బు అవసరం అమ్మాయిలను లోబరుచుకుని, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ బ్లూఫిలిమ్స్ చిత్రీకరించేవాడు. మహిళలను హింసిస్తూ బ్లూఫిలిమ్స్ చిత్రీకరించడం ఇతని స్పెషాలిలీ. వాటిని ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయడం ద్వారా బోలెడంత డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. ఈ బ్లూఫిలిమ్స్ బిజినెస్ కోసం అతను ఒక అత్యాధునిక ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నాడు. అత్యాధునిక వీడియో కెమెరాలు 20కి పైగా అతని దగ్గర వున్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తూకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ కేసును పోలీసులు చేపట్టి, ఛేదించారు.

ప్రధానికి బీజింగ్‌లో ఘన స్వాగతం

    భారత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఆయన చైనా పర్యటనలో రెండోరోజు శుక్రవారం నాడు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ దగ్గర నరేంద్రమోడీకి చైనా ప్రభుత్వం అధికారికంగా ఘన స్వాగతాన్ని అందించింది. మోడీ స్వాగత కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కెషాంగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత మోడీ, లీ కెషాంగ్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్య గురించి, భారత్‌లో చైనా పెట్టుబడులు పెట్టే అంశం గురించి చర్చించారు. సమావేశం కొనసాగుతోంది. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం వుంది. మోడీ శనివారం నాడు చైనా సంస్థల సీఇఓలతో సమావేశం అవుతారు.

రాహుల్‌కి కడుపునొప్పికి కారణమేంటి?

  తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కడుపు నొప్పి వచ్చింది. ఆయన జ్వరంతో కూడా బాధపడ్డారు. పాదయాత్ర కోసం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కి వచ్చిన ఆయన గురువారం రాత్రి కడుపునొప్పి, జ్వరంతో బాదపడ్డారు. వెంటనే ఆయన తనకు కేటాయించిన హోటల్ రూమ్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. తమ నాయకుడికి కడుపునొప్పి వచ్చిందని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మల్‌లోని ఒక ప్రైవేట్ వైద్యుడిని రాహుల్ గాంధీ దగ్గరకి పంపించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రయాణిక బడలిక కారణంగా జ్వరం వచ్చిందని, ఆహారం సరిపడకపోవడం వల్ల కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ నిర్ధారించి, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలు తేరుకున్నాయి. అయితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళను ఆపుకోలేక రాహుల్ గాంధీ తమకు దర్శనం ఇస్తేగానీ తమ మనసులు శాంతించవంటూ రాహుల్ బసచేసిన హోటల్ ముందు చేరి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వచ్చి, రాహుల్ బాగానే వున్నారని చెప్పడంతో వారు మనశ్శాంతి పొంది వెనుదిరిగారు.

ఆ ముగ్గురికీ ఆ ‘టెస్ట్’ చేస్తారట..

  కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది. మొదట ఆమెది అనుమానాస్పద మృతి అని భావించినప్పటికీ, తర్వాత అది హత్యగా పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసిందే. సునంద హత్య జరిగిన రోజున, అంతకుముందు జరిగిన పరిణామాలను పరిశోధిస్తున్న ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ముగ్గురు సాక్షులుగా వున్న శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ దావన్కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరేకు తమకు అనుమతినివ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ ముగ్గురూ దర్యాప్తుకు సహకరించకుండా తమ ప్రశ్నలకు నోటికి వచ్చిన సమాధానాలు చెబుతున్నారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది.

రైతులకు షాక్.. భూసేకరణకు జీవో

  ఆంధ్రరాష్ట నూతన రాజధాని కోసం భూములు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు, ఇవ్వమని రైతులు చెపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షాకిచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను రైతులు ఇవ్వాలని జీవోను జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2, 3 చాప్లర్ల నుంచి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ జీవో 166ను జారీ చేసింది. భూసేకరణకు సంబంధించిన అన్ని అధికారాలను కలెక్టర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల నుండి ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకుంటుంది.

ప్రాణం తీసిన సెల్ఫీ

  సెల్ఫీల పిచ్చి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు అది కాస్త ముదిరి సాహసాలు చేస్తూ ఫోటోలు తీసి మరీ పెడుతున్నారు యువత. అలా సాహసం చేసి ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకుంది ఓ యువతి. ఈ ఘటన ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో చోటుచేసుకుంది. అన్నా ఉర్సూ అనే యువతి ఓ సెల్ఫీ తీసి పోస్ట్ చేయాలనుకుంది అది కూడా మామూలుగా కాదు రైలు పైకి ఎక్కి. అనుకున్నదే తడువుగా వెంటనే రైలు పైకి ఎక్కింది. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె కాలు పొరపాటున హైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలవ్వగా ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె రైలు ఎక్కుతున్నప్పుడు ఎక్కొద్దని హెచ్చరించానని ఆమె వినిపించుకోకుండా ఎక్కిందని అక్కడ ఉన్న ప్రయాణికుడు తెలిపాడు.

రోడ్డు ప్రమాదంలో జీజేపీ నేత మృతి

  పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో స్థానిక భాజపా నాయకుడు అసిత్ శంకర్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. రాజ్ గంజ్ లోని తన పార్టీ కార్యలయం నుండి అసిత్ శంకర్ తిరిగి వస్తుండగా బెలకొడ వద్ద తన కారును ద్విచక్ర వాహనం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో అసిత్ శంకర్ కు తీవ్ర గాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అసిత్ శంకర్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు రాజ్ గంజ్ రోడ్డు వద్ద ధర్నాకి దిగారు. రాజ్ గంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ సరైన ట్రాఫిక్ నిబంధనలు లేనందుకు ఈ ప్రమాదం జరిగిందని, అక్కడ సరైన ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీడీవో ఎస్.పి షెర్బా వచ్చి నచ్చజెప్పడంతో వారి ఆందోళనలు విరమించారు.

నా కొడుకును కాపాడండి... దేవేందర్ గౌడ్

  నేపాల్ దేశంలో భూకంపం వచ్చి అక్కడి ప్రజలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఆస్తి నష్టం కలిగింది. ఆ దేశానికి సాయం చేయడానికి భారత్ సహా ఎన్నో దేశాలు ముందుకొచ్చాయి. అలా వారికి సాయం చేయడానికి వెళ్లిన వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కూడా ఉన్నాడు. అయితే మంగళవారం నేపాల్ లో మళ్లీ భూకంపం వచ్చింది. ఈ ప్రమాదంలో కొండ చరియలు విరిగిపడటంతో వాటి నుండి జాగ్రత్తగానే తప్పించుకున్నారు కానీ అక్కడి నుండి ఎలా బయట పడాలో వాళ్లకు తెలియడం లేదట. దీంతో దేవేందర్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తన కొడుకు తోపాటు మరో 16 మంది బృందాన్ని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర మంత్రులను కోరారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాశం జిల్లా దోర్నాలోని బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా విధానంలో రైతులు చితికిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా బాగా రెచ్చిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫియాను అరికట్టామని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 500 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇంకొంతమంది రుణమాఫీ చేయడం అసాధ్యమన్నారని.. కానీ 24వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పారు.

ప్రధాని 64 వేల కోట్ల ప్లాన్

  ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా మొదటి రోజు జియాన్ చేరుకున్నారు. జియాన్ లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని సందర్శించిన ఆయన తరువాత ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక పార్ధనలు చేశారు. అనంతరం ఆయన చైనా అధ్యక్షుడు జి షిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన వివిధ వాణిజ్య ఒప్పందాలు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. దాదాపు 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని, సుమారు 64వేల కోట్ల రూపాయల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల 19 వరకు మోడీ చైనాలోని మంగోలియా, దక్షిణకొరియా లో పర్యటించనున్నారు.

కేజ్రీవాల్ కు అక్షింతలు వేసిన సుప్రీం

  భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో రైతు గజేంద్రసింగ్ మరణించిన విషయంలో, ఆప్ మంత్రి నకిలీ డాక్యుమెంట్లు చూపిన విషయంలో మీడియా రాద్దాంతం చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియా పై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాపై పరువు నష్టం కింద కేసులు రిజస్టర్ చేయాలంటూ, హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలంటూ అధికారులను సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో కూడా మీడియాకు ప్రవేశం నిషేదించారు. అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ మీడియాకు వ్యతిరేకంగా సూచించిన సూచనలను తిప్పికొట్టింది. కేజ్రీవాల్ పంపిన సర్క్యులర్ పై స్టే విధించింది. అధికారం చేతికి వచ్చేంత వరకు మీడియాను ఉపయోగించుకోని ఇప్పుడు మీడియాతో కయ్యానికి దిగిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.

నా ప్రాజెక్టును ఏవరూ ఆపలేరు.. చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అవుకు రిజర్వాయర్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లుడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు వస్తే రాయలసీమకు నీటి కొరత ఉండదని, కానీ ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామంటే కొంతమంది అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నా ప్రాజెక్టును ఆపలేరని స్పష్టం చేశారు. అవసరమైతే జల విద్యుత్ ను తెలంగాణకు ఇచ్చి రాయలసీమకు కృష్ణా జలాలు తరలిస్తామని అన్నారు. రాయలసీమకు గోదావరి నీరు ఇస్తున్నామని గోదావరి వాసులను రెచ్చగొడుతున్నారని, నీచ రాజకీయాతో గోదావరి ప్రాజెక్టును అడ్డుకున్నారని అన్నారు. కానీ.. పోలవరం ప్రాజెక్టుకు అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అనవసరంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని ఇకనుండి అన్ని పనులు స్వయంగా పర్యవేక్షిస్తామని తెలిపారు.

తెలంగాణలో మరో సమ్మె

  తెలంగాణలో అలా ఆర్టీసీ సమ్మె ముగిసిందో లేదో మరో సమ్మెకు తెర లేచింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ 108 ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగారు. తొలగించిన ఉద్యోగులను విధల్లోకి తీసుకోవాలని, వేతన సవరణలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో జీవీకే యాజమాన్యం, 108 ఉద్యోగుల మధ్య చర్చలు విఫలమవ్వడంతో.. 108 నిర్వహణ నుండి జివికె ను తప్పించాలని, ప్రభుత్వ హయాంలోనే 108 సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో ఇటీవల జరిగిన చర్చలు ఈ నెల 13వ తేదీ బుధవారానికి వాయిదా పడ్డాయి. బుధవారంనాడు మళ్లీ చర్చలు విఫలం కావడంతో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఉద్యోగులు చెప్పారు. సమ్మె వల్ల దాదాపు 300 వాహనాలు నిలిచిపోయాయి.

బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన వృద్ధురాలు

  నల్గొండ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా, సూర్యాపేటలోని శాంతినగర్ లో ఓ వృద్ధురాలు అభంశుభం తెలియని ఓ ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు తన పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంటల వల్ల బాగా గాయపడిన పాపను స్థానిక ఆస్పత్రికి తరలించారు కానీ.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. పాప కుంటుంబ సభ్యులు ఆ వృద్ధురాలిపై ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. కానీ వృద్ధురాలి బంధువులు మాత్రం ఆమెకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్నారు.

ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

  ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి హైదరాబాద్ లో ఉనికిని కోల్పోయిందని, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపి హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిని హైదరాబాద్ లోనే కొనసాగించుకోవచ్చని, తమ రాష్ట్రంలో తామే పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు నిచ్చింది. తదుపరి విచారణను నాలుగు రోజుల పాటు వాయిదా వేసింది.

తెలంగాణా ఎంసెట్ పరీక్ష నేడే

  రాష్ట్ర విభజన జరిగి ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఎంసెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించే విషయంలో రెండు ప్రభుత్వాలు పంతాలకు పట్టింపులకి పోయాయి. కానీ చివరికీ తెలంగాణా ప్రభుత్వం తన పంతమే చెల్లించుకొంది. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే వేరేగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకొంది.   ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఎంసెట్ పరీక్షలు జరుగబోతున్నాయి. వీటికి మొత్తం 2,31,998 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. వీరిలో 1,39,636మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్, 92,362 మంది విద్యార్ధులు మెడికల్ ఎంట్రన్ పరీక్షలు వ్రాస్తున్నారు. వీరి కోసం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 432 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 189 కేంద్రాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు కనుక పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో ఎనిమిది జోన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది జోన్లలో పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులను చేర్చేందుకు ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా మొత్తం 261 బస్సులను కూడా ఏర్పాటు చేసారు. కానీ నిన్నటితోనే ఆర్టీసీ సమ్మె ముగియడంతో ప్రభుత్వం, ఎంసెట్ నిర్వాహకులు కూడా ఊపిరి పీల్చుకొన్నారు. తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఎంసెట్ పరీక్షల కోసం ‘కోడ్-క్యూ’ పరీక్షా పత్రాల సెట్ ని ఎంపిక చేసారు. తాజా సమాచారం ప్రకారం కొద్ది సేపటి క్రితమే రాష్ట్రంలో అన్ని సెంటర్లలో ఎంసెట్ పరీక్ష మొదలయింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా సాగుతోంది.