టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టిన మావోయిస్టులు

గ్రీన్ హంట్ నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఖమ్మంజిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ చేసిన ఆరుగురు నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం చత్తీస్ గఢ్ సరిహద్దులో వారిని వదలిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆరుగురు నేతలు చర్లకు చేరుకున్నారు.. మరికాసేపట్లో భద్రాచలం చేరకోనున్నారు. కాగా భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని.. లేదంటే టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.

సజావుగా సాగుతున్న వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్

  వరంగల్ లోక్ సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లో నిలబడి ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు వీలుంటుంది. కడియం శ్రీహరి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ఉన్న ఒకే ఒక స్థానానికి తెరాస, బీజేపీ, కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ తో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో ఉన్న 15, 09, 671 ఓటర్ల కోసం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 9, 428 మంది ఎన్నికల సిబ్బందిని, 20 కంపెనీల పోలీసు బలగాలను ఎన్నికల సంఘం నియమించింది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.

మాలి ఉగ్రవాదుల చెర నుండి బందీలను విడిపించిన సంయుక్త దళాలు

  మాలీ రాజధాని బమాకో లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కిన 170 మందిలో 143 మందిని సంయుక్త దళాలు సురక్షితంగా విడిపించాయి. మిగిలిన 27మంది ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చిక్కిన 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఈ మిలటరీ ఆపరేషన్ లో మాలి, ఫ్రాన్స్, అమెరికా, ఐఖ్యరాజ్య సమితికి చెందిన భద్రతా దళాలు పాల్గొన్నాయి. సంయుక్త దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.   అల్ మౌరాబి టౌన్ అనే తీవ్రవాద సంస్థ ఈదాడికి పాల్పడినట్లు ప్రకటించుకొంది. అది అల్ ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ. మాలీ ఉత్తర రాష్ట్రాలలో తువారెగ్, అరబ్ అనే మరో రెండు ఉగ్రవాద సంస్థలు కూడా దానితో బాటు పనిచేస్తున్నాయి. గత రెండు మూడేళ్ళుగా మాలిలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఉగ్రవాదుల దాడుల్లో ఏకంగా 27మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.   నిన్న ఉదయం ఉగ్రవాదులు రాడిసన్ బ్లూ హోటల్ లోకి ప్రవేశించి 170 మందిని బందీలుగా పట్టుకొన్న సమయంలో మాలి రాజధాని బమాకో సమీపంలోనే ఇటువంటి కమెండో ఆపరేషన్లను నిర్వహించడంలో సుశిక్షితులయిన, అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫ్రాన్స్, అమెరికా, ఐరాస భద్రతా దళాలు నిలిచి ఉండటం చాలా కలిసి వచ్చిందని భావించాలి. కేవలం మాలి భద్రతా దళాలు మాత్రమే ఈ మిలటరీ ఆపరేషన్ లో పాల్గొని ఉన్నట్లయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగేమో?   కనీసం పది మంది ఉగ్రవాదులను తాము చూసామని బందీలు చెప్పడంతో మిగిలిన ఉగ్రవాదుల కోసం సంయుక్త దళాలు హోటల్ ని ఆణువణువూ గాలిస్తున్నాయి. హోటల్ చుట్టూ సంయుక్త దళాలు మొహరించి ఉన్నందున ఎవరూ తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. కనుక మిగిలినవారు లోపల ఎక్కడయినా దాగి ఉన్నారా లేక చనిపోయిన 27మందిలో వారు కూడా ఉన్నారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. పారిస్ దాడుల తరువాత వరుసపెట్టి జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తుంటే భారత్ తో సహా అన్ని దేశాలు అటువంటి దాడులు పునరావృతం కాకుండా నిలువరించడానికి తగిన సన్నాహాలు చేసుకోవడం మంచిదని స్పష్టం అవుతోంది.

ఉగ్రవాదుల చెరలో 20మంది భారతీయులు

     పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశ రాజధాని బమాకో నగరంలో రెడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం ఉద్రయం ఉగ్రవాదులు ప్రవేశించి సుమారు 170 మందిని బందీలుగా పట్టుకొన్నారు. వారిలో ఖురాన్ చదువగలిగిన 7మందిని విడిచిపెట్టారు. కొంతమంది బందీలను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన వారిలో 20మంది భారతీయులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ఆ హోటల్లో ఒక దుబాయ్ సంస్థ తరపున పనిచేస్తుండగా మరికొందరు, ఏదో పని మీద బకామోకి వెళ్లి ఆ హోటల్లో దిగి ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారని సమాచారం. 20 మంది భారతీయులు ఉగ్రవాదుల చేతికి చిక్కినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు దృవీకరించారు. మాలీ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూ భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్లే చెపుతున్నారు. హోటల్ ని చుట్టుముట్టిన భద్రతాదళాలు లోపలకి ప్రవేశించి బందీలను విడిపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నాయి.

తండ్రి కేసీఆర్ ను మించిపోయిన కూతురు కవిత.. చిక్కుల్లో పడుతుందా?

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను చూస్తుంటే తన తండ్రినే మించిపోయినట్టు కనిపిస్తోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఎన్నికల ఖర్చు విషయంలో.. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధి పరిమితికి మించి ఖర్చు పెట్టకూడదనే నిబంధన ఉంటుంది. అంతేకాదు వారి ఖర్చుల విషయంలో షాడో అబ్జర్వర్లు కూడా ఉంటారు. వారు అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి ఒక్క పైసా లెక్క రాసుకొని వాటిని ఎన్నికల కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. చివరికి షాడో అబ్జర్వర్లు ఇచ్చిన లెక్కకు, అభ్యర్థుల లెక్కకు సరిపోవాలి. ఇప్పుడు ఈ విషయంలో కవితకు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఆమె ఇచ్చిన లెక్కలో తేడా కనిపిస్తుంది. అయితే తండ్రి కేసీఆర్ చూపించిన లెక్కల్లో 30 లక్షలు తేడా రాగా.. కవిత చూపించిన లెక్కల్లో 32 లక్షలు తేడా వచ్చింది. అయితే కేసీఆర్ పార్టీ ఇచ్చిన సొమ్ములను ఈసీకి సమర్పించలేదు. కానీ కవిత మాత్రం ఈసీ తనకు ఇచ్చిన నిధులకి యథాతథంగా లెక్కలు చూపించింది. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. తప్పుడు లెక్కలు చూపించడం చాలా నేరం. మరి కవిత లెక్కపై ఈసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

టీ టీడీపీ నేతల కొత్త రికార్డ్..

రాజకీయ నేతలు బహిరంగ లేఖలు రాయడం సాధారణమే. కానీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడంలో కూడా టీ టీడీపీ నేతలు సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పాలనలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు  మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య వైఎస్‌కు వరుసపెట్టి బహిరంగ లేఖలు రాసేవారు. ఆ తరువాత వైఎస్ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ మంత్రి శంకర్ రావు బహిరంగ లేఖలు రాసి రికార్డు న‌మోదుచేశారు. ఇప్పుడు టీ టీడీపీ నేతలు ఆ రికార్డ్ ను సైతం బద్దలు కొట్టేశారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ టీడీపీ నేతలు వరుసపెట్టి ఏకంగా తొమ్మిది బహిరంగ లేఖలు రాశారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు సంయుక్తంగా ఒక లేఖ ను విడుద‌ల చేశారు. రేవంత్‌ రెడ్డి, రమేశ్ రాథోడ్‌ మరో లేఖ, ఎర్రబెల్లి దయాకరరావు, ఒంటేరు ప్రతాపరెడ్డి పేరిట మరో లేఖ విడుదల అయ్యింది. అదేవిధంగా రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి ఒకటి, అమరనాథ్‌ బాబు, బుచ్చిలింగం వేరొక లేఖ, ఆర్‌.కృష్ణయ్య, వీరేందర్‌ గౌడ్‌ ఒక లేఖ, శోభారాణి, సీతక్క మరో లేఖ రాసి సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. మరి అంత కష్టపడి రాసిన టీడీపీ నేతల లేఖలకు సీఎం కేసీఆర్ సమాధానం చెపుతారో.. లైట్ తీసుకుంటారో చూడాలి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తాం.. అలాగే ఒబామాను కూడా.. ఐసిస్

పారిస్ లో గత వారం ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు పారిస్ లో దాడి జరిపినట్టే  అమెరికాలో కూడా దాడి జరుపుతామని ఐసిస్ హెచ్చరించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో పారిస్, అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సుమారు 6 నిమిషాలు నిడివి గల ఓ వీడియోను ఇరాక్‌లో రూపొందించారు. ఈ వీడియో ద్వారా ఓ ఉగ్రవాది అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌ హౌస్‌ను బాంబులతో పేల్చేస్తామని.. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మరిన్ని దాడులు చేస్తామని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను, అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా చంపేస్తామని హెచ్చరించాడు. ఆత్మాహుతి బాంబు దాడులు, కారు బాంబులతో మిమ్మల్ని చంపేస్తాం. మీరెక్కడికి వెళ్లినా వదిలిపెట్టం అని వీడియో ద్వారా ఉగ్రవాది బెదిరించాడు. ఈ వీడియోను విడుదల చేయడంతో అమెరికా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. మంత్రులుగా లాలు కొడుకులు

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు..పాట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదిహేనేళ్ల క్రితం కొద్దిరోజులుగా సీఎంగా పనిచేసిన నితీశ్ కుమార్ ఆతరువాత 2005లో 2010లో సీఎం అయ్యారు. 2014 లోకసభ ఎన్నికల్లో బీహార్‌లో పార్టీ దారుణ ఓటమి అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. మాంఝీని ముఖ్యమంత్రిగా తొలగించాక నితీష్ మరోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ కుమార్ తో పాటు మొత్తం 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో లాలు ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ లు కూడా ఉన్నారు. ఇంకా ముగ్గురు మహిళలకు కూడా మంత్రులుగా అవకాశం దక్కింది. కాగా నితీశ్ కుమార్ ప్రమాణ స్పీకారానికి పలువురు కేంద్రమంత్రులు.. 9 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేయగా 4:4:2 అనుకున్న ప్రకారమే పదవులు పంచుకున్నట్టు తెలుస్తోంది.

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బందీలుగా 170 మంది

పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. మాలి రాజధాని బమాకాలో ఉన్నరాడిసన్‌ బ్లూ హోటల్ లోకి 10 మంది ఉగ్రవాదులు చొరబడి చేసి 170 మందిని (140 మంది టూరిస్ట్ లు, 30 మంది హోటల్ సిబ్బంది) నిర్భందించి.. తొమ్మిది మందిని చంపారు. బందీల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్ కు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల దగ్గర భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాగా ఆటోమెటిక్ ఆయుధాలు, బాంబులు ధరించిన ఉగ్రవాదులు సెక్యూరిటీ గార్డులను హత్య చేసి, లోపలికి వెళ్లారని తెలుస్తోంది.

వెంకయ్యనాయుడిది జ్యోతిలక్ష్మీ నాలుక.. మోడీకి కట్టుకున్న పెళ్లాం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెరైటీగా తిట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడులను చాలా విచిత్రమైన పోలికలతో విమర్సించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే.. కాదు కాదు మేము అధికారంలోకి కనుక వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు బీజేపీ పార్టీ, వెంకయ్య నాయుడు కూడా చెప్పారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే మాత్రం నీళ్లు నములుతున్నారని అన్నారు. అంతేకాదు వెంకయ్య నాలుకను జ్యోతిలక్ష్మి నడుముతో పోల్చుతూ.. వెంకయ్యనాయుడు నాలుక జ్యోతిలక్ష్మీ నడుములా ఎటుబడితే అటు తిరుగుతుందని ఎద్దేవ చేశారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా మండిపడ్డారు. మోడీకి ఏపీ కట్టుకున్న పెళ్లామని.. కట్టుకున్న పెళ్లాం లాంటి  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ‘నీతో ఉండను' పొమ్మంటున్నారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నారాయణకు ఈసారి మోడీ, వెంకయ్య బలైయ్యారన్నమాట.

ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన నితీష్ కుమార్

  బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేసారు. దీనితో ఆయన ఐదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణస్వీకారోత్సవం జరుగుతోంది. బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. నితీష్ కుమార్ తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్, ఆ తరువాత పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వారిలో తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని పదాలను సరిగ్గా ఉచ్చరించకపోవడంతో గవర్నర్ రామ్ నాథ్ అతని చేత మళ్ళీ ప్రమాణస్వీకారం చేయించారు.   నితీష్ మంత్రివర్గంలో ఆయనతో కలిపి మొత్తం 28మంది మంత్రులుగా ఉంటారు. వారిలో జెడీయు, ఆర్.జె.డి.ల తరపున చెరో 12 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు కలిపి మొత్తం 28మంది మంత్రులు ఉంటారు. ఈ కార్యక్రమానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీపై వెంకయ్య ఫైర్.. అసహనం పేరుతో విమర్శలు చేస్తోంది..

కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అసహనం పేరుతో విమర్శలు చేస్తోందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అసహనానికి గురైందని.. అందుకే అందరిపై అసహనంతో ఇలా విమర్సలు  చేస్తున్నారు.. ముందు అసహనానికి గురైంది కాంగ్రెస్ పార్టీనే అని.. అది ఆ పార్టీ గుర్తించాలని విరుచుకుపడ్డారు. అనవసరంగా కుల, మత రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపుతోందని.. అందుకే  తన రాజకీయ అవసరాల కోసం కుల, మత శక్తులను ప్రోత్సహిస్తోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌ను పొగుడుతున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని కుల, మత, వర్గంగా విడగొట్టింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించారు.

సీఆర్డీఏ తో చంద్రబాబు సమావేశం..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీఆర్డీఏ తో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యలయాలు నిర్మాణంపై అంతర్జాతీయ అర్కిటెక్ లకు డిజైనింగ్ బాధ్యతలు అప్పగించామని.. ఫిభ్రవరి నెలాఖరుకు డిజైన్ లు ఫైనల్ చేస్తామని.. జూన్ నుండి నిర్మాణాలు చేపడుతామని సీఆర్డీఏ సెక్రెటరీ అజయ్ జైన్ తెలిపారు. ఈ ఫైనల్ డిజైన్ ఎంపికకు 5గురు సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేస్తామని.. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ ప్రపంచస్థాయిలో వినూత్నంగా ఉండే విధంగా డిజైన్లు రూపొందిస్తాని అన్నారు.

లాలు చిన్న కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి?

  బీహార్ ఎన్నికల్లో బీజేపీ పై మహా కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అసలు బీహార్ ఎన్నికల్లో అర్జేడీకి ఎక్కువ ఓట్లు రావు అని భావించినా కానీ జేడీయూ కంటే  అర్జేడీకే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాగూ మొదటి నుండి నితీశ్ నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కాబట్టి ఆయనే బీహర్ ముఖ్యమంత్రిగా ఉంటారు. దీనిలో భాగంగా ఈరోజు ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. మరి లాలు పరిస్థితి ఎంటి అన్నది ప్రశ్న.. అయితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి ఆయన కొడుకులకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి ఆయన నితీశ్ కుమార్ తో మంతనాలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీంతో లాలు చిన్న కొడుకు తేజస్వికి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మోడీకి రాహుల్ గాంధీ సవాల్..

ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. తన పౌరసత్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపక్ష నేతలు నాపై కావాలనే బురద చల్లుతున్నారని.. నా పౌరసత్వంపై వెంటనే దర్యాప్తు చేయండి.. ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే ఏ చర్యలకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. నేను మోడీని చూసి భయపడటం లేదు.. దమ్ముంటే తానే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయాలి.. అనుచరులతో ఇలా మాట్లాడించడం సరికాదు అని అన్నారు. కాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీ పౌరసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని..అతనికి లండన్ పౌరసత్వం ఉందని..దీని గురించి నేను ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ కు కూడా లేఖ రాశాను.. భారత్ ద్వంద్వ పౌరసత్వం ఒప్పుకోదు కాబట్టి రాహుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.

ఒక్కరోజులో మావోయిస్ట్ ల కలకలం.

ఒకేసారి పలు సందర్బాల్లో మావోయిస్టులు అరెస్ట్, ఎన్ కౌంటర్లతో కలకలం రేగింది. చాలా రోజుల తరువాత మళ్లీ చత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 15 మంది మావోలు చనిపోగా వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులను మావోలు కిడ్నాప్ చేయడం. ఖమ్మం జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నాయకులును కిడ్నాప్ చేసి అనంతరం మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట తమ డిమాండ్లతో ఒక లేఖను రాశారు. అందులో 1). వరంగల్ జిల్లాలో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలి. 2). ఖమ్మం జిల్లా నుంచి అదిలాబాద్ వరకూ నిర్వహిస్తున్న కూంబింగ్ ను నిలిపివేయాలి. 3). ఎన్ కౌంటర్ పేరిట హత్యల్ని ఆపేయాలని లేదంటే.. టీఆర్ ఎస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన కొంత సేపటికి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మావోయిస్ట్ సానుభూతి పరులంటూ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించారు. మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ జనార్ధన్ ఉరఫ్ ఐతు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన  వరంగల్ జిల్లా పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లో దశాబ్ద కాలం పాటు పని చేసిన ఇతను లొంగిపోవటం మావోలకు తీరని లోటుగా చెబుతున్నారు. ఇతని పేరు మీద రూ.20లక్షల రివార్డు ఉంది.

నితీశ్ చంద్రబాబును లైట్ తీసుకున్నారా?

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ ఈ రోజు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ అంగరంగ వైభవంగా జరిగే తన ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులను.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు. కానీ ఇంతమందికి ఆహ్వానం పంపించిన నితీశ్ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును మాత్రం ఆహ్వానించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మోడీకి చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి ఆహ్వానించలేదా అని అనుకుంటున్నారు.. కానీ అలా అయితే నితీశ్ మోడీనే ఆహ్వానించారు కదా.. మరి చంద్రబాబును ఆహ్వానించడంలో ఏముంది అని మరికొందరు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందునా నితీశ్ కు చంద్రబాబుకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ సుపరిచితులే.. అయినా చంద్రబాబును మాటవరుసకైనా ఆహ్వానించకుండా ఎందుకు లైట్ తీసుకున్నారా అని ఇప్పుడు అందరి ప్రశ్న. అంతేకాదు బాబుకు ఇన్విటేషన్ అందకపోవటంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కూడా ఆరా తీశారని చెబుతున్నారు. మరి చంద్రబాబును నితిశ్ ఆహ్వానించకపోవడానికి గల కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి.