ఓట్ల  కోసం గ్లామర్ మంత్రాన్ని నమ్ముకుంటోన్న బీజేపీ! 

సినిమా నటులు, ఇతర సెలబ్రిటీలకు దాదాపుగా అన్ని పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తుంటాయి. ఎందుకు? దీని వెనుక పెద్ద లాజిక్కే వుంది. సినిమా వాళ్లో, సెలబ్రిటీలో అయితే గెలిచే అకాశాలు చాలా ఎక్కువ. అదీ తొలిసారి రంగంలోకి దిగుతున్న వారైతే జనం క్రేజ్ తో ఓట్లు వేసేస్తారు. ఆ తరువాత వారు ఎంత వరకూ నియోజక వర్గానికి ఉపయోగపడతారన్నది వాళ్ల ఆసక్తి, నిజాయితీ మీద ఆధారపడి వుంటుంది. కానీ, ఎవరికీ తెలియని కొత్త వార్ని తెచ్చి నిలబెట్టేదాని కన్నా కాస్త పేరున్న సెలబ్రిటీల్ని నిలపటం పార్టీలకి సేఫ్. అందుకే, వారి కోసం ఎన్నికల సీజన్లో గాలం వేస్తుంటాయి. ఇక గెలుపు కంటే మరో ముఖ్యమైన అంశం… సెలబ్రిటీలు పార్టీల అధినాయకత్వానికి పెద్దగా ప్రమాదం కాదు. వారు ఎంత మెజార్టీతో గెలిచినా తమ పని తాము చేసుకుపోతుంటారు తప్ప దాదాపు ఏ సందర్భంలోనూ పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తీసుకురారు. సెలబ్రిటీలకు అసలు సిసలు పార్టీల అంతర్గత రాజకీయం తెలియదు కాబట్టి నాయకత్వాన్ని ధిక్కరించి ముఠాలు కట్టటం లాంటివి చేయరు. ఇలా రెండు విధాలా లాభం వుండటం వల్లనే ఈ సారి మరో మారు బీజేపి సెలబ్రిటీ గ్లామర్ పై ఆశలు పెట్టుకుంటోంది.     దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా సినిమా వాళ్ల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాయి. అలాంటిది బీజేపీ, కాంగ్రెస్ వార్ని ఎలా వదిలేస్తాయి. ఇప్పటికే చాలా మంది సినిమా వాళ్లు కాంగ్రెస్ , బీజేపీల టికెట్లపై గెలిచారు. అమితాబ్ బచ్చన్ మొదలు మన కృష్ణంరాజు దాకా వున్న వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే! అయితే, 2014లో మోదీ యూపీఏ పై దండయాత్ర చేసి స్వంత మెజార్టీతో నెగ్గారు. అందులో కూడా సెలబ్రిటీల పాత్ర కాస్త వుందనే చెప్పాలి. హేమామాలిని లాంటి వారు ఎప్పటిలాగే కమల దళం కోసం పోటీ చేయగా కొత్తగా పరేష్ రావల్, అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్, ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి వారు ఎన్నికల బరిలో దూకారు.     2014 కంటే ఇప్పుడు మోదీ పరిస్థితి కాస్త క్లిష్టంగా వుంది. అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత పైకి కనిపించకున్నా ఆందోళన కలిగిస్తోంది. అందుకే, జనం ఈజీగా కన్విన్స్ అయ్యేలా మరింత మంది సెలబ్రిటీలను బ్యాలెట్ బ్యాటిల్ లోకి దించాలని డిసైడ్ అయ్యారట. ముఖ్యంగా, బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, ఆమీర్ ఖాన్లకు ధీటుగా నిలుస్తూ కరుడుగట్టిన ఉత్తరాది బీజేపీ అభిమానులకు ఫేవరెట్ అయిన అక్షయ్ కుమార్ ని రంగంలోకి దించే యోచనలో వున్నారట. కానీ, ఆయన బీజేపీ పెద్దలు ఆశించినట్టు పంజాబ్ నుంచో, దిల్లీ నుంచో తలపడాలంటే ముందు కెనడా పౌరసత్వం వదులుకోవాలి. ఇప్పటికే మోదీ, అమిత్ షా టీమ్ అక్కీకి రెడీ అవ్వమని చెప్పారట. బాలీవుడ్ ఖిలాడీ ఏం చేస్తాడో! అక్షయ్ తో పాటూ అనుపమ్ ఖేర్ ని కూడా బీజేపీ పోటీలో పెట్టాలని భావిస్తుందంటున్నారు.     నానాపటేకర్ ని ఆయన స్వంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచీ పోటీ చేయిస్తారట. వీరే కాకుండా ఎన్నికలు దగ్గర పడుతోన్నకొద్దీ మరింత మంది కాషాయ కండువాలతో పార్టీకి సెలబ్రిటీ గ్లామర్ తెస్తారని ప్రచారం జరుగుతోంది. కాకపోతే, ఇటు తెలంగాణలో పెద్దగా బలం లేక, అటు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న బీజేపీతో ముందకు సాగటానికి ఇక్కడైతే ఏ సెలబ్రిటీ సాహిసించే పరిస్థితి లేదు! తెలుగు రాష్ట్రల్లో కొత్తగా బీజేపీ కండువాలు కప్పుకునే మూడ్ లో ఏ ప్రముఖులు కూడా కనిపించటం లేదు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే అంత రిస్క్ తీసుకుంటారని అస్సలు భావించలేం. కాబట్టి బీజేపీ సెలబ్రిటీ గ్లామర్ మంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే చింతకాయలు రాలవనే నిర్ణయించుకోవాలి!

కేసీఆర్‌కు గద్దర్, కోదండరామ్‌ల డ్యామేజ్ తప్పదా?

ఒకవైపు ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఓ సారి పవన్, చంద్రబాబు ఫైట్, మరోసారి చంద్రబాబు, జగన్ మాటల యద్ధం, ఇవేవీ కాకపోతే, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటాలు… ఇలా రోజూ ఆసక్తికరంగానే సాగిపోతోంది ఆంధ్రా వ్యవహారం. కానీ, తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణం వుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు ఎన్ని ఏర్పాటు చేసినా అధికార పక్షంపై దుమారం రేగేలా కామెంట్లు చేయలేకపోతోంది. టీ కాంగ్ అద్యక్షుడు ఉత్తమ్ సహా అందరూ కేసీఆర్ ని, ఆయన పథకాల్ని టార్గెట్ చేస్తున్పప్పటికీ మీడియాలో, జనంలో పెద్ద చర్చకు దారి తీయటం లేదు. దీనికి ప్రధానమైన కారణం… ఏపీలో వున్నట్టుగా చంద్రబాబు, జగన్, పవన్ వంటి వ్యక్తుల చుట్టూ తెలంగాణలో రాజకీయం లేదు! కేసీఆర్ తో సమానమైన ఛర్మిష్మా గల నేత కాంగ్రెస్ లో కనిపించటం లేదు. అలాగే, ఎవరు సీఎం క్యాండిడేటో తెలియని స్థితిలో … పూర్తిగా దిల్లీ అదుపు, ఆజ్ఞాల్లో టీ కాంగ్రెస్ పని చేయాలి. కానీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ప్రత్యక్ష నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ అయిన తెరాస దూసుకుపోతోంది. ఇదే పోటీలో సమతుల్యం దెబ్బతినేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు కావటంతో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టు వుంటోంది.     ఇప్పుడు పరిస్థితి ఎలా వున్నా… కనీసం వచ్చే ఎన్నికల తరువాతైనా తెలంగాణలో అధికార మార్పు వుంటుందా? కాస్త రాజకీయ అవగాహన వున్న వారు ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ అంత ఈజీగా కేసీఆర్ ని గద్దె దించలేదని చెప్పేస్తారు. అందుకు తగిన కారణాలు కూడా వున్నాయి. కేసీఆర్ వైఫల్యాలు అడపాదడపా కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు చెబుతోన్నా గట్టిగా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. పైగా రైతులకి ముఖ్యమంత్రి ఎకారానికి ఇంతంటూ డబ్బులు ఇవ్వటం, బీమా కల్పించటం, కొన్ని వర్గాలకి గొర్రెలు, బర్రెలు వంటివి పంపిణీ చేయటం లాంటివి చేస్తూ కులాల వారీగా ఆకట్టుకుంటున్నారు. మైనార్టీల్ని కూడా మతపరమైన సంతుష్టీకరణ చేస్తూ పట్టిపెడుతున్నారు. కేసీఆర్ చాణక్యానికి టీ కాంగ్ వద్ద పెద్దగా ఎదురు సమాధానాలు లేవు. ఇక బీజేపీ లాంటి ఇతర ప్రతిపక్షల సంగతైతే మరీ దయనీయం. వారు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపటం లేదు. ఈ సమయంలో జనంలో కొంత ఆసక్తి రేపుతున్న వారు ఇద్దరున్నారు! వారే… కోదండ రామ్, గద్దర్!     కోదండరామ్ ఇప్పటికే తెలంగాణ జన సమితి పెట్టేశారు. ఆ మద్య సభలు, సమావేశాలు, నిరసనలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. కేసీఆర్ కూడా ముందు జాగ్రత్తగా ఆయన ప్రయత్నాల్ని గట్టిగా ఎదుర్కొన్నారు. స్వయంగా కోదండరామ్ ని విమర్శించారు కూడా. ఇక ఇప్పుడు గద్దర్ రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు ఏర్పాటు చేసిన బహుజన ఫ్రంట్ మీటింగ్ లో ఆయన ఓట్ల రాజకీయం వైపు తాను రాబోతున్నానని సంకేతాలిచ్చారు. ఇది ఒక విధంగా పెద్ద వార్తే! గద్దర్ లాంటి వ్యక్తులు కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావం వుంటుంది. కానీ, ఎంత అనేదే పెద్ద ప్రశ్న. ఓట్ల రాజకీయాల్ని వ్యతిరేకించే నక్సల్ వాదిగా గద్దర్ ఇంత కాలం కొనసాగారు. కానీ, ఇప్పుడు ఆయనే ఓట్ల కోసం జనంలోకి వెళతానని అంటున్నారు. లాల్, నీల్ కలయిక అంటూ మాట్లాడారు. లెఫ్ట్ తో దళితులు కలవాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా కేసీఆర్ కు ఎంత వరకూ నష్టం చేయగలదు?     కోదండరామ్ అయినా, గద్దర్ అయినా నిజాయితీ విషయంలో మచ్చ లేని వారు. వాళ్లని జనం నమ్ముతారు. కానీ, మందు, బిర్యానీ, కులం, మతం ప్రధానంగా జరుగుతుంటాయి మన ఎన్నికలు. వాటిలో వీరికి మన ఓటర్లు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అనుమానమే! చాలా మంది ఓట్ల పోరాటంలో ఓడిపోయిన ఉద్యమకారుల విషయంలో ఇది గతంలో జరిగింది కూడా. లక్షలాది జనం తరలి వచ్చే ఉద్యమకారులకి ఓట్లు మాత్రం అంత తేలిగ్గా పడవు. అందుకు బోలెడు కారణాలు. ప్రధానమైంది ఎన్నికల సమయంలో జరిగే మనీ మ్యానేజ్మెంట్. ఆ విషయంలో గద్దర్ వ్యతిరేకిస్తున్న కేసీఆర్, మోదీ ఇద్దరూ సిద్ధహస్తులే! మరి ఇటువంటి సమయంలో కేసీఆర్ ని కట్టడి చేయాలని నిజంగా గద్దర్, కోదండరామ్ అనుకుంటే ఏం చేయాలి?     కోదండరామ్, గద్దర్లే వేరు వేరు వేదికల ద్వారా ఎన్నికలకి వెళుతున్నారు. ఇక ఎప్పుడూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వుండే కాంగ్రెస్, బీజేపీలు వుండనే వున్నాయి. ఇలా ప్రతిపక్షంలో ఎందరు ఎక్కువై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసీఆర్ కు అంత ఆనందం! ఆయనకు వచ్చే సీట్లు మరింతగా పెరుగుతాయి. ఇది తెలియనంత అమాయకులు కాదు గద్దర్, కోదండరామ్, కాబట్టి వారిద్దరూ టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జతకట్టి ముందుకు సాగితేనే కొంతైనా ఫలితం రాబట్టగలిగే అవకాశం వుంటుంది. టీ కాంగ్రెస్ కూడా గద్దర్, కోదండరామ్ లాంటి వార్ని తమతో కలుపుకుని ముందుకు పోయే పరిపక్వత చూపాలి. అలాంటిదేం ఇంత వరకూ కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం ద్వారా … గద్దర్, కోదండరామ్ ల ప్రచారం అంతా కేసీఆర్ కు వరంగా మారే ప్రమాదముంది!

చంద్రబాబు వ్యూహంతో… జగన్ ఒత్తిడికి లోనవుతున్నాడా? 

ఒక్కసారి మనం 2014 కంటే వెనక్కి వెళితే… మళ్లీ తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపిస్తుంది! అప్పటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చినవే. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఐ… ఇలా ప్రతీ పార్టీ జైతెలంగాణ అనక తప్పలేదు. అయితే, మిగతా పార్టీలన్నీ ఆంద్రాలో నష్టం జరుగుతోన్న తెలంగాణకు సై అని ఎందుకు అన్నాయి? జనంలో వున్న సెంటిమెంట్ ని టీఆర్ఎస్ గుర్తించి క్యాష్ చేసుకుంది కాబట్టి! గులాబీ బాస్ కేసీఆర్ జనకాంక్షని గ్రహించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి మిగతా అన్ని పార్టీల్ని కార్నర్ చేయగలిగారు! ఇప్పుడు అలాంటి వ్యూహమే చంద్రబాబు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు! అందులో జగన్ ఒత్తిడికి లోనుకావటం అసలు విశేషం!     ప్రత్యేక హోదా అంటూ గత కొంత కాలంగా టీడీపీ తన ఉద్యమాన్ని తార స్థాయికి చేర్చింది. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో, దిల్లీలో పోరుబాట పట్టింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి జనం ముందు బీజేపీని దోషిని చేసింది. ఇదంతా సక్సెస్ అవుతున్నట్టేనా? కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలైతే కనిపించటం లేదు. కానీ, చంద్రబాబు పొలిటికల్ స్కోర్ అయితే పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా, ప్రతిపక్ష నాయకుడు జగన్ అంకంతకూ కార్నర్ అవుతున్నారు. టీడీపీ ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీని, బీజేపితో సీక్రెట్ దోస్తీ చేస్తున్నారని జగన్ ని ఇరుకున పెడుతోంది. దాని ఫలితం పదే పదే కనిపిస్తోంది.     స్పెషల్ స్టేటస్ విషయంలో టీడీపీ జోరుని తగ్గించేందుకు జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంట్లో నిరసనలు చేయించారు. కాకపోతే, ఏదీ కూడా మోదీకి మరి ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తపడుతూనే వచ్చారు. ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ఎన్నికలప్పుడు బేషరతుగా మద్దతిచ్చి మోదీ, షాల దృష్టిలో పడ్డారు. కానీ, ఈ మెతకదనం అసలుకే ఎసరు తెచ్చేలా వుందని భావించి ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. మరోసారి మరో పరోక్ష ఎన్నికల్లో బీజేపికి మద్దతిస్తే టీడీపీ జనంలోకి ఆ విషయం తీసుకెళ్లి రచ్చ చేస్తుందని భయపడ్డ జగన్ కమలానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ సెలవిచ్చారు!     రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పదవికి ఈ పార్లమెంట్ సెషన్లో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ప్రస్తుతం శత్రుపక్షం కాబట్టి ఎలాగూ మద్దతివ్వదు. కానీ, అనూహ్యంగా జగన్ కూడా తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. బీజేపి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయటం అంటే మోదీ, షాలకు కోపం తెప్పించటమే. అయినా జగన్ ఈ సాహసానికి పూనుకోవటం టీడీపీ వల్లే అనాలి.     ఇప్పటికే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంతో మోదీ సర్కార్ ను ఓ ఆటాడాలని టీడీపీ యోచిస్తోంది. ఎన్డీఏలో లేని ప్రతీ పార్టీని కలిసి మద్దతు అడుగుతోంది. శివసేన లాంటి పార్టీల్ని కూడా కదలించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రత్యేక హోదా ఇవ్వని మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తోంటే… జగన్ బీజేపికి మద్దతెలా ఇస్తారు? ఇస్తే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి? టీడీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రశ్నల కారణంగానే జగన్ మోదీ వ్యతిరేక టీమ్ లోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఒత్తిడి వ్యూహమనే చెప్పాలి! ఏపీలో బాబు బీజేపిని ఒంటరని చేశారనే అనాలి! 

రామ మందిర రాజకీయం మళ్లీ రాజుకుంటోంది!

ఓవైసీ అయోధ్య రామ మందిరం వివాదం పై మళ్లీ నోరు విప్పాడు. ఆ కేసులో తీర్పు ఇవ్వాల్సింది సుప్రీమ్ కోర్టు అన్నాడు. అమిత్ షా కాదంటూ సెటైర్లు వేశాడు. అంతే కాదు, ఎన్నికల ముందు రాబోతోన్న అయోధ్య తీర్పు పారదర్శకంగా వుండాలని పేర్కొన్నాడు. ఇలా హఠాత్తుగా ట్విట్టర్ లో అయోధ్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింధి?     అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకి కారణం అమిత్ షా! ఆయన హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులతో, ఆరెస్సెస్, వీహెచ్పీ నేతలతో మాట్లాడారు. మీడియాకు నేరుగా వివరాలేవీ తెలియజేయనప్పటికీ … ఆయన రామ మందిరం గురించి మాట్లాడారని మ్యాటర్ లీకైంది. 2019 ఎన్నికల లోపే అయోధ్యలో రామ మందిరం సాకారం అవుతుందని షా అన్నారట. ఇది ఎలా బయటకు వచ్చిందోగానీ జాతీయ మీడియాలో కూడా కలకలం రేపింది. కోర్టులో వున్న విషయంపై బీజేపీ అధ్యక్షుడు అయ్యి వుండి అమిత్ షా అలా ఎలా మాట్లాడతారని నిరసనలు మొదలయ్యాయి. ఓవైసీ ట్విట్టర్ వ్యాఖ్యలకు ఇదే కారణం! ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ అన్ని పార్టీలు తమ తమ బలాల్నీ, బలహీనతల్ని మథింపు చేసుకుంటాయి. బీజేపీకి ఖచ్చితంగా రామ మందిరం పెద్ద బలం. బలహీనత కూడా! మోదీ ప్రస్తుతం స్వంత మెజార్టీతో ప్రధానిగా వున్నారు. ఆయన వాజ్ పేయ్ లా పొత్తుల వల్ల మందిరం కట్టలేకపోయానని చెప్పలేరు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయదళం రామ మందిరానికి పునాదులు వేశాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. సుప్రీమ్ లో కేసు విచారణ జరుగుతున్న వేగం కూడా ఆ దిశగానే వుంది. కోర్టు తీర్పు ఎలా చూసినా ఎన్నికల లోపే వచ్చేస్తుంది. అయితే, తీర్పు ఏంటన్నది ఎవ్వరం చెప్పలేం. కానీ, షా తనకు ఇప్పటికే తెలుసునన్నట్టు నాయకులకి, కార్యకర్తలకి మందిరం కట్టేస్తామని చెప్పటం వివాదాస్పదం అవుతోంది.     కోర్టులో వున్న వ్యవహారంపై తాను వ్యాఖ్యలు చేయకూడదని అమిత్ షాకి తెలియదనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ ఆయన తెలిసే మాట్లాడి వుంటే… ముందు ముందు మరోమారు రామ జన్మభూమి రాజకీయాలకు కీలకం అవ్వనుందని భావించవచ్చు. ఓవైసీ లాంటి వాళ్లు అప్పుడే పాదర్శకం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటే… తీర్పు ఎలా వచ్చినా గందరగోళం తప్పకపోవచ్చు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని షియా ముస్లిమ్ నాయకులు కూడా రామ మందిర నిర్మాణానికి బీజేపీ డైరెక్షన్లో అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మొత్తం మీద రామ మందిర అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పెద్ద రచ్చే జరగవచ్చు రానున్న ఎన్నికల సీజన్లో! ఖచ్చితంగా 2014లో లాగా అభివృద్ధి, అవినీతి వంటి విషయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇదంతా చివరాఖరుకు ఎవరికి లాభిస్తుంది? ప్రస్తుతానికి రాముడికే తెలియాలి! ఎన్నికల ఫలితాల నాడు మాత్రమే మనకు తెలుస్తుంది!

అసలు బిజినెస్ చేసుకోమంటే… సైడ్ బిజినెస్సే ముద్దంటున్న మల్టీప్లెక్స్లు!

వీకెండ్ వస్తే గతంలో ఎటు వెళ్లాలా అని జనం తెగ ఆలోచించే వారు! ఒక్కొక్కరూ ఒక్కో దారి చూసుకునే వారు. కొందరు సినిమాకి, కొందరు చుట్టాల వద్దకి, కొందరు షికార్లకి వెళ్లే వారు. కానీ, ఎప్పుడైతే షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సులు ప్రత్యక్షం అయ్యాయో జనం వారాంతాలు అక్కడే గడిచిపోతన్నాయి. చాలా మంది మల్టీప్లెక్సుల్లో సినిమాలకి విపరీతంగా అలవాటు పడిపోయారు. శనివారం, ఆదివారం సినిమాలు చూస్తూ, చిరుతిళ్లు తింటూ , షాపింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తమ జేబులకి చిల్లులు కూడా పెట్టుకుంటున్నారు. విచిత్రంగా జనం సొమ్ము దోచేస్తున్నది సినిమా టికెట్లు కాదు. సినిమా మధ్యలో నోట్లో నమిలే చిరుతిళ్లు!     మల్టీప్లెక్సుల్లో ఓ కాఫీ, ఓ కోక్, ఓ పాప కార్న్ లేదా ఓ బర్గర్… ఇవన్నీ ఎంత రేటు వుంటాయో అందరికీ తెలిసిందే! నిజానికి బయట కంటే డబుల్ రేట్లు పలుకుతుంటాయి. కొన్ని చోట్ల మూడింతలు కూడా! కానీ, కామన్ ఇండియన్స్ వీట్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కారణం… అంత పోష్ గా, అద్దాల మేడల్లో ప్రదర్శించే సినిమాల్లో… ఇలాంటి ఖరీదైన ఫుడ్సే వుంటాయని కన్విన్స్ అయిపోయారు. అయితే, ఎవరికో ఒకరికి మాత్రం ఒళ్లు మండకుండా వుంటుందా? అదే జరిగింది. ఓ ముంబై వాసి నేరుగా వెళ్లి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. మల్టీప్లెక్సుల్లో మామూలు క్వాలిటితోనే సర్వ్ చేయబడే ఫుడ్స్ ఎందుకు విపరీతమైన ధరకు అమ్ముతున్నారని అతడి ప్రశ్న! కోర్టు స్వీకరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది!     ఒకవైపు కోర్టులో కేసు వుండగానే మహరాష్ట్ర అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. మొదట ఎన్సీపీ నేత మల్టీప్లెక్సుల దోపిడి అంశం లేవనెత్తినప్పటికీ తరువాత అన్ని పార్టీల వారు గొంతు కలిపారు. అందరూ ఇది అన్యాయమనే అన్నారు. అధికార బీజేపీ మంత్రి నేరుగా ఇక మీదట తమ ఇష్టానుసారం రేట్లు నిర్ణయించడం కుదరదని చెప్పేశారు! ప్రతీ ఆహారం ఎమ్మార్పీ రేటుకే అమ్మేలా రూల్ తెస్తామన్నారు. పైగా మల్టీప్లెక్సుల్లోకి ప్రేక్షకులు తమ స్వంత ఆహారం కూడా తెచ్చుకోవచ్చని ప్రకటించారు!   మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన వ్యవహారమంతా మనకు పైకి చిన్న విషయంగా కనిపించినా పీవీఆర్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ కంపెనీల షేర్లే డౌన్ అయిపోయాయి స్టాక్ మార్కెట్లో! ఎందుకంటే, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, పానీయాల మీద రేట్లు తగ్గిపోతే దాదాపు 30-35 శాతం లాభాలు తగ్గిపోతాయట యాజమాన్యాలకి! ఇది బాహాటంగానే చెప్పేస్తున్నారు. అంటే, ఇంత కాలం మల్టీప్లెక్సుల వారు సినిమా టికెట్ల మీద కంటే ఈ కొసరు అమ్మకాల మీదే ఎక్కువ రాబట్టుకుంటున్నారన్నమాట!     బయట పదికి దొరికేది మల్టీప్లెక్స్ లో యాభై రూపాయాల కంటే ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారంటే… రెండింతలు, మూడింతలు డబ్బు ఎక్కువ చెల్లిస్తూ ఇంత కాలం ప్రేక్షకులు ఎంత నష్టపోయి వుంటారు? పైగా ఇప్పటికీ వ్యవహారమంతా మహారాష్ట్రలోనే జరుగుతుంది! హైద్రాబాద్, బెంగుళూరులోని మల్టీప్లెక్స్ ల దోపిడికి ఎప్పుడు అంతం? ఇంకా కొన్ని నెలలైనా పట్టవచ్చు! కోర్టు తీర్పు వస్తే తప్ప మహా సర్కార్ కూడా అంతిమ నియమ, నిబంధనలు నిర్ణయించలేదు. ఆ తరువాత మెల్లగా ఒక్కో రాష్ట్రం మల్టీప్లెక్సుల దోపిడీని అరికట్టాలి! అంత వరకూ సామాన్యుడు వినోదం కోసమో, బలహీనతకొద్దో ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూనే వుండాలి. చేతులకు చిలుము వదులుతూనే వుండాలి. ఇదీ పరిస్థితి!

జగన్‌కి బంపర్ ఆఫర్! స్వీకరించక తప్పదా?

  2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అమిత్ షాకి మిత్రుల అవసరం తెలిసి వస్తోందా? పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బీహార్ కు వెళ్లిన ఆయన నితీష్ తో చర్చలు జరిపారు. టిఫిన్ చేస్తూ, లంచ్ చేస్తూ మీటింగ్ లు నడిపిన షా ఎట్టకేలకు కొంచెం నమ్మకం కలిగించగలిగాడు నితీష్ లో. సీట్ల పంపకం సాకుగా చూపి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని భావించారు నితీష్. తన అనుకూలాన్ని బట్టి ఇటు వైపు, అటు వైపు గోడ దూకటం జేడీయూ నేతకి మామూలే. కాకపోతే, ఇప్పుడు మోదీ, షా ఆయనని వదులుకునే స్థితి లేదు. అందకే హుటాహుటిన పాట్నా వెళ్లి చర్చల రాజకీయం చేశారు షా. అయినా కూడా నితీష్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి!     బీహార్ నుంచి తెలంగాణకొచ్చిన అమిత్ షా ఎవ్వరూ ఊహించని విధంగా రామోజీ రావును కలిశారు. ఆయనతో ఏం మాట్లాడారు అన్నది సస్పెన్సే! అయితే, రానున్న ఎన్నికల్లో అన్ని దిక్కుల్లోంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుండటంతో అమిత్ షా ఈ మధ్య చాలా మంది ప్రముఖుల్నే కలుస్తున్నారు. వారిని తమకు మద్దతు తెలపమని కోరుతున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా కూడా అమిత్ షాతో బేటీ అయ్యారట. కానీ, ఇవన్నిటికంటే కీలకమైన వ్యాఖ్యలు అమిత్ షా హైద్రాబాద్ వదిలి వెళ్లాక వచ్చాయి. పైగా అవి కేంద్రంలోని ఓ మంత్రి చేశారు. ఆయన బీజేపీ వాడు కాకపోవటమే ఇక్కడ ట్విస్ట్!   మహారాష్ట్రకు చెందిన రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్ దాస్ అథావలే. ఆయన ఎన్డీఏలో భాగంగా కేంద్రంలో మంత్రిగా వున్నారు. ఆయన తాజా వ్యాఖ్యల్లో విస్పష్టంగా జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. అలా వస్తే తాము జగన్ ని ఏపీ సీఎం చేసేందుకు కూడా సహకరిస్తామన్నారు! ఇక్కడ తాము అంటే ఎవరో రామ్ దాస్ అథావలే చెప్పలేదు. మహాలో చాలా చిన్న పార్టీ అయిన రిపబ్లిక్ పార్టీ సహకారంతో జగన్ సీఎం అవుతారా? కాదు! అంటే, అథావలే మాట్లాడుతున్నది మోదీ, అమిత్ షాల గురించేననుకోవాలి! వారి సహకారంతో జగన్ సీఎం అవ్వొచ్చునని చెప్పటం… తీవ్రమైన పరిణామామే! ఇంత బహిరంగంగా జగన్ ను తమ కూటమిలోకి రమ్మనటం 2019 ఎన్నికల ఫీవర్ కారణంగానే అనుకోవచ్చు!     చంద్రబాబు ఎన్డీఏ నుంచీ వెళ్లిపోతే నితీష్ వచ్చాడని షా అన్నారు ఈ మద్య! అదే సమయంలో కేంద్రంలోని మంత్రి జగన్ ను రమ్మంటున్నారు. సీఎం చేస్తామంటున్నారు. అంటే, చంద్రబాబు లేని లోటు జగన్ చేరికతో పూడ్చుకోవాలని కమలం పెద్దలు డిసైడ్ అయిపోయారా? ఇంచుమించూ అదే అనుకోవాలి! కానీ, ఈ బంపరాఫర్ కి జగన్ ఎలా స్పందిస్తారు? ఇప్పటికే టీడీపీ జగన్ని, విజయసాయిరెడ్డిని మోదీ మనుషులంటూ ప్రచారం చేస్తోంది. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వని హిందూత్వ పార్టీతో జగన్ చేతులు కలిపితే ఆంద్రా ప్రజలు , ముఖ్యంగా, మైనార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? టీడీపీ క్యాష్ చేసుకోకుండా వుంటుందా? జగన్ ను వెనక్కి పట్టి వుంచే ప్రశ్నలు ఇవే!     జగన్ కు రాజకీయంగా కొంత డ్యామేజ్ వున్నా రిస్క్ చేసి ఎన్డీఏలో చేరతాడనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మీద వున్న కేసులే ఇందుకు కారణం అవుతాయని వారి అంచన. మోదీ, షా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వైసీపీని లొంగదీసుకోవచ్చిన అనుమానిస్తున్నారు! చూడాలి మరి… జగన్ ఎన్డీఏలో చేరితే… అది చంద్రబాబుకి, టీడీపికి పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది!

నిందలు మోపిన ఏపీ బీజేపి! నితిన్ పొగడ్తల వర్షం!

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపికి ఓ చిక్కు సమస్య వచ్చిపడుతోంది. ఒక్కసారి కాదు. పదే పదే వస్తోంది! అదేంటంటే… రాష్ట్ర బీజేపి నాయకులు కేసీఆర్ ని ఎడాపెడా విమర్శిస్తారు. ఆయన పాలన, పథకాలు దండగంటారు. కానీ, అంతలోనే కేంద్ర మంత్రులో, బీజేపీ పెద్దలో తెలంగాణకి వచ్చి సీఎం భేష్ అంటారు. పథకాలు సూపర్ అంటారు! ఇంకేముంది, టీ బీజేపీ నాయకులది కుడితిలో పడ్డ వ్యవహారం అవుతుంది! అయితే, తాజాగా ఏపీ బీజేపీ నాయకులకి కూడా పరిస్థితి అలాగే తయారైంది.     చంద్రబాబు నాలుగేళ్లు కమలంతో చెలిమి చేసినప్పుడు ఏపీ బీజేపీ నాయకులకి పెద్ద ఇబ్బందులు వుండేవి కావు. చంద్రబాబుని మిత్ర ధర్మంతో విమర్శించే వారు కాదు. జగన్ ను కూడా ఏమంత పెద్దగా టార్గెట్ చేయకుండానే బండి లాగించేసే వారు. కానీ, ప్రత్యేక హోదా విషయంలో బాబు సీరియస్ అయ్యాక పరిస్థితి తలకిందులైంది. రాత్రింబవళ్లూ టీడీపీని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే, పూర్తి స్థాయిలో సోము వీర్రాజు లాంటి వారు బాబు మీద నోరు చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ కూడా రోజుకో ప్రెస్ మీట్ తో విరుచుకుపడుతున్నాడు. అయితే, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వటం లేదన్న చంబ్రాబాబు ప్రశ్నకి ఎవరి వద్దా సమాధానం లేదు. అది పక్కన పెడితే… ఎలాగో మాటల గారడి చేసి ఏపీ సీఎంను ఇరుకున పెట్టినా… బీజేపీ పార్టీ అగ్రనేతలే రాష్ట్ర పార్టీ నాయకుల విమర్శలపై నీళ్లు చల్లుతున్నారు!     ఆంధ్రాలో పర్యటించిన నితిన్ గడ్కరీ చాలా వరకూ పాజిటివ్ కామెంట్సే చేశారు. భారీ నీటి పారుదల శాఖా మంత్రి అయిన ఆయన పోలవరం ప్రత్యక్షంగా సందర్శించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత విశాఖలోనూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, వీటన్నటిలో ఏపీ బీజేపీ నాయకులకి పచ్చి వెలక్కాయల పరిణమించిన కామెంట్స్ … చంద్రబాబు గురించి నితిన్ గడ్కరీ అన్న మాటలే! గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేసిన నితిన్ గడ్కరీ కేవలం మంత్రిగా మాట్లాడేస్తారని అనుకోలేం. కానీ, ఆయన ఎంతో రాజకీయ అనుభవం వున్నప్పటికీ చంద్రబాబుని నిజాయితీగా మెచ్చుకున్నారు. ఆయన విజనరీ అంటూ కితాబునిచ్చారు. పోలవరం విషయంలో బాబు పడుతోన్న తపన చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న రచ్చ తెలియకుండానే చేసి వుంటారా? అస్సలు కాదు. టీడీపీ ప్రత్యేక హోదా విషయంలో నేరుగా మోదీనే కారకుడ్ని చేస్తోందని తెలిసినా నితిన్ బాబుని మెచ్చుకున్నారు! ఇప్పుడు ఇదే ఏపీ బీజేపీ నాయకులకి మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది! తాము నిత్యం విమర్శిస్తోన్న అధికార పక్షాన్ని, సీఎంని తమ జాతీయ నేత, కేంద్ర మంత్రి పొగడ్తల్లో ముంచెత్తటం ఎవ్వరికీ జీర్ణం కావటం లేదు!     ఒకవైపు రాష్ట్ర నేతలతో తిట్టిస్తూ మరో వైపు జాతీయ నేతలతో పొగిడిస్తూ మోదీ, అమిత్ షా విచిత్ర రాజకీయమే నడిపిస్తున్నారు. దీని వల్ల చంద్రాబుకి వచ్చే నష్టమేం లేకున్నా ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇరుకున పడుతున్నారు!

కేసీఆర్ తో కయ్యమా? వియ్యమా? తేల్చుకోలేకపోతోన్న టీ బీజేపీ!

అమిత్ షా మరోసారి తెలంగాణకి వచ్చారు! హైద్రాబాద్ లో ఒక్క రోజు పాటూ బిజి బిజీ పర్యటన చేస్తున్నారు. అసలు ఇంత హడావిడి టూర్ తో ఆయన ఏం ఆశిస్తున్నారు? ఇదే ఇప్పుడు పెద్దగా సమాధానాలు చిక్కని ప్రశ్న!     ఏ పార్టీ అయినా తమ ప్రభుత్వం ఏర్పడాలనే పావులు కదుపుతూ వుంటుంది. కానీ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు అసాధ్యం. అంత బలహీనంగా వుంది పార్టీ పరిస్థితి. త్రిపురలో ఒక్క సర్పంచ్ కూడా లేకున్నా అధికారం చేపట్టామని బీజేపీ అభిమానులు వాదించవచ్చు. అయినా కూడా త్రిపుర, తెలంగాణ ఒక్కటి కాదు. ఇక్కడ టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ బలంగా వుంది. రెండో స్థానంలో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా తెలంగాణ వ్యాప్తంగా గట్టిగానే వుంది. ఇక మూడో స్థానానికి టీటీడీపీ, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో బీజేపీ పోటీ పడాల్సి వుంది. ఇటువంటి స్థితిలో కమలదళానికి మరో ఇబ్బందికర అంశం కూడా తెలంగాణలో వుంది!     అమిత్ షా గతంలో ఒకసారి తెలంగాణ పర్యటన చేసినప్పుడు కేసీఆర్ పైన ఘాటు విమర్శలే చేశారు. అందుకు ప్రతిగా స్వయంగా తెలంగాణ సీఎం ప్రతి దాడి చేశారు. కానీ, తరువాత రకరకాల సందర్భాల్లో పలువురు కేంద్ర మంత్రులు గులాబీ సర్కార్ ని మెచ్చుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ పథకాల్ని బీజేపీ అగ్రనేతలు చాలా సందర్భాల్లో అభినందిస్తున్నారు. వీలైతే తమ పరిధిలో కాపీ చేస్తున్నారు కూడా! ఇదంతా చూస్తే … అసలు ఎన్డీఏలో లేనేలేని టీఆర్ఎస్ పట్లే దిల్లీ నేతల వైఖరి అనుకూలంగా వుంది. నాలుగేళ్లు కలిసున్న టీడీపీతో మాత్రం ఉప్పు నిప్పులా వుంది. ఇలా కేసీఆర్ గవర్నమెంట్ పై ఎందుకు మోదీ బృందం సానుకూలంగా వుంటోంది? రానున్న ఎన్నికల్లో మోదీకి ఎంపీలు తక్కువ పడితే ఆదుకునే ఎన్డీఏ యేతర పార్టీల్లో ప్రధానమైనవి టీఆర్ఎస్, వైసీపీలే. పోలింగ్ కి ముందు కాకున్నా తరువాతైనా కేసీఆర్, జగన్ మోదీకి అండగా నిలుస్తారని కమలదళం భావిస్తోంది. అందుకే, కేంద్ర మంత్రులు వీలైనప్పుడల్లా తెలంగాణ రథసారథని పొగిడేస్తూ వస్తున్నారు. కానీ, ఇదే తెలంగాణ బీజేపీకి తలనొప్పిగా మారింది!     తమ పార్టీ నేతలే కేసీఆర్ పథకాల్ని మెచ్చుకుంటూ వుంటే టీ బీజేపీ నాయకులకి ఎలా విమర్శలు చేయాలో తెలియని గందరగోళం ఏర్పడుతోంద. అలాగని, తెలంగాణలో ప్రతిపక్షానికే పరిమితం అయిన కాంగ్రెస్ ని కూడా వారు ఏమంత టార్గెట్ చేయలేరు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఏమనకుండా జనంలోకి ఎలా వెళ్లాల్లో తెలంగాణ బీజీపీకి అర్థం కావటం లేదు. ఈ డైలామా కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల అసతంతృప్తిగా వున్న నేతలు సైతం కాషాయ కండువా కప్పుకోవటం లేదు. అసలు ఏ మాత్రం దిశా, దశా లేకుండా సాగుతోంది టీ బీజేపి! అంతా అయోమయంగా వున్న వేళ తెలంగాణలో కాలుమోపిన అమిత్ షా ఏం చేయనున్నారు? పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేసి హిందూత్వవాదుల వ్యతిరేకతకి కారణమైన కేసీఆర్ పై ముప్పేట దాడి చేయమని తన పార్టీ వారికి చెబుతారా? లేక ఎన్నికల ఫలితాల తరువాత మోదీ ప్రధాని అయ్యేందుకు కేసీఆర్ ఉపయోగపడతారని మెతక వైఖరి ప్రదర్శించమంటారా? ఇదే ఇప్పుడు తేలాల్సింది. అమిత్ షా ఇచ్చే ఆజ్ఞాలపైనే తెలంగాణ బీజేపీ యాక్షన్ ప్లాన్ ఆధారపడనుంది!   

కుల వివాదాలు పెరుగుతున్నాయి… కులం బలహీనపడుతోంది!

మామూలుగానే మన దేశంలో కులం అంటే అందరూ అలెర్ట్ అవుతారు. వందలాది ఏళ్లుగా వున్న కులం స్వతంత్రం వచ్చాక కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికలు వస్తే మరింత మసాలా దట్టించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ నాయకులు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. పార్టీలు అభ్యర్థుల కులాలు చూసే సీట్లు ఇస్తుంటాయి. చివరకు, పోలింగ్ రోజున ఓటర్లు కూడా కులం ఆధారంగానే తీర్పునిస్తుంటారు! ఇంత వ్యవహారం వుంది కాబట్టే కులం ఎప్పుడూ హాట్ టాపిక్కే! కానీ, తాజాగా జరిగిన ఓ సర్వే ఇండియాలో ఆవిష్కృతం అవుతోన్న కొత్త కోణం బయటపెట్టింది!     కులం పుట్టినప్పటి నుంచీ చచ్చేదాకా చాలా ముఖ్యమే. చదువులో, ఉద్యోగంలో అంతటా కీలకమే. కానీ, పెళ్లి విషయానికి వచ్చే సరికి కులం మరింత ప్రాముఖ్యత వహిస్తుంది. వేరు వేరు కులాల వారు పెళ్లి చేసుకుంటే ఎంత రచ్చవుతుంటుందో మనం చూస్తూనే వుంటాం. పరువు హత్యల దాకా వెళుతుంటాయి కేసులు. కానీ, ఒకవైపు ఇంత కుల మౌఢ్యం వున్నా కూడా మరో వైపు ఆధునిక భారతదేశం కులాన్ని లైట్ తీసుకుంటోంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇన్ షార్ట్ అనే యాప్ వారు నిర్వహించిన సర్వే ఫలితాలే!     ఈ ఆన్ లైన్ సర్వేలో ఒకరిద్దరు కాదు… ఏకంగా 1.3లక్షల మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అవేంటో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతీ 10 మందిలో 8 మంది తమకు కులాంతర వివాహం ఓకే అని చెప్పారట! 70 శాతం అబ్బాయిలు పెళ్లయ్యాక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోకున్నా ఫర్వాలేదు అన్నారట! ఇక ఎప్పుడూ అమ్మాయిల మీద జోకులేస్తూ… వాళ్లు బాగా డబ్బున్న అబ్బాయిలకి పడిపోతారని అంటూ వుంటారు. కానీ, ఈ సర్వే అది నిజం కాదని తేల్చింది. సర్వేలో పాల్గొన్న అమ్మాయిల్లో 84 శాతం మంది అబ్బాయి తమ కంటే ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదని అన్నారట! ఇంకో విస్తుగొలిపే విషయం ఏంటంటే… నిన్న మొన్నటి దాకా వరకట్నం కోసం తహతహలాడిన అబ్బాయిలు ఇప్పుడు రూటు మార్చారు. కట్నం కాదు… పెళ్లి ఖర్చులు అమ్మాయి తరుఫు వారికి తగ్గించేందుకు సై అంటున్నారట! 90 శాతం అబ్బాయిలు వధువు తరుఫు వారికి పెళ్లి ఖర్చులు తగ్గిస్తామనీ, అవసరం అయితే తమ వంతుగా కొంత భరిస్తామనీ అన్నారట!     ఒక సర్వేలో ఇలాంటి అభిప్రాయాలు వస్తే దేశం మారిపోయినట్టు కాదు. అది అంగీకరించాల్సిన విషయమే. కానీ, అదే సమయంలో ఈ ఫలితాలు క్రమంగా పొడచూపుతున్న మార్పుకి మాత్రం ఖచ్చితంగా సంకేతమే! కులం రాజకీయాల్లో, మీడియా చర్చల్లో పెద్ద ఇంపార్టెంట్ గొడవగా కనిపించినా… ఆధునిక కార్పొరేట్ యువత రాను రాను లైట్ తీసుకుంటున్నారు. పెళ్లి విషయంలో కూడా పట్టింపుల కంటే సర్దుకుపోవటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పాజిటివ్ ధోరణుల్ని ప్రభుత్వాలు, మీడియా, మేధావులు ఎంకరేజ్ చేయాలి. కానీ, దురదృష్టవశాత్తూ మన సమాజంలో రెచ్చగొట్టి పది మంది దృష్టి ఆకర్షించే వారు ఎక్కువవుతున్నారు.

పవన్ ఇమేజ్‌కు రేణు డ్యామేజ్ తప్పదా?

రాజకీయాల్లోకి దూకిన గబ్బర్ సింగ్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. ఉత్తరాంధ్రలో తనదైన రాజకీయం చేస్తున్నాడు. యాత్ర చేస్తూ జనంతో మమేకం అవుతున్నాడు. దీని తరువాత ఆంధ్రలో మరిన్ని చోట్ల జనసేనాని కవాతు కొనసాగనుంది. అయితే, తీరా ఎన్నికల వేళ పోలింగ్ నాడు పవన్ ప్రభావం ఎంత వుంటుంది? ఇది చెప్పటం కష్టమే. ఎందుకంటే, పవన్ డ్యామేజ్ టీడీపీ, వైసీపీలకు ఎంత వుంటుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడ్డది. అసలు వుంటుందా అనే అనుమానం వ్యక్తం చేసేవారూ లేకపోలేదు!     వచ్చే ఎన్నికల్లో జనసేన ఫలితాలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం పవన్ చుట్టూ వివాదాలు బాగానే ముసురుకుంటున్నాయి. రాజకీయాల్లోకి రావటం, అందులోనూ ఒక పార్టీ పెట్టి స్వంతంగా రణరంగంలోకి దిగటం మామూలు విషయం కాదు. ఇదే అదనుగా గత తప్పిదాలు, పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయి. అదే జరుగుతోంది పవర్ స్టార్ విషయంలో కూడా! ఆయన గురించి ఏదైనా ఆరోపణ చేయాల్సి వస్తే ముఖ్యంగా వ్యక్తిగత జీవితమే ఈజీ టార్గెట్ అవుతుంటుంది. అందులోనూ ఆయన మూడు పెళ్లిల్లు ఎప్పుడూ వివాదాస్పదమే. విమర్శలకు కారణమే! ఎన్నికల ఫీవర్ మొదలైన ప్రస్తుత తరుణంలో కూడా మరోసారి ఆయన ట్రిపుల్ మ్యారెజెస్ తిప్పలు తెచ్చిపెట్టేలా వున్నాయి!     పవన్ రెండో భార్య రేణు దేశాయ్ చాలా కాలం సైలెంట్ గానే వున్నారు. కానీ, వున్నట్టుండీ ఈ మధ్య కామెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. ఆమెను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం అసలు గొడవకి కారణం. అయితే, ఇదంతా పాత సంగతే. కానీ, ఈ మద్యే ఎంగేజ్ మెంట్ చేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైన రేణు గతంలో ఎప్పుడూ బయటపెట్టని సంగతులు బయటపెట్టి పవన్ ను డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. పవన్, రేణు విడిపోవటం నిజానికి పెద్ద వివాదమేం కాదు. వారు బాహాటంగానే విడిపోయారు. డైవోర్స్ కూడా తీసేసుకున్నారు. కానీ, సమస్యంతా ఇప్పుడు ఆమె పవన్ మూడో భార్య మొదటి సంతానం గురించి చెప్పటంతోనే మొదలైంది.     పవన్ ని బాగా విమర్శిస్తూ, టీడీపీకి అనూకులంగా గొంతు వినిపించే ఓ ఛానల్లో రేణు తన బాధ వెళ్లగక్కారు. తనకి విడాకులు కూడా ఇవ్వకుండానే పవన్ మరో స్త్రీతో బిడ్డకు తండ్రయ్యాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నిజంగా కొంత డ్యామేజింగ్ అంశమే! దానిపై యధావిధిగా సోషల్ మీడియాలో రచ్చ జరగటంతో తాజాగా రేణు దేశాయ్ పీఆర్ టీమ్ మరిన్ని వివరాలు బయటపెట్టింది. డేట్లతో సహా పవన్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేసింది!     2012 మార్చ్ 13న పవన్ మూడో భార్య లెజోనోవాకి పొలెనా పుట్టిందని ఫేస్బుక్ లో చెప్పిన రేణు పీఆర్ టీమ్… మార్చ్ 16న పవన్, రేణుల విడాకులు జరిగాయని గుర్తు చేసింది! అంటే, అంతకు ముందు సంవత్సర కాలం రేణు భార్యగా వుండగానే లెజోనోవా గర్భవతిగా వుందన్నమాట. ఇలా ఒకరితో చట్టబద్ధమైన వైవాహిక బంధంలోవుంటూ మరొకరితోనూ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయటం… తప్పు, నేరమూ కూడా అవుతుంది! ఈ విషయంలో రేణు వ్యక్తిగతంగా పవన్ ను ఇప్పుడేం అనకపోయినా…. అదును చూసి విషయం బయటపెట్టడం… కాస్త ఆసక్తికరం, ఆందోళనకరమే! ఎన్నికలకి ముందు ఇలాంటి విషయాలు పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయనే చెప్పాలి. మరి ఓట్ల రూపంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే!

కాశ్మీర్‌పై మోదీ సరికొత్త వ్యూహం… అసలుకే మోసమా?  

దేశంలో చాలా చోట్ల వలస రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీ నుంచీ గెలిచి మరో పార్టీలోకి దూకేవారు మరీ ఎక్కువైపోతున్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపేం కాదు. అయితే, దేశాన్ని ఏలుతోన్న బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ఎంపీల విషయంలో బేరసారాలు చేసే అవసరం మోదీ సర్కార్ కు లేదు. కానీ, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల విషయంలో చాలా చోట్ల ఎమ్మెల్యేల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతూనే వున్నాయి. దక్షిణాదిలో తమిళనాడులో, కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ఓ రేంజ్లో నడవటం మనం చూశాం. అయితే, ఉత్తరాదిలోనూ కమలం జంప్ జిలానీలతో రాజకీయం రక్తి కట్టిస్తోంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు అమిత్ షా. ఎన్నికలకు ముందు తరువాత అన్న భేదం లేకుండా వలలు వేసి పట్టేశారు. తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే అధికారంలో వున్న కాంగ్రెస్ ని అమాంతం కూల్చేశారు! ఇక ఇప్పుడు ఇదే అమిత్ షా మార్కు రాజకీయం వివాదాస్పద జమ్మూ కాశ్మీర్ కు మారటంతో అందరి దృష్టి పార్టీ ఫిరాయింపు పాలిటిక్స్ పై పడింది!     కాశ్మీర్ దేశంలోనే అత్యంత సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రం. దానితో పదే పదే మన కేంద్ర ప్రభుత్వాలు తప్పుగా వవ్యహరించి సమస్య మరింత జటిలం చేస్తూ వచ్చాయి. గతంలో అనేక సార్లు కాశ్మీర్ అంశంతో కాంగ్రెస్ ఆటలాడింది. ఇప్పుడు బీజేపీ సర్కార్ కూడా వివాదాస్పద ధోరణి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. చివరకు దీని ఫలితం మంచా? చెడా? తెలియని విధంగా పరిస్థితి నెలకొంటోంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన ఘాటు కామెంట్ అందుకు నిదర్శనం! దిల్లీ పెద్దలు పీడీపీ పార్టీని చీల్చాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ముఫ్తీ హెచ్చరించారు. ఇందుకు కారణం పీడీపీలోని అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్ లాంటి బీజేపీ నేతలు టచ్ లో వుండటమే. ఈ మధ్యే పొత్తుకు స్వస్తి చెప్పి ప్రభుత్వాన్ని కూల్చిన కమలదళం ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. మెహబూబా ముఫ్తీ పార్టీని చీల్చి తమ స్వంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. అదే జరిగితే పీడీపీ ఇక చరిత్రలో కలిసిపోవాల్సిందే. అందుకే, తాము హింసకైనా సిద్దమన్నట్టు మాట్లాడుతోంది మెహబూబా.     దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తమ ప్రభుత్వాలు వుండాలనుకోవటం వేరు. కాశ్మీర్ విషయంలోనూ అదే నీతి ప్రద్రర్శించటం వేరు. ఎందుకంటే, సమస్యాత్మకంగా వున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో బేరాసారాలు నడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనం రెచ్చిపోయే ప్రమాదం వుంది. వేర్పాటు వాదులు మరింత రెచ్చగొట్టే అవకాశమూ వుంది. ఇక పాకిస్తాన్ ఎలాగూ గోతి కాడి నక్కలా చూస్తూనే వుంటుంది. కాబట్టి ప్రస్తుతం గవర్నర్ పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అదే కొనసాగించి సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా గోడ దూకిన ఎమ్మెల్యేలతో సర్కార్ ఏర్పాటు చేస్తే నిత్యం రాష్ట్రమంతా గందరగోళం నెలకొనవచ్చు. దాని పై సరైన అంచనా వుండాల్సిందే! కొందరి అభిప్రాయం ప్రకారం బీజేపీ పీడీపీ పార్టీని చీల్చి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కారణం… ఆర్టికల్ 370 నిర్మూలనట! రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేనిదే ఆ ఆర్టికల్ తీసేయటం కుదరదు. కాబట్టి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీర్మానం చేయించి ఆర్టికల్ 370 తొలగిద్దామని మోదీ ఆలోచిస్తున్నారట. ఇది హర్షించదగిని వ్యూహమే అయినా సులవైంది మాత్రం కాదు. ప్రజా వ్యతిరేకత, దాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ఉగ్రవాదులు పెను సవాళ్లు అయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మోదీ ఏం చేసినా ఆచితూచి చేయాలి. లేదంటే లాభం కంటే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదముంది. పైగా పాకిస్తాన్ ఈ వ్యవహారమంతా అంతర్జాతీయంగా తనకు అనుకూలం చేసుకునే వీలు కూడా వుంది!

కేటుగాడు.. కోట్లు కొట్టేసాడు.

  'మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు' అన్నట్టుగా.. ఓ వ్యక్తి ఉన్నాడు.. మెడలో భారీ గోల్డ్ చైన్, చేతికి బ్రాస్ లెట్, అన్ని వేళ్లకు ఉంగరాలు, వంటిమీద ఖద్దరు డ్రెస్, తిరగడానికి ఖరీదైన కార్లు.. అబ్బో, అతను పైకి చూడటానికి అంబానీలా కనిపిస్తాడు.. కానీ లోపల ఒరిజినల్ క్యారక్టర్ పెద్ద మోసగాడు, కేటుగాడు.. అతనే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నైనాల చంద్రశేఖర్‌.. ఒకప్పుడు గ్రానైట్‌ కంపెనీల వద్ద లారీ డ్రైవర్‌ గా పనిచేసిన ఇతను.. తరువాత గ్రానైట్ కంపెనీ కొనే స్థాయికి ఎదిగాడు.. అతను ఆ స్థాయికి చేరడానికి కష్టాన్ని నమ్ముకోలేదు మోసాన్ని నమ్ముకున్నాడు.. డ్రైవర్ గా పనిచేసేటప్పుడు లారీలో గ్రానైట్‌ లోడుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో పరిచయం ఏర్పడింది.. ఆ ముఠాలతో కలిసి జేసీబీలను కాజేసి అమ్మడం చేసేవాడు.. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్‌టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్‌ పొందేవాడు.. ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు.. తర్వాతర్వాత ఆ మోసాన్ని కార్లు, జీపులకు కూడా విస్తరించాడు.. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయల సొమ్ము వెనుకేసుకొన్నాడు.. ఏడాది తిరిగేసరికి ఒక గ్రానైట్‌ కంపెనీనే కొనేసే స్థాయికి ఎదిగిపోయాడు.. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఒక కంపెనీ ఏర్పాటుచేశాడు.. ఒంగోలులో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కూడా కట్టాడు. మరి చంద్రశేఖర్ కి కొన్నాళ్ళకు ఇలా వాహనాలు కొట్టేయడం అమ్మడం బోర్ కొట్టిందేమో.. కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు.. ముందుగా షోరూమ్ కు వెళ్లి ఓ ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తాడు.. ఆ తరువాత ఆ వాహనంపై ఏదో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు.. అయితే దొంగ పత్రాల సృష్టి అనుభవంతో దానిపై అప్పు తీర్చకుండానే, అంతా డబ్బు కట్టేసినట్టు ఓ నకిలీ ఎన్‌వోసీ సృష్టిస్తాడు.. ఆ పత్రాలు ఆర్‌టీఏ కార్యాలయంలో చూపించి, దానికి క్లియరెన్స్‌ పొందుతాడు.. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్‌ సంస్థను సంప్రదించి, అక్కడ నుంచి మరోసారి రుణం పొందుతాడు.. ఇలా మూడు నాలుగు సంస్థల నుండి రుణాలు పొందుతాడు.. అతనికి కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతుంది.. ఇదంతా ఓ సినిమా కథని తలపిస్తుంది కదా.. సముద్రమంతా ఈది ఇంటిముందు మురికి కాలువలో పడి చనిపోయినట్టు.. చంద్రశేఖర్ కూడా మోసాలు చేస్తూ కోట్లు సంపాదించి, చివరికి చిక్కాడు.. చంద్రశేఖర్ ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి 30 లక్షలకు రెండు ఇన్నోవా కార్లను అమ్మాడు.. అమ్మేటప్పుడు ఈ వాహనాలకు రిజిష్ట్రేషన్‌ తో సహా అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయని చెప్పాడు.. అయితే ఎన్నిరోజులైనా క్లియరెన్స్‌ డాక్యుమెంట్లు ఇవ్వకపోతుండటంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది.. దీంతో నేరుగా ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అనుకోకుండా ఇతగాడు చేస్తున్న మోసం బయటపడింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఆంధ్రా కాంగ్రెస్‌కు ఓ ఆశాకిరణం!

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి! చరిత్రలో ఇలా శాశ్వతంగా తనకంటూ స్థానం సంపాదించుకున్నారు మాజీ సీఎం! విభజన సమయంలో ఆయన ఒక విధంగా కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. కాకపోతే, ఒకవైపు తెలంగాణ జనం ఆయనని సమైక్యవాదిగా చూశారు. ఆంద్రా జనం విభజన అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ సీఎంగా చూశారు. ఇలా రెండు వైపులా డ్యామేజ్ అయింది కిరణ్ కుమార్ రెడ్డి ఇమేజ్! అందుకే, గత నాలుగేళ్లుగా నిశ్శబ్ధంగా వుండిపోయారు. అయితే, తరుముకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన మరోమారు యాక్టివ్ అయ్యారు. దిల్లీ ఫ్లైట్ ఎక్కి వెళ్లి మరోమారు తన ఓల్డ్ బాస్… రాహుల్ ని కలవనున్నారు!     కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చేరతారా? ఇప్పుడు ఇది పెద్దగా సందేహించాల్సిన పరిణామం కాదు. దాదాపు ఖరారు అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ తో భేటీ తరువాత స్వయంగా ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, కిరణ్ చేరిక కాంగ్రెస్ కు లాభమా? కాంగ్రెస్ లో చేరిక కిరణ్ కు లాభమా? ఇవే అసలు ప్రశ్నలు!     విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఆఖరుకు స్వంత పార్టీ పెట్టుకుని బొక్క బోర్లా పడ్డారు కిరణ్. ఇప్పుడు ఆ పార్టీని, సమైక్యాంధ్ర నినాదాన్ని పక్కనపెట్టి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నారు! కానీ, విభజన చేసిన పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? ఇది సమాధానం లేని ప్రశ్నే! తెలుగుదేశం, వైసీపీల్లో చేరతారని కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో బీజేపీ అని కూడా అన్నారు. ఇవేవీ కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి దయనీయ స్థితిలో వున్న ఏపీ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇందులో ఆయన గుర్తించిన లాభం ఏంటో దేవుడికే తెలియాలి!     కాంగ్రెస్‌లో చేరిక వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి కనుచూపు మేరలో పెద్ద లాభాలేం లేవు. కాకపోతే, ఆయన వల్ల పార్టీకి కొంత మేర లాభమే! మాజీ సీఎంగా ఆయనకు జనంలో కొంత గుర్తింపు వుంది. అది హస్తానికి కలిసి రావచ్చు. అయితే, చిత్తూరు జిల్లా నాయకుడైన నల్లారి ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రభావం చూపే నాయకుడేం కాదు. కాబట్టి కాంగ్రెస్ కు ఆయన వల్ల కలిగే లాభం కూడా చాలా పరిమితమే! ఇలా కిరణ్, కాంగ్రెస్ ల పునః కలయిక రాజకీయంగా ఏమంత విశేషం కాదనే చెప్పాలి!     వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాహుల్ గాంధీ దళం అద్భుతాలు సృష్టించే అవకాశాలు అస్సలు కనిపించటం లేదు! బీజేపీకి ఎంత గడ్డు కాలం వుందో… అంతకంటే ఎక్కువే కాంగ్రెస్ కు కూడా ఆంద్రాలో వుంది. కాబట్టి తెలుగుదేశం, వైసీపీల జోరులో రెండు జాతీయ పార్టీలు అల్లాడిపోవటం గ్యారెంటీగానే కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన జనసేన ఎలాగూ వుండనే వుంది! మొత్తంగా ఇంకా ఓటర్ల దృష్టిలో విభజన చేసిన పార్టీగా మచ్చ పడ్డ కాంగ్రెస్ ఇప్పుడప్పుడే తేరుకునే స్థితిలో లేదు! మరి అటువంటి పార్టీలో కిరణ్ ముందు ముందు ఏం చేయనున్నారో! 

లోకేష్ బాబు శకం మొదలైనట్టేనా?

రాజకీయాలు నది లాంటివి! ఇలా ఎందుకు అనాలి అంటే… అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికలతో పాటూ పాలిటిక్స్ లోకి కొత్త నీరు వస్తూనే వుంటుంది. అచ్చం నదీ ప్రవాహంలో లాగే నిరంతరం కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలోనూ వచ్చినట్లు కనిపిస్తోంది! ప్రస్తుతం నడుస్తోన్న చంద్రబాబు శకం… 2019తో ముగిసి… లోకేష్ శకం అరంభం అవ్వనుందా? తాజా పరిణామాలు ఆ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.     లోకేష్ ఓ మీటింగ్ లో సంచలన ప్రకటన చేశారు! కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బహిరంగ సభలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది నిజానికి టీడీపీ సంప్రదాయాలకి, చంద్రబాబు స్టైల్ కి భిన్నం! బాబు తన అపార అనుభవం, ఆచితూచి వ్యవహరించే నైజం వల్ల ఎప్పుడూ ఇలాంటివి చేయరు. కానీ, యువ నేత లోకేష్ దూకుడుగా ఇటు మోహన్ రెడ్డిని, అటు బుట్టూ రేణుకని టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు.దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. తండ్రితో మాట్లాడకుండా లోకేష్ అభ్యర్థుల్ని ప్రకటించేంత నిర్ణయం చేయరనే అనుకోవాలి. అయితే, ఇందులో అసలు గుర్తించాల్సిన విషయం… రానున్న కాలంలో చినబాబు పోషించబోయే పాత్ర! ఒక బహిరంగ సభలో ఇద్దరు నేతల పేర్లు లోకేష్ పేర్కొనటం పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే, టీడీపీలో చంద్రబాబు కాకుండా ఇలా అభ్యర్థుల్ని మరొకరు ప్రకటించటం అస్సలు ఊహించలేం. కానీ, లోకేష్ బాబు ఇలా ఎందుకు చేసుంటారు? ప్లాన్డ్ గానే ఇదంతా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీ రోల్ చినబాబుదేనని వారంటున్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా వుంటారా ? లేదా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … పార్టీ పరంగా మాత్రం రానున్న రోజుల్లో లోకేష్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టవచ్చు. ములాయం అఖిలేష్ ని, సోనియా రాహుల్ ని రంగంలోకి దించేసినట్టే చంద్రబాబు కూడా ఫుల్ టైం రెస్పాన్సిబిలిటి లోకేష్ భుజాలపైన పెట్టవచ్చు! ఇక మరికొందరు రాజకీయ పండితులైతే మరో అడుగు ముందుకేసి… దిల్లీ రాజకీయాలు మోదీకి వ్యతిరేకంగా మారితే… ఖచ్చితంగా చంద్రబాబు అక్కడ వుండాల్సి వస్తుంది. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా బాబు పాత్ర ముఖ్యంగానే వుండబోతోంది. ఆయనే ప్రధాని అవ్వటం మొదలు కూటమిని ఒక్క తాటిపై నడిపే వరకూ ఆయన ఏ బాద్యతలైనా చేపట్టాల్సి రావచ్చు. అందుకే, దేశ రాజధానిలో తన మున్ముందు ఎజెండాను దృష్టిలో పెట్టుకనే బాబు లోకేష్ ను యాక్టివేట్ చేశారంటున్నారు. వారి ఉద్దేశ్యమైతే… దేశరాజధానికి బాబు, అమరావతిలో చినబాబు అని! చూడాలి మరి… లోకేష్ దూకుడు ముందు ముందు ఎలా వుండబోతోందో!

మోదీ, చంద్రబాబుల కంటే ముందే కేసీఆర్ రెడీ అయిపోతున్నారా?

గత ఎన్నికలు 2014లో జరిగాయి. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు? 2019లో! పార్లమెంట్, తెలంగాణ, ఏపీ అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు రావటం గత కొన్ని దఫాలుగా జరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి మాత్రం పరిస్థితి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది. ఎలక్షన్స్ రేపో, మాపో అన్నట్టు వుంటోంది కేసీఆర్, మోదీల వ్యవహార శైలి! చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 ఎండా కాలంలోనే ఎన్నికలు అంటుంటే… ప్రధాని, తెలంగాణ సీఎంలు మాత్రం ముందస్తుకు సంకేతాలు ఇస్తూ మీడియాలో కలకలం రేపుతున్నారు. కాకపోతే, ఇంత వరకూ అదికారిక స్టేట్మెంట్లు మాత్రం రాలేదు!     దేశం మొత్తం మోదీ జరపాలని భావిస్తోన్న జమిలి ఎన్నికలు, పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీకి మాత్రం ముందస్తు కంటే ముందస్తు ఎన్నికలు తేవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా? అవుననే అంటున్నారు గులాబీ నేతలు! తాజాగా ప్రగతి భవన్ నుంచి వెళ్లిన ఫోన్ల సంగతి పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కి దాదాపు తొంభై మంది ఎమ్మెల్యేలు వున్నారు. కొందరు కార్ గుర్తుపై గెలిచిన వారు, మరి కొందరు జంప్ జిలానీలు. వీరంతా వచ్చే ఎన్నికల్లో సహజంగానే టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అందులో కొంత మందికి మొండి చేయి తప్పదని వార్త వస్తోంది. అదే కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వెన్నులో వణకు పుట్టిస్తోంది.   టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంలో వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ తాజాగా ఫోన్లు చేయటం మరింత టెన్షన్ పుట్టిస్తోందట. కొందరికి స్వయంగా గులాబీ బాస్ ఫోన్ చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వండని చెప్పారట. ముందుగా వచ్చినా, టైముకే వచ్చినా, జమిలి ఎన్నికలైనా… అన్నిటికీ రెడీగా వుండాలని సీఎం చెప్పారట. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి, ఎన్నికలకి నిధులు సమకూర్చుకుని పోరు సన్నద్ధం కావాలిన ఫోన్ కాల్స్ సారాంశమట!     కేసీఆర్ ఫోన్ చేసి మళ్లీ ఎన్నికలకి సిద్ధం అవ్వమన్న వారు హ్యాపీనే! ఫోన్లు రాని వారి పరిస్థితే అయోమయంగా మారింది. తమకు బాస్ ఫోన్ చేయలేదంటే మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచన లేదేమోనని వారు భయపడుతున్నారట. ఒకవేళ అదే జరిగితే ఏం చేయాలన్నది ప్రస్తుత అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మనోవేదన! సహజంగానే వారు రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశాలుంటాయి. ఒకరిద్దరూ కేసీఆర్ నచ్చజెబితే ఊరుకుంటారుగానీ… సాధారణంగా ఇతర పార్టీల్లోకి జంపు చేసి అయినా పోటీలో వుంటారు. ఎందుకంటే, సాధారణ ఎన్నికలు అయిదేళ్ల దాకా మళ్లీ రావు. అందుకే, పార్టీలు, కండువాలు మార్చేసైనా సమరానికి సై అంటారు! మొత్తం మీద కేసీఆర్ పార్లమెంట్ కంటే కూడా ముందుగానే ఎన్నికలకు తెర తీస్తే పార్టీ ఫిరాయింపుల పర్వం కూడా మొదలవ్వచ్చు! అసతంతృప్తులు, రెబెల్స్ ని ఎంత మందిని తెలంగాణ ప్రతిపక్షం … కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోందో చూడాలి. అలాగే, తెలంగాణలో పర్యటనకు సిద్ధమైన అమిత్ షా కూడా ఎంత మందికి కాషాయ కండువాలు కప్పుతారో? ఏది ఏమైనా… తెలంగాణలో ఆషాధ మహంకాళీ జాతర పూర్తవ్వగానే ఎన్నికల జాతర మొదలయ్యేలా కనిపిస్తోంది!

కత్తి Vs స్వామీ… తప్పెవరిది?

ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో బాబూ గోగినేని అనే ఒక నాస్తికుడు రాముడ్ని దుర్భాషలాడాడు. నిజానికి దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తరువాత అదే విషయమై ఓ ఛానల్ చర్చ పెట్టడంతో కత్తి మహేష్ పోన్ ఇన్ లోకి వచ్చాడు. అప్పుడు ఆయన బాబూ గోగినేని రాముడ్ని అన్న మాటల్నే రిపీట్ చేశాడు. ఇది పెద్ద దుమారానికి కారణమైంది. ఇక చివరకు, ఇప్పుడది నగర బహిష్కరణల దాకా వెళ్లింది. కత్తి మహేష్, స్వామీ పరిపూర్ణానంద ఇద్దరూ భాగ్యనగరానికి దూరంగా వుండాల్సిన స్థితి ఏర్పడింది! ఈ కేసు మొత్తాన్నీ కాస్త ఓపిగ్గా విశ్లేషిస్తే బోలెడు విడ్డూరాలు కనిపిస్తాయి! అసలు సమస్య ఈ విపరీతాలే! రాముడ్ని దుర్భాషలాడటం కన్నా ఇవి ఆందోళనకరం…     బాబూ గోగినేని తన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకుని రాముడ్ని తిట్టిపోశాడు. అది కొందరు సమర్థిస్తారు. కొందరు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల మత పరమైన విశ్వాసాల్ని కించపర్చటం కాదు కదా! అయితే, ఆయనెక్కడో అన్న మాటలు అత్యధిక జనానికి తెల్సింది ఎలక్ట్రానిక్ మీడియా వల్ల. ఇలాంటి పెద్దగా ఎలాంటి సామాజిక, రాజకీయ ప్రాముఖ్యం లేని అంశాల్ని లైవ్ లో చర్చకెందుకు పెట్టాలి? జనానికి ఏంటి లాభం? రెచ్చగొట్టడమే మీడియా ఉద్దేశమా అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. ఆ మధ్య శ్రీరెడ్డి వ్యవహారంలో కూడా అనేక ఛానల్స్ వ్యవహరించిన తీరు ఆలోచించే వారికి ఎవరికైనా వెగటు పుట్టిస్తుంది. పెద్ద పెద్ద సామాజిక సమస్యలు వున్నప్పటికీ ఏమంత ప్రభావితం చేయని అంశాల్ని రచ్చకీడుస్తోంది మన మీడియా! దాని ఫలితమే ఈ తాజా దగుల్భాజీ వివాదం కూడా!     మీడియా ఉద్దేశ్యపూర్వకంగానో , ఉద్దేశ్యం లేకుండానో వివాదం రేపితే… ప్రభుత్వాలు కూడా అదే కోవలో స్పందిస్తున్నాయి. సమస్య జటిలం అవ్వటానికి ఇది మరో కారణం. కత్తి మహేష్ కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణం అయ్యి వుండవచ్చు. అతను అలా మాట్లాడవచ్చా లేదా అన్నది కోర్టులు నిర్ణయించాలి. కత్తి మహేష్ పై కేసులు నమోదైతే అరెస్ట్ చేయాలి. అవసరం లేదనుకుంటే అతడికి రక్షణ కల్పించి అరెస్ట్ చేయకుండా అయినా వుండాలి. ఇదేదీ చేయకుండా ప్రభుత్వం నగర బహిష్కరణ అనే కొత్త తంతు ముందుకు తీసుకు వచ్చేటప్పటికి వివాదం మరింత ముదిరింది. కత్తిని హైద్రాబాద్ నుంచి తరలించటంతో దళిత సంఘాలు, నేతలు, ఇతర అభ్యుదయవాదులు రోడ్డెక్కారు. వార్ని శాంత పరిచేందుకా అన్నట్టు ధర్మాగ్రహ దీక్ష అన్న పరిపూర్ణానందని నగరం బయటకి తరలించారు. ఇది ఇప్పుడు హిందూ సంస్థలకి కోపం తెప్పిస్తోంది. మొత్తంగా నగర బహిష్కరణల పర్యవసానం ఏంటి? వివాదంలోని ఇరు వర్గాలకి ప్రభుత్వంపై అసతంతృప్తి మిగిలింది!     కత్తి మహేష్, పరిపూర్ణానందల బహిష్కరణల వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు వున్నాయో మనకు తెలియదు కానీ… మీడియా, ప్రభుత్వం చేసిన వ్యవహారం వల్ల సమాజంలో కొన్ని వర్గాల నడుమ దూరం పెరిగిపోయింది. ఇలా కాకుండా వుంటేనే ముందు ముందు మంచిది. తెలుగు మీడియా జాతీయ, అంతర్జాతీయ మీడియాలను చూసి ఏ అంశాలు నిజంగా చర్చకు పెట్టాలో పునరాలోచించుకుంటే మంచిది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకునేటప్పుడు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తే బావుంటుంది. అంతే తప్ప జటిలం అయ్యేలా ప్రవర్తిస్తే సమాజానికి, దేశానికి మంచిది కాదు. నగర బహిష్కరణలే మార్గమైతే దేశాన్ని ఏలే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యాఖ్యాలు చేసే వారందర్నీ ఒక నగరం నుంచీ మరో రాష్ట్రానికి పంపించేస్తూ కాలం గడపాల్సి వుంటుంది. ప్రభుత్వాలు భావ ప్రకటనే ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించాలి. మనోభావాలు , మత విశ్వాసాలు ముఖ్యం అనుకుంటే వ్యాఖ్యలు చేసిన వార్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు వుంచాలి. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి సమాజ శ్రేయస్సుకి పని చేయటమే అంతిమంగా చెప్పదగింది… 

పవన్‌ను టార్గెట్ చేస్తోన్న టీడీపీ... జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిది? ఇది ఇప్పుడే చెప్పటం కష్టం. కానీ, రానున్న ఎన్నికల్లో యుద్ధం ఎవరెవరి మధ్యా అన్నది మాత్రం అంతకంతకూ స్పష్టమైపోతోంది. అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ నడుమ పోరాటం వుంటుందని అందరికీ తెలిసిందే! అయితే, పోయిన ఎన్నికల్లో సీన్ వేరుగా వుండింది. ఒకవైపు టీడీపీ, బీజేపీ, పవన్ మోహరించారు. మరోవైపు వైసీపీ, ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఒంటరి పోరు చేసి బొక్క బోర్లపడ్డాయి. కానీ, అయిదేళ్లలో అంతా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి చూస్తుంటే ఏ ఒక్కరూ మరొకరితో కలిసే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అగ్ర నాయకత్వం పవన్ ను ఏమాత్రం ఊపేక్షించవద్దని తమ కింది స్థాయి నాయకులకి చెప్పటం … ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది!     ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు సీఎంగా వున్న చంద్రబాబు తమకు చేతనైంది కొత్త రాష్ట్రానికి చేస్తూనే… మిగతాదంతా కేంద్రం వైఫల్యంగా జనానికి చూపిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగారు. ఇది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బాగానే కలిసొచ్చే విషయం. ఆయన పై సానుభూతి , మోదీపై ఆగ్రహం జనాల్లో పెల్లుబుకవచ్చు. అయితే, వైసీపీని కాదని టీడీపీకి మళ్లీ జనం ఓటు వేస్తారా? పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! రోజు రోజుకు టీడీపీకి కలిసి వస్తోన్న అంశాల్లో ప్రధానమైంది… ప్రతిపక్షాల అనైక్యత! ఏ రాష్ట్రంలో అయినా, మొత్తం దేశంలో అయినా శత్రువులు విడివిడిగా పోరాడటం అధికార పక్షానికి మేలు చేస్తుంది. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. 2014 ఎన్నికల్లో మోదీని గెలిచిపించింది, మొన్నటి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగిని గెలిపించింది అపోజిషన్ అనైక్యతే! ఇప్పుడు అదే చంద్రబాబుకు వరంగా మారేలా వుంది!     పవన్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ తన స్టాండ్ పూర్తిగా క్లియర్ చేసేశాడు. టీడీపీకి బద్ధ వ్యతిరేకిగా తాను ఎన్నికల బరిలో దిగనున్నట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇక గతంలో కలిసి పని చేసిన బీజేపీ కూడా ఇప్పుడు టీడీపీకి దూరంగానే వుంటోంది. కన్నా లక్ష్మీనారాయణ యాత్రలో దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. ఇక మిగిలిన కమ్యూనిస్టుల్లో సీపీఐ పవన్ తో కలవవచ్చని ప్రచారం నడుస్తోంది. సీపీఎం సంగతి అస్సలు తెలియదు. కాంగ్రెస్ కూడా ఏపీలో ఎవరితోనూ కలిసే స్థితిలో, గతిలో లేదు! ఒంటరి పోరు చేసి ఈసారన్నా సున్నా సీట్లు తెచ్చుకోకుంటే ఆ పార్టీకి అదే పదివేలు! మరిక టీడీపీ, వైసీపీలతో కలిసేది ఎవరు? ఎవ్వరూ లేరనే చెప్పాలి!       టీడీపీ, వైసీపీ రెండు ఒంటరిగానే బరిలో దిగినప్పటికీ… జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ వేటికవి సింగిల్ గా ఫైటింగ్ చేస్తే… డ్యామేజ్ జగన్ కే! ఎందుకంటే, అన్ని పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతే… ప్రధాన ప్రతిపక్షానికి లాభం అంతకంతకూ తగ్గిపోతుంది. అంటే, అంతిమంగా టీడీపీకి లాభమన్నమాటే!  బహుశా ఈ వ్యూహంతోనే పవన్ పై ఎదురు దాడికి సిద్ధం అవ్వమని టీడీపీ తన నాయకులకి, క్యాడర్ కి ఆదేశాలు ఇచ్చి వుంటుంది!

కేటీఆర్ ట్వీట్... లోకేష్ రీట్వీట్… మారుతోన్న రాజకీయం!

రాజకీయాలు మారిపోతున్నాయి. మన పాలిటిక్స్ లో పాత తరం నేతలు తమ వారసుల్ని వేగంగా దించేస్తున్నారు. కొత్త నేతల రాకతో పాలిటిక్స్ నడిచే తీరు కూడా మారుతోంది. తాజాగా ట్విట్టర్ లో తెలంగాణ సీఎం వారసుడు కేటీఆర్, ఆంధ్రా సీఎం వారసుడు లోకేష్ మధ్య జరిగిన సంభాషణ దానికే అద్దం పడుతుంది! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాలు గెలుచుకుని దేశం దృష్టిని ఆకర్షించాయి. దానిపైనే యువ నేతలిద్దరూ ట్వీట్లు పోస్టు చేశారు.   నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెబుతూనే కేటీఆర్ జస్ట్ మిస్ అన్నారు. కేవలం 0.09 శాతం తేడాతో ఫస్ట్ ర్యాంక్ మిస్సయ్యాం అన్నారు. దానికి స్పందించిన లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయన్నారు! ఇది తెలుగు ప్రజల మంచికే తప్ప ర్యాంకుల రేస్ మన మధ్య ఏం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది నిజంగా పరిణతి చెందిన సమాధానం అనే చెప్పాలి. నిజానికి కేటీఆర్ ఆంద్రప్రదేశ్ కు శుభాకాంక్షలు చెప్పటం హర్షనీయం. అంతకంటే ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటేనన్న భావం ధ్వనించేలా లోకేష్ స్పందించటం మరింత ఆనందదాయకం. ఈ సందర్భంగా మనం ఒక్కసారి విభజనకు ముందు పరిస్థితి గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినా కూడా కేసీఆర్ పదే పదే టీడీపీని టార్గెట్ చేసేవారు. అప్పుడు తెలుగు దేశం నేతలు ఘాటుగానే ప్రతి దాడి చేసేవారు. అటువంటి స్థితి నుంచీ ఇప్పుడు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుని వెన్నుతట్టి ప్రొత్సహించుకునే స్థితికి రావటం ఖచ్చితంగా గుణాత్మక మార్పే!   ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రకటన మరో విషయం కూడా తేటతెల్లం చేసింది. విభజన ఎంత మాత్రం మంచిది కాదన్న వాదన తప్పని నిరూపించింది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు వుండగా కొత్తగా ఏర్పడ్డ మన రెండు రాష్ట్రాలే టాప్ లో వుండటం విభజన కారణంగానే! విడిపోవటం వల్ల ఏపీ ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నప్పటికీ నెంబర్ వన్ గా నిలవటం నిస్సందేహంగా గొప్ప విషయం. ఇక్కడ వాణిజ్యానికి వున్న పుష్కలమైన అవకాశాలకి ఇది సంకేతం. అలాగే, హైద్రాబాద్ లాంటి బిజినెస్ హబ్ తో సహా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ సహజంగానే టాప్ గేర్లో దూసుకుపోతోంది. ఇదంతా విభజన వల్ల సాధ్యమైందనే చెప్పాలి!   మొత్తానికి… అనేక సంక్షోభాలు, గందరగోళాల నడుమ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల ఇప్పుడు యావత్ దేశం చూపుని కట్టిపడేస్తోంది. కేసీఆర్, చంద్రబాబు శకంలో ఉప్పు, నిప్పుగా వున్న టీఆర్ఎస్, టీడీపీ ఇప్పుడు సుహృద్బావంతో మెలుగుతున్నాయి. కేటీఆర్, లోకేష్ లు మంత్రులుగా, కాబోయే ముఖ్యమంత్రులుగా కొత్త రాజకీయంతో నవశకంలోకి తీసుకెళుతున్నారు. ఇదంతా తెలుగు వారికి ఒక విధంగా సంతోషదాయకమైన పరిణామమే! 

కత్తి రాజకీయ కలలకు గండి..!!

ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవాళ్ళు.. ఇప్పుడు కొత్తగా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నగర బహిష్కరణ అవుతారు అంటున్నారు.. ఇది కత్తి మహేష్ కు కరెక్ట్ గా సరిపోతుంది.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కత్తి మహేష్.. ఫిలిం క్రిటిక్ గా కొందరికి పరిచయమైన మహేష్, బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యారు.. ఆ ఫేమ్ ని అలా కంటిన్యూ చేసుకుంటే బాగుండేది.. కాని అలా ఉంటే కత్తి ఎందుకు అవుతాడు.. వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్నాడు. పవన్ మీద వ్యాఖ్యలు, పవన్ ఫ్యాన్స్ తో వివాదం.. దీంతో కొన్ని రోజులు మీడియాలో నానాడు.. తరువాత మూడు వ్యాఖ్యలు ఆరు విమర్శలతో గాలి వానలో పడవ ప్రయాణంలా సాగిపోయింది మహేష్ జీవితం.. ఇదే ఉత్సహంతో ఆయన రాజకీయ రంగప్రవేశం కూడా చేయాలనుకున్నారు.. వైసీపీ తరుపున చిత్తూర్ ఎంపీగా కత్తి పోటీ చేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.. ఇక కత్తి రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ అనుకుంటుండగా ఆయన నోటి దూలతో సిటీ నుండి ఎగ్జిట్ అయ్యాడు. ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న కత్తి, శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసాడు.. ఈ వ్యాఖ్యలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కత్తి వ్యాఖ్యలను వ్యతిరేకించాయి.. ఇప్పుడు కత్తి మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు టికెట్ ఇచ్చే సాహసం ఏ పార్టీ చేయదు.. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టుగా, కత్తి మహేష్ తన రాజకీయ కలలకు తన వ్యాఖ్యలతో గండి కొట్టుకున్నాడు.