జగన్, కేసీఆర్‌లకు బదులు చంద్రబాబునే నమ్ముకున్న మమతా!  

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారా? ఇలా మాట్లాడితే బీజేపీ అభిమానులు తెగ కామెడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా, సోషల్ మీడియాలో వారి హల్ చల్ అంతా ఇంతా కాదు. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు కూడా ఇదే వరస. చంద్రబాబు చక్రం తిరగలేదంటూ వెటకారాలు! అయితే, ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయం తెలుగు రాష్ట్ర కాషాయ అభిమానులు గుర్తించకపోవటమే పెద్ద విషాదం!     వచ్చే ఎన్నికల్లో ఏపీ కమలం పరిస్థితి గత ఎన్నికల్లో కాంగ్రెస్ లాగే వుండబోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం మోదీ , అమిత్ షా కుట్ర రాజకీయాలే. దానికి తగ్గట్టే చంద్రబాబు వరుసగా తెలివైన అడుగులు వేస్తూ వస్తున్నారు. చర్చ మొత్తం ప్రత్యేక హోదా వైపు మరల్చటంతో రాష్ట్రంలో బీజేపీ అతి పెద్ద విలన్ అయింది. ఆ విలన్ కి తోక పార్టీగా వైసీపీని నిలబెట్టడం కూడా చంద్రబాబు వ్యూహమే! అది ఫలించిందనే చెప్పుకోవాలి. అయితే, చంద్రబాబు తిప్పిన చక్రం అసలు ఎఫెక్ట్ దిల్లీలో పడబోతోంది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీకి ఇక్కడ సున్నా స్థానాలు వచ్చిన నష్టమేం లేదు. కానీ, దిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు డ్యామేజ్ భారీగానే వుండబోతోంది… అదే మోదీ, షాలు ఆలోచించుకోవాల్సిన సంగతి!     జాతీయ స్థాయిలో తాజా పరిణామాలు చూస్తే … బెంగాలీ రెబెల్ మమతా బెనర్జీ దిల్లీ చేరారు. సోనియా, రాహుల్ తో భేటీ అయిన ఆమె ప్రధాని రేస్ లో లేనని ప్రకటించారు. ముందు బీజేపీ కుట్రల్ని ఛేదించి అంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ వ్యతిరేక టీమ్ గా మారి ఎన్నికలు ఎదుర్కొంటే తరువాత పీఎం ఎవరన్నది ఆలోచించవచ్చని మమతా మాట. అంటే, ఎన్నికల్లో మోదీని, బీజేపీ అరికడితే … తరువాత అందరికీ సమ్మతమైన నేతని పీఎం చేయవచ్చని ఆమె ఆలోచన! ఇప్పుడున్న స్థితిలో ఇంత కంటే వేరే మార్గం లేదు మోదీ వ్యతిరేక వర్గానికి. ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత రాహుల్ అందరికీ ఆమోదం కాదు. అలాగే, ప్రాంతీయ నేతలు కూడా ఏ ఒక్కరూ ప్రధాని పదవికి ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపించటం లేదు. అందుకే, ఆమె ముందు ఎన్నికలు, తరువాత పీఎం కుర్చీ అన్నారు.         మమతా బెనర్జీ సోనియా, రాహుల్ ని కలవటమే కాక టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వార్ని మోదీ వ్యతిరేక పోరు చేస్తున్నందుకు అభినందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రంతో మమతా టీడీపీకీ దగ్గరవుతున్నారు. మరీ ముఖ్యంగా, మమతా బెనర్జీ ఈ నెలలో దిల్లీలో నిర్వహించబోయే ర్యాలీకి చంద్రబాబును ఆహ్వానించారు. దీనిపై ఏపీ సీఏం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ తృణముల్, టీడీపీల నడుమ మైత్రికి ఇది సంకేతమనే చెప్పాలి. ఆ మద్య కేసీఆర్ స్వయంగా కోల్ కతా వెళ్లి తన కూటమిలో చేరమంటే పెద్దగా స్పందించని బెంగాలీ సీఎం చంద్రబాబును స్వయంగా ఆహ్వానించారు! ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు దిల్లీలో మంచి పరిణామమే. మోదీకి బెదరకుండా ఎదురు నిల్చి పోరాడుతున్న ఆయన ఇప్పుడు జాతీయ మీడియా, జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీజేపీకి, మోదీకి పట్టు అతి తక్కువగా వుండే దక్షిణాదిలో చంద్రబాబు లాంటి కమాండర్ వుండటం మమతా బెనర్జీ లాంటి వారికి చాలా అవసరం!     మమతా బెనర్జీ ర్యాలీకి హాజరై చంద్రబాబు మోదీ వ్యతిరేక వర్గంలో కీలకంగా మారతారో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ, ఏపీ నుంచీ మమతా బెనర్జీ లాంటి వారు ఆయననే నమ్మదగ్గ నేతగా చూస్తున్నారనేది మాత్రం స్పష్టం. జగన్ కూడా అధికారికంగా మోదీ వర్గం కాకున్నా మమతా బెనర్జీ ఆయనని ఆహ్వానించలేదు. ముందు ముందు కూడా కేసీఆర్, జగన్ లు జాతీయ రాజకీయాల్లో ఒంటరయ్యే అవకాశాలే ఎక్కువ. మోదీ వ్యతిరేక వర్గం కూటమిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు చక్రం తిప్పటం పక్కా!  

చంద్రబాబు చాణక్యం Vs జగన్ చాపల్యం!

2014 సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలుగేళ్లైపోతోంది. ఇక చివరి సంవత్సరం మొదలైనట్టే. అంటే, ఈ సారికి ఇది క్లైమాక్స్ ఇయర్ అన్నమాట! ఏపీకి సంబంధించినంత వరకూ 2019లో తగిన సమయానికే ఎన్నికలని చంద్రబాబు అంటున్నారు కాబట్టి ముందస్తు సూచనలేం లేవు. మరి వచ్చే సంవత్సరం ఎండా కాలంలో ఎన్నికలంటే ఇప్పుడే హీట్ స్టార్ట్ అవ్వటంలో ఆశ్చర్యమేం లేదు కదా! అయితే రాష్ట్రంలోని ఒక్కో పార్టీ ఒక్కో అంశాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకెళుతోంది. తమకు అనుకూలంగా వుండబోయే వివాదాన్ని రచ్చకీడుస్తూ ఓట్లుగా మార్చుకోటానికి ట్రై చేస్తోంది. ప్రధానంగా రెండు ముఖ్యమైన పార్టీలైన టీడీపీ, వైసీపీ వేగంగా పావులు కదుపుతున్నాయి…     చంద్రబాబు గత కొంత కాలంగా రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. మోదీ సర్కార్ హోదాకి బదులు ప్యాకేజీ అంది. చివరకు ప్యాకేజీలో కూడా రాష్ట్రానికి పెద్దగా ఏమీ ఇవ్వకుండానే చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే, ఆయన ప్రత్యేక హోదా నినాదం ఉధృతం చేశారు. క్రమక్రమంగా ఎన్డీఏకు దూరం జరుగుతూ వచ్చి ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం పార్లమెంట్ వేదికగా చేస్తున్నారు. మొత్తంగా చూస్తే బాబు కేంద్రాన్ని విలన్ గా నిరూపించగలిగారు. వచ్చే ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదా చుట్టూ తిరిగేలా చేశారు!     హోదా విషయంలో బీజేపిని, మోదీని టార్గెట్ చేసిన చంద్రబాబు 25 మంది ఎంపీల్ని ఇస్తే తరువాతి ప్రధాని ఎవరో నేనే నిర్ణయిస్తానంటూ జనానికి తమ వాణి వినిపించారు. మరి జగన్ ఏం చేస్తున్నారు? ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రోజుకో ఎజెండాతో ముందుకు పోతోంది! చంద్రబాబు తుఫాన్ మొత్తం హోదా చుట్టూ కేంద్రీకృతం అయ్యేలా చూస్తే జగన్ ప్రతీ రోజూ చంద్రబాబును తిడుతు కాలం గడిపేస్తున్నారు. అది చాలదన్నట్టు చంద్రబాబును చంపేయ్యండని ఆ మధ్య దురుసుగా మాట్లాడిన జగన్ పవన్ పైన వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆయనకు నలుగురు పెళ్లాలంటూ లేనిపోని వివాదం కొనితెచ్చుకున్నారు! ఇలాంటి వ్యక్తిగత విమర్శలతో ఎన్నికల్లో ఓట్లు ఎలా రాలతాయి? అయితే గియితే మరిన్ని ఓట్లు పోతాయి!   జగన్ పవన్ ను తిట్టడం మొదలు రమణ దీక్షితులుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయన చేత విమర్శలు చేయించటం వరకూ నానా రకాలు రాజకీయాలు చేస్తున్నారు. అంతే తప్ప ఒక ఖచ్చితమైన అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. తాజాగా కాపు రిజర్వేషన్లపై స్వయంగా కాక రేపి చేతులు కాల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వారికి రిజర్వేషన్లు ఇవ్వటం కేంద్రం పరిధిలోనిదని , తన వల్ల ఏం కాదని చేతులు ఎత్తేశారు. మళ్లీ జరిగిన తప్పు గుర్తించి మీడియా నా మాటలు వక్రీకరించిందని రొటీన్ గా గండం నుంచీ గట్టెక్కే ప్రయత్నం చేశారు. ఏ మీడియా ఆయన మాటల్ని వక్రీకరించింది? ఆయన స్వంత సాక్షి కూడానా? జగన్ కాపు రిజర్వేషన్ల గురించి పబ్లిగ్గా మాట్లాడారు. వేలాది జనం మధ్య తన వాహనంపై నుంచీ ప్రసంగం చేశారు. అవే మాటల్ని మీడియా లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇందులో వక్రీకరించటానికి ఇంకేం మిగిలింది? జగన్ కే తెలియాలి!     ఒకవైపు చంద్రబాబు తెలివిగా జనం ఆగ్రహాన్ని బీజేపీపైకి, మోదీ పైకి మళ్లించి రానున్న ఎన్నికలకి ఎజెండా సెట్ చేస్తుంటే… జగన్ మాత్రం అనాలోచిత మాటలు, ఆవేశపూరిత చర్యలతో కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ, లోక్ సభల్లో లేరు. పవన్ పై వ్యాఖ్యలతో కాపుల మనో భావాలు దెబ్బతీశారు. ఆపైన రిజర్వేషన్లు నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ఇలా రోజుకో ఘనకార్యం చేస్తుంటే… ఇప్పటిదాకా ఓటు వేద్దామనుకున్న వారు కూడా పునరాలోచనలో పడతారు! ఇది జగన్ గమనించి ఇంకాస్త పరిణతితో వ్యవహరిస్తే బావుంటుంది! 

లోన్ల రూపంలో… జనం డబ్బుతో… ‘ఆటలాడుకున్నాడు’!

ఒక్క వ్యక్తి… కేవలం ఒకే ఒక్క వ్యక్తి… ఇటు అధికార బీజేపీని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ని కూడా ఇబ్బంది పెట్టగలగటం మాటలు కాదు. కానీ, ఆ పని విజయవంతంగా చేశాడు విజయ్ మాల్యా. కాంగ్రెస్ కాలంలో అప్పులు చేసి బీజేపీ పాలనలో దర్జాగా లండన్లో మకాం వేశాడు. ఇప్పుడు రెండూ పార్టీలు మాల్యా కేసులో పాపమంతా మీదంటే మీదని దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే, మోదీ సర్కార్ మాత్రం కింగ్ ఫిషర్ కింగ్ తమపై తీసుకొచ్చిన ఆరోపణల్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంతోంది. బ్రిటన్ కోర్టులో ఇవాళ్ల తుది వాదనల అనంతరం మాల్యా ఇండియాకు వస్తాడా లేదా తేలిపోతుంది. అయితే, ఇప్పటికే విజయ్ మాల్యాకు తన సీన్ ఏంటో అర్థమైపోయినట్టు కనిపిస్తోంది. ఆయనని భారత్ కు అప్పగించటానికే బ్రిటన్ కోర్టు ఆదేశించవచ్చు.     చాలా సింపుల్ గా మాట్లాడుకుంటే విజయ్ మాల్యా 9వేల కోట్లు వివిధ బ్యాంకుల వద్ద అప్పు చేసి ఎగ్గొట్టాడు. పారిపోయి బ్రిటన్ లో రాజసం వెలగబెడుతున్నాడు. అయితే, ఇప్పుడు సీబీఐ కేసు వేసి కోర్టుకి లాగటం వల్ల మాల్యా తిరిగి రాక తప్పకపోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఇంకా బోలెడు తతంగం వుంటుంది. కానీ, ముందైతే ఆయన ఇండియాలో దిగీ దిగగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది చాలు బీజేపీ వారికి. ఎందుకంటే, మాల్యా దేశం వదిలి పారిపోయేలా మోదీ సర్కార్ సహకరించిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టడానికి మాల్యా కొన్ని రోజులో, కొన్ని గంటలో జైల్లో వున్నా చాలు! కానీ, అసలుగా ఆయన చేసిన ఘనకార్యాలకు శిక్షపడిదే ఎప్పుడో మూలన పడ్డ కింగ్ ఫిషర్ విమానాలకే తెలియాలి!     విజయ్ మాల్యా లాంటి కార్పొరేట్ అవినీతి మొసళ్లు మన వ్యవస్థలోని లోపాల్ని ఆసరా చేసుకునే బతికేస్తుంటాయి. ఈ బెంగుళురు బుల్లోడు బాలీవుడ్ భామలతో ఫోటోషూట్ లు, గోవా బీచుల్లో క్యాలెండర్ గాళ్స్ తో సరసాలు తెగ సాగించాడు. అదంతా బాగానే వర్కవుట్ అయినా అసలు సమస్య మనోడి విపరీత తెలివితేటల్తో వచ్చింది. కింగ్ ఫిషర్ కంపెనీ పేరుతో హ్యాపీగా బీర్లు అమ్ముకున్న మాల్యా అక్కడితో ఆగక విమానాలు నడిపే సంస్థ ప్రారంభించాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్లోకి పోయింది. అందుకు కారణం మాల్యా ఎయిర్ హోస్టెస్ ల మీద పెట్టిన శ్రద్ధ పెట్టుబడులు, రాబడుల మీద పెట్టకపోవటమే. అది పక్కన పెడితే ఇంకా చాలా ఆర్దిక అరాచకాలు చేశాడంటున్నాయి జాతీయ మీడియా సంస్థలు. తాజాగా ఓ ఛానల్ వారు మాల్యా ఈమెయిల్స్ బట్టబయలు చేశారు. వాటిల్లో కింగ్ ఫిషర్ కంపెనీ ఉన్నతాధికారులతో మాల్యా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు.     మాల్యా ఈమెయిల్స్ సారాంశం ఏంటంటే… ఇక్కడి బ్యాంకుల వద్ద కింగ్ పిషర్ విమానాల కోసమని అప్పులు చేసి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ , ఫోర్స్ వన్ రేసింగ్ టీమ్ లకు డబ్బులు మళ్లించటం. క్రికెట్ లో, రేసింగ్ లో టీమ్ లు కొని వాట్ని పోషించటానికి జనం డబ్బుతో నడిచే బ్యాంకులకి టోపి పెట్టాడన్నమాట. ఇలా అయిదు వందల కోట్లు విదేశాలకు పంపి అక్కడ్నుంచీ తన క్రికెట్ టీమ్ కు, కార్ రేసింగ్ టీమ్ కు చెల్లింపులు చేశాడట. వాటి మీద లాభం ఏముంటుంది? అందుకే డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి!   మాల్యా లాగా కార్పోరేట్ మోసాలు చేసి విదేశాలకు పారిపోయే బాపతు నేరస్థులకి కఠిన శిక్షలు పడేలాగా మోదీ సర్కార్ కొత్త బిల్లు తెచ్చింది. అయితే, దాన్ని ఎంత వరకూ మన పాలకులు నిజాయితీగా అమలు చేస్తారన్నది సమస్య! అదే జరిగితే మాల్యా మొదలు నీరవ్ మోదీలు, జగన్మోహన్ రెడ్డీలు అందరూ తగిన ఫలితం అనుభవిస్తారు. కానీ, అలాంటి సూచనలు మన వ్యవస్థలో తక్కువే!

రాజధాని అడ్డుకుంటానన్న పవన్‌పై ప్రభావం… ‘వారిదే’నా!

ఈ మధ్యే ఏపీ సీపీఐ కార్యదర్శి ప్రకటించేశారు! రాబోయే ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారట! ఇది పెద్ద న్యూస్ ఏం అవ్వలేదు. ఎందుకంటే, పవన్ ఎర్ర జెండా అభిమానం రహస్యమేం కాదు. తాను చిన్నప్పట్నుంచే కమ్యూనిస్టు భావజాలం గలవాడినని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంత వరకూ సంతోషమే! కానీ, పవన్ కమ్యూనిజానికి ప్రతినిధులుగా భారతదేశ సీపీఐ, సీపీఎంలని ఎంచుకున్నారు! అదీ ఏపీ కొడవలి పార్టీల్ని అక్కున చేర్చుకున్నారు. ఇది పవన్ రాజకీయ అవగాహనకి మచ్చు తునక అనవచ్చు!     జనసేన, కమ్యూనిస్టులు కలిశారు కాబట్టి ఇక టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలది ఒంటరి పోరేనని మనం డిసైడ్ అవ్వొచ్చు. మరి కలిసి పోటీ చేస్తోన్న సీపీఎం, సీపీఐ, జనసేనలకి ఎవరికి ఎవరి వల్ల లాభం? ఇదే ఇప్పుడు హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ ను కూడా వేధిస్తోన్న విషయం! ఆయన మీద అభిమానంతో ఓటు వ్దేదామనుకున్న వారు కూడా ఇప్పుడు కమ్యూనిస్టు జెండాలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. సీపీఎం, సీపీఐ ఒకప్పటిలా ధృఢంగా లేవన్నది అందరికి తెలిసిన విషయమే. పోయిన ఎన్నికల్లో ఖాతాలు కూడా తెరవలేకపోయాయి నవ్యాంధ్రలో. అటువంటి స్థితిలో వున్న కమ్యూనిస్టులతో పవన్ కు అవసరం ఏంటి? ఒకరో ఇద్దరో కమ్యూనిస్టు వ్యతిరేక ఫ్యాన్స్ వుంటే వారు ఈయనకు ఓటు వేయకపోవటం తప్ప మరో లాభం లేదు! సీపీఎం, సీపీఐలతో కలయిక వల్ల పవన్ కు లాభం కంటే నష్టం ఎక్కువని కాస్త గట్టిగానే చెప్పుకోవచ్చు. ఎలాగంటే… ఆ రెండు పార్టీలు దేశ్య వ్యాప్తంగా కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. బెంగాల్ , త్రిపుర చేజారిపోగా , కేరళలో కాంగ్రెస్, బీజేపీలు సీపీఎంని ముప్పతిప్పలు పెడుతున్నాయి. కేరళల అధికారంపోతే కమ్యూనిస్టులకు ఎక్కడా సీఎం కుర్చీ వుండదు. అందుక్కారణం వారు చెప్పే కుందేటికి మూడు కాళ్ల సామెతే…     మన సీపీఎం, సీపీఐ పార్టీలు గొప్పగా చెప్పే చైనా కూడా కమ్యూనిజం పూర్తిగా మార్చేసుకుంది. కాలానుగుణంగా అమెరికాతో పోటీ పడేలా క్యాపిటలిస్టు ఆర్దిక విధానం నెత్తికెత్తుకుంది. అక్కడ పాలన, ఎన్నికల విధానాల్లో తప్ప కమ్యూనిజం ఎక్కడా కనిపించదు. కానీ, మన కమ్యూనిస్టులు మాత్రం ఇంకా మార్క్స్ , మావో సిద్ధాంతాలే మన గతి అంటూ చెబుతుంటారు. అవ్వి కూడా తమకు దశాబ్దాల తరబడి అధికారం ఇచ్చిన రాష్ట్రాల్లో నిజాయితీగా అమలు చేయలేదు. అందుకే, ప్రజలు వార్ని పక్కకు తోసి అభివృద్ధి, ఉద్యోగాలు చూపించే పార్టీలకు పట్టం కడుతున్నారు. బీజేపీ మొదలు టీడీపీ దాకా అన్నీ పార్టీలు ఉద్యమాలకు బదులు ఉద్యోగాలు అన్న నినాదంతోనే వరుసగా గెలుపులు స్వంతం చేసుకుంటున్నాయి. కమ్యూనిస్టులు మాత్రం అదే పాత పద్ధతిలో ప్రభుత్వ వ్యతిరేక జన ఆందోళనలే తప్ప మరో ఆలోచన చేయటం లేదు!     తమ పద్ధతులతో తామే నష్టపోతోన్న సీపీఎం, సీపీఐలని పవన్ అక్కున చేర్చుకున్నారు. పైగా వారి బాటలోనే తాజాగా కామెంట్స్ కూడా మొదలు పెట్టారు. అమరావతిలో కొంత మంది రైతుల కోసం వేల ఎకరాలిచ్చిన మిగిలిన అందరు రైతుల్ని నష్టపరిచేలా అమరావతి నిర్మాణం అడ్డుకుంటామని ప్రకటించారు. జనసేన అమరావతి నిర్మాణం అడ్డుకుంటుందా? అడ్డుకోగలదా? అన్నది తరువాతి ప్రశ్న! అసలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని నిర్మాణం జరుకుంటుంటే ఆనందించాల్సింది పోయి ఏవో సమస్యల్ని  చూపి అడ్డుకుంటానని బెదిరించటం ఏంటి? ఇది పక్కా సీపీఎం, సీపీఐ మార్కు ఉద్యమాల రాజకీయం. ఒకప్పుడు ఆ మాటలు పని చేసేవే. కానీ, ఇప్పుడు జనం ఉద్యమాల కంటే ఉద్యోగాల కోరుకుంటున్నారు. ఆవి అమరావతి లాంటి భవ్యమైన రాజధాని వల్ల సాధ్యం. హైద్రాబాద్ వుండటం వల్లే ఇవాళ్ల తెలంగాణ ఎంత ఆర్దిక అభివృద్ధి సాధించిందో అందరికీ తెలుసు. మరి అటువంటి రాజధాని ఏర్పాటుకు, అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే పవన్ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? ఎవరో చెప్పుడు మాటలు విని ఇలా బాద్యతా రహితంగా మాట్లాడితే ఎలా? రాజధాని అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ యువతకు జరిగే మంచేంటి?     ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం, ఓట్లు, సీట్లు పంచుకోవటం వరకూ ఓకే కానీ… రాబోయే ముప్పై ఏళ్లు ప్రజా జీవితం గడుపుతానని అంటోన్న జనసేనాని… పూర్తిగా సీపీఎం, సీపీఐ మార్కు ఛాందస కమ్యూనిజం తలకెత్తుకుంటే ఇబ్బందే! ఆయనకు అంతగా కమ్యూనిజం నచ్చితే మన కమ్యూనిస్టులు కాక చైనా ఏం చేస్తుందో చూసి తెలుసుకోవాలి. అప్పుడు ఆ దారిలోనన్నా అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ జనానికి భరోసా ఇవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి నిరోధకంగా మారితే… బెంగాల్, త్రిపుర, కేరళలో సీపీఎం, సీపీఐలకు ఎదురవుతోన్న గడ్డు పరిస్థితే పవన్ కు తప్పక పోవచ్చు!  

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి?

ఒకవేళ ముందస్తుగానో, లేక సమయానికే అయినా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆంధ్రులు ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేస్తారు. అది నిజమే అయినా… తెలంగాణ నుంచీ విడివడీ, హైద్రాబాద్ ను పోగొట్టుకున్న ఏపీ… ఇప్పుడు పీకల్లోతూ ఆర్దిక సవాళ్ల ఉబిలో వుంది. దీన్ని బయటకు లాగటమే ఎవరి లక్ష్యం అయినా. ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, రేపు జగన్ సీఎం అయినా కావచ్చు. కానీ, రాబోయే కొన్ని సంవత్సరాల వరకూ నవ్యాంధ్రకు అనేక అస్థిత్వ సమస్యలున్నాయి. ఎప్పటికప్పుడు జీవన్మరణ పోరాటం చేస్తే తప్ప నిలదొక్కుకోలేదు. అటువంటి కీలక సమయం కాబట్టే 2014లో జనం అనుభవజ్ఞుడైన చంద్రబాబును తమ సారథిగా ఎంచుకున్నారు.     త్వరలోనే మరోసారి దేశానికి ఎన్నికలు రావచ్చు. ఎప్పుడో మనం చెప్పలేకున్నా జనం తమ ఎంపీల్ని ఎన్నుకుని దిల్లీకి పంపాల్సి వుంటుంది! మరి టీడీపీ, వైసీపీల్లో ఎవరికి జైకొట్టాలి. ఇతర పార్టీలకి కూడా ఎందుకు మద్దతు తెలుపకూడదు. ఒక్కసారి ఆలోచిద్దాం. బీజేపీ ఇప్పటికే హోదా ఇవ్వక విలన్ గా మారింది. కాబట్టి కమలం గుర్తుకు ఎన్ని ఓట్లు వేసినా, ఎన్ని సీట్లిచ్చినా లాభమే శూన్యమే! మరిక కాంగ్రెస్ కైతే దేశ వ్యాప్తంగా ఏ మాత్రం ఆశావహంగా లేదు పరిస్థితి. పంజాబ్ తప్ప కాంగ్రెస్ చేతిలో ఏ రాష్ట్రామూ లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారీగా ఎంపీలు పెరిగి రాహుల్ ప్రధాని అవుతాడని వారి పార్టీ వాళ్లే నమ్మకంగా చెప్పటం లేదు. అటువంటి పార్టీ… పైగా ఇష్టానుసారం విభజన చేసిన హస్తం… ఇప్పుడు ఎంపీల్ని ఇస్తే ఏం చేస్తుంది? అదృష్టం బాగాలేకపోతే మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది రాహుల్ సేన! కాంగ్రెస్ , బీజేపీలు కాకుండా కమ్యూనిస్టులు, జనసేన వంటి పార్టీలకు ఎంపీల్ని ఇస్తే కూడా ఒదిగేదేం లేదు. ఎందుకంటే,  ఈ పార్టీలు ఇక్కడ అమరావతిలో చక్రం తిప్పలేవు. అక్కడ దిల్లీలో దమ్ము చూపులేవు. ఎటూ బలం లేని పార్టీలకు సీట్లు ఇస్తే సాధించేదేముంది? కాబట్టి చివరాఖరుకు మిగిలేవి టీడీపీ, వైసీపీలే! వీటిలోనే ఆంధ్రా ఓటర్ తన మద్దతు ఎవరికో తేల్చుకోవాలి!     వైసీపీకి పోయిన ఎన్నికల్లోనూ జనం బాగానే ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ, చేసిందేముంది? మోదీకి లోపాయికారిగా సహకరిస్తూ దిల్లీలో రాజీనామాలు చేసి హైద్రాబాద్ కు వచ్చేశారు. తెలంగాణ రాజధానిలో వ్యాపారాలు, ఏపీ రాజధానిలో చంద్రబాబుపై విమర్శలు. ఇంతే తప్ప ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ… వీటి గురించి వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారా? మొక్కుబడిగా మాట్లాడినా చివర్లో చంద్రబాబును తిట్టిపోసి మోదీకి సంతోషం కలిగిస్తుంటారు. అంతే తప్ప ఆంద్రా జనం కోసం తపన ఎక్కడా కనిపించదు. అన్ని పార్టీలు పోనూ మిగిలిన టీడీపీ … ఇప్పుడు పార్లమెంట్లో దేశ మొత్తం ముందు మోదీ సర్కార్ ను ఎండగడుతోంది. అవిశ్వాసం పెట్టి కలకలం రేపింది. ప్రతీ రోజూ చర్చలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పదే పదే మాట్లాడుతోంది. ఇదే ఓటర్లు ఆశించే స్పందన. అది అందిస్తోంది టీడీపీ ఎంపీలేగాని వైసీపీ వారు రాజీనామాలతో సరిపెట్టేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లు పక్కన పెట్టి రోడ్ పాలిటిక్స్ చేసుకుంటున్నారు. ఇదే ఏ ఏపీ ఓటరైనా రేపు పోలింగ్  టైంలో ఆలోచించాల్సింది! హోదా వచ్చినా రాకున్నా ఏదో ఒక రోజు తెచ్చేది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఎంపీలే. రాబోయే ఎన్నికల్లో మొత్తం పాతిక ఆంధ్రా పార్లమెంట్ స్థానాలు సైకిల్ క్యారియర్ పైకి చేరిపోతే… అప్పుడు వుంటుంది అసలు రాజకీయం. ఇప్పుడు వంద శాతం సీట్లు లేకున్నా ఎంతో పోరాడుతున్న టీడీపీ ఎంపీలు… 25మంది ఒక్కటైతే సభను అల్లాడించగలుగుతారు.     ఆంద్రా ఓటర్లు వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా చంద్రబాబుకు ఓటు వేస్తేనే హోదా ఉద్యమం ముందుకు పోయేది. లేదంటే, జగన్, పవన్ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ జట్టులోకి చేరిపోయే అవకాశాలే ఎక్కువ. అలాగే, గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా దిల్లీ రాజకీయాలు ఔపోసన పట్టిన చంద్రబాబు ఎంత ఎక్కువ మంది ఎంపీలుంటే అంత ఎక్కువ ప్రభావశీలం అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! మోదీ సర్కార్ వస్తే పోరాటం చేసేందుకు, మరో సర్కార్ వస్తే పొత్తు రాజకీయాల్లో ఏపీకి ఎక్కువ మేలు జరిగేలా చూసేందుకు… అన్నిటికి ఆయనే సమర్థుడు! అందుకే, ఆంధ్రా ఓటర్ చంద్రబాబుకు , టీడీపీకి కాకుండా ఇతర నేతలకి, పార్టీలకి జైకొట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటే అత్యంత అమూల్యం….   

సెల్ఫ్ గోల్స్‌తో ‘కాపు’రం చేస్తోన్న జగన్!

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ చేసిన కాపు రిజర్వేషన్ వ్యాఖ్యలే హాట్ టాపిక్ అయ్యాయి! గత ఎన్నికల ముందు నుంచీ కాపులకు బీసీ హోదా అనేది పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతూ వస్తోంది. జనంలో వున్న ఆకాంక్ష చూసి మన నేతలు సై అన్నారు. కానీ, ఇప్పుడు అది కోర్టులకి, కేంద్రానికి సంబంధించిన వివాదంగా మారిపోయింది. అయితే, ఇప్పటి వరకూ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మరే ఇతర పార్టీ కూడా కాపులకి రిజర్వేషన్స్ పై నో చెప్పలేదు. ఎందుకంటే, అది పొలిటికల్ గా అంత తెలివైన మాట కాదు. కాపులకి నిజంగా బీసీ స్టేటస్ ఇవ్వటం వీలవుతుందా లేదా అనేది పక్కన పెడితే… నా వల్ల కాదని మాత్రం ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఆ ఘనకార్యం మన జగన్ బాబే చేశారు!     జగన్ వైఎస్ బొమ్మ పెట్టుకుని ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు కానీ… అసలు ఆయనలో ఒక్కోసారి ఆశ్చర్యం కలిగించే మనిషి బయటకొస్తాడు. సగటు పొలిటీషన్ ఎవరూ చేయని చారిత్రక తప్పులు ఆయన చేస్తుంటారు. వాటి వెనుక ఏదో పెద్ద చాణక్యం వుందని ఆయన మీడియా, టీడీపీ అంటే పడని వారు, చంద్రబాబు ప్రత్యర్థులు భాష్యాలు చెప్పొచ్చుగాని…. ఫైనల్ వాటికి ఎలాంటి వాల్యూ వుండదు. జగన్ సెల్ఫ్ గోల్స్ గా హిస్టరీలో మిగిలిపోతుంటాయి. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన తాజా కామెంట్ అలాంటి ఒకానొక అన్ వాంటెడ్ సెల్ఫ్ గోలే! జగన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా నవ్యాంధ్రాలో తన ప్రస్థానం మొదలు పెట్టాక అసెంబ్లీని బహిష్కరించి అతి పెద్ద తప్పు చేశాడు. ఇక మొన్నటికి మొన్న కీలకమైన సమయంలో పార్లమెంట్ ను కూడా వదిలి వచ్చేయమని తన ఎంపీలకు చెప్పి మరో బ్లండర్ చేశాడు. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ సంగతి నా చేతిలో లేదు కేంద్రం చూసుకోవాలి అంటూ మ్యాచ్ ను మూడు , సున్నా గోల్స్ గా మార్చేశాడు! టీడీపీకి, చంద్రబాబుకి తన సెల్ఫ్ గోల్స్ తోనే జగన్ పాయింట్లు పెంచుతున్నాడు. ఆపార అనుభవం వున్న చంద్రబాబు తన చాణక్యంతో ఈ పాయింట్లతో ఈజీగా మ్యాచ్ గెలిచే పరిస్థితి వచ్చేస్తోంది!     ఇంతకీ, కాపులకి బీసీ స్టేటస్ పై నేనేమీ హామీ ఇవ్వను అని కుండబద్ధలు కొట్టి జగన్ ఏం సాధించాడు? ఏమీ లేదు! కుండ బద్దలై మట్టి పెంకులు గుచ్చుకునే స్థితి వచ్చింది! దట్సాల్! అసలు కొందరి అభిప్రాయం ప్రకారం జగన్ ఇలా మాట్లాడటానికి కారణం… అంతకు ముందు ఆయన పవన్ పై చేసిన పర్సనల్ వ్యాఖ్యలే! పవన్ పెళ్లిళ్ల గురించి అనవసరంగా నోరు రచ్చ చేసుకున్న వైసీపీ అధినేత ఈ కాపు కామెంట్ల ద్వారా జనం దృష్టిని మరల్చగలిగాడు. అయితే, ఇది కూడా నెగటివ్ గానే పని చేసింది. పవన్ ని తిట్టాడన్న ఆగ్రహంతో వున్న కాపు సోదరులు ఇప్పుడు తమ రిజర్వేషన్ ఆకాంక్షపై జగన్ నీళ్లు చల్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్రగడ లాంటి వారు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎలా చూసినా కాపు ఓటు బ్యాంక్ కి జగనే స్వయంగా చిల్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది...     జగన్ కాపు రిజన్వేషన్లపై తేల్చేశారు. దీని వల్ల టీడీపీకి ఎంత లాభమో కానీ పవన్ కు కాపు ఓట్లు మళ్లే ప్రమాదమూ వుంది. మరి ఈ విషయం తెలుసుకోలేనంత అమాయకుడా జగన్? చెప్పలేం… బాగా తెలివైన వాడే అయితే ఇప్పుడు ఏ అవసరం లేకున్నా కాపు రిజర్వేషన్ల సమస్యని రాజేసి ఎందుకు చలి కాచుకుంటాడు! జగన్ లాజిక్ జగన్నాథుడికే తెలియాలి! 

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాపాలు… ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి!  

భారతదేశంలో రాజకీయంగా ఓ విచిత్రమైన స్థితి వుంటుంది. అదేంటంటే… ఇప్పుడున్న సమస్యల్ని దేన్ని బాగా తవ్వి చూసినా… మూలంలో కాంగ్రెస్ హస్తం వుంటుంది! దేశాన్ని అత్యధిక కాలం దిల్లీలో, రాష్ట్రాల్లో ఏలిన అతి పురాతన పార్టీ అదే! కాబట్టి అన్ని అద్భుతాల వెనుక కాంగ్రెస్ వున్నా వుండకున్నా అన్ని అద్వాన్నాల వెనుక మాత్రం హస్తం… హస్తం వుండే తీరుతుంది! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన చర్చ కూడా పదేపదే చేయి గుర్తు వైపే వేలెత్తి చూపుతోంది!     ఒకవైపు మోదీ, మరోవైపు చంద్రబాబు మోహరించి ఇప్పుడు ప్రత్యేక హోదా రణ రంగం చేస్తున్నారు. ఏపీలో అయితే కాంగ్రెస్ కు వున్నది సున్నా ఎమ్మెల్యేలు కాబట్టి పెద్దగా చర్చే లేదు. కేంద్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అడపాదడపా ఏపీ ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతుంటారు. రాహుల్, మన్మోహన్ సహా అందరూ హోదా ఇవ్వాల్సిందేనంటారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా హస్తం నేతలు లోక్ సభ, రాజ్యసభల్లో ఆంద్రా డిమాండ్లకు అండగానే నిలిచారు. ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ వుందని భ్రమిస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే… అసలు ఇప్పుడున్న అన్ని చిక్కుముళ్లకి కారణమే కాంగ్రెస్ కాబట్టి! ప్రత్యేక హోదాకు ఆనాటి ప్రధాని మన్మోహన్ ఒప్పుకుని కూడా బిల్లులో అధికారికంగా పెట్టలేదు. అదే ఇప్పుడు మోదీ సర్కార్ కి వరంగా మారింది. అదికారికంగా ఇవ్వని హామీ తీర్చకున్నా ఏమీ అనటానికి వీల్లేని పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ తప్పు కాక మరెవరిది అనగలం?     తమ పదేళ్ల ప్రభుత్వ కాలంలో చిట్ట చివరి సమావేశాల రోజున సభలో తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన సోనియా సేన… కావాల్సినన్ని చారిత్రక తప్పులు చేసింది. బిల్లులో హోదా గురించి ఎలాంటి హామీ ఇవ్వని యూపీఏ సర్కార్ మరో దారుణం కూడా చేసింది. ఏపీలోని 175 ఎమ్మెల్యే స్థానాల్ని 225కి పెంచాలని విభజన చట్టంలో పెట్టారు. కానీ, అది సాధ్యమేనా? 2026 వరకూ నియోజక వర్గాల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. రాజ్యాంగం అందుకు ఒప్పుకోదు. ఈ మాట చెబుతోన్నది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వ మంత్రి చిదంబరం! తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశంలో ఆయనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదే విషయమై నిలదీశారు కూడా! చిదంబరం చక్కగా మౌనం దాల్చారు తప్పు జవాబు ఇవ్వలేదు!     రాజ్యాంగం ఒప్పుకోదని తెలిసీ, 2026 వరకూ ఎమ్మెల్యే సీట్ల పెంపు కుదరదనీ తెలిసి… కాంగ్రెస్ ఆ హామీని బిల్లులో పెట్టింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన చిదంబరం నిర్మోహమాటంగా వీలు కాదని చెబుతున్నారు. ఇలాంటి పనులే హస్తం పార్టీ ఎప్పుడూ చేస్తూ వస్తుంటుంది! పైగా అటు హోదా రాకపోవటానికి, ఇటు నియోజక వర్గాల పెంపు జరగకపోవటానికి కారణమైన పార్టీనే మళ్లీ మేము ఆంధ్రాను ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. యూపీఏ సర్కార్ వస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతన్నారు! వీళ్లని ఏపీ ఓటర్లు నమ్ముతారా? రాష్ట్రంలోని ఏ పార్టీ హస్తంతో చేయి కలపటానికి సిద్ధంగా లేకపోవటమే పరిస్థితికి అద్దం పడుతుంది! ఇష్టానుసారం విభజన చేసి, లోపభూయిష్టంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆకులు పట్టుకుందామన్నా లాభం లేని స్థితిలో వుంది. మరోవైపు ఏపీలో ఎదిగే అవకాశం వున్నా బీజేపీ మొండి వైఖరితో స్వయంకృతాపరధం చేస్తోంది. మొత్తానికి సమీప భవిష్యత్ లో రెండు జాతీయ పార్టీలు ఆంధ్రాలో సున్నాలకే పరిమితం కాక తప్పకపోవచ్చు!

కోమటిరెడ్డి మీద కోపం కోర్టుతో కొట్లాటగా మారుతోందా?

కోర్టులకి , ప్రభుత్వాలకి మధ్య గొడవ ఎప్పుడూ వుండేదే! చాలా అంశాల్లో కోర్టుల ఆదేశాల్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేయకుండా వుండాలా అని దార్లు వెతుకుతుంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి, హైకోర్టులకి మధ్య గొడవే కాదు సుప్రీమ్ కోర్టుకు , కేంద్రానికి కూడా అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తూనే వుంటాయి. కానీ, మన రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశిస్తే ఎవరైనా శిరసావహించాల్సిందే. అందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు కూడా అతీతం కారు. నిజానికి వారు బాధ్యతగా కోర్టు తీర్పుల్ని పాటించకపోతే సామాన్య జనానికి కూడా న్యాయస్థానాలపై గౌరవం తగ్గిపోయే ప్రమాదం వుంది. అందుకే బాధ్యత గల ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు ఎప్పుడూ పాల్పడదు!     కోర్టులకి, గవర్నెమంట్ కు గొడవ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే… హైద్రాబాద్ హైకోర్టు తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది. నిజానికి అసెంబ్లీకి సంబంధించినంత వరకూ స్పీకర్ దే అంతిమ నిర్ణయం. ఆయన ఆదేశాల్ని ప్రశ్నించటానికి వీల్లేదు. కానీ, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లపై తెలంగాణ స్పీకర్ తీసుకున్న చర్యలు వివాదాస్పదం అయ్యాయి. వేటు పడ్డ ఎమ్మెల్యేలు వేరే గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన సస్పెన్షన్ వేటు ఎత్తి వేసింది. వారికి గన్ మెన్లను కూడా తిరిగి కేటాయించాలని కేసీఆర్ సర్కార్ ని ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఇద్దరు ఎమ్మెల్యేల్ని స్పీకర్ అసెంబ్లీలోకి రానివ్వలేదు. గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించలేదు. ఇదే న్యాయమూర్తుల ఆగ్రహానికి కారణమైంది.     బహిష్కృత ఎమ్మెల్యేల్ని తిరిగి సభలోకి అనుమతించాలనీ, వారికి భద్రత కల్పించాలనీ, జీతభత్యాలు ఇవ్వాలని ఆదేశిస్తోన్న హైకోర్ట్ ఒక దశలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని సూటిగా ప్రశ్నించిందట. మీరు ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారా? లేక ఒక పార్టీ తరుఫునా? అంటూ ఏజీపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగా తెలంగాణ సర్కార్ పునరాలోచించుకోవాల్సిన అంశమే! ఎందుకంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధికార పక్షం గొడవగా మొదలైన బహిష్కరణ వ్యవహారం కోర్టుకి, ప్రభుత్వానికి మధ్య విభేదంగా మారుతోంది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే అంత మంచిది కాదు. కాకపోతే, ఇప్పుడు కోర్టు చెప్పినట్లు కోమటిరెడ్డి, సంపత్ లను తిరిగి అసెంబ్లీలోకి ఆహ్వానిస్తే అది టీఆర్ఎస్ కు ఓటమిగా ప్రచారం అవుతుంది. బహుశా ఇదే తెలంగాణ సీఎం మదిలో మెదులుతున్న ఆలోచన కావచ్చు. కానీ, కొన్నిసార్లు కేసీఆర్ గులాబీ బాస్ గా కాకుండా ప్రభుత్వ అధినేతగా నిర్ణయం తీసుకుంటేనే హుందాగా వుంటుంది. స్పీకర్ తో బహిష్కరణ వేటు ఎత్తి వేయిస్తే మరింత డ్యామేజ్ జరగకుండా వుంటుంది. కోమటిరెడ్డి, సంపత్ సభలోకి వచ్చాక వార్ని తమ ఎమ్మెల్యేలతో కలిసి ఎదుర్కోవటం టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరీ అసాద్యం ఏం కాదు. ఆ కోణంలో ఆలోచించకుండా పట్టుదలకి పోయి కోర్టు ధిక్కరణ అంచున నిలవటం జనం ముందు అంత మంచి సంకేతమేం కాదు.     కోమటిరెడ్డి, సంపత్ లకు కోర్టులో దక్కిన తీర్పు, వారి కోసం న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా టీకాంగ్ కు ఉత్సాహాన్నిచ్చేవే. జనంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ ను ఈ వివాదంతో కొంత వరకూ ఇరుకున పెట్టవచ్చని వారు ఆలోచిస్తుండవచ్చు. కాకపోతే, ఈ గొడవ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాల్చేటంత సంచలనాత్మకమైందైతే కాదు!

బలిపీఠంగా మారుతోన్న ప్రత్యేక హోదా నినాదం!

    తెలుగు నేల ఏ క్షణాన రాష్ట్రాలుగా ఏర్పడిందోగానీ… ఇక్కడ ఎప్పుడూ బలిదానాలే! నిజాం నిరంకుశ పాలనలో వేల మంది ప్రాణాలు కోల్పాయరు. ఆ తరువాత భారతదేశంలో విలీనం అయిన హైద్రాబాద్ సంస్థానం ఆంధ్రాతో కలిసింది. తెలంగాణతో కలవటానికి ముందే ఆంద్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది. ఇక ఆంధ్రా, తెలంగాణలు ఎలాగో కలిసి సమైక్యాంద్ర ఏర్పడితే… అది అనేక కారణాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. 1969లో తెలంగాణ ఉద్యమకారులు చనిపోయారు. వెంటనే… కొన్నేళ్లకే ప్రత్యేకాంధ్ర ఉద్యమంతో మరి కొంత మంది అసువులు బాయాల్సి వచ్చింది. ఇక 2014 విభజనతో ముగిసిన ఉదమ్యం సంగతైతే చెప్పక్కర్లేదు! తెలంగాణలో అనేక ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆంద్రలోనూ కొందరు బలవన్మరణం పాలయ్యారని వార్తలొచ్చాయి. మొత్తానికి ఏపీ, తెలంగాణ వేరు వేరు అయిపోయాక ఈ బలిదానాల గుండెకోత వుండదని అంతా భావించారు! కానీ, ఇప్పుడు మరోమారు ప్రత్యేక హోదా బలిపీఠంపై తెలుగు ప్రాణాలు పణంగా పెట్టబడుతున్నాయి! ఇది నిజంగా విషాదం…     చంద్రబాబు నాయుడు స్వంత జిల్లా చిత్తూరులోని మదనపల్లెలో సుధాకర్ అనే 26 ఏళ్ల యువకుడు ఉరితాడుకు వేలాడి ప్రాణాలు తీసుకున్నాడు. కారణం…. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని! ఇంకా బోలెడంత జీవితం మిగిలి వున్న ఆ యువకుడు , చేసేది చేనేత పని! తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులు! వింటుంటేనే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ ఉధృతిలోనూ ఇదే స్థితిని చూసింది తెలుగు జాతి. దిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి మనమెప్పుడూ మూల్యం చెల్లిస్తూనే వున్నాం. నెహ్రు నుంచీ మోదీ దాకా ఇదే పద్ధతి. నెహ్రూ సకాలంలో స్పందించకే పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అదే దుస్థితి కొనసాగుతోంది. అయితే, ప్రత్యేక హోదా విషయంలో మోదీ సర్కార్ చాలా స్పష్టంగా వీలుకాదని చెబుతోంది. ఆంధ్రా అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు పోరాడుతున్నారు. ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం వున్న వారికైనా ప్రత్యేక హోదా రాదని స్పష్టంగానే అవగాహన వుంటుంది. కనీసం జేసే దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు మోదీ ప్రధానిగా వున్నంత కాలం హోదా డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సాద్యం కాదు. ఇదంతా సుధాకర్ లాంటి అమాయకులకి చేరవేయటంలో రాజకీయ పార్టీలు, మీడియా, సోషల్ మీడియా విఫలం అవుతున్నాయి.     బ్రిటీష్ వాళ్లతో స్వతంత్ర పోరాటం చేసినప్పుడు కూడా మనం కోరింది అంతా తేలిగ్గా లభించలేదు. కానీ, అప్పుడు ఇప్పటిలా ఆత్మహత్యలు జరగలేదు. కారణం ఉద్యమం నడిపే నేతలు జనానికి భరోసా కల్పించేవారు. ఏనాటికైనా బతికి సాధించగలమని నమ్మకం కలిగించే వారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతూ, ఎవరి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వారు చేస్తూ రాష్ట్రం కోసం తపించే నిజాయితీపరుల్ని ఒత్తిడికి గురిచేస్తున్నారు. మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ హోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడట. ఇలా చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అనేకం. ఇప్పుడు సుధాకర్ అలాగే చేశారు. ఈయనకంటే ముందే తిరుపతికి చెందిన మునుకోటి అనే వ్యక్తి హోదా కోసం ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటి వాట్ని రాజకీయ నేతలు సీరియస్ గానే తీసుకోవాలి. తమ పార్టీ కార్యకర్తల చేత చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేయించాలి. మీడియాని, సోషల్ మీడియాని పెద్ద పెద్ద నాయకులు సమర్థంగా వాడుకుని ఆత్మహత్యలు వద్దని చెప్పాలి. లేదంటే, వందల మందిని బలితీసుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలాగే ప్రత్యేక హోదా కూడా అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ హోదా కోసమో, మరింక దేనికోసమో చేసుకునే ఆత్మహత్యల్ని హైలైట్ చేయకుండా వుండాలి. వాటి మీద చర్చ పెట్టి ముందు ముందు వేరే వారు చేసుకోకుండా చూడాలిగానీ…. టీఆర్పీల కోసం డెడ్ బాడీ వద్దకిపోయి సెన్సేషనలిజానికి తెగబడవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… కేంద్రం జనం ఎందు కోసం ఆత్మహత్యల దాకా వెళుతున్నారో అర్థం చేసుకోవాలి!

సైకిల్... హస్తం... కమలం… ఇక ఫ్యాన్?

అన్న ఎన్టీఆర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే పార్టీ టీడీపీనే! ఆయన స్థాపించిన ఆ పార్టీ, దాని పచ్చ జెండా, సైకిల్ గుర్తు చరిత్ర సృష్టించాయి. అయితే, తరువాతి కాలంలో నందమూరి వారసులు కాకుండా నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి పెద్ద దిక్కయ్యారు. ఇప్పుడు కూడా పార్టీని చంద్రబాబే ముందుండి నడుపుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నా పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కలుగజేసుకోరు. హరికృష్ణ, ఆయన తనయులు కూడా ఈ మధ్య టీడీపీకి దగ్గరగా ఏం మసులుకోవటం లేదు. మొత్తానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు అందరూ రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేకుండా అయిపోయారు. కేవలం నందమూరి పురంధేశ్వరి మాత్రం ఇందుకు మినహాయింపు!     మొదట తండ్రి పెట్టిన టీడీపీలో ప్రస్థానం ప్రారంభించిన పురంధేశ్వరి క్రమంగా చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారు. అసలు ఎన్టీఆర్ మనసావాచాకర్మణా వ్యతిరేకించిన హస్తం పార్టీలో ఆమె చేరటమే పెద్ద సంచలనం! అయినా ఆమె సోనియా సైన్యంలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించారు. కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో పురంధేశ్వరి పార్టీ ఫిరాయించారు. ఈసారి కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీలో చేరారు. టీడీపీ నుంచీ కాంగ్రెస్ లో చేరటం ఎంత విడ్డూరమో అంతే విచిత్రం కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి రావటం కూడా! కాకపోతే, కమలంలో చిన్నమ్మ ఆశించినంత వర్కవుట్ కాలేదు. బీజేపీ, టీడీపీ పొత్తు వున్నప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ లో ఆమె భాగం కాలేకపోయారు. ఎంపీగానూ, ఎమ్మెల్యేగానూ గెలవని ఆమె ఏ  కేంద్ర, రాష్టర ప్రభుత్వ పదవి లేకుండానే కాలక్షేపం చేయల్సి  వచ్చింది. ఇప్పుడిక మరోసారి ఎన్నికల సీజన్ వస్తుండటంతో పురంధేశ్వరి కదలికలపై ప్రచారాలు మొదలయ్యాయి…     ఇప్పటికైతే బీజేపీలోనే వున్న పురంధశ్వరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది! అయితే, అది కమలం గుర్తుపై కాదట. ఫ్యాన్ గుర్తు మీదనట. వైసీపీలోకి జంప్ చేసి ఆమె విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. జగన్ కూడా ఓకే చేశారని చెబుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమో ఇప్పుడే చెప్పలేం. కానీ, పురంధేశ్వరి ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి బలమైన కారణమే వుంది. ఆమె తన  కొడుకు పొలిటికల్ ఎంట్రీకి ఈ పని చేయక తప్పటం లేదట.     పురంధేశ్వరి తనయుడు పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నాడట. గతంలో అక్కడ్నుంచీ దగ్గుబాటి వేంకటేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అయితే, ఇప్పుడు తమ అబ్బాయిని పరుచూరు నుంచి పోటికి దింపాలంటే బలమైన పార్టీ కావాలి. బీజేపీలో వున్న పురంధేశ్వరి అదే పార్టీ నుంచీ కొడుకు దించేంత రిస్క్ చేయలేరు. ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా విలనైన కాషాయ పార్టీ ఎంత మాత్రం సూటబుల్ కాదు. ఆ పార్టీ టికెట్ పై పురంధేశ్వరి రాజకీయ వారసుడు బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుంది. అలా కాదని టీడీపీ నుంచి పోటీ చేసే చాన్స్ కూడా లేదు. చంద్రబాబుతో పురంధేశ్వరి దంపతుల విభేదాలే కారణం. ఇక మిగిలింది జగన్ పార్టీనే! అందుకే, పురంధేశ్వరి తాను బీజేపీ వదిలి వైసీపీలోకి మారి, కొడుకుని కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నారట! విజయవాడ ఎంపీగా పురంధేశ్వరి , పరచూరు ఎమ్మెల్యేగా ఆమె తనయుడు పోటీ చేసి గెలుస్తారో లేదో తరువాతి సంగతి… కానీ, ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీలు అన్నిట్లో పని చేసిన ఘనత మాత్రం నందమూరి పురంధేశ్వరికే దక్కుతుంది. అలాగే, ఈ మద్య కన్నా లక్ష్మీనారాయణను చివరి నిమిషంలో వెనక్కి లాగేసిన బీజేపీ పెద్దలు చిన్నమ్మ పార్టీ మార్పుపై ఎలా స్పందిస్తారో కూడా చూడాలి!

అభివృద్ధి హైవే వదిలి హిందూత్వ బైపాస్‌కి రూటు మార్చిన బీజేపీ!   

దేశంలో హిందూత్వ పార్టీ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బీజేపీనే! శివసేన లాంటి పార్టీలు అక్కడా ఇక్కడా వున్నా ప్రధానమైన హిందూత్వ ఎజెండాతో నడిచే కాషాయ పార్టీ కమలదళమే! అయితే, ఆరెస్సెస్ అండతో ముందుకు పోయే బీజేపీ రెండు రకాల మాటలతో రాజకీయం చేస్తూ వుంటుంది. ఒకవైపు అభివృద్ధి, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూనే మరో వైపు అవసరమైనప్పుడల్లా రామ మందిరం, హిందూత్వా అంటుంది! ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అలాగే ఎప్పుడు ఎవరు మాట్లాడాలో కూడా వారికి బాగా తెలుసు! అభివృద్ధి , అవినీతి నిర్మూలన, నల్లధనం, నిరుద్యోగం లాంటి మాటలు మాట్లాడే వారు గోవధ నిషేధం, ముస్లిమ్ లలో జనాభ పెరుగుదల, అయోధ్య రామ మందిరం… ఇలాంటి అంశాల జోలికి వెళ్లరు. తాజాగా కాషాయ నేతల వరుస కామెంట్లు చూస్తే మనకు రానున్న ఎన్నికల ఎజెండా ఏంటో తెలిసిపోతుంది!     2014లో కాంగ్రెస్ పదేళ్ల పాలనలోని అవినీతి, స్కామ్ లు మోదీకి బాగా కలిసొచ్చాయి. అందుకే, ఎక్కువగా హిందూత్వ ఎజెండా నెత్తికెత్తుకోలేదు. కాంగ్రెస్ హఠావ్ నినాదంతో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ హోరెత్తించారు. కానీ, నాలుగేళ్ల తరువాత సీన్ మొత్తం రివర్సైంది. మోదీ వచ్చాక చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రయోగాలు పేద, మధ్యతరగతి వారికి అసతంతృప్తి కలిగిస్తున్నాయి. అలాగే, ఉత్తరాదిలో బీజేపీ పట్టు అంతకంతకూ సడలుతోంది. పోయిన సారి ఎంపీల సీట్ల విషయంలో రాష్ట్రాలకు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసిన చోట ఇప్పుడు ఉప ఎన్నికల్లో వరుస ఓటములు భయపెడుతున్నాయి. అందుకే, ఉత్తరాది హిందూ ఓటర్లని కదిలించే పనిలో పడింది కాషాయ దళం. అందుకు తగ్గట్టే అతివాదులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో వారి కామెంట్లు చూస్తే భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థమైపోతుంది!     ఉత్తర్ ప్రదేశ్ నుంచీ పార్లెమంట్ కు ఎంపికైన ఎంపీ హరి ఓం పాండే. ఈయన తాజా కామెంట్ ఏంటంటే… దేశ స్వాతంత్ర్యం తరువాత ముస్లిమ్ జనాభ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అందువల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు పెరుగుతున్నాయి. మనం తక్షణం పార్లమెంట్లో జనాభ పెరుగుదల నియత్రణ కోసం బిల్లు తీసుకురాకపోతే మరోసారి పాకిస్తాన్ లాగా భూభాగం కోల్పోవాల్సి వస్తుంది! ఇదీ ఆయన చేసిన హాఠాత్తు వ్యాఖ్య!   ఉత్తర్ ప్రదేశ్ కే చెందిన మరో బీజేపీ నేత సురేంద్ర సింగ్. ఆయన కూడా ముస్లిమ్ లలో జనాభా పెరుగుదల ఎక్కువగా వుందని అన్నారు. అందుకు విరుగుడుగా హిందువులు కూడా అయిదుగురు పిల్లల్ని కనమని పిలుపునిచ్చారు. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, మరొకరు ఎవరైనా ఫర్వాలేదని ఆయన అన్నారు! బీజేపీ ఉత్తరాది నాయకులు మైనార్టీ వర్గాల్ని టార్గెట్ చేస్తే దక్షిణాది నేతలు మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో ఈ మద్యే ఎన్నికల్లో గెలిచిన ఓ ఎమ్మెల్యే మేధావుల్ని, అభ్యుదయవాదుల్ని ఏకంగా కాల్చిపారేయాలని అభిప్రాయపడ్డాడు. తానే దేశ హోంమంత్రి అయితే పోలీసులకి కాల్చిపారేయమని ఆదేశాలు ఇస్తానన్నాడు బసన గౌడ! కర్ణాటకలో ఈ మధ్యే గౌరీ లంకేష్ లాంటి రచయిత్రి మీద దాడి జరగటం మనందరికీ తెలిసిందే!     ముస్లిమ్ లకు వ్యతిరేకంగా, మేధావులు, అభ్యుదయవాదులకి వ్యతిరేకంగా ఇలా మాట్లాడే వారు బీజేపీలో ఎప్పుడూ వుంటారు. కానీ, వీరంతా ఇప్పుడు హఠాత్తుగా వ్యాఖ్యలు చేయటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. గోరక్షకుల దాడుల్ని, ఎక్కడ మైనార్టీలకు, దళితులకి ఏ కాస్త ఇబ్బంది కలిగినా ఆ సంఘటనల్ని కాంగ్రెస్ హైలైట్ చేస్తోంది. ఇతర సెక్యులర్ పార్టీలు కూడా మోదీ సర్కార్ ని వీలైనంత ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఇటువంటి సెక్యులర్ రాజకీయాలకు విరుగుడుగా బీజేపీ హిందూత్వ ఎజెండాను మరోసారి నెత్తికెత్తుకుంది. పరిస్థితి చూస్తుంటే ముందు ముందు ఎన్నికల హోరులో కాషాయ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. 2019 పార్లెమంట్ ఎన్నికల నాటికి ఈ మాటలు పరాకాష్టకు చేర్చి మోదీని మరోసారి పీఠం ఎక్కించటం ఈ మొత్తం వ్యూహం లక్ష్యంగా భావించాలి! అయితే, అది ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది? ఓటర్లు ఎంత వరకూ ఎమోషనల్ అవుతారు? వేచి చూడాలి! అంత వరకూ మాత్రం రాహుల్ లాంటి సెక్యులర్ నేతలు, ఓవైసీ లాంటి మైనార్టీ నేతలు బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలకి చెలరేగిపోయి స్పందించటం నిత్య కృత్యమే అవుతుంది!

మాంత్రికుడి ప్రాణం చిలకలో… పవన్‌కు గండం ఫ్యాన్స్ ఆవేశంలో!

పవన్ భయపడ్డంతా జరిగింది! ఆయన నోరు తెరిచి రచ్చ చేయొద్దని వేడుకున్నా… ఆయన సోకాల్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు! ఇది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే పదే పదే ఎదురయ్యే సమస్య! ఏం చేయాలో అర్ఝం కాని వ్యవహారం! ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషన్ అయిన జనసేన అధినేత ఫ్యాన్స్ అని చెప్పుకునే వారు చేసే వెటకారాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయినా వారిలో మాత్రం ఆవేశం, ఆలోచన రావటం లేదు… జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, పెళ్లాల గురించి మాట్లాడాడు. అది తప్పే. కానీ, వెంటనే పవన్ తన అభిమానులకి స్పష్టంగా చెప్పాడు. ఎక్కడా వైఎస్ కుటుంబ సభ్యుల్ని, వారింటిలోని ఆడపడుచుల్ని వివాదంలోకి లాగవద్దని. జనసేనాని ఇంతలా పరిణతి చూపించి పిలుపునిచ్చినా పవనిస్టులు మాత్రం తమ కథ తాము నడిపారు! వైఎస్ జగన్ కుటుంబంలోని ఆడవార్ని కాకుండా ఎవరో కొత్తమ్మాయిని గొడవలోకి లాగారు. ఆమె పేరు అలేఖ్యా ఏంజిల్. ఆమెతో జగన్ వున్న సెల్ఫీ ఫోటోను వైరల్ చేసి శునకానందం పొందారు! ఇదే వద్దని చెప్పారు పవన్. అయినా తమ బుద్ధి పోనిచ్చుకోలేదు ఉన్మాద అభిమానులు…     పాపం… పవన్ పదే పదే ఇలాంటి ఆవేశపూరిత ఫ్యాన్స్ వల్ల తంటాలు పడాల్సి వస్తోంది. కత్తి మహేష్ విషయంలో గబ్బర్ సింగ్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాన్ని ఒక విధంగా కత్తి చాలా తెలివిగా వాడుకుని గందరగోళం కూడా సృష్టించారు. ఆ పైన వర్మదీ, శ్రీరెడ్డిది కూడా ఇదే ఫార్మాట్! వాళ్లు పవన్ ని ఏదో అనటం, పవన్ వాళ్లనీ ఏమీ అనకున్నా ఫ్యాన్స్ రెచ్చిపోవటం, చివరకు తలనొప్పి అంతా పవర్ స్టార్ భరించాల్సి రావటం జరుగుతోంది. వపన్ అబిమానులు దుందుడుకు చర్యల వల్ల ఆయన రెండు, మూడు న్యూస్ ఛానల్స్ మ్యానేజ్మెంట్లతో కూడా గొడవపడాల్సిన స్థితి దాపురించింది. ఇక ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ వ్యవహారం కూడా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే! కందకు లేని దురద అన్న సామెత గుర్తొచ్చేలా పవన్ ఫ్యాన్స్ వదినమ్మని రెండో పెళ్లి చేసుకోవద్దని కలకలం రేపారు. పవన్, రేణు పరస్పర అవగాహనతో విడిపోయినా వీరే తెగ ఫీలయ్యారు!     వపన్ కళ్యాణ్ అభిమానులు ఇంత కాలం సోషల్ మీడియాలో చేసిన హంగామా వేరు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటూ … జనసేనాని ఓట్ల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో… వీరి ఆగడాలు తీసుకొచ్చే ఫలితాలు వేరు! పవన్ కి ఈ విషయం తెలియదని భావించలేం. కానీ, ఆయన తన అభిమానులని చెప్పుకునే వార్ని ఎలా కంట్రోల్ చేస్తారు? జగన్ వ్యక్తిగత విమర్శల్ని పట్టించుకోవద్దని చెప్పినా కూడా జరగాల్సింది జరిగిపోయింది. అనవసరంగా ఎవరో అలేఖ్యా అనే అమ్మాయి పవన్ అభిమానుల ఆవేశానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆమె ఓ క్రిస్టియన్ గీతాల సీడీ ఆవిష్కరణ కోసం లోటస్ పాండ్ కు వచ్చింది. అదీ తన కుటుంబ సభ్యులతో కలిసి. ఆ సమయంలో ఓ సెల్ఫీ తీసుకుంది. ఇంత చిన్న విషయాన్ని తమ ఇష్టానుసారం రాతలతో సోషల్ మీడీయాలో వైరల్ చేసి ఆనందించారు పవన్ అభిమానులు. దానికి అలేఖ్యా బాధపడి పోస్టు పెట్టింది. తనని బజారుకు లాగొద్దని వేడుకుంది. ట్విస్ట్ ఏంటంటే… తానూ పవన్ అభిమానినేనని చెప్పింది పాపం!     ఇప్పుడు జగన్, అలేఖ్యాల ఫోటో విషయంలో జరిగిన రచ్చకి పవన్ కారణం కాదు. అలాగే, కత్తి మహేష్, వర్మ, శ్రీరెడ్డి, రేణు దేశాయ్‌ల వ్యవహారాల్లో కూడా! కానీ, జనం ఓట్లు వేయటానికి పోలింగ్ బూత్ కి బయలుదేరేటప్పుడు ఇదంతా ఆలోచించరు. జరిగిన రచ్చని మాత్రమే జ్ఞాపకం పెట్టుకుని ఈవీఎం మెషిన్ పై మీట నొక్కుతారు. కాబట్టి పవన్ సాద్యమైనంత తొందరగా తన అభిమానులు అని చెప్పుకునే వార్ని నియంత్రించటానికి తగిన మార్గం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడాయన బాక్సాఫీస్ పవర్ స్టార్ కాదు… బ్యాలెట్ బాక్సుల బ్యాటిల్లో నిలిచిన జనసేనాని! 

చేతులు కాల్చుకున్న హస్తం... ఆకులు పట్టుకుంటోంది!

ఇప్పుడు ఏపీలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఎవరు అంటే… కాంగ్రెస్ అనే సమాధానమే వస్తుంది! 2014కు ముందు తెలుగు నేలపైన హస్తం అతి కీలకమైన పార్టీ! ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితం. అదీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తిని తట్టుకుని కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ పీఠం ఎక్కటం అంత తేలిక కాదు. ఇక ఆంద్రా కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలా వుంది పరస్థితి.     గత ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సమానంగా నిలవలేకపోయింది. అందుకు ఇష్టానుసారం చేసిన రాష్ట్ర విభజన ప్రధాన కారణంగా కాగా జగన్ పెట్టిన వేరు కుంపటి చేతి పార్టీ చేయికాలేలా చేసింది! ఇప్పుడు ఎన్ని ఆకులు పట్టుకున్నా పరిస్థితిలో మార్పు కనిపించేలా లేదు. గత నాలుగేళ్ల కాలంలో కూడా ఆంద్రా కాంగ్రెస్ రోడ్డెక్కి నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేకపోయింది. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో పార్లమెంట్ నడుస్తోంటే రెడీ మేడ్ రాజకీయం మాత్రం చేస్తోంది!     కేంద్రంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో వున్న టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ టీమ్ భావించింది. ఇంత వరకూ బాగానే వున్నా… ప్రస్తుతం ఆంధ్రా జనం ప్రధానమైన కోరిక ప్రత్యేక హోదా! దానిపై తగినంతగా స్పందించలేదు రాహుల్ గాంధీ. తన సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు చివర్లో వెళ్లి మోదీని వాటేసుకుని కలకలం రేపాడు. ఆ గిమ్మక్కు తప్ప రాహుల్ ఏపీ హోదా గురించి మాట్లాడిన ఏ ఒక్క మాటా హైలైట్ కాలేదు. ఇదే కాంగ్రెస్ పట్ల ఆంధ్రా ఓటర్లకు ఏ మాత్రం నమ్మకం కలగకపోవటానికి కారణం! ఇప్పుడు ఏపి వున్న పరిస్థితికి అసలు కారణం హస్తం పార్టీనే! 2009లో రాజేసిన రాష్ట్ర విభజన వివాదం సాగదీసీ సాగదీసీ 2014లో పార్లెమంట్ తలుపులు మూసి ముగించారు! ఆ దురుసు ప్రవర్తనే ఏపీ ఓటర్లలో కసి పెంచింది. సున్నా సీట్లు వచ్చేలా చేసింది. విభజన అనివార్యమైనప్పుడు యూపీఏ పాలనలోనే ఏపీకి తగిన వరాలు ఇచ్చి , కేటాయింపులు చేయాల్సింది. అవేమీ చేయకుండా కాంగ్రెస్ అడ్డంగా నరికి అవతల పారేసింది. ఆ ఫలితం కారణంగా తెలంగాణలోనూ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. రెంటికీ చెడ్డ రేవడైంది.     2014 ఎన్నికల ఫలితాలతో కూడా ఏమీ నేర్చుకోని కాంగ్రెస్ నాలుగేళ్లు నిద్రపోయింది. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఉధృత పోరు చేస్తోంటే కాస్త క్రెడిట్ కొట్టేసే పనిలో పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ ప్రైవేట్ బిల్లు అంటూ ప్రకటన చేశారు. అలా ప్రవైట్ బిల్ పెట్టటం ద్వారా లాభం ఏంటి? అవిశ్వాస తీర్మానంలో టైంలో రాహుల్ చేత గట్టిగా ఆంధ్రాకు మద్దతు పలికించకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా లాభం ఏంటి? చివరగా, కేవీపీ లాంటి అందరూ కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటి? 2019లో యూపీఏ వస్తే ప్రత్యేక హోదాకు కృషి చేస్తాం! దీన్ని నమ్మాల్సిన అగత్యం ఆంధ్రులకు ఏముంది? 2014కు ముందు సోనియా చేతిలో న్యాయం చేసే అవకాశం వుంటేనే చేయని వారు ముందు ముందు ఎలా చేస్తారు? అసలు యూపీఏ వచ్చే అవకాశాలు ఎంత మాత్రం వున్నాయని?     మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి చేర్చుకుని , ప్రత్యేక హోదా కోసం మేమూ కృషి చేస్తున్నామని సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ కు ఈసారి కూడా ఏపీ ఓటర్ల దయా, దాక్షిణ్యాలు కష్టమే! సున్నా రాకుండా కాస్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే అద్భుతం! ఎందుకంటే, పోయిన సారి టీడీపీ, వైసీపీ, బీజేపీ మాత్రమే వుంటే… ఈసారి జనసేన కూడా వచ్చి చేరింది. ఇన్ని పార్టీల్ని కాదని జనం హస్తాన్ని తెచ్చి తమ తల మీద ఎందుకు పెట్టుకుంటారు?

ఇక బ్యాటింగ్ ఇమ్రాన్ ఖాన్‌ది! భారత్ బౌలింగ్ ఎలా చేయాలి?

ఇవాళ్ల అంతర్జాతీయ మీడియా దృష్టంతా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలపైనే వుంది. అనుకున్న విధంగానే ఇమ్రాన్ ఖాన్ గెలుపు దిశగా సాగిపోయాడు. ఒకప్పుడు పాకిస్తాన్ కు క్రికెట్ వాల్డ్ కప్ సాధించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికే కెప్టెన్ అవ్వనున్నాడు. ఇంత వరకూ ఓకే. కానీ, ఇవాళ్లే మరో ముఖ్యమైన విశేషం కూడా వుంది. అదే భారత్ లో జరిగే కార్గిల్ విజయ్ దివస్! ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్ సంబరాలు జరుగుతున్నాయి అంటే పాకిస్తాన్ లో చాలా మంది రగిలిపోతుంటారు. వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఒకరు! ఆర్మీకి అత్యంత ప్రియుడైన ఈ టెర్రరిస్ట్ సపోర్టర్ కాశ్మీర్ తమదేనని అడ్డంగా వాదించే టైపే! నిజానికి అందుకే ఆయనంటే పాక్ మిలటరీకి బోలెడు ఇష్టం. నవాజ్ షరీఫ్ లా కాస్తో కూస్తో కూడా రాజకీయ చాతుర్యం వున్నా వాడు కాదు ఇమ్రాన్. పూర్తిగా మిలటరీ బాస్ లు చెప్పే మాటలకు జీ హుజూర్ అనే రకం! మరిక ముందు ముందు మన దేశం ఎలా వుండాలో ప్రత్యేకించి చెప్పాలా? అలెర్ట్ గానే వుండాలి!     భారత్, పాక్ వేరు వేరు దేశాలైనా గవర్నమెంట్ మార్పు జరిగితే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరి ప్రభావం వుంటుంది. అందుకే, పాకిస్తాన్ పాలకులు ఏదో మూలన కాంగ్రెస్ పాలన దిల్లీలో వుండాలని కోరుకుంటారు. అలాగే, ఇండియాలో నేరుగా ఆర్మీ పాలన కంటే పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం పాలన వుండాలని మనం కోరుకుంటాం. మరీ ముఖ్యంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా నవాజ్ షరీఫ్ లాంటి నేతే పాకిస్తాన్ పీఎంగా వుండాలని ఆశించింది. కానీ, అలా జరిగే సూచనలు ఎంత మాత్రం లేవు. సరిగ్గా జరిగినా, జరగకపోయినా ఎన్నికల్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ప్రధాని అతనే అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇమ్రాన్ ప్రధాని అంటే పాలన నేరుగా ఆర్మీనే చేస్తోందని భావించాలంటూ విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.     పాక్ లో ప్రభుత్వ మార్పు సరే… ఇండియాలో 2014లో మోదీ వచ్చినప్పటి నుంచీ పక్క దేశానికి అసహనంగానే వుంది. ఎందుకంటే, యూపీఏ సర్కార్ హయాంలో కాశ్మీర్ లోనే కాదు భారతదేశం లోపల కూడా పాక్ అరాచకాలు హాయిగా సాగాయి. మోదీ ఇతర పథకాలు, నిర్ణయాలు ఎలా వున్నా రక్షణ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త అద్భుతమే! ఏకంగా ముంబై మహానగరంలో ఊచకోత కోసిన పాక్ ఇప్పుడు ఒక్క బాంబు పేల్చలేకపోతోంది ఇండియాలో. కేవలం కాశ్మీర్ లో రాళ్ల దాడి వ్యూహంతో కాలం గడుపుతోంది. దానికి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మన భద్రతదళాలు ఎన్ కౌంటర్లు చేస్తూ పెద్ద ఎత్తున ఉగ్రవాదుల్ని హతం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కాలుపెట్టి ప్రతీకారం కూడా తీర్చుకున్నారు మన జవాన్లు. ఇలాంటి పరిస్థితి వల్లే పాక్ కు భారత్ లో ధృఢమైన ప్రభుత్వం వుండటం నచ్చదు. అదీ హిందూత్వ ఎజెండాతో సాగే బీజేపీ సర్కార్ అంటే పాక్ కు మరింత కలవరం.     2014 నుంచీ పాకిస్తాన్ కు మోదీ సర్కార్ మీద మంటగా వున్నా నవాజ్ షరీఫ్ లాంటి రాజకీయ నేత దేశాన్ని నడపటం వల్ల యుద్ద వాతావరణం తప్పుతూ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి పొలిటీషన్ అనుకోటానికి లేదు. తన మాజీ రెండో భార్య నుంచి అనేక ప్లేబాయ్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇమ్రాన్ అవసరాల కోసం పూర్తిగా పాక్ ఆర్మీకి అమ్ముడుపోయాడు. నవాజ్ షరీఫ్ ఆర్మీతో కాస్త దూరం పాటించటమే అతడి అరెస్ట్, ప్రస్తుత జైలు జీవితానికి కారణమన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి ఇమ్రాన్ ఆ తప్పు చేయకుండా మిలటరీ అధినేతల చెప్పుచేతల్లో తోకాడిస్తాడు.అంటే, భారత్ ఇమ్రాన్ రూపంలో పాక్ మిలటరీ కుట్రల్ని ఎదుర్కోటానికి సిద్ధంగా వుండాలన్నమాట. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే, తాడో పేడో తేల్చుకోవాల్సిన అంతిమ యుద్ధానికి కూడా ఇండియా తెగించే వుండాలి. తప్పదనుకుంటే పాక్ ను మోదీ మూడు ముక్కలు చేసైనా సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ఇమ్రాన్ ఖానే సంయుక్త పాకిస్తాన్ కు చివరి ప్రధాని అయ్యేలా చూడాలి. అదే భారత్ మనః శాంతికి శాశ్వత పరిష్కారం!

జగన్ చంద్రబాబుని తట్టుకోలేడా? ఉండవల్లి లాజిక్ ఏంటి?

ఉండవల్లి అరూణ్ కుమార్… తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు! అయితే, మాస్ పొలిటీషన్ గా కన్నా మేధావిగానే అరూణ్ కుమార్ ఫేమస్! ఆయన మాట్లాడితే అందరు రాజకీయ నేతల్లాగా తలా తోక లేని ఆరోపణలు చేయరు. తలకి, తోకకి ముడిపెట్టే లాజిక్ తో కొడుతుంటారు! అదే ఆయన మాటలకి వాల్యూ తీసుకొస్తుంటుంది. మీడియా చెవులు పెద్దవి చేసుకుని వినేలా చేస్తుంటుంది.     వైఎస్ హయాంలొ ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి తరువాత క్రమంగా ప్రభ తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేరన్నట్టుగా వుంది పరిస్థితి. ఓ సారి పవన్ పక్కన కనిపిస్తారు. ఓ సారి చంద్రబాబును కలుసుకుంటారు. స్వయంగా కూడా నేను ఏ పార్టీకి మద్దతుగా లేనని చెబుతూనే అప్పుడప్పుడూ ఆసక్తికర కామెంట్లు చేస్తుంటారు. ఉండవల్లి తాజా మాటలు రాజకీయ వర్గాల్లో అలాగే ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. వైఎస్ కు ఎంతో ఆత్మీయుడైనప్పటికి ఉండవల్లి ఏనాడూ జగన్ కు దగ్గర కాలేదు.  ఎప్పుడూ వీరాభిమానం చాటలేదు. ఇక ఇప్పుడైతే పూర్తిగా జగన్ కు వ్యతిరేకంగా విశ్లేషణ చేస్తున్నారు. జగన్ కోసం జనం విపరీతంగా రోడ్ల మీదకు వస్తుండటం నిజమే అయినా అదంతా ఓ సినిమా హీరో కోసం రావటం లాంటిదేనని అన్నారు. ఎన్నికల సమయంలో వారంతా జగన్ కే ఓటు వేస్తారని గ్యారెంటీ లేదన్నారు. గత ఎన్నికల్లోనూ జగనే గెలుస్తాడని చాలా మంది భావించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ముందు ఆయన చేయగలిగే పోల్ మ్యానేజ్మెంట్ జగన్ తట్టుకోలేడని అన్నారు!     ఉండవల్లి వ్యాఖ్యలు చంద్రబాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వున్నాయి కాబట్టి ఆయన టీడీపీలో చేరతారని మనం ఇప్పుడే భావించలేం. ఎందుకంటే, ఉండవల్లి రాజకీయ ఉద్దేశ్యాలు ఏవీ లేకుండా కూడా విశ్లేషణలు చేస్తుంటారు. ఆయన రాష్ట్ర విభజన విషయంలో కూడా మిగతా ఆంధ్రా నాయకులందరి కంటే భిన్నంగా స్పందిస్తూ వచ్చారు. అలాగే, ఇప్పుడు చంద్రబాబు, జగన్ ల సత్తాని ఆయన నిష్పక్షపాతంగానే అంచనా వేశారని మనం భావించవచ్చు. చంద్రబాబు అనుభవం, జనం నాడిని పట్టగలిగే చాకచక్యం ఎన్నికల చాణక్యం … ఇవన్నీ అందరికీ తెలిసినవే. మరో వైపు జగన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో తన ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని ఉపసంహరించుకుని చేస్తున్న రాజకీయం, సుదీర్ఘ పాదయాత్ర, పవన్ పై వ్యక్తిగత విమర్శలు… ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే వున్నాం. కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా చంద్రబాబు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఛేదించుకుని మళ్లీ అధికారంలోకి రావటం ఆశ్చర్యకరమేం కాదు. కానీ, జగన్ తనకున్న అనుభవ లేమీ, దూకుడు స్వభావంతో ఏపీ నెక్ట్స్ సీఎం అవుతారా? డౌటేనంటున్నారు ఉండవల్లి! ఉండవల్లి వ్యాఖ్యలు నిజమవుతాయా లేదా? జగన్ నవ్యాంధ్రా రెండో సీఎం అవుతారా? లేక చంద్రబాబే నవ్యాంధ్రకి రెండోసారి సీఎం అవుతారా? వేచి చూడాలి! ప్రస్తుతానికైతే సస్పెన్సే!

మోదీకి సాయం! ఏపీకి నష్టం! టీఆర్ఎస్ వ్యూహం!

ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా టాపిక్ గా నడుస్తోంది. అందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే, ఏపీకి సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హోదా విషయం పెద్దగా చర్చలో లేదు. జనం దాన్నసలు ఆలోచించటం లేదు. ఎందుకంటే, విభజన సమయంలో హైద్రాబాద్ తెలంగాణకు దక్కింది. అందుకే, స్పెషల్ స్టేటస్ లాంటివేవీ హామీ ఇవ్వలేదు. ఇక ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో చెప్పిన ఏపీకైనా వచ్చిందా అంటే అదీ లేదు. అది రాకపోవటం వల్లే ఇంత గొడవ జరుగుతోంది. అయితే, ఈ మొత్తం కోలాహలంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఆందోళనకరంగా, అనుమానాస్పదంగా వుంటోంది…     నిన్న మొన్నటి వరకూ ఎక్కడ అడిగినా టీఆర్ఎస్ వారు ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పేవారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని అనేవారు. కానీ, అవిశ్వాస తీర్మానం వచ్చాక గులాబీ నేతల స్వరాల్లో మార్పు వచ్చేసింది. ఓటింగ్ సమయంలో గైర్హాజర్ అవ్వటం ద్వారా మోదీకి సాయం చేసిన కేసీఆర్ శిబిరం అక్కడితో ఆగకుండా పదే పదే ఏపీకి హోదా రాకుండా వుండేలా కామెంట్లు చేస్తోంది. ఆంద్రాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే హైద్రాబాద్ కు వాణిజ్య, వ్యాపార పరంగా నష్టం అంటూ మోకాలు అడ్డుతోంది టీఆర్ఎస్. హోదా ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇవ్వాలని మెలిక పెడుతోంది. ఈ వాదన ద్వారా పరోక్షంగా మోదీకి అత్యంత అవసరమైన సహకారం అందిస్తోంది గులాబీ పార్టీ!       అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కూడా నిరసనలు తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. అంతే కాక పోలవరానికి కీలకమైన ముంపు మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదని తెలిసినా కేంద్ర ప్రభుత్వానికి సాయపడేలా ఆ మాట మాట్లాడారు. ఒకవైపు ప్రత్యేక హోదా, మరోవైపు పోలవరం రెండిటికీ కారు పార్టీ అడ్డుగా నిలుస్తోంది. దీని వల్ల టీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏం లేకున్నా కేంద్రంలోని దిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవచ్చు. అదే ఎజెండాగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టే కేసీఆర్ చంద్రబాబు కంటే బాగా పని చేసుకుపోతున్నారని మోదీ అనటం … కమలం, గులాబీల మధ్య ఒప్పందాన్ని బహిరంగంగానే స్పష్ఠపరుస్తోంది.       ఈ మద్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి పదే పదే మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఆయనకు ఆంద్రా మీదే ప్రేమ తప్ప తెలంగాణ మీద లేదని అన్నారు. ఏపీకి హోదా ఇవ్వమని ఆజాద్ డిమాండ్ చేశారు. పార్లెమంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన డిమాండ్ ని టీఆర్ఎస్ తప్పుపట్టింది. ఆయన తెలంగాణ గురించి పట్టించుకోకుండా ఏపీ మీద ప్రేమ ఒలకబోస్తున్నారని గులాబీ నేత కర్నె ప్రభావకర్ అన్నారు. దీని ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కార్నర్ చేయాలని ఆయన ప్రయత్నం. ఏపీకి కాంగ్రెస్ సాయం చేస్తోందని చెప్పటం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ను విలన్ గా నిలపాలని టీఆర్ఎస్ వ్యూహం!     తెలంగాణలో కాంగ్రెస్ తమ ప్రతిపక్షం కాబట్టి టీఆర్ఎస్ దాడి చేయటం అర్థం చేసుకోవచ్చు. కానీ, ఏపీకి ఎలాంటి జాలీ లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వనంటోన్న బీజేపికి లోపాయకారిగా సాయపడటం… కుట్రే అవుతుంది. లేదా వచ్చే ఎన్నికల తరువాత మోదీ సర్కార్ ఏర్పడితే టీఆర్ఎస్ అందులో మంత్రి పదవులు ఆశిస్తూ వుండాలి. ఏది ఏమైనా , ఎలాంటి రాజకీయ లబ్ధి వున్నా సాటి తెలుగు రాష్ట్రం నష్టపోయేలా వ్యూహాలు పన్నటం, కేంద్రానికి సాయం చేస్తూ ఏపీని ఎదగకుండా అడ్డుకోవటం… అస్సలు సమర్థనీయం కాదు. కేసీఆర్ దీనిపై పునరాలోచించుకోవాలి. లేదంటే తెలంగాణలోని, ముఖ్యంగా, హైద్రాబాద్ లోని ఆంధ్రుల ఓట్లపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు… 

ఇక మీదైనా నోటిపై అదుపు పాటిస్తారో లేదో… విజయ‘సారీ’రెడ్డి!

రాజకీయం వేరు, రచ్చ వేరు. అలాగే, వ్యాపారం , లెక్కలూ వేరు. పార్లమెంట్, చట్ట సభల్లో చర్చలు కూడా వేరు! ఈ సత్యం వృత్తి రిత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయి రెడ్డికి ఇవాళ్లే బోధపడి వుంటుంది! ఆయన రాజ్యసభలో అందరి ముందూ బేషరతుగా చైర్మన్ వెంకయ్య నాయుడికి సారీ చెప్పారు. అలా చెప్పే పరిస్థితి నిన్న ఆయన తన స్వంత మాటలు, చేష్టలు కారణంగానే తెచ్చుకున్నారు. బహుశా ఇప్పటికైనా విజయసాయికి పెద్దల సభ అంటే తమ పార్టీ కార్యాలయం కాదని అవగాహనకు వచ్చి వుంటుంది!     విజయసాయి రెడ్డి కొన్నాళ్ల కిందటి దాకా జగన్ వ్యాపారపు లెక్కలు చూసుకునే సీఏ మాత్రమే. అయితే కామర్స్ తెలిసిన ఈయన అంతకంటే ఎక్కువ ప్రతిభ ప్రదర్శించారు. అందుకే, అనేక కేసుల్లో జగన్ ఏ వన్ అయితే ఈయన ఏ టూ అయ్యారు! అలా వైసీపీ అధినేతకి ఇతోధికంగా సహకరించిన విజయసాయి రాను రాను పార్టీలో కీలకమైపోయారు. మరీ ముఖ్యంగా, రాజ్యసభలో వైసీపీ ఎంపీగా కాలుపెట్టాక రెడ్డిగారి దూకుడు మరింత పెరిగింది. దిల్లీలో జగన్ కంటే ఎక్కువ ఈయనే పాప్యులర్ అయిపోయారు. ప్రధాని మోదీని ఓ సీఎం అయిన చంద్రబాబు కలవటం కష్టమైనా విజయసాయి మాత్రం అమాంతం కలిసేస్తుంటారు. అంతలా చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కమలదళానికి కావాల్సినంత సేవలందించారు. ఇదంతా రహస్యం కూడా కాదు. బహిరంగమే!     పార్టీలో జగన్ తరువాత అత్యంత కీలకమైన స్థానంలోకి వచ్చిన విజయసాయి రాజ్యసభ అంటే అదేదో ప్రెస్ మీట్ అనుకున్నారో ఏమో కానీ ఏకంగా చైర్మన్నే టార్గెట్ చేసుకున్నారు! మన తెలుగు వారే అయిన మోస్ట్ సీనియర్ పొలిటీషన్ వెంకయ్య నాయుడు చైర్ లో వుండగా నిన్న విజయసాయి రెడ్డి అలిగారు. వాకౌట్ చేశారు. తనకు సరిగ్గా మాట్లాడే టైం ఇవ్వలేదని నిరసన తెలిపారు. ఇంత వరకూ ఓకే! కానీ, ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య తన పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తుననారని ఆనేశారు! దీని ఎఫెక్ట్ ఎలా వుంటుందో బహుశా నిన్న ఆయనకు అంచనా లేకపోవచ్చు!     విజయసాయి నోటి దురుసు తెలుగు వారికి కొత్తేం కాదు. ఆయన ప్రతీ రెండు రోజులకి ఒకసారి చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిడుతుంటారు. అయితే, అదంతా ప్రెస్ వారి మైకుల ముందు. కానీ, అలాంటి ప్రవర్తనే సభలో ప్రదర్శిస్తే ఎలా? అదీ జాతీయ స్థాయి పెద్దల సభ అయిన రాజ్యసభలో … నేరుగా చైర్మన్ ను ఉద్దేశించి అనాలోచితంగా మాట్లాడటం ఏంటి? తాను చేసిన తప్పు అర్థమైన వెంటనే విజయసాయి నిన్ననే వెంకయ్య వద్దకి వ్యక్తిగతంగా వెళ్లి సారీ చెప్పారట. అయితే, ఇవాళ్ల ఉదయం రాజ్యసభలో మళ్లీ ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. చైర్మన్ పై విమర్శల గురించి వివరణ ఇచ్చుకునే అవకాశం వచ్చింది. కానీ, మరోమారు తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ … రాగం తీసే సరికి వెంకయ్య నాయుడు విజయసాయి మాటల్ని మధ్యలోనే కట్ చేసి ఇతరులకి మాట్లాడే అవకాశం ఇచ్చేశారు. దీంతో వ్యవహారంలోని సీరియస్ నెస్ అర్థం చేసుకున్న మన సీఏగారు వివరణలు ఇవ్వటం మానేసి… బేషరతుగా సభకు సారీ చెప్పారు! విజయసాయి రెడ్డి రాజ్యసభలో సారీ చెప్పటం పెద్ద అవమానమో, నష్టమో కాదు. కానీ, ఆయన ఇప్పటి నుంచైనా నోటి మీద అదుపు ప్రదర్శిస్తే ఎంతో మంచిది. తెలుగు జాతి గర్వించేలా ఎదిగిన వెంకయ్యనే దేశం మొత్తం ముందు పక్షపాతి అనటం … ఏ విధంగానూ వివేకం కలిగిన పని కాదు. ఇలాంటివి జనంలో విజయసాయిని, ఆయన పార్టీని చులకన చేస్తాయి తప్ప మరే లాభమూ వుండదు! 

చంద్రబాబులోని ఆ లక్షణం… పవన్‌కు ఎంతో అవసరం! 

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో… ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు సీనియర్ మోస్ట్! ఆయనకంటే ఎక్కువ రాజకీయ జీవితం గడిపిన వారు చాలా తక్కువ. అయితే, ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో అందరూ బాగా గుర్తించేది చంద్రబాబులోని అభివృద్ధి చేయగల సత్తా, కష్టపడి పని చేసే తత్వం, దూరదృష్టి… ఇలాంటివన్నీ! కానీ, ఏపీ సీఎంలో మరో గొప్ప లక్షణం వుంది. అది చాలా వరకూ పెద్దగా చర్చకు రాదు. అదేంటంటే… చంద్రబాబు ఏనాడూ తన ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా దూషించరు! ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే చంద్రబాబు పర్సనల్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు! ఇది నిజంగా ఈనాటి రాజకీయ నాయకులు ఆయన నుంచీ తప్పక నేర్చుకోవాల్సింది. మరీ ముఖ్యంగా, చంద్రబాబును ఢీకొంటున్న ఆంధ్రా యువనేతలు జగన్, పవన్!     రాజకీయాల్లో విమర్శలు తప్పవు. అంత వరకూ ఓకే. కానీ, విమర్శలకు , వ్యక్తిగత దూషణలకు చాలా తేడా వుంటుంది. ఇక్కడే చంద్రబాబు లాంటి పరిణతి చెందిన నేతలు తమ విజ్ఞత చూపిస్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో మనకు తెలిసిందే. ఆయన పార్టీలోని రోజా లాంటి నేతల పదజాలం స్థాయి కూడా మనకు తెలిసిందే. అయితే, జగన్ తాజా టార్గెట్ పవన్ కళ్యాణ్ అయ్యారు! పవన్ ఈ మద్యే జగన్ను విమర్శించారు. ఏమని? ఆయనలాగా తనకూ కొందరు ఎమ్మెల్యేలు వుండి వుంటే తాను అసెంబ్లీ వదిలి వెళ్లే వాడ్ని కానని అన్నారు. జనం ఓట్లు వేసి పంపినందుకు సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసేవాడ్ననని పవన్ అన్నారు! దీనిపై జగన్ ఎలా స్పందించాలి? తాను ఎందుకు సభను వదిలి పాదయాత్ర చేస్తున్నాడో చెప్పుకోవాలి. అంతే తప్ప పవన్ పై వ్యక్తిగత దూషణలు అవసరమా? కానీ, మెచ్యూరిటీ లేని జగన్ అదే చేశారు!     పవన్ కళ్యాణ్ కార్లు మార్చినంత తేలిగ్గా పెళ్లాల్ని మారుస్తారనీ, ఆయనకు నలుగురు భార్యలని జగన్ దెప్పిపొడిచారు! ఇదెక్కడి సంస్కారం? పవన్ కళ్యాణ్ ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవటం, వారికి చట్టబద్ధంగా విడాకులు ఇవ్వటం అంతా, అందరికీ తెలిసిందే! ఎలాంటి రహస్యమూ లేని ఆయన వ్యక్తిగత జీవితాన్ని, పైగా ఆయన భార్యల్ని కూడా రాజకీయ రచ్చలోకి లాగటం జగన్ కు సరైందేనా? అస్సలు కాదు!     ఇక… ఒకవైపు పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చెలరేగిపోతుంటే… జనసేనాని కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా ఇంట్లో తుపాకులు పేల్చి బయట తిరుగుతున్న వారి సంగతేంటి అంటూ పరోక్ష విమర్శలు చేశారు. ఇవి టీడీపీ నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణను ఉద్దేశించినవే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ బాలకృష్ణ పేరైతే ఎత్తలేదుగాని ఆయన మొత్తం మీద ఎవర్నో వ్యక్తిగతంగా టార్గెటైతే చేశారు. ఆయన అలా చేయటానికి కారణం… జనసేన కార్యకర్తలు వాహనాలకు సైలెన్సర్లు లేకుండా ఓ ర్యాలీ తీశారట. దాంట్లో పవన్ కూడా పాల్గొన్నారు. విపరీతంగా శబ్దం చేస్తూ సైలెన్సర్లు లేని బండ్లు రోడ్డు మీద తిరిగాయి. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.     రూల్స్ కు విరుద్ధంగా రోడ్డు మీద వెహికల్స్ నడపవచ్చా? అభిమానులు అలా చేసినా పవన్ వారించకుండా వుండవచ్చా? ఇవన్నీ పక్కన పెట్టి పవన్ ఎదురుదాడి చేస్తూ బాలకృష్ణపై పరోక్ష విమర్శలు సంధించారు. అసలు ఆయనకు , వివాదానికి ఏమైనా సంబంధం వుందా? ఇక్కడే పవన్ చంద్రబాబు లాంటి నేతల నుంచీ చాలా నేర్చుకోవాలి. ఒక పార్టీ అధినేతగా ఆయన స్థాయిని తగ్గించుకునే చౌకబారు వ్యక్తిగత విమర్శలు ఎప్పటికైనా చేటే చేస్తాయి. జనసేన అధినేతకే కాదు… ఇదే సూత్రం వైసీపీ నాయకుడికి కూడా వర్తిస్తుంది! తాత్కాలిక లాభం కోసం వ్యక్తిగత దూషణలు ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోవు! 

వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం 'కాసే' దమ్మున్నోడు!

కేటీఆర్… 2014కి ముందు కేసీఆర్ తనయుడు మాత్రమే! మరిప్పుడు? ఇప్పుడు కూడా ఆయన కేసీఆర్ వారసుడే … కానీ… జూలై 24 ఆయన 42వ పుట్టిన రోజు సందర్భంగా జరుగుతోన్న హంగామా చూస్తోంటే తాజా పరిస్థితి అర్థం అవుతుంది! ఆదివారం నుంచీ జ్వరం, బహుశా వయస్సు మీద పడుతున్నందుకేమో… అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో సరదాగా పోస్టు చేశారు! అనారోగ్యం వల్ల తెలంగాణ ఐటీ మంత్రి బయట ఎక్కడా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆయన బర్త్ డే హోరు జోరుగానే వుంది. పొలిటీషన్స్, సినిమా వారు, ఇతరులు అన్న తేడా లేకుండా వరస పెట్టి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అసలు ఎవరెవరు ఈ 42 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ కి హ్యాపీ బర్త్ డే చెప్పారో ఓ సారి చూస్తే క్రేజ్ ఏంటో అర్థమవుతుంది…     ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బావ హరీష్ రావు కూడా వున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, దర్శకుడు ఎన్. శంకర్, కేథరిన్ హడ్డా, ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌మాన్, నటుడు మహేశ్ బాబు, బ్రహ్మజీ, ప్రియదర్శితో పాటు ఇంకా చాలా మందే వున్నారు. ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ కూడా తన సహచర రాజకీయ వారసుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు!     ఒకవైపు తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరో వైపు కేటీఆర్ కేకులు కోసి, కటౌట్లు కట్టి డబ్బులు వృథా చేయకండి అంటూ పిలుపునిచ్చారు. మొక్కలు నాటమని చెప్పారు. ఆయన పిలుపునందుకుని టీఆర్ఎస్ శ్రేణులు భారీగానే మొక్కలు నాటుతూ, పళ్లు పంచిపెడుతూ సేవ కార్యక్రమాలు చేశాయి. ఓ కేటీఆర్ అభిమాని అయితే 42 ఏళ్ల తమ నేత మీద అభిమానంతో 42 మొక్కలు నాటారట! ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ బర్త్ డే అసలు హై లైట్ ‘వీడియో సాంగ్’! స్వయంగా హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వీడియో సాంగ్ ని ప్రజెంట్ చేయటం మరింత విశేషం! తెలంగాణ భవన్ లో కేటీఆర్ పై రూపొందించిన పాటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విడుదల చేశారు!     ఒక రాజకీయ నేత బర్త్ డే అన్నాక ఇలాంటి హంగామా సహజమే. కాకపోతే, ఎన్నికల ముందు సంవత్సరంలో కేసీఆర్ వారసుడు కేటీఆర్ పై ఈ శుభాకాంక్షల జల్లు కాస్త ప్రత్యేకమని కూడా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ తరువాత సీఎం పీఠంపై ఆయన కూర్చుంటారా? ఇప్పుడైతే ఆ చర్చ లేదు కానీ… రేపు ఎప్పుడైనా తెలంగాణ సీఎం అవ్వాలి అంటే ఆ అవకాశాలు టీఆర్ఎస్ లో కేటీఆర్ కే ఎక్కువగా వున్నాయి. హరీష్ వర్గం కూడా ఒకటి వుండవచ్చు. అయినా కేటీఆర్ పట్టు పార్టీపై రోజు రోజుకి పెరుగుతుండటం ఎవరూ కాదనలేని సత్యం! అందుకు ఆయన బర్త్ డే హంగామా మరో ఉదాహరణ! అంతే కాదు… ఆయన పై రూపొందించిన పాటలో కూడా తొలి లైనే… ‘’ వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు!’’ అంటూ సాగుతుంది! ఈ రాష్ట్రాన్ని కాయటం అంటే ఏంటి అంతరార్థం? ఇప్పుడే రకరకాల విశ్లేషణలు అవసరం లేనప్పటికీ… కేటీఆర్ … కేసీఆర్ తరువాత అంతటి వాడవుతున్నారు పార్టీలో అన్నది మాత్రం విస్పష్టం!