నెల్లూరులో జగన్ చెలగాటం! ‘వారి’ టికెట్ ఆశలకి ప్రాణ సంకటం!

పిల్లికి చెలగాటం… ఎలుకకి ప్రాణ సంకటం… ఈ సామెత పాతదే! కానీ, దాని ప్రభావం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఎలుకలుగా మారింది ఎవరు అటారా? అది తెలియాలంటే అసలు చెలగాటం ఆడుతున్న పిల్లెవరో తెలుసుకోవాలి కదా!     వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ నెల్లూరులో చెలగాటం మొదలు పెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వుండి తరువాత టీడీపీలోకి వచ్చి… తాజాగా జగన్ శిబిరం చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కలకలానికి కారణమయ్యారు. నెల్లూరులో ఆనం ఫ్యామిలి పట్టు అందరికీ తెలిసిందే. అదే జగన్ చేత మాజీ మంత్రి రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికించింది. కానీ, ఆనంకి అందిన ఆహ్వానం ఇప్పుడు నెల్లూరులొని అసలు వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతోన్న వేళ తమకు ఈ ఆనం గండమేంటని వారు వాపోతున్నారు!     ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెద్ద నేతలు పార్టీ మారితే దాని ఎఫెక్ట్ ఎక్కువగానే వుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఆర్దిక మంత్రిగా చేసిన ఆయన ఒక దేశలో సమైక్యాంధ్రకు సీఎం కూడా అవుతారని అన్నారు. అంత రేంజ్ కలిగిన ఆయన రాష్ట్ర విభజనతో హస్తం పార్టీలాగే కుదేలయ్యారు. నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనిపించుకుంటూ కొనసాగుతున్నారు. ఈ మధ్యే ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి మరణించటం కూడా వారి కుటుంబంలో విషాదం నింపింది. ఇటువంటి తరుణంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని ఆనం రామనారాయణ ప్రయత్నిస్తున్నారు. కారణాలు ఏవైనా టీడీపీని వదిలి వైసీపీకి చేరువైన ఆయన బలమున్న ఆత్మకూరు నియోజక వర్గం అడిగినప్పటికీ కుదరదని తేల్చేశారట జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఎంపీ వున్న స్థానాల్లో ఆనంకు అవకాశం లేదని తేలిపోయిందట. ఆత్మకూరు కాకుండా వెంకటగిరి తీసుకొమ్మని జగన్ అన్నట్టు పొలిటికల్ టాక్! ఆత్మకూరులో ఆనం అంటే మేకపాటి కుటుంబం తాము ఏకంగా వైసీపీ వదిలి పెడతామని హెచ్చరించిందని కూడా అంటున్నారు. మేకపాటి ఫ్యామిలిని వదులుకునే పిచ్చి ప్రయత్నాలేవీ జగన్ చేయరు కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి అంతగా పట్టులేని వెంకటగిరికే పరిమితం కావాలి.     జగన్ చెప్పినట్టు వెంకటగిరి నుంచి పోటీ చేసినా ఆనం ఎఫెక్ట్ మరో ఇద్దరు వైసీపీ నాయకుల మీద పడనుందట. నాలుగేళ్లుగా తమకు టికెట్ గ్యారెంటీ అంటూ వారిద్దరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాను రెక్కలు పట్టుకుని జోరుగా తింపుతూ వచ్చారు. వెంకటగిరి నియోజక వర్గంలో బొమ్మిరెడ్డి  రాఘవేంద్రా రెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అనేక ప్రజా కార్యక్రమాల్లో స్వంత డబ్బుతో పాలుపంచుకుంటూ వచ్చారు తీరా ఇప్పుడు ఆనం చేరిక ఆటంబాంబులా వారి ఆశల్ని ఛిన్నాభిన్నం చేసేస్తోందట! ఆనం వెంకటగిరి నుంచీ పోటీ చేస్తే బొమ్మిరెడ్డి, కలిమలి ఇద్దరూ పోటీకి దూరంగా వుండాల్సిన స్థితి వస్తుంది. నాలుగేళ్లుగా వారు చూసిన సహనానికి, పార్టీ విధేయతకి ఇలాంటి ఫలితం దక్కటం నిజంగా విషాదమే! ఇప్పటికైతే ఆనం ఏ స్థానం నుంచీ పోటీ చేస్తారని జగన్ చెప్పలేదు. ఆనం కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆనం నెల్లూరులో ఎక్కడ నుంచీ పోటీ చేసినా ఆయనకంటే ముందు నుంచీ వున్న వైసీపీ నేతలు ఎవరికో ఒకరి ప్రాణ సంకటమే! చూడాలి మరి జగన్ ఈ చెలగాటాన్ని ఎలా ఆడతారో! 

జగన్ బందులకి మోదీ ‘చింతకాయలు’రాల్చరు!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎందుకు రావటం లేదు? మోదీ ఇవ్వటం లేదు! ఇదే సమాధానం అనుకుంటే అంతకన్నా పెద్ద తప్పుడు ఆలోచన వుండదు. అసలు ఏ కేంద్ర ప్రభుత్వమైనా ఓ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేకపోతే సవితి తల్లి ప్రేమే చూపిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మేం రెడీ అంటూ కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ కూడా రేపు దిల్లీలో అధికారంలోకి వస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తుందా? బీజేపీలాగే కబుర్లు చెప్పే ఛాన్స్ లు ఎక్కువ! ఎందుకంటే, ఏపీలోనూ వారి ప్రభుత్వం వుండాలి. ఆ సూచనలు కనిపించటం లేదు. ఇక్కడ టీడీపీనో లేదో వైసీపీనో అధికారంలో వుంటాయి. ప్రాంతీయ పార్టీలు పీఠంపై వుండీ జాతీయ పార్టీలది కేంద్రంలో అధికారమైతే ఇక చెప్పేదేముంది? ఇదీ అసలు సమస్య. అయితే…     రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి జనం జైకొట్టినంత మాత్రాన దిల్లీలోని జాతీయ పార్టీలు ఇష్టానుసారం వివక్ష చూపించుకుంటూ పోతే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? అక్కర్లేదు! 2009 – 2014 నడుమ తెలంగాణ కావాలని పది జిల్లాల ప్రజలు రోడ్డెక్కారు. పార్టీలూ ఏకతాటిపైకి వచ్చాయి. ఏ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలన్నా ఒక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఒక్కటవ్వాలి. అదే విజయానికి మూలం. తమిళనాడులో జల్లికట్టు విషయంలోనూ అదే నిరూపితమైంది. జనం, పార్టీలు అంతా కలిస్తే దిల్లీ కూడా ఒప్పుకోక తప్పదు. సరిగ్గా అదే జరగటం లేదు ప్రత్యేక హోదా విషయంలో!     ప్రత్యేక హోదా వద్దనే పార్టీ ఏపీలో ఏదీ లేదు. అయినా, ఎవరి రాజకీయం వారిది. జగన్ పిలుపునిచ్చిన తాజా బందే ఇందుకు కారణం. ఆ మద్య తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా అనేక బందులు జరిగేవి. అయితే, చాలా వరకూ అవి సక్సెస్ కావటానికి కారణం జేఏపీ రూపంలో అన్ని పార్టీల్ని నిరసనాల్లో భాగమే చేసే వ్యవస్థ వుండేది. ఇవాళ్టి బంద్ లో అలాంటిదేం లేదు. జగన్ ఒంటెద్దుపోకడ తప్ప ప్రత్యేక హోదాపై నిజాయితీ ఎక్కడా కనిపించటం లేదు! తనకు తానే నిర్ణయం తీసుకుని మంగళవారం రాష్ట్రం బంద్ అనేశారు ప్రతిపక్ష నేత. దానికి ఎవరు మద్దతిస్తారు? ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఇవ్వటం లేదు. ప్రతిపక్ష నేత బందులకి అధికారపక్షం ఎలాగూ అండగా నిలువదు కదా! కనీసం ఇతర ప్రతిపక్షాలైనా వైసీపీ బంద్ కు మద్దతిస్తున్నాయా? ఎక్కడా లేదనే చెప్పాలి!     జగన్ పిలుపునిచ్చిన బంద్ కు టీడీపీ సహజంగానే సై అనలేదు. విచిత్రంగా ప్రత్యేక హోదా కావాలి అని ఎప్పట్నుంచో అంటోన్న జనసేనాని కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు ఇవాళ్ల. బంద్ లో ఆయన వంతు పాత్ర ఏం లేదు. ఇది ఖచ్చితంగా జగన్ వైఫల్యమే. బంద్ విజయవంతంగా నిర్వహించాలనుకున్నప్పుడు కాస్త చొరవ చేసి పవన్ తో అయినా చర్చలు జరపాల్సింది. చంద్రబాబు దగ్గరికి వెళ్లి బంద్ కు సహకరించమని అడగలేరు కదా! వున్న మిగతా ప్రతిపక్షాల్నికూడా కలుపుకుపోకపోతే ఎలా? జనసేనతో సహా పోరాటాలకి , బందులకి నిత్యం సై అనే కమ్యూనిస్టు పార్టీల్ని కూడా జగన్ తన వెంట తెచ్చుకోలేకపోయారు. చివరకు, వైసీపీ బంద్ ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంగా కన్నా తమ పార్టీ బల ప్రదర్శనగా మారిపోయింది. వైసీపీ ఏపీ వీధుల్లో బంద్ నిర్వహిస్తుంటే టీడీపీ పార్లమెంట్లో హోదా కోసం చర్చకు పట్టుబడుతోంది. అక్కడ వైసీపీ టీడీపీకి సహకరించటం లేదు. ఇక్కడ టీడీపీ వైసీపీ వెంట వుండటం లేదు. మిగతా పార్టీల దారి దేనిది దానిదే! ఇలా అనైక్యంగా వుండటమే మోదీకి అత్యంత అనుకూలంగా మారుతోంది. హోదా కంటే ఏపీ రాజకీయ పార్టీలు తమ పొలిటికల్ ఎజెండానే ఎక్కువగా కొనసాగిస్తున్నాయి. దిల్లీ పెద్దలకు కావాల్సింది కూడా అదే! 

ముగింపులు లేని బుజ్జగింపుల్లో చంద్రబాబు!

  నవ్యాంధ్ర సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదా అతి పెద్ద సమస్య. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకి సమస్యేంటి? బోలెడు! అలాగే వుంది పరిస్థితి. తాజాగా ఆయన పిలిచి మాట్లాడక అనంతపురం సీనియర్ నేత జేసీ చల్లబడ్డారు. ఆయనసలు అలకబూనటానికి కారణం ఏంటి? అదీ స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే రకరకాల ప్రచారాలే తప్ప దివాకర్ రెడ్డి నేరుగా తన డిమాండ్లు ఇవ్వంటూ ఎవరికీ చెప్పలేదు. అలాగే, చంద్రబాబు కూడా పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు. కానీ, జేసీ డిమాండ్స్ లో ఎన్ని న్యాయబద్ధమైవి, ఎన్ని కాకపోయినా… కీలక సమయంలో పార్టీకి, పార్టీ అధినేతకి ఇబ్బందికరంగా మాత్రం మారాయని చెప్పక తప్పదు. మోదీని ఢీకొంటూ చంద్రబాబు దిల్లీలో మంత్రాంగం నడుపుతుంటే… టీడీపీ ఎంపీ అయ్యి వుండి జేసీ అనంతపురంలో అలక పాన్పు ఎక్కారు. పార్లమెంట్ కు పోనని పేచీ పెట్టారు. ఎలాగో సర్ది చెప్పిన టీడీపీ అధినేత ఇతర పార్టీల ఎంపీల్ని మద్దతివ్వమన్నట్టు తన స్వంత పార్టీ ఎంపీనే బుజ్జగించాల్సి వచ్చింది. ఇది ఎంత మాత్రం హర్షనీయం కాదు!     అవిశ్వాస తీర్మానం అంకం ముగిశాక జేసీ ఇవాళ్ల చంద్రబాబుని కలిశారు. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవటంలో అపార అనుభవం వున్న చంద్రబాబు లోపల ఏం మంత్రం వేశారోగానీ దివాకర్ రెడ్డి పూర్తిగా మెత్తబడ్డారు. లోపలేం జరిగిందో తాను చెప్పను అంటూనే లోక్ సభకు వెళతానని స్పష్టం చేశారు. మోదీ పీఎంగా వున్నంత కాలం విభజన హామీలు నెరవేరవని మరోమారు అన్న ఆయన పోరాటం మాత్రం సాగుతూనే వుండాలని చెప్పుకొచ్చారు. అసలింతకీ, దివాకర్ రెడ్డి ఏం అడిగారు? చంద్రబాబు ఎలా సముదాయించారు? ఇదంతా ఇప్పటికైతే సీక్రెట్టే! బహుశా వచ్చే ఎన్నికల్లో తనకు, తన వారసుడికి టికెట్ల గురించి దివాకర్ రెడ్డి పట్టుబట్టి వుంటారు.ఇది కూడా జరుగుతున్న ప్రచారమే తప్ప అధికారికంగా ఎక్కడా ఎవరూ చెప్పటం లేదు.     దివాకర్ రెడ్డి లాగే గతంలో గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి, చంద్రబాబుకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం చేశారు. సీఎం స్వయంగా ఆయన్ని పిలిచి మాట్లాడాల్సి వచ్చింది. ఇక దఫదఫాలుగా కొనసాగిన నంద్యాల నియోజక వర్గ వర్గపోరు సంగతి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ఒకటికి రెండు సార్లు వాళ్లని పిలిచి కూర్చోబెట్టి సముదాయించాల్సి వచ్చింది. ఇలా పదే పదే పుట్టుకొస్తున్న పార్టీ అంతర్గత కలహాలు లేదా కుమ్ములాటలు, అసంతృప్తులు అధినేత సమయాన్ని వృథా చేస్తున్నాయి. రాష్ట్ర రథసారథిగా ఆయన సమయం అమూల్యమైంది. దాన్ని స్వంత పార్టీ నేతలే వృథా చేయిస్తుండటం ప్రభుత్వానికి, ప్రజలకి కూడా నష్టమే. ముందు ముందు ఎన్నికలు సమీపిస్తే ఈ అలకలు, బుజ్జగింపులు మరింత పెరుగుతాయేమోనని కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు! దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి మరి…

పీఎం కుర్చీపై రాహుల్ కర్చీఫ్! మోదీ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్ పార్టీ! 

2014లో జరిగినట్టే మళ్లీ జరుగుతోందా? ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో చిక్కుతోందా? పరిణామాలు చూస్తోంటే అలాగే అనిపిస్తోంది! రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తొలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ నాయకత్వంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం సమాలోచనలు జరిపింది. చివర్న రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ హస్తం పార్టీ సంకేతాలిచ్చింది. నిజానికి, ఇదే కమలానికి కావాల్సింది! కాషాయ నేతల ఆశలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ పోరు జరగాలనే! ఆ ట్రాప్ లో చిక్కినట్టే కనిపించింది కాంగ్రెస్ పార్టీ!     2014లో బీజేపీకి స్పష్టంగా మోదీ అనే నేత నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కి సోనియా వున్నా ఆమె ప్రధాని అభ్యర్థి కాదు. మన్మోహన్ మళ్లీ పీఎం అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదు. పోనీ రాహుల్ పీఎం అవుతారని కూడా అనలేదు. అయినా కూడా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా మోదీ చుట్టూ తిరిగింది. మోదీ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టు కొనసాగి చివరకు ఓటర్లు నమో మీదే నమ్మకం చూపేలా చేసింది. అయితే, కాంగ్రెస్ ఈసారి తొందరపడి రాహుల్ ని పీఎం క్యాండిడేట్ గా ప్రకటించి మళ్లీ మోదీకి మేలు చేసినట్టు కనిపిస్తోంది!     2014లో కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పకున్నా జనం దృష్టి మోదీ అనే వ్యక్తి మీద నిలిచింది. పార్టీలు, పార్టీల గుర్తులు ప్రాముఖ్యత కోల్పోయాయి. ఇప్పుడు రాహుల్ మా ప్రధాని అంటూ కాంగ్రెస్ ప్రకటించే సరికి మరో మారు అమెరికన్ స్టైల్లో వ్యక్తుల మధ్య పోరాటంగా పరిణమించబోతోంది. మోదీ వర్సెస్ రాహుల్ అయితే బీజేపీకి పండగే. ఎందుకంటే, గతంలో కంటే ఇప్పుడు రాహుల్ ఇమేజ్ కాస్త బెటరైనా మోదీని ఢీకొట్టే స్థాయిలో క్రేజ్ రాలేదు. అదే విధంగా రాహుల్ నేతృత్వం దేశంలోని ఎన్ని పార్టీలకు, ఎంత మంది సీనియర్ నాయకులకు ఆమోదం? ఇదీ అనుమానమే! కాబట్టి ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఈ విషయంలో తొందరపడిందనే చెప్పుకోవాలి. రాహుల్ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పటం ద్వారా హస్తం పార్టీకి వచ్చే ప్రత్యేక లాభాలేం లేవు. కానీ, అదే సమయంలో బీజేపీకీ మాత్రం మోదీ ప్రత్యర్థిగా రాహుల్ వుండటం ఎంతో అవసరం. దేశమంతా పార్లమెంట్ ఎన్నికల్ని మోదీ వర్సెస్ రాహుల్ గా భావిస్తే ఓటర్లు నరేంద్రుడి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే సమయంలో మోదీ, రాహుల్ ప్రచార హోరులో మమత, మాయ, ములాయం, చంద్రబాబు, కేసీఆర్… ఇలా అందరు సీనియర్ నేతలు సైడ్ లైన్ అవుతారు. తమతమ రాష్ట్రాలకే పరిమితం అవుతారు. ఇది మోదీకి అతి పెద్ద లాభం. తెలిసో తెలియకో కాంగ్రెస్ ఈ లబ్ది చేకూర్చిపెడుతోంది మోదీకి!     తమకు రెండు వందల దాకా సీట్లు వస్తే రాహులే ప్రధాని అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం నలభై సీట్లు మాత్రం వున్న పార్టీ అమాంతం రెండు వందలకు చేరుకోవటం కష్టం. అదీ చాలా చోట్ల రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు లేవు. మరప్పుడు ఎంపీల్ని గెలిపించుకోవటం రాహుల్ కు తలకు మించిన భారమే. అటువంటప్పుడు మోదీని అడ్డుకోవాలని నిజంగా వుంటే… ప్రాంతీయ పార్టీలు, నాయకుల్ని కలుపుకుపోవాలి.ఎన్నికల పలితాలు పూర్తిగా వచ్చేదాకా ప్రధాని అభ్యర్థిత్వంపై మాట్లాడకుండా వుండాలి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత, మోదీపై అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ కు రెండు వందల దాకా సీట్లొస్తే మిగతా పార్టీలన్నీ రాహుల్ నే పీఎంని చేస్తాయి. దానికి ఇప్పట్నుంచే కుర్చీపై కర్చీఫ్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనవసరంగా మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల్లో కూడా భయాలు, అనుమానాలు రేకెత్తించటం తప్ప! కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది! 

పవన్ కళ్యాణ్ … టీడీపీ, వైసీపీల ముంగిట తీరం దాటని తుఫాన్!

పవన్ కళ్యాణ్ … నిన్న మొన్నటి దాకా పార్ట్ టైం పొలిటీషన్. ఫుల్ టైం హీరో. కానీ, ఇప్పుడు ఫుల్ టైం జనం మధ్యనే గడుపుతోన్న జనసేనాని! అయితే, ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే…. పవన్ స్ట్రాటజీ ఏంటి? ఆయన నేరుగా ఎన్నికల్లో పాల్గొనకున్నా 2014లో తీవ్రంగా ప్రచారం చేశారు. చంద్రబాబును, మోదీని సమర్థించారు. మరిప్పుడు? ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తున్నారు! కొంత కాలం కాకినాడ, అనంతపురాల్లో సభలు నిర్వహించినప్పుడు మోదీని తెగ తిట్టి, బాబును సున్నితంగా విమర్శించారు. ఇప్పుడు సీన్ రివర్స్ చేసేశారు. చంద్రబాబును, లోకేష్ ను, టీడీపీని అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు. అలా అని పవన్ బీజేపీ వైపున కూడా వుండటం లేదు. జగన్ను కూడా ఉపేక్షించటం లేదు. అందర్నీ విమర్శిస్తూ ఒంటరిగానే బరిలో తొడగొడుతున్నారు. దీని వల్ల ఆయనకెంత లాభం? ఇతర పార్టీలకు ఎంత నష్టం? ఎన్నికల ఫలితాలొచ్చే దాకా సస్పెన్సే!     పవన్ పోరుయాత్ర చేస్తూ ఉత్తరాంధ్ర దాటి కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. అయితే, రోజురోజుకి ఆయన ఆరోపణలు, మాటలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాస్త సన్నిహితంగా వున్నా దాదాపుగా జనసేనాని యుద్ధం ఒంటరిగానే అని తేలిపోతోంది. పవన్ తాజాగా జగన్ని టార్గెట్ చేశారు. తనకు పది మంది ఎమ్మెల్యేలు వున్నా అసెంబ్లీ వదిలి పారిపోయేవాడ్ని కానని చెప్పారు. జగన్ మంచి అవకాశాన్ని అసెంబ్లీ సాక్షిగా పాడు చేసుకున్నారని అన్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీని, నేరుగా చంద్రబాబునే ఇరుకునే పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు జనసేన అధినేత!     చంద్రబాబు తనను గతంలో ప్రత్యక్ష పోరుకు దిగవద్దని అన్నారని చెప్పిన పవన్ అందుకు ప్రతిగా రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారంటూ పేర్కొన్నారు. కానీ, తనకు రాజ్యసభ సీటు ఇస్తానన్న సంగతి మరుసటి రోజుకే పత్రికలకు లీకు చేయించారని పవన్ ఆరోపించారు. ఇది ఎప్పుడో 2014కి ముందు జరిగింది. దీన్ని ఇప్పుడు పవన్ బయటపెట్టటం ఏంటి? కేవలం చంద్రబాబు ఇమేజ్ ని ఎంతో కొంత డ్యామేజ్ చేయటమే దీని ఉద్దేశం అయి వుండాలి. ఇక ఇలాంటి ఆరోపణలు ఎంత వరకూ ఓట్లు రాలుస్తాయో కూడా చూడాలి!     ఒకవైపు చంద్రబాబును, మరోవైపు జగన్ను వ్యతిరేకిస్తోన్న పవన్ గత కొంత కాలంగా మోదీని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఘాటు విమర్శలు కాదు కదా… కనీస ఎత్తిపొడుపులు కూడా వుండటం. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెలరేగిన పవన్ సడన్ గా ఇలా ఎందుకు మెత్తబడ్డారో ఆయనకి, మోదీకే తెలియాలి. కానీ, రానున్న ఎన్నికల్లో పవన్ కీలక శక్తి మాత్రం కానున్నారని ఆయన తాజా విమర్శల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే, పవన్ బోలెడు మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంటారని అర్థం కాదు! ఆయన పార్టీ నిలబెట్టే అభ్యర్థుల వల్ల చంద్రబాబుకో, జగన్ కో డ్యామేజ్ పక్కా. అది ఎవరవుతారో వాళ్లు అధికారానికి దూరమవ్వమూ ఖాయం. మొత్తానికి పవన్ తాను తినకుండా ఎవరు తినకూడదో డిసైడ్ చేయబోయే ప్రమాదకర శక్తిగా మారనున్నరన్నది గ్యారెంటీ!

పాక్ ప్రధాని కాబోతున్నాడు! మాజీ భార్య మాత్రం ముప్పతిప్పలు పెడుతోంది! 

ఏ దేశంలో అయినా ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలు, నేతలు గుర్తుకు వస్తారు. అయితే, నిజంగా రాజకీయాన్ని ప్రభావితం చేసేది పొలిటీషన్స్ అయినా ఎక్కువ చర్చ, రచ్చ జరిగేది మాత్రం సినిమా, క్రికెట్, టీవీ సెలబ్రిటీల గురించే! మన దేశంలో కూడా ఎన్నికలొప్పుడొచ్చినా చూస్తూనే వుంటాం కదా! నలభై ఏళ్ల అనుభవం వున్న రాజకీయ నేతకి దక్కని కవరేజ్ నాలుగు సినిమాలు చేసిన సెలబ్రిటీలకు దక్కేస్తుంది! అంతా గ్లామర్ మహిమ!     పాకిస్తాన్ లో మరో రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలున్నాయి. పాక్ నెక్స్ట్ పీఎం ఎవరో డిసైడ్ అవ్వనుంది. అయితే, ఈసారి పాకిస్తాన్ లో కూడా క్రికెట్ సెలబ్రిటీ హంగామానే నడుస్తోంది. ఒకవైపు మిలటరీ, మరోవైపు ఉగ్రవాదుల అరాచకం మధ్య పాకిస్తాన్ ప్రధాని అంటేనే డమ్మీ అనుకుంటారు ప్రపంచ జనం. అటువంటిది ఈసారి మాజీ క్రికెటర్, వరుస పెళ్లిళ్ల రొమాంటిక్ స్టార్ … ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్సెస్ వున్నాయట! చాలా సర్వేలు అదే చెబుతన్నాయి. పాక్ ఆర్మీకి కూడా మనోడే మక్కువగా వున్నాడు. అందుకే, కాస్తో కూస్తో రాజకీయ అనుభవం వున్న నవాజ్ షరీఫ్ ను , అతడి కూతుర్ని లోపలేసి మరీ ఇమ్రాన్ ఖాన్ ను అధికారపు పిచ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది!     జనంలో క్రేజ్, ఆర్మీతో మంచి సంబంధాలు, అన్నీ బాగానే వున్నా… ప్లేబాయ్ గా పేరుబడ్డ ఇమ్రాన్ ఖాన్ కి అసలు సమస్య మాజీ భార్య రేహమ్ నుంచి వస్తోంది. ఆమెని రెండో భార్యగా నిఖా చేసుకున్న ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ అలవాటు ప్రకారం వదిలేసి మొన్న ఫిబ్రవరీలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రెండో భార్య రేహమ్ ఆత్మకథ రాస్తున్నా అంటూ … పీఎం పదవిపై పరుగు తీస్తున్న ఇమ్రాన్ ని రన్నవుట్ చేసే పనిలో వుంది! తన పుస్తకంలో రచ్చ రచ్చైపోయే వివరాలు పేర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ గే అని రేహమ్ చెప్పిందట బుక్కులో. అతడికి ఓ బాలీవుడ్ హీరో సంబంధం వుందని రాసింది ఆత్మకథలో. అంతే కాదు, ఇమ్రాన్ ఖాన్ కు అయిదుగురు అక్రమ సంతానం వున్నారనీ, వాళ్లు రహస్యంగా పెరుగుతున్నారని చెప్పింది. వాళ్లలో కొందరు భారతదేశంలో పెరుగుతున్నారని అనటం కలకలం రేపింది!     ఎన్నికల ముందు రోజుకో విధంగా ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య డ్యామేజింగ్ చేస్తోంటే కాబోయే పీఎం మాత్రం ఏమీ అనటం లేదు. ఎలక్షన్స్ టైంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని లోలోన మథనపడుతున్నాడు. అయితే, చిట్ట చివరకు నోరు తెరిచిన ఇమ్రాన్ తన జీవితంలో చేసిన తప్పులన్నిట్లో అతి పెద్ద తప్పు రేహమ్ ఖాన్ ని పెళ్లాడటమేనని అన్నాడు! ఇంతకీ, రేహమ్ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా? ఇమ్రాన్ అయితే వాట్ని ఖండించటం లేదు! అంటే… నిజమనే కదా!     ఇమ్రాన్ ఖాన్ లాంటి క్యారెక్టర్ పాక్ పీఎం అయితే ఏమవుతుంది? కొత్తగా ఆ దేశానికి జరగాల్సిన నష్టమంటూ ఏం మిగలలేదని కూడా కొందరంటున్నారు. అది పక్కన పెడితే ఇమ్రాన్ పిల్లలు రహస్యంగా మన దేశంలో పెరుగుతున్నారా? వారెవరు? ఇవీ… ఇంట్రస్టింగ్ కొశన్స్. రేపు ఆయన ప్రధాని అయితే… ఏదో ఒక క్షణంలో వారెవరో కూడా బయటకు పొక్కవచ్చు! చూద్దాం! అంతవరకూ మాత్రం పాక్ ఎన్నికల హడావిడిని గమనించటం మంచి ఎంర్టైన్మెంటే! ఎందుకంటే, అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు… తమ ప్రచార పోస్టర్లపై అమితాబ్, మాధురీ దీక్షిత్ ఫోటోలు ముద్రించి క్యాంపైన్ కొనసాగిస్తున్నారట! పాక్ పై ఇండియా, బాలీవుడ్ల ప్రభావం చాలానే వుందని ఒప్పుకోక తప్పదు!

అవిశ్వాసం వీగిపోయినా చంద్రబాబు దిల్లీకి ఎందుకు వెళ్లారు?

చంద్రబాబు దిల్లీ వెళ్లారు. దీన్ని కూడా కొందరు విమర్శిస్తున్నారు. కొందరైతే వెటకారాలు కూడా చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవటంతో ఏపీ సీఎం మరో విధంగా హడావిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. కానీ, నిన్నే పార్లమెంట్లో చర్చతో వేడెక్కిన దిల్లీకి ఇవాళ్ల చంద్రబాబు ఎందుకు వెళ్లారు? జగన్ చెప్పినట్టు అమరావతిలో కూర్చునే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు కదా? టీడీపీ ఎమ్మెల్యేలతో చేత కూడా పార్లమెంట్ సమావేశాలు సాగుతుండగానే రాజీనామాలు చేయించి నిరాహార దీక్షలు చేయవచ్చు కదా?     చంద్రబాబు దిల్లీ టూర్ ఊరికే చేస్తున్నదేం కాదు. ప్రత్యేక హోదా విషయంలో సభలో చేయాల్సింది అంతా చేసేశాం. ఇప్పుడిక పార్లమెంట్ వెలుపల జరగాల్సిందే మిగిలి వుంది. ప్రత్యేక హోదా రాలేదు. మోదీ ఇవ్వనని తేల్చేశారు. మరి ఎలా? చంద్రబాబు ఒకటి కావాలని నిర్ణయించుకున్నాకా వెనక్కి తగ్గరు కదా! అదీ ఆంధ్ర ప్రజలకు మంచి చేసేది అయితే ఆయన ఏనాడూ మడమ తిప్పరు. అందుకే, ఇప్పుడు మరో పంథాలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు జరుగుతోన్న కీలక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బాబు చక్రం తిప్పుతున్నారు.     మోదీ ఒకవేళ ముందస్తుకు సై అంటే ఇప్పుడు జరుగుతోన్న లోక్ సభ సమావేశాలే చివరివి కూడా కావచ్చు. అందుకే, హుటాహుటిన దిల్లీ చేరుకున్న చంద్రబాబు జాతీయ మీడియా ముందు ఏపీ బాధని వెల్లడించారు. ఇప్పుడైతేనే నేషనల్ మీడియా పూర్తి స్థాయి దృష్టి పెడుతుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతే ఏపీ ప్రత్యేక హోదా అంశం స్థానిక సమస్యగా భావిస్తాయి ఇంగ్లీషు, హిందీ మీడియా సంస్థులు. అందుకే, చంద్రబాబు ఇదే సమయాన్ని తెలివిగా వాడుకుంటున్నారు. సమస్యని ఏక కాలంలో మీడియా, ఉత్తరాది పార్టీలు అన్నిటి దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీ స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఎంతగా ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ లో మార్మోగితే అంత ఇబ్బంది మోదీకి. అలాగే, ఈ సమస్యపై టీడీపీ ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని ఇతర పార్టీలు ఎంతగా గుర్తిస్తే అంత మంచిది భవిష్యత్ లో. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా వుండవచ్చు. అవిశ్వాస తీర్మానంలో గెలిచినప్పటికీ మోదీ 2019 ఓటర్ల తీర్పులో గెలిచేస్తారని చెప్పలేం. అప్పుడు మోదీ వ్యతిరేక పార్టీలదే కీలక పాత్ర అవుతుంది. ఆప్ , టీఎంసీ, బీఎస్పీ, ఎస్పీ… ఇలా అనేక పార్టీలు మోదీపై గుస్సాగా వున్నాయి. ఆయా పార్టీలతో వ్యూహ రచన చేయాలంటే బాబు దిల్లీలో వుండటం ఇప్పడు తప్సనిసరి. అందుకే, చంద్రబాబు నేరుగా రాజధాని చేరి రాజకీయం చేస్తున్నారు.     ఇప్పటికిప్పుడు హోదా ఇవ్వకపోవటాన్ని ఎత్తి చూపటం, మెజార్టీ వర్సెస్ మోరాలిటి అంటూ నినదించటం ఒక కోణం. రానున్న కాలంలో మోదీ వ్యతిరేక శిబిరంలో కీలకంగా మారి అలాగైనా ఏపీకి లాభం రాబట్టుకోవటం మరో కోణం! ఇదీ సింపుల్ గా చెప్పుకుంటే చంద్రబాబు దిల్లీ టూర్ సారాంశం…

గాడి తప్పిన పాక్ లో… ఓ గాడిద బతుకు!

  మన దేశంలో జరిగే బోలెడు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటాయి. మధ్యలో అవిశ్వాస తీర్మానం పేరున లోక్ సభలోనూ ఓటింగ్ హడావిడి నడిచింది. వీటన్నటి మధ్యా అంతర్జాతీయ వ్యవహారాలు పెద్దగా ఆసక్తి లేని వారు పట్టించుకోకుండా వదిలేస్తోన్న ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. అవే పాకిస్తాన్ జాతీయ ఎన్నికలు! ఈ మాట వినగానే భారతీయులు ఎవరైనా నవ్వేసి ఊరుకునే ప్రమాదమే వుంది. అలాంటి స్థితి మన పక్క దేశంలో నెలకొని వుంటుంది. 1947లొనే స్వతంత్రం పొంది ఇండియాతో పాటూ ఏర్పడ్డప్పటికీ పాకిస్తాన్ దారుణమైన స్థితిలో వుంది. ఇండియా చంద్రుడ్ని, అంగారకుడ్ని చేరుకుంటూ వుంటే పాకిస్తాన్ కాశ్మీర్ లో కాలుపెట్టడానికి ఉగ్రవాదుల్ని తయారు చేయటంలోనే మునిగిపోయింది. దీనికి కారణం పాక్ లోని మతోన్మాదం, ఆ మతోన్మాదాన్ని వాడుకునే అక్కడి మిలటరీ. పాక్ సైన్యం చేతిలోనే ఆ దేశం అధికారం మగ్గిపోతూ వుంటుంది. ప్రధాని వున్నా, నియంతలు పాలించినా! అందుకే, పాక్ ఎన్నికలు అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపరు…   పాకిస్తాన్ ఎన్నికల్ని మనం పెద్దగా పట్టించుకోకున్నా ఈ మద్య జరిగిన ఒక నికృష్టమైన దాడిని మాత్రం తప్పక మాట్లాడుకోవాలి. ఎన్నికల సందర్భంగా దాడి అంటే అదేదో మానవ బాంబు దాడి అనుకోకండి. అవి కూడా పాకిస్తాన్ లో సర్వ సాధారణం అయిపోయాయి. ఈ ఎన్నికల సందర్భంగానే బాంబు పేలుళ్లలో వందల మంది చనిపోయారు. అది పక్కన పెడితే కొందరు ఆగంతకులు కరాచీ నగరంలో ఓ రాత్రి పూట ఒక గాడిదని చిత్రవధ చేశారు. ఎంత దారుణంగా అంటే… గాడిద ముక్కుపుటాలు విరిచేశారు. ఎముకలు విరిగేలా చావబాదారు. కార్ తో గాడిదని ఢీకొట్టి నుజ్జునుజ్జు చేశారు! ఎందుకు? సమాధానం వింటే పాకిస్తాన్ లో రాజ్యమేలుతోన్న ఉన్మాదం ఎంతో అవగాహనకు వస్తుంది!     పాకిస్తాన్ ఎన్నికల్లో తరువాతి ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫుల్ గా ప్రచారం అవుతున్నాడు. అతడికే మిలటరీ సపోర్ట్ కూడా వుండటంతో గెలవటం దాదాపు ఖాయం అయిపోయినట్టే. అతను ప్రధాని అవుతాడో కాడోగానీ… ఇమ్రాన్ ఖాన్ ఓ మాటన్నాడు. ఎన్నికల ప్రచారంలో నవాజ్ షరీఫ్ మద్దతుదారులు గాడిదలు అన్నాడు! అదే గుర్తుతెలియని ఉన్మాదుల నికృష్ట ప్రవర్తనకి కారణం! రాత్రి వేళ ఘారాతి ఘోరంగా గాడిదని హింసించి దాని ఒంటిపై నవాజ్ అని కత్తితో చెక్కి… రోడ్డు పక్కన చావటానికి వదిలేసి వెళ్లిపోయారు.   బహుశా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యులని అనుమానిస్తున్న సాడిస్టులు ఇంత వరకూ దొరకలేదు. మనుషుల్నే కుక్కల్లా కాల్చి చంపే పాకిస్తాన్ లో గాడిదని ఎవరు పట్టించుకుంటారు? అలా దారిన పోతున్న ఒకాయన రక్తం కక్కుతూ చచ్చిపోతున్న గాడిదని చూసి ఫేస్బుక్ లో పోస్టు పెట్టి ఎవరైనా సాయం చేయండని అభ్యర్థించాడు. ఒక స్వచ్ఛంద సంస్థ వారొచ్చి గాడిదకి ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రస్తుతం వైద్యం చేయిస్తున్నారు. సగటు పాకిస్తానీల ఉన్మాదానికి బలైన ఆ గాడిద ఇంకా లేచి నిలబడి తిరగలేకపోతోంది. బతికే చాన్స్ వుందని వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు!   మనుషుల్నే మతోన్మాదంతో , డబ్బుల కోసం, అధికారం కోసం, అర్థంపర్థం లేని పగతో చంపేసే పాకిస్తాన్ లో గాడిద బతికినా చచ్చినా పెద్దగా తేడా ఏం వుండబోదు. కానీ, అసలు విషాదం ఏంటంటే… పాక్ లోని ఆర్మీ, పాలకులు, తాజాగా అధికారులు, న్యాయ వ్యవస్థలోని వారు అందరూ … మొత్తం వ్యవస్థనే గాడిదని చేశారు. తమకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దిశ నుంచీ హింసిస్తున్నారు. అటువంటి పాక్ లో సామాన్య జనం బతుకులు మాత్రం… ఎన్ని ఎన్నికలు వచ్చినా …. చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ గాడిదలానే వుండబోతున్నాయి. నవాజ్ షరీఫ్ జైలుకి వెళ్లినా, ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయినా పాక్ ఎప్పుడు మారుతుందో వాళ్ల దేవుడికే తెలియాలి!  

శివసేన పులి స్వారీ చేస్తోన్న బీజేపీకి ‘గండం’ తప్పకపోవచ్చు!

శత్రువుగా కనిపించే శత్రువు కంటే… మిత్రుడుగా నటించే శత్రువు చాలా ప్రమాదకరం! ఈ విషయం మోదీ లాంటి రాజకీయ నాయకుడికి , అమిత్ షా లాంటి వ్యూహకర్తకి తెలియదని మనం భావించలేం. కానీ, వారు కూడా ఏమీ చేయలేక కళ్లప్పగించి చూస్తున్నారు శివసేనని! అసలింతకీ మరాఠా పార్టీకి, కాషాయ పార్టీకి మధ్య సమస్య ఏంటి? అదే ఇంత వరకూ అర్థం కానిది! శివసేన ప్రతీ రోజూ , ప్రతీ కారణంపై ఏదో ఒక విధంగా బీజేపీని తిట్టిపోస్తూనే వుంది. అయినా కూడా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నుంచీ మాత్రం తప్పుకోదు. మిత్ర పక్షంగా వుంటేనే ప్రతిపక్షాల కంటే దారుణంగా దాడి చేస్తుంటుంది!     శివసేన, బీజేపీలది ప్రతీ రోజు సాయంత్రం విపరీతంగా గొడవపడే భార్యా, భర్తల సంబంధం లాంటిది. తెల్లవారితే అంతా మామూలైపోతుంది. రెండు పార్టీలు అసలేం కాలేదన్నట్టు నటిస్తాయి. తాజా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా అంతా శివసేన బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంటుందని అంచనా వేశారు. ఉద్ధవ్ గత కొన్ని నెలలుగా తన పత్రిక సామ్నాలో దుమ్మెత్తి పోస్తూనే వున్నాడు. తమ సీఎం ఫడ్నవీస్ ను, దేశ ప్రధాని మోదీని ఆయన తిట్టని తిట్టు లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోయాక కూడా శివసేన మరో మారు బీజేపీపై మాటల బాంబులు వేసింది. తమ పత్రికలో మోదీని కసాయి అనేసింది. జంతువుల్ని కాపాడుతాడుగానీ మనుషుల్ని పట్టించుకోడనీ, దయ, జాలీ లేవని నోటికి వచ్చినట్టు రాసేశారు. మరింత కోపమే వుంటే మోదీకి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయవచ్చు కదా? అలా చేయలేదు! సైలెంట్ గా శివసేన ఎంపీలు జారుకున్నారు. సభలో లేకపోవటం ద్వారా బీజేపీకి, మోదీకి కావాల్సినంత మేలు చేశారు!     ఒకవైపు శివసేన అయోమయంగా ప్రవర్తిస్తున్నా బీజేపీ ఏమీ అనకుండా మౌనంగా భరిస్తోంది! అంతకు మించి కాషాయ అగ్రనేతలు చేయగలిగింది కూడా ఏం లేదు. మహారాష్ట్రలో కమలానికి స్వంత మెజార్టీ లేదు. కేంద్రంలో కూడా వాజ్ పేయ్, అడ్వాణీ హయాం నుంచీ శివసేన తోడుగా వుంటోంది. అక్కడా సాటి హిందూత్వ పార్టీ అయిన శివసేనని కమలదళం వదలలేదు. ఇలా దిల్లీలో, ముంబైలో రెండు చోట్లా శివసేన అవసరం ఎంతో కొంత బీజేపీకి కూడా వుంది. ఇదే మోదీ, అమిత్ షాల సహనానికి,మౌనానికి కారణం!     ఇష్టం లేని కాపురం శివసేన, బీజేపీలు ఇంకా ఎంత కాలం చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కానీ, ఇదే తంతు కొనసాగితే మాత్రం ఇద్దరికీ కష్టమే. ప్రాంతీయ పార్టీ అయిన శివసేనని పక్కన పెడితే మళ్లీ ప్రధాని కావాలని పట్టుదలతో వున్న మోదీకి మాత్రం … మిత్ర పక్షంలా పక్కనే వుంటూ బల్లెంలా తయరైన మరాఠా పార్టీ ఏనాటికైనా ప్రమాదమే! శివసేన పులి స్వారీ చేయటం… దుస్సాహసమే!

వాట్సప్ మెసేజ్ లకి, వాస్తవాలకి తేడా తెలుసుకోలేకపోతున్న జనం!

సైన్స్ , టెక్నాలజీ ఎప్పుడూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే వుంటాయి. అయితే, కొన్ని సార్లు వాటి ప్రభావం మంచికి దారి తీస్తే కొన్ని సార్లు చెడు ఎదురవుతూ వుంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఆవిష్కరణలు, సాంకేతిక అద్భుతాలు ఒక ఉద్దేశంతో మొదలై ఎక్కడో ముగుస్తున్నాయి. చివరకు, విషాదాలకి దారి తీస్తున్నాయి! సోషల్ మీడియా కూడా ఆ లిస్టులో చేరింది!     కంప్యూటర్ కనుగొన్న సైంటిస్టుకి ఇంటర్నెట్ అంటూ ఒకటి వస్తుందని తెలియకపోవచ్చు. అలాగే, ఇంటర్నెట్ రూపొందించిన శాస్త్రవేత్తలకు ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఊహల్లో కూడా వుండకపోవచ్చు! కానీ, ఇవాళ్ల అవ్వి అంగీకరించి తీరాల్సిన నిజాలు! ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ లాంటివి ఎంతో మేలు చేస్తున్నాయన్నది కూడా నిజమే. అదీ ఒప్పుకుని తీరాల్సిందే. కానీ, ఇండియా లాంటి దేశాల్లో మేలు చేసే సోషల్ మీడియా తలనొప్పులు కూడా తెచ్చి పెడుతోంది. అదే ప్రభుత్వానికి కూడా సమస్యగా మారింది! సోషల్ మీడియాలో ఇతర సైట్లు కూడా వున్నా… స్మార్ట్ ఫోన్లనే నమ్ముకున్న వాట్సప్ యాప్ దుమారం రేపుతోంది. ట్విట్టర్ కంటే, ఫేస్బుక్ కంటే వాట్సప్ సామాన్యులకి అత్యంత అందుబాటులో వుంటూ అవసరాలు తీరుస్తోంది. మాటలు, పాటలు, కథలు, కవితలు, వీడియోలు, ఆడియోలు… ఇలా ఒక్కటని కాకుండా అన్నీ షేర్ చేసుకుంటున్నారు కామన్ ఇండియన్స్. వాట్సప్పే అందరికీ దిక్కైపోయింది. కానీ, వాట్సప్ వాడే క్రమంలో తెలిసీ , తెలియక గందరగోళానికి, విషాదాలకి కూడా భారతీయులే కారణం అవుతున్నారు!     వాట్సప్ కంపెనీ వారు అధికారికంగా చెబుతోన్న సమాచారం ప్రకారం కూడా ఇండియన్స్ మెసేజ్ లు ఫార్వార్డ్ చేయటంలో అందరి కంటే ముందున్నారట. ప్రపంచంలో వాట్సప్ వాడే వారందరిలో మన భారీయులే మెసేజ్ ఫార్వార్డ్ ఆప్షన్ విపరీతంగా వాడుతున్నారట. ఇదే ఇప్పుడు సమస్యలకి కారణం అవుతోంది. ప్రాణాలు కూడా తీస్తోంది. తమకు వచ్చిన మెసేజ్ వెనకా ముందు ఆలోచించకుండా తమ కాంటక్ట్స్ లో వున్న అందరికీ పంపేస్తున్నారు. అలా వెళ్లిన మెసేజ్ ప్రభావం చాలా తీవ్రంగా వుంటోంది. ఈ మద్యే బళ్లారి ప్రాంతంలో హైద్రాబాద్ నుంచి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అనుమానంతో కొట్టి చంపారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే కిడ్నాపర్లు రెడ్ కార్లో వస్తున్నారన్న వాట్సప్ మెసేజే ఆ విషాదానికి కారణం! ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.     కాశ్మీర్ లాంటి కల్లోల ప్రాంతాల్లో కూడా వాట్సప్ మెసేజ్ లు సంక్షోభానికి దారి తీస్తున్నాయి. రెచ్చగొట్టే తప్పుడు సందేశాలు వైరల్ గా మారిపోయి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. అందుకే, ఏ చిన్న అల్లరి మొదలైనా ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలు ఆపేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అర్థం కాని అజ్ఞానం, అత్యుత్సాహం! వాట్సప్ ఆమెరికాలోనూ, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ కూడా వుంది. కానీ, అక్కడ ఇలా ఫార్వర్డ్ మెసేజీల సమస్య లేదు. వాట్సప్ మెసేజ్ లు చూసి జనం రెచ్చిపోరు. ఎందుకంటే, టెక్నాలజీని వాడుకోవటంలో వారు విచక్షణ చూపుతున్నారు. మన దగ్గర అది కొరవడుతోంది.     వాట్సప్ కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తప్పుడు వార్తల విషయమై నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో రెండు సార్లు తీవ్రంగా హెచ్చరించింది. వాట్సప్ వారు కూడా ఎలా ఫేక్ మెసేజ్ లు ఫిల్టర్ చేయాలా అని ఆలోచిస్తున్నారట. నియమాలు, నియంత్రణలు ఎలా వున్నా… జనం వాట్సప్ లాంటి ఆధునిక సౌకర్యాల్ని తెలివిగా, వివేకంతో వాడుకోవాలి. అంతే తప్ప తమకు ఏది వచ్చినా దాన్ని అందరికి చేరవేసి అనవసర సంకోభాలకి తెర తీయవద్దు. అలాగే, సున్నితమైన విషయాలపై వాట్సప్ లాంటి ఓపెన్ ఫోరమ్ లలో వచ్చే ప్రతీ మాటని నమ్మవద్దు. అన్నిటికి రెచ్చిపోతూ రోడ్ల మీదకొచ్చే ఉన్మాదాన్ని జనం మానుకోనంత వరకూ ఎంత మంచి ఆవిష్కరణ అయినా చెడుకే దారి తీస్తుంది. ప్రభుత్వం దీనిపై జనాన్ని చైతన్య పరచాలి!

దిల్లీలో అవిశ్వాసం… ట్విట్టర్‌లో జనసేనాని అయోమయం!

ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబువి తెలివైన రాజకీయాలు. జగన్ వి ఆవేశపూరిత రాజకీయాలు. ఇక పవన్‌వి ఆశ్చర్యకర రాజకీయాలు! ఆయన ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తారో, ఎవరికి గౌరవం ఇస్తారో, ఎవర్ని బతిమాలతారో, ఎవర్ని తిట్టిపోస్తారో ఆయనకే తెలియదు! అవిశ్వాస తీర్మానం నేపథ్యంలోనూ పవర్ స్టార్ ట్వీట్ల రాజకీయం మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలింతకీ కళ్యాణ్ బాబు కథ ఏంటి, కథనం ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి అనేలా వ్యవహారం నడిచింది!     గత వారం రోజులుగా ఏదైనా అంశం తీవ్ర దుమారం రేపుతోంది అంటే… అది అవిశ్వాసమే! కేంద్రంపై టీడీపీ సంధించిన బలపరీక్ష అస్త్రం కలకలమే రేపుతోంది. లాభ, నష్టల మాట ఎలా వున్నా ఏపీకి జరిగిన అన్యాయం జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. ఒక విధంగా మోదీ బోనులో నిలబడాల్సిన స్థితి వచ్చింది. టీడీపీ ఇంత వరకైనా సక్సెస్ అవుతుంటే జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి అస్త్ర సన్యాసానికి పాల్పడ్డారు. ఆయనకంటే తెలివైన వారు పవన్ కళ్యాణ్! అసలు ఈయన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న శుక్రవారం ఉదయం వరకూ నిద్రలేవలేదు! అవిశ్వాసం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు! జనసేన అనే ఒక పార్టీనే ఏర్పాటు చేసుకుని జనంలో తిరుగుతోన్న నాయకుడు ఇంత బాధ్యత రాహిత్యంతో వుండవచ్చా? హోదా గురించి ప్రజలు ఎంతో సీరియస్ గా వుంటే అది సమస్యే కాదన్నట్టు తన యాత్రలు, పర్యటనలు, కవాతులు తాను చేసుకుంటున్నారు పవన్. ఇక తప్పదన్నట్టు అవిశ్వాసం సభలో జరగనున్న నాటి ఉదయం రెండు మొక్కుబడి ట్వీట్లు చేసి ఊరుకున్నారు! అందులోనూ తనదైన శైలిలో గందరగోళ వ్యాఖ్యానం చేశారు జనసేనాని!     గుర్తుందిగా… ఇదే గబ్బర్ సింగ్ గతంలో అనంతపురం, కాకినాడ సభల్లో కాషాయ పార్టీని కడిగిపారేశారు. కానీ, ఇప్పుడు తాను కావాలన్న హోదా విషయంలోనే టీడీపీ పూర్తి స్థాయి యుద్ధం చేస్తుంటే … సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు! పవన్ తన ట్వీట్స్ లో స్వీట్ గా ఇలా చెప్పారు. బీజేపీ పెద్దలకు టీడీపీ పెద్దలతో ఏవైనా గొడవలుంటే ప్రత్యేక హోదాని పణంగా పెట్టవద్దట! ఇదేం చోద్యం? టీడీపీ నాయకత్వానికి బీజేపీ నేతలతో వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు ఏముంటాయి? పవన్ కే తెలియాలి.     ఇక ఇంకో ట్వీట్ లో పవన్ టీడీపీ, బీజేపీలు రెండూ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. టీడీపీ హోదా ఇవ్వమని పట్టుబట్టి అవిశ్వాస తీర్మానం దాకా వ్యవహారాన్ని లాక్కొస్తే నాటకాలు ఏమున్నాయి? మోదీని నేరుగా విమర్శిస్తోంటే ఇంకేం కావాలి? జగన్ తో బాటూ పవన్ ఈ మధ్య కాలంలో మోదీని పల్లెత్తు మాట అనటం మీరెప్పుడైనా చూశారా? కానీ, మన అజ్ఞాత వాసికి అన్ని రిస్క్ లు తీసుకుంటోన్న టీడీపీ కూడా బీజేపీకి తోడు దొంగలా కనిపిస్తోందట!     ఆ మధ్య ఏవో పెన్ డ్రైవ్ లు దొరికాయని వార్తలు రావటమే తప్ప వాటి గురించి, అవ్వి పవన్ పంథాపై చూపుతోన్న ప్రభావం గురించి అధికారికంగా ఏం తెలియటం లేదు. కానీ, పవన్ బీజేపీని సాద్యమైనంత తక్కువ టార్గెట్ చేసీ… మోదీని ఒక్క మాటైనా అనకుండా వుంటూ… టీడీపీని బోనులో నిలబెడుతుండటం చూస్తే… పెన్ డ్రైవ్ గాసిప్స్ నిజమేనేమో అనిపిస్తోంది! దిల్లీ పెద్దలు జగన్ని సీబీఐ ద్వారా, పవన్ని పెన్ డ్రైవ్ ద్వారా రిమోట్ కంట్రోలింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది! 

ఆటలో అరటి పండు అయిపోయిన వైసీపీ! 

ఇప్పుడు దేశమంతా పార్లమెంట్ వైపు చూస్తోంది. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలు అవిశ్వాస తీర్మానం చర్చను శ్రద్ధగా వింటున్నారు. ఏపీ ప్రజలకు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా గురించి టీడీపీ ఏం చెబుతోంది, బీజేపీ ఏం చెప్పబోతోంది ఈ రోజు తేలిపోతుంది. అలాగే, ప్రత్యేక హోదా గురించి ఇంత వరకూ ఒక్కసారి కూడా అధికారికంగా నోరు మెదపని మోదీ ఏమంటారు? అది కూడా తీర్మానంపై చర్చ చివరకొచ్చే సరికి స్పష్టం కానుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్న మరో వ్యక్తి జగన్! ప్రధాన ప్రతిపక్ష నేత అయిన ఆయన జనంలో పాదయాత్ర చేస్తున్నారు. సంతోషమే. కానీ, ఆయన ఎంపీలు ఎక్కడున్నారు? కీలకమైన ప్రత్యేక హోదా గురించి అవిశ్వాసం ముందుకొస్తే వారెక్కడా? ఇదీ సామాన్య ఆంద్రా జనం ఆలోచన!     జగన్ యువ నేత. ఒక విధంగా చెప్పాలంటే… ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పుట్టేటప్పటికే పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఆ అపార అనుభవం ఇప్పుడు కళ్లారా కనిపిస్తోంది! జగన్ వయస్సంత అనుభవం వున్న రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు అటు మోదీని , ఇటు జగన్ ని ఏక కాలంలో కార్నర్ చేశారనే చెప్పాలి. హోదా ఇవ్వని పీఎంని అవిశ్వాసానికి గురి చేయటమే గొప్ప విజయం! స్వంతంగా ఇరవై మంది ఎంపీలు కూడా లేని టీడీపీ ఆ పని చేయగలిగింది. ఇది గొప్ప నైతిక విజయమే. మోదీ ఓట్ల సంఖ్యతో బలపరీక్ష నెగ్గవచ్చు. కానీ, జనం ముందు బాబు తన పోరాట పటిమ నిరూపించుకున్నారు. మరి జగన్ సంగతేంటి?     జగన్ అనుభవ రాహిత్యం గత నాలుగేళ్లలో ఇది రెండోసారి సుస్పష్టంగా కనిపించటం. ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వున్న ఆయన ఇప్పటికీ డెమొక్రటిక్ పాలిటిక్స్ ఒంట బట్టించుకోవటం లేదు. ఆ మధ్య అసెంబ్లీలోకి కోట్లాది ఓటర్లు తమని నమ్మి అందించిన ఎంట్రీని తనకు తానే దూరం చేసుకున్నారు. పాదయాత్ర అంటూ బయలుదేరి అసెంబ్లీని బహిష్కరించారు. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో కాదు. రోడ్లపై ఉద్యమాలు చేయటానికి ఎన్నికల్లో గెలవటం ఎందుకు? ఎన్జీవోలు స్థాపించుకుని కూడా జనం కోసం పోరాడవచ్చు కదా? ఏపీ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే దాన్ని అవతలకి విసిరేసి రోడ్డు మీదకొచ్చి మళ్లీ ఓటేయండి అంటూ పాదయాత్ర చేయటం జగన్ కే చెల్లింది!     అసెంబ్లీ వేదికగా తన అనుభవ రాహిత్యం నిరూపించుకున్న జగన్ తానే కాక తన ఎమ్మెల్యేలు కూడా జనం కష్టాలు ప్రస్తావించకుండా చేసేశారు. ఇప్పుడు అదే తప్పిదం పార్లమెంట్ వేదికగా ఎంపీల చేత చేయించారు. అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు వైసీపీ ఎంపీల్ని ఎందుకు గెలిపించారు? తమ గొంతు దిల్లీలో వినిపిస్తారని! కానీ, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా సమస్యపై జనం తరుఫున మాట్లాడాల్సిన సమయంలో జగన్ ఎంపీలు ఏ ఒక్కరూ లేరు! ఇది ఖచ్చితంగా జగన్ దుందుడుకు నిర్ణయం వల్లే! పార్లమెంట్లో టీడీపీ వాదన, బీజేపీ ప్రతి వాదన జరుగుతుంటే వైసీపీ స్వరమే లేకుండాపోయింది. ఇది చేజేతులారా జగన్ చేసుకున్న నిర్వాకం అనక తప్పదు!     చంద్రబాబువి సహనంతో కూడుకున్న రాజకీయాలు. జగన్ వి అసహనపు ఎదురు దాడులు. సీఎం అవ్వలేకపోయానన్న అసహనం, త్వరగా ఎన్నికలొచ్చి అధికార పీఠంపై కూర్చోవాలన్న అసహనం అతడ్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. పాతికేళ్లు ఎదురు చూసి సీఎం అయిన తన తండ్రి వైఎస్ చరిత్ర అయినా జగన్ ఒకసారి మననం చేసుకోవాలి. లేదంటే, అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలుగా జగన్ ప్రజాస్వామ్యాన్ని , ఓటర్లు వేసిన ఓట్లని అపహాస్యం చేయటం… జనం సీరియస్ గా తీసుకుంటారు! 

అవిశ్వాసానికి వెళ్లకపోతే… జేసీ ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బ తీసినట్లేనా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఇది పాత మాటే. కానీ, కొత్త విషయం ఏంటంటే…. అసలు ఇప్పటి రాజకీయాల్లో మిత్రులు అంటూ ఎవరూ వుండటం లేదు! ఎవరు ఎప్పుడు ఎలా కుట్ర చేస్తారో తెలియదు. ఎవరు ఎందుకు ఇబ్బంది కలిగిస్తారో అర్థం కాదు! అసలు ఎవరి ఎవరి వైపున నిలబడుతున్నారో కూడా క్లారిటీ వుండటం లేదు!     టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. కాంగ్రెస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మద్దతు పలికింది. అసలు చరిత్రలో ఏనాడూ కలవని టీడీపీ, కాంగ్రెస్ లు మోదీ విషయంలో ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఇంత వరకూ అందరికీ అర్థమయ్యే వ్యవహారమే. కానీ, తమ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానికి తానే హాజరుకానని జేసీ దివాకర్ రెడ్డి అనటం … నిజంగా ఆశ్చర్యకర పరిణామమే! ఇంతకీ జేసీ సమస్య ఏంటి? జేసీ దివాకర్ రెడ్డి తాను పార్లెమంట్ కు వెళ్లనని భీష్మించి అనంతపురంలో కూర్చున్నారు. ఎంపీగా ఎన్నికైన ఆయన సభ నడుస్తుంటే ఇంట్లో కూర్చోవటం ఏంటి? ఓట్లు వేసిన జనానికి జవాబుదారి అంటూ ఏం లేదా? అది పక్కన పెడితే టికెట్ ఇచ్చిన పార్టీ అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయమని విప్ జారీ చేసింది. దాన్నైనా గౌరవించాలి కదా? ఇంత కాలం జేసీ కూడా మిగతా ఎంపీలతో కలిసి ఆంద్రాకు అన్యాయం జరుగుతోందనే అన్నారు. తీరా ఇప్పుడు ఓటు వేసి మోదీ సర్కార్ ను బోనులో నిలబెట్టే సమయం వస్తే ఆయన వెళ్లకుండా వుండిపోతున్నారు! ఇదెక్కడి విడ్డూరం?     దిల్లీకి వెళ్లకపోవటానికి జేసీ చెబుతోన్న కారణాలు కూడా విచిత్రంగానే వున్నాయి. మోదీ ప్రధానిగా వున్నంత కాలం ఏపీకి ఏమీ రావని కుండబద్ధలు కొడుతున్నారు. ఆయన చెప్పింది నిజమే అయినా జనం కోసం , జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించాలి కదా? అది చేయకుండా అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో బాధని పంచుకుంటే ఏం లాభం? ప్రత్యేక హోదా అవిశ్వాస తీర్మానం వల్ల రాదని జేసీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విషయం అపార అనుభవం వున్న చంద్రబాబుకు తెలియదా? తెలిసే ఆయన అవిశ్వాస తీర్మానంతో మోదీని ఢీకొడుతున్నారంటే జనం మనోభావాల్ని జాతీయ స్థాయిలో వినిపించాలనే కదా! మరి అందులో భాగం అవ్వటానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డికి ఏంటి ఇబ్బంది? జేసీ మొరాయింపు వెనుక అసలు కారణం వేరే అంటున్నారు టీడీపీలోని వారు. ఇప్పటికే ఆయనని బుజ్జిగించి దిల్లీ ఫ్లైట్ ఎక్కించే పనిలో వున్న కొంత మంది ఆయన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధూసూదన్ గుప్త విషయంలో గుస్సాగా వున్నారని అంటున్నారు. గుప్తా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. అది పార్టీకి కూడా ఇష్టమే. కానీ, టీడీపీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి మాత్రం మధూసూదన్ గుప్తా చేరికని ఇష్టపడటం లేదు. అందుకే, అదును చూసి టీడీపీ అధిష్టానం పై ఒత్తిడి పెంచారని టాక్!     జేసీ అలకకి కారణాలు ఎలా వున్నా… ఆయన తన వ్యక్తిగత , రాజకీయ అంశాల కారణంగా ప్రత్యేక హోదా విషయాన్ని లైట్ తీసుకోవటం బాధాకరమే! పార్టీని, పార్టీ అధినేతని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తూ ఆయన జనం ముందు చులకన అవుతున్నారు. ఆంధ్రులకు ఎమోషనల్ ఇష్యూగా మారిన హోదా విషయంలో జేసీ పునరాలోచించుకుంటే మంచిది. దిల్లీకి వెళ్లి మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎంపీగా తన బాద్యత నిర్వర్తిస్తే చరిత్రలో పేరు చెడిపోకుండా స్థిరమవుతుంది!

సుప్రీమ్ శబరిమల తీర్పు… చట్టం ముందు అన్ని మతాలు సమానమేనా?

సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పుల పరంపర కొనసాగుతూనే వుంది. స్వలింగ సంపర్కంపై గొంతు విప్పిన అత్యున్నత న్యాయస్థానం మరో కీలక తీర్పు వెలువరించింది. ఈసారి హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో న్యాయస్థానం సూటిగా అభిప్రాయం వెలువరించింది. శబరిమల ఆలయంలోకి ఆడవారు ప్రవేశించవచ్చని దీపక్ మిశ్రా సహా అందరూ న్యాయమూర్తులు ఏకీభవించారు!     కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలోయంలోకి 10 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు మొదలు 50 ఏళ్ల వరకూ వయస్సున్న వారికి అనుమతి వుండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఈ నియమంపై కోర్టుకెక్కారు కొందరు ఉద్యమకారులు. కేవలం స్త్రీలన్న వివక్షతో, ప్రకృతి సహజమైన ఋతుస్రావం నెపంగా చూపుతూ దేవుడి దర్శనానికి దూరం చేయటం తప్పన్నది వారి వాదన. నిజానికి నెలసరి సమయంలో హిందూ స్త్రీలు ఏ గుడిలోకి కూడా వెళ్లరు. అంతటా ఇది వర్తిస్తుంది. కానీ, అయ్యప్ప ఆలయంలోకి ఎలాంటి శారీరిక ఇబ్బంది లేని రోజుల్లో కూడా ఇంత కాలం అనుమతించే వారు కాదు. పదేళ్ల నుంచీ యాభై ఏళ్ల వయస్సున్న ఆడవారెవరూ కొండ మీదకి వెళ్లేవారు కాదు. ఇది తప్పా ఒప్పా అనేది పెద్ద చర్చ. ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది కూదా. అయితే, తాజా సుప్రీమ్ తీర్పుతో శబరిమల వివాదానికి తెర పడినట్టైంది.     కోర్టు తీర్పుని అందరూ శిరసావహించటం తప్పనిసరే. అలాగే, అత్యధిక శాతం హిందువులు దీన్ని పెద్దగా విమర్శిస్తారని కూడా భావించలేం. ఎందుకంటే, ఆలయాల్లోకి స్త్రీల్ని నిషేధించటం హిందూ మతంలోని మూలమైన సిద్ధాంతం ఏం కాదు. అసలు అలాంటి నియమం వేదాలు, పురాణాల్లో ఎక్కడా కనిపించదు కూడా. శబరిమల, శని సిగ్నాపూర్ లాంటి క్షేత్రాల్లో కాల క్రమంలో ఏర్పడ్డ నిషేధాలే ఇవన్నీ. కేరళలలోనే ఇతర అయ్యప్ప ఆలయాల్లో కూడా ఎక్కడా స్త్రీల ప్రవేశం కట్టడి చేయలేదు. కేవలం శబరిమల కొండపైకే నిషేధించారు. దాని వల్ల స్త్రీలకి ఏం నష్టం జరుగుతోందని వాదించే చాందసవాదులు కూడా వున్నారు. వారి మాటలో కొంత వరకూ సరైన అంశాలే వున్నా రాజ్యాంగబద్ధంగా పని చేసే కోర్టు మగ, ఆడా మధ్య భేదాలు వుండకూడదన్న సమనత్వ సూత్రంపైనే తీర్పు వెలువరించింది. ఇక ఇక్కడే మరో కోణమూ వుంది. తీర్పు వచ్చింది కాబట్టి నమ్మకాల్ని, విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎందరు స్త్రీలు శబరిమల కొండ ఎక్కుతారు? అదీ అనుమానమే! చాలా మంది స్త్రీలు శబరిమల కొండపైకి ఒక వయస్సు వచ్చే వరకూ ప్రవేశం లేకపోవటం పెద్ద సమస్యగా భావించరనేది కూడా సత్యమే!     ఏ మతమైన ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూనే ముందుకు సాగాలి. అది శబరిమల ఆలయం ప్రవేశమైనా, ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారమైనా… అన్నీ కాలక్రమంలో పక్కకు తప్పుకోవాల్సిందే. కాకపోతే, మన దేశంలో అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేయవలసిన పనులు కోర్టులు చేయాల్సి వస్తోంది. అదే విచారకరం! ఇప్పటికైనా కోర్టులో, ప్రభుత్వాల్లో ఏవో ఒకటి అన్ని మతాల్లోని దురాచారాల్ని అంతం చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. అలా కాకుండా కేవలం హిందువుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బతిసేలా మాత్రమే తీర్పులు, ఆదేశాలు, చట్టాలు వస్తే… అది అశాంతికి కారణం అవుతుంది. మైనార్టీ మతాల విషయంలో కూడా ఉద్యమకారులు, అభ్యుదయవాదులు, ప్రభుత్వాలు నిష్పపక్షపాతంగా, నిర్భయంగా స్పందించాలి. ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారాల్ని సమూలంగా అంతం చేసే చర్యలు వేగంగా చేపట్టాలి. అదే సమానత్వం అనిపించుకుంటుంది!

మోదీ గెలిచి ఓడటం, చంద్రబాబు ఓడి గెలవటం… ఖాయమే!

టీడీపీ పంతం నెగ్గించుకుంది! చంద్రబాబు వ్యూహం ఫలించింది! అవిశ్వాస రాజకీయం మోదీని కార్నర్ చేయగలిగిందనే చెప్పాలి! నిజానికి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాల్సి రావటమే ఒక మైనస్ పాయింట్. అందులోనూ తమతో నాలుగేళ్లు కలిసి సాగిన టీడీపీ లాంటి పార్టీయే అవిశ్వాసం పెట్టటం మోదీకి ఇబ్బందికర పరిస్థితే. అందుకే, గత పార్లమెంట్ సమావేశాల్లో రోజుల తరబడి సమయం వృథా అయినా ప్రధాని చర్చకు సిద్ధపడలేదు. కానీ, అది రివర్స్ రిజల్ట్స్ ఇచ్చింది. మీడియాలో, దేశ వ్యాప్తంగా కూడా మోదీ ప్రతిపక్షాల ప్రశ్నలకి భయపడుతున్నారని ప్రచారం జరిగింది. మళ్లీ ఈసారి కూడా పోయిన సారిలాగే టీడీపీ అవిశ్వాస అస్త్రం ఎక్కుపెట్టడంతో మోదీ చర్చకు దిగి రాక తప్పలేదు…     ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ రాష్ట్రంలో అన్ని పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. కానీ, పార్లమెంట్ వేదికగా ఉద్యమిస్తేనే దేశమంతా గమనిస్తుంది. అందుకే, టీడీపీ పోరుబాట ఎంచుకుంది. కానీ, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తప్పులో కాలేసింది. జగన్ తన ఎంపీల చేత రాజీనాలు చేయించి ట్రాప్ లో పడ్డారు. ఇప్పుడు మోదీ అవిశ్వాసం పై చర్చకు సై అనటంతో టీడీపీ ఎంపీల స్వరమే లోక్ సభలో వినిపించనుంది. జనం తరుఫున మాట్లాడే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఈ విషయంలో టీడీపీదే పై చేయి అయిందని చెప్పుకోవాలి…     టీడీపీ, వైసీపీ మధ్య పోటీ పక్కన పెడితే చంద్రబాబు గత కొన్ని రోజులుగా బీజేపిని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో మోదీయే విలన్ అని జనానికి చెప్పగలిగారు. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా అదే మరింత స్పష్టం కానుంది. ఖచ్చితంగా బీజేపీ నేతలు, ప్రధాని కూడా తీవ్ర స్థాయి ఎదురు దాడికి సిద్ధమయ్యే చర్చకు ఒప్పుకుని వుంటారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, కాషాయ దళం ఎంత ప్రతి దాడి చేసినా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అనే ప్రధానమైన తప్పిదం మాత్రం కప్పిపుచ్చలేనిది. జనం ఆ విషయం గుర్తిస్తే చంద్రబాబు అవిశ్వాస వ్యూహం ఫలించినట్లే!     అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చ జరగటం, ప్రధాని సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వటం ఎప్పుడైనా మామూలే. అయితే, చివర్లో ఓటింగ్ జరిగి ప్రభుత్వాలు కూలుతుంటాయి. అంతటి పరిస్థితి ఇప్పుడైతే లేదనే చెప్పాలి. మోదీ సర్కార్ కూలటం దాదాపు అసాద్యమే. ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ కే కేవలం 44 సీట్లు వుండటం, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతగా ప్రతిఘటిస్తున్నా టీఆర్ఎస్, అన్నాడీఎంకే లాంటి పార్టీలు లోపాయికారిగా కేంద్రానికి సాయపడుతుండటం, వైసీపీ కూడా తన ఎంపీల రాజీనామాతో మోదీకి హెల్ప్ చేయటం… ఇలాంటి బోలెడు కారణాలున్నాయి! వీటన్నిటి వల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు నష్టం లేన్నట్టే. కానీ, టీడీపీతో సహా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన పార్టీలు, మద్దతిస్తున్న పార్టీలు మాత్రం జనం ముందు దిల్లీ పెద్దల్ని దోషులుగా నిలిపే ఛాన్స్ వుంటుంది. అంత వరకూ చంద్రబాబు ఇతర నేతలు సక్సెస్ అయినట్టే! 

మా బాబు మంచివాడని రమణ దీక్షితులు ఇందుకే అన్నారా?

తిరుమల వెంకన్న ప్రధానార్చకులుగా రమణ దీక్షితులు ఇప్పుడు అందరికీ తెలిసిన వారే! నిజానికి ఆయన అర్చకులుగా వున్నప్పటి కంటే పదవీ విరమణ తరువాతే మరింత ఫేమస్ అయ్యారు. కారణం వివాదాల పరంపరనే! టీటీడీలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించటం మొదలు పింక్ డైమండ్ అని ఒకసారి, అమిత్ షాను కలిసి ఒకసారి, జగన్ తో బేటీ అయ్యి ఒకసారి ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. లోపలి కారణాలు అసలేంటో ఎవ్వరికీ తెలియదు. తప్పు టీటీడీదా? రమణ దీక్షితులుదేనా? అంతా అయోమయమే! కానీ, ఈ గొడవ మొత్తంలోకి చంద్రబాబు పేరు కూడా పదే పదే వచ్చేస్తోంది. ఆయన ప్రమేయం ఎంత మేర అన్నది కూడా అస్పష్టమే. రమణ దీక్షితులు లాంటి అర్చకులకి 65 ఏళ్ల వయో పరిమితితో బలవంతంగా రిటైర్మెంట్ ఇవ్వటం చంద్రబాబు ఆలోచనా? లేక టీటీడీ బోర్డులోని వారిదా? దాన్ని ముందుగానే సీఎంకి చెప్పి అమలు చేశారా? ఇలా బోలెడు ప్రశ్నలు! అయితే తాజాగా రమణ దీక్షితులు బాబుకి క్లీన్ చిట్ ఇవ్వటం నిజంగా ఆసక్తికరమే!     ఇంత కాలంగా పోరుబాట పట్టిన రమణ దీక్షితులు ఇప్పుడు రూటు మార్చారా? సుప్రీమ్ గడప తొక్కుతాననీ, న్యాయపోరాటం చేసి తన అర్చకత్వ పదవి తాను తిరిగి పొందుతానని చెప్పుకొచ్చిన ఆయన వున్నట్టుండీ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో జూనియర్ అని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు, చంద్రబాబు మంచివాడని కూడా కితాబునిచ్చారు. సీఎంగా ఆయన ఆంధ్రా ప్రజల అభివృద్ధి కోరతారని అన్నారు. ఇతరులెవరో చంద్రబాబుని పక్కదోవ పట్టించారని కూడా రమణ దీక్షితులు అనటం కొసమెరుపు! చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారని వాపోయారు!     ఈ తాజా కామెంట్స్ తో రమణ దీక్షితులు చెప్పదలుచుకున్నది ఏంటి? తనకు సీఎంతో సంధి ఓకేనని చెబుతున్నారా? అలాగే, తనకు అప్పాయింట్ మెంట్ ఇస్తే బాబుని కలిసి ఆయన ఏమైనా చెప్పదలుచుకున్నారా? బాబు మంచివాడే కానీ… అంటూ ముక్తాయింపు ఇచ్చారంటే… ఆ అసలు విలన్లు ఎవరు? బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీక్షితులు మాటలతో! ఏది ఏమైనా స్వరం మార్చిన రమణ దీక్షితులు తత్వం గ్రహించారనే భావించాలి. దిల్లీలో మకాం వేసి న్యాయ పోరాటం చేయటం అంత సులువేం కాదని అర్థమై వుండవచ్చు. టీటీడీ తీసుకున్న నిర్ణయం కోర్టు కొట్టివేస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అలాగే కేసులో ఆయన విజయం సాధించినా అది ఎన్నాళ్లు సాగుతుందో ఊహించలేని వ్యవహారం. వీటన్నటి మధ్యా సమరం కంటే సంధే మంచిదని భావించారనుకోవాలి! మహాసంప్రోక్షణ సందర్భంగా తొమ్మది రోజులు భక్తుల్ని రానివ్వమని ప్రకటించిన టీటీడీ పెద్ద దుమారం రేపింది. అయితే, దాన్ని చంద్రబాబు ఒక్క ఆదేశంతో సద్దుమణిగించారు. భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతించాల్సిందేనని తెలిపారు. రమణ దీక్షితులు వ్యవహారం కూడా సీఎం అలాగే డీల్ చేస్తే సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆయనకి అప్పాయింట్ మెంట్ ఇచ్చి అతడి వాదన కూడా వింటే సమస్య చాలా వరకూ సద్దుమణగవచ్చు. ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న తరుణంలో ఒకవేళ దీక్షితులు సుప్రీమ్ గడప తొక్కిదే టీడీపీకి ఎంతో కొంత ఇబ్బందికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా కూడా చంద్రబాబు చర్చకు ఆస్కారం కల్పించి రమణ దీక్షితులు వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తే ఎంతో బావుంటుంది. 

సుప్రీమ్ చెప్పాకైనా మోదీ సర్కార్ గోరక్షకులపై దృష్టి పెడుతుందా? 

గతంలో అసలు జరిగేవి కావో లేక మీడియా ఇంతగా రిపోర్ట్ చేసేది కాదో… కానీ, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ పెద్ద తలనొప్పిగా మారిపోయిన సమస్య గోరక్షకుల దాడులు! నిజంగా ప్రధానికి ఈ దాడుల్లో ప్రమేయం వుండదని తెలిసినా చివరకు ఆయనని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది ప్రతీ ఒక్కరికి. ఎందుకంటే, ఎక్కడైనా ఓ రాష్ట్రంలో కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా ఒకరిద్దరిపై దాడి చేస్తే అది శాంతి భద్రతల సమస్య. రాష్ట్రం పరిధిలోనిది. కానీ, మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ ఒక మతాన్ని, కొన్ని కులాల్ని కావాలని గురి చూసి దాడులు జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. ఇది ఆందోళనకరమైన పరిణామమే. స్వయంగా సుప్రీమ్ కోర్టు కూడా అదే అంటోంది…     కోర్టులో దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రత్యేక చట్టం చేయమని ఆదేశించింది. రాష్ట్రాల్ని కూడా జనం చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చూడాలని ఆదేశించింది. గో రక్షకులమని చెప్పుకుంటూ మందలుగా మారి దాడులు చేయటం నిజంగా దుర్మార్గం. కానీ, ఉత్తరభారతంలో గత కొన్ని ఏళ్లుగా ఇది మామూలైపోయింది. దీనికి ప్రస్తుత మోదీ ప్రభుత్వం కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంత వరకూ నిజమనేది పక్కనపెడితే చాలా రాష్ట్రాల్లో అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా గోరక్షకుల దాడులతో కలవర పెడుతున్నాయి. దీన్ని అరికట్టడానికి అవసరమైన చట్టం తేవాలని సుప్రీమ్ సూచించింది. పార్లమెంట్లో ఈ తరహా చట్టం తేవటానికి పెద్దగా అడ్డంకులు కూడా వుండకపోవచ్చు. అన్ని పార్టీలు అంగీకరిస్తాయి కూడా.     చట్టం తీసుకురావాలన్న కోర్టు మరిన్ని సూచనలు కూడా చేసింది. దాడి జరిగినప్పుడు నష్ట పరిహారం బాధితుల మతం, కలం చూసి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వారికి జరిగిన నష్టం ఆధారంగా నిర్ణయించాలని సూచించింది. బాధితులు ఏ మతం వారైనా వుండవచ్చిన అభిప్రాయపడింది. సుప్రీమ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా చట్టాన్ని తెస్తే అంత మంచిది. లేదంటే ఎంతో మంది అమాయకులు ఇంకా బలయ్యే అవకాశాలున్నాయి. కేవలం గోరక్షకుల దాడులే రాజకీయంగా చర్చకు వస్తున్నాయి కానీ… చాలా చోట్ల అనేక కోణాల్లో జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రోడ్లపైనే హింసతో చెలరేగిపోతున్నారు.     కొద్ది రోజుల క్రితమే కేవలం ఒక వాట్సప్ మెసేజ్ కారణంగా ఒక సాఫ్ట్ వేర్ టెక్కీ జనం దాడిలో మరణించాడు. అతడ్ని పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిగా భావించి జనం కొట్టి చంపారు. ఇలాంటివి జరగటానికి అనేక కారణాలే వున్నా… ప్రధానంగా మందగా మారిపోయి దాడి చేస్తే ఎవరికీ శిక్షలు పడటం లేదు. అదే జనంలోని అరాచకులకి ఊతం ఇస్తోంది. కొంత వరకూ అనుమానం వున్నా, లేదా ఏదో ఇతర కోపం వున్నా… మరో పది మందితో కలిసి దాడులు చేస్తున్నారు. చివరకు ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకుంటున్నారు. ఇది సమాజానికి అస్సలు క్షేమం కాదు. కఠినమైన చట్టం తీసుకు రావటమే సమస్యకి కొంత మేర పరిష్కారం చూపుతుంది!  

అజ్జు భాయ్‌ని సికింద్రాబాద్ పిచ్‌పై స్వంత పార్టీ నేతలే రనవుట్ చేస్తారా?

అజహరుద్దీన్… ఈ పేరు వినగానే మనకు ఇప్పటికీ క్రికెట్టే గుర్తుకు వస్తుంది. అలాంటి మంచి ట్రాక్ రికార్డ్ వున్న క్రికెటర్ అండ్ కెప్టెన్ ఆయన. కానీ, ఇప్పుడు అజహరుద్దీన్ క్రికెటర్ కాదు. పొలిటీషన్. అసలు ఆయన అలా ప్రవర్తిచింది ఎప్పుడూ లేదు. పోయిన ఎన్నికల్లో కూడా ఎంపీగా గెలిచి ఈ అయిదళ్ల కాలంలో దాదాపు స్థబ్దుగా వుండిపోయారు. చాలా మంది సినీ, క్రికెట్ ప్రముఖల్లాగే కాంగ్రెస్ కు ఓ ఎంపీ సీటు సంపాదించి పెట్టి తన పని తాను చేసుకుంటూ వుండిపోయాడు. పార్లమెంట్లో , బయటా ఎక్కడా అజహరుద్దీన్ రాజకీయ వ్యాఖ్యలు చేసిందీ లేదు, రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించింది కూడా లేదు! కాకపోతే, తాజాగా ఆయన చేసిన ఒక చిన్న కామెంట్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. అదీ తెలంగాణ , హైద్రాబాద్ కాంగ్రెస్ లలో!     2014లో ఉత్తరాదిన పోటి చేసిన అజహరుద్దీన్ ఈసారి స్వంత రాష్ట్రం తెలంగాణ నుంచీ పోటీకి రెడీ అయ్యాడు.అయితే, చాలా రోజులుగా ఆయన హైద్రాబాద్ ఎంపీ స్థానానికి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తారని టాక్ వినిపించింది. దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఓవైసీకి అజహరుద్దీన్ సరైన పోటీ అని భావించిందట. కారణం… ముస్లిమ్ జనాభా ఎక్కువ వుండే హైద్రాబాద్ లో ఓవైసీకి పెద్దగా పోటీనే లేదు ప్రస్తుతం. అతడిపై విమర్శలు చేయటం కూడా బీజేపీ వారు చేయాల్సిందే తప్ప ఇతర పార్టీలు ఓవైసీల ఎంఐఎం ప్రాపకం కోసం పాకులాడుతూనే వుంటాయి. టీఆర్ఎస్ కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానీ ఎప్పుడూ ఓవైసీల్ని టార్గెట్ చేసింది లేదు. కానీ, గత ఎన్నికల్లో మోదీ తుఫాన్ కారణంగా కాంగ్రెస్ 44 సీట్లకు దిగజారింది. తమకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ఓటు బ్యాంక్ గా వున్న ముస్లిమ్ లు కూడా కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అందుకే, రాహుల్ టీమ్ ముస్లిమ్ జనాభా ఎక్కువగా వుండే నియోజక వర్గాలపై దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెడుతోంది ఈ సారి.     హైద్రాబాద్ లోని ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను అజహరుద్దీన్ తిరిగి తమ ఖాతాలోకి తెస్తాడని కాంగ్రెస్ హై కమాండ్ భావించి వుండవచ్చు. కానీ, ఓవైసీపై పోటీ చేస్తే తాను తప్పక ఓడిపోతానని అజహరుద్దీన్ కు బాగా తెలుసు. ఎంఐఎం అధినేతకు అలాంటి పట్టు నియోజకవర్గంపై వుంది. అంతే కాక అజహరుద్దీన్ కు అసదుద్దీన్ తో వున్న బంధం కూడా పోటీకి వెనుకంజ వేసేలా చేసి వుండవచ్చు. ఇవన్నిటి కారణంగా అజహరుద్దీన్ సికింద్రాబాద్ బాంబు పేల్చాడు!     హైద్రాబాద్ అంత ముస్లిమ్ జనాభా లేనప్పటికీ సికింద్రాబాద్ లో కూడా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిమ్ ఓటర్లు మెజార్టీగా వున్నారు. అందుకే, అజహరుద్దీన్ సికింద్రాబాద్ నుంచీ పోటీ చేస్తానని తన అభిప్రాయం బయటపెట్టారు. ఇది వరుసగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తూ వస్తోన్న అంజన్ కుమార్ యాదవ్ కి నచ్చలేదు. 2014లో ఓడినప్పటికీ 2004, 2009 ఎన్నికల్లో ఆయన మంచి మెజార్టీతోనే గెలిచారు. 2019లో బీజేపీ దత్తాత్రేయ నెగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు మంచి పట్టున్న నియోజక వర్గం వదలటానికి అంజన్ ఏ మాత్రం సిద్దంగా లేరు. అంతే కాదు, అజహరుద్దీన్ కి మతం కలిసి వస్తే అంజన్ కు కులం కలిసి వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించాలి. పైగా కాంగ్రెస్ అజహరుద్దీన్ లాంటి ముస్లిమ్ అభ్యర్థిని పోటీకి పెడితే అది బీజేపీకి ఆటోమేటిక్ గా కలిసొచ్చే అంశం. అజహరుద్దీన్ పై బహిరంగంగా బీజేపీ మతపరమైన కామెంట్లు చేయకపోయినా… బూతు లెవల్లో ఓటర్లను హిందూత్వ భావజాలంతో ప్రభావితం చేయగలదు. అలా కాంగ్రెస్ కు సికింద్రాబాద్ నియోజక వర్గం మొత్తానికి పోయే ప్రమాదం వుంది. లోకల్ నేతైన అంజన్ కుమార్ నే బరిలోకి దించటం ఎంతైనా తెలివైన పని అంటున్నారు రాజకీయ పండితులు!     రాహుల్ గాంధీ నిజంగా ముస్లిమ్ లకు దగ్గరవ్వాలనుకుంటే అజహరుద్దీన్ ను ఓవైసీ పైన పోటికి ఒప్పించటమే తెలివైన నిర్ణయం అవుతుంది. ఎందుకంటే, ఎన్నిసార్లు గెలిచినా హైద్రాబాద్ ముస్లిమ్ ల సమస్యలపై ఓవైసీలు పెద్దగా చేసిందేం లేదు. ఆ విషయాన్ని ఓటర్లుకు అజహరుద్దీన్ చేత చెప్పిస్తే కాంగ్రెస్ తిరిగి పట్టు సాధించుకోవచ్చు. అలాగే, అసదుద్దీన్ బీజేపీతో పాటూ కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్య. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు దగ్గరగా మసులుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఆయనేం కాంగ్రెస్ కు మద్దతు పలకటం లేదు. కాబట్టి ఓవైసీలపై అజహరుద్దీన్ చేత పోరు చేయించి హైద్రాబాద్ వశం చేసుకుంటే అది పెద్ద లాభంగా మారుతుంది. లేదంటే సికింద్రాబాద్ నియోజక వర్గంలో లేనిపోని గందరగోళంతో అంజన్ కుమార్ లాంటి మాస్ లీడర్ ని కూడా ఏ బీజేపీకో, టీఆర్ఎస్ కో కోల్పోవాల్సి రావచ్చు! 

టీటీడీ చెలగాటం… టీడీపీకి ప్రాణ సంకటం!

మహాసంప్రోక్షణ మహావివాదం ఒక్క మాటతో ముగిసింది. చంద్రబాబు కలుగజేసుకుని భక్తులకి నిత్యం దర్శనాలు కల్పించాల్సిందేనని అదేశించటంతో టీటీడీ బోర్డు నిర్వాకం మరింత దుమారం కాకుండా ఆగిపోయింది. అయితే, అసలు ఇంత వరకూ పరిస్థితి రాకుండా వుంటే ఇంకా బావుండేదని మాత్రం చెప్పుకోవాలి. ఇదంతా సీఎంపైనా, అధికార పార్టీపైనా అనవసర రాద్ధాంతానికి మూలమైంది. కేవలం టీటీడీ బోర్డు వారి అనాలోచిత నిర్ణయం పెద్ద గొడవకి తెర తీసింది.     ఎన్నికల ముందు సంవత్సరం అంటే అధికార పక్షం డిఫెన్స్ లో సాగుతుంటుంది. అపోజిషన్ దూకుడుగా ఆడుతుంది. ఈ విషయం తెలియని వారు కాదు టీటీడీ చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో. అయినా కూడా సరిగ్గా ప్రతిపక్షం అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మహాసంప్రోక్షణ వివాదం కోరి తల మీద తెచ్చి పెట్టారు. అసలు వెయ్యి సంవత్సరాలుగా రామానుజచార్యుల కాలం నుండీ ఈ క్రతువు జరుగుతూనే వుంది. ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి స్వామి వారికి విశేష పూజలు, ఆగమ శాస్త్ర యుక్తంగా సేవలు జరుగుతాయి. మరి గతంలో చేసిన విధంగానే ఇప్పుడూ చేస్తే పోయేదానికి కొత్తగా భక్తుల్ని నిషేధించటం ఎందుకు? దీనికి టీటీడీ దగ్గర సరైన సమాధానం వుందని అనుకోలేం.     ఎందుకంటే, వారు చెబుతున్నట్టు గతంలో వచ్చిన దాని కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారన్నది నిజం. కానీ, అందుకు తగ్గట్టే సాంకేతిక సౌకర్యాలు కూడా పెరిగాయి. మనసుంటే మార్గమూ వుంటుంది. రోజుకు ఇరవై వేల మందికి ఏ విధంగా చూసినా దర్శనం కల్పించే అవకాశం వుంటుందని బోర్డు వారే ఒప్పుకున్నప్పుడు ఆ పని చేయకుండా మొత్తంగా దర్శనాలు రద్దు చేయటం, అవసరం వున్నా లేకున్నా కొండపైకి దార్లు మూయటం, సీసీ కెమెరాలు పని చేయవని చెప్పటం… ఇదంతా ఎందుకు? రమణ దీక్షితులు కేంద్రంగా సాగుతోన్న వివాదానికి మరింత ఆజ్యం పోసింది మహా సంప్రోక్షణ! చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో పెద్ద దుమారం తప్పిందనాలి. ప్రతిపక్ష నేత జగన్ దీనిపై నోరు విప్పకున్నా ఆయన పార్టీ ప్రతినిధి రోజా కొండపైనే కామెంట్స్ చేశారు. సామాన్య భక్తులు కూడా కొంత వరకూ ఆగ్రహం చెందారనే చెప్పాలి. ఒకవేళ ఈ లోపే ఎవరైనా కోర్టుకి వెళ్లి పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ లాంటిది వేసి వుంటే? అది మీడియాలో మరింత రచ్చకి దారి తీసేది! ప్రత్యేక హోదా విషయంలో తమని టార్గెట్ చేస్తున్న చంద్రబాబుని బీజేపీ ఈ విషయంలో కార్నర్ చేసి వుండేది. హిందూ మతపరమైన విషయాలు, అదీ తిరుమల వెంకన్నకు సంబంధించిన వివాదం అయితే… కాషాయ పార్టీని నియంత్రించటం కష్టమే అయివుండేది.     వారికి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతోన్న ప్రచారం నుంచీ ఏపీ ప్రజల దృష్టి మరల్చటానికి అచ్చంగా ఇలాంటి గొడవే కావాలి. దాన్ని టీటీడీ చక్కగా అందించింది. సమయానికి ఏపీ సీఎం తేరుకోవటంతో హిందువుల మనోభావాల చుట్టూ జరిగే రాజకీయం ఆదిలోనే ఆగిపోయింది! ఆ మధ్య దుర్గ గుడి వివాదం, ఇప్పుడు తిరుమల… ఇలాంటివి ఎన్నికల ఓటర్ల మీద తీవ్ర ప్రభావమే చూపే అవకాశం వుంది. కానీ, వీటిల్లో చాలా వరకూ ప్రభుత్వం, మంత్రులు, సీఎం పాత్ర చాలా తక్కువ. ఈవోలు, దేవాలయ బోర్డుల నిర్వాకాలే ఎక్కువ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నడుస్తోన్న ఈ కీలక సంవత్సరంలో ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇక ముందు మరింత జాగ్రత్తగా వుంటే మంచిది! గొడవ జరిగాక సద్దుమణిగించటం… ఎంతో కొంత డ్యామేజ్ చేసే తీరుతుంది. వివాదం చెలరేగకుండా వుండేలా చర్యలు వుండాలి.