కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా?

  లోపల భయపడిపోతూ పైకి మనం ఎంత ధైర్యంగా నటించినా ఏదో ఒక సందర్భంలో మన భయం బయటపడుతుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉందనే అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దు సమయం నుంచి తమ పార్టీ వంద సీట్లు గెలుచుకొని తిరిగి అధికారంలోకి వస్తుందంటూ టీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్.. వంద సీట్లు పైనే గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ సమయంలో దాదాపు అందరూ.. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం కష్టం కానీ.. అధికారంలోకి రావడం మాత్రం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. వార్ వన్ సైడ్ కాదు.. టీఆర్ఎస్ కు మహాకూటమితో నువ్వా నేనా అన్నట్టు పోరు తప్పేలా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని సర్వేలు అయితే మహాకూటమిదే పైచేయి అని తేల్చాయి. దీనికితోడు ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు. దీంతో ప్రజల్లో క్రమక్రమంగా మహాకూటమి కూడా అధికారంలోకి రావొచ్చనే అభిప్రాయం మొదలైంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేడి మొదలైన తరువాత కేటీఆర్ ఒక మాట పదేపదే చెప్తున్నారు. అదే 'టీఆర్ఎస్ ఒంటరిగా అధికారంలోకి రాకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా, అమెరికా వెళ్ళిపోతా'. కేటీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు అది ఆయనకి గెలుపుపై ఉన్న ధీమా అని సమర్ధించుకుంటున్నా.. కూటమి నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు అంటూ విమర్శించారు. మరికొందరైతే గెలిచినా, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే నాయకులు కావాలి కానీ.. ఓడిపోతే వదిలేసి విదేశాలు పోయే నాయకులు ఎందుకంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విమర్శల వర్షమే కేసీఆర్ మీద కూడా మొదలైంది. కేసీఆర్ మొన్నటి వరకు వంద సీట్లు గెలుస్తాం, మళ్ళీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ.. కూటమి నేతల మీద విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 'వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే.. నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పని చేస్త. లేకుంటే ఇంటికాడ రెస్ట్‌ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా' అని కేసీఆర్ అన్నారు. దీంతో కేటీఆర్ లాగే కేసీఆర్ కి కూడా ఓటమి భయం పట్టుకుందంటూ విమర్శలు మొదలయ్యాయి. కూటమి గెలుస్తుందని అర్ధమయ్యే కేసీఆర్.. ఓడిపొతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అంటున్నారు అంటూ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇలా ఓడిపోతే అమెరికా పోయేవాళ్లు, రెస్ట్ తీసుకునేవాళ్లు తెలంగాణకు అవసరమా అంటూ గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రద్దు సమయంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసి విపక్షాలకు భయం పుట్టించిన కేటీఆర్, కేసీఆర్.. ఇప్పుడు 'ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతా, ఓడిపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా' అంటూ విపక్షాలకు అస్త్రాలు అందించారు. మరి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు వారు కాన్ఫిడెన్స్ తో ఆ మాటలు అన్నారో లేక కూటమి నేతలు చెప్తున్నట్టు ఓటమి భయంతో ఆ మాటలు అన్నారో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో.

రంగంలో అగ్రనేతలు..ఏకంగా ఇంటికే వెళ్తున్నారు

  నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరి గడువు కావటంతో రెబల్స్ ని బుజ్జగించే పనిలో పడ్డారు అన్ని పార్టీల నేతలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా బరిలోకి దిగిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీ ఒక్క సీటును కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడానికి అహ్మద్‌ పటేల్‌,జైరాం రమేశ్‌, వీరప్ప మొయిలీ,డీకే శివకుమార్‌ వంటి హేమాహేమీలు దిగి వచ్చారు. వారు అసమ్మతి నేతల ఇంటికి నేరుగా వెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు అగ్ర నేతలు ఆయన ఇంటికి వెళ్లారు. ఇప్పటికే భిక్షపతి యాదవ్‌ను  జైపాల్‌రెడ్డి కలిశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నారు. దాంతో  ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌ పటేల్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులు భిక్షపతి యాదవ్‌ ఇంటికి వెళ్లి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బుజ్జగించారు. ఉన్నతమైన స్థానం ఇచ్చి గౌరవమిస్తామని హామీ ఇచ్చారు.అగ్రనేతలు రావటంతో భిక్షపతి కూడా మెత్తబడ్డారు. పెద్దలు మాట్లాడిన తీరు, ఇచ్చిన హామీ తనను సంతృప్తిపరిచాయని, నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని తెలిపారు.  మరోవైపు మేడ్చల్‌ నుంచి రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జంగయ్య యాదవ్ ను బుజ్జగించేందుకు జైరాం రమేశ్‌ ఆయన ఇంటికి వెళ్లారు. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని జంగయ్య యాదవ్‌ తెలిపారు. మల్కాజిగిరి నుంచి నామినేషన్‌ వేసిన సురేశ్‌ యాదవ్‌తో వీరప్ప మొయిలీ మాట్లాడారు. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్‌ నుంచి నామినేషన్‌ తిరస్కరణకు గురైన రాజు యాదవ్‌.. తాను దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా పనిచేస్తానని తెలిపారు. సూర్యాపేటలో నామినేషన్‌ వేసిన పటేల్‌ రమేశ్‌ రెడ్డి కూడా ఉపసంహరణకు అంగీకరించారు. పొత్తుల్లో భాగంగా సనత్‌నగర్‌ సీటును కోల్పోయిన మర్రి శశిధర్‌ రెడ్డి నివాసానికీ జైరాం రమేశ్‌ వెళ్లి సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్‌తో సమావేశమైన జైరాం... సోనియా సభ ఏర్పాట్లు, అసంతృప్తుల బుజ్జగింపులపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెబల్స్‌ అందరూ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మొత్తానికి అగ్రనేతలు దిగి రావటంతో బుజ్జగింపులు కొలిక్కి వచ్చాయి. రెబల్స్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఏకంగా వారి ఇళ్లకే వెళ్లడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి అని కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్నారు.

తెలంగాణాలో టీడీపీ తరుపున కొడాలి నాని ప్రచారం

  కొడాలి నానికి మొదటినుంచి నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. ముఖ్యంగా ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కొడాలి నాని మంచి స్నేహితుడు. నందమూరి కుటుంబంతో ఉన్న ఆ అనుబంధంతోనే అప్పుడు నానికి టీడీపీ గుడివాడ టికెట్ ఇచ్చారనే అభిప్రాయం ఉండేది. అయితే నాని గుడివాడలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకొని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయినా ఆయనకి నందమూరి కుటుంబం మీద అభిమానం ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. హరికృష్ణ మరణించిన సమయంలో ఓ వైవు బాధపడుతూనే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఓ స్నేహితుడిలా అండగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా హరికృష్ణ కుటుంబం మీద ఉన్న అభిమానం పోదని రుజువు చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాని హరికృష్ణ కుటుంబం కోసం తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమయ్యాయి. ఈ కూటమిలో పొత్తులో భాగంగా టీడీపీకి 14 స్థానాలు కేటాయించారు. వాటిలో కూకట్ పల్లి కూడా ఉంది. చంద్రబాబు కూకట్ పల్లి నుంచి అనూహ్యంగా హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దించారు. సుహాసిని గెలవాలని మహాకూటమి ఎంత బలంగా కోరుకుంటుందో.. కొడాలి నాని కూడా అంతే బలంగా కోరుకుంటున్నారట. హరికృష్ణ కూతురి గెలుపు కోసం తనవంతుగా ప్రచారం చేయాలని నాని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది. అయినా కొడాలి నాని మాత్రం తాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని నిజంగా ప్రచారం చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రత్యర్థులు. అలాంటిది టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత ప్రచారానికి వస్తా అంటే టీడీపీ ఒప్పుకుంటుందా? కష్టమే. మరోవైపు కొడాలి నాని కూడా ప్రచారానికి రావడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఆయన ప్రచారానికి రావాలనుకుంటున్నారన్న వార్తలు వస్తేనే.. నందమూరి అభిమానుల ఓట్ల కోసమే నాని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక తెలంగాణలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తే టీడీపీని పొగడాలి, కేసీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడాలి. దీనివల్ల టీడీపీ వ్యతిరేకంగా, కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటున్న వైసీపీకి కష్టాలు తప్పవు. మరి ఇన్ని ప్రతికూలతల నడుమ నాని కూకట్ పల్లిలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

పొన్నాలకి క్లియర్..మర్రికి షాక్‌.. జానాకు సస్పెన్స్‌

  తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్,టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమితో ఒక్కటయ్యాయిగాని సీట్ల సర్దుబాటు కోసం చాలా కాలం మదన పడ్డాయి. ఎట్టకేలకు టీడీపీ 14 ,టీజేఎస్ 8, సీపీఐ 3 , మిగలిన  స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడే అసలు తలనొప్పి మొదలైంది.సీట్లు సరే ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే దానిపై తర్జన భర్జన పడ్డాయి. నామినేషన్ వేసేందుకు ఇతర పార్టీలు సిద్ధమవుతున్నా కూటమి పార్టీల్లో సమన్వయము కుదర్లేదు.కూటమి విచ్చిన్నం అవుతుంది అనుకున్న తరుణంలో పలు చర్చల అనంతరం మొత్తానికి పార్టీలు తమ తొలి విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాతో కొందరు సీనియర్ నేతలు అవాక్కయ్యారు. తమ పేర్లు లేకపోవటంతో షాక్ కి గురయ్యారు. జాబితాలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు లేవు. పొన్నాల లక్ష్మయ్య తాను మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ స్తానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేదు.ఆ స్థానాన్ని పొత్తు భాగంగా టీజేఎస్ కి కేటాయిస్తున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పొన్నాల హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధిష్టానంతో చర్చలు జరిపారు.ఎంపీ టికెట్ ఇస్తామన్నా వద్దని జనగామ టికెట్ కోసం పట్టుబట్టారు. బీసీ నేత అందులోనూ,సీనియర్ నేత అవ్వటంతో ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని భావించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనగామ స్థానం విషయంలో రాజీ పడాల్సిందిగా కోదండరాంని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోదండరాం భేటీ అయ్యి చర్చలు జరిపారు. ఎట్టకేలకు కోదండరాం ఆ స్థానం విషయంలో తగ్గారు.దీంతో పొన్నాల కి లైన్ క్లియర్ అయింది. మర్రి శశిధర్ రెడ్డి ..మాజీ ముఖ్య మంత్రి కుమారుడు,న్యాయపోరాటాలతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసిన నాయకుడు.ఇలాంటి నేతకి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది.ఆయన పేరు కూడా రెండు జాబితాల్లో ప్రకటించలేదు.పైగా ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీ కి కేటాయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.దీంతో ఆయన డిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు.సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు తనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తులు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కనీసం మూడో జాబితాలోనైనా సనత్‌నగర్ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తారనుకుంటే అది జరగలేదు. కాంగ్రెస్ మూడో జాబితా విడుదలైన కాసేపటికే సనత్‌నగర్ నుంచి కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.దీనిపై స్పందించిన మర్రి శశిధర్‌రెడ్డి మూడో జాబితాలోనూ తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. నియోజకవర్గంలో తన కమిట్‌మెంట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఓ నిర్ణయానికొస్తానని శశిధర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిర్యాలగూడ విషయంలో కూడా సందిగ్దత వీడలేదు.మిర్యాలగూడ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఆయన కుమారున్నిబరిలో దింపాలని భావిస్తున్నారు.పొత్తులో భాగంగా ఆ స్థాన్నాన్ని టీజేఎస్ ఆశిస్తుంది.దీనిపై స్పష్టత రాకపోవటంతో ఆ స్థానాన్ని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఢిల్లీకి వెళ్లి మరీ జానారెడ్డి ప్రయత్నాలు చేశారు.కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని తేల్చేసిందట.ఇప్పటికే పొన్నాల కోసం జనగామ స్థానాన్ని త్యాగం చేసిన కోదండరాం మరో స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగాలేరని సమాచారం.దీంతో జానా రెడ్డి తన కుమారునికి టికెట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ టీజేఎస్ లో తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నారట. జేఏసీ లో కీలక భూమిక పోషించిన టీజేఎస్ నేత విద్యాధరర్ రెడ్డి కి టికెట్ ఇవ్వాలని కోదండరాం భావిస్తుంటే టీజేఎస్ లోనే ఉన్న తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్ రెడ్డికి ఇవ్వాలని జానారెడ్డి పట్టుబడుతున్నారట.మరీ ఈ ఇరకాటంలో ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.

టీఆర్ఎస్ కు ఓటేయమంటున్న బీజేపీ.!!

  తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బరిలో ఎన్ని పార్టీలు ఉన్నా.. అధికారం కోసం టీఆర్ఎస్, మహాకూటమి మధ్యే అసలు పోరు అనేది వాస్తవం. అసెంబ్లీరద్దుకి ముందు వరకు తెలంగాణ ఎన్నికల ఫలితం ఏకపక్షమే అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిందో.. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అధికారం కోసం టీఆర్ఎస్ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగుతుంది. కొన్ని సర్వేలు కూటమిదే అధికారమని కూడా చెప్తున్నాయి. దీంతో బీజేపీ ఆలోచనలో పడింది. తెలంగాణలో బీజేపీ అంతబలంగా లేకపోయినా ఒంటరిగా బరిలోకి దిగుతుంది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ అదంతా పైకి మాత్రమే. లోపల బీజేపీ వేరేలా ఆలోచిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యం మహాకూటమిని ఓడించడం. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవాలని టీఆర్ఎస్ ఎంతబలంగా కోరుకుంటుందో.. అంతకంటే బలంగా బీజేపీ కూడా కోరుకుంటోంది. బీజేపీకి కాంగ్రెస్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ప్రధాన శత్రువే. ఇప్పుడు టీడీపీ కూడా అదేస్థాయిలో శత్రువైంది. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వస్తానంటే బీజేపీ ఊరుకుంటుందా?. అందుకే కూటమికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేయడానికైనా సిద్దపడింది. ప్రస్తుతం బీజేపీ కొన్ని స్థానాల్లో ప్రచారం చేస్తూ కేడర్ కి భిన్న సంకేతాలు ఇస్తుందట. గెలుస్తుంది అనుకుంటేనే బీజేపీకి ఓటేయండి లేదంటే టీఆర్ఎస్ కి ఓటేయండి అని చెప్తుందట. దీనివల్ల కూటమిని ఓటమికి దగ్గర చేయొచ్చని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య పొత్తుందని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ కావాలనే బలం లేని అభ్యర్థులను నిల్చోబెడుతుందని పలువురు ఆరోపించారు. ఆ ఆరోపణల్లో నిజమెంతో ఇంకా బయటికి తెలియలేదు కానీ.. కూటమిని ఓడించాలని బీజేపీ టీఆర్ఎస్ కి ఓటేయమని చెప్తుంది అంటూ కొత్త ఆరోపణలు మొదలయ్యాయి. ఒకవేళ నిజంగా బీజేపీ అలా చేస్తే మాత్రం బీజేపీకే నష్టమనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ సహకరిస్తే బీజేపీ మూడు, నాలుగు సిట్టింగ్ స్థానాల్లో గెలుస్తుందేమో.. కానీ మిగతా స్థానాల్లో కూటమి ఓటమి కోసం టీఆర్ఎస్ కి ఓటు వేయిస్తే అసలు తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదం. అసలే బీజేపీకి అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి బలమైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న కాస్త ఓటుబ్యాంకు కూడా టీఆర్ఎస్ కి పడితే.. బీజేపీ ఓటు శాతం దారుణంగా పడిపోతుంది. దీనితో పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బ తినడంతో పాటు.. ప్రజలకు బీజేపీ మీద నమ్మకం పోతుంది. మరి భవిష్యత్తులో పార్టీకి జరిగే భారీ నష్టం గురించి ఆలోచించకుండా టీఆర్ఎస్ కు సహకరించి బీజేపీ రాంగ్ స్టెప్ వేస్తుందా?. చూద్దాం ఏం జరుగుతుందో.

టీఆర్‌ఎస్‌ సెంటిమెంట్ ను మార్చిన జీవన్‌రెడ్డి

  టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతి విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతారు.ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లికి వచ్చి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఎన్నికలకు కూడా నామినేషన్ వేసేముందు కోనాయిపల్లిలో పూజలు జరిపించి నామినేషన్ వేశారు.అయితే ఈ సెంటిమెంట్ నామినేషన్స్ కి మాత్రమే పరిమితం కాదు చివరికి అభ్యర్థుల ప్రకటనలోనూ ఫాలో అవుతున్నారు కేసీఆర్‌. ఎన్నికల్లో కేసీఆర్‌ మొట్ట మొదటి టికెట్ కేటాయించిన వారు ఓడిపోతారనే సెంటిమెంట్ ఉండేది.ఆలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో దిగారు.అయితే, ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ మొట్టమొదటి టికెట్‌గా ప్రకటించిన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్‌ ఓటమి పాలయ్యారు.2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు.ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్‌ఎస్‌ అధినేత తొలి టికెట్‌ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారానికి 2014 ఎన్నికల ఫలితాలే అడ్డుకట్ట వేశాయి. 2014 ఎన్నికల్లో ఆర్మూర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన నియోజకవర్గం ఇన్‌చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.2013 లో టీఆర్‌ఎస్‌ 13వ ఆవిర్భావ సభను జీవన్‌రెడ్డి విజయవంతంగా నిర్వహించిందనుకు కేసీఆర్‌ ఆయన ఇంటికి వెళ్లి మరీ టీఆర్‌ఎస్‌ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్‌ అసెంబ్లీ స్థానానికి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు.మొత్తానికి జీవన్ రెడ్డి గెలిచారు.దీంతో జీవన్ రెడ్డి మొదటి టికెట్‌ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే సెంటిమెంట్ కి స్వస్తి పలకడంతో ఇప్పడు జరగనున్న ఎన్నికలకు సెంటిమెంట్ ని ఫాలో అయ్యే కేసీఆర్‌ మొట్టమొదట బీ-ఫారం జీవన్ రెడ్డి కే ఇచ్చారు.మరి ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం..!!

టీడీపీ అభ్యర్థి రేవూరి పోటీ నుంచి తప్పుకుంటారా?

  కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. అదేవిధంగా టీడీపీ కూడా 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. దీంతో ఈ 74 స్థానాల మీద స్పష్టత వచ్చింది ఇక మిగతా స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టిపెడితే చాలు అనుకున్నారు. కానీ కొందరు ఆశావహులు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో కూడా ఇంకా ఆశ పోగొట్టుకోవట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఒక స్థానం విషయంలో పట్టుబడుతున్నారు. అదే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం. టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో  వరంగల్‌ పశ్చిమ కూడా ఉంది. ఈ స్థానం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికే వరంగల్‌ పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు హన్మకొండలోని డీసీసీ భవన్‌లో రెండు రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి విదితమే. పొత్తులో భాగంగా ఆ సీటుని కాంగ్రెస్ టీడీపీకి కేటాయించింది. టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. అయినా కాంగ్రెస్ నేతలు పట్టువీడకుండా రాజేందర్‌రెడ్డికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు దీక్షలో పాల్గొన్న నేతలను సంప్రదించారు. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ తో పాటు మిగతా నాయకులతో చర్చించారు. న్యాయం చేయాలని నాయకులు,కార్యకర్తలు వి.హెచ్ ను చుట్టుముట్టారు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్, బీ-ఫాం కేటాయింపు తర్వాతే దీక్ష విరమిస్తామని కట్ల శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే యత్నంచేసినా స్వీయ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న నేతలు డీసీసీ భవన్‌ నుంచి బయటకు రాలేదు. అనంతరం వి.హెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజేందర్‌రెడ్డి అన్ని విధాలా సేవలందించారన్నారు. ఆయనకు పశ్చిమ టిక్కెట్ దక్కకపోవడం సమంజసం కాదన్నారు. ఈ విషయమే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా, టీడీపీ అధినేత చంద్రబాబు, టీటీడీపీ అధ్యక్షుడు రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వి.హెచ్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నేతలు వినలేదు. రాజేందర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాపం వి.హెచ్ చేసేదేమి లేక ఉత్తమ్‌, కుంతియా, చంద్రబాబు, రమణలతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇది ఇప్పుడు ఎంతవరకు సాధ్యం. టీడీపీ ఇప్పటికే వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ మొదటినుంచి టిక్కెట్ల విషయంలో పెద్దగా పట్టుబట్టలేదు. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి ప్రయోజనాల దృష్ట్యా 14 స్థానాలతో సరిపెట్టుకుంది. మరి ఇప్పుడు సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి నేత స్థానాన్ని అడిగితే అంగీకరిస్తుందా?. రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారా? అంటే అనుమానమే. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక్కసారి అభ్యర్థిని మార్చడం మొదలుపెడితే మిగతా స్థానాల్లోని ఆశావహులు కూడా ఇదే విధంగా పట్టుబట్టే అవకాశముంది. దీంతో ఇన్నాళ్లు చర్చలు జరిపి, కసరత్తులు చేసి, సీట్ల కేటాయింపు చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అదీగాక ఇప్పటికే టిక్కెట్ల విషయంలో కూటమికోసం టీడీపీ చేసిన త్యాగాలు కాంగ్రెస్ కి తెలుసు. వీటినిబట్టి చూస్తుంటే కాంగ్రెస్ వరంగల్‌ పశ్చిమ అభ్యర్థిని మార్చడానికి సుముఖుత వ్యక్తం చేయకపోవొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రాజేందర్‌రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో అని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

బాబర్ బడి గురించి విన్నారా!

  పశ్చిమబెంగాల్‌ల్లో ఓ మారుమూల ఊరు బబ్తా. ఆ ఊళ్లో ‘బాబర్ ఆలీ’ అనే చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతనికి చదువంటే ఇష్టం. అందుకనే కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి నడిచి ఓ బడికి వెళ్లి చదువుకునేవాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తన తోటి పిల్లలంతా చదువు మీద దృష్టి పెట్టకుండా ఆడపాటల్లో గడిపేయడం అతన్ని ఆలోచింపచేసింది. ఆ తర్వాత అతను ఏం చేశాడు అన్నది ఓ చరిత్ర!   బాబర్‌ ఆలీ ఐదో తరగతి చదువుకుంటుండగా... చదువుకునే అవకాశం లేని తన తోటి పిల్లలకి కూడా ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇంటి ముందర ఉన్న జామచెట్టు కింద నలుగురినీ పోగేసి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. తన చెల్లెలుతో సహా ఓ ఎనిమిది మంది పిల్లలు అతని దగ్గర చదువుకోవడం మొదలుపెట్టారు.   మొదట్లో బాబర్‌ ఏదో సరదాగా ఈ ఇంటిబడిని మొదలుపెట్టాడు. కానీ ఇతరులకి చదువు నేర్పడంలో ఉన్న తృప్తి ఆ పిల్లవాడికి ఓ లక్ష్యాన్ని ఏర్పరిచింది. తన ఊళ్లో చదువుకోని ప్రతి ఒక్కరికీ, తనకి తెలిసిన విద్యని నేర్పాలన్న తపన మొదలైంది. దాంతో ఇంటింటికీ తిరిగి పిల్లలని తన బడికి పంపమని ప్రాథేయపడటం మొదటుపెట్టాడు. తన చేతిలో ఉన్న చిల్లర డబ్బుల్తోనే పిల్లలకి కావల్సిన చాక్‌పీసులు, పుస్తకాలు కొనిపెట్టే ప్రయత్నం చేశాడు. పిల్లలని బడికి ఆకర్షించేందుకు స్వీట్లు కొనిపెట్టేవాడు. బాబర్ తండ్రి చాలా చిన్న ఉద్యోగి. మొదట్లో తన పిల్లవాడి తపన ఆయనకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే బాబర్‌ లక్ష్యాన్ని గ్రహించాడో... తను కూడా తనకి చేతనైన సాయం చేయడం మొదలుపెట్టాడు.   బడి నడిపేందుకు బాబర్ కుటుంబం నుంచి పూర్తి సహకారం వచ్చేసింది. కానీ గ్రామస్తులకి మాత్రం అతని మీద చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఏ స్వార్థమూ లేకుండా తమ పిల్లలకి అతను చదువెందుకు చెబుతున్నాడు? కొంపదీసి తమ పిల్లలని వేరే మతంలోకి కానీ మార్చడు కదా? లాంటి సందేహాలతో అతన్ని ఛీదరించుకోవడం మొదలుపెట్టారు. కానీ బాబర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రోజూ ఠంచనుగా తన బడి నుంచి వచ్చిన వెంటనే ఇంటిబడిని మొదలుపెట్టేసేవాడు. ఒకోసారి అతనికి ఇంత తిండి తినే అవకాశం కూడా ఉండేది కాదు.   2002లో బాబర్ మొదలుపెట్టిన ఈ చిన్న బడి క్రమంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది. 2009లో బీబీసీ పత్రికలో అతని మీద ఒక కథనం వచ్చింది. ‘ప్రపంచంలోనే అతి చిన్న వయసు హెడ్‌మాస్టర్’ అంటూ ఆ కథనం ప్రకటించింది. దాంతో బాబర్‌ బడికి కావల్సినంత ప్రచారం దక్కింది. అతను మరింతమంది పిల్లలని చేర్చుకునేందుకు, కొత్త బడిని నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఇక కర్ణాటకలోని ఇంటర్మడియట్‌ పాఠ్యపుస్తకాలలో బాబర్‌ గురించి ఓ పాఠమే ఉంది.   ఇప్పుడు బాబర్ నేర్పుతున్న బడిలో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి చదువు చెప్పేందుకు 10 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఆరుగురు టీచర్లు ఒకప్పుడు బాబర్ బడిలో చదువకుని పైకి వచ్చినవారే! అలా ఓ జాబచెట్టు కింద మొదలైన బాబర్ బడికి ఇప్పుడు ‘ఆనంద శిక్షానికేతన్‌’ అన్న పేరుతో అద్భుతాలు సృష్టిస్తోంది. చదువు సంగతి అలా ఉంచితే, నలుగురికీ మంచి చేయాలన్న ఆలోచన ఉంటే... ఎంతటివారైనా అద్భుతాలు సాధించగలరని నిరూపిస్తోంది.            - నిర్జర.         

'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో 'ఆపరేషన్ బి'.. టీడీపీకి కష్టాలు తప్పవా?

  గతంలో నటుడు శివాజీ.. ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఏపీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని పరిణామాలు చూసి 'ఆపరేషన్ గరుడ' నిజమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు 'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో ఏపీని టార్గెట్ చేస్తూ మరో ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ ఆపరేషన్ గురించి చెప్పింది శివాజీ కాదు.. ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ. తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ గరుడ' ఫెయిల్ అయ్యేసరికి 'ఆపరేషన్ బి' పేరుతో త్వరలోనే మరో ఆపరేషన్ ప్రారంభమవుతుందని చెప్పి సంచలనం రేపారు. పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని అన్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు.. ఈసారి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై జరుగుతాయని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు, 24 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత, మరియు ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ మోహన్,బొడే ప్రసాద్,బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేందరప్రసాద్,కొమ్మాలపాటి శ్రీధర్, సిద్ధా రాఘవరావు.. ఎంపీ లు సీఎం రమేష్, మురళీమోహన్, విజయవాడ లోని ప్రముఖ హోటల్ డీవీ మానర్ యజమాని, KL యూనివర్సిటీ అధినేత పై త్వరలో ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం పీఎంవోలో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని, తనకు అందిన సమాచారాన్నే బయటపెడుతున్నానని అన్నారు. ఈ విషయంపై తనను విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో బాబు చురుగ్గా పాల్గొనకుండా ఉండేందుకే ఈ దాడులు జరగుతాయని అన్నారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని, గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తమ్మారెడ్డి అన్నారు. చూద్దాం మరి 'ఆపరేషన్ బి' ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో.

పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా?

  మైనింగ్ మాఫియాకి పర్యాయపదం లాంటి వ్యక్తి గాలి జనార్ధన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన్ని పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారికి జనార్ధన్ రెడ్డి కోటి లంచం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఈ డీల్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో  లేకుండా పోయినట్టుగా పోలీసులు గుర్తించారు. జనార్దన్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే సోదాలు నిర్వహించిన పోలీసులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. జనార్ధన్ రెడ్డి ఇంట్లో గోడల మధ్యలో రహస్య లాకర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా జనార్ధన్‌రెడ్డి అసిస్టెంట్ అలీఖాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హైద్రాబాద్, బెంగుళూరు, ఢిల్లీలో జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. జనార్ధన్ రెడ్డి మిత్రుల ఇళ్లలో కూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇంతవరకు గాలి జనార్ధన్ రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన హైద్రాబాద్ లో ఉండి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం దేశం వదిలి వెళ్ళిపోయుంటాడని అభిప్రాయపడుతున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కింగ్ గా జనాలకి ఎలా తెలుసో బీజేపీ నేతగా కూడా అలానే తెలుసు. అయితే గాలి జనార్ధన్ రెడ్డి వ్యవహారం వల్ల పార్టీకి మచ్చ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ.. బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై భిన్నంగా స్పందిస్తున్నారు. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు తప్ప మిగిలిన విషయాలు తనకు తెలీదని, మాతో ఎవరూ ఈ విషయంపై మాట్లాడలేదని యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, అందువలన ఈ విషయంపై పూర్తి వివరాలు తాము సేకరించలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. మరో బీజేపీ నేత, గాలి ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే శ్రీరాములు కూడా ఇంచుమించు ఇలాగే స్పందించారు. ఈ విషయం గురించి తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాతే తెలుసుకున్నానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీరాములు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల స్పందనతో గాలి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో గాలి జనార్ధన్ రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా కూడా పనిచేసారు. ఇప్పటికి బళ్లారిలో గాలి కుటుంబానికి మంచి పట్టుంది. ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థికంగా తోడుంటారని అంటుంటారు. ఎన్నికల సమయంలో బీజేపీ వ్యక్తి అయిన గాలి జనార్ధన్ రెడ్డి.. కర్ణాటకలో ఎన్నికలు, ఉప ఎన్నికలు అయిపోయి.. ఇలా కేసులో దొరికిపోయి పారిపోతే పార్టీకి మచ్చ వస్తుందని.. ఇప్పుడు బీజేపీ వ్యక్తి కాకుండా పోయాడా? అంటూ గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం చెప్పినదాని ప్రకారమే కర్ణాటక బీజేపీ నేతలు గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఇలా స్పందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచుతుందా?

  ఓవర్ కాన్ఫిడెన్స్.. కొన్నిసార్లు తీసుకెళ్లి కొండమీద కూర్చోబెడితే, కొన్నిసార్లు కొంపముంచుతుంది. ప్రస్తుతం ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కేసీఆర్ కొంపముంచేలా కనిపిస్తోంది. 2014 లో కేసీఆర్ గెలిచి సీఎం అయ్యారు. తెలంగాణలో ఎదురులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అనుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ 8 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతలో ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపించారు. అధికారం మళ్ళీ తమదే అని ధీమాగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచే పరిస్థితులు ఒక్కొక్కటిగా కేసీఆర్ కి వ్యతిరేకంగా మారడం మొదలు పెట్టాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీంతో కూటమి రూపంలో కేసీఆర్ కి బలమైన ప్రత్యర్థి వచ్చింది. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు తెలంగాణలో కాంగ్రెస్ అంతోఇంతో బలంగా ఉంది కానీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అనే అభిప్రాయం ఉండేది. కానీ కూటమి బలంతో కాంగ్రెస్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా టీడీపీ కేడర్ బలం కాంగ్రెస్ కి కలిసొస్తుంది. సర్వేలు కూడా మహాకూటమికే విజయావకాశాలు ఎక్కువున్నాయని చెప్తున్నాయి. ఇదే కేసీఆర్ కి మింగుడుపడటం లేదు. దీనికి తోడు కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్న మరో అంశం గ్రామాల్లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎదురవుతున్న నిరసన సెగ. కేసీఆర్ తాను సర్వేలు చేయించుకున్నాను. అన్ని సర్వేల్లో వందకి పైగా సీట్లు వస్తాయని తేలింది అన్నారు. తమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజలు తెరాస ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. కారు గుర్తు కనిపిస్తే చాలు ఓట్లు గుద్దేస్తారు అనుకున్నారు. అందుకేనేమో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా.. 'కేసీఆర్ బ్రాండ్ తో ఈజీగా గెలవొచ్చు' అనే కాన్ఫిడెన్స్ తో మార్చకుండా దాదాపు వారినే అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్సే కొంపముంచింది అనిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ఈ నాలుగున్నరేళ్లలో ఏం చేసారని ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు? అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. కొందరు నేతలని అయితే అసలు గ్రామాల్లోనే అడుగు పెట్టనివ్వట్లేదు. అభ్యర్థులను మార్చలేక, ఈ అభ్యర్థులతో ఎలా గెలవాలో తెలియక కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. కేసీఆర్ బలమైన నేత. ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. మరి అలాంటి కేసీఆర్ రాంగ్ స్టెప్ ఎలా వేశారు?. ఆయన పక్కన ఉన్నవారే మీ ఫోటో ఉంటే చాలు అభ్యర్థి ఎవరైనా ప్రజలు కళ్ళు మూసుకొని కారు గుర్తుకి ఓటేస్తారని ఆయనని ఇలా రాంగ్ స్టెప్ వేసేలా చేసారా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన మెప్పు కోసం ఎన్నైనా చెప్పి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఎమ్మెల్యేల మీద, పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నిజం చెప్తేనే కదా ఆయనకి తెలిసేది. అదీగాక ఆయన మీడియాకి కూడా అంత స్వేచ్ఛ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియాకి స్వేచ్ఛ ఇస్తేనే కదా మంచి చేసినప్పుడు పొగడ్త.. తప్పు చేసినప్పుడు విమర్శ చేసి ప్లస్ లు, మైనస్ లు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు అనుకోని ఏం లాభం. నెలలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికల్లో కేసీఆర్ ఒకప్పటిలా దూసుకుపోతారో లేదో చూడాలి.

తెరాసకు చెక్.. కోదండరామ్ తో కాంగ్రెస్ ప్లాన్ అదేనా?

  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రముఖుల్లో కోదండరామ్ ఒకరు. ఈ తరం తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ లాంటి నేతలు ఉద్యమ సమయంలో కోదండరామ్ ను ఎంతలా పొగిడారో అందరికీ తెలిసిందే. అయితే తరువాత పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యారు. తరువాత కోదండరామ్ పోరాట లక్ష్యం కూడా మారిపోయింది. 'మనం పోరాడి తెలంగాణ సాధించినది దీనికోసం కాదు.. కేసీఆర్ పాలన సరిగా లేదు.. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదు' అంటూ కోదండరామ్ మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. కోదండరామ్ కూడా సీట్ల సర్దుబాటు గురించి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్నారు. ఒక వైపు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతుంటే.. మరో వైపు కోదండరామ్ తో కాంగ్రెస్ ఓ ప్లాన్ వేస్తుందట. అదేటంటే కోదండరామ్ తో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో.. కేసీఆర్ కి వ్యతిరేకంగా కోదండరామ్ తో విమర్శలు చేయించాలని చూస్తోందట. వేరే నేతలు ఎవరు విమర్శలు చేసినా తెరాస వెంటనే తిప్పికొడుతుంది.. విరుచుకుపడుతుంది. అదే కోదండరామ్ అయితే తెరాస మిగతా నేతల మీద విరుచుకుపడినట్టు పడలేదు. హద్దుమీరి మాటలు అనలేదు. ఒకవేళ అన్నా అది తెరాస కే మైనస్. తెలంగాణ కోసం పోరాడిన నేతగా, వివాదాలకు దూరంగా ఉండే నేతగా, సౌమ్యుడుగా  కోదండరామ్ అంటే ప్రజల్లో సదాభిప్రాయం ఉంది. మరి అలాంటి కోదండరామ్ మీద తెరాస నోరుజారితే మొదటికే మోసం వస్తుంది. మొత్తానికి తెరాసకి చెక్ పెట్టడానికి కోదండరామ్ అనే అస్త్రాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకురాబోతుంది అనమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

పదిమంది సీనియర్ నేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్.!!

  ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణలో తెరాసను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీడీపీ, టిజెఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు ఇలా అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలతో చర్చల మీద చర్చలు జరిపి.. ఆచితూచి అడుగులు వేసి.. పార్టీలు సంతృప్తి చెందేలా సీట్ల లెక్క తేల్చింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలోనూ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గాల్లో రిపోర్ట్ లు తెప్పించుకొని, ముఖ్య నేతలతో చర్చింది అభ్యర్థుల ఎంపిక జాగ్రత్తగా చేస్తుంది. అయితే అభ్యర్థులను ప్రకటించిన తరువాత తెరాసలో లాగా అసంతృప్తి సెగ తగలకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త చర్యలు చేపట్టింది. తెరాసలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తి సెగ ఎంతలా తగిలిందో తెలిసిందే. పలు సీనియర్ నేతలు పార్టీని వీడారు.. కొందరు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జానారెడ్డి, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, విజ‌య‌శాంతి ఇలా సుమారు పదిమంది ముఖ్య నేతలను రంగంలోకి దింపనుందట. వీరికి ఒక్కొక్కరికి 10 నుంచి 15 నియోజకవర్గాలు అప్పగిస్తారు. అభ్యర్థుల ప్రకటన జరిగిన వెంటనే ఈ నేతలు ఆ నియోజకవర్గాల్లోని అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడతారు. టిక్కెట్లు రాలేద‌ని బాధ‌ప‌డొద్ద‌ని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ ప‌ద‌వుల‌లో ప్రాధాన్య‌త కల్పిస్తామ‌ని, ఇత‌ర మార్గాల ద్వారా కూడా పార్టీ నుంచి మేలు జ‌రుగుతుంద‌ని బుజ్జ‌గింపులు చేసి.. వారు పార్టీ మారకుండా, రెబెల్స్ గా పోటీచేయకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారన్నమాట. చూద్దాం మరి కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

ఏంటో ఈ జోక్యం.. 'సీబీఐ'నే కాదు 'ఆర్బీఐ'ని కూడా వదలని కేంద్రం

  గుర్రం చేసే పని గుర్రం చేయాలి.. గాడిద చేసే పని గాడిద చేయాలి. అలాకాకుండా ఒకరి పనిలో ఒకరు తలదూరిస్తే చివరికి వారి పని అయిపోతుంది. ప్రస్తుతం కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలే సీబీఐ పనితీరులో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న కేంద్రానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూపంలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. తాము టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంటే కేంద్రం మాత్రం టీ-20 క్రికెట్ తరహా నిర్ణయాలను తీసుకుంటున్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య అన్నారు. తాజాగా ఏడీ ష్రాఫ్ మెమోరియల్ స్మారకోపన్యాసాన్ని ఆచార్య ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ నిర్ణయాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోతున్నదంటూ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఈ తరహా మోసాలకు ఆర్బీఐ వంటి నియంత్రిత సంస్థలు బాధ్యత వహించట్లేదని, రాజకీయ నాయకుల్నే ప్రజలు దోషులుగా చూస్తున్నారని జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు జైట్లీకి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతీ విదితమే. దీనిపై విఠల్ ఆచార్య స్పందిస్తూ ఆర్బీఐకి అసలు స్వేచ్ఛ ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నియంత్రణ కోసం ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సిందేనన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ, యాజమాన్య మార్పులు, బోర్డుల్లో డైరెక్టర్ల నియామకాలు, లైసెన్సుల రద్దు, విలీనాలు, అమ్మకాల్లో తీర్మానాలు వంటి అంశాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయమై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పరోక్షంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఇది కుదరడం లేదని ఆచార్య సంకేతాలిచ్చారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల వ్యవహారంపైనా స్పందిస్తూ.. పర్యవేక్షణ, నియంత్రిత ప్రమాణాల్లో రాజీ పడాల్సి వస్తున్నదని ప్రభుత్వ పెద్దల జోక్యాన్ని ఎండగట్టారు. చివరకు ఆర్బీఐ ద్రవ్యవిధాన నిర్ణయాల్లోనూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పేరుతో తలదూర్చడాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏమాత్రం మంచివి కావంటూ ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవించకపోతే ఆర్థిక మార్కెట్లకు కష్టాలు తప్పవన్నారు. ఇప్పటికే సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం వంటివాటిల్లో కేంద్రం తల దూరుస్తుందని విమర్శలు వస్తున్న వేళ.. ఆర్బీఐ నిర్ణయాలలోనూ కేంద్రం తల దూరుస్తుందని తెలియడంతో ఈ విమర్శలు మరింత పెరిగేలా ఉన్నాయి.

సీమాంధ్రులపై కేటీఆర్ ప్రేమ.. నిజమెంత?

  తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెరాస 100 సీట్లకు పైగా సాధించి మళ్ళీ తామే అధికారం చేపడతామని ధీమాతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైంది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో 'తెరాస వర్సెస్ మహాకూటమి' పోరు నువ్వా నేనా అన్నట్టు సాగేలా కనిపిస్తోంది. దీంతో తెరాస.. మహాకూటమి మీద మాటల యుద్ధం మొదలుపెట్టింది. 'కాంగ్రెస్ సిగ్గులేకుండా టీడీపీ తో పెట్టుకుంది. మహాకూటమి గెలిస్తే జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం వస్తుంది'. ఇలా తెరాస నేతలు ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని సహించలేక.. గతంలో లాగా మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చాలనే ఉద్దేశంతో.. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ శృతిమించిన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా అవే సెంటిమెంట్ మాటలా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేసారు. ఇక ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వారు.. తెరాస తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలే గతంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తే తెలంగాణలోని కంపెనీలు ఏపీకి తరలిపోతాయంటూ వ్యాఖ్యలు చేసి.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురైన తెరాస నేతలు.. ఎన్నికల వేల చంద్రబాబు, ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ వ్యాఖ్యలు చేసి ఇంకా ఆగ్రహం తెప్పించారు. అయితే ఏమైందో ఏంటో సడెన్ గా తెరాస యూ టర్న్ తీసుకుంది. 'సీమాంధ్రులకు సోదరుడిలా అండగా ఉంటా.. అమరావతి నిర్మాణానికి వందకోట్లు ఇవ్వాలనుకున్నాం.. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారు.. హరికృష్ణ మరణసమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించిందో చూసారుగా'.. అంటూ ఏపీ మీద, ఏపీ ప్రజల మీద తమకు చాలా ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం చేసారు కేటీఆర్. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతోనే కేటీఆర్ లేనిప్రేమను ఒలకపోస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో సెటిలర్లు ఎక్కువుగా ఉంటారు. వీళ్ళు అనేక నియోజక వర్గాల్లో గెలుపుని ప్రభావితం చేయగలరు. వారిలో ఎక్కువగా టీడీపీని, చంద్రబాబుని అభిమానించే వారుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించారో ఏంటో.. కేటీఆర్ ఇప్పుడు వారి మీద ప్రేమ చూపిస్తున్నారనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మొన్నటి వరకు తెరాస నేతలు చంద్రబాబు మీద విరుచుకు పడితే కేటీఆర్ మాత్రం ఆచితూచి అడుగులు వేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారనే చంద్రబాబుపై మా కోపం.. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు పాలించాలనేదే మా ధ్యేయం అన్నారు. అంతేనా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వాలనుకున్నారట. కానీ కేంద్రం మట్టి, నీరు తప్ప ఏమివ్వట్లేదు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఇస్తే బాగోదని ఆగిపోయారట. కాంగ్రెస్, బీజేపీ హవా ఉండకూడదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలి.. అన్నదమ్ముల్లా కలిసుండాలి అని కేటీఆర్ అన్నారు.. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని వీరు కూడా ఇవ్వడం మానేశారంట!!.. ఇదేం లాజిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు.. కానీ ప్రత్యేకహోదా వస్తే తెలంగాణ కంపెనీలు ఏపీకి తరలిపోతాయనే అపోహ ఎందుకు కలిగించారు?.. తెలంగాణ ఏర్పడి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆంధ్రా పెత్తనం అని ఎందుకు అంటున్నారు? ఏపీ సీఎం మీద శృతిమించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయం దగ్గర పడటమే.. సెటిలర్ల విషయంలో కేటీఆర్ యూ టర్న్ తీసుకోవడానికి కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ పై దాడి వెనుక నిజంగానే టీడీపీ హస్తముందా?

తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఒక విషయంపై విపరీతమైన రచ్చ జరుగుతుంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడి. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే ఓ యువకుడు సెల్ఫీ కోసమంటూ జగన్ దగ్గరికి వచ్చి.. తన వెంట తెచ్చుకున్న కోడి పందాలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. జగన్ ప్రాథమిక చికిత్స చేసుకొని.. నార్మల్ గానే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇక అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మారిపోయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా టీడీపీ ప్రభుత్వం మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. కొందరు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ దాడి జరిగిందంటే.. ఇంకొందరేమో అసలు ఈ దాడి చేయించిందే టీడీపీ, ఈ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. ఇక మరి కొందరైతే ఆ కత్తికి విషం పూసి పొడిచారేమో అంటూ కొత్త అనుమానాలు క్రియేట్ చేసి పార్టీ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేసారు. అంతేనా జగన్ భుజానికి గాయం లోతు విషయంలోనూ కన్ఫ్యూజన్. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ లో చికిత్స చేసిన డాక్టర్లు జగన్‌ ఎడమ చేతికి అర సెంటీమీటరు లోతున భుజానికి గాయమైందని చెప్తే.. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్లు మాత్రం జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో వైజాగ్ లో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు.. హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.     సరే ఇదంతా పక్కన పెడితే.. అసలు ఈ దాడికి కారణం టీడీపీ నే అని వైసీపీ బలంగా ఆరోపణలు చేస్తోంది. కానీ ఆరోపణల్లో నిజమెంత?. నిందితుడు శ్రీనివాస్ వెయిటర్ గా పనిచేస్తున్న హోటల్ ఓనర్ టీడీపీ సానుభూతి పరుడు అన్నారు. కానీ ఆ ఓనర్ మాత్రం తాను వైసీపీ అభిమానినని మీడియాతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతెందుకు నిందితుడు శ్రీనివాస్ కూడా జగన్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. నిందితుడి సోదరుడే స్వయంగా మీడియా ముందు చెప్పాడు. 2018 న్యూ ఇయర్ సందర్భంగా నిందితుడు ఒక ఫ్లెక్సీ పెట్టాడు. అందులో అతని ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉంది. ఈ ఫ్లెక్సీ ఫోటో కూడా నిందితుడి సోదరుడి ద్వారా బయటికి వచ్చింది. కానీ ఎవరో ఆ ఫ్లెక్సీ ఫోటోని కూడా మార్ఫ్ చేసారు. ఒక దానిలో జగన్ ప్లేస్ లో చంద్రబాబు ఫోటో.. మరోదానిలో జగన్ ప్లేస్ లో లోకేష్ ఫోటో పెట్టారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు చూసి కొందరు కార్యకర్తలు ఆందోళన, మరికొందరు నిరసన వ్యక్తం చేసారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన నాయకులూ కూడా రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే టీడీపీ కూడా వాటిని అంతేస్థాయిలో తిప్పికొడుతోంది. ఎయిర్‌పోర్ట్‌ లో స్థానిక పోలీసులు కాదు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ఉంటారు.. వారి కళ్ళుగప్పి నిందితుడు కత్తి ఎలా లోపకి తీసుకెళ్లాడు?.. తనపై దాడి జరిగిన వెంటనే జగన్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా, వారికి సమాచారం తెలపకుండా తన మానాన తాను హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోయారు? వైజాగ్ లో స్వల్ప గాయం హైదరాబాద్ వెళ్ళాక పెద్దగా ఎలా అయిందంటూ టీడీపీ నేతలు పలు అనుమానాలు చేసారు. అంతేకాదు గతంలో శివాజీ.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఒక ముఖ్య నేతపై ఇలా ప్రాణహాని లేని దాడి జరిపి అల్లర్లు సృష్టిస్తారు అన్నారు. శివాజీ చెప్పినట్టే దాడి జరగడంతో ఇది ఆపరేషన్ గరుడలో భాగమే అని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఆపరేషన్ గరుడ కూడా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని ఆరోపిస్తుంది. దీంతో అసలు ఈ దాడి ఏంటో? ఈ దాడి వెనకున్న డ్రామా ఏంటో అర్థంకాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు.     సరే కాసేపు ఈ దాడి వెనుక టీడీపీ ఉంది అనుకున్నాం. కానీ ఈ దాడి వల్ల టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటని అడిగితే అందరి సమాధానం మౌనం. ఒక నాయకుడి మీద దాడి జరిగితే ఆ దాడి వల్ల ప్రజల్లో ఎంతోకొంత సానుభూతి వస్తుంది. పోయి పోయి ఒక పార్టీ, ప్రత్యర్థి పార్టీ నాయకుడి మీద ఇలాంటి దాడి చేసి సానుభూతి పెంచుతుందా? అంటే అనుమానమే. మరి టీడీపీ మాత్రం ఇంత సిల్లీ దాడి ఎలా చేస్తుంది?. జగన్ ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలు కవర్ చేసారు. వందల మీటింగులు పెట్టారు. వేల కిలోమీటర్లు నడిచారు. అయినా జగన్ మీద ఈగ కూడా వాలలేదు. కానీ టైట్ సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్ట్‌లో అంత సిల్లీగా దాడి ఎలా జరిగింది?. నిందితుడు అసలు సిబ్బంది కళ్ళు గప్పి ఆ కత్తి ఎలా తీసుకెళ్లాడు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు.. అక్కడ ఉండే సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది నిర్లక్ష్యం అవుతుంది. అదీగాక నిందితుడు కూడా తాను జగన్ అభిమానిని.. ఆయనని సీఎం చేయాలనే ఆశతో సానుభూతి కోసం ఈ దాడి చేసానని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒకవైపు విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు బయటికి వస్తాయి. అసలు నిజమేంటో తెలీకుండా కొందరు నేతలు ఇలా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం ఎంత వరకు కరెక్ట్?. ప్రస్తుతం జరిగిందంతా చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే ఆరోపణల్లో నిజంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఈ దాడి వెనుక ఉన్న డ్రామా ఏంటో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. తెలుసుకుందాం త్వరలో అసలు నిజాలేంటో.

పంచాయతీ ఎన్నికలు.. జనసేనకు తప్పవా కష్టాలు

  ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో జరగాలి. కానీ ప్రభుత్వం జరపకుండా ప్రత్యేక అధికారులను నియమించింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తమ పార్టీకి భయపడే టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే జనసేనకు పంచాయతీ ఎన్నికలు క్లిష్టమైన పరిస్థితిని తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ స్థాపించి సుమారు ఐదేళ్లు అయింది కానీ.. ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రూపంలో ముందే బరిలోకి దిగే అవకాశం వచ్చింది. పవన్.. టీడీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ విమర్శలు చేసారు కానీ.. నిజానికి పంచాయతీ ఎన్నికలు జరగడం జనసేనకు అంత మంచిదేమి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల గెలుపు గురించి పట్టించుకుంటారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. గ్రామస్థాయి నుంచి కేడర్ ఉంది. మండల, నియోజకవర్గ స్థాయి నేతలున్నారు. వారు పంచాయతీ ఎన్నికలు పట్టించుకుంటారు. కానీ జనసేన పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉంది. గ్రామస్థాయిలో నిర్మాణం జరగలేదు. మండల, నియోజకవర్గ స్థాయి నేతలు ఏర్పడలేదు. అసెంబ్లీ ఎన్నికలంటే పార్టీ అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేయొచ్చు.. కానీ పంచాయితీలకు సాధ్యపడదు. అక్కడి లీడర్లు, అక్కడి కేడర్ కావాలి. ఇవ్వన్నీ చూస్తుంటే పంచాయతీ ఎన్నికల్లో జనసేనకు చేదు అనుభవం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. అలా అని జనసేన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పవన్ పలు సందర్భాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జనసేనకు కష్టాలు తెచ్చిపెట్టాయిగా అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం మరి జనసేన వీటిని ఎలా ఎదుర్కుంటుందో.

ఆ రెండు స్థానాల్లో టీడీపీ.. తెరాసకు పెద్ద తలనొప్పిగా మారిందా?

  తెలంగాణలో టీడీపీ పార్టీ ప్రస్తావన వస్తే ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మొదటినుంచి పట్టుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ స్థానాన్ని టీడీపీనే కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశముంది.. కానీ పార్టీలో అంతర్గత వర్గ పోరు కారణంగా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికల తరువాత పార్టీలోని కొందరు నేతలు తెరాసలో చేరారు. దీంతో ఇప్పుడు వర్గపోరు లేదు. అదీకాకుండా ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది. దీంతో ఖమ్మంలో టీడీపీ బలం రెట్టింపు అవుతుంది. నిజానికి 2014 ఎన్నికల తరువాత సీనియర్ నాయకులు కొందరు పార్టీని వీడడంతో ఖమ్మంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విషయం ఈ మధ్య బాలకృష్ణ ఖమ్మం పర్యటన సందర్భంగా స్పష్టమైంది. బాలకృష్ణ మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించగా.. స్వచ్చంధంగా వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పసుపుమయం చేసారు. దీంతో టీడీపీ ఖమ్మంలో ఎంత బలంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం కూడా తోడవడంతో.. ఖమ్మం పార్లమెంట్ కి మహాకూటమి అభ్యర్థి బరిలోకి దిగితే భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం అందరి దృష్టి అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ముఖ్యంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల మీద ప్రధాన దృష్టి ఉంది. అవే ఖమ్మం అసెంబ్లీ మరియు సత్తుపల్లి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్, టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై ఐదువేల మెజారిటీతో గెలుపొందారు. అయితే తరువాత వీరిద్దరూ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తుమ్మల మంత్రి అయ్యారు. తరువాత పాలేరులో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పాలేరు నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇక ఖమ్మం విషయానికొస్తే తాజా మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ నే తెరాస తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మంలో ఎలాగైనా గెలవాలని తెరాస పట్టుదలగా ఉంది. అజయ్ తో పాటు తుమ్మల ఖమ్మం అసెంబ్లీని సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఖమ్మంలో తెరాస గెలుపు సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. ఆ ఎన్నికల్లో తెరాస 7 శాతం ఓట్లకే పరిమితమైంది. తరువాత ఇద్దరు నేతల చేరికతో తెరాస బలం కాస్త పెరిగినప్పటికీ.. ఖమ్మంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు ఇంకా బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం.. అదీగాక మహాకూటమి అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయం అవ్వడంతో తెరాసకు తలనొప్పి మొదలైంది. బలమైన కేడరున్న పార్టీలు ఏకమవ్వడం, బలమైన ప్రత్యర్థి బరిలోకి దిగుతుండడంతో తెరాసకు ఓటమి భయం మొదలైంది. సత్తుపల్లి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున పోటీ చేసిన దయానంద్ రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక తెరాస అభ్యర్థి పిడమర్తి రవి కేవలం ఆరు వేల ఓట్లే సాధించారు. తరువాత వైసీపీ అభ్యర్థి దయానంద్ తెరాసలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆయనే అనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తెరాస అనూహ్యంగా పిడమర్తి రవినే తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగ భగ్గుమంది. ఇదే సండ్రకు కలిసి రానుంది. ఒకవైపు కాంగ్రెస్ ఓటుబ్యాంకు బలం తోడైంది.. మరోవైపు తెరాసలో అసంతృత్తి సెగ. దీంతో మళ్ళీ సండ్రనే విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తుమ్మల మాత్రం సత్తుపల్లిని బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా తెరాస జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది తుమ్మల సొంత నియోజకవర్గం.. అదీగాక ఆయన గతంలో టీడీపీని తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు, అనుభవంతో సండ్ర జోరుకి ఎలాగైనా బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తుమ్మల ఆశలు ఫలించేలా లేవు. మొత్తానికి టీడీపీ బరిలోకి దిగుతున్న ఖమ్మం అసెంబ్లీ, సత్తుపల్లి అసెంబ్లీ సీట్లు తుమ్మల, తెరాసకు పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కేసీఆర్ మహాకూటమికి చెక్ పెట్టాలని జగన్, పవన్ ని దింపుతున్నారా?

  తెరాస 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ అధికారం తామే చేపడతామని ధీమా వ్యక్తం చేస్తూ ముందస్తుకు సిద్ధమైంది. అయితే తెరాస ఊహించినట్లు 100 సీట్లైతే రావడం కష్టం కానీ.. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని అందరూ భావించారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎప్పుడైతే కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సిపిఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ తెరాసను అధికారానికి దూరం చేసే అంత బలం లేదని మొన్నటివరకు అందరూ భావించారు. కానీ ఇప్పుడు మహాకూటమితో కాంగ్రెస్ బలం పెరిగింది. ముఖ్యంగా నాయకులు దూరమైనా కేడర్ ఉండి.. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న టీడీపీ బలం కాంగ్రెస్ కు కలిసొస్తుంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ నువ్వానేనా అన్నట్టు జరిగే అవకాశాలున్నాయి. ఇదే ఇప్పుడు తెరాసను కలవరపెడుతోంది. మహాకూటమిని ఓడించి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మహాకూటమిని అడ్డుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. దానిలో భాగంగానే అవసరమైతే జగన్, పవన్ లను అస్త్రాలుగా మలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట. ప్రస్తుతం జగన్, పవన్ ల దృష్టంతా వచ్చే ఏపీ ఎన్నికల మీదే ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని ఎవరికి తోచిన దారిలో వారు అడుగులు వేస్తున్నారు. అయితే వీరి అడుగులు తెలంగాణలో పడితే ఎలా ఉంటుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. నిజానికి తెలంగాణలో వైసీపీ, జనసేన పార్టీలు అసలు ఉన్నాయా? అనే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలో ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది కానీ వాళ్ళు ఎన్నికల అనంతరం పార్టీని వీడారు. ఉన్న కేడర్ కూడా దూరమైంది. దీంతో జగన్ పార్టీని ఏపీకే పరిమితం చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. మరి అలాంటిది కేసీఆర్ వైసీపీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే దానికో కారణం ఉందట. వైసీపీని కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో బరిలోకి దింపితే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీదున్న అభిమానంతో కొందరు కాంగ్రెస్ ఓటర్లు వైసీపీకి ఓటేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారట. దీనివల్ల కాంగ్రెస్ కి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అలాగే జనసేన బరిలోకి దిగితే కూడా తెరాసకు ఎంతోకొంత లాభం ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట. మహాకూటమి బలంగా ఉన్న స్థానాల్లో జనసేనను బరిలోకి దింపితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు చీలిపోయి తెరాసకు లాభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ కేసీఆర్ మహాకూటమిని అడ్డుకోవడానికి వైసీపీ, జనసేనని రంగంలోకి దింపుతారా అంటే నమ్మడానికి కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీగాక బలంలేని తెలంగాణలో పోటీ చేసి వైసీపీ తన పరువు తాను తీసుకునే సాహసం చేయకపోవొచ్చు. ఇక జనసేన విషయానివస్తే తెలంగాణలో పార్టీ నిర్మాణమే జరగలేదు. ఇప్పటికిప్పుడు సరైన అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. మరి ఇలాంటి సమయంలో పవన్ తొందరపడి పార్టీకి నష్టం జరిగే స్టెప్ వేయకపోవొచ్చు. చూద్దాం మరి మహాకూటమిని అడ్డుకోవడానికి కేసీఆర్ ముందు ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో ఏంటో.