చిరంజీవి బాటలో పవన్.. ఎమ్మెల్యే పోటీలో ఊహించని ట్విస్ట్!!

  ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి దూరం జరుగుతూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. తరువాత పూర్తిగా దూరం జరిగి విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీకి కూడా సిద్ధమయ్యారు. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. అయితే పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారని.. లేదా గత ఎన్నికల్లో లాగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో కలిసి పనిచేస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వీటిని పవన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. జన సైనికులు కూడా పవన్ కి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సరే.. జన సైనికులతో పాటు ఇప్పుడు సామాన్యులను ఓ ప్రశ్న వేధిస్తోంది. అదే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడినుంచి పోటీ చేస్తారు?. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తాం అంటున్నారు బాగానే ఉంది. మిగతా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలీదు కానీ ముందు పవన్ పోటీ చేసే స్థానం చెప్పండంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థానం గురించి ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలీదు కానీ.. ప్రజలను మాత్రం బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పవన్ ఒకసారి అనంతపురం నుంచి పోటీ చేస్తా అన్నారు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అన్నారు. మరోసారి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అన్నారు. ఇలా ఒకోసారి.. ఒకో సభలో.. ఒకో పేరు చెప్పారు. దీంతో పవన్ అసలు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో అర్ధంగాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. తాను పోటీ చేసే స్థానం మీద స్పష్టత కోసం పవన్ తెగ కసరత్తులు చేస్తున్నారట. ఒకవైపు 175 స్థానాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను పోటీ చేసే స్థానం ఎంపిక విషయంలోనూ నిమగ్నమయ్యారట. ఇన్నిరోజులు పవన్ పోటీ చేసే స్థానం అంటూ అనంతపురం, ఇచ్చాపురం, పిఠాపురం ఇలా రకరకాల పురం పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరోపేరు తెరమీదకు వచ్చింది. అదే గతంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన తిరుపతి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో చిరంజీవి తిరుపతి, పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. తిరుపతి నుంచి గెలుపొందారు. తరువాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ విషయంలో పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి బాటలోనే వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలని తర్జనభర్జన పడుతుండగా.. గతంలో అన్నయ్య చిరంజీవిని గెలిపించిన తిరుపతి నుంచి పోటీ చేయమని కొందరు మెగా అభిమానులు సూచించారట. దీనిపై పవన్ కూడా కాస్త సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి కంటే శ్రీకాకుళం జిల్లా లేదా గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడం మంచిదని సలహా ఇస్తున్నారట. ఇంకా కొందరైతే రెండు స్థానాల నుంచి పోటీ చేయమని సలహా ఇస్తున్నారట. దీంతో ఆలోచనలో పడ్డ పవన్ తిరుపతి, ఇచ్చాపురం, పిఠాపురంలలో ఏవైనా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. మరి పవన్ గతంలో చిరంజీవికి విజయం అందించిన తిరుపతి నుంచి పోటీ చేస్తారేమో చూడాలి.

కొడాలి నానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ.. ఓటమి తప్పదా?

  గుడివాడ. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గతంలో ఎన్టీఆర్ ఇక్కడినుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 నుంచి 2009 వరకు ఒక్కసారి తప్ప మిగతా అన్నిసార్లు గుడివాడలో టీడీపీనే గెలుస్తూ వచ్చింది. అలాంటి కంచుకోట.. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైంది. దానికి కారణం కొడాలి నాని. నందమూరి కుటుంబానికి.. మరీ ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కొడాలి నాని.. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తక్కువ సమయంలోనే గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాల కారణంగా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటినుంచి టీడీపీ మీద విమర్శల చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడుపడని విషయం. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ వల్ల ఎదిగి ఇప్పుడు టీడీపీని విమర్శించడం ఏంటంటూ టీడీపీ నేతలు నాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం కూడా నాని విషయంలో సీరియస్ గానే ఉంది. ఈసారి గుడివాడలో నానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటుంది. గత ఎన్నికల్లో నాని మీద పోటీగా.. టీడీపీ. రావి వెంకటేశ్వర రావుని బరిలోకి దింపింది. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. గుడివాడలో మాత్రం నాని గాలి వీయడంతో.. రావి 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో నాని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ గుడివాడ మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈసారి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తోంది. నాని దూకుడును త‌ట్టుకోగ‌లిగిన నేత కోసం టీడీపీ అన్వేషి స్తోంది. వచ్చే ఎన్నికల్లో నాని మీద పోటీగా రావినే బరిలోకి దింపాలా లేదా మరోనేతను దింపాలా అని ఆలోచనలో పడింది. ఆ ఆలోచనల నుంచే కొత్తపేరు తెరమీదకు వచ్చింది. ఆ పేరే దేవినేని అవినాష్. కొడాలి నాని ని ఎదుర్కోగ‌లిగిన నేత‌ల వడపోత చేపట్టగా తుది పరిశీలనలో రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సానుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తు న్నాయి. రావి ఆర్థికంగా ఆచితూచి వ్య‌వ‌హ‌రిచే వ్య‌క్తి కావ‌టంతో అధిష్టానం అవినాష్ పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో దేవినేని కుటుంబానికి ఓ ప్ర‌త్య‌క గుర్తింపు ఉంది. అవినాష్ ప్రస్తుతం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన యువనేత కావడం.. అదీగాక దివంగత దేవినేని నెహ్రు తనయుడు కావడం కూడా అవినాష్ కి కలిసొచ్చే అంశం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నానికి ధీటైన అభ్యర్థి అవినాషే అని చంద్రబాబు భావిస్తున్నారట. కొద్ది రోజుల్లోనే ఈ విషయం మీద ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

టీడీపీలోకి వంగవీటి.. వైసీపీలోకి దేవినేని!!

  వంగవీటి రాధా టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. ఒకప్పుడు విజయవాడను శాసించిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు ఇప్పుడు మరోసారి ఒకే పార్టీలో, ఒకే వేదికపై కనిపించబోతున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. గతంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వంగవీటి, దేవినేని కుటుంబాలు.. ఇప్పుడు టీడీపీలోనూ అదే రకమైన రాజకీయ ప్రయాణం చేయబోతున్నాయి. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. దీంతో విజయవాడలో వంగవీటి రంగా వర్సెస్ దేవినేని నెహ్రూ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడ రాజకీయాలు మారిపోయాయి. రంగా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ఆయన కుమారుడు రాధా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు అప్పట్లో టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ.. సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ గొడుగు కిందకు వచ్చాయి. ఒకే పార్టీలో ఉన్నా ఈ రెండు కుటుంబాల మధ్య మర్యాదపూర్వకంగా కూడా మాటలు ఉండేవి కావు. అయినా ఈ రెండు కుటుంబాలను కాంగ్రెస్ అప్పట్లో బాగానే బ్యాలెన్స్ చేసింది. తరువాత ఆ అవసరం లేకుండా పోయింది. 2009లో వంగవీటి రాధా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దేవినేని నెహ్రూ మాత్రం 2014 వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 తరువాత దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొన్నాళ్ల క్రితం దేవినేని నెహ్రూ చనిపోగా.. ప్రస్తుతం ఆయన తనయుడు అవినాష్ టీడీపీలో ఉన్నారు. రీసెంట్ గా చంద్రబాబు అవినాష్ ని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా నియమించారు. అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా కూడా టీడీపీలో చేరబోతుండటంతో.. ఈ ఇరువురు టీడీపీలో ఎలా ఇముడుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. మాటలు లేకపోయినా నాడు కాంగ్రెస్‌లో ఎలాగోలాగ సర్దుకుపోయిన వంగవీటి, దేవినేని కుటుంబాల వారసులు.. నేడు టీడీపీలో అదే రకంగా సర్దుకుపోతారా అంటూ చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు ఇప్పుడొక సంచలన వార్త విజయవాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. రాధా రాకను అవినాష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రాధా టీడీపీలో చేరితే, తాను టీడీపీని వీడుతా అని అవినాష్ సన్నిహితుల వద్ద చెప్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇప్పటికే వైసీపీ రంగంలోకి దిగి అవినాష్ కి విజయవాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ లోటుని దేవినేని ఫ్యామిలీతో భర్తీ చేయాలని వైసీపీ భావిస్తోందట. మొత్తానికి రాధా టీడీపీలో చేరిన వెంటనే అవినాష్ వైసీపీలో చేరతారని వార్తలొస్తున్నాయి. అయితే అవినాష్ వైసీపీలో చేరతారు అని వస్తున్న వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. టీడీపీ అవినాష్ కి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించింది, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. మరి రాధా టీడీపీలో చేరుతున్నారని.. అవినాష్ తనకు తగిన గుర్తింపు ఇస్తున్న టీడీపీని వీడి వైసీపీలో చేరతారా? లేక గతంలో వంగవీటి, దేవినేని కుటుంబాలు కాంగ్రెస్ లో సర్దుకుపోయాయి కదా అని టీడీపీలోనే కొనసాగుతారో చూడాలి.

ఎన్నికల ఎఫెక్ట్.. టీడీపీకి కొత్త అధ్యక్షుడు!!

  తెలంగాణ టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలనుకుంటుంది. ఎన్నికలలోగా పార్టీని గాడిన పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి మార్పు సహా.. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన చేయాలని నిర్ణయానికి వచ్చిందట.  రాష్ట్ర విభజన తరవాత రెండు రాష్ట్రాలకూ ఇద్దరు అధ్యక్షులను నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. ఏపీలో టీడీపీ బలంగా ఉంది, అధికారంలో ఉంది.. కాబట్టి ఏ సమస్య లేదు. కానీ తెలంగాణ లో పరిస్థితి ఆలా లేదు. రోజురోజుకి పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది.  ఒక్కప్పుడు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. విభజనంతరం 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెల్చుకుంది. అయితే 13మంది ఎమ్మేల్యేలు, ఒక ఎంపీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా చూడటంలో అధ్యక్షుడిగా రమణ విఫలమయ్యారనే వివర్మలున్నాయి‌. గ్రేటర్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఒకే ఒక్క స్థానాన్ని గెల్చుకుంది. తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం అధ్యక్షుడిగా ఎల్‌.రమణ పనితీరుపై విమర్శలు వచ్చాయి.‌ ప్రజాకూటమిని ఏర్పాటు చేయటంలో రమణ చొరవ తీసుకున్నప్పటకీ.. పార్టీ క్యాడర్లో మాత్రం ఉత్సాహం నింపలేకపోయారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు టికెట్ల పంపిణీ విషయంలో కూడా రమణపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు‌. ముందస్తు ఎన్నికల్లో పోటీచేయకుండా.. రమణ సేఫ్ గేమ్ ఆడారనే విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుందట. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పిడి వల్ల పార్టీకి నష్టమని కొందరు అభిప్రాయపడుతున్నారట. మరోవైపు ఒకవేళ అధ్యక్షుడిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనేది అంతుచిక్కడం లేదట. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవటానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన అధిష్టానం దగ్గర తన మనసులో మాటను చెప్పారట. అయితే పార్టీ అధినేత ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చూద్దాం మరి చంద్రబాబు రమణని మారుస్తారో లేదో.

చంద్రబాబుకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్.. ఇకనుంచి గిఫ్ట్ లే గిఫ్ట్ లు!!

  వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుంటే ప్రధాన పార్టీల్లో చేరికలు, వలసలు సహజం. ప్రస్తుతం ఏపీలో కూడా అదే జరుగుతుంది. తాజాగా కడప జిల్లాకు చెందిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ ని కలిశారు. ఆఫీసియల్ గా వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే మేడా టీడీపీని వీడడం వెనుక జగన్ పాత్ర ఎంతుందో తెలీదు కానీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర మాత్రం గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే మొదటి గిఫ్ట్ గా కేసీఆర్.. మేడాను టీడీపీకి దూరం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో మేడా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ దక్కడం.. కడప జిల్లాలో టీడీపీ ఘోర ఓటమి చవిచూసినా.. ఆయన మాత్రం జిల్లా నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిపోయాయి. కడప జిల్లా నుంచి గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం మేడాకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారు. దీంతో మేడాలో అసంతృప్తి విత్తనం మొలకెత్తింది. అదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో మేడా అసంతృత్తి ఆగ్రహంగా మారింది. పార్టీ తరుపున గెలిచిన తనకి మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటంటూ.. సన్నిహితులు, ఇతర టీడీపీ నేతల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మేడాని బుజ్జగించేందుకు చంద్రబాబు రంగంలోకి దిగి.. మేడా తండ్రికి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశమిచ్చారు. అయినా మేడా శాంతించలేదు. పార్టీ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు.  దీన్నే వైసీపీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. మేడా టీడీపీని వీడి వైసీపీలో చేరేలా పావులు కదపడం మొదలుపెట్టింది. అయినా మేడా సందిగ్ధంలోనే ఉన్నారు. వైసీపీలో చేరాలా? వద్దా? ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఒక్క ఫోన్ కాల్ తో మేడా టీడీపీని వీడేలా చేశారట. అసలు మేడా కేసీఆర్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటనేగా మీ డౌట్. మేడా పెద్ద కాంట్రాక్టర్. కేసీఆర్ సహకారంతో ఆయన తెలంగాణలో చాలా కాంట్రాక్టులు చేస్తున్నారట. మరి తనకి కాంట్రాక్టులు ఇచ్చిన కేసీఆర్ మాటకి ఆ మాత్రం విలువ ఇవ్వాలి కదా. అసలే టీడీపీ మీద అసంతృప్తి, దీనికితోడు కేసీఆర్ ఫోన్ కాల్.. ఇంకేముంది మేడా వెంటనే టీడీపీకి గుడ్ చెప్పేశారట. మొత్తానికి మేడా రూపంలో కేసీఆర్ చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఇది ఇంతటితో అయిపోలేదట. మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలను టీడీపీని వీడి వైసీపీలో చేరేలా చేస్తానని కేసీఆర్ జగన్ కి హామీ ఇచ్చారట. తాజాగా వైసీపీ బొత్స సత్యనారాయణ మాటలు వింటే ఇది నిజమనే అభిప్రాయం కలగక మానదు. తాజాగా బొత్స మాట్లాడుతూ.. మేడా మల్లిఖార్జున రెడ్డి మాత్రమే కాదనీ ఇంకా చాలామంది టీడీపీ నుంచి బయటకు వస్తారని అన్నారు. దీనిబట్టి చూస్తుంటే వైసీపీ కేసీఆర్ తో కలిసి టీడీపీకి షాకులు మీద షాకులు ఇచ్చేలా ఉంది. చూద్దాం మరి ముందు ముందు కేసీఆర్ చంద్రబాబుకి ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తారో ఏంటో.

వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు.. పాపం జగన్ ఏం చేస్తారో?

  విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకీ ముదురుతున్నాయి. సమన్వయకర్త కన్నబాబురాజుతో కలిసి పనిచేయలేమని, ఆయనను మార్చాల్సిందేనని బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు డిమాండ్‌ చేస్తున్నారు. కన్నబాబురాజు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బొడ్డేడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో వున్నప్పుడు తనపై కేసులు పెట్టించి, ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తానని మరో నేత ప్రగడ నాగేశ్వరరావు అంటున్నారు. ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. ఆదినుంచి ఉంది. ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న కన్నబాబురాజు వైసీపీలో చేరకముందు.. బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరావు మధ్య వర్గపోరు నడిచేది. ఇరువురు పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించేవారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ బాబు చేతిలో ఓడిపోయిన ప్రగడ నాగేశ్వరరావును నియోజకవర్గం సమన్వయకర్తగా అధిష్ఠానం నియమించింది. అయితే ఏడాదిన్నర క్రితం అతనిని తొలగించి, బొడ్డేడ ప్రసాద్‌కు పగ్గాలు అప్పగించింది. దీంతో ఇద్దరిమధ్య విభేదాలు మరింత ముదిరాయి. గత ఎన్నికల్లో తమ నేత ఓటమికి కారణమైన వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం ఏమిటని ప్రగడ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని అధినేత జగన్‌ చెప్పినా వారు శాంతించలేదు.   ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అంతేకాక సమన్వయర్తగా వున్న బొడ్డేడ ప్రసాద్‌ను తప్పించి, అధిష్ఠానం కన్నబాబురాజును నియమించింది. దీంతో పాత ప్రత్యర్థులు బొడ్డేడ, ప్రగడ ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా బొడ్డేడ ప్రసాద్‌తో విభేదిస్తూ వస్తున్న ప్రగడ.. గతంలో కన్నబాబురాజు తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారంటూ బొడ్డేడతో చేతులు కలిపారు. దీంతో ఇరువురు నేతల అనుచరులు కూడా ఒకే తాటిపైకి వచ్చారు. జగన్‌ విశాఖ జిల్లాలో పాదయాత్రకు ముందు మునగపాకలో విజయ్‌సాయిరెడ్డి సమక్షంలోనే బొడ్డేడ, కన్నబాబు వర్గాలు గొడవ పడ్డాయి. జగన్‌ పాదయాత్ర తరువాత కూడా వర్గపోరు తగ్గలేదు. జగన్‌ జన్మదిన వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వేర్వేరుగా జరుపుకున్నారు. పార్టీ కార్యక్రమాలను, కార్యకర్తల సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునగపాక మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో బొడ్డేడ, ప్రగడ నేతలతోపాటు వారి అనుచరులు కూడా పార్టీ సమన్వయకర్తపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. తమను చిన్నచూపు చూస్తున్నారని, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని కార్యకర్తలు ఆవేదన చెందారు. కన్నబాబురాజుతో కలిసి పనిచేయలేమని, సమన్వయకర్తను మార్చే విషయాన్ని పరిశీలించాలని అధిష్ఠానానికి సూచించారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించని పక్షంలో తగిన నిర్ణయం తీసుకుందామని బొడ్డేడ ప్రకటించారు. కన్నబాబురాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనపై పలు కేసులు పెట్టి అవమానించారని, అలాంటి వ్యక్తితో ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తామని ప్రగడ నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిష్ఠానం రంగంలోకి దిగి.. బొడ్డేడ ప్రసాద్‌, ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులను శాంతపరచకపోతే ఎలమంచిలిలో వైసీపీకి తీవ్రనష్టం వాటిల్లుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి వైసీపీ అధినేత జగన్ పార్టీలో ఏర్పడిన ఈ వర్గపోరుని ఎలా అరికడతారో.

జేసీపై ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిల!!

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పేరు చాలా రోజుల తరువాత మళ్ళీ మొన్న తెరమీదకు వచ్చింది. తన గురించి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షర్మిల గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఆమె రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనప్పటికీ.. రాజకీయంగా కాస్తో కూస్తో అనుభవం ఉంది. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్ర చేసారు. అలాగే వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేసారు. అందుకే వైసీపీ శ్రేణుల్లో షర్మిల మీద సానుకూలత ఉంది. నిజానికి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పోటీకి ఆమె దూరంగా ఉన్నారో లేక జగన్ దూరంగా ఉంచారో తెలీదు కానీ ఆమె మాత్రం ఎన్నికల బరిలో దిగలేదు. తరువాత రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఉంచారు. అయితే ఇప్పుడు ఆమె మనసు రాజకీయాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారట. ఆమె పోటీ పట్ల జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ.. బీజేపీ అభ్యర్థి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఆమె పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇక్కడ షర్మిల గెలుస్తుందని నూటికి నూరు శాతం చెప్పలేకపోయినా గెలిచే అవకాశం మాత్రం ఉందని వైసీపీ భావిస్తోంది. ఒకవేళ షర్మిల విశాఖపట్నం నుంచి పోటీ చేయకపోతే.. అనంతపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎంపీగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ పైన, జగన్ పైన జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనపై తన సోదరి చేత పోటీ చేయించి ఓడించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే జేసీని ఓడించడం అంతా ఈజీ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు షర్మిల విశాఖపట్నం, అనంతపురం కంటే కడప ఎంపీగా పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం విశాఖపట్నం లేదా అనంతపురం నుంచే బరిలోకి దింపాలని చూస్తున్నారట. చూద్దాం మరి షర్మిల అసలు పోటీ చేస్తారో లేదో. ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడినుంచి పోటీ చేస్తారో ఏంటో.

జగన్ కి షాకిచ్చిన పీకే.. కేసీఆర్ తో దోస్తీ డౌటే!!

  ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్, కేటీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు వైసీపీ నేతలే.. రాబోయే ఎన్నికల్లో జగన్, టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా ఏంటని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భేటీ గురించి ప్రశాంత్ కిషోర్ టీం కూడా షాకింగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిందట. జగన్, కేటీఆర్ తో భేటీ అయి రాజకీయాలపై చర్చించారు. ఇక దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న జగన్.. ప్రశాంత్ కిషోర్ టీంకు ఆ బాధ్యతను అప్పగించారు.అయితే ప్రజల దాకా వెళ్ళకుండానే.. వైసీపీ నేతలు, కార్యకర్తలను ముందుగా సర్వే చేస్తేనే చాలా ప్రతికూల ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లకుండానే వైసీపీ నేతల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ చాలా నెగిటివ్ గా వచ్చిన నేపథ్యంలో జగన్ కేసీఆర్ తో దోస్తీ పై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇంతకాలం జగన్ పాదయాత్రలతో పార్టీకి కాస్తోకూస్తో మైలేజీ తీసుకొని వచ్చారని సంబరపడుతున్న వైసీపీ శ్రేణులకు జగన్ కేటీఆర్ తో భేటీ నీరుగార్చేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటికొచ్చినట్టు ఆంధ్ర ప్రజలను తిడుతూ వారి మనోభావాలను కించపరిచే కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికలకు వెళితే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఓ వైసీపీ నేత చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతలతో జతకడితే ఏపీకి ఏవిధంగా లాభం కలుగుతుందో జగన్ ఆలోచించుకోవాలని.. దీనిని ఏపీ రాష్ట్ర ప్రజలు హర్షించరని ఒక నేత ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి విమర్శలు చేయని చంద్రబాబుని ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఆదరించలేదు. అలాంటిది ఆంధ్ర ప్రజలని దొంగలు, దోపిడీదారులు అని అభివర్ణించిన కేసీఆర్.. గతంలో తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యాసంస్థలను నిషేధిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రాలో బిర్యాని పేడ బిర్యానీ అంటూ వంకలు పెట్టిన కేసిఆర్.. ఏపీ రాజకీయాల్లో జగన్ కు మద్దతిస్తే అది జగన్ కు మైనస్ తప్ప ప్లస్ కాదని, ఏపీ ప్రజలు కేసిఆర్ మాటలు ఇంకా మరిచిపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారట. ప్రత్యేక హోదా పైన వ్యతిరేకత ప్రదర్శించి, పోలవరం పైన పలు కేసులను దాఖలు చేసి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏపీకి రావాల్సిన 5200 కోట్ల ధనాన్ని ఎగవేసి, ఇక విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేయడానికి ఏ విధంగానూ సహకరించని టీఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇవన్నీ పక్కన పెట్టి కేసిఆర్ తో దోస్తీ చేయడమంటే జగన్ తన గోతి తానే తీసుకున్నట్లు అవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. రాహుల్ గాంధీ ఏపీ పర్యటన సమయంలో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన చేస్తామని ప్రకటన చేసిన సందర్భంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇస్తే.. తెలంగాణకు వచ్చి ఏపీకి వరాలు ఇవ్వడం ఏంటని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరి జగన్ అలాంటి వారితో కలిసి టీడీపీని ఓడించటానికి పని చేస్తే అది వైసీపీకే నష్టం చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తాజాగా కేటీఆర్ తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో వైసీపీలో చేరాలని, వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ఆశావహులు చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించడానికి పనిచేస్తామని టీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ తో దోస్తీ తనకు లాభిస్తుంది అనుకుంటున్న జగన్ కు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న వ్యతిరేకత పునరాలోచనలో పడేలా చేసిందట. ఒకవేళ జగన్ నిజంగానే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

జగన్, పవన్ ని కలిపే బాధ్యత కేటీఆర్ దేనా?

  ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంతో.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల దోస్తీ ఆఫీసియల్ అయినట్లు అయింది. మొన్నటివరకు పరోక్షంగా మద్దతు ఇచ్చుకున్న పార్టీలు ఇక నుంచి ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చుకోనున్నాయి. ముఖ్యంగా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. పేరుకి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్, వైసీపీ దగ్గరయ్యాయని చెప్తున్నా.. నిజానికి ఆ రెండు పార్టీల ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబుని గద్దె దించడం. చంద్రబాబుని ఓడించాలనే ప్రధాన అజెండాతోనే ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు టీడీపీ నేతలైతే ఈ పార్టీలను బీజేపీ వెనుకనుంచి ఆడిస్తుందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇదంతా సరే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ తరువాత టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబు మీద, లోకేష్ మీద, ఇతర టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఓ రకంగా చంద్రబాబుని గద్దె దించాలని జగన్ ఎలా టార్గెట్ పెట్టుకున్నారో.. పవన్ కూడా అలానే టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ కామన్ టార్గెట్ జగన్, పవన్ లను దగ్గర చేస్తుందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్, జగన్ భేటీ సందర్భంగా పవన్ గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబుని ఓడించాలంటే పవన్ మద్దతు కూడా తోడవ్వాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించనప్పటికీ.. కొందరు వైసీపీ నేతలు మాత్రం పవన్ తో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. భేటీ సందర్భంగా కేటీఆర్ కూడా జగన్ తో.. పవన్ ని కలుపుకొనిపోతే చంద్రబాబుని ఓడించడం సులభమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు పవన్ ని ఎలా ఒప్పించాలో తనకు తెలుసునని.. పవన్ ని ఒప్పించి చంద్రబాబుని ఓడించడానికి అందరూ కలిసి పనిచేసేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజమైతే.. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఓడించడానికి విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడినట్లు ఏపీలో టీడీపీని ఓడించడానికి కూడా కూటమి ఏర్పడడం ఖాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ.. వైఎస్సార్ అభిమానుల రియాక్షన్ ఏంటి?

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీనే. జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే కేసీఆర్ ఆదేశాల మేరకు తాజాగా కేటీఆర్ జగన్ ను కలిశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు దగ్గరవడానికి ఓ రకంగా చంద్రబాబు కారణమని చెప్పాలి. శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు అనే ఫార్ములా ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదిరేలా చేసిందని చెప్పాలి. ఏపీలో జగన్, చంద్రబాబు ప్రత్యర్థులు. చంద్రబాబుని గద్దె దించి ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీలో కూర్చుందామా అని జగన్ ఎదురుచూస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ కి కూడా చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడి పని చేసారు. ఆ సమయంలో కేసీఆర్ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు చంద్రబాబు అనే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతాం అంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఏపీలో వైసీపీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజానికి టీఆర్ఎస్, వైసీపీల మధ్య దోస్తీ ఎప్పుడో కుదిరిందనేది బహిరంగ రహస్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఉన్న ఒకరిద్దరు వైసీపీ నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసారు. ఇప్పుడు కేటీఆర్, జగన్ భేటీతో ఈ దోస్తీ ఆఫీసియల్ గా ట్రాక్ ఎక్కనుంది. అయితే టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు మీద కోపంతో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందని ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకుంది. చంద్రబాబు మీద పంతం కొద్దీ కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతానంటే వైసీపీ తమకేదో మేలు జరుగుతుందని గంతులేస్తుంది. కానీ సాధారణ ప్రజల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈమధ్య వరకు ఆంధ్రా వారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. కొన్ని సందర్భాల్లో ఏపీ నాయకుల మీదే కాకుండా సాధారణ ప్రజల మీద కూడా తీవ్ర విమర్శలు చేసారు. మరి ఆ మాటలన్నీ ఏపీ ప్రజల అంత త్వరగా మర్చిపోతారా?. అదీగాక ప్రస్తుతం ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కావాలని బలంగా కోరుకున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏపీకి ప్రత్యేకహోదా వస్తే కంపెనీలన్నీ ఏపీకి తరలిపోతాయని ప్రత్యేకహోదాని వ్యతిరేకించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి తరువాత యూ టర్న్ తీసుకున్న బీజేపీ మీద కోపంతో రగిలిపోతున్న ఏపీ ప్రజలు.. మరి ఇప్పుడు ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు?. సాధారణ ప్రజలే కాదు వైఎస్సార్ అభిమానులు కూడా టీఆర్ఎస్, వైసీపీల దోస్తీని వ్యతిరేకిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైఎస్సార్ టీఆర్ఎస్ ను ఎంతగా వ్యతిరేకించేవారో తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్.. కేసీఆర్, ఈటల రాజేందర్ వంటి నేతల మీద విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఏమన్నా కేసీఆర్ జాగీరా? అంటూ మండిపడ్డారు. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్ధమవుతుందా రాజేంద్ర? అని ఈటలని వైఎస్సార్ అసెంబ్లీలో విమర్శించడం తీవ్ర దుమారమే రేపింది. కేసీఆర్, హరీష్ రావు కూడా ఈమధ్య వరకు వైఎస్సార్ మీద తీవ్ర విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ బ్రతికుంటే టీఆర్ఎస్ ని ఎదగనిచ్చేవారు కాదనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. మరి ఇవన్నీ మర్చిపోయి జగన్ చెప్పాడు కదా అని వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్ దోస్తీని స్వాగతిస్తారా అంటే డౌటే. చూద్దాం మరి ఏపీ ప్రజలు, వైఎస్సార్ అభిమానులు టీఆర్ఎస్, వైసీపీ దోస్తీని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో.

ఏపీలో ఎన్నికలు..టీడీపీతో టీఆర్ఎస్ ఢీ

  తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూటమి తరుపున ప్రచారం చేయటం తెలంగాణ సీఎం కేసీఆర్ కి నచ్చలేదో ఏమో? ..ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాం, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని అన్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించటమే. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవ్వటమే ఇందుకు ఉదాహరణ. పైకి ఫెడరల్ ఫ్రంట్ పైనే చర్చించాం అని చెప్తున్నా..ఏపీ రాజకీయాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలు ఏపీలో ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదని అటు టీఆర్ఎస్,ఇటు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఓడించేందుకు తమ పార్టీ ఎంపీలు ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు. కేటీఆర్, జగన్ భేటీ కేవలం ఫెడరల్ ఫ్రంట్ కోసమేనని, ఇందులో మరేతర విషయాలు లేవన్నారు. ఫ్రంట్ వెనుక బీజేపీ ఉందన్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలన్న నినాదాన్ని ఎన్నికల ముందే కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ అనేక మందిని కలిశారని, జగన్‌తో భేటీ కూడా అందులో భాగంగానే ఈ భేటీ అని ఆయన స్పష్టం చేశారు. జగన్ ఏమైనా అంటరానివాడా? ఆయన ఓ ప్రతిపక్ష నేత అని ఆయన తెలిపారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీకి ఎందుకింత ఉలికి పాటు? తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు పర్యటించలేదా? అని సీతారాం నాయక్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భేటీపై స్పందించారు. తాజాగా అయన మీడియాతో మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు. రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

టీడీపీలో ట్విస్ట్ లే ట్విస్ట్ లు.. భూమా ఔట్, శిల్పా ఇన్!!

  'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అనే పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడిదే పాటని కాస్త మార్చి పాడుకుంటున్నారు మన పొలిటీషియన్స్. 'ఏడాదికో పార్టీ మారితే పొరపాటు కాదోయ్' అని పాడుతున్నారు. ఈరోజుల్లో నాయకులు పార్టీలు మారడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో.. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతాడో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతం నంద్యాల రాజకీయం కూడా అలాగే ఉంది. మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీని వీడి జనసేనలో చేరడానికి సిద్దమయ్యారంటూ కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అఖిల ప్రియ ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఆమె టీడీపీని వీడుతున్నారనే ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు నంద్యాలలో మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అఖిల ప్రియ టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని వార్తలు రావడంతో.. శిల్పా బ్రదర్స్ టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారట. 2014 ఎన్నికల సమయంలో భూమా ఫ్యామిలీ వైసీపీలో ఉంటే.. శిల్పా ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. 2014 లో నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ తరుపున భూమా నాగిరెడ్డి, టీడీపీ తరుపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. తరువాత భూమా ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాలలో 2017 లో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు శిల్పాని కాదని భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడానికి మొగ్గుచూపారు. భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో శిల్పా టీడీపీని వీడి వైసీపీలో చేరి.. వైసీపీ తరుపున బరిలోకి దిగారు. అయితే ఉపఎన్నికల్లో కూడా శిల్పా ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీలో కూడా శిల్పా పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఎంఐఎం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మైనార్టీలు అధికంగా ఉండే నంద్యాల అసెంబ్లీ సీటును ఎంఐఎం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరగగా వైఎస్ జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో శిల్పా సందిగ్ధంలో పడ్డారు. నంద్యాల టికెట్ ఎంఐఎంకి ఇస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డ శిల్పాకి.. భూమా కుటుంబం టీడీపీని వీడనుందనే వార్త కొత్త ఆశ తీసుకొచ్చిందట. నంద్యాల టికెట్ ఇస్తానంటే టీడీపీలో చేరడానికి సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి భూమా ఫ్యామిలీ.. అఖిల ప్రియ చెప్పినట్లు టీడీపీలోనే ఉంటుందా? లేక టీడీపీని వీడి శిల్పా ఫ్యామిలీకి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.

సంక్రాంతి తరువాత టీడీపీలోకి చేరికలే చేరికలు!!

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్నిరోజులు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపైనే ఎక్కువ దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది. వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఉన్నచోట ప్రత్యామ్నాయంగా ఎవరిని తెరపైకి తీసుకురావాలి అనే అంశాలపై ఇప్పటికే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు, మాజీమంత్రి అహ్మదుల్లా, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరతానని చంద్రబాబుకు స్పష్టం చేశారు. టీడీపీ సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు సైతం త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మాజీమంత్రి అహ్మదుల్లా సైతం అధికార టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన అహ్మదుల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలోనే అహ్మదుల్లా టీడీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి సైతం టీడీపీలో చేరేందుకు ఆసక్తి  చూపుతున్నారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో చంద్రబాబును సబ్బం హరి ప్రశంసిస్తూ వస్తున్నారు. పలుమార్లు కలిసి అభినందించారు కూడా. ఇటీవలే డిసెంబర్ 31న చంద్రబాబును ఆయన నివాసంలో సబ్బం హరి కలిశారు. తాను టీడీపీలో చేరతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టీడీపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పని తీరును మెచ్చుకున్న కొణతాల.. జనవరి 18న టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా కమెడియన్ అలీ కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సంక్రాంతి తరువాత టీడీపీలోకి భారీగానే చేరికలు ఉండేలా ఉన్నాయి.

జేసీకి వార్నింగ్ ఇచ్చిన సీఐకి వైసీపీ ఎంపీ టికెట్!!

  సీఐ గోరంట్ల మాధవ్. కొద్ది రోజుల క్రితం ఈ పేరు వార్తల్లో మారుమోగిపోయింది. ఏకంగా అధికార పార్టీ ఎంపీకే మీసం మెలేసి వార్నింగ్ ఇవ్వడంతో ఈయన పేరు వార్తల్లో బాగా వినిపించింది. అనంతపురం జిల్లాలో ప్రబోధానంద స్వామి గొడవలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఐ మాధవ్ తెరపైకి వచ్చారు. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలని మాధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే సీఐ మాధవ్ పేరు ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వినిపిస్తుంది. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారట. జేసీలాంటి వ్యక్తికే సవాల్ విసిరిన మాధవ్‌పై వైసీపీ కన్నేసింది. కదిరి సీఐగా ఉన్న ఆయనతో వైసీపీ పెద్దలు రహస్యంగా మంతనాలు జరిపారట. హిందూపురం ఎంపీగా మాధవ్‌ను పోటీచేసేలా ఒప్పించాలన్నది ఆ సంప్రదింపుల సారాంశం. అందుకు మాధవ్ సైతం ‍ఒప్పుకున్నారని తెలుస్తోంది. సీఐ పదవికి రాజీనామా చేసి రావాలని వైసీపీ హైకమాండ్ కోరడంతో మాధవ్ అదే పనిలో ఉన్నారు. తన రాజీనామా లేఖను జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీకి పంపారట కూడా!   మాధవ్ కురబ సామాజికవర్గానికి చెందినవారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కురబ, యాదవ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందుకే మాధవ్‌ను బరిలోకి దింపడం ద్వారా టీడీపీకి గట్టిపోటీ ఇవ్వవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. బీసీల అండతోనే టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప రెండుసార్లు గెలిచారు. దీంతో టీడీపీ వెంట ఉన్న బీసీలకు గాలం వేయడానికే మాధవ్ పేరును వైసీపీకి తెరపైకి తీసుకువచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే మాధవ్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వకుండా ఆయనను బలిపశువును చేస్తారమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకున్న తర్వాత వారికి హ్యాండ్‌ ఇచ్చిన ఘటనలున్నాయి. అందుకే మాధవ్ విషయంలో ఇలా జరుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి మాధవ్‌ వ్యవహారం వచ్చే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో!

టీడీపీ కి బిగ్ షాక్.. జనసేనలోకి మంత్రి అఖిల ప్రియ?

  ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. మంత్రి అఖిల ప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పి.. త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త‌ల్లి శోభా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఉపఎన్నిక‌ల ద్వారా వైసీపీ తరుపున అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఆ త‌రువాత తండ్రి ఆకస్మికంగా మ‌ర‌ణించారు. కొద్ది కాలానికి అఖిల ప్రియ మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్న అఖిల ప్రియ అంద‌రినీ కలుపుకొని పోవడంలో స‌క్సెస్ కాలేక పోయార‌నే భావ‌న ఉంది. దీంతో జిల్లాలోని టీడీపీ నేతలే అఖిలకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో అఖిల ప్రియ సైతం పార్టీ నేత‌ల తీరుపై అస‌హ‌నంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ పార్టీ మారుతారంటూ కర్నూల్ జిల్లాలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో త‌నకు వ్య‌తిరేకంగా నేత‌లు ప‌ని చేస్తున్నా.. అధినాయ‌క‌త్వం వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం పై అఖిల ప్రియ అసంతృప్తితో ఉన్న‌ట్లు సమాచారం. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుండి టీడీపీ బ‌రిలోకి దింపుతోంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. నంద్యాల నుండి మైనార్టీ అభ్యర్దికి అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. క‌ర్నూలు ఎమ్మెల్యేగా అఖిల ప్రియ మేన‌మామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో భూమా కుటుంబం నుండి బ్ర‌హ్మానంద‌రెడ్డికి మాత్ర‌మే టిక్కెట్ ద‌క్కుతుందంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలపై అగ్ర‌హంతో ఉన్న అఖిల ప్రియ.. కర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌నకు సీఎం చంద్రబాబు వ‌చ్చినా దూరంగా ఉన్నారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే అఖిల ప్రియ సీఎం ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నార‌ని.. సీఎంకు స‌మాచారం కూడా ఇచ్చార‌ని సన్నిహితులు చెబుతున్నారు. అయినా అఖిల ప్రియ టీడీపీని వీడుతున్నారనే ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. అఖిల ప్రియ త్వ‌రలోనే టీడీపీని వీడి.. ఎన్నిక‌ల ముందు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భూమా కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శోభా నాగిరెడ్డి 2004 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ త‌రువాత వైసీపీలో చేరారు. భూమా దంప‌తుల మ‌ర‌ణం త‌రువాత పవన్ కళ్యాణ్.. వారి పిల్ల‌ల గురించి ప‌లు మార్లు ఆరా తీసేవారట. ఇప్పుడు కర్నూల్ జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో చేరటం కరెక్ట్ అని అఖిల ప్రియ భావిస్తున్నారట. జనసేనలో అయితే తనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కుతాయని.. అందుకే వీలైనంత త్వరగా టీడీపీని వీడి జనసేనలో చేరాలని అఖిల ప్రియ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల ప్రియ నిజంగా జనసేనలో చేరతారో లేక టీడీపీలోనే ఉంటారో చూడాలి.

జగన్, పవన్ నై నై.. చంద్రబాబుకే అలీ జై!!

  గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా నానుతున్న పేరు అలీ. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అలీ.. కమెడియన్ గా ఆకట్టుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం అలీ జనాల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలీ ఏ పార్టీలో చేరతారో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ, జనసేన, టీడీపీ ఈ మూడు దారుల్లో అలీ పయనం ఎటువైపో అర్ధంగాక ప్రజలు క్వశ్చన్ మార్క్ ఫేస్ లతో చూస్తున్నారు. సినీ ప్రయాణంలో అలీ.. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు. పవన్ చేసిన మెజారిటీ సినిమాల్లో అలీ నటించాడు. వీరిద్దరూ మంచి స్నేహితులని సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. దీంతో అలీ.. పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారని భావించారంతా. కానీ అలీ ఎందుకో జనసేనకు దూరం పాటిస్తూ వచ్చారు. సర్లే అలీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా అలీ వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. దీంతో అలీ వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఇదేంటి పవన్ జనసేన ఉండగా.. అలీ వైసీపీ వైపు ఎందుకు చూస్తున్నారు? అంటూ ఒకటే చర్చలు. ఒకవైపు అలా చర్చలు జరుగుతుండగానే మరోవార్త బయటికి వచ్చింది. అదే పవన్ తో అలీ భేటీ. ఇంకేముంది అలీ 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అంటూ పవన్ వైపు వచ్చారు. త్వరలో జనసేనలో చేరతారు అంటూ చర్చలు మొదలయ్యాయి. అబ్బే.. ఇంతటితో ఆగితే ఏం మజా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా ఇంకో పెద్ద ట్విస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి అలీ.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడు అలీ టీడీపీలో చేరుతున్నారంటూ వార్తలు. ఇలా ఈ మూడు పార్టీలలో అలీ ఏ పార్టీకి జై కొడతారో అర్థంగాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలీ టీడీపీ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఇక వైసీపీ విషయానికొస్తే.. టికెట్ విషయంలో అలీకి ఆ పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. అసలు ప్రస్తుతం అలీ రాజకీయాల్లోకి రావాలనుకునేది ఎన్నికల బరిలోకి దిగడానికి. నిజానికి అలీ గతంలోనే టీడీపీ తరుపున పోటీ చేయాలనుకున్నారు. కానీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. కానీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయనికి గతంలో ఉన్న టీడీపీ సత్సంబంధాలతో చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతేకాదు ఆయనికి టీడీపీ నుంచి టికెట్ హామీ కూడా వచ్చినట్లు సమాచారం. అలీ టీడీపీ తరుపున మైనార్టీలు ఎక్కువగా ఉండే గుంటూరు 1 నుంచి పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరి అలీ టీడీపీలో చేరతారో లేక ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తారో చూడాలి.

ఏపీ ఎన్నికలు.. 50 కోట్లు ఖర్చు పెట్టేవారికే ఎమ్మెల్యే టికెట్

  ఒకప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే.. ఆ వ్యక్తికి ప్రజల్లో మంచి పేరుందా? ప్రజలకు సేవ చేస్తాడా? అని పార్టీలు ఆలోచించేవి. కానిప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కంటే ఎక్కువ ఖర్చు చేయగలడా? లేదా? అని పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఆలోచించడం ఏంటి.. అలా ఖర్చు చేయగలిగిన వారికే టిక్కెట్లు ఇస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూడా ఎమ్మెల్యే టిక్కెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగల వారికే దక్కేలా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదమని వైసీపీ భావిస్తోంది. అందుకే రాబోయే ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే టీడీపీకి ధీటుగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తోంది. మొన్నామధ్య వైసీపీ అధినేత జగన్.. పార్టీలో కష్టపడేవారి కంటే ఎన్నికల్లో ఖర్చుపెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 'నిప్పు లేనిదే పొగ రాదు' అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటారు. వారిని ఓడించాలంటే అంతకన్నా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అందుకే వైసీపీ నియోజకవర్గాన్ని బట్టి 25 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోందట. అయితే ఇలా పార్టీలు పోటాపోటీగా ఖర్చు పెట్టగలిగే అభ్యర్థులను బరిలోకి దింపాలి అనుకోవడం.. నిజంగా పార్టీ కోసం కష్టపడే, ప్రజలకు సేవ చేసే మధ్యతరగతి నాయకులకు బాధ కలిగించే విషయమనే చెప్పాలి. బడాబాబులకు టికెట్ ఇస్తే ఖర్చు చేస్తారు. గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. తరువాత అవకాశాన్ని బట్టి పార్టీ కూడా మారుతారు. కానీ పార్టీనే నమ్ముకున్న మధ్యతరగతి నాయకులు అలా కాదు. టికెట్ వచ్చినా రాకపోయినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే ఉంటారు. పార్టీకోసం కష్టపడతారు. ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికే టిక్కెట్లు ఇవ్వాలని చూస్తున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో.. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన మధ్యతరగతి నేతలు టికెట్ రాదని తెలిసి బాధపడుతున్నప్పటికీ.. పార్టీని వీడే ఆలోచనలో లేరు. మరి ఇప్పటికైనా ప్రధాన పార్టీలు ఖర్చు పెట్టేవారికి కాదు.. కష్టపడి పనిచేసేవారికి టిక్కెట్లు ఇవ్వాలని మనసు మార్చుకుంటాయేమో చూడాలి.

కేసీఆర్ బాటలో జగన్.. టార్గెట్ వందసీట్లు.. వ్యూహం ఫలిస్తుందా?

  తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించాలని చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. అంతేకాదు అందరికంటే ముందుగా ఒకేసారి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీనివల్ల అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి ఎక్కువ సమయం దొరికింది. అలాగే మిగతా పార్టీలకంటే ముందుగా ప్రచారం మొదలు పెట్టి ప్రజల్లోకి త్వరగా వెళ్లే అవకాశం దొరికింది. మొత్తానికి కేసీఆర్ వ్యూహం ఫలించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు.   ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఈ సారి ఒకే దఫా వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కూడా అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో జగన్ చేప్పట్టిన పాదయాత్ర ఈ నెల 9 తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనుంది. అదేరోజు జగన్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 175 సీట్లు ఉన్న ఏపీలో ఒకేసారి వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా జగన్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ముందుగా అభ్యర్ధుల ప్రకటన పార్టీకి లాభిస్తుందని.. ప్రచారానికి కావాల్సినంత సమయం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు. మిగిలిన 75 సీట్లకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని.. పరిస్థితులకు అనుగుణంగా ఈ సీట్లలో నిర్ణయం తెసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఫార్ములా ఏపీలో పనిచేస్తుందని చెప్పటానికి లేకపోయినా.. అభ్యర్ధి ప్రజల్లోకి వెళ్ళటానికి, తమ ప్రత్యర్ధుల కంటే ముందుగా ప్రచారం చేసుకోవటానికి ఇది పనికొస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు కూడా పక్కాగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా కారణంగా టిక్కెట్ నిరాకరించాల్సి వస్తే.. అలాంటి నేతలతో జగన్ స్వయంగా మాట్లాడి బుజ్జగింపులు కూడా చేయటానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. చూద్దాం మరి జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.

మళ్ళీ నువ్వే రావాలి.. నిజంగా ప్రజలు కోరుకుంటున్నారా?

  గత ఎన్నికల్లో ఏపీ ప్రజల్లోకి.. ముఖ్యంగా యువతలోకి బలంగా దూసుకుపోయిన స్లోగన్ 'బాబు రావాలి.. జాబు రావాలి'. టీడీపీ కార్యకర్తల నుంచి సామాన్య ఓటర్ల వరకు అందరి నోట ఈ మాట బాగా వినిపించింది. ఏపీ ప్రజలు చంద్రబాబుని నమ్మారు.. దానికి తగ్గట్లే అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు కూడా ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో చాలా సాధించారు. ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కియా మోటార్స్, టిసిఎల్ కంపెనీలు తీస్కోచ్చారు. రాయలసీమకు నీళ్లిచ్చారు. రీసెంట్ గా కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన కూడా చేసారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలన్నా, పెద్ద కంపెనీలు రావాలన్నా మళ్ళీ బాబే రావాలని టీడీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. అందుకే గతంలో 'బాబు రావాలి.. జాబు రావాలి' అనే స్లోగన్ లాగా ఇప్పుడు 'మళ్ళీ నువ్వే రావాలి' అనే స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ ప్రజలు నిజంగా మళ్ళీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారా? అంటే దాదాపు 64 శాతం మంది మళ్ళీ బాబు రావాలని కోరుకుంటున్నారట. ఏపీలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మీద దృష్టి పెట్టడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు కూడా ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూనే.. మరోవైపు పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేపిస్తూ గెలుపు గుర్రాలను వెతుకుతున్నారు. అయితే రీసెంట్ గా చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పెద్దలు ఒక సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో డొంక తిరుగుడు లేకుండా ఒకే ఒక ప్రశ్న అడిగారట. అదేంటంటే మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా?. ప్రతిజిల్లాలో దాదాపు నాలుగు వేల మందిని ఈ ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. వివిధ వర్గాలు, మతాలు, కులాలకు చెందిన వారు ఈ నాలుగు వేల మందిలో ఉన్నారట. మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలా? వద్దా? అన్న ప్రశ్నకు దాదాపు 64 శాతం మంది మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పారట. 15 శాతం మంది చంద్రబాబు పనితీరు పర్వాలేదని చెప్పగా.. 21 శాతం మంది మాత్రం ఈ ప్రభుత్వం మారిపోవాలని కోరుకున్నారట. మొత్తానికి ఈ సర్వేతో టీడీపీ నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. అయితే చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వారి శాతం ఇంకా పెరగాలని.. అప్పుడు టీడీపీ విజయావకాశాలు మరింత పెరుగుతాయని నేతలు భావిస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.