విద్యుత్ పంపకాలపై ముందుకేనంటున్న బాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ.జెన్.కో. విద్యుత్ పంపకాల ఒప్పందాల రద్దుకు చేసిన అభ్యర్ధనను ఈ.ఆర్.సి. తిరస్కరించినప్పటికీ, ఈవిషయంలో వెనక్కి తగ్గకూడదని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ వ్రాయడమే కాకుండా, త్వరలో డిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మరియు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో ఈవిషయం గురించి మాట్లాడాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర విభజనలో అన్నిటినీ జనాభా ప్రాతిపదికన విభజించినపుడు విద్యుత్ కేటాయింపులు మాత్రం వినియోగం ఆధారంగా కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య జరిగిన ఈ విద్యుత్ కేటాయింపుల ఒప్పందాలలో ఏ ప్రాంతానికి ఎంత నిర్దిష్ట విద్యుత్ కేటాయించాలనే అంశం పేర్కొనబడలేదని, కానీ తెలంగాణా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. సమైక్యరాష్ట్రంలో జరిగిన ఈ విద్యుత్ పంపిణీ ఒప్పందాలకు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ఆమోదం తెలుపలేదనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు.   ఇక ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ.జెన్.కో. కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తోంది. విద్యుత్ శాఖ నియమనిబందనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ఆయా రాష్ట్రాలలో ఉండే స్థానిక లోడ్ డిస్పాచ్ కేంద్రాలు విద్యుత్ పంపిణీ చేయవలసి ఉంటుందని, అందువల్ల వాటి ప్రతిపాదనలను ఈ.ఆర్.సి. ఆమోదించడం కేవలం లాంఛన ప్రాయమేనని, అటువంటప్పుడు ఆ ప్రతిపాదనలను తిరస్కరించదానికి కూడా వీలులేదని వాదిస్తునట్లు సమాచారం. ఏమయినప్పటికీ ఉభయరాష్ట్రాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యదర్శులు అవసరమయితే ముఖ్యమంత్రులు చర్చించుకొని ఇటువంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడం మంచిది.

తరిమేవరకూ పదవులు వదలరా?

      పదవులు పట్టుకుని వేలాడటం రాజకీయ నాయకులకు వుండే సహజలక్షణం. తమకు ఆ పదవిలో కొనసాగే అర్హత, నైతిక హక్కు లేదని తెలిసినా పదవిని పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతూనే వుంటారు. అలాంటి కొంతమంది గబ్బిలం బ్యాచ్ రాజకీయ నాయకులలో కొన్ని గబ్బిలాలు తరిమితే పోతాయి. కొన్ని గబ్బిలాలు మాత్రం తరుముతున్నా పోకుండా సదరు సీటును పట్టుకుని వేలాడుతూ వుంటాయి. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అలాంటి గబ్బిలాలు బోలెడన్ని వున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ హయాంలో ఎంతోమందిని ఎన్నెన్నో నామినేటెడ్ పోస్టుల్లో పెట్టింది. కొంతమంది పదేళ్ళుగా, మరికొంతమంది కొన్నేళ్ళుగా ఆ పదవులలో సౌఖ్యాలు అనుభవిస్తు్న్నారు. వారిలో కాంగ్రెస్ హయాంలో నియామకాలు పొందిన గవర్నర్లు కూడా వున్నారు. నైతికంగా చెప్పాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు సదరు పెద్దలంతా తమ పదవుల నుంచి తప్పుకోవడం మర్యాద. గవర్నర్ లాంటి పదవుల్లో వున్నవారు మాత్రం కేంద్రం ఆదేశాలు వచ్చేవరకూ పదవుల్లో వుండొచ్చుగానీ, కొర్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లాంటి వాటిలో పదవుల్లో వున్నవారు ప్రభుత్వాలు మారగానే తమ పదవులకు రాజీనామాలు చేయడం అయితే, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ చాలామంది పదవుల మీద వ్యామోహం తీరక కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నారు. అలాంటి వారిని వదిలించుకోవడానికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వాలు తరిమేస్తూ వుండటంతో కొంతమంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా విపత్తు నివారణ సంస్థకు అధ్యక్షుడిగా వున్న మర్రి శశిధర్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించేంత వరకు పదవిని వదల్లేదు. అలాగే మరికొన్ని జాతీయ ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో వున్నవారు గవర్నమెంట్ తరిమే వరకూ పదవుల్లోనే వేలాడే ఉద్దేశంలో వున్నారు. అలాంటి చాలామందిని ప్రభుత్వాలు వదిలించుకునే పనిలోపడ్డాయి. కొంతమంది గవర్నర్లు అయితే ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళేట్టు వున్నారని తెలుస్తోంది. అయితే కేంద్రం తలుచుకుంటే వాళ్ళ పప్పులు ఉడకవనేది సత్యం. ఏది ఏమైనా తరిమేవరకూ పదవులను పట్టుకుని వేలాడటం సరైన పద్ధతి కాదన్న అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

కార్యకర్తల సంక్షేమం కోసం తెదేపాలో వ్యవస్థ ఏర్పాటు

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపాకు గ్రామ స్థాయి నుండి కూడా చాలా బలమయిన పార్టీ క్యాడర్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. గత పదేళ్లలో కార్యకర్తల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పట్టింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు, నిరుపేద కార్యకర్తల పిల్లలు చదువులకు ఆర్ధిక సహాయం చేస్తూ కార్యకర్తలను ఆదుకొంటోంది. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించాలంటే దానికి ఒక ప్రత్యేకమయిన నిధి, దానిని నిర్వహించేందుకు ఒక వ్యవస్థ అవసరమని నారా లోకేష్ చేసిన సూచనను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించడమే కాక ఆ భాద్యతను ఆయనకే అప్పగించింది. ఈరోజు తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గా లేక వ్యూ గెస్ట్ హౌస్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే నా రాలోకేష్ కూడా ఈ సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు.   ఈ సందర్భంగా నారా లోకేష్ లోకేష్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లోనే కార్యకర్తల సహాయం కోసం (హెల్ప్ లైన్) ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ కేటాయిస్తామని, రెండు రాష్ట్రాలలో కార్యకర్తలు ఎప్పుడయినా ఆ నెంబరుకు ఫోన్ చేసి అవసరమయిన సహాయం పొందవచ్చని తెలిపారు.   సాధారణంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలోనే పార్టీ కార్యకర్తలు గుర్తుకు వస్తారు. ఆసమయంలో వారిని పూర్తిగా వాడుకొని, అధికారం చేజిక్కించుకొన్నాక మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వారిని పట్టించుకోరు. అయినప్పటికీ ఏదో ఒకరోజు పార్టీ మేలుచేయకపోతుందా అనే ఆశతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. వాటి కోసం తమ కష్టార్జితాన్ని సైతం ఖర్చు చేస్తుంటారు. పార్టీ పిలుపు మేర ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి కడుపు మాడ్చుకొంటారు, పోలీసుల లాటీ దెబ్బలు తింటారు, కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను, తమపై ఆధారపడిన కుటుంబసభ్యుల జీవితాలను కూడా చేజేతులా నాశనం చేసుకొంటుంటారు. అయితే వారి ఈ కష్టానికి ప్రతిఫలం మాత్రం సదరు పార్టీ నాయకులు అనుభవిస్తారు. కార్యకర్తలు వారి కుటుంబాలు పస్తులుంటే, వారి కష్టంతో గెలిచిన నాయకులు మాత్రం విలాసవంతమయిన జీవితం గడుపుతుంటారు.   నారా లోకేష్ ప్రత్యక్ష రాజకేయాలలోకి రాకుండా పార్టీని బలోపేతం చేసే పనిలో ఈ పరిస్థితులన్నిటినీ స్వయంగా చూసారు. అందుకే ఇకపై పార్టీ కార్యకర్తల, వారి కుటుంబాల బాగోగులు పార్టీయే చూడాలని నిర్ణయించుకొన్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో మరే పార్టీ చేయని విధంగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, పార్టీయే వారి బాగోగులు చూసుకోవాలని భావించడం నిజంగా చాలా అభినందనీయం. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది.

జయలలిత రాజీనామా చేస్తారా లేదా?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి ఇప్పుడు పెద్ద ధర్మసంకటం ఎదురైంది. తమిళనాడులో ఎదురులేని నాయకురాలిగా పరిపాలన చేస్తున్న జయలలిత కోర్టు దగ్గర మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జయలలిత మీద ఎప్పటి నుంచో వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆమె ఇంతకాలం ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడా కేసు జయలలితకు పెద్ద తలనొప్పిలా తయారైంది. ఈ కేసులో తమిళనాడు సీఎం జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 66 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణపై విధించిన స్టేను కోర్టు ఎత్తివేసింది. దాంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా జరిగే అవకాశం వుంది. తన మీద ఒక కేసు దర్యాప్తు జరుగుతూ వుండగా జయలలిత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతికంగా ఎంతవరకు కరెక్టన్న వాదన వినిపిస్తోంది. తనపై జరుగుతున్న దర్యాప్తుకు సహకరిస్తూ ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదిలిపెడితే మంచిదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అని దేశంలోని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

చంద్రబాబు సమర్ధతకు సవాలుగా మారిన వ్యవసాయ ఋణాలు

    వేలకోట్ల వ్యవసాయ ఋణాలను మాఫీ చేయడం తగదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. ఒకవేళ ఋణాలు మాఫీ చేయదలిస్తే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించి మాఫీ చేసుకోవచ్చని కానీ ప్రభుత్వ బాండ్లు పెట్టి మాఫీ కోరడం తగదని స్పష్టంగా చెప్పింది. ఋణాలు మాఫీ చేయకపోతే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ఊరుకోరు. మాఫీ చేస్తామంటే ఆర్.బీ.ఐ. ఒప్పుకోవడం లేదు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల పరిస్థతి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. కేసీఆర్ ప్రభుత్వానికి కొద్దిగా మిగులు బడ్జెట్ తో ఉన్నందున ఏదోవిధంగా ఈ గండం గట్టెక్కగలదు. కానీ లోటు బడ్జెట్ లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ అప్పుల ఊభి నుండి బయటపడాలంటే చాలా కష్టం.   కేంద్రం చాలా ఉదారంగా ఆదుకొంటే తప్ప అది సాధ్యం కాదు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి చేసిన హామీలను తీర్చే బాధ్యత ఒకవేళ కేంద్రం తలకెత్తుకొన్నట్లయితే, అదొక సంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. గనుక ప్రధానమంత్రి మోడీ ఈ విషయంలో చంద్రబాబుకి నేరుగా ఆర్ధిక సహాయం చేయక పోవచ్చును. ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి సిద్దపడినట్లయితే, మిగిలిన ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి డిమాండ్లే మొదలయితే అప్పుడు కేంద్రం కూడా ఇరకాటంలో పడుతుంది గనుక ఈ విషయంలో కేంద్రం ఏ మేరకు, ఏ విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందజేస్తుందనేది వేచి చూడాలి.   ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియదనుకోలేము. ఆర్.బీ.ఐ. నుండి లేఖ అందుకొన్న తరువాత, నిన్న చంద్రబాబు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఋణమాఫీపై వేసిన కొండయ్య కమిటీ సభ్యులతో ఈవిషయంపై సుదీర్గంగా చర్చించారు. వ్యవసాయ ఋణాలు మొత్తం అన్నీ కలిపి రూ.59,105కోట్లు ఉన్నట్లు తేలింది. కానీ వాటిని ఏవిధంగా తీర్చాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. కానీ ఈవిషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరాదని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు మళ్ళీ కేంద్రాన్నే ఆశ్రయించాలని నిశ్చయించుకొన్నారు. పనిలో పనిగా ఆర్.బీ.ఐ.కు కూడా తాము ఏ పరిస్థితుల్లో పంట ఋణాలు మాఫీ చేసేందుకు అంగీకరించవలసి వచ్చిందో వివరిస్తూ ఒక లేఖ వ్రాసి, ఈ విషయంలో ఆర్.బీ.ఐ. సహకారం కూడా కోరాలని నిర్ణయించేరు. కానీ ఈ రెండు నిర్ణయాల వలన ఎటువంటి ఫలితము ఉండకపోవచ్చును.   రాష్ట్ర విభజన వల్ల చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పకుండా అన్నివిధాల ఆదుకొంటానని కేంద్రం పదేపదే హామీ ఇస్తుండవచ్చును. కానీ దానర్ధం చంద్రబాబు తలెకెత్తుకొన్న ఈ వేల కోట్ల ఋణభారాన్ని భరిస్తానని మాత్రం కాదని గ్రహించవలసి ఉంటుంది. అటువంటప్పుడు చంద్రబాబే ఈ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. రైతులకు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, వారిపై కొత్తగా ఎటువంటి ఆర్ధిక భారం మోపకుండా, కేంద్రం నుండి సహాయం అందకపోయినా ఈ జటిల సమస్యను తాను విధించుకొన్న 45రోజుల గడువులో ఏదోవిధంగా పరిష్కరించ వలసి ఉంటుంది. ఆ గడువులో అప్పుడే 10రోజులు పూర్తయిపోయాయి. మిగిలిన ఈ కొద్ది రోజులలో తప్పనిసరిగా ఈ సమస్యకు ఆయన పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. ప్రజలు ప్రతిపక్షాలు కూడా ఆయన ఈ జటిల సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారా? అని ఎదురుచూస్తున్నారు.   ఒకవేళ పరిష్కరించ గలిగితే ఆయన సమర్ధతకు ప్రజలందరూ నీరాజనాలు పడతారు. లేకుంటే విమర్శలు, తీరని అపఖ్యాతి మూటగట్టుకొంటారు. నిజంగా ఇది చంద్రబాబు సమర్ధతకు అగ్ని పరీక్ష వంటిదే! అయితే ఆ పరీక్షను ఆయానే స్వయంగా ఎన్నుకొన్నారు గనుక ఇక ఎవరినీ నిందించడానికి లేదు.

డీఎంకేకి ఖుష్బూ గుడ్ బై.. బీజేపీలోకి..?

      ఒకప్పుడు తమిళ సినిమా రంగంలో టాప్‌ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన ఖుష్బూ ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించారు. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే పార్టీలో చేరిన ఆమె ఆ పార్టీకి చాలా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే ఆమె తాజాగా డీఎంకేకి రాజీనామా చేశారు. తాను పార్టీకి సేవలు చేస్తూనే వుంటోంది తప్ప డీఎంకే పార్టీ నుంచి తనకేమీ లభించడం లేదని ఆమె చెప్పింది. డీఎంకేతో తన ప్రయాణం ‘వన్‌ వే’ మాదిరిగా వుందని వాపోతూ ఆమె పార్టీకి రాజీనామా చేశారు.   ఇప్పుడు ఖుష్బూ దృష్టి బీజేపీ మీద పడినట్టు తెలుస్తోంది. ఆమె త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు అంచనా వేస్తున్నారు. తమిళ రాజకీయాలలో మరో జయలలిత స్థాయిని అందుకోవాలని కలలు కని రాజకీయ రంగప్రవేశం చేసిన ఖుష్బూకి రాజకీయాలలో పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. మర్రిచెట్టులాంటి డీఎంకే లాంటి పార్టీ నీడలో వుంటే తమిళనాడు రాజకీయాలలో తాను సాధించేదేమీ  లేదని, కరుణానిధి కుటుంబాన్ని దాటుకుని తాను డీఎంకేలో ఎదిగే అవకాశం లేదని ఖుష్బూ అర్థం చేసుకున్నారు. అందుకే డీఎంకే నుంచి బయటపడి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి తమిళనాడులో చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు. తాను బీజేపీలో చేరిన పక్షంలో పార్టీలో ఉన్నత స్థానానికి రాగలనని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. టైమ్ బాగుంటే తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు. లేకపోతే కేంద్ర స్థాయి రాజకీయాలకు వెళ్ళొచ్చన్న అభిప్రాయంలో ఖుష్బూ వున్నట్టు తెలుస్తోంది. ఖుష్బూ పార్టీలోకి వస్తే చేర్చుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం కూడా సిద్ధంగా వున్నట్టు తెలుస్తోంది. ఒక ముస్లిం మహిళ తమ పార్టీలోకి వస్తే బీజేపీ ముస్లింలకు దగ్గరయ్యే అవకాశాలు బలపడతాయని బీజేపీ నాయకత్వం భావిస్తునట్టు సమాచారం.

జగన్‌కి బ్యాడ్ టైమ్ మళ్ళీ మొదలవబోతోందా?

      ఎన్నికల పుణ్యమా అని ఇంతకాలం బెయిల్ మీద తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వైసీపీ అధినేత జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వం వున్నంతకాలం సోనియా చెప్పినట్టు ఆడిన సీబీఐ ఇప్పుడు ఎన్డీయే హయాంలో కాస్తంత స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి విషయంలో చాలా కఠినంగా వుండే మోడీ హయాంలో సీబీఐ పనితీరు ఆశాజనకంగా వుండొచ్చన్న ఆశలు జనంలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులు మళ్ళీ విచారణకు రానున్నాయి. ఈనెల 21 నుంచి జగన్ అక్రమాస్తులకు సంబంధించిన పది కేసులను విచారించడానికి సీబీఐ కోర్టు సన్నాహాలు చేస్తోంది. ఈ పది కేసుల్లోనూ జగన్ మొదటి ముద్దాయిగా వున్నారు. అరబిందో, హెటిరో ఫార్మాలకు సంబంధించిన కేసు ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ముందుకు రానుంది. గతంలో బ్యాడ్ టైమ్ నడిచినంతకాలం దాదాపు పదహారు నెలల పాటు జగన్ జైలులో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్ కేసులు మళ్ళీ విచారణకు వస్తున్నాయి. ఈ కేసుల వల్ల జగన్‌కి మళ్ళీ బ్యాడ్ టైమ్ ప్రారంభం కాబోతోందా అనే సందేహాలు రాజకీయ పరిశీలకులలో కలుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో చూస్తే జగన్‌ భవిష్యత్తు ఎలా వుండబోతోందో అర్థమైపోతుంది.

పార్టీ సమీక్షలనగా ఆత్మస్తుతి, పరనింద

      సాధారణంగా ఎన్నికలలో ఓడిన పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని ఆత్మవిమర్శ చేసుకొని తమ లోపాలను గుర్తించి సవరించుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ మన రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలను కూడా తమ ప్రత్యర్ధులు, మీడియా ఎత్తిపొడుస్తాయనే భయంతోనే సమీక్షా సమావేశాలను కూడా ఒక తప్పనిసరి తద్ధినంలా నిర్వహించేసి చేతులు దులుపుకోవడం రివాజయిపోయింది. ఎలాగూ అంతమంది నేతలు ఒక చోట కలవడం అరుదు గనుక, అలా కలిసినప్పుడు అందరూ కూడా ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేసి దానినే సమీక్షా సమావేశాలుగా భావిస్తుంటారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.   ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, సుబ్బిరామిరెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, పల్లంరాజు, కిల్లికృపా రాణీ, కొందరు మురళి, మల్లాది విష్ణు తదితరులు అనేకమంది పాల్గొన్నారు. ఇంతమంది హేమాహేమీలు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశాలాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు కనుగొని, వాటిని సవరించుకొనేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అదేవిధంగా అసలు శాసనసభలో కాంగ్రెస్ తరపున ఒక్క సభ్యుడు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం చేత అధికారంలో నున్న తెదేపా ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ చెప్పట్టవలసి ఉంది. కానీ పార్టీని వీడిపోయిన కాంగ్రెస్ నేతలను అవినీతిపరులని, పార్టీలో మిగిలినవారు మాత్రమే నిజాయితీపరులని చెప్పుకోవడానికే పుణ్యకాలం కాస్త సరిపోయేలా ఉంది. ఇక అవకాశం దొరికితే తెదేపాలోకి దూకేసేందుకు తన సోదరుడు ఆనం రామినారాయణరెడ్డి సిద్దంగా ఉన్నారనే సంగతి కూడా మరిచిపోయిన ఆనం  వివేకానంద రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం నేతలందరూ ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడబెట్టుకోన్నారని, కానీ పార్టీ ఓడిపోయేలా కనిపించడంతో అనేకమంది తెదేపా, వైకాపాలలోకి దూకేసారని ఆరోపించారు. అలాగని పార్టీలో మిగిలిన వారందరూ నిజాయితీ పరులేనని చెప్పలేనని, వారూ చాలా ఆస్తులు పోగేసారని ఆరోపించారు. ఇక చంద్రబాబుకి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, అన్నీ రెండే కోరుకొంటారు గనుక ఆయన కేవలం రెండేళ్ళే అధికారంలో కొనసాగుతారని జోస్యం చెప్పారు. ఆయన మాటలకి కాంగ్రెస్ నేతలందరూ పకపకమని నవ్వారు. కానీ సమీక్షా సమావేశాలలో ఇటువంటి డైలాగులతో సరదాగా కాలక్షేపం చేయడం వలన వారికి వినోదం కలుగుతుంది తప్ప పార్టీకే ఎవిదంగా మేలు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏమయినప్పటికీ కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నపుడు డబ్బులు పోగేసుకొంటారని పార్టీ సమావేశంలోనే ఒక కాంగ్రెస్ నేత చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెద్ద తప్పుగా భావించడం లేదని, కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉంటే ఏమి చేస్తారో కూడా స్పష్టమవుతోంది.

మరో తప్పుకి సిద్దమవుతున్న కిరణ్

  ఒకప్పుడు అందు లేడు..ఇందు లేడు అనే సందేహం వలదన్నట్లు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి కనబడకుండా అదృశ్యమయిపోయారు. ఆయన మీడియా భారి నుండి తప్పించుకొనేందుకు ప్రస్తుతం బెంగుళూరులో విశ్రాంతి తీసుకొంటున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి సన్నిహితంగా ఉండే కొందరు గుజరాతీ పారిశ్రామికవేత్తలకు ఆయన సహాయపడ్డారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు వారి ద్వారా నరేంద్ర మోడీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తాజా సమాచారం.   ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొని ఉంది ఉంటె ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. ఆక్షేపించేవారు కాదు. పార్టీ శ్రేయోభిలాషిగా ఆయన చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన కారణంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓటమి భారంతో క్రుంగిపోతోంది గనుక ఒకవేళ ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపితే తప్పకుండా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించి ఉండేది. కానీ పొరపాట్లు చేయడం అలవాటుగా మారినందునేమో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇదే ఆలోచన ఆయన ఎన్నికలకు ముందు, తెదేపాతో బీజేపీ పొత్తులు ఖరారు కాక ముందు చేసి ఉండి ఉంటే బహుశః నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! ఆ సమయంలో సీమంద్రాలో బీజేపీని నడిపించేందుకు సమర్దుడయిన నాయకుడు లేక అల్లాడుతున్న బీజేపీ, బహుశః ఆయనకే ఆ భాద్యతలు కట్టబెట్టి ఉండేదేమో! అప్పుడు బీజేపీ తెదేపాతో పొత్తుల గురించి ఆలోచించేదే కాదేమో!   సమయం కాని సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అందెవేసిన కిరణ్, ఇప్పుడు కాంగ్రెస్ కు బదులు బీజేపీలో చేరాలనుకొంటే అది ఆయన రాజకీయ జీవితంలో మరొక ఘోర తప్పిదం అవుతుంది. ఎందువలన అంటే, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు ఇంతవరకు మొహం కూడా చూడని బీజేపీ నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబుతో వినయంగా మెలగ వలసి ఉంటుంది. అయినప్పటికీ ఆయనకీ రాష్ట్రంలో కాని కేంద్రంలో గానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరితే అందులో ఒక అనామకుడిగా మిగిలిపోవచ్చును. మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో వేచి చూడాలి.

ఆంధ్రా విద్యార్ధులను ఎవరు ఆదుకొంటారు?

        హైదరాబాదులో చదువుకొంటున్న ఆంధ్రా విధ్యార్దులకు, తెలంగాణా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించిన కేసీఆర్, ఈ విద్యా సంవత్సరం నుండి కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల ఈరోజు ఆయన నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను కూడా చర్చకు పెట్టబోతున్నారు. బహుశః ఈ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుండి మిశ్రమ స్పందన రావచ్చును.   ఆయన తెలంగాణా ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈవిధంగా కొంత భారం తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలందరినీ సమానంగా చూడవలసిన ఆయన, ఆంద్ర విద్యార్దులపట్ల ఈవిధంగా వివక్ష చూపాలనుకోవడం వలన విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. కానీ, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కొన్ని సూచనలు చేసి అందుకు ఆయన అంగీకరిస్తే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఏమయినప్పటికీ, తెలంగాణాలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొంటున్న విద్యార్ధులు, తెలంగాణా విద్యార్ధులు, ఆంధ్రా నుండి వచ్చిన విద్యార్ధులకు కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరు విధానాలు అవలంభించాలనుకొంటే అది విద్యార్ధులలో కూడా చీలికలు సృష్టిస్తుంది. ముఖ్యంగా ఆంద్ర విద్యార్ధులలో, వారి తల్లి తండ్రులలో అభద్రతా భావం సృష్టిస్తుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం ఈవిషయంలో ప్రతిపక్షాల సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలు.   ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వని పక్షంలో దానిపైనే ఆధారపడి చదువుకొంటున్న వందలాది విద్యార్ధులు చదువులు కొనసాగించలేని దుస్థితి ఏర్పడుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో హైదరాబాద్ కు చెందిన విద్యార్ధులు మరణించినపుడు చంద్రబాబు స్వచ్చందంగా ముందుకు వచ్చి తక్షణమే సహాయచర్యలు చేప్పట్టి, మరణించిన విద్యార్ధులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఏవిధంగా మానవతా దృక్పదం ప్రదర్శించారో అదేవిధంగా కేసీఆర్ కూడా ఆంధ్రా విద్యార్దులపట్ల మానవతా దృక్పధంతో స్పందిస్తే అందరూ హర్షిస్తారు. ఒకవేళ తన ప్రభుత్వమొక్కటే వారి భారం మోయలేదని ఆయన భావిస్తే ఆయన చంద్రబాబుని సంప్రదించి ఇరు ప్రభుత్వాలు విద్యార్ధుల భాద్యతను స్వీకరిస్తే అందరూ హర్షిస్తారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు బ్లూ ప్రింట్ సిద్దం చేసారా?

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి క్యాబినెట్ సమావేశం తరువాత రాష్ట్ర రాజధానితో బాటు వైజాగ్, తిరుపతి మరియు నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. పదమూడు జిల్లాలలో ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమయిన వనరులున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేలా ఆ ప్రాంతాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తామని ఆయన తెలిపారు. నిన్న ఆయనతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమతో కూడా మళ్ళీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారని తెలిపారు. అభివృద్ధి అంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని ఆయన కోరుకొంటున్నారని వారు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల తగిన స్థలం కోసం తమ అన్వేషణ కొనసాగిస్తామని, అయితే ఈ విషయంలో తాము ఆయనకు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేస్తామని అంతిమ నిర్ణయం ఆయనే తీసుకోవలసి ఉంటుందని వారు తెలిపారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నందున రాజధానితో బాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు, వాటికీ ఉన్న అవకాశాలు, అవసరమయిన వనరులు, నిధుల గురించి కూడా తమ నివేదికలో చేర్చుతామని తెలిపారు. రేపటి నుండి రాయలసీమలో పర్యటించి ఆ ప్రాంతపు వివరాలు కూడా సేకరిస్తామని తెలిపారు. చంద్రబాబు, శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చాలా లోతుగా చర్చించారు గనుక ఇప్పుడు రాజధాని నిర్మాణం, ఇతర నగరాలు, పట్టణాలు అభివృద్ధి విషయంలో వారందరూ సరయిన అవగాహనకు వచ్చి ఉండవచ్చును. అందువల్ల ఈసారి కమిటీ నుండి మరింత నిర్దిష్టమయిన, మెరుగయిన ప్రతిపాదనలు సూచనలు సలహాలు వచ్చే అవకాశం ఉంది.   ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు, అపోహలకు లోను కావద్దని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న సంగతి కేంద్రానికి కూడా తెలుసునని, అందువల్ల కనీసం మొదటి సంవత్సరం ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భరించవచ్చని ఆయన తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురయినా కేంద్రం వాటిని అధిగమించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండవచ్చును గనుక ఆ విధంగా కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల అభివృద్దికి కేంద్రం నుండి అధనపు నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలున్నాయి తప్ప సహజ వనరులు, మానవ వనరులకు లోటు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్ధికంగా సహాయపడతామని స్పష్టమయిన హామీ ఇస్తోంది గనుక ఇక ప్రయత్నా లోపం లేకుండా కేంద్రం నుండి నిధులు రాబట్టుకొంటూ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది.

హార్డ్ వేర్ రంగంపై దృష్టి పెట్టాలి: జే.ఏ. చౌదరి

  హైదరాబాదు నగరాన్ని ప్రపంచ సాఫ్ట్ వేర్ చిత్రపటంలో స్థానం కల్పించడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఆ మహాయజ్ఞంలో ఆయనతో కలిసి పనిచేసిన వారిలో జేఏ చౌదరి గారు కూడా ఒకరు. ఆయన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీ.ఐ.ఈకి ప్రెసిడెంట్ మరియు ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థ యన్.వి.ఐ.డీ.ఐ.ఏకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాది అవకాశాలు పెంచడం, రాష్ట్ర ఆర్ధిక లోటును పూడ్చుకోవలాసిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక అమూల్యమయిన సూచనలు చేసారు. ఆయన ఏమి చెప్పారంటే...   “ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్ వేర్ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించవలసి ఉంది. అందుకోసం చంద్రబాబు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థతో సహా అనేక దేశ, విదేశీ కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మన రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. గా నియమితులవడం మన అదృష్టమనే చెప్పుకోవచ్చును. చంద్రబాబు ఆయనతో కూడా మాట్లాడారు. అటువంటి పెద్ద సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగితే, వాటిని ఇతర సంస్థలు అనుసరిస్తాయి.   మన రాష్ట్రం, దేశం సాఫ్ట్ వేర్ రంగంలో చాలా మంచి పేరు సంపాదించుకొంది. అయితే హార్డ్ వేర్ రంగంపై మనం ఇంకా దృష్టి పెట్టవలసి ఉంది. మనకున్న అపరిమితమయిన మానవ వనరులను వినియోగించుకొని మనం ఈ రంగంలో అభివృద్ది సాధించేందుకు కృషి చేయాల్సి ఉంది. అన్ని విధాల అభివృద్ధి చెందిన చెన్నై నగరానికి సమీపంలో గల నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో, బెంగుళూరుకు దగ్గరగా ఉండే అనంతపురం జిల్లాలలో ఈ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటే వెనుకబడిన ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా, ఆ సంస్థలు కూడా త్వరగా నిలద్రోక్కుకోగలవు.   అదేవిధంగా ఓడిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ సంస్థలు స్థాపించగలిగితే అక్కడ కూడా అభివృద్ధి జరిగి, సంస్థలు త్వరగా నిలద్రోక్కుకోగలవు. వైజాగ్ లో ఇప్పటికే కొన్ని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి కనుక అక్కడికి కొత్తవి రప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. సాఫ్ట్ వేర్ తో బాటు హార్డ్ వేర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషిచేయాల్సుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు ప్రోత్సహాకాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది గనుక మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని హార్డ్ వేర్ సంస్థల స్థాపనకు గట్టిగా కృషి చేయాలి. మన రాష్ట్రం సాఫ్ట్ వేర్ రంగంలో మంచి పేరు సంపాదించుకొంది. అదేవిధంగా ఇప్పుడు హార్డ్ వేర్ రంగంపై కూడా మంచి పట్టు సాధించాల్సి ఉంది. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నన్ను మళ్ళీ ఆహ్వానిస్తే తప్పకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సిద్దంగా ఉన్నాను, “ అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-3

  ఒకప్పుడు ప్రజలకి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉండేది. ప్రభుత్వం తమ ధన, మాన, ప్రాణాలకు పూర్తి భద్రత ఇస్తుందని నమ్మేవారు. కారణం అప్పటి ప్రభుత్వాలను నడిపిన రాజకీయ నేతలు చాలా చిత్తశుద్దితో, నిస్వార్ధంగా పాలన సాగించేవారు. కానీ ఇప్పుడు అటువంటి గొప్ప నేతలు లేరు, అందువల్ల ప్రభుత్వాలపై ప్రజలకు మునుపటి నమ్మకమూ లేదు. ప్రభుత్వాలు కూడా ప్రజలలో ఆ అపనమ్మకాన్ని మరింత పెంచుతూనే ఉన్నాయి.   ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఏకంగా రాష్ట్ర విభజనకే పూనుకొంది. తెలంగాణా ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అందుకోసం సీమంద్రా ప్రజలను రోడ్డున పడేయడమే చాలా దారుణం. అందుకే ఆ పార్టీకి ఎన్నికలలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా చాలా కటినంగా శిక్షించారు. కానీ అదే సమయంలో ప్రజలు చంద్రబాబు హామీలపై, సమర్ధతపై నమ్మకం ఉంచి తెదేపాను గెలిపించారు.   అందువల్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే బాధ్యత చంద్రబాబు, తెదేపా నేతలదే. ఇప్పుడు తెదేపా ప్రభుత్వం ముందు అనేక క్లిష్టమయిన సమస్యలున్నాయి. వాటిని అధిగమించాలంటే, నిబద్దత, దీక్ష దక్షతలతో పాటు ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడేలా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడే వారి నుండి కూడా పూర్తి సహకారం దొరుకుతుంది. రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి నిత్యం ప్రజలకు వివరిస్తూ వారి నుండి సహాయ సహకారాలు అర్ధించడమే కాకుండా, కోట్లకు పడగలెత్తిన నేతలందరూ కూడా స్వయంగా భారీ విరాళాలు ఇచ్చి, తమకు ప్రభుత్వం కల్పిస్తున్న డజన్ల కొద్దీ కార్లతో కూడిన కాన్వాయిలను, బ్లాక్ క్యాట్ కమెండో సెక్యురిటీ వంటి కొన్ని సౌకర్యాలను వదులుకొని, ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇంటిపన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి కోట్లాది రూపాయల బాకీలను వెంటనే చెల్లించి ప్రజలలో నమ్మకం కలిగించవచ్చును. కానీ వారు ఎటువంటి త్యాగాలు చేయకుండా ప్రజాధనంతో విలాసంగా జీవిస్తూ ప్రజలను త్యాగాలు చేయమని, విరాళాలు ఇమ్మని కోరితే ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీలాగే భంగపాటు తప్పదని గుర్తుంచుకోవాలి.   ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసు గనుక అధికారం చేప్పట్టిన నేతలందరూ, నిజాయితీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడితే, ప్రజలందరూ కూడా తమ వంతు సహకారం అందించడానికి ఎన్నడూ వెనకాడరు. ప్రజలు, ప్రభుత్వము చేయిచేయి కలిపి నడిస్తే, రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద అసాధ్యమేమీ కాదు.  

ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కి లేదు: ప్రణాళికా సంఘం

      రాష్ట్ర విభజన విషయంలో అన్యాయం జరిగినా, ప్రత్యేక హోదా దక్కుతుందన్న ఊరటలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కేంద్ర ప్రణాళికా సంఘం పిడుగు వేసింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత, ప్రత్యేక హోదా పొందే అర్హత ఆంధ్రప్రదేశ్ కు లేదని, జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన నిబంధనలు, సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందలేదని ప్రణాళికా సంఘం తేల్చి చెప్పింది. ప్రణాళికా శాఖ కేంద్ర మంత్రి ఇందర్ జీత్ సింగ్ రావుకు ప్రణాళికా సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న యుపిఎ గవర్నమెంట్ వాగ్దానం, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ హామీ, ప్రత్యేక హోదా పదిహేనేళ్ళపాటు కావాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఆశ గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండటం, జన సాంద్రత తక్కువగా ఉండటం, పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా ఉండటం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించే ఛాన్స్ వుందని కొందరు అధికారులు అంటున్నారు.

మా ఫిలిం ఛాంబర్ మాగావాలె..

  రాష్ట్ర విభజనలో భాగంగా పీటముడిపడున్న ప్రభుత్వ శాఖలను, వాటిలో పనిచేసే ప్రభుత్వోద్యోగులను ఎలాగో అతికష్టం మీద రెండు రాష్ట్రాలకు మధ్య పంపకాలు అయ్యాయి. కానీ హైదరాబాదు కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ఇంకా ఈ పంపకాలు జరగకపోవడంతో తెలంగాణా సినీ పరిశ్రమగా విడిపోయిన కొందరు మా మా ఫిలిం ఛాంబర్ మాగావాలె...అంటూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం ముందు ఈ రోజు గొడవకు దిగారు. వారు ఇప్పటికే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు. కానీ ఇంతవరకు అన్ని ప్రాంతాలకు కలిపి ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా తమకీయమని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.   వారు విడిపోవాలని గట్టిగా పట్టుబడుతుంటే, కొద్ది రోజుల క్రితం ఇరుప్రాంతాలకు కలిపి కొత్తగా తెలుగు ఫిలిం ఛాంబర్ అనే మరో కొత్త సంస్థను ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఒక రాష్ట్రంలో తీసిన సినిమాలు మరొక రాష్ట్రంలో విడుదల చేయాలంటే, అందుకు రెంటి మధ్య అనుసంధానంగా ఇటువంటి ఏర్పాటు అవసరమనే మంచి ఆలోచనతోనే దీనిని ఏర్పాటు చేసారు. కానీ దానితో తమకు ఎటువంటి సంబందమూ, అవసరమూ లేదని తెలంగాణకు చెందిన కొందరు నిర్మాతలు, డిస్త్రిబ్యుటర్లు వాదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇంకా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అసాధ్యమని వారు వాదిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ భవనంలో తమ వాటాగా రావలసిన భాగాన్ని తమకు అప్పగించాలని, లేకుంటే బలవంతంగానయినా ఆక్రమించుకొంటామని హెచ్చరించారు.   ఫిలిం ఛాంబర్ భవనంలో తెలంగాణా సినీ పరిశ్రమవారికి ఈయవలసిన భాగం పంచి ఇచ్చేయవచ్చును. కానీ ఇంత వ్యతిరేఖత ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు సినీ పరిశ్రమ ఎంతోకాలం హైదరాబాదుని అంటిపెట్టుకొని ఉండటం కష్టమే. తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం, సినీ పరిశ్రమ చాలా కష్టాలు ఎదుర్కొంది. చాలా తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ అక్కడే కొనసాగుతోంది.   మా అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ “మద్రాసు నుండి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ తరలి వచ్చి స్థిరపడిందనుకొంటున్న సమయంలో ఈ సమస్య రావడం దురదృష్టం. ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి వేరే చోటకు సినీ పరిశ్రమను తరలించడం చాలా కష్టం. అందువల్ల కొన్ని సమస్యలు ఎదురయినా ఇక్కడే కొనసాగుతాము. ఇరు ప్రభుత్వాలు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందింస్తాయని ఆశిస్తున్నాము,” అని అన్నారు.   హైదరాబాదులో అనేక ఫిలిం మరియు రికార్డింగ్ స్టూడియోలు, ల్యాబులు, చిత్ర నిర్మాణానికి అవసరమయిన సామాగ్రీ, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు వగైరా అన్నీలభ్యమవుతాయి. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగక తప్పదు. కానీ, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముండే మేల్కోవడం మేలని ఇప్పటికే ఒకసారి తెలిసి వచ్చింది. కనుక సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనువయిన ప్రాంతానికి తరలించేందుకు ఇప్పటి నుండే మెల్లగా ఏర్పాట్లు చేసుకొనట్లయితే, రాజధాని విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నట్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడకుండా తప్పించుకోవచ్చును. సినీ పరిశ్రమ నుండి వచ్చిన మురళీ మోహన్, బాలకృష్ణ వంటివారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు గనుక వారే చొరవ తీసుకొని పరిశ్రమకు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పించేందుకు కృషి చేస్తే బాగుంటుంది.

ఒకదెబ్బకు రెండు పిట్టలా?

  నిన్న వైజాగ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో క్విడ్-ప్రో క్రింద జరిగిన అక్రమ భూపంపకాలను గుర్తించి, అటువంటి భూములను తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని వేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. క్విడ్ ప్రోకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవినావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు ప్రభుత్వం తన తొలి సమావేశంలోనే అతని చుట్టూ మరింత గట్టిగా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని, అక్రమంగా కేటాయించబడ్డ ప్రభుత్వ భూములను గుర్తించి వెనక్కు తీసుకోవడానికే ఈ ప్రతిపాదనకు అంగీకరించానని చెప్పుకొన్నారు. కానీ అన్ని నదులు చివరికి సముద్రంలోనే కలిసినట్లుగా, అన్నిక్విడ్ ప్రో కేసులూ చివరికి జగన్మోహన్ రెడ్డి కేసులలోనే కలుస్తున్నాయి గనుక ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మిగిలినవారందరితో పాటు జగన్మోహన్ రెడ్డికీ మళ్ళీ సమస్యలు తప్పవని అర్ధం అవుతోంది.   ప్రస్తుతం అతనిపై ఇదే వ్యవహారంలో పది చార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయి. గనుక ఆ కేసులతో సంబంధం ఉన్న భూముల వ్యవహారంలో మంత్రుల సబ్-కమిటీ వేలు పెట్టలేదు కానీ ఇంకా అటువంటివి మరేమయినా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని వెనక్కు తీసుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఇదివరకు జగన్ క్విడ్ ప్రో కేసులపై సమగ్ర దర్యాప్తు చేసి, సీబీఐ కోర్టులో జగన్ పై చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణను తిరిగి రప్పించి ఆయనకే ఈ భాద్యతలు అప్పగిస్తే బాగుటుందని మంత్రులు దేవినేని ఉమా, బొజ్జల గోపాల కృష్ణ చేసిన సూచనకు చంద్రబాబుకు అంగీకారం తెలిపారు. త్వరలో కేంద్రంతో మాట్లాడి ఆయనను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.   గత పదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు క్విడ్ ప్రో పద్దతిలో అక్రమంగా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజధాని, కొత్తగా స్మార్ట్ సిటీలు, శాటిలైట్ సిటీలు రోడ్లు, భవనాలు నిర్మాణం కోసం వేల ఎకరాల భూములు, డబ్బు చాలా అవసరం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పంచబడిన ఆ లక్షల ఎకరాల భూములలో సగమయినా వెనక్కి రాబట్టగలిగినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. పైగా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ వ్యవహారామంతా జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకే పరిమితం చేసినట్లయితే విమర్శలు మూటగట్టుకోవడం తధ్యం.   అయితే అక్రమంగా పంచబడిన భూములను చంద్రబాబు ప్రభుత్వం తిరిగి స్వాదీనం చేసుకోనగలిగితే, కాగల కార్యం ఆ లక్ష్మి నారాయణుడే చక్కబెట్టగలరు. అప్పుడు చంద్రబాబు ఆశించినట్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది.

వికలాంగుల పెన్షన్ పై బాబు మెలిక

  ఎన్నికలలో హామీలివ్వడం ఎంత తేలికో అధికారం చేప్పట్టిన తరువాత వాటిని అమలుచేయడం అంత కష్టం. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రుణాలమాఫీ విషయంలో అప్పుడే నిరూపించి చూపగా, ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు దానిని మరోమారు నిరూపించి చూపారు. వ్యవసాయ రుణాల సంగతి తేల్చేందుకు కమిటీ వేస్తున్నట్లు మొదటి రోజే ప్రకటించేశారు గనుక దాని గురించి ఆలోచించేందుకు మరో 45రోజుల గడువు సంపాదించుకొన్నారు. అందువల్ల ఆ విషయంలో ఆయనను విమర్శించడానికి అవకాశం లేదు. కానీ వికలాంగులకు పెన్షన్ విషయంలో మాత్రం చిన్న మెలికపెట్టడం ద్వారా కొంతయినా ఆర్ధిక భారం తగ్గించుకొనే ప్రయత్నం చేయడంతో, బహుశః రేపటి నుండి ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించవచ్చును. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 80శాతం అంగ వైకల్యం ఉన్నవారికే రూ.1500 పెన్షన్ ఇస్తామని, అంతకంటే తక్కువ ఉన్న వారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ప్రకటించారు.   ఎన్నడూ అబద్దం ఆడని ధర్మరాజు అంతటివాడు కురుక్షేత్ర యుద్దంలో కౌరవ సేనలకు నాయకత్వం వహిస్తున్న ద్రోణాచార్యుల వారిని నిలువరించలేకపోవడంతో, ఆయనను మానసికంగా దెబ్బతీసి ఆయనపై పైచేయి సాధించేందుకు, “అశ్వత్థామ హతః...కుంజరః” (ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని బిగ్గరగా అరిచి, మెల్లగా ఆ పేరు గల ఏనుగు అని పలుకుతాడు). ధర్మరాజు కూడా అబద్దం ఆడినప్పటికీ, కుంజరః అని ద్రోణాచార్యుల వారికి వినపడనంత మెల్లగా పలికడం ద్వారా అపవాదు తప్పించుకొన్నాడు.   ఇప్పుడు కేసీఆర్, చంద్రబాబులు కూడా అదేవిధంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని, వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రజలందరి చెవులు చిల్లులు పడేంత బిగ్గరగా అరిచి చెప్పారు. కానీ కేవలం 2013-14సం.లలో లక్షలోపు తీసుకొన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు కుదువబెట్టి తెచ్చుకొన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయమని కేసీఆర్, 80శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవారికి రూ.1000 మాత్రమే ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత చల్లగా చెపుతున్నారు.   బహుశః వారిరువురూ మున్ముందు ఈ “అశ్వత్థామ హతః...కుంజరః” ఫార్ములాను ఇంకా చాలాసార్లు ప్రయోగించవచ్చును. అందువల్ల ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా ఆ ‘కుంజర’ శబ్దం కోసం ఇకపై చెవులు నిక్కబొడుచుకొని వినేందుకు సిద్దంగా ఉండక తప్పదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం-2

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కొన్ని భవన సముదాయాలు నిర్మించి దానినే రాజధాని అనుకోకూడదని, రాజధానికి అన్ని హంగులతో బాటు జీవం, జీవనం కూడా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. సింగపూరు వంటి రాజధాని నిర్మాణానికి కనీసం దాదాపు 20వేల ఎకరాల స్థలం అవసరం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటి గొప్ప రాజధాని కలిగి ఉండటం ఆంధ్ర ప్రజలందరికీ గర్వకారణమే. కానీ అది అక్షయ పాత్ర వంటి పచ్చని పంట పొలాల మీద నిలబడటం ఎవరూ హర్షించరు.   పొలాలు పోగొట్టుకొన్న రైతన్నలకి ఏదో రూపంలో పరిహారం చెల్లించ వచ్చును. కానీ సారవంతమయిన అటువంటి భూములను మరొక చోట సృష్టించలేము. వాటికి నీటి సౌకర్యమూ కల్పించడము అదనపు భారమే అవుతుంది. పైగా ఆర్భాటానికి పోయి చేజేతులా ఆహారపు కొరతను సృష్టించుకొన్నవారము అవుతాము.   రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అందుకు అవసరమయినంత భూమిని మాత్రమే సేకరించాలి. వీలయినంత వరకు సారవంతమయిన పంట పొలాల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. ఇప్పటికే కొందరు స్వార్ధ పరులయిన రాజకీయ నేతలు, రియల్టర్లు ఆ ప్రాంతంలో పచ్చటి పంట పొలాలను, మామిడి, కొబ్బరి, అరటి వంటి తోటలను చదునుచేసి లే అవుట్లుగా మారుస్తున్నారు. వీరు కాక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ఆ పరిసర ప్రాంతాలలో భారీగా (పంట) భూములను కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిని ప్రభుత్వం తక్షణమే అడ్డుకొని పంట భూములను కాపాడుకోవాలి. కానీ ఆపని చేయకుండా ప్రభుత్వమే ఇప్పుడు స్వయంగా ఆ రెండు జిల్లాలలో మిగిలిన పంట భూములను సేకరించి దానిపై కొత్త రాజధాని నిర్మించాలనుకొంటే, మున్ముందు ఇతర రాష్ట్రాల నుండి బియ్యం, పప్పులు దిగుమతి చేసుకోవలసి దుస్థితి ఏర్పడుతుంది.   అయితే దీనికి పరిష్కారం ఏమిటంటే కొత్త రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఏర్పాటు చేసి, హైకోర్టు, అసెంబ్లీ, శాసనమండలి, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు వంటివన్నిటినీ మిగిలిన జిల్లాలలో ఒక్కో చోట ఏర్పాటు చేయవచ్చును. తద్వారా సారవంతమయిన పంట పొలాలను కాపాడుకొంటూనే, అభివృద్ధి వికేంద్రీకరణ చేసే అవకాశం ఉంటుంది. పదమూడు జిల్లాలలో ఉంటున్న ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు సమానంగా అందినట్లయితే ఇక అసంతృప్తికి తావుండదు.   రాష్ట్ర రాజధాని అంటే కేవలం ఒక వృత్తాకారంగానో, చతురస్రాకారంగానో ఉండాలనే నియమేమీ లేదు. అవసరమయితే తూర్పు గోదావరి జిల్లా నుండి ప్రకాశం జిల్లా వరకు పొడవుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చును.   ఒకవేళ రాజధానిని ఖచ్చితంగా విజయవాడ-గుంటూరు మధ్యే ఏర్పాటు చేయాలనుకొన్నట్లయితే, అక్కడ ఉన్న పంట భూములను అంతా నాశనం చేసి నిర్మించడం కంటే, ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోవచ్చును కూడా. జపాన్, తైవాన్, సింగపూర్ వంటి చిన్న చిన్న దేశాలలో ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో 20-30 పైబడి నిర్మించిన భవన సముదాయం ఒక్కటి కూడా లేదు. అందువల్ల సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాలలో నిర్మించినట్లు 50-100 లేదా అంతకు పైబడి అంతస్తులు గల భవన సముదాయాలు కొత్త రాజధానిలోనే నిర్మించినట్లయితే, సారవంతమయిన పంట పొలాలను రక్షించుకొన్నట్లవుతుంది. పైగా అటువంటి ఆకాశ హర్మ్యాలు దేశంలో మొట్ట మొదటగా సారిగా మన రాష్ట్రంలోనే నిర్మించబడటం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమవుతుంది.

శాఖల కేటాయింపుకు ముందే మంత్రులకు బాబు క్లాసు

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు కూడా మోడీనే ఆదర్శంగా తీసుకొని పని ప్రారంభించారు. మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యి శాఖలు ఏవయినప్పటికీ మంత్రులందరూ తప్పనిసరిగా ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకొంటూ రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేయాలని, ముటాలు, గ్రూపు రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ముందే అందరికీ హెచ్చరికలు జారీ చేసారు. మూడు నెలల తరువాత వారి పని మంచి పనితీరు స్వయంగా సమీక్షిస్తానని , సంతృప్తికరంగా లేకపోయినా మంత్రివర్గంలో నుండి ఉద్వాసన తప్పదని ముందే హెచ్చరించారు.   మంత్రులకి పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే చంద్రబాబు అందరికీ గట్టిగా క్లాసు తీసుకోవడంవలన, ఎవరూ కూడా ఇంతవరకు తమకు అప్రదాన్యమయిన శాఖలు ఇచ్చేరని అలిగి కూర్చోన్నట్లు వార్తలు రాలేదు. ఎవరయినా అలిగినట్లయితే బహుశః వారిని ఆ పదవి నుండి తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణా అసెంబ్లీకి తెదేపా శాసనసభాపక్ష చైర్మన్ గా ఎర్రబెల్లి దయాకర్ రావుని, శాసనసభ ఫ్లోర్ లీడర్ గా తలసాని యాదవ్ ను నియమిద్దామనుకొన్నపుడు, తలసాని యాదవ్ తనకు శాసనసభాపక్ష నాయకుడిగా నియమించనందుకు అలిగి, తనకు ఎటువంటి పదవులు వద్దని శాసనసభ్యుడుగానే కొనసాగుతానని ప్రకటించడంతో, చంద్రబాబు ఆయనను పక్కన పెట్టేసారు.   అందువల్ల ఇప్పుడు అప్రదాన్య శాఖలను ఇచ్చినందుకు అలిగితే తమకు అదే పరిస్థితి ఎదురవుతుందని మంత్రులందరిలో ఒకరకమయిన భయం ఏర్పడింది. గ్రూపు రాజకీయాలు నడపడంలో అందెవేసిన గంట శ్రీనివాస రావు బహుశః అందుకే తనను వ్యతిరేఖించే విశాఖజిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడుతో కలిసిపని చేస్తానని చెప్పారు.