మెట్రో రైల్ వార్తలు మీడియా చలవేనట

  హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే దానిపై అధికార తెరాస ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు మొదలయ్యాయి. దానితో వెంటనే మేల్కొన్న తెలంగాణా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టి, సంబంధిత వ్యక్తులందరి చేత ఖండనలు చేయించింది. మెట్రో పనులలో అడ్డంకులు ఏర్పడటం, దానిపై తాము లేఖలు వ్రాసుకోవడం అన్నీ నిజమే కానీ, ప్రభుత్వంతో తమకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని, ప్రభుత్వ సహకారంతోనే తాము అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, అదేవిధంగా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి తీరుతామని ఈ లేఖ వ్రాసినట్లుగా చెప్పబడిన యల్.యండ్.టీ. మేనేజింగ్ డైరెక్టర్ గాడ్గిల్ సంజాయిషీతో “జబ్ మియా బీబీ హోగయా రాజీ క్యా కరేగా ఖాజీ?”(మొగుడు పెళ్ళాలు రాజీ పడిపోయేక ఖాజీ (ముస్లిం పురోహితుడు) మాత్రం ఏమి చేస్తాడు?) అనే నానుడి ఊరికే పుట్టలేదని ఈరోజు మరోసారి రుజువయింది. తరువాత ప్రాజెక్టు రెండవ దశ పనులు మొదలు పెట్టేందుకు సంబంధిత అధికారులను తక్షణమే డిల్లీ పంపించి మెట్రో గురువుగా పేరొందిన శ్రీధరన్ నుండి అవసరమయిన సలహాలు తీసుకోబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం, సదరు సంస్థ రెండూ కూడా తమ మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఇదంతా మీడియా సృష్టేనని తేల్చి పడేశాయి. ఒకటి రెండు పత్రికలు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఉద్దేశ్య పూర్వకంగా లేఖలో కొంత భాగం మాత్రమే ప్రచురించాయని ప్రభుత్వం ఆరోపించింది.

ఓడినా మేమే గెలిచాము: రఘువీర రెడ్డి

  అధికార తెలుగు దేశం ప్రభుత్వానికి బుద్ధి చెపుతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ నందిగామ ఉపఎన్నికల బరిలో దూకిన కాంగ్రెస్ పార్టీ అదే అధికారపార్టీ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కానీ చింత చచ్చినా పులుపు చావనట్లు, ఓడిపోయినా తమ పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదం. తాము ఎన్నికలలో పైసా ఖర్చు పెట్టకపోయినా సుమారు పాతికవేలు ఓట్లు గెలవడం తెదేపా పరిపాలన పట్ల ప్రజల అసంతృప్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని ఆయన కొత్త విషయం కనిపెట్టి చెప్పారు.   కానీ 'అశ్వత్థామ హతః కుంజరహః' అన్నట్లుగా ఆయన అసలు విషయం మాత్రం చెప్పనే లేదు. తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ రావు ఆకస్మిక మృతి కారణంగా వచ్చిన ఈ ఉపఎన్నికలలో తెదేపా ఆయన కుమార్తె సౌమ్యను తన అభ్యర్ధిగా నిలబెడుతున్న కారణంగా వైకాపా తన అభ్యర్ధిని నిలబెట్టలేదు. అందుకే వైకాపా ఖాతాలోపడవలసిన ఓట్లు, కాంగ్రెస్ ఖాతాలో జామా అయ్యాయి. ఒకవేళ వైకాపా కూడా ఈ ఉప ఎన్నికలలో పాల్గొని ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ అయినా దక్కేది కాదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయినా రఘువీరా రెడ్డి ఈ సంగతి ప్రస్తావించకుండా వాపును చూసి బలుపని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వలన ఆయనకు, కాంగ్రెస్ పార్టీకే నష్టం కలుగుతుంది తప్పఅధికార తెదేపాకు కానీ ప్రజలకు గానీ ఎటువంటి నష్టమూ లేదు. ఇటువంటి వాదనలు ఆయన తన అధిష్టానానికి సర్ది చెప్పుకోవడానికి పనికివస్తాయి తప్ప ప్రజలకు నచ్చజెప్పడానికి పనికి రావని దని గ్రహిస్తే మేలు. అయినా ఆయన ఇటువంటి భ్రమల్లో బ్రతకాలనుకొంటే ఎవరు మాత్రం కాదంటారు.

అవును! నేను ఇంకా పని మొదలుపెట్టలేదు: కేసీఆర్

    అవును! నేను ఇంకా పని మొదలుపెట్టలేదు. ఈ మాటన్నది ఎవరో కాదు సాక్షాత్ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప అధికారం చేప్పట్టి మూడు నెలలయినా ఇంత వరకు పని మొదలు పెట్టలేదని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో వేరొకరయితే తమ ప్రభుత్వం చేప్పట్టిన కార్యక్రామలను ఏకరువు పెడుతుంటారు. కానీ కేసీఆర్ మాత్రం చాలా దైర్యంగా “అవును! మా ప్రభుత్వం ఇంకా పని మొదలుపెట్టలేదు” అని చెప్పడం విశేషమే. అంతే కాదు “ఒకసారి తన ప్రభుత్వం పని చేయడం మొదలు పెడితే ఇక ఏ ప్రతిపక్ష పార్టీ తమ ప్రభుత్వం ముందు నిలవలేదని” హెచ్చరించారు కూడా.   తన ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలనే ఆలోచనతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొని అడుగు ముందుకు వేస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రుణాలతో సహా తాను ఇచ్చిన ప్రతీ హామీని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని, అయితే అంతవరకు ప్రతిపక్ష పార్టీలు నోటికి వచ్చినట్లు వాగుతుంటూనే ఉంటాయని, వాటిని తాను పట్టించుకొబోనని అన్నారు. తెలంగాణ అవసరాలకు సరిపోయే విధంగా బడ్జెట్ తిరిగి రూపొందిస్తునందున బడ్జెట్ సమావేశాలలో కొంచెం జాప్యం జరుగుతోందని, అయితే డిశంబరులోగా రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకొనే వెసులుబాటు ఉన్నందున, అన్ని విధాల తెలంగాణకు సరిపోయే బడ్జెట్ ను తయారుచేసి దానిని ముందుగా ఆర్ధిక సంఘానికి సమర్పించిన తరువాతనే బడ్జెట్ సమావేశాలు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేసారు.

కాంగ్రెస్ ఆత్రపడితే జీ.హెచ్.యం.సి. ఎన్నికలు వస్తాయా?

  తెలంగాణా కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు సిద్దం అయ్యే ప్రయత్నంలో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యి ఆ పరిధిలో స్థిరపడిన సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో వారి భద్రతకు తాము భరోసా ఇస్తున్నామంటూ ఏవో చాలా మాటలే చెప్పారు. అయితే జీ.హెచ్.యం.సి. కౌన్సిల్ ప్రస్తుత కాలపరిమితి డిశంబరులో ముగుస్తుంది. ఆ తరువాత జీ.హెచ్.యం.సి. పరిధిలో వార్డులను జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేసి, ఆయా వార్డులలో బీసీ, యస్సీ, యస్టీ వర్గాలకు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. కనుక ఆ ప్రక్రియ అంతా పూర్తీ చేసేవరకు జీ.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని రవాణా శాఖామంత్రి పీ. మహేందర్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా టీ-కాంగ్రెస్ జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు అప్పుడే సమర శంఖం పూరించేసారు. అంతేగాక ఈ సారి సెట్టిలర్లను ప్రసన్నం చేసుకొని ఈ ఎన్నికలలో గట్టెక్కాలని ఒక ప్రణాళిక కూడా సిద్దం చేసుకొన్నట్లున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎంతగా ఆత్రం పడినప్పటికీ ఇప్పట్లో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగే అవకాశం లేదని మంత్రిగారి ప్రకటన స్పష్టం చేస్తోంది.

టీ-కాంగ్రెస్ కి సీమాంధ్ర ప్రజలు మళ్ళీ గుర్తుకు వచ్చేరు

  హైదరాబాదులో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ తో సహా కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రా ప్రజల తరపున తాము నిలబడి పోరాడుతామని, వారి భద్రతకు తమ పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని ముక్త కంఠంతో చాలా గట్టిగా చెప్పారు. అయితే ఇదే టీ-కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన తరువాత తమ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొంటూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రాంతాలలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజల పక్షాన్న నిలబడి గట్టిగా మాట్లాడటం వలన తెలంగాణా ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేఖత ఏర్పడి, అది తమ ఓటమికి దారి తీసిందని కనుగొన్నారు. ఆనాడు తప్పుగా కనిపించింది ఈనాడు కాంగ్రెస్ నేతలకు ఒప్పుగా ఎందుకు కనిపిస్తోంది అంటే దానికీ వారి ప్రసంగాలలోనే సరయిన సమాధానం దొరుకుతుంది.   త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలందరూ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో గెలవాలంటే అక్కడ అత్యధికంగా ఉన్న ఆంద్ర ప్రజల ఓట్లే చాలా కీలకం కానున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చాలా కాలం తరువాత ఆంద్ర ప్రజల భద్రత గురించి మాట్లాడుతోంది. విశ్వనగరం నిర్మించడం అంటే ప్రజల ఇళ్ళు కూల్చి వేయడం, వారిలో అభద్రతా భావం పెంచడం కాదని మాజీ మంత్రి కె.జానారెడ్డి అధికార తెరాస ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో స్థిరపడిన ఆంద్ర ప్రజలకు అండగా నిలబడుతుందని గట్టిగా చెప్పారు. ఆనాడు తెలంగాణా ప్రభుత్వం ప్రజల ఇళ్ళను కూల్చివేస్తుంటే నోరు మెదపని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తాపీగా ఆ విషయం ప్రస్తావించి, తాము ప్రజలకి అండగా నిలబడుతామని కాంగ్రెస్ నేతలు చెప్పడం కేవలం గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చెపుతున్న ఒట్టొట్టి మాటలేనని అర్ధమవుతూనే ఉంది.   కాంగ్రెస్ నేతల మాటలలో విశ్వసనీయత, చిత్తశుద్ధి కొరవడినందునే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించాఋ. కానీ వారు నేటికీ అది గ్రహించకుండా మళ్ళీ అదే ధోరణిలో వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వారు తమ ఈ తీరు మార్చుకోనంతకాలం ఈ విధంగా భ్రమలలోనే బ్రతకవలసి ఉంటుందనే సంగతి ఇంకా ఎప్పటికి గ్రహిస్తారో? పాపం కాంగ్రెస్ నేతలు!

పంట రుణాల మాఫీపై ఆంధ్రా ప్రభుత్వ ఎఫెక్ట్

  ఈరోజు జరిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వచ్చే నెల మొదటి వారం నుండి వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమాన్ని చెప్పట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. తొలివిడతలో రూ.10, 000 కోట్ల రుణాలు మాఫీ చేయబడతాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి చాలా ఆనందం కలుగజేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రభావం తెలంగాణా ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా ఉంది.   ఆంద్రప్రదేశ్ కంటే అన్ని విధాల మెరుగుగా ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తేల్చలేదు. కానీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇప్పుడు తప్పనిసరిగా తెలంగాణా ప్రభుత్వం కూడా రుణాల మాఫీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బహుశః త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్టులో దీని కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయవచ్చును. లేకుంటే తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలకు మరొక మంచి అవకాశం అందించినట్లవుతుంది. ఏమయినప్పటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన ఆంద్రప్రదేశ్ రైతాంగానికే కాక, తెలంగాణా రైతాంగానికి కూడా మేలు జరగడం సంతోషమే కదా.   ఇక ఈ నిర్ణయం వైకాపాకు కొంత నిరాశ కలిగగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ వచ్చే నెల నుండి పంట రుణాల మాఫీ చేయమంటూ రైతులను కలుపుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉద్యమాలు మొదలు పెట్టాలని భావించింది. కానీ అంతకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రుణాల మాఫీ ప్రక్రియ మొదలు పెడుతోంది కనుక తన ఉద్యమ ఆలోచనకు రైతుల నుండి అంతగా స్పందన రాకపోవచ్చును. ఇది వైకాపాకు కొంచెం నిరాశ కలిగించే విషయమే.

శభాష్ ఏపీ సర్కార్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణా ఆర్ధికంగా కొంచెం బాగానే ఉంది. అంతే కాదు వ్యవసాయ రుణాల భారం కూడా తక్కువే ఉంది. అయితే నేటికీ తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతోంది. కానీ తీవ్ర ఆర్ధిక సమస్యలతో క్రుంగిపోయున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా ముందుందని చెప్పవచ్చును. పంట రుణాలమాఫీ చేయాలనే తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని దృవీకరిస్తూ ప్రభుత్వం ఒక జీ.ఓ. జారీ చేయడమే కాకుండా, ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అక్టోబరు మొదటి వారం నుండి దానిని అమలు చేయాలని నిర్ణయించుకొంది. కానీ ఇప్పటికిప్పుడు వేల కోట్ల రుణాలు ఒకేసారి తీర్చే పరిస్థితిలో లేనందున, తోలి విడతగా రూ.10, 000 కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిశ్చయించుకొంది.   రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున పలు చర్యల కారణంగా త్వరలోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, అప్పుడు మిగిలిన పంట రుణాలను కూడా ఇదేవిధంగా తీర్చివేయగలనని భావిస్తోంది. అటు కేంద్రం కానీ రిజర్వు బ్యాంకు కానీ ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయకపోయినా, తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టి ముట్టి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా దైర్యంగా, చాలా నేర్పుగా పంట రుణాలను తీర్చి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా అభినందనీయం.

అభివృద్ధి ఆలోచనల్లో కేసీఆర్.. ఫైల్స్ చూసే తీరిక కూడా లేదు...

  తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతగానో తపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఆలోచనల్లో నిమగ్నమై వున్నారు. తెలంగాణ అభివృద్ధి ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయి వున్న ఆయన వంద రోజులుగా మేధోమథనం చేస్తున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తూ ‘బంగారు తెలంగాణ’ సాధించడం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ముఖ్యమంత్రిలో కనిపిస్తున్న కసిని చూస్తుంటే ఆయన తెలంగాణని ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తుకి తీసుకెళ్ళేలా కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా సరే ‘తెలంగాణ’ కోణంలో వుండాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో ఎంతో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఆయనకు పాపం తన కార్యాలయానికి వచ్చే ఫైళ్ళను చూసే తీరిక కూడా వుండటం లేదు. దానివల్ల దాదాపు వెయ్యి కీలక ఫైళ్ళు పెండింగ్ పడిపోయాయని తెలుస్తోంది. వెయ్యి ఫైళ్ళు పెండింగ్‌లో వుండటం అనేది మామూలు విషయం కాదు. అయినప్పటికీ ఏదో రోజు ఆయన పెండింగ్ ఫైళ్ళని క్లియర్ చేసే పనిలో పడతారన్న ఆశాభావం ప్రభుత్వ అధికారులలో వ్యక్తమవుతోంది.   ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే ఏ పని అయినా ‘తెలంగాణ’ కోణంలో వుండాలని భావిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ కోణానికి సంబంధించిన విధి విధానాలను ఇంకా ఖరారు చేయాల్సి వుంది. అవి ఖరారయ్యాక ఫైల్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఎందుకంటే, ప్రభుత్వ విధానం ‘ఇదీ’ అని క్లియర్ అయ్యే వరకూ ఫైళ్ళను క్లియర్ చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారని అనిపిస్తోంది. ప్రభుత్వ విధానం విషయంలో క్లారిటీ వస్తే, పెండింగ్‌ వున్న ఫైళ్ళను ఆ విధానానికి అనుగుణంగా క్లియర్ చేసేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. సీఎం గారి ఆలోచన ఎలా వున్నా, పెండింగ్‌లో వున్న ఫైల్స్‌ ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియకపోయినా కేసీఆర్ ప్రభుత్వం భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం మాత్రం ప్రజల్లో, అధికారుల్లో బలంగా వుంది.

ఏపీకి నిధుల విడుదల ఇంకా ఎప్పుడో?

  కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మూడు నెలలపైనే అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా నిధుల కోసం మోడీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క నయాపైసా విదిలించలేదు. కానీ కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ తదితరులు హామీలు గట్టిగానే ఇస్తున్నారు. కేంద్రం నిధులు విదిలించనిదే అభివృద్ధి పనులు మొదలుపెట్టే అవకాశం లేకపోవడంతో రోజులు గడుస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.   అయితే నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోకుండా, రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన అధ్యయనం, పోలవరం ప్రాజెక్టు క్రిందకు వచ్చిన ముంపు గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో విలీనం చేసి నిర్వాసితుల తరలింపుకి అవసరమయిన ఏర్పాట్లు, ప్రాజెక్టుకి అభ్యంతరం చెపుతున్న ఛత్తీస్ ఘర్, ఒడ్డిషా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు చర్చలు, రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపడం వంటివి అనేకం చేస్తోంది.   త్వరలో ప్రభుత్వ ప్రధాన శాఖలను విజయవాడకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండటంతో విజయవాడలో చేప్పట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అనేక ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. వాటిలో ముఖ్యంగా కనక దుర్గ గుడివద్ద రూ. 270 కోట్లతో ఫ్లై-ఓవర్ నిర్మాణం, అది నిర్మాణం అయ్యేవరకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడానికి ఇప్పుడున్న రోడ్డును రూ. 3.5 కోట్లతో ఆధునీకరణ, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, రాయలసీమను విజయవాడ వద్ద నిర్మింపబడే కొత్త రాజధానితో కలుపుతూ ఆరు రోడ్ల నిర్మాణం, విజయవాడ-మచిలీపట్నం మధ్య రూ. 1,000 కోట్లతో హైవే వెడల్పు చేయడం వంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.   ఒక్క విజయవాడకు సంబందించిన ప్రతిపాదనలే ఇన్ని ఉన్నాయి. ఇక జిల్లాల వారిగా చూసుకొన్నట్లయితే ఇటువంటివి కనీసం వందకు పైగానే ఉంటాయి. కేంద్రం వేటినీ కాదనకుండా హామీలు గుప్పిస్తూ మీనమేషాలు లెక్కపెడుతూనే ఉంది. ఏమంటే కేంద్ర ప్రభుత్వం పలు శాఖలను, వ్యవస్థలను, చట్టాలను సవరించడంలో తీరిక లేకుండా ఉందని సమాధానం వస్తోంది. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం మొదలుపెడుతుందో తెదేపా నేతలు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రయత్నలోపం లేకుండా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కనుక బహుశః త్వరలోనే కనీసం రెండు మూడు పెద్ద ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ మంత్రులకు ఐ-ప్యాడ్ పరీక్షలు

  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా పేపర్ రహిత మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అందుకోసం శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులందరికీ ఐ-ప్యాడ్ లు, వాటి పాస్ వర్డులు అందించి వారికి వాటిని వినియోగించడంలో ఒక రోజు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. కానీ చాలామంది మంత్రులకు ఐ-ప్యాడ్ ల వినియోగంపై అవగాహన ఏర్పడలేదు. అందువల్ల తమ వ్యక్తిగత కార్యదర్శుల సహకారం తీసుకోక తప్పడంలేదు. అయితే ఈ ఐ-ప్యాడ్ లు ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశ్యం గోప్యత పాటించడం కూడా ఒకటి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. మరి కొందరు మంత్రులు తమకు కేటాయించిన పాస్ వర్డులు మరిచిపోవడంతో, అసలు ఐ-ప్యాడ్ లలో నిక్షిప్తం చేసిన మంత్రివర్గ సమావేశ అజెండా సైతం తెలియని స్థితి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సాటి మంత్రుల ద్వారా దాని గురించి తెలుసుకోవలసి వచ్చింది. ఈ  మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అసలు విషయాల కంటే ముందు మంత్రులకు  ఐ-ప్యాడ్ లతో నెగ్గుకు రావడమే పెద్ద సమస్యగా మారేట్లుంది.   ఐ-ప్యాడ్ వినియోగించడంలో మెలుకువలు తెలుసుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని, అంతవరకు తమ సహాయకులకు పాస్ వర్డులు ఇవ్వకతప్పదని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కే.ఇ. కృష్ణ మూర్తి, సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ళ కోషోర్ చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. సమావేశ అజెండా గురించి గోప్యత పాటించే ప్రయత్నంలో అంతా ఐ-ప్యాడ్ లలో నిక్షిప్తం చేసినందున, అది మంత్రుల సహాయకుల చేతిలో పడి ముందుగానే మీడియాకు కూడా పొక్కే అవకాశం ఏర్పడింది. గోప్యత పాటించినా సమావేశం తరువాత అందులో చర్చించిన విషయాలు, తీసుకొన్న నిర్ణయాల గురించి తప్పనిసరిగా మీడియాకు వివరించడం అవసరం కనుక ఇదంతా వృధా ప్రయాసగా మిగిలిపోనుంది. అంతే కాదు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప పేరు రావడం సంగతెలా ఉన్నప్పటికీ ఈ వ్యవహారం అంతా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు మరో మంచి అవకాశం కల్పించినట్లవుతోంది. దీనిద్వారా మంత్రివర్గం సాధించేదేముందో తెలియదు కానీ, మంత్రులకు ఇబ్బందులు, ప్రభుత్వానికి విమర్శలు మాత్రం తప్పకపోవచ్చును.

అమరావతిలో రాజధాని బెస్ట్! వాస్తు ఎక్స్‌పర్ట్ అడ్వైజ్

  మొదట ఆంద్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించాలని చర్చ. ఎక్కడకడితే ఏ పార్టీకి ఎంత లాభమో అనేదానిపై మరో రసవత్తరమయిన చర్చ...ఆ తరువాత దాని గురించి ప్రతిపక్షాలకు మాట మాత్రంగా చెప్పలేదని రచ్చ రచ్చ. తరువాత సింగపూరు మోడలా... లేక చికాగో మోడల్లో నిర్మించాలా అనే మరో ఆసక్తికరమయిన చర్చ. తరువాత భూసేకరణ..అందుకు నిధుల సమీకరణ..ఇత్యాది సమస్యలు. ఇవ్వనీ సరిపోవన్నట్లు కొత్తగా వాస్తు సమస్యలు..పరిష్కారాలు..వాటిపై మళ్ళీ చర్చలు విమర్శలు.. ఇదంతా చూస్తుంటే ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుంది.   ఇక వాస్తు స్పెషలిస్టులు కూడా ప్రజలలో భాగమే కనుక వారు కూడా ఈ చర్చలో ఎంట్రీ ఇచ్చేరు. వాస్తు ప్రకారం కృష్ణా నదికి కుడివైపు రాజధానిని నిర్మిస్తే, నదీ ప్రవాహం ఉత్తరం నుండి ఈశాన్యం వైపు ప్రవహిస్తుంటుంది కనుక రాష్ట్రానికి, ప్రజలకి, ప్రభుత్వానికి, దాని అధిపతికి కూడా మంచి జరుగుతుందని స్పెషలిస్టుల సలహా.   రాష్ట్ర ప్రభుత్వం మొదట నూజివీడు వద్ద రాజధాని నిర్మిద్దామని అనుకొన్నా, అప్పుడు రాజధానికి కృష్ణానది ఆగ్నేయం వైపు ప్రవహిస్తుంటుంది. దానికి వాస్తు స్పెషలిస్టులు ఒప్పుకోలేదు కనుక ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకొని (కృష్ణ) ఒడ్డునపడే పడే ఆలోచన చేస్తోందని పబ్లిక్ టాక్. అందుకే చంద్రబాబు మొదటి నుండి మంగళగిరి జపం చేస్తున్నారని టాక్ వినబడుతోంది.   అయితే మంగళగిరి వద్ద కంటే అమరావతి వద్ద ఉన్న వైకుంటపురం రాజధానికి వాస్తుపరంగా చాలా అనువయిన ప్రాంతమని, ఎందుకంటే అక్కడ నిర్మిస్తే రాజధానికి నది ఖచ్చితంగా ఈశాన్యం వైపే ప్రవహిస్తోంటుందని ఎక్స్ పర్ట్ అడ్వైజ్ లభిస్తోంది. అందువలన అమరావతా మంగళగిరా అనే దానిపై కూడా మరో చర్చ అవసరంపడుతోంది.   ఇక ఏ శాస్త్రానికయినా అమెండ్మెంటులు, పండితుల వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలు అనివార్యం కనుక గుంటూరు వాస్తు స్పెషలిస్టులు అసలు గుంటూరే అన్ని విధాల రాజధానికి అనువయిందని బల్ల గుద్దిమరీ వాదిస్తున్నారు. ఏవిధంగా అంటే “గుంటూరు సముద్ర మట్టానికి 36 మీటర్ల ఎత్తులో ఉంటే, విజయవాడ కేవలం 12.5 మీటర్ల ఎత్తులో ఉంది కనుక, యజమాని అంటే సచివాలయం ఎప్పుడు ఉన్నతమయిన స్థానంలోనే ఉండాలనుకొంటే గుంటూరులోనే సెటిల్ అవడం మంచిది. అలాకాక పల్లపు ప్రాంతమయిన విజయవాడలో పాలకులు, ఎగువ ప్రాంతాలలో ప్రజలు ఉన్నట్లయితే శాస్త్రం ఎలాగు ఒప్పుకోదు, పైగా అరిష్టం కూడాను...” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.   కానీ మంగళగిరికి మొగ్గుతున్నవాళ్ళు బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా కోట్ చేస్తూ “మంగళగిరి మెగా సిటీ అవుతుందని అయన ఎప్పుడో చెప్పారు. అటువంటప్పుడు వేరే ఎక్కడో రాజధాని ఎలా నిర్మిస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.   నిత్యం అందరూ పూజలు, పునస్కారాలు, వాస్తు, గ్రహ దోష పరిహారాలు ఎన్ని చేసుకొంటున్నా ఆ విషయం పబ్లిక్ గా చెప్పుకోవడానికి హేతువాదులు అభ్యంతరం చెపుతుంటారు కనుక, విజయవాడ యంపీ కెశినేని నాని “ఈ వాస్తు టాక్ అంతా ఒట్టి రబ్బిష్..ప్రభుత్వం అదేమీ చూడటంలేదు..అందంతా గిట్టని వాళ్ళు చేస్తున్న ప్రచారం మాత్రమే..మా ప్రభుత్వం అందరూ మెచ్చుకొనే విధంగా సింగపూరు వంటి గొప్ప రాజధానిని ఏవిధంగా నిర్మించాలని మాత్రమే ఆలోచిస్తోంది తప్ప వాస్తు గురించి కాదు,” అని మ్యాటర్ కట్ చేసే ప్రయత్నం చేసారు. (అందువలన సింగపూరు, చికాగో నగరాలు వాస్తు ప్రకారం నిర్మింపబడ్డాయో లేదో ముందు తెలుసుకొంటే ప్రభుత్వం నిజం చెపుతోందా లేదో ఈజీగా కనిపెట్టేయవచ్చును. ఆ రెండు నగరాలు బాగానే అభివృద్ధి చెందాయి కనుక వాటి వాస్తు కూడా బాగానే ఉందని ఒప్పుకోక తప్పదు. కనుక మన రాజధానికి కూడా అదే వాస్తు సూటవుతుందని బాబుగారు భావిస్తున్నారేమో.)   ఏమయినప్పటికీ ప్రభుత్వం మాత్రం (వాస్తు స్పెషలిస్టులు సూచించిన విధంగా) క్రిష్ణమ్మకు కుడివైపుకే ఫిక్స్ అయిపోయినట్లుగానే కనిపిస్తోంది. కృష్ణా నదికి కుడివైపునున్న 11మండలాలలో సర్వే నిర్వహించమని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. ఈ వాస్తు పుణ్యమాని ఇంతకాలానికి మా పంట పండబోతోందని అక్కడి రైతులు చాలా సంతోషిస్తున్నారుట. ఎందుకంటే ఎకరానికి కోటి రూపాయలు చెపుతున్నారు కదా మరి!

అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన భూసేకరణ

  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రాభివృద్ధికి చాలా భారీ ప్రణాళికలు ప్రకటించింది. జిల్లా కొకటి చొప్పున అన్ని జిల్లాలలో కొత్తగా చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం, వైజాగ్, తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం వంటి భారీ ప్రణాళికలు అందులో ఉన్నాయి. విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు అవబోతోందనే విషయం పసిగట్టిన అనేకమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు భారీగా భూములు కొనుగోలు చేసి దానిపై అంతకు పదింతలు సొమ్ము ఆర్జించాలని ఏవిధంగా ఆరాటపడుతున్నారో, అదేవిధంగా రాష్ట్రంలో రైతులు కూడా ఇన్నాళకు తమ పంట పండినదని సంతోషిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో రైతులు తమ భూముల ధరలు అమాంతం పెంచేసి ఎకరానికి కోటి రూపాయలు ఇస్తేగానీ అమ్మబోమని చెట్టెక్కి కూర్చోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది.   ప్రభుత్వం ఎకరానికి రూ.25 నుండి 40లక్షల వరకు చెల్లించేందుకు సిద్దపడినా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. రాజకీయ నాయకులే ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నపుడు తాము మాత్రం ఎందుకు త్యాగం చేయాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి ఈ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అలాగని ఎంతో కొంత సొమ్ము వారి చేతిలో పెట్టేసి వారి భూములు బలవంతంగా గుంజుకొంటే అది ఇంకా ప్రమాదం. ఈ పని చేసినట్లయితే ‘రైతు వ్యతిరేఖ ప్రభుత్వం’ అంటూ ప్రతిపక్షాలతో కలిసి రైతులు కూడా ఉద్యమించే ప్రమాదం ఉంది. అదీ గాక వారందరినీ కలిపేందుకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం ఉండనే ఉంది.   ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ఎన్నిప్రణాళికలు సిద్దం చేసుకొన్నా, భూసేకరణ ఇప్పుడు ప్రతిబంధకంగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 ప్రకారం రాష్ట్రాభివృద్ధికి కేంద్రమే అన్ని విధాల సహాయం చేస్తాననే హామీ ఉంది. కనుక విమానాశ్రయాల ఏర్పాటు, అభివృద్ధికి సంబంధించినంత వరకు కేంద్ర సహాయం కోరాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. తెదేపా యంపీ మరియు కేంద్ర విమానశాఖా మంత్రి అశోక్ గజపతి రాజు ద్వారా ఈ పని సాధించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందుకు కేంద్రం అంగీకరించినట్లయితే, భూసేకరణకి రూ.500 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధి కోసం మరో రూ.300 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయవలసి ఉంటుంది.   కానీ లక్షల కోట్లు వ్యయం అయ్యే పోలవరం, కొత్త రాజధాని నిర్మాణం, వైజాగ్-చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటువంటి అనేక ప్రతిపాదనలను అమలు చేయవలసిన కేంద్రం, భూసేకరణకు కూడా అంత డబ్బు మంజూరు చేస్తుందా? విమానాశ్రయాల ఏర్పాటు, అభివృద్ధికే ఇన్ని వందల కోట్లు అవసరమయితే రేపు మిగిలిన అన్నిటినీ నిర్మించేందుకు భూసేకరణ చేయవలసి వస్తుంది కనుక అప్పుడు వాటికి కూడా కేంద్రమే భరిస్తుందా? అని ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం తలొగ్గకపోవచ్చని అర్ధమవుతోంది.   కేంద్రం ఏ ప్రాజెక్టు మంజూరు చేసినా దానికి అవసరమయిన భూములను చూపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. అందువలన ఈ భూసేకరణ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోగలిగితేనే, అన్ని ప్రాజెక్టులు అమలుకు నోచుకొంటాయి. కనుక కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, పాతవాటి అభివృద్ధికి ల్యాండింగ్ గేర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని భావించవలసి ఉంటుంది.

ఏపీ ప్రభుత్వానికి సెల్యూట్

  బెదిరించి సెల్యూట్స్ చేయించుకోవాలని అనుకోవడం గొప్ప విషయం కాదు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేసిన ఎవరికైనా అడక్కుండానే సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు అలా సెల్యూట్స్ అందుకునే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆపదలో వున్న తెలుగువారిని ఆదుకునే విషయంలో ఎలాంటి వివక్ష చూపించకుండా ఆదర్శప్రాయంగా నిలిచింది.   ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారీ వరదల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రెండు వందలు దాటింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ సంఖ్యలో సైన్యం రంగప్రవేశం చేస్తే తప్ప పరిస్థితి కొంతవరకైనా అదుపులోకి రాలేదు. వరదల ధాటికి అసలు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఉనికే మాయమైపోయింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఆయన కార్యాలయం కూడా వరదల్లో చిక్కుకుపోయింది. కనీసం ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.   ఇంత దారుణమైన వరదల్లో 36 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న 36 మంది తెలుగు విద్యార్థులు వరద పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోయారు. వీరిలో 19 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కాగా, 17 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు. తెలుగు విద్యార్థులు కాశ్మీర్‌లో చిక్కుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. తెలుగు విద్యార్థులను రక్షించి వారిని స్వస్థలాలకు పంపించే బాధ్యతను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి గద్దే రామ్మోహన్ రావుకు అందించింది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించి 36 మంది విద్యార్థులను విమానంలో క్షేమంగా హైదరాబాద్‌కి చేర్చారు. మేము ఆంధ్రప్రదేశ్‌కి చెందని వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల బాధ్యతను మాత్రమే తీసుకుంటామని అనకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను కూడా సురక్షితంగా హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తమ విషయంలో చూపించిన ఆదరణకి తెలంగాణ విద్యార్థులు ఎంతో సంతోషించారు. తమను పరాయివారిగా చూడనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి మరో జీవన్మరణ సమస్య?

    కేంద్ర ఎన్నికల కమీషన్ మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నిన్న షెడ్యుల్ విడుదల చేసింది. వచ్చే నెల 15వ తేదీన రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిపి 19వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు మరో అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఎందుకంటే, ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమియే అత్యధిక యంపీ సీట్లు కొల్లగొట్టి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాలకు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. కనుక ఇప్పుడు జరుగబోయే ఎన్నికలలో ఎన్డీయే కూటమిని తప్పనిసరిగా నిలువరించి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవలసి ఉంటుంది.   ముఖ్యంగా మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకోకపోయినట్లయితే ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనలు సమఉజ్జీలుగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు విశ్వప్రయత్నం చేయవలసి ఉంటుంది. అదీగాక శివసేన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయ్యిఉండటం కూడా దానికి కలిసి వచ్చే అంశం అయితే, అదే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చును.   కేంద్రంలో అధికారం కోల్పోయి మళ్ళీ ఎప్పటికయినా తిరిగి అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కంటే, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమికి చెందిన పార్టీలు అధికారంలో ఉండటమే రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆ రెండు రాష్ట్రాల ప్రజలు భావిస్తే కాంగ్రెస్ పార్టీకి మరోసారి పరాభవం తప్పదు.   ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం నిలబెట్టుకోలేకపోయినట్లయితే, ఆ ప్రభావం పార్టీపై చాలా తీవ్రంగా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత సోనియా, రాహుల్ గాంధీలను తమ పదవులలో నుండి దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్లు వినిపించాయి. అవి ఇప్పుడు మరింత జోరందుకొంటే కాంగ్రెస్ పార్టీకి ఇంటాబయటా కష్టాలు తప్పవు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే, దేశానికి ప్రధానమంత్రి కావాలనుకొన్న రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుండి కూడా దిగిపోవలసిన పరిస్థితి ఎదురయినా ఆశ్చర్యంలేదు.   అంతే కాదు..తమది జాతీయ పార్టీ, నూరేళ్ళ చరిత్ర కల గొప్ప పార్టీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయి మోడీ ప్రభుత్వం ముందు మరుగుజ్జులా మారిపోతుంది. ఇది వచ్చే అన్ని ఎన్నికలపై ప్రభావం చూపవచ్చును కూడా. అందువలన ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటివని చెప్పక తప్పదు.

మళ్ళీ ఆధార్ గోల మొదలు?

    ఇది వరకు యూపీయే ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ మరియు వివిధ సంక్షేమ పధకాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినపుడు, సుప్రీంకోర్టు కలుగజేసుకొని ఆ ప్రయత్నాలను అడ్డుకొంది. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకొనేందుకు వివిధ సంక్షేమ పధకాలను ప్రకటిస్తుంటాయి. కానీ వాటిని యధాతధంగా ఆచరణలో పెట్టేందుకు మాత్రం వెనకాడుతుంటాయి. అందుకు కారణం అసలు కంటే నకిలీ లబ్దిదారులే ఎక్కువ ఉండటమే. అందువలన ప్రభుత్వాలు తము ప్రకటించిన పధకాలను ప్రకటనలకే పరిమితం చేస్తాయి, లేకుంటే ఈ నకిలీ భారం వదుల్చుకొనేందుకు ఇటువంటి ఆలోచనలు చేయవలసి వస్తుంటుంది.   ఒక సంపూర్ణ వ్యవస్థను, పద్దతులను, విధి విధానాలను ముందుగా ఏర్పాటు చేసుకోకుండా అత్యుత్సాహంతోనో లేకపోతే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునో తీసుకొనే ఇటువంటి నిర్ణయాలతో ప్రజలకు కొత్త ఇబ్బందులు కలుగుతుంటాయి కనుక సహజంగానే వారిలో వ్యతిరేఖత ఉంటుంది. ప్రజల సహకారం లేనిదే ఏ ప్రభుత్వ పధకమూ ఇంతవరకు విజయవంతం అయిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వాలు ఈ విషయం విస్మరించి తమ ఆలోచనలను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటాయి. నగదు బదిలీ పధకం, సబ్సిడీ గ్యాస్ లను బ్యాంకు-ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి యూపీయే ప్రభుత్వం ఏవిధంగా అభాసు పాలయిందో అందరికీ తెలుసు.   ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పధకాలను మళ్ళీ ఆధార్ కార్డులతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ అంతకంటే ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ ఆధార్ కార్డులు అందాయా లేదా? కార్డులున్న వారందరికీ బ్యాంకు ఖాతాలున్నాయా లేదా? మారుమూల గ్రామాల ప్రజలకు ఆధార్ కార్డులున్నప్పటికీ వారికి అందుబాటులో బ్యాంకులున్నాయా లేదా? లేకుంటే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? వంటి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొన్న తరువాతనే ఆధార్ కార్డుతో అనుసంధానం గురించి ఆలోచిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా పధకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడం కోసం హడావుడిగా అనుసంధానం చేసేసి ఆ తరువాత కోర్టుల ముందు తలొంచుకొని నిలబడి సంజాయిషీలు చెప్పుకోవడం అంటే వ్రతం చెడినా ఫలితం లేకుండా పోయినట్లవుతుందని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.

నందిగామలో కాంగ్రెస్ వ్యూహం ఎదురు తన్నబోతోందా?

  నందిగామ ఉప ఎన్నికలను తెదేపా ప్రభుత్వం యొక్క వందరోజుల పరిపాలనపౌ ప్రజలివ్వబోయే తీర్పుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ, ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెపుతానంటూ ఎన్నికల బరిలోకి దిగింది. కానీ నిజానికి కాంగ్రెస్ ఆలోచన, ఉద్దేశ్యం వేరే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు తమపై చాలా ఆగ్రహంగా ఉన్నందునే తమకీ దుస్థితి ఏర్పడిందని వారికి తెలుసు. అయితే ఇదంతా జరిగి అప్పుడే మూడు నెలలయిపోయింది కనుక ఇప్పటికయినా ప్రజలు తమ పార్టీపై మెత్తపడ్డారా లేదా? అనే సంగతి తెలుసుకొనేందుకే ఈ ఎన్నికలలో ఒక బాబురావును బకరాగా చేసి నిలబెట్టారు. ఒకవేళ ఆయన స్వంత కష్టంతోనో మరో రకంగానో ఈ ఎన్నికలలో నెగ్గితే ఇక కాంగ్రెస్ తన ఈ వాదనకు మరింత పదును పెడుతుంది. అంతే కాక ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ శాసన సభలో అడుగుపెట్టవచ్చనే అత్యాస కూడా ఉంది.   అయితే తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాక రావు ఆకస్మిక మరణం వలన నిర్వహిస్తున్న ఈ ఎన్నికలలో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తునందున, నందిగామ ప్రజలు ఆమెపై సానుభూతి చూపుతూ ఆమెకే ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే వైకాపా కూడా తన అభ్యర్ధిని పోటీలో నిలపలేదు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను తెదేపా ప్రభుత్వ పాలనపై తీర్పు అని చెపుతూ ఎన్నికల బరిలో దిగడం పెద్ద తప్పు అవుతుంది. అంటే కాంగ్రెస్ అతితెలివి ప్రదర్శించడం వలన తను స్వయంగా నష్టపోతూ తెదేపాకు మేలు చేయబోతోందన్నమాట. తెదేపా అభ్యర్ధి సౌమ్య సానుభూతి ఓట్లతోనే విజయం సాధించినప్పటికీ, దానిని తెదేపా ప్రభుత్వం తన వందరోజుల పాలనపై తీర్పు గానే చెప్పుకొనే అవకాశం కాంగ్రెస్ పార్టీయే చేజేతులా తెదేపాకు అందించినట్లయింది. అంతే కాదు, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరో మారు ఘోర పరాజయం పొందితే, అది ఆ పార్టీకి చెంపపెట్టుగా మిగిలిపోతుంది. అధికార తెదేపా ప్రభుత్వానికి బుద్ధి చెపుతానని ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ తను ఎంచుకొన్న తప్పుడు ఉపాయానికి మళ్ళీ తనే బలవబోతోందని అర్ధమవుతోంది.

డాడీకి మీరైనా చెప్పండి: కేకేకి కేటీఆర్ రిక్వెస్ట్...

  మీడియావాళ్ళ మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల గొయ్యి తీసి పాతేస్తాం.. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి లాంటి కామెంట్లు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. వందరోజుల పాలనలో చేసిందేమీ లేకపోయినా, వందరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ‘మాటల కానుక’ ఇప్పుడు తెలంగాణకు జాతీయ స్థాయిలో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కేసీఆర్‌కి ఒక ప్రత్యేకమైన శైలి వుంది. కొంతకాలం ఆయన బయట ఎవరికీ కనపడరు. సడెన్‌గా ఒకరోజు బయటకి వస్తారు. ఆరోజు తాను ఎవర్ని తిట్టాలనుకుంటారో వాళ్ళని తిట్టేసి మళ్ళీ గప్‌చుప్‌గా వుండిపోతారు. ఆయన మళ్ళీ బయటకి వచ్చేవరకూ ఆయన మాట్లాడిన మాటల ప్రభావం వుంటుంది.   అయితే ఈ వ్యవహార శైలి ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా వున్నప్పుడు బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఏ స్థాయిలో వున్న వ్యక్తి ఆ స్థాయిలోనే మాట్లాడాలి తప్ప తన స్థాయి నుంచి కిందకి దిగి మాట్లాడ్డం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మొన్న కేసీఆర్ మీడియాని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇలాంటివే. కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎంత ప్రమాదకరమైనవో ఆయన మాట్లాడేటప్పుడు ముందు, వెనుక నుంచుని ఇకిలించి చప్పట్లు కొట్టేవాళ్ళకి అర్థంకాకపోవచ్చుగానీ, కేసీఆర్ కుమారుడు - విద్యావంతుడు అయిన కేటీఆర్‌కి మాత్రం తన తండ్రి మాట్లాడుతున్న మాటలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమైనట్టు తెలుస్తోంది. తన తండ్రి వాగ్ధాటిని తగ్గించాలని ప్రయత్నించిన కేటీఆర్ పూర్తిగా విఫలం అయినట్టు సమాచారం. తన తండ్రితో వాదించి ఒప్పించే శక్తి లేని కేటీఆర్ ఈ విషయంలో మరో పెద్దమనిషికి తన బాధ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ పెద్దమనిషి ఎవరో కాదు.. కె.కేశవరావు.   కేకే అంకుల్.. నాన్నగారు మీడియాతో పెట్టుకుంటున్నారు. ఇరుక్కుపోయే కామెంట్లు చేశారు. నాన్నగారు మీడియా వాళ్ళ మెడలు విరగ్గొడతాం, పాతిపెడతాం లాంటి కామెంట్లు చేయడంతో జాతీయ స్థాయిలో పరువు పోయింది. ఇంకా ముందు ముందు ఆయన ఎలాంటి కామెంట్లు చేస్తారో, ఏం కొంప ముంచుతారోనని భయంగా వుంది. ఆయన్ని అదుపు చేయడం మా వల్ల కావడం లేదు. పెద్దవారు కనీసం మీరు చెప్పిన మాటయినా ఆయన వింటారన్న నమ్మకం వుంది. మీరే ఎలాగైనా నాన్నగారి దూకుడు తగ్గించండని కేటీఆర్ కేకేని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కేకే కేసీఆర్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.

కేసీఆర్ వ్యాఖ్యలు ‘బ్రాండ్ తెలంగాణ’కి బ్యాడ్ చేశాయా?

  ‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ అనే మాట ఎప్పుడు ఏ మహానుభావుడు చెప్పాడో గానీ, ఆ మహానుభావుడికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ మాట అక్షరాలా సత్యమని చెప్పే సంఘటనలు ఈ ప్రపంచంలో నిరంతరం కనిపిస్తూనే వుంటాయి. ఇప్పుడు తెలుగు ప్రజలకు తాజాగా కనిపిస్తున్న రివర్స్ ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారణమైన ఆయన మీద తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన తెలంగాణని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తారని ఆశించారు. అందుకే ఎన్నికలలో ఆయనకి అధికారం ఇచ్చారు. తెలంగాణ ‘బ్రాండ్’ని విశ్వవిఖ్యాతం చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పిన మాటలు విని మురిసిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వందరోజులు పూర్తయినా హామీల వర్షం కురిపించడమే తప్ప, ఆవగింజంతయిన అభివృద్ధి జరగకపోయినా కేసీఆర్ మీద ప్రజల నమ్మకం ఎంతమాత్రం సడలలేదు. కానీ పరిపాలన వందరోజులు పూర్తయిన ఉత్సాహంలోనో, తనకు తిరుగేలేదన్న ఆత్మవిశ్వాసంలోనో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు వికటించాయి. ‘బ్రాండ్ తెలంగాణ’ సంగతి అటుంచితే, తెలంగాణ ఇమేజ్‌ని జాతీయ స్థాయిలో దెబ్బతీశాయి.   వరంగల్‌లో జరిగిన కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్ మీడియా మీద, జర్నలిస్టుల మీద చేసిన వ్యాఖ్యలు ఆ సభలో పాల్గొన్న కొంతమంది అత్యుత్సాహ పరుల చేత చప్పట్లు కొట్టించి వుండొచ్చుగానీ, అవి జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశాయి. తెలంగాణలో వుండాలంటే మాకు సెల్యూట్ చేయాలి, మెడలు విరిచేస్తాం, పది కిలోమీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతాం లాంటి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఒక ముఖ్యమంత్రిని కాకుండా ఒక ఉద్యమకారుడిని చూపించాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా కాకుండా ఒక ముఠా నాయకుడు మాట్లాడిన మాటల్లా వున్నాయన్న అభిప్రాయాలు జాతీయ స్థాయిలో వ్యక్తమయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద జాతీయ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అన్ని జాతీయ ఛానళ్ళు కేసీఆర్ వ్యవహారశైలిని, ఆయన మాట్లాడిన మాటల్ని చీల్చి చెండాడేశాయి. టైమ్స్ నౌ ఛానల్లో అర్నబ్ గోస్వామి అయితే కేసీఆర్ వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ జర్నలిస్టుల్ని ఎలా చంపుతారు? ఎలా మెడలు విరుస్తారు? ఎంతమందిని చంపుతారు? కేసీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలి... కేసీఆర్ మీద హత్యాయత్నం కేసులు పెట్టాలి... లేదా ఆయనకు మతిస్థిమితం లేదని ప్రకటించాలి అంటూ రాజ్యాంగంలోని చట్టాలను కూడా ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఛానల్ చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్‌ని అయితే దులిపిపారేశారు. సీమాంధ్రుల మీద నోరు వేసుకుని పడిపోయే వినోద్ కుమార్ కూడా ఆర్నబ్ గోస్వామి ముందు నోరెత్తలేక నీళ్ళు నమిలారు. మిగతా జాతీయ ఛానల్స్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాయి. ఆయా ఛానళ్ళ చర్చలో పాల్గొన్న కవిత లాంటి టీఆర్ఎస్ నాయకులు బిత్తరపోయేలా స్పందించాయి.   కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, వాటికి జాతీయ స్థాయిలో వ్యతిరేకత రావడం, జాతీయ స్థాయి మీడియా కేసీఆర్ని తీవ్రంగా విమర్శించడం.... ఇక్కడితో ఈ ఇష్యూ ముగిసిపోలేదు. మొత్తమ్మీద ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఇమేజ్‌కే డ్యామేజ్ చేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ ఇమేజ్ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల కలలను కేసీఆర్ వ్యాఖ్యలు కల్లలు చేసే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇలాంటి వ్యవహారశైలి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పలు ప్రఖ్యాత సంస్థలు పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన పుణ్యం, టీఆర్ఎస్ నాయకుల తిట్ల పుణ్యమా అని సీమాంధ్ర నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారశైలి, మాటలు దేశంలోని ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చే అంశాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఇప్పటికైనా ఈ ముప్పును గ్రహించి కేసీఆర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని లేకపోతే ‘బ్రాండ్ తెలంగాణ’ని మరచిపోవాల్సి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.మన నోటిలో వున్న మాటకి మనం రాజులం.. మన నోరు దాటిన మాటకి మనం బానిసలం. నోరు తెరిస్తే బోలెడన్ని కవితలు, సామెతలు చెప్పే కేసీఆర్ గారికి ఈ సామెత తెలియకుండా వుంటుందా?

దాని గురించి ఆయనకు ముందే తెలుసట!

  యుగయుగాలుగా ప్రజలు రామాయణ, మహాభారత కధలను చదువుతూనే ఉన్నా నేటికీ వాటి నుండి ఎప్పుడూ ఏదో ఒక తెలియని కొత్త షయం బయటపడుతూనే ఉంటుంది. అది మనుషులను సన్మార్గంవైపు నడిపేందుకు దోహదపడుతోంది. పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన గత కాంగ్రెస్ పాలనలో కూడా అనేక అవినీతి భాగోతాలు బయటపడ్డాయి. ఇంకా నేటికీ బయటపడుతూనే ఉన్నాయి. అయితే అవన్నీ జరిగిన తప్పులను నెమరు వేసుకోవడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవని అందరికీ తెలుసు.   ఉన్నత స్థాయిలో జరిగిన ఆ అవినీతి భాగోతాలలో నిందితులలో ఎ ఒక్కరికీ ఇంత వరకు శిక్ష పడలేదు. బహుశః పడే అవకాశం కూడా లేదనే భావించవచ్చును. వందలు, వేల కోట్ల ప్రజాధనం బొక్కేసిన నేతలు,అధికారులు, పారిశ్రామిక వేత్తలు ఒకటి, రెండేళ్ళు జైలులో గడిపితే దానినీ త్యాగమనుకొనే రోజులివి. ఆ అపూర్వ త్యాగధనులని ప్రజలే భుజానికేత్తుకొని మోస్తుంటే, వారు చట్ట సభలను తమ చేతులలోకి తీసుకొంటే ఆశ్చర్యం ఏముంది? వారు సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవడంలో వింతేమి ఉంది?   ఇక విషయంలోకి వస్తే గత యూపీయే పాలనలో వెలుగు చూసిన అనేక కుంభకోణాలలో 2జి కుంభకోణం చాలా అమూల్యమయినది. ఎందుకంటే స్పెక్ట్రం అంటే అంతా గాలే. కంటికి కనపడే వస్తువు కాదు. ఆ టెలిఫోన్, ఇంటర్నెట్ తరంగాలలాగే ఎన్నిలక్షల కోట్లు చేతులు మారాయో కూడా ఎవరికీ కనపడదు. ఏనుగుకి పైకి కనబడే దంతాలు కేవలం ప్రదర్శనకే కానీ దేనినయినా నమిలి పారేయగల అసలు దంతాలు లోపల వేరే ఉన్నట్లే, ఈ కుంభకోణంలో కూడా ఒకటో రెండో లక్షల కోట్లు అవినీతి జరిగినట్లు అతి కష్టం మీద కనుగొనగలిగారు. కానీ మొత్తం ఎన్ని లక్షల కోట్లు మింగేసారనే విషయం నేటికీ చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది.   మొదటగా ఈ అవినీతిని బయటపెట్టిన కాగ్ మాజీ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ యూపీయే ప్రభుత్వం గురించి మళ్ళీ మరికొన్ని గొప్ప విషయాలు బయట పెట్టారు. 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి గురించి మాజీ ప్రధాని డా.మన్మొహన్ సింగ్ కు పూర్తిగా తెలుసునని, అదే విషయాన్ని నాటి కేంద్రమంత్రి కమల్ నాద్ తో సహా ఆయనను చాలా ముందే హెచ్చరించినప్పటికీ ఆయన దానిపై వెంటనే చర్యలు చెప్పట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు నిర్లిప్తంగా కూర్చొని, పరోక్షంగా ఈ అవినీతికి సహకరించారని ఆరోపించారు.   దయానిధీ మారన్ టెలికాం మంత్రిగా ఉన్నప్పటి నుండి సాగుతున్న ఈ అవినీతి భాగోతం గురించి ఆ తరువాత ఆ బాధ్యతలు చేప్పట్టిన ఎ.రాజా మాజీ ప్రధాని డా.మన్మొహన్ సింగ్ కు పూర్తిగా వివరించడమే కాకుండా దానిని తను కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా ఆయన స్పందించలేదనే సంగతిని వినోద్ రాయ్ బయటపెట్టారు. అంతే కాదు.. తను తయారు చేసిన కాగ్ నివేదికలో డా.మన్మొహన్ సింగ్ పేరును, ఈ విషయాన్ని ప్రస్తావించవద్దని తనపై సీనియర్ కాంగ్రెస్ నేతలు అశ్వినీ కుమార్, సంజయ్ నిరుపం మరియు సంజయ్ దీక్షిత్ లు ఒత్తిడి చేసారని వినోద్ రాయ్ తెలిపారు. ఒకవేళ ప్రధాని తలుచుకొంటే ఈ అతిపెద్ద కుంభకోణం జరగకుండా నివారించగలిగేవారని కానీ ఆయన మౌనం వహించడం ద్వారా దానికి ఆమోదం తెలిపినట్లయిందని వినోద్ రాయ్ తెలిపారు.    వినోద్ రాయ్ వ్రాసిన ‘నాట్ జస్ట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం త్వరలో విడుదల కానుంది. అందులో ఇటువంటి గొప్ప గొప్ప విశేషాలు మరిన్ని బయటపడవచ్చును. అయితే దోషులు ఎవరూ శిక్షింపబడే అవకాశము లేదు. వారు దిగ మింగిన లక్షల కోట్ల ప్రజాధనం కక్కించగల సత్తా మన చట్టాలకు లేవు. అందువలన ఇదంతా చదువుకొని భారంగా ఒక నిటూర్పు విడవడటం కంటే మనం చేయగలిగిందేమీ లేదు.