రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ

చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ.  క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం  84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ  రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది.
డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో  226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్  ఏ  జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు  వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్  నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన  మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?

సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అత్యంత మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్న ఆయన.. కొండగట్టు ఆంజనేయస్వామివారి సేవ చేసుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.  పవన్ కళ్యాణ్   శనివారం (జనవరి 3)  కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయలం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం అప్పట్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం   35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో  నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3) శంకుస్థాపన చేశారు.  కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.   రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదన్న ఆయన  త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానన్న ఆయన.. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిం చినందుకు ఆనందంగా ఉందన్నారు.  అంతకు ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు వేదపండితులు శాస్త్రోక్తంగా  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గాన్ని సాకారం చేయాలని, అందుకు తానే స్వయంగా వచ్చి కరసేన వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్   బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్, టీటీడీ బోర్టు సభ్యులు ఆనందసాయి,  మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని   ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా  ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో  35.19 కోట్ల రూపాయల వ్యవయంతో  భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా  దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.   టీటీడీ నిధులతో ఇక్కడ నిర్మించనున్న దీక్ష విరమణ మండపంలో  ఒకేసారి   రెండువేల మంది   భక్తులు అయ్యప్ప దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అలాగే   సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు కొండగట్టు ఆలయానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తాయని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో  ఈ ఉదయం జరిగిన  రెండు ఎన్ కౌంటర్లలో  14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు.  సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన  రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.  సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా,  బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.  సుక్మా జిల్లాలోని కొంటా   ప్రాంత అడవుల్లో ఉదయం  నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక నాయకుడు సచిన్ మంగ్డు సహా 12 మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  మృతులలో కొంటా ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు.  సంఘటనా స్థలం నుంచిఏకే-47, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్  రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా శనివారం (జనవరి 3) ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలుఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో ఏకకాలంలో కూంబింగ్ నిర్వహించారు.   ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశముందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన  ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో  దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా  ఏపీ దక్కించు కోగా,  ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో  13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో  12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.  

ఒక్క బ్రిడ్జి.. నాలుగు జిల్లాల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను తీర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఇందుకు తాజా తార్కాణం విశాఖపట్నం, రాజాం రోడ్డులో నాలుగేళ్ల కిందట శిథిలావస్థకు చేరి రాకపోకలకు అనువుగా లేని బ్రిడ్జిని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో  వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ బ్రిడ్జి మూత వల్ల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రాజాం విశాఖల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినప్పటికీ.. అదనంగా ఐదు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.  మూతపడిన బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆరంభమైనప్పటికీ పనులు చాలా చాలా నెమ్మదిగా సాగాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖతో సమన్వయం కారణంగా నిధుల సమస్య లేకుండా పోయింది. అంతే నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యింది. ఈ కొత్త బ్రిడ్జిని సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.  ఈ ఒక్క బ్రిడ్జితో  నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోనున్నాయి.  

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు  గుంటూరు లో  శనివారం (జనవరి 3) ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే  ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో  తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.   తెలుగు ప్రపంచ మహా సభలకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు భాషాభిమానులు, విద్యావేత్తలూ తరలి వస్తున్నారు.  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శనివారం (జనవరి 3) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది.   మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు  తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి. ఇక ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు కార్యక్రమం సోమవారం  ( జనవరి 5) జరగనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు.  

సిర్గాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్

విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, అన్నంలో విషం పెట్టి వారిని చంపేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.    దీంతో  విద్యార్థులపై కక్ష పెంచుకున్న వార్డెన్ శుక్రవారం (జనవరి 2) పూటుగా మద్యం సేవించి హాస్టల్ కు వచ్చి విద్యార్థులను దుర్భాషలాడారు.  హాస్ల్ సిబ్బందికి పోన్ చేసి తన మీద ఫిర్యాదు చేసిన విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపేయమంటూ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక నుంచి తెలంగాణలో రహదారి భద్రతా సెస్సు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం  రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే  ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు  మినహాయింపునిచ్చారు. ఇక పోతే  సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం    లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా  4  నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.  

మెక్సికోలో కంపించిన భూమి

మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో  సంభవించిన ఈ భూకంప కేంద్రం  భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు. పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. భూమి కంపించడంతో  జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆమె 'ఎక్స్' వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని  పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు సైతం చిగురుటాకుల్లా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

లేగదూడకు నామకరణ మహోత్సవం!

కన్నబిడ్డగా పెంచుకున్న ఆవు లేగదూడకు జన్మనిస్తే.. ఆ లేగదూడను తన మనవరాలిగా భావించి ఘనంగా నామకరణ మహోత్సవం చేసిన రైతు ఉదంతమిది. తనకు ఆడపిల్లలు లేరన్న చింత తీర్చుకోవడానికి ఓ ఆవును తీసుకువచ్చి, దానికి గౌరి అని నామకరణం చేసి పెంచుకున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్, ఆ ఆవుకు పుట్టిన లేగ దూడకు శుక్రవారం (జనవరి 2) ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు. వివరాల్లోకి వెడితే.. పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట  వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని  దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు  గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇందు కోసం శుక్రవారం (జనవరి 2)  దానికి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను గ్రామస్తులను ఆహ్వానంచి అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇళ్లల్లో పిల్లలకు ఏ విధంగా అయితే బాల సారె నిర్వహిస్తారో సరిగ్గా అలాగే ఈ నామకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి దానికి నందీశ్వరుడు అని పేరు పెట్టారు.  ఈ నామకరణ మహోత్సవాన్ని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి తిలకించి ఇలాంటి తంతు ఎక్కడా చూడలేదని ఇదే మొదటి సారి అని ఇంత మంచి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.