ఇక నుంచి తెలంగాణలో రహదారి భద్రతా సెస్సు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం  రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే  ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు  మినహాయింపునిచ్చారు.

ఇక పోతే  సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం    లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా  4  నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.  

మదురో కోసం ప్రాణాలొడ్డిన 32 మంది క్యూబన్ కమెండోలు

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన ఆపరేషన్  32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల ప్రాణాలు తీసింది. మదురోకు రక్షణగా ఉన్న 32 మంది క్యూబన్ సైనికులు, నిఘా అధికారులు ఆయనను రక్షించేందుకు అమెరికా కమెండోలతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వైమానిక దాడులు, నేల మీద జరిగిన భీకర కాల్పుల వల్ల ఈ మరణాలు సంభవించాయి.  క్యూబన్ సైనికులు, నిఘా అధికారుల మరణాన్ని క్యూబా అధికారికంగా ధృవీకరించింది. ఒక దేశాధినేతను రక్షించే క్రమంలో తమ సైనికులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్న ఆ దేశం సోమ (జనవరి 5; మంగళ(జనవరి 6) వారాలను  దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించింది. మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని,  ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది. మదురో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత భద్రతను క్యూబా పర్యవేక్షిస్తోంది. అయితే దాడి జరిగిన సమయంలో ఎంతమంది క్యూబన్లు అక్కడ ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 63 ఏళ్ల నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సీలియా ఫ్లోరస్‌ను కూడా బంధించి,  విమానంలో అమెరికాకు తరలించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న మదురోను.. సోమవారం రోజు మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరు పరచనున్నారు. మదురోపై అమెరికా ప్రధానంగా డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాదం ఆరోపణలు మోపింది. 2020లో విడుదల చేసిన అభియోగపత్రం ప్రకారం.. మదురో ప్రభుత్వం అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను సరఫరా చేసే ముఠాలకు సహకరిస్తోందని అమెరికా వాదిస్తోంది. ఈ నేరాలకు సంబంధించి ఆయనను విచారించేందుకే ఈ అపహరణ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. అయితే మదురో ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు. దశాబ్ద కాలంగా వెనిజులాను ఏలుతున్న మదురో ఇలా అమెరికా జైలు పాలవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్యూబన్ల మరణంతో ఈ వివాదం కేవలం అమెరికా-వెనిజులా మధ్యే కాకుండా క్యూబాతో కూడా దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెట్టింది. నిందితుడిగా కోర్టు ముందుకు వెళ్తున్న మదురోకు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు ఎలా స్పందించనున్నాన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. 

అబుదాబీలో రోడ్డు ప్రమాదం.. భారత్ కు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి

విదేశీ గడ్డపై ఉపాధి పొందుతూ ఆనందంగా జీవితస్తున్న ఒక భారతీయ కుటుంబంలో   విషాదం చోటు చేసుకుంది.   అబుదాబిలో ఆదివారం (జనవరి 5) తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో వారి వారి ఇంటి పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. కేరళ  మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు వేగంగా పల్టీలు కొట్టడంతో లోపల ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో లతీఫ్ కుమారులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 ఏళ్ల అషాజ్, 12 ఏళ్ల అమ్మార్, ఐదేళ్ల అయ్యష్‌లతో పాటు వారి ఇంట్లో పని చేస్తున్న బుష్రా అనే మహిళ అక్కడికక్కడే కన్నుమూశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న ముగ్గురు కొడుకులు కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాద సమయంలో   అబ్దుల్ లతీఫ్, రుక్సానా, మిగిలిన ఇద్దరు పిల్లలు ఎజ్జా (10), అజ్జామ్ (7)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు అబుదాబిలోని షేక్ షక్బౌట్ మెడికల్ సిటీలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.

అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ జీకే కిషోర్ కుమార్ సతీమణి మృతి

  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో నిన్న అర్ధరాత్రి  మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త  ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.   ఈమె ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా ఐఏఎస్ అధికార జీకే కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికీ, పర్యవేక్షిం చడానికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు.   . ఈ నెల 7 ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా  పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.   చంద్రబాబు  పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత వేగం పుంజుకోవడం ఖాయమని   అధికారులు అంటున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి  ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం   విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. అప్పట్లో ఆయన సోమవారం కు పోలవారం అని నామకరణం చేసి మరీ క్రమం తప్పకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించేవారు. అయితే ఆ తరువాత 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తరువాత పోలవరం పనులు పడకేశాయి. మళ్లీ 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న  కనకదుర్గ అమ్మవారిని  మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు.  ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు   ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.   

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు దుర్మరణం

అమెరికా లో  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాలకొల్లు వాసులు కొటికల పూడి కృష్ణ కిషోర్, ఆశ దంపతులు గత దశాబ్ద కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, ఆశ దంపతులు అక్కడికక్కడే మరణించగా, వారి పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే భారత్ కు వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లిన వీరు.. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వారి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

అసోంలో కంపించిన భూమి.. త్రిపుర, మేఘాలయలో కూడా

అస్సాంలో  సోమవారం (జవవరి 5) తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్కర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో త్రిపురలో కూడా పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆలా ఉండగా ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

ఉగ్రవాదంపై అమెరికా అపేక్ష.. ఉపేక్ష ఎందుకు?

నార్కో టెర్రరిజం అంటూ ఒక దేశాధ్యక్షుడినే అత్యంత అమానవీయంగా ఆ దేశంపై మెరుపుదాడి నిర్వహించి మరీ అరెస్టు చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల విషయంలో ఎందుకు అపరిమితమైన ఆపేక్ష చూపుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కర్తా, కర్మా, క్రియా తానేనన్నట్లుగా అమెరికా ఎందుకు అనవసర ఆడంబరం, అనవసర పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది? ఈ ప్రశ్నలకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ ఇలా తయారైందన్న బదులు వస్తుంది.  అమెరికా తొలుత ఇలా ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ అమెరికాను తమతో పాటు పాల్గొనాల్సిందిగా కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించడమే కాదు.. కనీసం బ్రిటన్ కు మిత్రదేశంగా ఉండటానికి కూడా ముందుకు రాలేదు.  అయితే కానీ ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ ఘటన జరిగిందో ఆనాటి నుంచి అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి  కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది. అక్కడి నుంచీ తమ దేశ భద్రతకు ఆయుధ తయారీని  ఒక ప్రామాణికంగా పెట్టుకుంది. దానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తత్తి చేసిన ఆయుధాల నిల్వ భారీగా ఉండటంతో.. ప్రపంచంలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడికి తగుదునమ్మా అంటూ వెళ్లి,  ఆ దేశ సమస్యల్లో వేలు పెట్టి.. తన ఆయుధాల విక్రయానికి ఆ సమస్యలను అలంబనగా చేసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే వియత్నాం, గల్ఫ్, సిరియాయుద్ధాలు. ఆ మాటకొస్తే భారత్- పాక్, రష్యా- ఉక్రెయిన్,  చైనా- తైవాన్ ఇలా ఏ రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడ్డా తనదైన శైలిలో.. జోక్యంొ చేసుకుంటూ తనకు తానే ప్రపంచ దేశాలకు పెద్దన్న అన్నట్లుగా వ్యవహరిస్తోంది.    అమెరికా  వ్యవహారశైలి ఎలాంటిదో ఒక దళారి పశ్చాత్తాపం వంటి పుస్తకాలు చదివితే మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతగా ప్రపంచ రాజకీయాలను శాసించడం ప్రారంభించింది అమెరికా. ఇక ఇంధనం కారణంగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకానొక వ్యసనం కూడా అమెరికాకు పట్టుకుంది.  దీంతో ఆయా చిన్నా చితకా దేశాల వెంట పడడం.. వాటి సహజవనరులపై కన్నేయడం అమెరికాకు పరిపాటిగా మారింది. చివరికి గల్ఫ్ దేశాలపైనా అమెరికా ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వారి పెట్రో డాలర్లన్నీ తమ ట్రెజరీల్లో భద్రంగా ఉంచుకుని.. ఆపై వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అంతగా ఇతర దేశాల్లో కాళ్లు, వేళ్లు, తలా దేర్చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించడం అమెరికాకు రివాజైపోయింది.  తమ మాట వినని దేశాల్లో కుల మత విద్వేషాలను రాజేసి మరీ వాటిని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. అనుకున్న ఫలితం సాధించడం అమెరికా తన అగ్ర నాయకత్వంలో ఒక భాగం చేసుకుంది. ఈ విషయంలో అమెరికాకు చైనా, రష్యా, భారత్ లు కూడా మినహాయింపు కాదు.  ఇవాళ వెనిజువెల విషయంలో నార్కో టెర్రరిజం పేరిట ఆ దేశ అధ్యక్షుడు మదురో ని అరెస్టు చేసిన అమెరికా.. పాక్ లో  ఉగ్రవాదం వెయ్యి తలలు వేస్తున్నా కిమ్మనడం లేదంటే.. ఏమనుకోవాలి.  స్వయానా అమెరికా కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర బాధిత దేశాల్లో ఒకటి. అయినా అమెరికా పాక్ ఒంటిపై ఈగ వాలకుండా కాపాడటమే కాకుండా, ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి భారీ రుణాలతో ఆదుకుంటోంది. కానీ అదే అమెరికా వెనిజువేలా అధ్యక్షుడు మదురో పై 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఉందనీ, అందుకే అరెస్టు చేశామనీ చెప్పుకుంటోంది.  కానీ, హఫీజ్ సయీద్ వంటి వారిపైనా ఇలాంటి రివార్డ్ లే ఉన్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు?    పాకిస్థాన్ కి అమెరికా ఇప్పిస్తున్న  వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లోన్ల నుంచి మసూద్ అజర్ వంటి టెర్రరిస్ట్ బాసులకు భారీగా నిధులు అందుతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీని గాజాలో దింపేందుకే ఈ నజరాలు, సానుభూతి అని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అమెరికా ధ్వంస రచన ఇంకెంత కాలం సాగుతుందో చూడాలంటున్నారు అంత ర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

వెనుజువెలా.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏమిటంటే.. అసలు వెనిజువేలాలో ఏం జరుగుతోంది? ఈ నెల 3న అంటే శనివారం అమెరికన్ ఆర్మీ మెరుపుదాడి జరిపివెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది.  ఈ సందర్భంగా వెనిజువేలా  రాజధాని కకరాకస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. విద్యుత్ గ్రిడ్ లు ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చార్జింగ్ కోసం జనం బారులు తీరారు.  అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శ నగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనిజువేలాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.   అయితే మదురో బదులు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని అంటు న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తర్వాతి అధ్యక్షురాలయ్యే  చాన్సుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే అదేమీ జరిగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే   కొరినా మచాడో నునోబెల్ స్వీకారానికి కూడా అవకాశం దొరకని ఇబ్బందికర  పరిస్థితులను ఎదుర్కు న్నారు. ప్రస్తుతం మదురోను అమెరికా అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్ అయితే వెనుజువెలా వెళ్లే వారు అత్యవసరమైతే తప్ప వెళ్ల వద్దని ట్రావెల్ కాషన్ జారీ చేసింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అయిన డెల్టా ఫోర్స్ .. ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్  పేరిట రాజధాని కరాక స్‌లో భారీ సైనిక దాడి చేసింది. ఈ దాడిలో మదురో నివాసంపై హెలికాప్టర్లతో దాడి చేసి, మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. మదురో దంపతులను ముందుగా యుఎ స్ఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలోకి, ఆ తరువాత న్యూయార్క్‌లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చారు. ప్రస్తుతం మదురో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మదురోపై 2020 నుంచి అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇండిక్ట్‌మెంట్ ఆధారంగా.. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ ఇతర డిస్ట్రక్టివ్ డివైసెస్ పొజెషన్ వంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే  మదురోపై  50 మిలియన్ రివార్డ్ ప్రకటించింది అమెరికా. ఇప్పుడు మదురోను మెరిపుదాడి చేసి మరీ అరెస్టు చేసింది.  అరెస్ట్ సమయంలో మదురో ఇంట్లో నిద్రిస్తున్నారని, అతడి నుంచి  ఎలాంటి  ప్రతిఘటన లేకుండానే బంధించారనీ తెలుస్తోంది. అయితే అరెస్టు తర్వాత   మదురో చేతులకు సంకెళ్లతో అమెరికా ఆఫీసర్ల మధ్య నడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అ య్యాయి. మదురో అరెస్టును  . చైనా, రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయిజ అయితే కొన్ని దేశాలు ఈ అరెస్టును స్వాగతించాయి. ఇలా ఉండగా మదురో అరెస్టు అంశంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లోని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు.  వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.   వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు.