Read more!

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. మలుపుల మీద మలుపులు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్ ఎగ్జామ్‌ పేపర్‌ మొదలు గ్రూప్‌ 1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు  ఇప్పటికే   9 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.  విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.

గ్రూప్ 1 పేపర్‌ను రాజశేఖర్ చాలా మందికి విక్రయించినట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రూప్ 1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్లను కూడా విచారించేందుకు సిట్‌ రెడీ అవుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచే పేపర్ల లీక్ మొదలైనట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కరీంనగర్‌కు చెందిన ఆరుగురికి రాజశేఖర్‌ గ్రూప్ 1 పేపర్‌ ముందుగానే రాజశేఖర్ ద్వారా అందినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.  ఇలా అందుకున్న వారిలో నలుగురు ఎన్‌ఆర్‌ఐలతో పాటు మరో ఇద్దరు స్థానికులు గ్రూప్‌1 పరీక్షలు రాసిసనట్లు అధికారులు గుర్తించారు.

పరీక్షలు రాయడానికి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి వచ్చారు. పేపర్‌ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను రాజశేఖర్‌ స్నేహితులు, బంధువుల ఖాతాలో జమ చేసినట్లు గుర్తించిన సీట్ ఆ విషయంపై దర్యాప్తు సాగిస్తోంది.  అదలా ఉంటే..  టీఎస్‌పీఎస్‌సీ అక్టోబర్‌ తర్వాత 7 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ 7 పరీక్షల్లో టాప్ మార్క్స్ సాధించిన 500 మందిని విచారించేందుకు సైతం సిట్ సమాయత్తమౌతోంది.