Read more!

శ్రీరామ రక్ష.. సర్వ జగద్రక్ష

బంటురీతిఁ గొలు వీయవయ్య రామ
తుంటవింటివాని మొదలైన మదా
దులఁ బట్టి నేలఁ గూలఁజేయు నిజ
రోమాంచమనే ఘనకంచుకము
రామభక్తుడనే ముద్రబిళ్లయు
రామనామ మనే వరఖడ్గము వి
రాజిల్లనయ్య త్యాగరాజునికే 
రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకునే శుభ తరుణం శ్రీరామనవమి. శ్రీరామ నవమి  రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. 

ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా  తెలుసుకుంటారు. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి  కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.  శ్రీరామనవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామవ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు.

రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా.. యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం; రామ అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి -రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని. శ్రీరామ నవమి రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ..
శ్రీరామ రామరామేతి 
రమే రామే మనోరమే 
సహస్ర నామ తత్తుల్యం 
రామ నామ వరాననే 
అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీరామ నవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఉగాదితో నూతన సంవత్సరం ఆరంభం అయితే శ్రీరామనవమి పండుగ ఉగాది పండుగ తరువాత వచ్చే అత్యంత పర్వదినం.

రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే.. ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథినాడు మధ్యాహ్నం వేళ రాముడు జన్మించాడు. దశరథ రాముడు, సకల కళా గుణాభిరాముడు అయిన శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో అంటే మిట్టమధ్యాహ్నాం త్రేతాయుగంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.  ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. శ్రీమహా విష్ణువు ఏడో అవతారంగా శ్రీరాముడిని భావిస్తారు.

శ్రీరామాయణం ఆది కావ్యం. మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. రామాయణం చదువుతున్నప్పుడు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతున్నట్లు అనిపించే అద్భుతరచన. శ్రీరామాయణం ఇతిహాసం. యథార్థమైన గాథ. రామచంద్రమూర్తి అవతారం పరమసత్యం. రామ స్పర్శలేని విషయం ఉండదు. ఏదైనా రాస్తే ‘శ్రీరామా’ అని రాసి మొదలు పెడతాం. చంటి పిల్లాడికి స్నానం చేయిస్తే, పాత్రలో మిగిలిన నీళ్లతో ‘శ్రీరామరక్ష.. నూరేళ్ల ఆయుష్షు’ అని తల్లి అంటుంది. గోరుముద్దలు తినిపిస్తూ రామకథ చెబుతుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలనుకుంటే రామచంద్రమూర్తి అంతటి వాడివి కావాలని ఆశీర్వదిస్తారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే ‘శూర్పణఖ’ బుద్ధి అంటారు. అహంకారంతో ప్రవర్తిస్తే, ‘రావణ అహంకారం పనికిరాదు’ అంటారు. ఎక్కువగా నిద్రపోతే ‘కుంభకర్ణుడిలా ఆ నిద్ర ఏంటి’ అంటారు. ఇలా సమాజం నుంచి విడదీయరాని బంధం శ్రీరామాయణంతో ఏర్పడింది.

ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.