బాబు దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు సిద్దం
posted on Oct 11, 2013 @ 12:58PM
గత ఐదు రోజులుగా డిల్లీలో ఏపీ భవన్ వద్ద చంద్రబాబు చేస్తున్నఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్దమయింది. ఆయన ఆరోగ్యపరిస్థితి క్రమంగా విషమిస్తుండటంతో అప్రమత్తమయిన హోం శాఖ , వైద్యులతో కూడిన ఒక అంబులెన్స్ ను కొద్దిసేపటి క్రితమే దీక్షావేదిక వద్దకు పంపింది. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సాయంత్రంలోగా ఎప్పుడయినా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును.
ఆయన కోసం స్థానిక ఆసుపత్రిలోఒక గది (రూమ్ నెంబర్:6) ను కూడా సిద్దం చేసి ఉంచింది. పోలీసులు దీక్షా స్థలికి చేరుకోవడంతో అక్కడ ఉన్న తెదేపా నేతలు, కార్యకర్తలలో ఆందోళన మొదలయ్యింది. అయితే దీక్షను భగ్నం చేయడం అనివార్యమని అందరికీ తెలిసిన విషయమే.
తెలుగు ప్రజలకు న్యాయం జరిగే చ్వరకు డిల్లీ నుండి కదలనని భీషణ ప్రతిజ్ఞా చేసిన చంద్రబాబు మరి దీక్ష భగ్నం అయిన తరువాత డిల్లీలోనే మఖం వేసి తన ప్రయత్నాలు కొనసాగిస్తారా లేక రాష్ట్రానికి తిరిగి వచ్చి తన ఆత్మా గౌరవ యాత్రలు మొదలు పెడతారా తెలుసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాలి.
ఏమయినప్పటికీ ఆయన దీక్ష వల్ల రాష్ట్ర విభజన సమస్య గురించి ఇప్పుడు జాతీయ నాయకులకు, జాతీయ మీడియాకు ఆసక్తి పెరిగింది. ఇంతవరకు ఈ వ్యవహారంలో వారు చూడని అనేక రాజకీయ కోణాలు ఆయన తన దీక్షా సమయంలో బయటపెట్టి, వారి మద్దతు కూడా గట్టగాలిగారు.